26, ఏప్రిల్ 2018, గురువారం

కథని అర్ధం చేసుకోవడం ఎలా ?

1) కథ వ్రాసిన (వ్రాయబడిన అంటే గతంలో  చాలా ఏళ్ళ క్రితం జరిగిన విషయాలని జ్ఞాపకానికి తెచ్చుకుని వ్రాసిన  ) కాలాన్ని,ఆ నాటి సామాజిక, ఆర్ధిక, రాజకీయాలని దృష్టిలో ఉంచుకుని కథని చదవడానికి పూనుకోవాలి. 

2) కథల్లో నవరసాలలో దేనికో ఒక దానికి ప్రాధాన్యత ఉంటుంది. రచయిత కోణంలోనే పరకాయ ప్రవేశం చేసి  అర్ధం చేసుకోమని ఎవరూ చెప్పరు. పాఠకులు  తమ అభిరుచి మేరకే  తమకున్న  అవగాహన మేరకే కథని అర్ధం చేసుకుంటారు. అంటే పాఠకుల  ఆలోచన, వికాస పరిధిని బట్టీ ఆ సూక్ష్మ గ్రాహ్యత లభిస్తుంది. ఉదాహరణకి ప్రపంచ పోకడలు తెలియని  పల్లెటూరి  పాఠకులకి అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఉండాలి.  వారికి ఎక్కువ సమాజ రీతికి అనుగుణంగానే కథలుండాలి  అవే నచ్చుతాయి వారికి.  అదే పల్లెటూరులో ఉన్నా ఎక్కువ  చదువుకుని అనేక  పుస్తకాలు చదివి, లేదా వివిధ దేశాలు పర్యటించడం వల్ల  విస్తారమైన లోకజ్ఞానం ఉన్నవారికి వాస్తవ జీవితాల్లో ఉన్న సంక్లిష్టత తెలిసినవారికి కథ ఎలా ఉన్నా  అర్ధంచేసుకోగలరు. కథా వస్తువు విభిన్నంగా ఉండి (సాంఘిక నియమాలని దాటి నైతిక విలువలు లోపించి,నీతి బాహ్యమైన పనులు చేసే పాత్రలున్న కథలు  ) వ్యక్తి పరిధిని దాటి సమాజ (అనేక సమూహాల)  పరిధి లోకి వెళ్ళినప్పుడు వ్యక్తి సంస్కారం (సహానుభూతి చెందడం ) ఆ కథని చదవడంలో తప్పక అవసరం అవుతుంది. జీవితాన్ని వాస్తవిక కోణంలో అర్ధం చేసుకుని యధాతదంగా తీసుకునే వారి అవగాహనకి, అవి లోపించిన వారికి ఉన్న తేడా కూడా సంస్కారమే అనుకుంటాను నేను.

(ఉదాహరణ కి చలం గారి కథలు అందరికి నచ్చవు ఆకోణంలో ఆలోచించాలి ) (కొందరికి క్రైమ్,హార్రర్,శృంగార కథలు నచ్చవు) పాఠకులలో సాధారణ పాఠకులు, రచనలు చేసే పాఠకులు, విమర్శకులు అందరూ ఉంటారు. ఎవరి దృష్టి వారిది. ఎవరైనా కథ బాగోలేదని కితాబులివ్వలేదని బెంగ పడాల్సిన పనిలేదు. ఒక కథ మంచి కథో కాదో తెలియాలంటే కనీసం వో యాబై యేళ్ళు కాలానికి తట్టుకుని నిలబడితే ..అది మంచి కథ అవుతుందని కథల వుత్శవంలో పెద్దలు చెపితే విని .. సంతోషించాను. కాలమే కదా నిగ్గు తేల్చేది అని.

ఇకపోతే నేనూ పాఠకులకి అర్ధం కాని కథ వ్రాసానని "మొదటి మరణం " ప్రచురితమైనాక తెలిసింది. చాలామంది క్లారిటీ లోపించింది అన్నారు. మరికొందరు పాఠకులు బాగా అర్ధం చేసుకున్నారు. అప్పుడు నేను పెట్టిన కథ పేరుకి, కథా ప్రారంభానికి, ముగింపుకి సమన్వయం కుదిరిందని అనిపించింది. ఒక కథని ప్రచురించే ముందు ఆ పత్రిక ఎడిటర్స్ ఆ మాత్రం జాగ్రత్త తీసుకుంటారు కదా ! అందుకే కథలని అర్ధం చేసుకునేవాల్లకి అర్ధం చేసుకున్నంత. సహ బ్లాగర్ నేను వ్రాసిన కథపై .ఇలా స్పందించారు.. మంజు యనమదల (కబుర్లు కాకరకాయలు బ్లాగు )

కథను అర్దం చేసుకోవడమిలా అనిపిస్తుంది.ఈ రోజు మనం పత్రిక ఆదివారం సంచిక మకుటంలో ప్రచురితమైన వనజ గారి కథ “మొదటి మరణం” గురించి..
" మొదటి మరణం .. ఇదేంటి !? మొదటి మరణం రెండో మరణం చివరి మరణం అంటూ వుంటాయా? కథ టైటిల్ ఇలా వుందేమిటని ఆలోచిస్తూ వున్నాను. కథని మరొకసారి చదివాను. రెండు క్లూ లు దొరికాయి. హేమ వివాహం తర్వాత పేరు మారిన వసంత అని అన్పించింది. బట్టలుతికే లక్షయ్య కూడా వురి వేసుకున్న హేమ కాళ్ళు యెత్తి పట్టుకుని వూపిరి వున్నట్టా లేనట్టా అని కనీళ్ళతో చూస్తుంటాడు. ఇక ఆఖరిగా పెళ్ళి పోటోలు చూస్తున్న వసంత దగ్గరకొచ్చి కూర్చుని మీ పెళ్ళి ఫోటోలు చూసుకుంటున్నావా.. అంటాడు కొడుకు. చనిపోయిందేమో అనుకుంటున్న హేమే వసంత అని క్షణం సేపు రిలీఫ్ కల్గినా అంతలోనే బోలెడంత దిగులు చుట్టేసింది. నిత్య గాయాలతో రోజుకో మరణాన్ని, క్షణానికో మరణాన్ని అనుభవించే స్రీలకి మొదటి,రెండు,వందల మరణాలు వుంటాయని సూక్ష్మంగా  చెప్పారు  వనజ గారు. మంచి కథ. వ్రాస్తున్నకొద్దీ పదునుదేలుతున్న మీ కలానికి అభినందనలు. మీరు మరిన్ని కధలు వ్రాయాలని కోరుకుంటూ, స్తీ సమస్యలను చెప్పడానికి మీ ఆలోచనలు వెన్నుదన్నుగా వుండాలని కోరుకుంటూ అభినందనలు."
అని వ్రాసారు . 

కథని అర్ధం చేసుకున్న మంజు యనమదల గారికి  ధన్యవాదాలు.

ఈ టపా వుద్దేశ్యం కథ  అర్ధం కాని వారికి నా మనసులో మాట చెప్పుకున్నాను అంతే ! 

కామెంట్‌లు లేవు: