31, జులై 2018, మంగళవారం

మెత్తగా సుతిమెత్తగా ..






 - మంజు యనమదల 


సామాజిక అంశాలపై తనదైన శైలిలో చక్కని కథలను రాస్తూ రాయికి నోరొస్తే, కుల వృక్షం అనే రెండు కథల పుస్తకాలను వెలువరించి వెలుతురు బాకు అనే కవితా సంపుటిని అందిస్తున్న పరిచయమక్కర్లేని వనజ వనమాలి బ్లాగర్ తాతినేని వనజ.


 వెలుతురు బాకు కవితా సంపుటి గురించి నాలుగు మాటలు...


మొదటి కవిత ద్వారాల మాటలో ఇంట్లో ఓ ఆడది అవసరాలకు మాత్రమే ఉండాలనుకునే శతాబ్దాల చరితకు ముగింపు రుధిర ద్వారాల మాటను, దశమ ద్వారమా మాట అంటూ ఎంత నిక్కచ్చితంగా చెప్పారో ఆ వేదనాభరిత హృదయాన్ని మనం ఆ అక్షరాల్లో చూడవచ్చు. కల కల్లలై కవితలో రైతు ఎదురుచూపులను, వెనుకెలుగుతో కవితలో ఒంటరితనపు మది అంతరంగాన్ని, వస్త్రాపహరణమొక సంస్కృతి అంటూ ఇంటా బయటా స్త్రీలపై జరుగుతున్న అరాచకాలను, జాతి, మత, కుల వివక్షలకు తావీయక అధికారులు చేస్తున్న అన్యాయాలను అద్దంలో చూపించారు. వారు వారే కవితలో పర స్త్రీలలో అమ్మ అనాటమి చూడలేని ఎన్నటికీ, ఎప్పటికి మారని వారి వికృత అభిరుచిని ఎండగట్టారు. హాస్టల్ గది కవితలో చదువుల బందిఖానాలో పడి మగ్గుతున్న పిల్లల ఆవేదనను, అక్షయ శిఖరంలో అమ్ముడౌతున్న అక్షరం ఆక్రోశాన్ని, రహస్య రచయితల(ఘోస్ట్ రైటర్స్) అక్షరపు అమ్మకాలను, అక్షయ అక్షర తూణీరంలో లసంత విక్రమ తుంగే మరణానికి చింతిస్తూ వెలువడిన భావావేశాన్ని, ఆంధీ కవితలో తోలి వలపు ప్రేమ పరిమళపు జ్ఞాపకాన్ని, చిరునామాలో ఎవరేమనుకున్నా తానేమిటో చెప్పిన భావుకత్వాన్ని, దుఃఖం కావాలనిపిస్తుందిలో మనల్ని మనం సేదదీర్చుకోవడానికి కాస్త దుఃఖం కావాలనిపిస్తుందంటారు ప్రేమగా. దేహాన్ని కప్పండి కవితలో కాసుల కోసం సినిమాయాజాలం చేస్తున్న అంగాంగ ప్రదర్శనను, దానికి కారణమైన కళాకారుల కుటుంబ గతులను సవివరంగా చూపించారు. 


నాకో మనిషి కావాలిలో అనుభూతులను, అవసరాలను పంచుకోవడానికి మనిషి ఆకాశంలో చందమామయినప్పుడు ఇలా మాటై, మనసై అక్షరంలో చేరానంటారు. నిశ్శబ్ద సంగీతంలో జీవిత సంగీతాన్ని, నదీ వియోగ గీతంలో మనసు నది అంతరించి పోతున్న జీవ నదులలు, తరిగిపోతున్న జీతపు విలువలకు అన్వయిస్తూ ఆలపిస్తున్న అంతర్లీన గీతాన్ని వినిపించారు. ఈ కవితా సంపుటి పేరైన వెలుతురూ బాకు కవితలో మానసిక చీకట్లను రూపుమాపడానికి రహస్య ఖార్ఖానాలో తయారు చేసుకున్న వెలుతుబాకుతో దండయాత్ర చేద్దామంటారు. సాయం చేయడానికి చేతులు కావాలిలో పరాయి దేశాలు పట్టిపోయిన మన వారసత్వాలకు బలై పోతున్న ఎన్నో మనసుల మానసిక సంఘర్షణ ఈ కవిత తేటతెల్లం చేస్తుంది. మట్టి, మనసు ఒకటేనంటారు సౌందర్య పిపాస కవితలో. 


హాలికుడా కవితలో హరితం కాలేని రైతు బతుకు ఉరికొయ్యకు వేలాడుతోందని వేదనగా వందనాలంటారు. ఎవరి కోసం ఆగని కాలంతో కలసి కలం కవితలో పగురులు తీస్తారు. పులిస్వారీలో ప్రేమని ఓ ద్రవంగా చెప్తూ వయసుకి వణుకు వచ్చినా , మనసుకి జ్వరం వస్తూనే ఉంటుందంటూ ఆ అయోమయంలో ప్రయాణ ప్రమాదం, ప్రమాద ప్రయాణానికి తేడా తెలియడం లేదంటారు. ఎవరన్నారు రాయడం లేదని, అక్షరాత్మ ఆశ్లేషం, డైరీలో కొన్ని పేజీలు, నీటిపై ప్రయాణం, మామ కబుర్లు, మనలేని మనం, హృదయాన్ని ఊరడిల్లనీయీ వంటి కవితల్లో సున్నితత్వంతోపాటు తన మనసు అంతరాళంలో తచ్చాడే భావాలను, వేదనలను వినిపిస్తారు. నాగలి విధ్వంసం, నువ్వు వదిలేసిన కాడితో కవితల్లో ఓ ఇంటి రైతు మరణాన్ని, ఆ తరువాత ఆ ఇంటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు ఓ కొత్త దృక్కోణంలో.


అంతేగా.., పూల కథ, బరువు మేఘం, దింపేయగా రాలేవా, ఏమడిగాను నిన్ను, ఎప్పుడో ఒకప్పుడు, అతిధి వంటి కవితలు కళాత్మకంగా సుకుమారంగా ఓ మగువ మనసుని ఆవిష్కరిస్తాయి. అవయవ దానం కవిత మహిళలపై జరుగుతున్న దాడులకు తన నిరసన గళాన్ని విన్నూత్నంగా చాలా నిక్కచ్చిగా వినిపించడం అభినందనీయం. చెక్కేసిన వాక్యం కవితలో లైఫ్ ఈజ్ బ్లండెడ్ విత్ కిచెన్ అంటూ వంటింటికి అంకితమైపోయిన స్త్రీ జీవితం ఎప్పటికి మారని నిర్వచనమని, ఎప్పుడో చెక్కేసిన వాక్యమని అంటారు. రమ్మంటే రాదు, రాలుటాకు స్వగతం, అలవాటుగా, హాంగోవర్, అమ్మ మనసులో ఓ మాట, అమ్మ చేతి గాజులు, నా కెరుకగాని ప్రేమభాష, జీవితకథ, జారిపోయినరోజు, జీవితాన్వేషణ మొదలైన కవితల్లో ప్రేమ రాహిత్యం, అమ్మ మనసు, స్త్రీ సున్నిత హృదయం మనకు కనిపిస్తాయి.


 దేహక్రిడలో తెగిన సగం, గోడలు, గాయం - వేల సందర్భాలు, నా ఏకాంతంలో నేను, నిరీక్షణ, నేను సరస్సుని, శపిస్తున్నా, ఒక మౌనం వెనుక, కన్నీటికి స్వేచ్ఛ, వంటి కవితలు ఆత్మీయత కోసం ఓ స్త్రీ మది పడే తపన కనిపిస్తుంది. తాళం చెవి, ఉనికి, ఇంటిపేరు, ఖాళీ సంచి, అయామ్ ఆల్వేజ్ ఏ లూజర్,ఆధునిక మహిళ వంటి కవితల్లో భావావేశం తీవ్రత తనకి ఏం కావాలో, ఎలా కావాలో చెప్పడంలో ఎవరి చెప్పని విధంగా చెప్పడంలో అద్భుత ప్రతిభ గోచరిస్తుంది. ప్యాసా దిల్, రూపకశ్రేణి, ఆకాశాన సగం మనం వంటి కవితల్లో సమానత్వాన్ని కాంక్షిస్తారు. 


మూడో మనిషి, రాత్రి ఓ అంతరంగ రహస్యం, నాల్గింట మగనాలి, నీడసత్యం - శివం - సుందరం వంటి తనని తాను వ్యక్తపరుచుకోవంలో ఓ నిజాయితీతో కూడిన నిబద్దత ప్రతి కవితలోని కనిపిస్తుంది. తిరిగొచ్చిన ఇంద్రధనుస్సు కవిత హాయిగా మనలని ఓ పిల్లతెమ్మెర తాకినట్లు ఉంటుంది. పునీత కవితలో గాయాల అంతర్వేదన గాయపడిన స్త్రీకి కొత్త కాదని వేరొకరు గీసిన గీతని మార్చేసి సరికొత్త గీతాగానంగా చరిత్రలో నిలిచిపొమ్మంటారు. బిచ్చటపు ఎద కవిత ప్రేమ రాహిత్యంలో కొట్టుకుపోతున్న జీవితాలకు విశ్వ రహస్యమైన ప్రేమను అరువుగా ఇమ్మని విశ్వాత్మను అర్ధించడం ఈ కవితా సంపుటికి అందమైన ముగింపుగా మారింది.

మన సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అకృత్యాలను, వింత పోకడలను, స్త్రీ సమస్యలను, రైతు సమస్యలను, సామాజిక లోటుపాట్లను ఇలా ప్రతి కోణాన్ని పరిశీలించి విభిన్న భావావేశంతో తనదైన శైలిలో నిజాయితీ నిండిన మనసుతో సున్నితంగా కొన్ని అంశాలను, కోపంగా మరికొన్నిటిని, ఆవేశంగా కొన్ని అక్షర భావాలను బాకులుగా మార్చి వెన్నెలను కూడా మండే అగ్ని కణాలుగా వర్షింపజేయడం ఒక్క వనజ తాటినికే చెల్లింది. చక్కని సామజిక, నైతిక అంశాలతో కూడిన ఈ " వెలుతురు బాకు " కవితా సంపుటి అందరిని అలరిస్తుంది అనడంలో ఎట్టి సందేహమూ లేదు. చక్కని, చిక్కని కవిత్వాన్ని అందించిన వనజ తాతినేని శుభాభినందనలు.



కామెంట్‌లు లేవు: