31, డిసెంబర్ 2018, సోమవారం

కబుర్ల ఊటబావి

కాలక్షేపం కబుర్లు .. ఈ మాట వినగానే బ్లాగర్లందరికీ కష్టేఫలే  శర్మ గారు గుర్తుకువస్తారు. వారి బ్లాగ్ ని 13 భాగాలుగా  ఈ -బుక్ రూపంలో మనముందుకు  తీసుకువచ్చారు. అందులో  ''గఱికెల మాన్యం" అనే భాగానికి నేను స్పందన వ్రాయడం జరిగింది. ముందుమాట అని ఘనమైన మాటను నేను వాడదల్చుకోలేదు. ఆ స్పందన మీతో పంచుకుని .. కినిగె లో ఉన్న ఆ ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తూ .. శర్మగారికి నమస్సులతో ..  


''గఱికెల మాన్యం" ఈ బుక్ ఈ లింక్ లో లభ్యం.


కబుర్ల ఊటబావి 


వేదాలను  కావ్యాలను ఇతిహాసాలను ఔపాసన పట్టి లోకజ్ఞానం సముపార్జించిన   యోగి కూడా జ్ఞానాన్ని శిష్యుల రూపంలో పరంపరగా అందిందించి  లోకం నుండి  నిష్క్రమించినట్లే శతాయుష్షు చేరుకొని జీవితాన్ని విస్తారంగా  చవిచూచిన వృద్ధులైననూ జ్ఞాన ఛాయలు వొదిలి వెళ్లాల్సి వుంది.  ఆ జ్ఞానఛాయలు  భావితరాలకు చుక్కానిలా దారి చూపుతుంటాయి. మన సంస్కృతిలోనే  వొక   నిరంతర ధార వుంది. అది పెద్దలమాట చద్దిమూట లాంటిది. అలాంటి మంచి పనిని శర్మ గారు  "గఱికెల మాన్యం" రూపంలో చేస్తున్నందుకు సంతోషంగా వుంది.


మనుషులు ఏళ్ళు గడిచే కొద్దీ తోటి మనుషులకు దూరంగా స్వంత  కాలక్షేపానికి దగ్గరగా లేకపోతే ఏకాంతంగా వొక యోగిలా జీవించడం నేర్చుకోవాలి. ఇతరులనుండి ఏమీ ఆశించకుండా వాళ్ళ ప్రవర్తన వలన క్షణ కాలమైనా మనసు కలుక్కుమనకుండా ఇతరులు మనని అర్ధం చేసుకోవడంలేదు అని అనుకోకుండా వాళ్లనే మనము అర్ధం చేసుకుంటూ వీలైనంత దూరంగా జరుగుతూ అంతర్ముఖులై జీవించడం ప్రకృతికి దగ్గరగా జీవించడం ఉత్తమం.శర్మ గారి జీవన విధానం చూస్తే నాకలాగే అనిపించింది. అలాంటి ఉత్తమమైన జీవన విధానంతో  జీవిస్తూ  వారి అనుభవాలను జ్ఞాపకాలను  మనందరికీ  చెప్పిన బ్లాగ్  కాలక్షేపం కబుర్లు ఈ బుక్ గా రావడం సంతోషకరం. ఈ పుస్తకానికి నన్ను ముందు మాట వ్రాయమని అడగడం నా భాగ్యంగా భావించాను. నిజానికి నాకంత అర్హత లేదు. వ్యక్తిగతంగా పార్వతీ పరమేశ్వరుల లాంటి దంపతులను వారింటికి వెళ్లి కలుసుకోవడం వారి ఆతిధ్యం ఆదరణ నా మనసులో చాలా విలువైనవిగా మిగిలి వున్నాయి. వారి కుటుంబం పట్ల ఉన్న ఆత్మీయతపరంగానూ  వారి బ్లాగ్ ని యెక్కువ చదవడం మూలంగా  నాకు ఈ అవకాశం లభించినందుకు ధన్యురాలిని. 


మొదటిసారిగా శర్మ గారి బ్లాగ్ చదివినప్పుడు చాలా ఆసక్తితో ఒకరోజంతా చదువుకుంటూ వెళ్ళిపోయాను . నిషేదంలో ఉన్న అనేకానేక విషయాలను వస్తువులను యథేచ్ఛగా వాడేస్తున్నాం జరపకూడనివి నిరభ్యంతరంగా   జరిపేస్తున్నాం . ఈ బ్లాగ్ చదవకూడదు అనే నిషేధం పెడితే బాగుండును. మరింత చదివేస్తారు అనుకునేదాన్ని.  


ఇక ఈ గఱికెల మాన్యం గురించి నా స్పందన 


మనకు ప్రపంచ జ్ఞానమైతే వుంది కానీ సంప్రదాయ జ్ఞానం లేదు. సంప్రదాయం మారుతూనే వుంటుంది. మార్పులకు అనుగుణంగా మనం మారలేక మళ్ళీ గతం వైపు మళ్ళి చూస్తాం . అలాంటపుడు మనకు గత కాలపు మనుషులు మౌఖిక రూపంలో లభించనపుడు లిఖితరూపంలో లభ్యమవుతున్న వాటిపై ఆధారపడతాం. సాంప్రదాయపు అట్టడుగు పొరల్లోకి వెళ్లి చూసే తీరిక ఎవరికీ వుందిపుడు?  అదిగో అలాంటప్పుడే ఈ గఱికెల మాన్యం పెద్దమ్మలా ఆదుకుంటుంది. 

     

ఒక పుస్తకం చదివినా  ఒక ప్రసంగం విన్నా ఒక సినిమా చూసినా మనకేమి కావాలో అదే తీసుకుంటాం. ఈ పుస్తకం మొత్తాన్ని తీసుకోగల్గడం ఒక భాగ్యంగా భావించాలి మనమందరం.   ఎన్నెనో తెలుగు పదాలు ఏది సంస్కృతంమో  ఏది తెలుగు పదమో వివరించే క్రమాలు ఆ నుండి ఱ వరకూ ,సామెతలు,ఛలోక్తులు,నానుడి అన్నీ మిళితమై ఉంటాయి. కథలు, మళ్ళీ అందులో ఉప కథలు, అనుభవాలు. గారెలకు చిల్లు యెందుకు, తోడికోడళ్ళు దెప్పుకున్నట్లు  నాయకులు దెప్పుకోవడాలు ప్రపంచ రాజకీయాలు, సమకాలీన సమస్యలు ఆసక్తికరమైన  విషయాలు అన్నీ ఉంటాయి.. సూక్ష్మంగా సలహాలు కూడా  లభిస్తాయి చదువుతుంటే కాలం తెలియదు. చదివి కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు మన అనుభవంలో  మనకి తెలుస్తూంటుంది అంతే. 


కాలక్షేపం కబుర్లు చదవడం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. పూర్తిగా చదివి ఆకళింపు చేసుకునేవారికి యిది ఒక ఊట బావి.   పెద్ద పెద్ద గ్రంధాలు చదవలేనివారికి సూక్ష్మంలో మోక్షంలా ఉంటాయి. అమ్మమ్మ అమ్మ చెప్పే కథలు ఉంటాయి. చిటికినవేలు పట్టుకుని నడిపించే తాత ప్రేమ కబుర్లు ఉంటాయి. నాన్న నడుస్తున్న నడక ఉంటుంది.  మొత్తంగా శర్మ గారి  వ్రాతలను వొడపోయడం మాత్రం చాలా కష్టం. ఇది బాగుంది యిది బాగోలేదు అని విభజించడం మరీ కష్టం. వారికి యెంతోమంది అజ్ఞాత అభిమానులు వున్నారు. ఎక్కడో వొకచోట ఆ పెద్దాయన వొకసారి యిలా చెప్పారు అని గుర్తుచేసుకోక మానరు.  ఈ కబుర్లలో అత్యద్భుతమైన జీవన విధానం వుంది. అనుభవాలున్నాయి. సూక్ష్మ రహస్యాలున్నాయి. మొత్తంగా మన తెలుగువారికి ఒక పాఠ్య గ్రంధం యిలా భద్రపరచి వుంది. అతిశయోక్తి  అనుకోవద్దు. పిల్లలకు తెలుగు చదవడం వచ్చిన తర్వాత ఈ బ్లాగ్ పుస్తకం చేతికి అందించగలిగితే చాలు. జీవితంలో  ముఖ్యంగా నేర్చుకోవాల్సినదల్లా చాలా వరకూ లభ్యమైనట్లే.  మొత్తంగా ఈ రాతలు మన శ్రేయస్సును కోరుకునే వెంపటారి దెయ్యం  అని మనవి చేస్తున్నాను. ఒకటే లోటు  ఈ పుస్తకం ముద్రణలో కూడా వుంటే  హాయిగా చదువుకోవడానికి అనువుగా ఉండేదని చాలా సార్లు అనుకున్నాను. ఆ లోటు కూడా తీరుతుందని ఆశిస్తున్నాను 



ఆఖరిగా ఒక మాట. అదీ  శర్మ గారి మాటల్లోనే ..


"మీ నాన్న బహుమతి ఏమీ యివ్వలోదోయ్ అన్నాడట భర్త. మా నాన్న కష్టపడి కని పెంచి  మీకివ్వడమే ఒక బహుమతి. ఇంతకంటే యేమిస్తాడు బహుమతి అందంట భార్య".  

 . 

  శర్మ గారికి అర్ధాంగి కీ శే  శ్రీమతి బాలబాస్కర ఆది  శేషారత్నం గారు అలాంటి బహుమతి.అనిపించింది. అందుకే ఆమెకు  గఱికెల మాన్యం ను జ్ఞాపకార్థముగా ప్రచురించడం జరిగిందని తలుస్తాను.వారిని ఆత్మీయంగా తలుచుకుంటూ ...  "గఱికెల మాన్యం" పై  నా చిరు స్పందన. నాకీ అవకాశం యిచ్చిన శర్మ గారికి ధన్యవాదములు. నమస్సులు. 

                                                                                                                    

                                                                                             వనజ తాతినేని     

                                                                                                 13/11/2018

                                                                                                 విజయవాడ. 

(అట్లాంటా నగరం USA నుండి వ్రాయడమైనది )

20, డిసెంబర్ 2018, గురువారం

విచ్చిన్న సంసారము

అంతః బాహ్య సున్నిత సంఘర్షణల జీవన చిత్రిక రవీంద్రనాథ్ ఠాగూర్  నవలిక "విచ్చిన్న సంసారము" 


ఏ పుస్తకాన్నైనా   చదివిన తర్వాత నా ఆలోచనలను పఠనానుభవాన్ని క్లుప్తంగానైనా వ్రాసుకోవడం నాకలవాటు. ఆ వ్రాసుకోవడమే యింకొంచెం వివరంగా చేస్తే మరీ బావుంటుందని నాకనిపించినప్పుడల్లా ఇలా వ్యాసరూపంలో నిలిచివుంటున్నాయి.  నూట పద్దెనిమిది యేళ్ళ క్రితం (1901) విశ్వకవి నష్టానిర్ (Nastanirh)  బెంగాలీ భాషలోనూ తరువాత వారే ఆంగ్లములోనూ (The broken Nest )  వ్రాసిన నవల యిది.  ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే  నిర్మించిన " చారులత (1964లో) చిత్రానికి మూల కథ యీ నవల. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క రహస్య ప్రేమ కథ అని కూడా అని చెప్పుకున్న కబుర్లను చదివాను. అంత పెద్ద విశేషాన్ని విన్న తర్వాత మనసు ఆగుతుందా చెప్పండి?. చాలా సార్లు ఆ చిత్రాన్ని చూసాను. కొందరి పరిచయాలలో చదివాను కూడా. అయితే బెంగాలీలోనూ ఆంగ్లంలోనూ చదవడం నాకు కష్టం కాబట్టి తెలుగులో వెతుకుతూ వుండేదాన్ని. నా శ్రమ ఫలించి "విచ్చిన సంసారము" పేరిట ఈ నవలను నేను చూడటం తటస్థించింది.  1955 లో  తెలుగులో మొదటి ముద్రణ వచ్చింది.  తెలుగు అనువాదం కారుమూరి వైకుంఠ రావు.వీరు కథాగుచ్చం  అనే పేరిట ఠాగూర్ కథలను నాలుగు సంపుటాలుగా తెలుగులోకి అనువదించారు.    


    భూపతి ధనవంతుల కుటుంబంలో పుట్టాడు అతనికి పని చేయవలసిన అవసరం లేదు. ఇంగ్లీష్ విద్యకూడా అభ్యసించాడు.  చందా కట్టి అనేక పుస్తకాలను తెప్పించుకునేవాడు కానీ యేనాడైనా చదివిన పాపానబోడు.  పత్రికలకు ఇంగ్లీష్ లో ఉత్తరాలు వ్రాయడం వ్యాపకంగా పెట్టుకుంటాడు. ఒక ఇంగ్లీష్ పత్రికను కూడా స్థాపిస్తాడు .  వరుసకు బావమరిది అయ్యే ఉమాపతి  ఇతనిని బాగా ప్రోత్సహిస్తూ ఉంటాడు.ఉమాపతి గతంలో ప్లీడర్ వృత్తి చేస్తూ అందులో నెగ్గలేక భూపతి చెంత చేరి పత్రిక పనిలో పాలుపంచుకుంటాడు  


భూపతి భార్య  చారులత. ఆమెకు ఇంట్లో పని చేయవలసిన పనే లేదు. పుస్తకాలు చదవడం అనే అలవాటువల్ల ఆమెకి సులువుగా కాలక్షేపం జరిగిపోతూ ఉండేది. భార్యకు  మరింత కాలక్షేపం అవుతుందని పల్లె నుండి  ఉమాపతి భార్య మందాకిని ని పిలిపిస్తాడు. మేనత్త కొడుకు అమల్  ని  యింటికి తీసుకొచ్చి ఆశ్రయమిచ్చి చదువుకోవడానికి సహాయం చేస్తూ అతనిని చారులతకు ఇంగ్లీష్ నేర్పించమని పురమాయిస్తాడు. 


 ఒకే వయసు వారైన  చారులత కు అమల్ కి బాగా స్నేహం కుదురుతుంది. చారులత  అమల్ కు పుస్తకాలు కొనుక్కోవడానికి కాలేజీలో మధ్యాహ్నం ఫలహారం చేయడానికి డబ్బులు ఇస్తూ ఉంటుంది. చారులత  అతిశయం లేదు కానీ   అభిమానవంతురాలు. తనకి రానిదేదైననూ రాదనీ వొప్పుకోవడం ఆమెకిష్టం వుండదు. ఆఖరికి వూలుతో మేజోళ్ళు అల్లడం రాదని  చెప్పకుండా బజారులో కొనుక్కోమని చెపుతుంది కానీ కొద్దిరోజులకే మేజోళ్ళను అల్లడం నేర్చుకుని  అల్లి అమల్  కి బహుకరిస్తుంది.మెడకి  చుట్టుకునే పెద్ద పూల  రుమాలును కూడా  అల్లి అతనికి బహుకరిస్తుంది.


చారులత అమల్ కలిసి భవనం వెనుక గల స్థలమును మంచి ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని కమిటీ వేసుకుంటారు.  భూపతికి తెలియకుండా రహస్యంగా ఆ  ఉద్యానవనము నిర్మించి అతనిని ఆశ్చర్య పరచాలని చారులత అభిలాష. ఆ ఉద్యానవనంలో చిన్న సరస్సు అందులో నీలివర్ణ తామర పుష్పాలను పూయించాలని హంసలు పెంచాలని ఆమె కల. ఆమె ఊహలు  అన్ని అబ్బురమైనవి.ఆలోచనలు సున్నితమైనవి. కలలను వాస్తవరూపంలో తీసుకురాగల సహకారం భర్త నుండి ఆమె ఆశించలేదు. అతనెప్పుడూ మిత్రులతో సాహిత్యచర్చలు చేస్తూ పత్రికలకు సంబంధించిన లెక్కలు చూసుకుంటూ భార్యకు కొద్దిగా నైనా  ప్రేమనివ్వాలనే ముఖ్య విషయాన్ని మర్చిపోతుంటాడు.   చారులత అమల్ ఇంటి వెనుక వున్న తోటలో తిరుగుతూ .. పుస్తకాలు చదువుతూ ఆడుతూ పాడుతూ కవిత్వాలు అల్లుకుంటూ వుంటారు. 


అమల్ కూడా చారులత లాగానే ఊహాశక్తి అధికంగా కలవాడు.  దోమ తెరలపై పెన్సిల్ తో లతలు గీసి  దానిని కుట్టుపనితో అందంగా ఉండేటట్లు చేయమని చారులతను అడగడం,  కవిత్వం వ్రాయడం అది చారులత చూసి ఆనందించి మరికొన్ని వ్రాయమని ప్రోత్సహహించడమూ అతను అనేక వ్యాసాలూ వ్రాసి పత్రికలకు పంపడమూ మంచి పేరు రావడమూ జరుగుతుంది. చారులతను కవ్వించి ఆమెలో ఉన్న సృజనాత్మక శక్తులను వెలికిదీయడంతోపాటు తనతో స్నేహానికి  , భావాలు పంచుకోవడానికి పలు విషయాలను  చర్చించడానికి తగిన వ్యక్తిగా భావిస్తాడు పైగా భూపతి చేసే సహాయమే కాకుండా   ఆమె వల్ల కూడా అధిక సహాయం పొందుతూ ఉంటాడు. కానీ ఆటకాయితనంగా చారులతను ఉడికించాలని చూస్తూ  మందాకినికి  తన రచనలు చదివి వినిపిస్తూ చారులతలో అసూయకు తెరదీస్తాడు  .


సమవయస్కుడైన అతని ఆకర్షణలో మోహంలో పడిన చారులత  అతను నామమాత్రంగా నైనా  ఇంకొక స్త్రీ కి ప్రాధాన్యం ఇవ్వడం భరించలేక  అపవాదులు వేయడానికి కూడా సిద్ధపడుతుంది.  మందాకిని  పై అక్కసుతో  ఆమెలో  వివేకం  ఆత్మహత్య చేసుకుంటుంది. అమల్ అప్పుడు గ్రహిస్తాడు. చారులతకు నచ్చనప్పుడు తానైనా అలాగే ఇంటి నుండి గెంటివేయబడటం జరుగుతుందని.కానీ మందాకినీ  భర్త ఉమాపతి భూపతిని మోసం చేస్తూ మిగుల్చుకున్న మొత్తాన్ని అక్కడినుండి దాటేయడానికే మందాకినీ వెళ్ళిపోతుందని తర్వాత అర్ధమవుతుంది.  అమల్ కి పెళ్ళిసంబంధాలు చూడమని   భర్తకి సూచిస్తుంది. చూసుంటే ..మీరు చూస్తే సరిపోతుందా నేను చూడొద్దా అని గొడవపెడుతుంది.  తీరా మంచి కుటుంబం అతనిని అల్లుడిగా చేసుకోవడానికి  అతనిని విదేశాలకు పంపడానికి  అంగీకరించే సరికి మళ్ళీ అంతలోనే తేరుకుని అతను  ఆమెకు దూరమవుతున్నట్లు గ్రహించి దుఃఖపడుతుంది. 

   

అమల్  వివాహం చేసుకుని విదేశాలకి వెళ్ళిపోయాక చారులత లోలోపల చాలా దుఃఖపడుతుంది. ఆమె దుఃఖాన్ని గుర్తించే స్థితిలో కూడా భూపతి వుండదు. బావమరిది చేసిన మోసాల వల్ల  అప్పులధికమై పత్రికను మూసివేసే పరిస్థితి వస్తుంది. అంతటి కష్టంలో ఉన్న తనకు సాంత్వన కల్గించే శక్తి భార్య దగ్గరే లభిస్తుందని తెలుసుకుని వడి వడిగా భార్య గదికి వస్తాడు వేళకాని వేళలో. అతను వచ్చేటప్పటికి ఏదో వ్రాసుకుంటున్న చారులత అప్రయత్నంగా ఆ పుస్తకాన్ని దాచేస్తుంది. నా భార్యకి  కూడా నాకు తెలియని రహస్యాలు వున్నాయా ఆమె కూడా నన్ను మోసగిస్తుందా అని తలపోస్తాడు. చారులత అమల్ గురించిన ఆలోచనలు ప్రక్కకు నెట్టి భర్త కిష్టమైన వంటలు చేస్తుంది.శ్రద్దగా అలంకరించుకుంటుంది. కానీ భార్యాభర్తలిరువురు ఎవరి ఆలోచనల్లో వారుండి స్తబ్దతను చేదించి  మనసులని కలబోసుకోలేకపోతారు.  


విదేశాలకి వెళ్లిన అమల్  తనకొక ఉత్తరమైనా వ్రాస్తాడని యెదురుచూస్తుంది. అమల్ ఏమైనా ఉత్తరం వ్రాశాడా అని పదే పదే అడుగుతూ ఉంటుంది.   అతని క్షేమ సమాచారం కొరకు ఆత్రుత పడుతుంది. అమల్ పదే పదే ఉత్తరం పంపడం కూడా ఖర్చుతో కూడిన పని కాబట్టి అంత కంగారు అవసరం లేదని భూపతి ఆ విషయాన్ని తేలికగా తీసుకోమని చెపుతుంటాడు. చారులత తన నగని రహస్యంగా అమ్మి ఆ డబ్బుతో అమల్ కి తంతి పంపుతుంది. తిరుగు తంతికి కూడా డబ్బు కట్టి పంపుతుంది. తిరిగి తంతి వచ్చే రోజుకి  భూపతిని  వూరికి వెళ్లి తన చెల్లిని చూసి రమ్మని పంపుతుంది. అయితే  ఆ తంతి నేరుగా భూపతి చేతుల్లో పడటమూ ఎక్కడో అతనిలో లీలామాత్రంగా ఉన్న అనుమానానికి తోడు రుజువు లభించడంతో భూపతి భార్యని అసహ్యించుకుంటాడు.ఆమెని శిక్షించనూలేక  క్షమించలేక మానసికంగా కృంగిపోతాడు.  దేశానికి మరో వైపునున్న బెంగళూరు నగరంలో వున్న వొక  పత్రికకు పని చేయడానికి ఒంటరిగా వెళ్లాలని నిశ్చయించుకుని చారులతకు చెప్పినప్పుడు ఆమె "మరి నేనూ" అని అడుగుతుంది.  అంతలోనే అతను భార్యపై జాలిపడి ప్రయాణానికి సిద్దమవమని అంటాడు. అతని అంతరంగం అర్ధమై ఆభిజాత్యంతో  ఆమె వద్దు అవసరం లేదు అంటుంది. ఇదీ కథ.  చారులతకు అమల్ రూపంలో  ఎదురైన ఆకర్షణ భర్త  ప్రేమరాహిత్యం, భూపతి మనః సంఘర్షణ, అమల్ కుర్రతనపు ఆలోచనలు,బ్రతకనేర్చిన తనమూ అన్నీ కళ్ళకు కట్టినట్లు ఉంటాయి. మానవుల సహజ బలహీనతలు  కలలు ప్రపంచమూ అన్నీ సహజంగా చిత్రికపట్టారు.  


ఈ నవల చదువుతున్నప్పుడూ తర్వాతా నాకు కల్గిన ఆలోచనలు 

బెంగాలీ కుటుంబాలంటేనే సంగీత సాహిత్యాలకు నెలవు.వారు మనకన్నా ఎంతోముందు ఉన్నారనేది నిజం. అందుకే ఇంత అందమైన రచన ఆలోచింపదగిన  సాంఘిక నవల అక్కడ రావడం తటస్థించింది. మనకు అలాంటి తెలుగు నవలలు యేమైనా వున్నాయా అని చదివినవాటిని గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేసాను కానీ నాకు అంత స్ఫురించలేదు కూడా. ప్రస్తుత కాలానికి ముడిపెట్టి ఈ నవలను వ్యాఖ్యానించడం సబబు కాకపోయినప్పటికినీ వ్యాఖ్యానించక తప్పడం లేదు. ఎవరి అభిరుచులు ఎవరి ఆసక్తులు వారివైపోయి పాలునీళ్ళు లా కలిసిపోవాల్సిన భార్యాభర్తల బంధాలు మొక్కుబడిగా మారడం వెనుక ఇదిగో ఇలాంటి కారణాలే ఉంటున్నాయి. పర స్త్రీ పురుష ఆకర్షణలు మొదలై  సంసార విచ్చిన్నానికి దారితీస్తున్నాయి.  పూలను సృష్టించినవాడే తుమ్మెదలను సృష్టించాడు కానీ  గొడ్డలిని సృష్టించలేదు. ఆ గొడ్డలిని మనమే సృష్టించుకుంటున్నాం కదా.  సంసారం విచ్చిన్నమైనదని భూపతికి  చదివిన పాఠకులకు తోస్తుందేమో కానీ నేను బాగా గమనించిన విషయం యేమిటంటే  చారులత దృష్టిలో అమల్ తో ఆమె కట్టుకోవాలనుకున్న కలల  గూడు రూపంలోకి మారకుండానే అవిసిపోవడం విషాదం అవుతూనే సంసారమనే గూడు కూడా  విచ్చిన్నమవుతుంది. 


వంద పేజీలకు పైన వున్న యీ నవల ప్రతీకారం అనే పెద్దకథతో కలిసి మొత్తం 144 పేజీలవరకు  వరకూ ఉంది. ఈ నవల  ధనవంతులైన బెంగాలీ బాబుల భద్రలోక అంతఃపుర స్త్రీల చపల చిత్తాన్ని,ప్రేమరాహిత్యాన్ని బట్టబయలు చేసింది. సత్యజిత్ రే   సినిమాటిక్ ముగింపు స్పష్టతనివ్వదు. ఒక ఆశావాదంతో కథ ముగుస్తుంది. కానీ ఈ నవల నిరాశ మధ్య కొనసాగుతూ ఉంటుంది.  ఠాగూర్ తన నలభయ్యోయేట వ్రాసిన పుస్తకం ఆయన మరణించిన తర్వాత పద్నాలుగేండ్లకి మన తెలుగులో అనువాదం అయిన నవల.


చారులత కు స్వంత ఖర్చుల కోసం కొంత ధనము ఇవ్వడం అని ఉదహరిస్తారు ఒకచోట. రచనలలో ఠాగూర్ లో అభ్యుదయ కోణాన్ని ఇక్కడ గమనించవచ్చు. అప్పటి బెంగాలీ ధనవంతుల కుటుంబంలో అలా ఉండేదో లేక ఠాగూర్ స్త్రీకి స్వంత ఖర్చుల కోసం ధనం ఇవ్వడం అవసరమని భావించాడో కానీ.. ఆ ప్రస్తావన బాగుంటుంది. 


చారులత మానసిక కల్లోలమూ, ప్రేమైక హృదయం,వివాహిత స్త్రీగా ఆమె వివేకమూ మొత్తంగా చూస్తే  ఆమెపై పాఠకునికి కొంత జాలి మరికొంత విచారమూ కల్గుతుంది.భూపతి అలా ఉండకుండా ఉంటె బాగుండేది అనుకుంటాం తప్ప ఆ పాత్రపైన కోపమూ వుండదు. ఏ ఒక్క పాత్రపైనా విముఖత లేదా  ప్రేమ కలగని నిశ్చల హృదయంతో పుస్తకము మూసేసి నిరామయంగా ఉండిపోతాము. అనుభూతికి అందని దృశ్యాన్ని యెంత వర్ణించినప్పటికినూ అనుభవానికి రాని రుచిని ఆస్వాదించినట్లే వుంటుంది కాబట్టి యింకా యెక్కువ చెప్పకుండా ముగిస్తాను.     


పనిలేనివాడు పొట్టు తీయకుండా పల్లీలు తిన్నట్టు అసలు సిసలు రచన చదవాలంటే The Broken Nest  ఆంగ్ల నవలను చదువుకోవడమూ, అబ్బా చదివే ఓపిక యెక్కడుందిలే అనుకుంటే Charulatha  ఇంగ్లీష్ సంభాషణలతో వున్న నలుపుతెలుపుల సత్యజిత్ రే చిత్రాన్ని,   కాస్త ఆకర్షణీయంగా వుండాలనుకుంటే రంగుల చిత్రాన్ని చూడటమూ చేయవచ్చును. తెలుగులో చదవాలనుకుంటే pdf లో చదువుకోవచ్చు.     


https://www.youtube.com/watch?v=SVuZLVrPq98 చారులత ఇంగ్లీష్ సంభాషణలతో ఉన్న చిత్రం ఇక్కడ అందుబాటులో ఉంది.

The  Broken Nest అనురాగ్ బసు భార్య Tani Basu ఈ చిత్రాన్ని మరొకసారి నిర్మించారు The Epic Channel లో అందుబాటులో ఉంది 


మరొక నవలను పరిచయం చేస్తూ మరొకసారి... 


విచ్చిన్న సంసారం _ రవీంద్రనాథ్ ఠాగూర్ 

19, డిసెంబర్ 2018, బుధవారం

మట్టి మనుషులు

ఈ మధ్య ఫేస్ బుక్ పై విరక్తి చెందిన నేను డార్క్ నాలెడ్జ్ ని (అవసరంలేని విషయ జ్ఞానం) వదిలించుకునే క్రమంలో మూడు నవలలు చదివాను అందులో వొకటి మట్టి మనుషులు. ఆ నవలని చదివిన తర్వాత నా స్పందన వ్రాయకుండా వుండలేకపోయాను. అలాగే పంచకుండా కూడా వుండలేక ఈ నవలా పరిచయం.
సాహిత్యం యేమి చేస్తుందంటే కుసంస్కారంతో మూసుకున్న కళ్ళను తెరిపిస్తుంటుంది. మనలో నెలకొన్న బేషజాలను రూపుమాపడానికి తోటి మనిషిని అర్ధం చేసుకోవడానికి అన్నింటికన్నా ముఖ్యంగా మన ఉరుకుల బెరుకుల ప్రయాణాన్ని ఆపి కాస్త మనలోకి మనం తొంగిచూసుకోవడానికి లోకాన్ని మరింత అర్ధం చేసుకునే ప్రయత్నంలో ఊతగానూ వుంటుంది. మనిషిని మనీషిగా మార్చకపోయినా మనిషిగా మిగిల్చే సంస్కారాన్ని నేర్పుతుంది.
నేను ఈమధ్య వ్రాసుకున్న నా ఆలోచన అదే విధమైన అర్ధం స్ఫురించేలా వొక వాక్యమూ అక్కడ నాకు కనబడటం యాదృచ్చికమే అయినా నేను కొంత వుద్వేగానికి గురైనమాట వాస్తవం. ఆ వుద్వేగమే ఆ నవలను కంప్యూటర్ తెరపై ఏకబిగిన చదివే వూపునిచ్చింది.
ఈ మట్టి మనుషులు నవల మనుషుల గురించి వ్రాసినది అయినా మనుషుల కోసమే వ్రాసినది అని ఆనంద కౌసల్యాయన పుస్తకం గురించి చెప్పిన రెండు మాటల్లో అన్నారు. కాళిందీ చరణ పాణి గ్రాహీ వ్రాసిన మొట్టమొదట రచన యిది. తెలుగులో ప్రధమ ముద్రణ మార్చి 1958 అయితే అంతకు ముందు పాతికేళ్ల ముందే యీ నవల పుట్టింది. ఈ నవల రచయిత మొట్టమొదటి రచన కూడా.
పూరీ జిల్లాలో డెలాంగా గ్రామంలో ఒక రైతు కుటుంబానికి చెందిన యిద్దరన్నదమ్ముల కథ యిది. ప్రముఖ ముద్రణా సంస్థ ఆనందలహరి గ్రంధాలలో మొట్టమొదట గ్రంధం యిది. గ్రంధం అంటున్నానని గ్రాంథికంలో ఈ నవల ఉంటుందని అనుకోవద్దు. ఒరియా తెలుగు రెండు భాషలు రెండు కన్నులుగా భావించే పురిపండా అప్పలస్వామి గారు ఒడియా నుండి తెలుగులోకి అనువదించారు. అనువాదకాలం కేవలం రెండు మాసాలు అని ముందుమాటలో చదివి ఆశ్చర్యం వేసింది. ఈ నవలా రచయిత ముఖమైనా చూడకుండా నవలను చదివి అనువాదం కోసం అనుమతి తీసుకోవడానికి వేరొక రచయిత ద్వారా కాళింది చరణ పాణిగ్రాహి తో పరిచయం పెంచుకున్నారని రచయిత చెప్పుకున్నారు. ఈ పుస్తకం వెలువడగానే దీనికి నాటక రూపమూ కావ్య రూపముగా కూడా మారిందంటే పాఠక లోకంపై సమకాలీనులైన రచయితలపై యెంతటి గాఢముద్ర వేసిందో అర్ధం చేసుకోవచ్చు.
గ్రామ జీవనంలో ఆదర్శవాదాన్ని మూలవస్తువుగా తీసుకుని యీ నవల జీవం పోసుకుంది అనేకంటే రచనాకాలం నాటి భారతీయ గ్రామ స్వభావాన్ని, ఎవరి వృత్తి వారు చేసుకుంటూ కులమత ధనిక పేదా తేడాలు లేని ఆదర్శ జీవనాన్ని గ్రామస్తుల కల్మషం లేని మనసులను భోళాతనాన్ని మనకు పరిచయం చేస్తుంది. వృత్తిరీత్యా యెవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే అందరి పొయ్యిలోకి వెళ్ళే కట్టెల మోపు వోలె కలిసి ఉండేవారు. వారిలో ఒకరే భిన్నమైన వాడు. ఆ ఊరి మోతుబరి హరిమిశ్రా.
గ్రామస్తులను అర్ధం చేసుకోవాలనే మనకు కూడా గ్రామీణ నేపధ్యం వుండివుండాలి లేదా సహృదయత యెక్కువన్నా ఉండాలి. నాగరీకులకు అల్పంగా మూడాచారాలుగా అనిపించే విషయాలలో గ్రామీణులు బహు సున్నితంగా చూస్తారు లేదా బలీయమైన విశ్వాసంగానూ పరిగణిస్తారు. ఆఊరి గ్రామదేవత మంగళా అమ్మవారు. గ్రామస్తులందరికీ ఆమెను అండ దండ గా భావిస్తారు. పధానపడ గ్రామంలో శామపదాను యిల్లంటే ధర్మానికి నిలయం. ఎన్ని తరాలుగా ఆ యిల్లు కూలి పోయినా ధర్మాన్ని మాత్రం కూలిపోనివ్వని ఆ యిల్లంటే గ్రామస్తులందరికీ వల్లమాలిన అభిమానం. గ్రామమస్తుల మధ్య చిన్నచిన్న తగాదా మొదలుకుని పెద్ద పెద్ద విషయాల దాకా శామపదాను మధ్యవర్తిత్వం ఆ వూరిని నిలబెడుతూ ఉండేది.
శామపదాను ఇలా అంటూ ఉండేవాడు. ఓరే.. మనమేమో దరిద్రులం. చిన్న చిన్న దొంగలం. సొరకాయ మీద గుమ్మడికాయ మీద మనం కన్ను వేస్తాం. ఆ ప్రెసిడెంట్ జమిందారూ షావుకారూ వీళ్ళు దొంగలు కాదు దోపిడీ గాళ్ళు. పట్టపగలు దబాయించే గదమాయించే కేసులు కోర్టులూ అని బెదిరించి మనల్ని బికారులని చేస్తారు మనుషులను తినే మొసళ్ళు వీళ్ళు.. పులులను మొసళ్ళను కోర్టులు ఏమీ చేయలేవు న్యాయమేమీ చేయలేదు అని.
శామపదానుకి ఇద్దరు కొడుకులు బరజు, చకడీ. బరజు కొద్దిగా చదువుకుని వుద్యోగం చేస్తూ ఉంటాడు. చకడి ఆ మాత్రం చదువు కూడా లేకుండా జులాయిగా తిరుగుతూ కాలక్షేపం కోసం దగ్గరలోనే ఉన్న పట్టణానినికి వెళ్లి తిరిగొస్తూ ఉండేవాడు. బరజుకి తమ్ముడికి పదేళ్లు తేడా. బరజు పెళ్ళై నలుగురు పిల్లలు కల్గిన తర్వాత ఛకడికి పెళ్ళవుతుంది. చిన్న కోడలు కాస్త ఉన్నత కుటుంబం నుంచి నగ నట్రా సారె చీరలతో ఘనంగా అత్తగారింటికి రావడం వల్ల అహంభావము నోటి దురుసు యెక్కువ. అలాంటి కోడలితో మాటామంచి లేకపోతే ఇంకా అహంకారం యెక్కువగా ఉంటుందనే ఆలోచనతో శామాపధాను భార్య ఆమెపై ప్రేమ కురిపించేది. అది అలుసుగా తీసుకుని ఆమె తోటి కోడలుపై దురుసుగా వ్యవహరించేది. శామపధాను భార్య చనిపోతుంది. ఆ దిగులుతో శామపధాను కూడా దిగులుతో మంచం పడతాడు. భూమి ఉన్న రైతు వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగించాలి కానీ వుద్యోగం చేయడం మన వంశ ధర్మం కాదని బరజుకి భోదిస్తాడు శామపధాను.తండ్రి కోరికను అర్ధం చేసుకుని చేస్తున్న అమీను వుద్యోగం మానుకుని వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉంటాడు బరజు. శామపధాను కూడా మరణానికి చేరువవుతూ ఉంటాడు. మీ యిద్దరన్నదమ్ములు విడిపోకూడదు. పొలం మధ్య గట్టు పడకూడదు.కొంప మధ్య గోడ లేవకూడదు. ఇది మాత్రం నువ్వు చేయాలి అని బరజు దగ్గర మాట తీసుకుంటాడు. తల్లి మాటలు విని మాకోసం యేమి దాచి పెట్టావ్ తాతా అని అడుగుతారు పిల్లలు. శామపధాను వేలెత్తి పైకి చూపిస్తూ మీ కోసం ధర్మం ధర్మం దాచిపెట్టాను అంటూ కన్ను మూస్తాడు.
హరిమిశ్రా ఆ ఊరి పంచాయితీ ప్రెసిడెంట్. ఎవరికి అప్పునిచ్చి వారికి ఉన్న చెక్కా ముక్కా మడి ని కూడా తన దాంట్లో కలిపేసుకోవాలని చూస్తూ ఉండే వ్యక్తి. శామపదాను వుండగా ఆ గ్రామంలో అతని ఆటలు సాగవు. ఇప్పుడు తండ్రి స్థానంలో తండ్రి కన్నా యెక్కువగా బరజు ఆ ఊరి వారందరికీ ప్రియపాత్రుడు అయ్యాడు. ఊరి జనంలోకన్నా ఇంట్లోనే చిచ్చులు పెట్టి అన్నదమ్మలని విడదీయాలని పన్నాగాలు పన్నుతాడు.
ఇక పెద్దదిక్కులేని యింట్లో తోడికోడళ్ళిద్దరూ తమలపాకుతో నేనొకటి అంటే తలుపు చెక్కతో నేను రెండు అంటా అనుకునే బాపతు. రోజూ ఒకరిమీద ఒకరు భర్తలకు పితూరీలు చెప్పుకునే వారు. చిన్న కోడలు.. ఆమెకు నలుగురు పిల్లలున్నారు నాకేమన్నా పిల్లా జెల్లా నేనెందుకు యెక్కువ పని జేయాలి అంటూ నిత్యం గొడవపడేది. ఆ గొడవుల మధ్యే కొన్నేళ్ళు గడిచిపోతాయి. ఛకడీ పనులు చేసేవాడు కాదు. పైగా భార్య మాటలు విని అన్నని వదినని మాటలు అంటూ వుండేవాడు. బరజు భార్యనే కోప్పడి,ఆమె వినక పోతే మౌనంగా మాటాడకుండా శిక్షించి తమ్ముడితో అతని భార్యతో గొడవలు పడకుండా సర్దుకుపోయేటట్లుగాను ఆమె వారిని ప్రేమించే రీతిలో భార్యలో మార్పు తీసుకువస్తాడు. ఉమ్మడి కుటుంబంలోనే పిల్లలకి పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. మనకి రావాల్సిన సొమ్ముకి లెక్కా పత్రం లేదు అంటూ చకడి చెవిలో పోరుతో ఉండేది అతని భార్య. తండ్రి మాటను మనసులో ఉంచుకుని అన్నదమ్ములు విడిపోకుండా వుండటానికి చాలా చేసాడు బరజు. అయిననూ ఆ అగ్గి ఆరలేదు. కోతకు వచ్చిన పంటను వండిన బెల్లాన్ని తీసుకుని బజారులో అమ్ముకుంటాడు. అయిననూ బరజు తమ్ముడిని ఏమీ అనడు.
అప్పట్లోనే వూర్లో పేదవాళ్ళపై జులుం చూపి అన్యాయంగా దండిస్తాడు హరిమిశ్రా. ఊరందరూ బరజు మాటలతో ఏకం అవుతారు. కలిసికట్టుగా అన్యాయాన్ని యెదుర్కోవాలని మాట చేసుకుంటారు. ఓటమిని సహించలేక హరిమిశ్రా మరింత కక్ష పెంచుకుంటాడు. అతని చెప్పుడు మాటలు విని వెనుకనుండి భార్య రెచ్చగొడుతూ వుండటమూ వల్ల యెట్టకేలకు మొహమాటాన్నివీడి గొంతు పెద్దది చేసి అసలు విషయాన్ని వెల్లడిస్తాడు చకడి. పిల్లల పెళ్ళికి అయిన ఖర్చు వివరాలు ఆ లెక్క చెపుతూ నాకు సగభాగాన్ని పంచి ఇవ్వమని అడుగుతాడు. బరజు యేమీ మాట్లాడకుండా సమస్తం తమ్ముడికి వొదిలేసి చిన్ని బట్టల మూటతో భార్యా పిల్లలతో కలిసి వూరు విడిచి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళే దృశ్యాన్ని రామాయణ కావ్యంలో శ్రీరామచంద్రుడు తండ్రిమాట అనుసరించి కానలకేగుతున్నప్పుడు విలపించినట్లు వూరు వూరంతా బరజును అనుసరిస్తూ అతనికి వెళ్ళవద్దని ప్రాదేయపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఆఖరికి ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటే మట్టి మనుషులు నవల చదవాల్సిందే. ముఖ్యంగా రచనా దర్పణంలో కొండంత వాస్తవాన్ని కొంచెంగా మాత్రమే చూపగలం. ఊహలకి అందని మనిషితనం యెప్పటికప్పుడు సంస్కరింపబడుతూ వుండటం వల్ల నిజజీవితంలో దానిని చివరికంటా చూడగలం. మంచి సాహిత్యం ఆ మార్గంలో మనిషిని నడిపిస్తుంది.
పిల్లల కోసం ముందు తరాల వారు స్దిర చరాస్తులు వస్తువాహనాలు కాదు సంపాదించాల్సింది.. ధర్మం అని .. ఆ ధర్మమే మానవుని మనుగడకు సాక్షీభూతమై నిలుస్తుందని.. తమ పూర్వీకులు అదే పని చేసారని తనూ అదే పని చేసానని శామపధాను కొడుకుకి చెబుతూ .. అదే ధర్మాన్ని ఆచరింపమని కొడుకు బరజు ఛకడి లకు చెబుతాడు. నవలలోపాత్రల ద్వారా పలికించడం ఆచరింపజేయడమూ చేత ఆ రచయిత ధృక్ఫదం యేమిటన్నది సృష్టంగా తెలిసిపోతుంది. ఈ నవలలో నాకు బాగా నచ్చిన విషయం యిది.
ఇల్లు వొదిలిన కాలంలోనూ తమ్మునికి సమస్తం వొదిలేసి గమ్యం లేని ప్రయాణం చేస్తున్న ఆ రోజున కూడా పాండవులు అందరూ ఇలా అన్ని వదిలి అడవుల వెంట తిరగలేదా రామచంద్రుడు సీతతో కలిసి వనవాసం చేయలేదా.. అదీ ధర్మానికి కట్టుబడే కదా.. వారి బాటలోనే నేనూ అని అనుకుంటాడు బరజు.
పురిపండా అప్పలస్వామి గారి చక్కని బాషా సౌందర్యం ఆ అనువాదంలో నిండుకుని ఉంది. అక్కడక్కడా ఒడియా పదాలు ఉన్నప్పటికీ కింద ఫుట్ నోట్స్ ఇవ్వడం వల్ల చదవడానికి ఇబ్బంది లేకుండా హాయిగా వుంది. భారతీయ గ్రామీణ జీవనం తాలూకు ఆత్మ ఈ నవలలో ప్రతిబింబించింది. పాఠకుడు నవలాకాలంలోకి వెళ్ళి ఆ విరూపానదీ తీరంలో మంగళా అమ్మవారి సాక్షిగా ఆ పచ్చని చేలలో తిరుగుతూ కాయకష్టం చేసుకునే ఆ గ్రామీణుల అమాయకత్వంతో అమాయకంగా చైతన్యంలో చైతన్యంగా బరజు వెంట సహప్రయాణం చేస్తూ వుంటాం. ఈ నవలలో అంతగా లీనమై పోవడానికి కారణం మాత్రం నాదీ గ్రామీణ వ్యవసాయ నేపధ్యం కావడం వలెనే అనుకుంటున్నాను. ఉమ్మడి కుటుంబాలు లేకపోయినా కనీసం రక్తసంబంధీకుల మధ్యనైనా ఆత్మీయభావన నెలకొని ఉండటానికి చదివిన పాఠకుల మనసుని కాస్త తడి చేయడానికి ఈ నవలా పఠనం దోహదం చేస్తుందని నేను నమ్ముతున్నాను.
మరొక నవలా పరిచయంతో మరొకసారి. నమస్సులతో ..
  

ఇదిగో యీ  లింక్ లో యీ నవలను చదవచ్చు.  మట్టి మనుషులు -పురిపండా అప్పలస్వామి

  
   

13, డిసెంబర్ 2018, గురువారం

రెక్కల గుఱ్ఱం




(ఈ చిత్రం అట్లాంటా బొటానికల్ గార్డెన్ లో తీసినది) 

చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలవుంటాయని నమ్మడానికి ఎంతో బాగుంది... ఇదిగో యీ చిత్రం చూడగానే యిలాగే పాడుకున్నాను. చందమామ కథలను గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ... ఫోటో తీసుకోవాలని ముచ్చట పడ్డాను. నా కన్నా ముందు యింకొందరు చిత్రాలు తీసుకుంటే వేచి చూస్తూ వరుసలో నిలబడ్డాను. నేను ఫోటో తీస్తుంటే మరికొందరు చిత్రంలో వాళ్ళు కనబడకుండా ఆగి మరీ వేచి చూసారు. 

నా వుత్సాహం చూసి అబ్బాయి అమ్మా ... నువ్వక్కడ నిలబడు,ఆ రెక్కల గుర్రంతో పాటు నిన్నూ ఫోటో తీస్తాను అన్నాడు. నాలుగైదు చిత్రాలు తీసుకున్నాక ముందుకు వస్తుంటే మాకెదురు వస్తున్న శ్వేతజాతీయుడు.. మీ కెమెరాలో తాజ్ మహల్  చిత్రం వుందా... నా కెమెరాలో భద్రంగా ఉంది అన్నారు. మా అబ్బాయి నవ్వుతూ లేదు అన్నాడు. ఆ శ్వేతజాతీయుడి మాటల్లో శ్లేష నాకూ అబ్బాయికి అర్ధమై మళ్ళీ నవ్వుకున్నాము. కాసేపు అతను అక్కడే ఆగి వుంటే మా అబ్బాయితో అతనికి యిలా చెప్పించేదాన్ని.  

ఆ చెప్పించే విషయాన్నే మా అబ్బాయికి చెప్పాను నేను. ఇండియా అంటే తాజ్ మహల్ మాత్రమే కాదు. తాజ్ మహల్ కట్టడం అద్భుతమైనదే కానీ అంతకన్నా అద్భుతమైనవి మా దేశంలో చాలా వున్నాయి.     దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగజీవుల కోసం వెలిగే అమరజవాన్ జ్యోతి ఇండియా గేట్,  సతీష్ ధావన్  స్పేస్ సెంటర్ (ఇస్రో) భాక్రా డామ్, అదే తాజ్ మహల్ ని నిర్మించిన షాజహాన్ చక్రవర్తి నిర్మించిన  ఎర్రకోట పై  ఎగిరే మన జాతీయపతాక రెప రెపలు ఇవే గొప్ప నాకు.

ఇంకా చెప్పాలంటే మా ప్రకాశం బేరేజ్ అమరావతి పోలవరం ప్రాజెక్ట్ గొప్ప అని కూడా చెపుతాను అంటే.. అమ్మా .. అన్నాడు ఇక ఆగమన్నట్లు.  

11, డిసెంబర్ 2018, మంగళవారం

గడ్డిపూవు జ్ఞానం

సెల్ఫ్ ప్రమోషన్ కోసం పొగిడించుకోడం సర్వసాధారణమైన రోజులలో... విని చూసి వెగటుపుట్టినప్పడు పుట్టిన కథ. ఈ..చిన్న కథ.

అనగనగనగా.. ఒక కదంబమాల... అంట. అందులో పద్దెనిమిది పూలంట. ఒకో పువ్వు గురించి మిగతా పదిహేడు పూలు .. గోడెక్కి దారిన పోతున్న అందరికి వినబడేటట్టు అబ్బ.. యేమి రంగు యేమి పరిమళం యెంత సొగసు అని నోరార పొగుడుకుంటూ వున్నాయంట. దారినపోతున్న దానయ్య .. సుందరమైన సుకుమారమైన అద్బుతమైన పూవుల్లారా..మీలో వొకరినొకరు పొగుడుకునే సంబడమాపేసి దండగా మారిన మీరు దండగవకుండా దేవి పూజకు వెళ్ళండి ఆలస్యమవకుండా.. అని చెప్పి వెళ్ళిపోయాడంట.

అసుర సంధ్య వేళ దేవి మెడలో అలంకారంగా మారాలనుకుని గుడికి వెళ్ళింది అంట కదంబమాల. పూజారి దేవి మెడలో కదంబమాల వేశాక ఈ సారి ఒకొరినొకరు పొగడుకోకుండా యెవరిని వారు పొగుడుకుంటూ.. అందుకే నేనంటేనే దేవికి యెక్కువ యిష్టం అని.. చెప్పుకుంటున్న రొద విని .. దేవి కి విసుగొచ్చి ... ఇక ఆపండి మీ స్వీయస్తోత్రం. మీ అందరిని సృష్టించిన నాకు తెలియదా మీ గురించి. మీతో పాటు నేను సృజించిన ఆ గడ్డి పూవును చూడండి .. యెంత వినయంగా నా పాదాల దగ్గర వొదిగి వుందో .. అని అందట.

దేవి : జ్ఞానదేవత

పంకం లేనిదే పద్మం పుట్టదు, కానీ పంకం వాసన పద్మానికి అంటదు. జ్ఞానవంతుడికి ప్రచారం అవసరంలేదని నా భావన. 



10, డిసెంబర్ 2018, సోమవారం

కవి ఉదయం

కవిత్వమంటే 


మనిషీ .. 


కవిత్వమంటే  

మురుగు కాల్వలో 

కొట్టుకుపోయే క్యారీ బేగ్ కాదు  

మహా సముద్రంలో 

తేలియాడుతున్న డంప్ యార్డ్ కాదు 


కాలయోనిలో యెప్పుడే కవి ఉదయిస్తాడో 

పురిటి వాసన కొడుతూ

నలు దిక్కులెపుడు  చెలరేగుతాడో 

అక్షరాలుగా మారినది 

అతని  హృదయ కంపనలేమో 

వాక్యమై తేలినది అనేకుల 

ఆలోచనల ఆజ్యమేమో 

నింపాదిగా చూస్తే కదా తెలిసేది 


చూసేవాడికేమి తెలుసు కాడి బరువు

భుజం మార్చుకుని చూడు  

కుబుసం విడుస్తున్న నాగు నడుగు 

మిలమిలలాడటం ఎంత కష్టమో 


కవిత్వమంటే..

అంధకార అడవిలో  గుడ్డి  వెలుగు 

మనో వేగాశ్వాన్ని అధిరోహించడానికి 

కాలూనే రికాబు 

గుండెని పొడిచే గునపం

మెదడుకు గుచ్చుకునే పల్లేరు తీపు 

పూలకై దోసిలి పట్టిన మనిషికి  

ఆయాచితంగా లభించిన అగ్ని కణిక.   


(గణేష్ దిన పత్రిక ఆదివారం సంచికలో 09/11/2018.)

3, డిసెంబర్ 2018, సోమవారం

జ్ఞాపకాలు

కాఫీ విత్ కవిత్వం కొద్దీ నిమిషాల్లో   

జీవన వనంలో తనదికాని కాలంలో 
ఓ  పూపొద లేదు యెద సొద లేదు 
మధుపం లేదు మధువు లేదు 
మధు పాత్రలు తప్ప 

రెక్కలు విరిగిన తూనీగల్లేనూ 
రంగు రాళ్ళ సీతాకోకచిలకలను చూసి మురుస్తూనూ 
మనసును  నియంత్రించుకుంటూనూ.. 
కుదరకపోతే  జ్ఞాపకాల గుట్టలను తవ్విపోస్తూనో 

ఎంతైనా ఆలోచనలోనే మాధుర్యం ఎక్కువ 
అనుభవంలో కన్నా  
పూలు పరిమళాల్ని మోస్తున్నట్టు 
మనిషి జ్ఞాపకాలు మోయడం సహజాతి సహజం.
జ్ఞాపకాలు 
మనిషిని మొత్తంగా వెచ్చ బెట్టే చలిమంటలు