31, అక్టోబర్ 2018, బుధవారం

రస స్పర్శ





నిశ్శబ్దం నిశ్శబ్దం .. భయంకరమైన నిశ్శబ్దం. నా  లోలోపల మాట్లాడుకునే మాటలే నాకు వినబడని నిశ్శబ్దం.  అమావాస్య రాత్రిలా  నన్ను చుట్టేసిన నిశ్శబ్దం. మైనస్ డిగ్రీలలో వెచ్చని రజాయిలా నన్ను అంటిపెట్టుకున్న నిశ్శబ్దం. నిశ్శబ్దంలో నుండి  నిశ్శబ్దంలోకి ప్రయాణిస్తూ నేను. ప్రచండమైన మనో వేగంతో యిల్లు నగరాలు దేశాలు ఖండాలు దాటి దట్టమైన  కీకారణ్యంలో ప్రవేశించాను. అక్కడ కూడా నిశ్శబ్దమే. నేను మనుషులకి దూరంగా కదా పారిపోయి వచ్చింది. ఇన్నాళ్ళూ వాళ్ళకు యిష్టంగా నాకు కష్టంగా వాళ్ళకు కష్టంగా నాకు యిష్టంగా మాట్లాడే శబ్దాల నుండి వెఱచి చేస్తున్న ప్రయాణం కదా యిది. పక్షుల కిలకిల రవాలని  కూడా అసహ్యించుకున్నానేమో..అవి కూడా వినబడని గాఢమైన నిశ్శబ్దంలో దారీతెన్నూ లేక నడుస్తూనే వున్నాను. ఊటలా పుట్టే ఆలోచనలపై కూడా  నిశ్శబ్దమనే పెద్ద బండపడి యెందుకు నడుస్తున్నానో తెలియని  సృహలో  నిసృహగా నడుస్తూనే వున్నాను. అలా పగలురాత్రెరుగని ప్రయాణంలో నిస్సత్తుగా మారి శరీరం గాలిలో తేలిపోతూన్నట్లు అనిపించి  కాసేపు విశ్రమించాలని అనుకున్నాను. ఉన్నచోటనే పడిపోయాను. రాళ్ళు ముళ్ళు వున్న సృహే  లేదు.

ఆ అచేతనావస్థలో అకస్మాత్తుగా   చెవులనుండి ఆత్మని చేరిన సంగీత ప్రవాహం. అనాదిగా వున్న నిశ్శబ్దంలో నుండి జనియించిన శబ్దం. అది సృష్టించిన అలజడిలో నుండి మేల్కొని చుట్టూ పరికించి చూడాలనుకున్నాను. కానీ కనులు తెరవలేకపోతున్నాను. నా విశ్రాంతిని,  నిశ్శబ్దాన్ని భగ్నం చేసిన ఆ శబ్దంపై  అంతులేని ద్వేషం కల్గింది. పైకి లేవలేక కుప్పకూలిపోయాను. లోకంలో వూరేగాల్సిన గాలినంతా యెవరో  పోగేసుకున్నట్లు దానిని పూరించి శబ్దాన్ని సృష్టిస్తూ వున్నట్లు అనిపించింది. వింటూ వింటూ నుండగా  ఆ  నాదంలో యేదో మహత్తర శక్తి వుందనిపించింది .  క్రమేపీ ఆ శక్తి నాలో ఆణువణువూ ఆక్రమించింది. నన్ను  నిద్రాణంలో నుండి బయటపడేసిన ఆ శబ్దాన్ని సృష్టించిన  వైతాళికుడిని చూడాలనుకుని లేచి కూర్చున్నాను.  ఈసారి శ్రమ పడకుండానే కళ్ళు మాములుగా తెరుచుకున్నాయి. మైళ్ళ దూరందాకా  విస్తరించిన ఊడల మఱ్ఱిచెట్టు మొదలునానుకుని విశ్రాంతంగా రాజసంగా కూర్చున్నాడతను. అరమోడ్పు కన్నులతో వెదురుకర్రపై వేళ్ళు కదిలిస్తూ పెదవులతో గాలిని వూయిస్తూ లోకాలలో పనిలేనట్టు తన లోకంలో మునిగిపోయి వున్నాడు.  నాకు దాహంగా వుంది అని అరిచాను.  అతను ఆ వెదురుకర్రని వూదటం ఆపేసి నెమ్మెదిగా లేచొచ్చి  తండ్రిలా నా చేయి పట్టుకుని నడిపిస్తూ తీసుకెళ్లి  సముద్రం ముందు నిలబెట్టాడు. అతన్ని పట్టించుకోవడం మానేసి సముద్రాన్ని చూస్తున్నా. కెరటాలు వువెత్తున్న వచ్చి భూమిని తన తలతో కసితీరా బాది  వెనక్కి వెళుతున్నాయి. అలసిపోతూ వున్నాయి. మళ్ళీ అంతలోనే వొచ్చి  తనప్రతాపం చూపుతున్నాయి.  ఎందుకో భూమిపై జాలేసింది. సముద్రం పొగరు అణచాలనిపించింది.

సముద్రానికి స్ట్రా వేసి తాగుతున్నా ..తాగుతూనే వున్నాను. ఎంత తాగినా దప్పికారడం లేదు. సముద్రమంతా యెండిపోతుంది. చేపలన్నీ,తిమింగలాలన్నీ యెగిరిపోతున్నాయి. నక్షత్రాలన్నీ నా చుట్టూ వెలుగుతున్నాయి. కనిపించినంతమేరా పూలపొదలు,ముత్యాల, పగడాల, బంగారు రాసులు. చిన్న పువ్వునైనా కోసుకోవాలని కానీ ముత్యాల  పగడాల రాశులని  తాకాలని కానీ నాకనిపించలేదు.  ఒక్క క్షణం నేనెవరిని ..అసలు నాకూ ఈ లోకానికి సంబంధమేమిటీ అన్న సందేహం వచ్చింది. తెలుసుకోవాలనిపించింది. మరుక్షణంలో అసలీ లోకంతో నాకు పనేమిటీ, నేను నేనే. నేను మాత్రమే నిజం అన్న అహం ఆవరించింది. తలెత్తి చూసాను. భూమి చాలా మైళ్ళ యెత్తులో,శిఖరాలు అంతకన్నా యెత్తులో కనబడుతూ వున్నాయి. నేనిక్కడ దాకా యెందుకు వచ్చాను,  అసలక్కడ లేనిది యిక్కడ వున్నది యేమిటన్న  సందేహం ముంచుకొచ్చింది. హఠాత్తుగా నాలోపల ఒక మనిషి వున్నాడని గుర్తుకువచ్చింది . వాడికి అన్నీ వున్నాయి అనుకోగానే  ఆకలి గుర్తుకొచ్చింది.  చుట్టూ చూసాను. తినదగిన ఆహార పదార్ధాలేవి  యెక్కడా కనబడలేదు. ఆఖరికి నీళ్ళు లేవు, గాలి లేదు, యేవీలేవు.  కానీ నేనున్నాను. అసంతృప్తి నిండిన నేనున్నాను.  నాకేమికావాలో తెలిసిన సృహలో  కొంత వినయంగానూ, తెలియని అజ్ఞానంలో కొంత అమాయకంగానూ, నాకేమి తెలియాల్సింది లేదన్న అహంకారంతో  కొంత నిర్లక్ష్యంగానూ సంచరిస్తూనే  వున్నాను.

ఉన్నాను, అలాగే సంచరిస్తూనే వున్నాను.మంటలు మంటలు నా చుట్టూతా మంటలు మంటలమధ్య కూడా నడుస్తూనే వున్నాను.అందులో దహించబడతున్నానేమోనని   భయం కల్గింది కానీ నాకు యిసుమంత వేడి తగలడంలేదు దూదిలా తేలి తేలి పోతున్నాను. ఎందుకంటే నాలో ఉన్న ఆరునదులను దాచుకుని వున్నందునేమో. ఆ ఆరు నదులు అగ్నికి లోబడి దహించనిదే నేను చేరుకోవాల్సిన గమ్యం నాకు కనబడదేమోనన్న దిగులు ఆవరించింది .   నిరాశగా నడుస్తూనే వు న్నాను. కొన్నాళ్ళకి   ఆ అగ్ని శిఖల మధ్య అతను. చిత్రంగా అతని చుట్టూ ఒక చీకటి  వలయం. ఆవలయంలో కూర్చుని శిల్పాలు చెక్కుతూనే వున్నాడు అతని చుట్టూ వున్న బండరాళ్ళన్నీ  శిల్పాలు గా మారుతూనే వున్నాయి..కొన్నాళ్ళకి  ఆ శిల్పాల అర చేతిలో దీపపు ప్రమిదలని  చెక్కుతున్నాడు. చెక్కడం పూర్తైన తర్వాత నోటితో ఉప్ మని వూది వాటినన్నింటిలో  నూనెని నింపాడు.  తరువాత  అన్నింటిని చేతితో తాకుతూ వెళుతున్నాడు. దీపాలు  వెలుగుతున్నాయి  కానీ కానీ అక్కడ వెలుగు లేదు. అక్కడ  ఆవరించిన భయంకరమైన  చీకటిలోకి  వూపిరి ఆడటంలేదు. దీపాలని వెలిగించి వెలిగించి అతను చెట్టుని ఆనుకుని కూర్చుని వెదురుకర్రని ఊదడం మొదలెట్టగానే దీపాలన్నీ వెలుగుతున్నట్లు గాలికి వూగుతున్నట్లు కనబడింది నాకు. విసుగనిపించింది. మెల్లగా ఆ వలయం మధ్య నుండి బయటకి చేరుకున్నాను  అక్కడపుడు అగ్ని లేదు. మళ్ళీ సంచారం. 


 కొన్నాళ్ళకి  ఓపిక సన్నగిల్లింది. తూలిపడిపోబోతున్న నన్నొక ఆత్మీయ హస్తం పట్టుకుని నిలబెట్టింది. మెత్తని  పచ్చిక తివాచీపై కూర్చుండబెట్టి ఈ లోకానికి అతిధిగా వచ్చావ్, క్షుద్భాధతో అలమటించడం నాకు బాధ కల్గిస్తుంది. రా .. వచ్చి ఆరగించు అన్నాడు  చేతితో దగ్గరగా వున్న రకరకాల ఆహారపదార్ధాలవైపు చూపుతూ.   తొలిసారిగా నాతో మాట్లాడుతూన్న అతని వైపు చూస్తూ    ఓహ్ ..నన్ను  యిప్పుడితని అతిధిని అంటున్నాడు. అతిధి మర్యాదలు చేయకపోతే నామోషీ గాబోలు, కనీసం  ఆకలి తీర్చేటప్పుడైనా అమ్మలాగా అనిపించ వచ్చు కదా !  ఆ ఆహారపదార్ధాలలో కాస్త మధురమైన ప్రేమని రంగరించి  కొసరి కొసరి తినిపించవచ్చుకదా !  ఏదో మొక్కుబడిగా పిలిచాడు. నేనెందుకు వెళ్ళాలసలు అని బీరాలు  పోయాను.  ఆకలి సంగతి మరిచి ఆసలెక్కడికి వెళ్ళినా అతనే యెందుకుంటున్నాడో అని ఆలోచన చేస్తూ ఆ ఆహార పదార్ధాలనుండి దూరంగా జరిగి  వో  రాతిపై కూర్చుండి పోయాను.

అతను ఎప్పటిలాగానే   చెట్టు క్రిందనే కూర్చుని దట్టీ లో నుంచి వెదురు కఱ్ఱని తీసి పెదవులకి ఆనించాడు. ఎప్పటిలాగానే నేనొకరకమైన  మైకంలో  కనులు మూసుకుని పోతుండగా నా అంతరంగం ఒకటి గుర్తుచేస్తుంది.ఈ సుందర వుద్యాన వనాలు, లతలు, ఫలపుష్ఫాదులు, ముత్యాల పగడాల రాసులు, గాలిలో తేలిపోయినట్లుండే యీ సంగీతం వినడం, మధుర పదార్ధాలు ఆరగించడం యివేమి కాదే నేను కోరుకున్నది. నాకు కావాల్సినది మరేదో, అదేమిటో హృదయానికి తెలుసు కానీ ఆలోచనకేమాత్రం అందనంటుంది.  శతాబ్దాల విరహంతో మనసు వేగిపోతుంది. హృదయం అలమటిస్తుంది.  ఆ యాతనని  చెప్పటానికి సమయం ఆసన్నమైంది కానీ నోరు పెగలనంటుంది. ఎట్టకేలకూ  అంతరంగంలో జ్వలిస్తున్న కోరిక ముందుకు తోసుకొచ్చింది. అవును నేను నా సఖుడిని కదా కోరుకున్నది. అతడే యీతడు కావచ్చు కదా అని తోచింది. తోచినదే తడవుగా  నేను నా అహాన్ని  త్యజించి బిడియం విసర్జించి  అతడు మాత్రమే సత్యం అన్నది  గ్రహించి జ్ఞాన వస్త్రాన్నికప్పుకుంటూ చేతులు చాచి  రా రమ్మని ఆహ్వానిస్తూ  అతని ముందుకు నడిచాను. అతను నా వైపు చూడనైనా చూడలేదు. తన లోకంలో తాను మునిగి వున్నాడు.  నాచుట్టూ మాయమైన సముద్రమంతా దుఃఖంలా మొలుచుకొస్తుంది. అందులో నేను మునిగిపోతున్నాను. దీనంగా అతనిపైనే దృష్టి నిలిపి నీ బాహుబంధాల మధ్య క్షణమైనా నన్ను విశ్రమించనీయి. ఎన్నివేల లక్షల   యోజనాలు తిరిగి తిరిగి వెతికాను నిన్ను. నిన్నిప్పుడే తెలుసుకున్నాను. నీ సమక్షంలో  గొప్ప శాంతిని పొందిన అనుభవాన్ని రవంతైనా  మిగలనీయ కూడదా, వేదనతో అలమటిస్తున్న నా  ఆత్మ రోదన వినిపించడం లేదా అని మౌనంగా నా మాటని  నివేదిస్తున్నాను. కళ్ళనిండా వున్న నీళ్ళను కమ్మేస్తూ మహా సముద్రం నన్ను ముంచేసింది.

సృహ వచ్చి చూసుకునే సరికి అతని ఆలింగనంలో నేను.  నన్ను రక్షించాడతను.సంతోషంతో నిలువెల్లా వూగిపోయాను.  సఖా ! నేను నువ్వు వేరు  వేరు కాదు  కదా,  మనం ఆత్మ ముద్రలం కదా అని గుస గుసగా అడుగుతూ, నా స్వరం నాకే కొత్తగా వినబడుతుంటే ఆశ్చర్యంగా కనులు విప్పాను. నాతలకి దగ్గరగా అతను  తలని వొంచి  దయాపూరితమైన ధృక్కుతో వాత్సల్యంతో నన్ను చూస్తూ   నీ అశాంతి మాయమైందా  అని అడిగాడతను . మాయం చేయడం నీ చేతిలో పని కదా, మళ్ళీ అశాంతి వొడ్డున నన్ను వొదిలేయకు. నన్ను నీ ఆలింగనంలోనే బంధించి ఆ పారవశ్యసౌఖ్యాన్ని శాశ్వతం చేయి అన్నాను. అతను మాట్లాడ లేదు. తలనెత్తి సాలోచనగా పైకి  క్షణకాలం   చూసి కనులు మూసుకున్నాడు. ఆ గడ్డం క్రింద  నొక్కుని చూస్తూ అతన్ని మరింత గట్టిగా హత్తుకోబోయాను. సుతిమెత్తని స్పర్శలో యేదో లోపించింది. మరుక్షణం మనసుకి  వుక్కపోసినట్లయింది. అప్రయత్నంగా అతని నుండి విడివడ్డాను.క్షణంలో నన్నావరించిన తేజస్సంతా తటిల్లతలా మెరిసి గాఢాంధకారంలో కలిసిపోయింది.  అర్ధమైంది, నేను అలమటిస్తున్నాననే జాలి దయతోనే  అతను నన్ను దగ్గరకి తీసుకున్నట్లు.   సంపూర్ణమైన ప్రేమతో  అక్కున జేర్చుకోని అతని  ప్రియ సాన్నినిధ్యం  నాకు మాత్రం వెగటు కల్గించదూ. పొతే పోనీయి లే అని నన్ను నేను స్థిమిత పరుచుకున్నాను. మరుక్షణంలోనే  నా ప్రేమలో నిస్వార్ధం, నా వాంఛలో పరిపూర్ణం గోచరించనిదే అతను మాత్రం యెలా స్వీకరించగలడు అని ప్రశ్నించుకున్నాను.  అతను క్రమేపీ నా మానసంలో నుండి కూడా అదృశ్యమై పోయాడు. వెనువెంటనే  అవ్యక్తమైన  దుఃఖం నన్నావరించింది. మృత భారమైన శరీరాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ వున్నాను.ప్రేమించడం అంటే మనని మనం గాయపరుచుకోవడమేకదా! గాయాలను మాన్పుకుంటూ మరింత ప్రేమించడమనే మార్గం ద్వారానే అతన్ని చేరుకోగలననిపించింది.

దేహం పొరలు పొరలు  తొలుచుకుంటూ నెమ్మెదిగా బయటకి వస్తుంది. తడిచిన మోచేయి చల్లగా ముఖానికి  తగులుతుంది.ఎవరో పై అంతస్తులో గతా గతా నడుస్తున్న శబ్దం. తోడుగా తలుపుపై మునివేళ్ళ శబ్దం. బలవంతంగా నెమ్మదిగా కళ్ళు తెరిచి యెదురుగా  వున్న కిటికీ వైపుకి చూసాను. దూరంగా గాలికి కదులుతున్న ఫైన్ వృక్షపు కొమ్మలు. అద్దాల తలుపులని బద్దలు కొట్టుకుని మరీ వచ్చిన   బుచుకు  బుచుకు మనే శబ్దం. అప్రయత్నంగానే లేచి కిటికీ ప్రక్కన నిలబడి  అద్దానికి ఆవల చూస్తే రోజ్ గ్రీక్ పూల పొదలపై తుమ్మెదల సంచారాన్ని చూసిన ఆనందంతో పేటియా రైలింగ్ పైన చక్కర్లు కొడుతూ గొంతువిప్పిన పక్షి.  తిరిగి మొదలైన అవుట్ ఫుట్ రొద. దూరంగా కూతవేస్తూ వెళుతున్న లోకల్ ట్రైన్ నా లోపలి  నిశ్శబ్దాన్ని పూర్తిగా భగ్నం చేస్తూ.



                            (ఇదొక అనుభవైకవేద్యం)

26, అక్టోబర్ 2018, శుక్రవారం

అబెలియా రోజ్ క్రీక్

మా ఇంటికి సమీపంలోనూ,చుట్టుప్రక్కలా  విరివిగా కనబడే అబెలియా రోజ్ క్రీక్ పూపొదలు. 


అందమైన తెల్లని పూలతో పాటు తరువంతా  చిగురుటాకులు పూమొగ్గల్లా కనబడతాయి. పరీక్షగా చూడండి లేత చిగురుటెరుపులా కనబడేవన్నీ ఆకులే . 


ఇక ఈ పూల లోని మకరందం కోసం గండు తుమ్మెదలు రొద చేస్తూ తిరుగుతూనే ఉంటాయి. ప్రొద్దు ప్రొద్దుటే చిన్న చిన్న తేనెటీగల కోసం ఆ పూపొదల చుట్టూ చక్కర్లు కొట్టే పిచ్చుకలకంటే పెద్దవైన  పక్షులు వాటి బుచుకు బుచుకు అనే రవాలు బహుముచ్చటగా ఉంటాయి. 


ఈ అబెలియా రోజ్ క్రీక్  పొదలు చాలా చోట్ల కనబడ్డాయి. రోడ్డు ప్రక్కన ఉన్న విశాలమైన జాగాలలో క్రమపద్ధతిగా నాటబడి అందంగా కనబడుతూ ఉంటాయి. 


ఇలా నా చేత ఆకర్షింపబడిన చెట్లు పూల మొక్కలవలన  నాకు బాగా ఇష్టమైన కాలక్షేపం కేమీ కొరతలేదు.  ప్రకృతిని ప్రేమించడానికి ఇంతకన్నా కారణమేమి కావాలసలు :)   








24, అక్టోబర్ 2018, బుధవారం

ఓక్ వృక్షం ప్రేమలో ..


మొక్కలతో సంభాషించని రోజు నాకు వెలితిగా ఉంటుంది. మా అబ్బాయి ఉండే ప్రాంతంలో పచ్చదనానికి ఏ మాత్రం కొరత లేకపోయినా వాటిని సృశించకుండా ఆ పచ్చదనాన్ని అనుభూతిలోకి ఒంపుకోవడం సాధ్యం కానీ పని . ఆకురాలు కాలానికి ముందు నేను అమెరికా దేశానికి రావడం ఆనందం కల్గించే విషయమే. ఎన్నో రకాల వృక్ష జాతులని వాటి ఆకుల రూపు రేఖల్ని పూల పొదలని ప్రత్యక్షంగా చూసాను. వాటిని సృశించకుండా ఉండటమే అసలైన శిక్ష . 

నన్ను బాగా ఆకర్షించిన వృక్షం "ఓక్ " 
ఆ వృక్షపు రాలు ఆకులు రాలిన పండ్ల గింజలు చూస్తూ కాసిని యేరుకుంటూ ఫోటోలు తీసుకుంటూ చిన్న పిల్లలా పేర్చుకుంటూ గడిపే ఆనందకర సమయాన్ని కాస్త మీతో ఇలా పంచుకుంటూ .. ఈ చిత్రాలు. 









23, అక్టోబర్ 2018, మంగళవారం

పురుషాహంకారం పై విసురుతున్న వెలుతురు బాకు

పురుషాహాంకారంపై వనజ గారు విసురుతున్న “వెలుతురు బాకు ‘ ఈ కవిత్వం “


రాజారామ్ తూముచర్ల (కవిసంగమం -కవితాంతరంగం శీర్షికలో సమీక్ష ) ఈ లింక్ లో ..



ఎవరైనా సంతోషాన్నో ఆనందాన్నో కోరుకుంటారు.దుఃఖాన్నో విషాదాన్నో ఎవరు కొరుకోరు.కాస్త దుఃఖం కావాలనిపిస్తుందని ఎవరన్నా అంటారా?.తనని తాను సేద తీర్చుకోవడానికీ దుఃఖాన్ని తోడుకోవాలని దుఃఖపు నదిని ఈదాలని ఎవరైనా ఆలోచిస్తారా?దుఃఖాన్ని ప్రేమగా ఎవరైనా హత్తుకోగలరా?. హత్తుకోలేరు.కానీ ఒక కవయిత్రి తనది కానీ నిలువెత్తు దుఃఖాన్ని ప్రేమగా హత్తుకున్నది కవిత్వంలో…

తమ నుదుట దుఃఖాన్నిదేవుడు రాసిపెట్టినాడని అనుకుంటున్న స్త్రీల హృదయాలలోని భావనని బద్దలు కొట్టి దుఃఖవారసత్వాలని మోయకుండా విసిరేసీ సవాళ్ళను ఎదుర్కోగల స్థైర్యంతో పురుషాహాంకారపు చీకటిని చీల్చడానికీ కవిత్వపు వెలుతు బాకుని ఒక కవయిత్రి విసిరింది.

“వాక్య గుచ్ఛం ముడి విప్పితే
విడివడిన అనేక పదాల్లో
నిండిన భావ పరిమళమే
నేను అనబడే నా కవిత్వం “

కవిత్వ గులాబీ ముళ్ళకి చిక్కుకొని దిగుళ్ల పల్లకీని బోయిలా మోస్తున్నహృదయం వున్న ఒక కవయిత్రి అన్న మాటలు పై వాక్యాలు. ఆకాశంలో సగం నాదేనని ఢంకా బజాయిస్తూ అంతటా విస్తరిస్తున్న మహిళా చైతన్యానికీ ప్రతీకగా కవిత్వపు మెరుపుల్ని కవిత్వపు వెలుగుల్నీ వెలుతురు బాకు గా మార్చి అసమ వ్యవస్థ మీద విసిరేసింది ఒక కవయిత్రి.

ఆ కవయిత్రి ఎవరంటే.. వనజ తాతినేని గారు. ఈవిడ కవిత్వ సంపుటిలో వున్న కవితలన్నీ చూడటానికీ స్త్రీవాద కవితలని అనిపించినా అందులో కొన్నిఆవిడ అంతరంగా మథనాలే అయినా అవన్నీ భాషలో భావంలో తొట్రుబాటు లేని కవితలు.ఈ కవితల్లో సమాజ పరిశీలనం నిశితం.వ్యక్తీకరణ కళాత్మకం.ధిక్కారాన్ని సహించని ధిషణ, రచనా దక్షత వనజ గారి కవిత్వపు సొంపులు.తోటి స్త్రీల అనుభవాలు,స్వీయ అనుభవాలు కేంద్రంగా నడిపిన కవితలివన్నీ.


వనజ గారి ‘ ద్వారాల మాట ‘ అనే కవితా ఖండిక ఒక విభిన్న అభివ్యక్తితో మంచి కవిత కావటం వల్లనేమో నన్ను వెంటాడుతూ వేటాడుతూ వుండింది చాలా రోజులు.

వస్త్వాంశాల పేర్పులో నేర్పు వుండటం అందుకు కారణమేమో.విభేదకాంశాలను వ్యక్తీకరించే పదాలను ఇందులో పొదుపుగా పొదగడం వల్లా కూడా ఈ కవిత శక్తివంతమైంది.ఆ కవిత ఇది.

“మీ కన్నా ఒక ద్వారం ఎక్కువ వున్న వాళ్ళం
ఆ ద్వారం నుండే లోకాన్ని చూడటానికి అనుమతిచ్చిన వాళ్ళం
నిత్య సాంగత్యపు గాయాల సలుపు తీరకుండానే
జీవనౌషాధాన్ని పూసుకుంటూ యంత్రాల్లా పరిగెడుతున్న వాళ్ళం
ద్వారాల పైనే ఉన్న మీ కాముక దృష్టిని మరల్చి
360 డిగ్రీలకోణం తో చూపులని విశాలత్వంతో నింపండి
ఎటు తిప్పిన ఇద్దరం కలసి తిరగాల్సిన వాళ్ళమే కదా
ప్రేమతో చెబుతున్నాం ..పరుషంగా చెపుతున్నాం
ఎలా చెప్పినా మీరిది విని తీరాలి ఇది రుధిర ద్వారాల మాట
ఇది దశమ ద్వారాల మాట “ 
( ద్వారాల మాట )

“ ప్రేమతోనో పరుషంగానో చెపుబుతున్నాం ఎలా చెప్పినా మీరు విని తీరాలి” – అని అంటున్న కవయిత్రి వనజ తాతినేని గారు.ఎందుకు అలా అన్నారంటే ఒక పీడిత వర్గంగా వున్న స్త్రీ విద్య,ఆరోగ్య,వైవాహిక,సాంసారిక ఉద్యోగాది రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక సాధికారిక శక్తిగా వనజ గారు తనను తాను ప్రతినిధిగా ఎంచుకుంటూనే జీవితంలో సహచరులైన పురుషుల వైఖరిలో రావాల్సిన మార్పుల కోసం అలా అంటున్నారు.

రోజుకొకసారైన ప్రేమ జడివానలో తడవాలని,ప్రేమార్హతకై తపించిపోతూ,నిత్య సాంగత్యపు గాయాల సలుపు తీరకుండానే జీవనౌషధాన్ని పూసుకొంటూ యంత్రాల్లా వున్న స్త్రీని భార్యగా,వంట మనిషిగా,ఇంటి పని మనిషిగా కామోద్దీపనకు ఉపయోపడే పరికరంగా మాత్రమే చూస్తున్న పురుషులతో “ మీ కన్నా ఒక ద్వారం ఎక్కువ వున్న వాళ్ళం ఆ ద్వారం నుండే లోకాన్ని చూడటానికి అనుమతిచ్చిన వాళ్లం “అని అంటూ స్త్రీ అణిచివేత పట్ల,పురుషాహంకారం పట్ల ధర్మాగ్రహాన్ని ప్రకటించారు వనజ గారు .

ఇట్లా కవిత్వం రాసే స్త్రీలు వొకప్పుడు చాలా తక్కువగా వుండేవారు.ఆడవాళ్ళు కవిత్వానికి ఆమడ దూరమని కొందరు అనుకుంటున్న సమయంలో ఈ స్థితి అనివార్యంగా మారిపోయిన సందర్భంలో ఇవాళ ఎందరో స్త్రీలు కవిత్వం రాయడం మొదలెట్టారు.

ప్రేమ గీతాలు,విరహగీతాలో కాక సామాజిక నిబద్ధత గల కవితలు రాస్తున్నారు స్త్రీలు.అశ్లీలతా ఆరోపణలకు వెరవకుండా మగవాళ్ళు కూడా స్పృశించడానికి సాహసించని వస్తువులను ఆశ్చర్యం కలిగించే శిల్పం తో ధైర్యంతో మంచి కవిత్వం సీరియస్ కవిత్వం కొందరు కవయిత్రులు రాస్తున్నారు.అలాంటి కవయిత్రుల్లో తాతినేని వనజ గారొకరు.

వెలుతురు బాకు విసరటం మగవారి సొత్తు మాత్రమే కాదు ఆకాశంలో సగం అయిన తమది కూడానని జెండా ఎగరేసి అంతటా విస్తరిస్తున్న స్త్రీ చైతన్యానికి ప్రతీకగా అభ్యుదయగామిగా కఠోర సత్యాలను నిర్మొహమాటంగా నిండు మనస్సు తో కవిత్వం చేస్తున్న కవయిత్రి వనజ గారు.పురుషాధిక్య సమాజంలో స్త్రీల కన్నీటి గాథలకు హేతువులు వెదికి తన కవిత్వాన్ని స్త్రీలకు వకాల్తా చేయాలన్న ఆలోచన ఈవిడ కవిత్వమంతా మెరుస్తుంది.

అట్లని అన్నీ స్త్రీ చైతన్య కవితల్నే వనజ గారు సృజించలేదు.భాషలో భావంలో ఏ మాత్రం తొట్రుబాటుతనం తొందరపాటు తనం లేకుండా నిశిత పరిశీలన దృష్టితో కళాత్మక వ్యక్తీకరణతో స్త్రీ సమస్యలను, వ్యవస్థ స్వరూప స్వభావాలను పరిశీలించడంలో వనజ గారు ప్రదర్శించిన తీరు ప్రశంసించకుండా ఉండలేను.కల కల్లనే ఎప్పుడు.అదునులో వాన కురువని సందర్భంలో రైతులు కన్న కలలు కల్లలైన దృశ్యానికి కూడా స్త్రీ వాద చైతన్య స్పృహనే అద్దుతుంది ఈ కవయిత్రి.

“ఉన్నట్టుండి నల్లటి పువ్వులని విరబూసిన ఆకాశం
చల్లని గాలితో ఆహ్లాదంగా రాలుతున్న చినుకుల రెమ్మలు
ఆర్తి కొంగు పట్టి వాటిని జరుపుకుంటున్న నేల కన్నె
ఒడిలో విత్తు పగిలి మూడు రుతు రాత్రులు తెల్లారితే చాలు
పచ్చని కాంతితో పిగిలిపడుతూ పూర్ణ కుంభిణిలా శోభించే పుడమి
ప్రసవ వేదన తర్వాత బిడ్డని చూసుకున్న తల్లి చిరునవ్వులా ఖాళీ భూమి “

మేఘాల్ని నల్లటి పువ్వులతో పోల్చింది ఈవిడ.స్త్రీ జీవితంలొని ప్రసవ వేదనా వ్యధని పుడమిలోంచి అంకురించే విత్తు వేదనతో పోల్చుతుంది.మొలిచిన విత్తుని చూసిన రైతు ఆనందాన్ని ప్రసవించాక తల్లి ముఖంలొని ఆనందపు చిరునవ్వుతో పొల్చి..మొలకెత్తిన పంట వానలేక వాడిపోతే ఆశలు అవిసిపోయిన రైతు దుఃఖాన్ని .. ఆ రైతుని రుణాల కరాళ నృత్యతాండవంతో బెదిరిన గొడ్డుతో సంభావిస్తుంది వనజ గారు. సమస్యల్ని 360 డిగ్రీల కోణంతో చూపిస్తుంది. 
ఈ దేశ దుర్యోధన దుశ్శాసన పర్వంలో పోలీస్ స్టేషన్స్ కూడ కౌరవ సభలు కావడాన్ని చెప్పడానికీ ఇక్కడ వస్త్రాపహరణమొక సంస్కృతి అని అంటుంది వనజ గారు. ఎఅవరి ఆయుధం వారి చేతుల్లో వుండాలని చెబుతూ పోలీస్ స్టేషన్ కు వెళ్ళేటప్పుడు చీర కొంగుల్లో చిటికెడు కారమో చేతిలో చిన్న చుర కత్తైన లేకుండా వెళ్లకండి అని చెబుతుంది.ఇంకా ఏమంటారంటే ఈ కవయిత్రి…

“జాగ్రత్త తల్లీ
ఈ సారి పోలీస్ హవుస్ లకి వెళ్ళేటప్పుడు
తోళ్ళు తాటాకులు కూడా రహస్యంగా తీసుకెళ్ళండి
ఏం జరిగిన రహస్యంగా దాచుకోండి “

రక్షించే రక్షణ వ్యవస్థే ఇట్లా ప్రవర్తించే సంస్కృతిని నిరసిస్తూ బరితెగించిన ఈ వ్యవస్థని గర్హిస్తుంది. పర స్త్రీ అనాటమీలో తమ అమ్మ అనాటమీ ని చూడలేని అనారిక సంతతి ఈ దేశంలో అనేకం. ఇంట్లో ప్రదర్శించిన వికృత మనస్తత్వాన్ని ఇంకా మిగుల్చుకున్న మగ వాళ్ళు స్త్ర్రీ శరీరాల తాకిడికై పడే వెంపర్లాటల్ని “వారు వారే “ అనే కవితలో అలాంటి వాళ్ల ముసుగుల్ని తొలగించి చూపించింది ఈ కవయిత్రి.

“హాస్టల్ లో ఉన్న ఆడపిల్లను చూస్తే
ఆక్వేరియమ్ లో అలుపు లేకుండా తిరిగే
రంగు రంగుల చేపలని చూసినట్టుంటుంది
ఎప్పుడేప్పుడు బయట పడుదామా అన్నట్లు
గేటు వైపు చూస్తుంటే
కాముకుల చూపుల వలకీ
చిక్కుకుపోతారేమోనని భయమేస్తుంటుంది”

చదువుల సముద్రంలో ర్యాంక్ ల ఓడలపై ప్రయాణిస్తున్న విద్యార్థునుల హాస్టల్ల లోని జీవితాల్ని, జ్వలిస్తూ హృదయాలు చలించే కవిత్వం చేసింది వనజ గారు.విద్యాగంధాల్ని ఆస్వాదించాల్సిన వాళ్ళు టాయిలెట్ల దుర్గంధాన్ని భరించలేని స్థితికి ఈ “హాస్టల్ గది “ అనే కవితలో అద్దం పట్టారు.

“పైటని తగిలేయాలి” అని జయప్రభ గారన్నారు .కానీ వనజ గారు పైటని చుట్టండి అని అంటున్నారు.దేహ సంపదని బజారున వేయకండి అని అంటుంది ఈ కవయిత్రి.నేర ప్రవృత్తికి సరి కొత్త ఊపిరి పోసే సంస్కతిని ,నాగరికతా భ్రమలో దేహ సంపదనుని బజారున వేస్తున్న సంస్కృతిని,ప్రపంచమంతా పువ్వులాంటి అబల నడుము చుట్టు తిప్పుతున్న వ్యాపార సంస్కృతిని, స్త్రీ దేహాన్నికాసులు పండించే పంట భూమిగా భావించే తండ్రుల ఆలోచనల్నీ, చిన్నతనంలోనే తెరమీద తన బిడ్డల్నీ చూసుకోవాలని ఆత్రుతతో తమ బిడ్డకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఇచ్చే తల్లుల భావనల్నీ ఖండించడానికే ఈ కవయిత్రి “అమ్మమ్మలూ బామ్మలూ పైటని చుట్టండి దేహాన్ని కప్పండి “ అని కవిత్వంలో అన్నది.అంతే కానీ ఛాందసంతో కాదని అనుకుంటున్నా.

జనారణ్యంలో మనిషే కరువయ్యాడు. మనిషంటూ ఎవరులేరు అందరు యంత్రాలే.వడి వడిగా జడిజడిగా వొక యంత్ర విధానంలో పరిగెత్తే వ్యవస్థలోని ఒక అవస్థను చెప్పడానికే “నాకో మనిషి కావాలి “ అనే ఈ కవిత రాసింది ఈ కవయిత్రి.

“త్వరిత గతిన నాతో సంభాషించే మనిషి కావాలి
ఎవరితో నైనా మాట్లాడాలి పోనీ ఎవరిఒతోనైనా పోట్లాడాలి
ఎవరిపైనైనా కోపగించుకోవాలి ఒకరిపైనైనా కినుక వహించాలి
జాగ్రతావస్థని దాటి అపరిచుతలనైనా ఆత్మీయంగా హత్తుకోవాలి “

ప్రతి మనిషి నాలుగు గోడల మధ్యనే వుంటాడు. మనిషికి మనిషికీ మధ్య కనిపించని ఐదో గోడ ఒకటి వుందని అది ఇదేనని ఇలా చెబుతుంది.

“ఎటూ చూసినా నాలుగు గోడలేనా
అయిదో గోడ కూడా ఉంది
మనిషికి మనిషికీ మధ్యవున్న గోడ ఏ చరిత్రకందని వింత
దాని పొడవు వెడల్పుఇ ఎవరూ ఊహించనిది “

మనిషి జీవితం వొక మట్టి పాత్రలాంటిదని అది కరిగి పగొలిపోయే లోపలే కష్ట సుఖాల అనుభూతుల వర్షంతో నింపుకోవాలనే ఒక తాత్విక భావనని చిక్కని హృదయం మేఘమై తేలిపోయేలా సౌందర్య పిపాసని రంగరించి చెబుతారు వనజ గారు.

“మట్టి పాత్రలాంటి మనిషి మట్టిలో కలిసిపోయేలోగా
అనుభూతుల వర్షంతో నింపుకోవాలి ఒలకబోసుకోవాలి
నలుపు తెలుపుల జీవితం రోట్లో
కాలం రోకలి పోటుకి చిందే అమృతక్షణాలు
పిండై పోయిన ఘడియలు తిరిగి రానే రావు “
ఈ దేశంలో రావణ పాదం తాకని చోటు కీచకుని చూపు సోకని చోటు లేదేమో? సామూహిక అత్యాచారాలు,మేరిటల్ రేప్ లు నిత్యం సత్యమై కలవరపెడుతున్నాయి.చట్టలు న్యాయస్థానాలు శిక్షలు కూడా ఏవీ పని చేయని చోట క్షణానికో అత్యాచారం నిముషానికో కనిపించని ఆత్మహనం కలవరపెడుతున్న సందర్భంలో కొందరికి తగులుకున్న కామ తెగులుని ఈ కవయిత్రి ధర్మాగ్రహంతో నిలదీస్తుంది ఇలా.

“రోటీ కపడా ఔర్ మకాన్
ఎవర్రా ఆ మాటంది
వాటికన్నా ముందు
విసర్జించడానికీ స్కలించడానికి ఓ క్షేత్రం కావాలి “

మరుగుదొడ్డి కన్నా మగువ అల్పంగా, ఆవుకన్న ఆడది స్వల్పంగా ఆలోచిస్తున్న ఈ పురుషాహంకార వ్యవస్థ వికృత రూపాన్ని చూపెడుతూ మానవ దేహంలో వున్న అనేక అవయవాలు ఇతరులకీ దానం చేయడానికీ పనికి వస్తాయి.దానానికీ కూడా పనికిరాని జననాంగాలకోసం వెంపర్లాడే జాతి కక్కుర్తిని మన కలువలకళ్ళు ఎర్రకోనేరులయ్యే కోపంతో ఇలా అంటుంది.

“అమ్మల్లారా
మూకమ్మడిగా అవయవాల ఆయుధాలని విసర్జించేద్దాం కదలండి
అవయవ దానానికి కూడా పనికిరాని అవయవాల కోసం నిత్యం
కాట్లాడే కుక్కల్లా పొంచివుండే నక్కల్లా
వేటాడే హైనాల్లాంటి వారి నరాల తీపుకీ
కోట్ల యోనుల్ని ఈ నేల మీద పరిచి
రేప్ కోర్టులు నిర్మిద్దాం రండి
చప్పరింపులకీ ఆటలాడుకోడానికీ స్తన్యాలని
గుదిబండలాగా పాతేసీపోదాం పదండి
కుట్టేసిన యోనులు కోసేసిన కుచద్వయాలతో
ఇంటా బయటా అర్థరాత్రి అపరాత్రి స్వేచ్ఛగా సంచరిస్తూ… “

ఎంత తీవ్ర కలతచెందితే తప్ప ఇలా రాయలేరు ఎవరైనా. ఈ లోకాన స్వచ్ఛమైనదేదైనా వుందంటే అది అమ్మ ప్రేమే.అందుకే కవిత్వ వస్తువైంది అనేకుల ఊహల్లో.అమ్మను గూర్చి రాయని కవి బహుశా లేడేమో?ఈ కవయిత్రి వనజ గారు అమ్మను బరువు మేఘం చేశారు కవిత్వంతో.

“అమ్మంటే అస్తిత్వమని అశ్రుబిందువులతో యెలుగెత్తి చెపుతున్నా
అమ్మంటే ఆవలి గట్టుకి వంతెననని యెద పరచి ఆరేస్తున్నా
అమ్మంటే వో బరువు మేఘమని అది అంత తొందరపడి కురవదని
కురిసినా ఎవరినీ యేమీ తిరిగి ఇమ్మనిఅడగదని “

ఈ కవయిత్రి కలానికీ కోపంతో అక్షర తూణీరం నుండి కవితాస్త్రాలను సంధించడమే కాదు తెలిసింది బాధల నదిలో కొట్టాడుతున్న తెర చాపను దింపటం తెలుసు. స్వచ్ఛమైన సుకుమారపు పువ్వులాంటి భావనల్ని కవిత్వంగా నేయటం తెలుసు.

“చూడు నీ కొసం ఏమి తెచ్చానో
మనసంతా స్వఛ్చమైన సుకుమారమైన పువ్వులని
గిలిగింతలు పెట్టే సంభాషణా చాతుర్యాన్ని
గండుకోయిల రాగాలని అడవి పూల సుగంధాన్ని
వేయి వేణువుల నాట్యాన్ని
గతజన్మలోని జ్ఞాపకాలనీ “

ఈ కవయిత్రి కథలు కూడా రాస్తుంది. అందుకే ఈవిడ కవితల్లో దృశ్య చిత్రణ ఎక్కువగా కనిపిస్తుంది.బహుశా ఇలా రాయడం కథా కథనం నుంచి తెచ్చుకున్న శిల్ప విశేషం. ఇది ఈ కవిత్వానికీ అదనపు అందమే.ఈ కవిత చూడండి.
“తల పగిలిపోతుంది
రక్త నాళాలు చిట్లిపోతున్నట్లు బాధ
యాపిల్ ని కత్తితో కోస్తే రెండు చెక్కలైనట్లు
మెదడు రెండు ముక్కలైతే బావుండును
నా నుండి నేను పాయలుగా చీలిపోతున్నట్లు
శాఖోప శాఖలుగా విస్తరించినట్లు
అంతర్వేదన బహిర్వేదన”

ఇలా కథా కథన శిల్పం తో ఈ కవయిత్రికథకే కాదు కవితకు ప్రాణం పోస్తుంది. ఈ సంపుటికి ముందుమాట రాసే అవకాశాన్ని జారవిడుచుకున్నాను.కారణం ముందుమాట రాసే అర్హత నాలో లేదన్న ఒకే ఒక్క భావనతో మాత్రమే.అంతే తప్ప అలసత్వం ఏమాత్రం కాదు కేవలం అశక్తతేనని చెబుతున్న వనజ గారికీ.

స్త్రీకీ పుట్టుకతో వచ్చే ఇంటి పేరు పెళ్ళితో మారిపోతున్నది ఈ దేశంలో.ఆడదో ఈడదో లేకుండా ఏదో ఒకటి ఉండకుండా వున్నదాన్ని వదిలించుకొని అది లేకుండా నేను లేనా అని ప్రశ్నిస్తుంది ఈ కవయిత్రి.మనిషిని ఎదగనివ్వని మూలాల్ని వద్దేవద్దని చెబుతుంది. నవ్వులో కన్నీళ్ళు చిట్లించగల వొకానొక విషాదాన్ని చవి చూసిన వనజ గారు మగువ మండే భాస్వరం కావాలని కోరుకుంటున్నది.స్త్రీల కన్నీటికీ స్వేచ్ఛ కోరుకుంటున్నకవిత్వం ఈవిడది.తాను మాటై మనసై వాక్యమై రాసిన కవిత్వమిది. సర్వజన సమ్మోహిత స్వరంగా తన కవిత్వాన్ని చేయాలనుకున్న కవయిత్రి అంతరంగమీ కవిత్వం.అంతర్లీనంగా తనలో ప్రవహించే బాధా నదీ అలల చప్పుళ్ళ సంగీతం ఇది.ఈ నిశ్శబ్ద కవిత్వ రవం వొళ్లంతా చుట్టుకున్న వేళ వనజ తాతినేని గారికీ అభినందనలు చెబుతూ…


( వెలుతురు బాకు సంపుటి కవయిత్రి వనజ గారు ఈ వారం కవితాంతరంగంలో ) — with వనజ తాతినేని




20, అక్టోబర్ 2018, శనివారం

ఈర్పెన

పనిలేని పంకజాక్షి ఈపి మీద  ఈసు (ఈర్ష్య) పడిందంట అనే సామెతని  మా నానమ్మ  వాడుతూ  ఉండేది.

ఈపి  అంటే ఏమిటో అనుకునేరు. మనకందరికీ తెలిసినదే.. పేలు గుడ్లు. హాస్టల్ లో పిల్లలని  సెలవలకి ఇంటికి తీసుకొచ్చి  అమ్మలందరూ వెంటబడి మరీ దువ్వి పోసేవి. అయినా ఇప్పుడు అందరికీ చుండ్రే, పేలు ఎక్కడ వున్నాయిలెండి. అసలు జుట్టే తక్కువ. అమ్మలు ఇంకేమి దువ్విపోస్తారు ? అసలు ఆ ఈపిని జుట్టు క్రింద నుండి  దువ్వి జుట్టు ఎంత పొడవు ఉంటె అంత పొడవునా జాగ్రత్తగా లాగి ఈర్పెన పళ్ళని ఎడమచేతితో దగ్గరకి చేర్చుతూ ఇసుకు ఇసుకు అనే శబ్దాన్ని పేలగుడ్లు శబ్దంకన్నా ఎక్కువ వినిపించే అమ్మలకి యెంత అమితానందమో. ఆ ఆనందం కోసమే పిల్లల ఎంబడి పడీ  పడీ మరీ కూలేసేవారు.  పిల్లల ఆటలకి శత్రువులా అడ్డుపడేవారని నా గట్టి  నమ్మకం. మా అమ్మ కూడా అంతే నండి.  అందుకే  ఈ విషయమంటే నాకంత  జ్ఞాపకం.

సోది చెప్పే వాళ్ళ దగ్గరో, నక్కలాళ్ళ దగ్గరో  చెక్క దువ్వెనలు కొని భద్రంగా దాపెట్టేవాళ్ళు .  సందు దొరికినప్పుడు పేల  మీద పేక్షనిజం చూపించే వారు. చెక్క దువ్వెనలు పోయి రకరకాల  దువ్వెనలు వచ్చేసాయి.  అసలు జుట్టులే మూడొంతులకి పైగా తగ్గిపోయాయి కాబట్టి ఏ దువ్వెనయితే యేం పోయింది అనిపిస్తూ ఉండటంలో తప్పులేదు.  కానీ..  ప్లాస్టిక్ దువ్వెనలు ఎందుకు వాడాలి? సహజమైన చెక్క దువ్వెనలు ఎందుకు వాడటం లేదు   అనే అనుమానం వచ్చింది.  ఈకో గణేశుడి లాగా ఈకో దువ్వెనలు వాడాలి అని కంకణం కట్టుకున్నాను .

 ఈర్పెన బొమ్మ కోసం వెదికి  వెదికి ప్లాస్టిక్ దెబ్బకి పురాతన ప్రదర్శనశాలలో పెట్టబడి ఉంటుంది అనుకున్నాను . నిజంగా ఈర్పెన చిత్రం గూగుల్ అంతా గాలించినా దొరకలేదిప్పుడు. ఏదో సామీప్యమైన చిత్రాలు దొరికాయి. మనం చిన్నప్పుడు చూసిన, ఉపయోగించిన ఈర్పెన ని ఈర్పెన అంటే యేమిటని అడిగిన భావితరాల వారికి చూపాలి కదా!

నేను చూడండి, వ్రాసుకుంటున్న కథ ప్రక్కన పడేసి ప్రొద్దున్నే యీ ఈర్పెన వెంట బడ్డాను. కథ కంచికి వెళ్లకముందే కనకదుర్గమ్మ ముంగిట ఆగింది.  కథలో సామెతని వాడి చేటు తెచ్చుకున్నాను సుమీ!  కథ వ్రాసే .. mood పోయి ఈర్పెన లో ఈపి పై చిక్కుకుంది.

ఉండండి ఇంత చెపుతుంటే తల ఒకటే దురదపుట్టి చస్తుంది. ప్రస్తుతానికి ప్లాస్టిక్ దువ్వెనతో అయిననూ కానీ...  తల దువ్వి పోయాలి.  :)




12, అక్టోబర్ 2018, శుక్రవారం

లిప్త క్షణాలు



ఈ తొవ్వకేమి తెలుసు
ప్రతి తలపు నీ వైపుకే నని
తనే మనసై నీ దరికి చేరనున్నదని.

***

నీ గురించి ఆలోచిస్తూ
నన్ను నేను గాయపర్చుకుంటూ..
ఆ గాయాలపై ఉప్పు జల్లుకుంటున్నానని

*****

కాయానికేనా తనని తాను మోసుకునే బాధ
గుండెకెంత వ్యధ
తన సొదని వినే తోడు లేక.

*******

తూట్లు తూట్లు పొడుచుకుంటుంది
రక్తాన్ని తుడుచుకుని కుట్లు వేసుకునేది నేనే
నువ్వు  కేవలం నిమిత్రమాత్తుడివి.

**********

ఊహల చెలమలో కథలు వూరుతుంటాయి
 కాసిని తొలుపుకుందామంటే
గులకరాళ్ళ గోటి గిచ్చుళ్ళు

************

అంతరాత్మ భాష అసలు భాష
చిత్రంగా
దానికి నవరసాలు తెలుసు

****************

చేరుకునేదాకనే దూరం
దగ్గరైనాక ఆవలికి జరగడం
కళ్ళపై చేయడ్డుపెట్టి వెతుకుతుంటాం ఇంకో గమ్యం కోసం.