3, మార్చి 2016, గురువారం

ఈ దేశంలో ఏం జరుగుతుంది !?

"మతమా...  మతమా!! నువ్వేం పని చేస్తావ్ ? అనడిగితే మనుషులని ఎన్నటికి  కలవనీయకుండా చేస్తాను"
"కులమా...  కులమా  !! నువ్వేం పని చేస్తావ్ ? అనడిగితే ప్రాణ స్నేహితులని కూడా  విడదీస్తాను "
" వర్గమా ..వర్గమా !! నువ్వేం పని చేస్తావ్ ? అంటే అయినదానికీ కానిదానికి ఇతర వర్గాల వారిపై రాళ్ళేసి  రెచ్చగొడతాను"

నిజం, మన భారతీయ సమాజం ఇప్పుడలాగే ఉంది.

ఈ దేశంలో ఏం జరుగుతుంది !? ఉదాహరణ కే ఈ పోస్ట్ . సాధారణ వ్యక్తిగా వ్రాసానీ... పోస్ట్.

టీవిలో  ప్రసారమవుతున్న ఒక దృశ్యం చూసాను. ఏ తల్లి కన్నబిడ్దో యూనివర్సిటీలో పి హెచ్ డి చేసేంత తెలివిగల, బంగారం లాంటి బిడ్డ.  తల్లిదండ్రులు పెంచుకున్న ఆశలని అడియాసలు చేసి జీవితం మీద అంతులేని నిరాశతో ఉరి త్రాడుని ముద్దాడి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అతను దళిత విద్యార్ధి అని చెపుతున్నారు.

ఎవరైతే ఏమిటిరా !?  నీ వర్గీకరణ మండిపోనూ ! బంగారంలాంటి బిడ్డ ... అలా మరణించినందుకు అయ్యో ..పాపం! అని బాధపడక కులం పేరు పదే పదే ప్రస్తావించాలా..? అని టీవి వాడిని తిట్టుకుంటూ   పేస్ బుక్ లోకి వెళితే ఒక రచయిత ఎంతో విచారంతో ఆ అబ్బాయి మరణాన్ని అందుకు గల కారణాలని చెపుతూ ఒక పోస్ట్ వేసారు .
ఏమిటో...  ఈ కులాల మతాల పిచ్చిలో అన్యాయంగా సమిధలవుతున్నఇలాంటి  బిడ్డలని చూసి జాలేస్తుంది. సున్నితమైన అంశాలే కదా...  ప్రాణాలు తీసేది అని బాధపడ్డాను.

అంతలో ఇంకొకామె ఆమె రచయిత, సామాజిక కార్యకర్త ... ఎవరైతే ఆ అబ్బాయి మరణానికి కారకులో వాళ్ళే...  అయ్యో అని  ఇప్పుడు సానుభూతి చూపుతున్నారు ... వాళ్ళంతా మనువాదులే.... అని పోస్ట్ వేసారు. పైగా హిందూ మతవాదులు, అగ్రకుల అహంకారులు ఈ విద్యార్ధి మరణానికి కారకులు. వీళ్ళందరికీ ఆ విద్యార్ధి మరణం పట్ల సానుభూతి చూపడానికి కూడా అనర్హులు అని నొక్కి వక్కాణించారు.

నేను తెల్లబోయాను. అదేంటి !? ఈ చనిపోయిన విద్యార్ధి ఎవరో నాకసలు తెలియదు . మా ఇంటిప్రక్క అబ్బాయి కూడా కాదు.  కుల వివక్ష వల్ల వి. సి వేదింపు చర్యలవల్ల  మరణిస్తే ... దానికి కారణం వి. సి అవ్వాలి లేదా అక్కడ జరిగిన గొడవలలో పాల్గొన్న వ్యక్తులు కారణమవ్వాలి కానీ... ఈ దేశంలో  హిందూ మతం అవలంబిస్తున్న వారందరూ ... వి.సి కులమైన కమ్మ కులస్తులందరూ కారణం ఎలా అవుతారు !? ఒక వ్యక్తీ కారణం కావచ్చు ... ఆ కులస్తులందరూ కారణం కాదు, ఒక మత అనుబంధ సంస్థ సభ్యులు కారణం కావచ్చు . ఆ మతాన్ని అవలంబించే వాళ్ళందరూ  ఎలా కారణమవుతారు ?

మానవ సహజమైన స్పందన చూపడానికి కూడా మీరర్హులు కాదు అంటే ...నాలాంటి తటస్థ వాదులు  దానిని  ఎలా అర్ధం చేసుకోవాలి ? వ్యక్తిని వర్గానికి - సభ్యుడిని సంస్థ మొత్తానికి ఆపాదించి ఎలా చూడగలరు!?  ఒక ఐ ఎస్ ఐ ఉగ్రవాది ఎంతో మంది అమాయుకుల మరణానికి కారణమయ్యాడని ..అతను ఒక ముస్లిం  అని  నా చుట్టుప్రక్కల ఉన్న ముస్లిం మతస్తులందరినీ మీరే కారణమని తిట్టిన దాఖలాలు నా చుట్టూరా ఎక్కడా లేవు . నేనే కాదు నా చుట్టుప్రక్కల ఉన్న  హిందూ, క్రైస్తవ, బహాయి మతస్తులందరూ కూడా ఆ ముస్లిం మతస్తులని తూలనాడలేదు. మా పరిధిలో మేమందరం బాగానే ఉన్నాం, ఉంటున్నాం. ఇప్పటిదాకా నాతో  స్నేహంగా ఉన్న కవి మిత్రులు, రచయిత మితృలకి ఉన్నఫళంగా నేనెలా శత్రువునయ్యానో నాకేమీ అర్ధం కాలేదు. మీరు హిందువులు, మీరు అగ్ర కులస్తులు అయితే మీరు మా ఫ్రెండ్స్ లిస్టు లో ఉండనవసరం లేదు అని...  తన  రచనలకి అవార్డులందుకున్న స్థాయి గల వ్యక్తులు బహిరంగంగా ప్రకటించడాన్ని  ఏమంటారు ? కొంచెమైనా ఆత్మాభిమానం ఉన్న వారు వెంటనే అతని/ఆమె నుండి దూరంగా తప్పుకుంటారు కదా ! అలా అన్నాక కూడా అక్కడే వేలాడటానికి సిగ్గు,అభిమానం అడ్డొస్తాయి కదా !  సంస్కారవంతులని అనుకున్న మిత్రులందరూ కూడా ...  కులాధారంగా, మతాధారంగా  ఎన్నో తూలనాడారు. నేను ఎంతగా  భయపడిపోయానంటే  కనీసం లైక్ కొట్టడం కూడా మాహాపరాధం అన్నంతగా !


ఇంకొక కవి, రచయిత కవిత్వం వ్రాయడం లేదని ఆరోపణ. ఆ విద్యార్ధి మరణానికి సానుభూతి తెలపడానికి కూడా మీకు అర్హత లేదని తిడుతూనే మళ్ళీ కవిత్వం వ్రాయలేదని ఆరోపణ చేస్తారు . ఇదెక్కడి న్యాయం ?
అక్కడ వాళ్ళని వాళ్ళు ఆకాశానికెత్తుకున్నతీరు చూస్తే మరీ నవ్వొచ్చింది. ఈ దేశంలో బహుజనుల తరపున, దళితుల తరపున , మైనారిటీల తరపున, స్త్రీల తరపున జరిగిన అన్యాయాలకి స్పందించి ప్రశ్నించే హక్కు వారికి మాత్రమే  ఉందంట. అందుకనే..  వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చట. ఇలా అని చెప్పిన ఆ వ్యాఖ్య తర్వాత తొలగింపబడింది అనుకోండి.

మనువాదులన్నా, అగ్ర కులాల వాళ్ళన్నా, హిందూ మతోన్మాదులన్నా మౌనంగా భరిస్తున్నామని ఎక్కడ ఏం జరిగినా సమూహాలలోకి వచ్చి వ్యాఖ్యానించడమనేది ఎదుటి వాళ్ళ మనోభావాలని కించపరచడం క్రింద జమ అవదా ? మీ మతస్తులకి, మీ కులస్తులకేనా సున్నితమైన బాధపడే మనసు ఉన్నది . మిగతా వారు పాషాణ మనస్కులా !?  మేము పూజించే దేవుళ్ళని మీరేమైనా తిట్టవచ్చు. మేమేమి అనకపోయినా ఎక్కడ ఏ ఘర్షణ  జరిగినా హిందూ కులస్తులు, అగ్రవర్ణాల వారే కారకులు అవుతారు అని మీ నిశ్చితాభిప్రాయం.

కుల మత బేధాలు సమసిపోవాలని, అందరితో  ఆత్మీయంగా ఉండాలని సమాజం సంస్కారంగా, సంస్కరణలతో  చక్కగా ఉండాలని, ప్రగతి బాటలో నడవాలని కోరుకుంటున్న వారిని ... మీ మీ అసంబద్దమైన ఆరోపణలతో అన్యాయంగా దూషించడం మీకు మాత్రం  న్యాయంగా ఉందా ?

 హిందూ మత ద్వేషుల్లారా ! అగ్రవర్ణ మంటూ పదే పదే  తిడుతున్న వారూ ... నిజం చెప్పండి ..!? మీకొక కులం లేదా ? అది మార్చుకుంటున్నారా ? రిజర్వేషన్ లాంటి ఫలితాలని మీరు అనుభవించడం లేదా ? మీకొక మతం లేదా ? మీరు   వ్యక్తులుగా మాత్రమే చెలామణీ అవుతున్నారా ? మీరు ఏ వర్గం కాకుండానే ఉన్నారా ? హిందూత్వ రాజ్యం అంటున్నారు ? హిందువులందరూ  బిజెపి పార్టీ కి లేదా ఆ పార్టీ అనుకూల పార్టీకే ఓటు చేసి ఉంటారని మీరు చెప్పగలరా ? అసలు మీరే పార్టీకి వోట్ చేసారో మీరు చెప్పగలరా ? మీకు మాత్రం వ్యక్తీ స్వేచ్చ, మత స్వేచ్చ వగైరా వగైరా ..అన్నీ ఉండవచ్చు . హిందువులకి  మాత్రం ఏమీ అవసరం లేదు ... దేశంలో  మిగతా మతస్తులందరూ  హిందువులని  తిడితే మాత్రం పడి ఉండాలి, ఆంధ్రరాష్ట్రంలో కమ్మ కులస్తులని తిడితే పడి ఉండాలి.  అధికారంలో ఉన్నారు కాబట్టి తిట్టి తీరాలని అనేట్టు ఉన్నారు కొందరు.  నాలాంటి  సాధారణ వ్యక్తులు ఇలా ప్రశ్నిస్తే కూడా వారు తట్టుకోలేరు. అహంకారంతో మరింత తిడతారు కదా !

ఈ దేశంలో నిజాలని ఒప్పుకోరు . జీర్ణించుకోలేరు . సమాజాన్ని మారనివ్వరు . సమాజం మారిందని ఒప్పుకుంటే వారికి మనుగడ ఉండదని భయం. ఎప్పుడూ ఏదో  ఒక వివాదాన్ని భుజాల మీద మోస్తూ వార్తలలో ఉండాలి . ప్రతిదీ రాజకీయం చేయాలి. ప్రజలకి ఏం కావాలో వీళ్ళకి అక్కరలేదు. వీళ్ళు మాత్రం బాధితులపట్ల సానుభూతి చూపిస్తూ పోరాటం జరిపే వాళ్ళు. వీళ్ళకి మాత్రమే స్పందించే హక్కు, పోరాడే హక్కు ఉన్నవాళ్ళు . హిందువులు,అగ్రవర్ణం వాళ్ళు పాషాణాలు అని వీళ్ళ అభిప్రాయం. న్యాయం, ధర్మం అన్నీ మా వైపే ఉన్నాయని అడ్డ దిడ్డంగా వాదించే వాళ్ళు ఉన్నంతకాలం . వీళ్ళని చూసి జాలి పడటం మినహా ఏమి చేయగలం ? వీళ్ళు ఇలా తిట్టే కొలదీ హిందువులంతా ఒకే తాటి మీదకి వస్తారు. అది ఈ దేశానికి ఎంతమాత్రం మంచిది కాదు. (అది వాళ్ళకి కూడా తెలుసు ) తెలిసి కూడా స్వప్రయోజనాల కోసం అదే పని చేస్తుంటారు.

కుల,మత,ప్రాంత పరంగా తమలో నిద్రాణంగా ఉండే ఆధిపత్యఅవశేషాలను వదుల్చుకోవడానికి తమలో తామే యుద్ధం చేసుకునే వాళ్ళందరూ ఈ దేశంలో మైనారిటీలు అనుకుంటున్న వారందరికీ   శత్రువులు కారుకదా? మరి స్పందించడం లేదు అనే కారణంతో వాళ్ళందరిని తిట్టడం ఎందుకు ?  అదివరకు లేని కుల,మత భావనల్ని ఇప్పుడు పెంపొందిస్తున్నది రాజ్యం , రాజకీయ నాయకులు మాత్రమే కాదు. మేధావులు అని చెప్పుకునే రచయితలూ, కవులూ కూడా ! అంతకు క్రితం తటస్తంగా  ఉండే వాళ్ళు కూడా ... ఇప్పుడు  మత భావనలో, కుల పిచ్చిలో కూరుకు పోతున్నారు. అందుకు ఉదాహరణ నేనే !  నేను అవలంభించే మతాన్ని, నా కులాన్ని పదే పదే  తిడుతూ ఉంటే  నా ఆత్మ గౌరవం  కూడా దెబ్బ తింటుంది. ఖచ్చితంగా దానిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. ఇతర మతాల పట్ల లేని ద్వేషం నాకు కల్గుతుంది కదా !  ఈ దేశంలో మత భావనలు, కుల అహంకారాలు లేనివాళ్ళకి కల్గించడంలో "తిలపాపం తలా పిడికెడు " అన్నది నిజం .

 ఇక నాకెందుకో... ఈ మధ్య  సీతారామారావు బాగా గుర్తుకొస్తున్నాడు. సీతారామారవంటే నాకు ఒక రకంగా జాలి ఇష్టం కూడా ! కానీ అతనన్న మాటలు అతని ఆలోచనలు ఇప్పటి పరిస్థితికి చక్కగా అమిరిపోతాయి. ఈ క్రింది  మాటలు ఒక ప్రముఖ నవలలో ఒక పాత్ర ఆలోచనలు.  ఆ నవలా రచయిత ఒక సంఘ సంస్కర్త కొడుకు.ఇక సీతారామారావు ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి ... ఆయన దొంగ సంఘ సంస్కర్తలని బాగా గమనించాడు.  గర్హించాడు.

కొంతమంది సంఘ సంస్కరణ, విప్లవం అంటూ తిరుగుతుంటారు సంఘానికి పరిపక్వతదశ అనేది లేనే లేదు కదా ! మరి దేనికోసం వీళ్ళ ఆర్భాటం అని జాలేసేదంట సీతారామారావుకి. కుర్రతనంలో సంఘసేవ చేయాలనే ఉబలాటం కొద్దీ  సంఘంలో బాధపడే వాళ్ళని ఉద్దరిద్దామని పొలోమంటూ బయలుదేరతారు . కొన్నాళ్ళకి తాము చేసే పనిపట్ల ఏమీ లాభం లేదని తెలిసినప్పటికీ వెనక్కి తగ్గే అవకాశం ఉండదు . ఆ సంగతి లోకులకి చెప్పే దైర్యం ఉండదు. అప్పటికే వాళ్లకి సంఘంలో గౌరవం లభించి ఉంటుంది. వీళ్ళ మాటలు నమ్మి అనేక కష్టాలకి ఓర్చి అనేకులు వాళ్ళకి  అనుచరులై ఉంటారు . వాళ్లకి ఇప్పటివరకు నేను చెప్పిందంతా తప్పు ... అంటే ఆ అనుచరగణం ఊరుకుంటారా? అప్పటిదాకా వాళ్ళు చేసిన త్యాగం,పడిన కష్టాలు గుర్తుకొస్తే ... కొంపలు కూలిపోవూ ! అందుకే వాళ్లకి సత్యం తెలిసినా పైకి చెప్పరు.  నమ్మకం లేకపోయినా యధాప్రకారం సంఘసంస్కరణ ,విప్లవం అంటూనే ఉంటారు. ప్రజలని మభ్యపెడుతూనే ఉంటారు .  కానీ వాళ్ళ పిల్లలని ఉద్యమాల బాట పట్టనీయకుండా మంచి మంచి స్థానాల్లో కూర్చోబెడతారు . సోషలిజం కావాలనుకునే నాయకులు తమ ప్రత్యర్దులని బాధపెట్టి,హింసించి, చంపి తమ సిద్దాతాలని ఆచరణలో పెట్టబోతారు, ఈ సిద్దాంత ప్రకారం ప్రతి బలహీనుడిని బలవంతుడు దండించవచ్చు అజ్ఞానిని జ్ఞాని దండించవచ్చు భర్త భార్యని దండించవచ్చు . కానీ దండన వాళ్ళ మంచి కోసమే జరగాలని ఎక్కడుంది ? స్వార్ధం కోసం జరిగితే ఏం చేయగలరు ? అనుకుంటాడు సీతారామారావు
అదండీ ..సంగతి.  ఈ మాటలు ఎవరికీ వర్తిస్తాయో అందరికి అర్ధమై ఉంటుంది.

ఏ మతోన్మాదమైతే ప్రపంచాన్ని నాశనం చేయనున్నదో  ఆ మతం చెప్పింది , ఏ మతోన్మాదమైతే ఈ దేశాన్ని నాశనం చేయనున్నదో  ఆ మతం చెప్పింది , ఏ మతమైతే ప్రపంచంలో  ఎక్కడ అడుగు పెడితే అక్కడ బలపడాలని చాప క్రింద నీరులా వచ్చి చేరుతుందో  ఆ మతం చెప్పిందీ  కూడా ఒకటే ! అన్ని  మతాల సారమంతా ఒక్కటే ! మనిషిని మనిషి ప్రేమించుకోలేనప్పుడు మిగిలేది ద్వేషమే !  ఆ ద్వేషం తోనే అడ్డు గోడలు  కట్టుకుంటారు, ఆ ద్వేషంలోనే మాడి మసై పోతారు.

నిజం నుండి నువ్వు ఎంతగా పారిపోవాలని చూస్తావో ఆ నిజం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది ... అన్నది నిజం.

ఏ ప్రాణైనా కూడా  తన ఉనికిని  తానూ  కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. నా ఉనికిని నేను కాపాడుకోవడానికి నాకొక కులం అవసరం అవుతుందని, మతం నీడలో ఒదిగి ఉండాలని నేను అనుకోలేదు. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు అలా ఉండాలని నెట్టేస్తున్నారు. నేను అలా మారతానో లేదో నాకే తెలియదు. మా అమ్మ ఉగ్గుపాలతో నాకేం   నేర్పిందో దానికి విరుద్దంగా సమాజం ఏం నేర్పుతుందో నాకు మాత్రమే తెలుసు. అమ్మ అంటే ఏమిటో నిజంగా తెలిసినవారికి అమ్మ విశ్వజనీయత తెలిసినవారికి ఏ ద్వేషం అంటదు.
నాకీ  సిద్ధాంతాలు,రాద్ధాంతాలు పెద్దగా తెలియవు. నేను ఎక్కువ చదువుకోలేదు. తర్కాలు తెలియదు. నాకు తెలిసింది స్పందించడం అంతే ! నాకు అవకాశం ఉన్న చోట తప్పకుండా స్పందిస్తాను. ఆ స్పందనలో భాగంగానే  ఈ పోస్ట్.
(ఈ పోస్ట్ కి వ్యాఖ్యలు నిలిపి వేయడమైనది. గమనించగలరు)

కామెంట్‌లు లేవు: