11, డిసెంబర్ 2015, శుక్రవారం

రెండు నాల్కల ధోరణి

ఫ్రెండ్స్ !


రచనలు రచనలు గాను కవిత్వం కవిత్వం గా వ్రాసుకుంటే ఎవరైనా హర్షిస్తారు. బాధితులు పీడితులు ఉంటె సహానుభూతి చెందుతారు. కుల మత జాతులకి అతీతంగా స్పందిస్తారు అందులో ఎలాంటి కుట్రలు సందేహాలు ఉండవు. ఈ మధ్య కొందరు సూడో అభ్యుదయవాదులు ముసుగేసుకుని మరీ వచ్చి వారి అసహనాన్ని వ్యక్తిగత ద్వేషాన్ని రచనల్లో, కవిత్వంలో వ్యక్తీకరిస్తున్నారు. ఒక కులాన్నో లేదా ఒక మతాన్నో ఒక వర్గాన్నో టార్గెట్ చేసుకుని వచ్చి వారి ప్రేలాపనలతో ఇతరులని కించపరుస్తున్నారు. అణచివేతకి గురైతే ఎక్కడ గురయ్యారో అక్కడ ప్రశ్నించండి. వ్యక్తులని వదిలేసి సమూహాలకి ఎందుకు ఆపాదిస్తారు ? ఎవడో ఎక్కడో ఏదో చేస్తారు కూస్తారు. దాన్ని పట్టుకుని కులం మొత్తానికి మతం మొత్తానికి జాతి మొత్తానికి ఆపాదించి కసిదీరా తిట్టి దూలానందం పొందుతున్నారు.


చరిత్రలో చాలా పీడనలు అణచివేతలు ఉన్నాయి. అవి ఇంకా అలాగే ఉన్నాయి అసలేమీ మారలేదు అన్నట్లు ఉంటె ఎలా ? క్రమేపీ సమాజం మారుతుంది మనుషులు మారుతున్నారు. అణచివేయబడిన వర్గాలు తెలివి చదువు ఉద్యోగం బలం పెంచుకుని చట్టాల గురించి తెలుసుకుని ప్రశ్నించే స్థాయికి, తిరిగి ఇతరులని బాధించే స్థాయికి చేరుకున్నట్లే ... ఒక్కప్పుడు బలవంతులమని విర్రవీగినవాళ్ళు సైతం వాళ్ళ మూఢత్వాన్ని ఛాందసవాదాన్ని వొదిలి జనబాహుళ్యంలో కలిసిపోతున్నారు. సామరస్యంతో ఇతరులతొ కలసి పోతున్నారు. ఈ విషయాన్ని మరుగున పరిచి మీ వ్యక్తిగత ద్వేషాలని ఒక కులంలో ఉన్న మొత్తానికో ఒక మతంలో ఉన్న మొత్తానికో అపాదించవద్దు. పదే పదే వ్యక్తులకి బదులు సమూహాలకి సమాజం మొత్తానికి మీ ద్వేషాన్ని అంటకట్టవద్దు. మీకెలా ఒక కులం ఉందో మాకు అలాగే ఒక కులం ఉంది. మీకిష్టమైన మతం మీరెలా పాటిస్తారో మా కిష్టమైన మతాన్ని మేమలాగే పాటిస్తాం. మీరు అవహేళనలకి అన్యాయానికి గురైతే ప్రశ్నించండి మా దృష్టికి వచ్చినప్పుడు ఖండించడం, మీకు మద్దతు పలకడం అన్నీ ఉంటాయి. 



అణగారిన వర్గాల తరపున వకాల్తా పుచ్చుకుని (కొందరు ఇలా వకాల్తా పుచ్చుకుని వ్యక్తిగత ప్రయోజనాల కోసం నమ్మిన వాళ్ళని నట్టేట ముంచేసిన వాళ్ళు ఉన్నారు) అందరిని ఒకే గాట కట్టేయడం సబబు కాదు. చీము, నెత్తురు, రోషం, అభిమానం మాకూ ఉన్నాయి. ఎల్లకాలం చూసి చూడనట్లు పోవడం కూడా కుదరదు. దయచేసి వివాదాస్పద వ్రాతలు వ్రాయకుండా ఉంటే మంచిది. చదువుకుని సంస్కారవంతంగా ఆలోచించే రచయితలూ కవులు కళాకారులే ఇలా ఉంటె మిగతావారి సంగతేమిటని ఆలోచిస్తున్నారా ? లేదా !? చాలా విచారంగా ఉంది. అభిప్రాయబేధాలు సహజంగానే వస్తూనే ఉంటాయి. కాదనడంలేదు. ఎవరు ఏమీ మారలేదు అనుకుంటే మాత్రం జాలిపడటం తప్ప ఇంకేమీ మాట్లాడలేం . కానీ వంచన చేయడం ఆత్మ వంచన చేసుకోవడం మంచిది కాదు



."సో కాల్డ్ మేధావులు...స్తీవాదులు....సామాజిక సేవేద్దారకులు ...వారి కిష్టమైనపుడు మాట్లాడతారు ...లేకపోతే. .తేలు కుట్టిన దొంగలలా నో రుమూసుకుంటారు. మరల వారే ఇంకొకరి మతాలను కులాలను విమర్శిస్తారు. రెండు నాలుకల నీతి చాలా ఎక్కువ ఉంది" 



పరమత సహనం నా అభిప్రాయం ...


పరమత సహనం భారతీయ ఆత్మ దాని గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నాయకులు వేరు ప్రజలు వేరు . భిన్న సంస్కృతితో తరతరాలుగా మమేకమైపొయిన జాతి మనది. అయిదేళ్ళు పాటు పరిపాలించే నాయకులోచ్చి ఇది ఒక మతానికి చెందిన దేశమనో లేదా ఈ దేశ వారసత్వానికి ప్రతీకలమనో చెప్పుకున్నంత మాత్రాన మిగతా మతాల వారందరూ ఈ జాతీయులు కాకపోతారా? అలాంటి నాయకులకి బుద్ది చెప్పాలంటే వారి కుళ్ళు కుతంత్రాలు అర్ధం చేసుకున్న వారే నడుంబిగించాలి కానీ కొంత మంది కావాలని మంటలని ఎగదోస్తున్నారు. అందుకు విచారంగా ఉంది.


ఈ మధ్య నా కథ ఒకటి ప్రింట్ మీడియాలో ప్రచురింపబడినప్పుడు పాఠకుల స్పందన కోసం మొబైల్ నెంబర్ ఇచ్చాను. వెంటనే ..దేవుడు మీకు స్వస్థత చేకూర్చుతాడు ప్రార్ధనామందిరమునకి రండి తో మొదలెట్టి ప్రతి రోజు సువార్త వాక్యాలు అందించడం మొదలెట్టారు. మరి ఈ రకమైన మత ప్రచారం పట్ల కూడా సహనం వహిస్తూనే ఉన్నాం. మాకు సమీపంలో ఒక గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో వినాయకుడి గుడి కట్టి పదేళ్ళు అయింది. దానికి దగ్గరలోనే విదేశాల నుండి వచ్చిన సొమ్ముతో ఒక ఇంటిలో చర్చిని నెలకొల్పారు. తెల్లవారుఝామునే పోటాపోటీగా మైకులు పెట్టి మరీ ఆమెన్ - గణేష్ మహారాజ్ కి జై అంటూ వినిపిస్తారు . నిద్ర ఖరాబై ఆరోగ్యాలు పాడై ఏమిటీ శిక్ష అనుకుంటున్నాం తప్ప ఒకరినొకరు తిట్టుకోవడంలేదు.


మనం తల్లి గురించి గొప్ప  కవిత్వం వ్రాస్తాం. చెల్లి గురించి కవిత్వం వ్రాస్తాం. ఆలి గురించి అంతకన్నా గొప్పగా కవిత్వం వ్రాస్తాం. ఆకాశంలో సగమంటూ కీర్తిస్తాం. ఆహా .. ఓహో అనే భట్రాజు పొగడ్తలు వందిమగాదులు ఎందఱో ! ఒక మత పెద్ద ఈ ఆడోళ్ళని గడ్డిపోచ లెక్కన జమకట్టినప్పుడు మాత్రం అస్సలు మాట్లాడరు . అది వాళ్ళ మతానికి సంబంధించిన విషయం మాత్రమే ! కలగజేసుకుంటే ఫత్వాలు జారీ చేయబడతాయని భయం .

అదే ఇంకో మతం స్వామీజీ ఎక్కువమంది పిల్లలని కనాలంటే మాత్రం ..ఈ ఆడజాతి మీద అంతులేని సానుభూతి పుట్టుకొస్తుంది. అప్పుడు మాత్రం బాగా మాట్లాడతారు .


అభ్యుదయమంటే కులమతజాతికి అతీతంగా నిర్భయంగా న్యాయంగా మాట్లాడాలి కదా ! నేను ఈ రెండు నాల్కల ధోరణి గురించే మాట్లాడుతున్నాను.


పరమత సహనం హిందువులకి లేదని వక్కాణించే సూడో మేధావులు వారి మతం వారి వ్యక్తిగతం అనుకుంటారు. పరమతం వారి విశ్వాసాలు మాత్రం సమాజం పై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపణలు చేస్తారు. అసలు ఈ బీఫ్ వివాదాలు లేని గ్రామాలు భారతదేశంలో మూడొంతులు ఉన్నాయంటే నమ్మరు వీళ్ళు.


మా పల్లెటూర్లో హిందూ ముస్లిం క్రిష్టియన్ బేధాలు లేవు ఏమైనా వస్తే అవి అప్పటికప్పుడు సమసిపోయేవే ! మా మధ్య కుహనా మేధావులు లేరు అందుకే మేము ఇంకా స్వచ్చంగా స్వేచ్చగా ఆనందంగా బ్రతకగల్గుతున్నాం అని చెప్పడానికి గర్విస్తున్నాను. జై హింద్ !


కామెంట్‌లు లేవు: