31, జనవరి 2019, గురువారం

तितलियाँ ढूंढने वाले

నిష్క్రమణం


तितलियाँ ढूंढने वाले వినసొంపైన శీర్షిక. ఈ సౌందర్యమైన శీర్షిక వెనుక అంతులేని విషాదం వుంది. ఆ విషాద కథ హృదయాన్ని తుత్తినియలు చేస్తుంది. ఒక ఉర్దూ కథ కి అనువాదం "నిష్క్రమణం" అనే శీర్షిక  చదివి కొంచెం విచారించాను. ఈ కథ ప్రాంభం నుండి మనల్ని ఊపిరాడనీయదను. ఎవరో గుండెని పిడికిటి బిగించి క్షణానికోసారి నొక్కుతున్నప్పుడు వుండే నొప్పి. చాలా శక్తివంతమైన శిల్పం. 


ఈ కథను వ్రాసింది జహీదా హీనా.. భారతదేశంలో పుట్టి స్వాతంత్య్రం అనంతరం పాకిస్తాన్ కి వెళ్లిన ఆమె కవిగా కథకురాలిగా కాలమిస్ట్ గా ఇంకా మీడియా లో పనిచేస్తూ వున్నా సృజనశీలి. ఆమె వ్రాసిన కథ तितलियाँ ढूंढने वाले   


నార్జిస్ ఆమె భర్త హుసేన్ . మిలటరీ కాలంలో  స్వేచ్ఛగా ఆలోచనలు చేసినందుకే నిర్బంధించి భార్య భర్తలిరువురుని బంధిస్తారు . కొన్నాళ్ళకు హుసేన్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రకటిస్తారు జైలు అధికారులు. నార్జిస్ కి తెలుసు తన భర్త ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని. అప్పుడే ఆమెకు తెలుస్తుంది తాను తల్లి కాబోతుందని. ఆమె బిడ్డకోసం సత్యం కోసం ఆశతో జీవిస్తుంది . ఏదో ఒక నేరం చేసి జైలుకి వచ్చిన చాలామంది ఏ నేరం చేయకుండానే నార్జిస్ ను చూసి గౌరవభావంతో ప్రేమతో మెలుగుతారు. ఆమెకు కొడుకు పుడతాడు ఆ బిడ్డ పేరు మెహదీ తల్లితోపాటు జైలు నాలుగుగోడలమధ్యే పెరుగుతాడు. నార్జిస్ కి అందరూ క్క్షమాభిక్ష కోసం ఆర్జీ పెట్టుమని చెపుతారు . తప్పు చేయని తాను క్షమా భిక్ష పెట్టుకోవడం యిష్టం లేదని ఉరిశిక్ష అయినా చింతించనని చెపుతుంది. మర్నాడు ఉరి తీయబోతున్నారనగా బిడ్డకి ఎప్పటిలాగానే కథలు చెపుతుంది. రేపు ఇక తానూ కనబడనని సీతాకోకచిలుకలు వెతకడానికి వెళుతున్నానని అవి దొరకడం ఆలస్యమవుతుందని బిడ్డకి చెపుతుంది. 


సీతాకోకచిలుకలు స్వేచ్చకీ ప్రతీక. జైలు గోడల మధ్య సీతాకోకచిలుకలని చూడలేని బిడ్డకి వాటిని వెతుకుతూ వెళతానని చెపుతుండటం చదివిన పాఠకులకి  దుఃఖం వువ్వెత్తున్న ముంచుకొస్తుంది. పసిపిల్లవాడి అమాయకత్వం తల్లి ప్రేమ ఎంతో ఉద్దాతంగా చిత్రీకరించిన కథ యిది. రచయిత  స్త్రీ కాబట్టే  అంత సున్నితంగా హృద్యంగా కథను చిత్రీకరించగల్గిందని నాకు ఎన్నోసార్లు అనిపించింది. నేను చదివిన వేల కథల్లో ఇదొక అత్యుత్తమ కథ. బాగా గుర్తుండిపోయే కథ. ఈ కథను చాలా బాగా అనువదించిన షణ్ముఖరావు గారికి అనువాద కథగా పాఠకుల ముందుకు తీసుకువచ్చిన సాక్షి funday సంచిక వారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే! అలాగే జహీదా హీనా  ముందు నేను నిలబడగలిగే అవకాశం వస్తే నా కన్నీళ్లతో ఆమె చేతులను ముద్దాడతాను ఇంత హృద్యమైన కథ అందించినందుకు.  చదవండి పూర్తి కథ .. 


నిష్క్రమణం


నార్జిస్‌ కటకటాల వెనుక నుంచి తల్లిని చూసింది. ఆమె పండిన జుత్తునీ, ధారాపాతంగా కురుస్తున్న కన్నీటినీ చూసింది. ఆమె పక్కనే నిల్చుని ఉన్న సోదరుణ్ణి చూసింది. అతని తల విషాదంతో అవనతమై ఉండటాన్ని చూసింది. అయినా నార్జిస్‌కు అతని ఖిన్న వదనం స్పష్టంగానే కనపడింది.  నార్జిస్‌తో పాటు జైల్లో పెరుగుతున్న ఆమె కొడుకు మెహెదీ అమాయకంగా నవ్వుతున్నాడు. చప్పట్టు కొడుతూ మేనమామ వైపు చాక్లెట్‌ కోసం చెయ్యి చాచాడు. అప్పుడతను వొంచిన తల ఎత్తాడు. కటకటాల లోంచే పిల్లవాడి చేతుల్ని తన చేతిలోకి తీసుకున్నాడు. మామయ్య కన్నీరు మేనల్లుడి చేతిలో పడ్డది. మురికి తుడుస్తున్నట్టు నటిస్తూ ఆ చేతుల్ని తుడిచాడు. ఈ దృశ్యం నార్జిస్‌ జ్ఞాపకాల పెన్నిధిలో ముద్రితమైపోయింది. ఆమెలో ఒక ఉపశమన భావం కలిగింది. ప్రస్తుతం వార్ధక్యంలో ఉన్న తల్లి చనిపోయిన తర్వాత కూడా మెహెదీని చూసుకోవడానికి తన సోదరుడు ఉన్నాడనే భరోసా నార్జిస్‌కు కలిగింది. అతడు ఈ పిల్లవాణ్ణి పెంచగలడు. విద్యాబుద్ధులు చెప్పించగలడు. వాడి జీవితానికి మార్గదర్శి కాగలడు.క్షమాభిక్ష కోసం అర్జీపై సంతకం పెట్టమని ఆమె సోదరుడు ఎంతో ఒత్తడి చేశాడు. కానీ నార్జిస్‌ సుతరామూ ఇష్టపడలేదు. మిలటరీ పాలనలో నేరమేమీ చెయ్యకుండానే కేవలం ఆలోచనా విధానానికే ఉరిశిక్ష విధిస్తారు.అటువంటి స్థితిలో క్షమాభిక్ష అర్థించడం అనవసరమని నార్జిస్‌ దృఢంగా విశ్వసించింది. అభ్యర్థన సమర్పించడానికి గడువూ ముగిసిపోయింది. ఇప్పుడామె మృత్యు ముఖద్వారం వద్ద వేచి ఉన్నది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించడానికి చేయూతనిచ్చినట్టు ఆమె తల్లి నార్జిస్‌ చెయ్యి పట్టుకుంది.


నార్జిస్‌కు తన వారితో ఇదే చివరి సమాగమం. ఇక ఈ క్షణంలో వారు విడిపోవడమంటే శాశ్వతంగా వీడ్కోలు చెప్పుకోవడమే. ఈ క్షణం దుర్భరమైనదీ, అత్యంత దుఃఖభరితమైనదీ. ఈ క్షణంతోనే ఆమెకు అందమూ అనాకారితనమూ, మంచీ చెడూ, ప్రేమా ద్వేషమూ మిళితమై ఉన్న బాహ్యప్రపంచంతో సంబంధం తెగిపోనున్నది. పసివాడు మెహెదీ నవ్వుతూ తన మామతో ఏదో మాట్లాడేస్తున్నాడు. ఊచల మధ్య నుంచి తల దూర్చి మామని ముద్దు పెట్టుకున్నాడు. తన చిన్ని చేతివేళ్లని అమ్మమ్మ పండు జుత్తులో చొప్పించాడు.  ‘‘అమ్మా! ఇక మెహెదీకైనా స్వేచ్ఛ లభిస్తుంది. సంతోషించు. ఈ ఇనుప గొలుసులు, చేతి సంకెళ్లూ, నిర్బంధాలు ఇవే వాడి ప్రపంచమైపోయాయి. వాడూ ఈ బ్యారెక్స్‌లోనే పుట్టాడు. ఇంతవరకు ఇక్కడే పెరిగాడు. ఇక వాడు విడుదలవుతాడు. బడికి వెళ్లగలడు. బజారుకెళ్లగలడు. పార్కులో ఆడుకోగలడు. తమ్ముడూ! ఇక ముందు వీడిని పెంచే బాధ్యత నీదే.’’  ‘‘అక్కా! అక్కా! అలా మాట్లాడకు.’’ అంటూ నార్జిస్‌ సోదరుడు ఒక్కసారిగా భోరుమన్నాడు. అప్పుడామె మౌనం వహించింది. తల్లి వేదనా సోదరుడి దుఃఖం అర్థమయ్యాయి. కాని ఇతరులకు జీవితాన్ని ఇవ్వడానికి వేరొకరు మరణాన్ని ఆహ్వానించక తప్పదని, వారికి వివరించలేకపోయింది. సంపూర్ణమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సాధించాలంటే కొన్ని జీవితాలు ఉరికంబానికి బలి చెయ్యక తప్పదని వారికి విశదీకరించలేకపోయింది.


నార్జిస్, ఆమె భర్త హుస్సేన్‌ ఒకేసారి అరెస్టయ్యారు. అప్పటికే ఆమె గర్భిణి. ఇంటరాగేషన్‌ సమయంలో హుస్సేన్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పుకార్లు పుట్టించారు. మిలటరీ నిర్బంధంలో ఇవన్నీ సర్వసాధారణం. చిత్రహింసలు తట్టుకోలేక చనిపోయిన వారి శవాల్ని కుటుంబాలకు అప్పగించరు. కనీసం తెలియజెయ్యరు. మిలటరీ వారే పూడ్చిపెట్టేస్తారు. ఆ హత్యలని ఆత్మహత్యలుగా ప్రచారం చేస్తారు.హుస్సేన్‌పై ఆమెకు గల విశ్వాసం రవ్వంత కూడా చలించలేదు. ఆమెలానే అతడు కూడా అంతరాత్మ గల వ్యక్తి. అటువంటి ఖైదీలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కారు. వారు క్షమాభిక్షనూ అర్థించరు.ఈ చివరిచూపుల పర్వం ముగియగానే నార్జిస్‌ తల్లి ఒకవిధమైన నిర్వేదంలో పడిపోయింది. సోదరుడు కటకటాల్లోంచే ఆమె చేతిని ముద్దాడాడు. జుత్తు నిమిరాడు. తర్వాత వాళ్లు వెళ్లిపోయారు. కాదు, వారైవెళ్లలేదు. వారిని బయటకు తీసుకుపోయారు. నార్జిస్‌ ఒక్కసారి సోదరుణ్ణి దగ్గరకు తీసుకోవాలనుకుంది. కౌగిలించుకోవాలనుకుంది. కానీ ఇద్దరి మధ్య కఠినాతి కఠినమైన కటకటాలు అడ్డు నిలిచాయి. జైలు నియమాలను మనుషులే తయారు చేస్తారు. కానీ వాటిలో కాస్తంత కూడా మానవత్వం పాలు ఉండదు.  తన మామ అటు వెళ్లగానే మెహెదీ బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. అమ్మ చెప్పిన కథల్లోని లోకాలనూ స్థలాలనూ చూడాలని వాడు కలలు కంటున్నాడు. కానీ అమ్మ ఎక్కడికీ వెళ్లనివ్వడం లేదు.


‘‘నువ్వు రేపు వెళ్దువుగాని నాన్నా! మామయ్య నిన్ను రేపు బయటకు తీసుకెళ్తాడు.’’ అని నెమ్మదిగా అంటూనే నార్జిస్‌ మెహెదీ బుగ్గల్ని ముద్దు పెట్టుకుంది.జైలు వార్డెన్‌ మరియమ్‌ తల్లీ కొడుకుల వైపు ఒక్కసారి చూసింది. తర్వాత చూడలేక తన కళ్లను కిందకు దించుకుంది. ‘ఈమె ఎటువంటి మహిళ? ఉరిశిక్ష రద్దు కోసం క్షమాభిక్ష అర్జీనైనా పెట్టుకోలేదు. రేపు ఉదయం శిక్ష అమలు చేస్తారని తెలిసినా ఒక్క కన్నీటి బొట్టు కూడా విడువలేదు. ఏడవలేదు. భగవంతుడిని తిట్టుకోవడం లేదు. కనీసం జైలరునైనా తూలనాడటం లేదు’ అనుకుంది. నిజానికి నార్జిస్‌ ఒక విచిత్రమైన మహిళ. ఆమె చేతికి ఖురాన్‌ ఇచ్చినా, ఆమె దాన్ని కళ్లకు అద్దుకుని పక్కన పెట్టేసింది. తన పిల్లవాడ్నే ముద్దులతో ముంచెత్తింది. మౌల్వీ ప్రార్థన చేయించడానికి వచ్చాడు. సర్వవ్యాపి అయిన దయామయుడైన దేవుడిని తన పాపాలను ప్రక్షాళనం చేయమని కోరమన్నాడు. కాని ఆమె చిన్న చిరునవ్వే నవ్వింది. ఆ చిరునవ్వులో నేనేమీ చెయ్యలేదు అన్న అర్థం దాగి ఉంది. మౌల్వీ అటు వెళ్లగానే ప్రార్థనాసనమైన చాపని దిండు కింద పెట్టుకుంది. తన తలని దిండు మీద పెట్టుకుంది. పసివాడికి కథలు చెప్పడం మొదలుపెట్టింది.మహిళా వార్డులో అనేక రకాలైన నేరాలు ఆరోపించబడిన వారూ, నేరాలు నిరూపించబడిన వారూ ఉన్నారు. కానీ వారెవ్వరూ నార్జిస్‌ను తమతో పాటుగా ఒక దోషి అని పరిగణించలేదు. గత నాలుగేళ్లలో ఈ ‘చెడ్డ’ స్త్రీలంతా ఆమె పట్ల మంచిగా ప్రవర్తించారు.నార్జిస్‌ ఎవరి జుత్తు గానీ, ముక్కుగానీ కొయ్యలేదు. ఎవరి పశువుల్నీ సంపదనీ దొంగిలించలేదు. గంజాయిలాంటి మాదకద్రవ్యాలనీ అమ్మలేదు. ఎవర్నీ గాయపరచలేదు. హత్య చెయ్యలేదు. మరి ఇటువంటితీవ్రమైన శిక్షకు ఎందుకు గురి అవుతున్నదో ఆ స్త్రీలెవరికీ అర్థంకావడం లేదు.‘‘బీబీ! మిమ్మల్ని తప్పించలేదా?’’ ‘మృత్యుక్రమం’లోనికి నార్జిస్‌ని మార్చిన కొద్ది రోజుల్లోనే వార్డెన్‌ మరియమ్‌ అడిగింది.


‘‘దేని నుంచి తప్పించాలి?’’ నార్జిస్‌ కంఠంలో ఒక పవిత్రత ధ్వనించింది. ‘‘మరణం నుంచి’’‘‘లేదు. చావు మీద ఎవరికైతే నియంత్రణ ఉంటుందో వారు దాని నుంచి తప్పించుకోరు. అంతేకాదు, మెహెదీ ఉన్నాడు.నా తర్వాత వాడు జీవిస్తాడు. నేను వాడిలో జీవిస్తాను. వాడి తర్వాత వాడి పిల్లల్లో జీవిస్తాను.’’ఆ తర్వాత మరియమ్‌ మరే ప్రశ్నలూ వేయలేదు. ‘మరణ క్రమం’లో ఉన్న బీబీ ఒక గొప్ప తత్వవేత్త అని బ్యారెక్స్‌లో వ్యాపించిపోయింది. మరణం తర్వాత కూడా ఆమె పునరుత్థానం చెందుతుందనీ జీవావిష్కరణ పొందుతుందనీ అందరూ చెప్పుకున్నారు. ఆమెను గొప్ప మనోబలం గల వ్యక్తిగా అందరూ భావించారు. ఆ సంఘటన తర్వాత ఆమె వద్దకు వార్డెన్‌ ఎవరు వచ్చినా వినయంతో కిందకు చూసి నడుస్తుంటారు. జైలు సూపరింటెండెంట్‌ వచ్చినా వెంటనే ఆమె గది నుంచి పారిపోతాడు. ప్రతిరోజూ ఆమెనురెండుసార్లు గది నుంచి వెలుపలికి తీసుకు వెళ్లేటప్పుడు ఒక హఠాత్‌ నిశ్శబ్దం చుట్టూ ఉన్న వారిలో వ్యాపిస్తుంది. అప్పటి వరకు అరుస్తూ పోట్లాడుకుంటున్న స్త్రీలు కూడా ఒక్కసారిగా మౌనం వహిస్తారు. ఆమెను ప్రత్యేక వ్యక్తిగా చూస్తారు. నార్జిస్‌ ఊర్ధ్వలోకం నుంచి ఊడి వచ్చినట్టుగా గౌరవిస్తారు.ఆ చివరి భోజనం ఒక పండుగ విందు మాదిరిగా జరిగింది. ‘ది లాస్ట్‌ సప్పర్‌’ గొప్ప చిత్రకారుడు లియొనార్డో డావిన్సీ చిత్రపటం ఆమెకు గుర్తుకొచ్చింది. ఆ భోజనంతో మెహెదీ ఎంతో ఆనందపడిపోయాడు. ‘‘అమ్మా! తిండి బాగుందమ్మా!’’ అంటూ ఆమె మెడ చుట్టూ చేతులేశాడు.‘‘ఔను నాన్నా! నీ మాట నిజం!’’ నార్జిస్‌ అతడి నోటిలో ముద్ద పెడుతూ దుఃఖాన్ని దిగమింగుకుంటూ చూపు మరల్చుకున్నది. ఆమె కన్నీరు ఆ చిన్నవాడి కంటపడటం ఆమెకు ఇష్టం లేదు.


రాత్రి అయింది. మెహెదీ నిద్రలో మునిగిపోయాడు. కానీ నార్జిస్‌ వాడితో గుండె నిండుగా కబుర్లు చెప్పుకోవాలనుకుంది. వాడి మాటలు వినాలనుకుంది. బాగా పొద్దు పోయే వరకు వాడిని మెలకువగా ఉంచాలనుకుంది. ఉదయాన్నే ఆమెను తీసుకుపోవడానికి వారు వచ్చేసరికి వాడు గాఢనిద్రలో మునిగి ఉండాలనుకుంది.నార్జిస్‌ వాడి కళ్ల వైపు చూసింది. వాడి అందమైన నుదుటి వైపు చూసింది. వాడి కళ్లు హుస్సేన్‌ కళ్లలా ఉంటాయి. వాడి నుదురు హుస్సేన్‌ నుదురులాగా విశాలంగా ఉంటుంది. వాడి శరీరం కూడా హుస్సేన్‌ శరీరపు పరిమళమే వేస్తుంది. ఆ సుగంధంలో పుష్పాల సౌందర్యమూ, అనంతమైనజీవేచ్ఛా ఉంటాయి.హుస్సేన్‌! ఇప్పుడు  ఇక్కడ నువ్వు లేవు. ఇంకా ఎక్కడో ఉన్నావా? భూమ్యాకాశాల మధ్య సంచరిస్తున్నావా? లేక నీ జీవకణాలను పంచుకు పుట్టిన ఈ నీకుమారుడిలోఉన్నావా? నార్జిస్‌ రక్తం ఒక్కసారిగా ఉప్పొంగింది. మెహెదీని ఆప్యాయంగా పెనవేసుకుంది.‘‘అమ్మా! నాకు నిద్రొస్తుంది’’ అన్నాడు మెహెదీ.‘‘నాన్నా! మరికొద్ది సేపే మెలకువగా ఉండు.ఆతర్వాత నిద్రపోదువుగాని. ఇంకాసేపు నాతో మాట్లాడు నాన్నా!’’ నార్జిస్‌ గొంతులో చిన్న కంపం చోటు చేసుకుంది. ‘‘రేపు మావయ్య నిన్ను ఇంటికి తీసుకెళ్తాడు. కథలు చెబుతాడు. బజార్నీ చూపిస్తాడు.వెళ్తావు కదా!’’‘‘తప్పకుండా వెళ్తావమ్మా! నువ్వు కూడా మాతో బజారుకు వస్తావు కదా!’’ మెహెదీ నిద్ర మరచి కూర్చున్నాడు.‘‘నేను మీతో రాలేను నాన్నా!’’‘‘అయితే నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావా?’’‘ఉండను నాన్నా! నీకోసం సీతాకోక చిలుకల్ని పట్టుకోవడానికి వెళ్తాను.’’వరండాలో ఏదో శబ్దం వినబడింది. నార్జిస్‌ పైకి చూసింది. వార్డెన్‌ మరియమ్‌ కటకటాలు పట్టుకొని కబుర్లు చెప్పకొంటున్న తల్లీబిడ్డల వైపు చూస్తోంది. ఆమె అశ్రునయనాలతో ఉంది.‘‘మా అమ్మ రేపు నాకోసం సీతాకోక చిలుకల్ని పట్టుకోవడానికి వెళ్తోంది’’ అంటూ మెహెదీ ఉత్సాహంగా మరియమ్‌తో చెప్పాడు. వాడెప్పుడూ సీతాకోక చిలుకల్ని చూడలేదు. కాని తల్లి వాడికి వాటిని గురించి చాలా కథలు చెప్పింది.


‘‘ఔను రాజా! నువ్వు మీ అమ్మతో ఎక్కువ సేపు మాట్లాడు. ఆమెకు కుప్పలు తెప్పలుగా కౌగిలింతలూ ముద్దులూ ఇవ్వు’’ మరియమ్‌ స్వరం బొంగురుపోయింది. వెంటనే వెనుదిరిగి వెళ్లిపోయింది.‘‘అమ్మానువ్వు సాయంత్రానికి తిరిగి వచ్చేస్తావు కదా!’’‘‘లేదు నాన్నా! సీతాకోక చిలుకలు చాలా వేగంగా ఎగురుతుంటాయి. నేను వాటిని వెంబడిస్తున్న కొద్దీ మరింత దూరం పోతుంటాయి. కాబట్టి వాటి కోసం నేను చాలా చాలా దూరం పోతాను.’’‘‘అమ్మా! నువ్వు ఎలాంటి సీతాకోకచిలుకల కోసం చూస్తావు?’’నార్జిస్‌ ఒక్క క్షణం ఆగింది. ‘‘నేనా? స్వేచ్ఛా స్వాతంత్య్రం అనే సీతాకోక చిలుకల కోసం చూస్తాను నాన్నా!’’ ఆమె కుమారుడి జుత్తుని ముద్దుపెట్టుకుంది.నిజానికి వాడికి ఆ మాటలకు అర్థం తెలీదు. ‘‘స్వేచ్ఛా స్వాతంత్య్రం ఏ రంగులో ఉంటాయమ్మా!’’‘‘హరివిల్లుకుండే అన్ని రంగుల్లోనూ ఉంటాయి.’’‘‘హరివిల్లు ఎలా ఉంటుంది?’’‘‘ఈసారి వర్షం కురిసినప్పుడు హరివిల్లుని చూపించమని మావయ్యని అడుగు.’’‘‘అప్పుడు నేను కూడా హరివిల్లు రంగుల సీతాకోక చిలుకల కోసం వెళ్తాను.’’‘‘నువ్వు వెళ్లొద్దు నాన్నా! ఆ సీతాకోక చిలుకలు వాటికవే నీ వద్దకు వస్తాయి. నేను వాటి కోసమే పైకి వెళ్లి వెతుకుతాను. కాబట్టి మరి నువ్వు వెళ్లనవసరం లేదు.’’ నార్జిస్‌లో చిన్న వొణుకు ప్రారంభమైంది. మనఃపూర్వకంగా తీవ్రమైన అనురాగంతో మెహెదీ మురికిపట్టని మెడని గట్టిగా ముద్దుపెట్టుకుంది.ఈ వారంలో మొదటిసారిగా ఆమె కన్నుల్లో నీరు ఉబికి ప్రవహించసాగింది.


మెహెదీ నిద్రపోయిన తర్వాత నార్జిస్‌ వాడిని పైకి ఎత్తి తన గుండెపై పడుకోబెట్టుకుంది. వాడిలో ఆమెకొక ఆశాకిరణం కనబడింది. ఈ ఆశే ఆమెలో హిమాలయమంత ఎత్తుకు ఎగురుతోంది. భవిష్యత్తులో తన జీవ చైతన్యాన్ని వాడు కొనసాగించగలడని, ఒక ఆవిష్కరణా భావం ఆమెకు కలుగుతోంది.చుట్టుపక్కల బ్యారెక్స్‌ నుంచి ప్రార్థనా గీతాలు వినిపించడం మొదలైంది. ఎవరో ఒకామె ‘నూరా రెహమాన్‌’ అంటూ శ్రావ్యంగా ఆలపిస్తోంది. ఈ రోజు బీబీ శాశ్వత నిష్క్రమణం అని వారికి తెలుసు. అందకోసమే ఈ సన్నద్ధత.నార్జిస్‌ గుండెలో ఏదో పోటు మొదలైంది. జైలు ప్రధాన ద్వారం వెలుపల తన సోదరుడు మట్టిలో ధూళిలో కూర్చుని వేచి ఉంటాడు. అతడు స్టాటిస్టిక్స్‌లో పెద్ద డిగ్రీ తీసుకున్నాడు. కాని ఆ గణిత జ్ఞానంతో తన అక్క అస్తమయానికి ఇంకా మిగిలి ఉన్న నిమిషాలను లెక్కించవలసి వస్తుందని అతడు ఏనాడూ ఊహించి ఉండడు. తమ తల్లి కన్న ఇద్దరిలో తనొక్కడే మిగిలిపోతాడని భావించి ఉండడు. తన మేనల్లుణ్ణి పెంచి పెద్దచేసే బరువు బాధ్యతలు తన మీదనే పడతాయని యోచించి ఉండడు.నార్జిస్‌ మనస్సులో చాలా ముఖాలు, ప్రియమైనవీ అప్రియమైనవీ, దయగలవీ క్రూరమైనవీ, బాగా పరిచయమైనవీ కానివీ పరిభ్రమించసాగాయి. తన అంతిమయాత్ర బాధారహితంగా సాగడానికి తమ నిద్రను త్యాగం చేసి ప్రార్థనాగీతాలను ఆలపిస్తున్న వారి పట్ల ఆపుకోలేని ప్రేమాభిమానాలు కలిగాయి. వారందరికీ మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొంది. ఆయా గొంతుల వారితో ఒక వారం క్రితం తనకు కలిసే ఉండేది. కాని వారెప్పుడూ తనని అర్థం చేసుకోలేదు. అంతేకాదు, వారికి తన గురించి ఏమీ తెలీదు.


క్షమాభిక్ష కోసం అర్థించే గడువు దాటిన తర్వాత ఆ వార్త బయటికి పొక్కింది. జైలు అధికారులు ఆమెను బ్యారెక్స్‌ నుంచి ‘మరణక్రమం’లోనికి మార్చడానికి వచ్చారు. పరిసరాల్లో భయంకరమైన నిశ్శబ్దం అలముకుంది. నార్జిస్‌తో పాటు మెహెదీ కూడా బ్యారెక్స్‌ని వీడేటప్పుడు కొందరు స్త్రీలు తలలు వంచుకుని కళ్లు తుడుచుకోవడం ఆమెకు కనపడింది. ఈ స్త్రీల ఏ చిన్న గడబిడ సన్నివేశానికైనా ఒకర్నొకరు తిట్టుకుంటారు. దుస్తులు చించుకుంటారు. దాంతో వారిని మ్యాట్రన్, వార్డెన్‌ బలవంతంగా విడదీస్తుంటారు. ఈరోజు వారి ప్రవర్తన భిన్నంగా ఉంది.నార్జిస్‌కు ఒక తాత్కాలికమైన నిద్రమత్తు వంటిది ఆవహించింది.ఆమె హృదయం కృంగిపోనారంభించింది. గుండె ఒక తీవ్రమైన అనునాదంతో కొట్టుకుంటోంది. ఈ హృదయ స్పందనే మృత్యు ముఖద్వారం వద్ద ఆమె ఘనవిజయంగా నిలుస్తుంది. ఆమె మరణం తర్వాత జీవిస్తుందా? మరి జీవచైతన్యం అంటే ఏమిటి? శరీరాన్ని వీడిన తర్వాత అది ఎక్కడకు పోతుంది? హుస్సేన్‌ ఎక్కడున్నాడు? ఎక్కడా లేడు. లేనే లేడు. అంతా సర్వనాశనమైంది. నాశనమంటే అర్థమేమిటి? ఆ మాటకు భాషాపరమైన అర్థం మాత్రమే ఆమెకు తెలుసు. మరికొద్ది సేపట్లో తనే ఆ అనుభవాన్ని పొందనుంది.‘‘బీబీ’’ మరియమ్‌ కటకటాల వద్దకు వచ్చి మృదువుగా పిలిచింది.


‘‘చెప్పమ్మా!’’‘‘బీబీ! ఆ చిన్నరాజుని పరుపు మీదనే ఉంచండి. వాళ్లు వచ్చేస్తున్నారు.’’ మరియమ్‌ మాట తడబడుతోంది.ఒక్క క్షణం నార్జిస్‌కు తన పాదాల కింద నేల ప్రకంపిస్తున్నట్లు అనిపించింది. కానీ నిలదొక్కుకుంది. తన మెడ చుట్టూ ఉన్న మెహెదీ చేతుల్ని నెమ్మదిగా విడిపించుకుంది. వాడిని ఆ కఠినమైన పరుపు మీదనే వదిలి పెట్టింది. ‘వాడు నా ముఖాన్ని గుర్తుంచుకోలేడు. వాడి జ్ఞాపకాలలో కేవలంనా పేరు, నా ఊహ, నా స్మృతి మాత్రమే మిగులుతాయి.’‘‘నన్ను క్షమించండి బీబీ! కటకటాలకు తాళాలు వేసి తీసే నా ఈ చేతులే నాకు తిండి పెడుతున్నాయి.’ మరియమ్‌ ఊచలపై తలపెట్టుకునిఏడవనారంభించింది.నార్జిస్‌ నులక మంచం మీద నుంచి లేచింది. కటకటాల్లోంచి మరియమ్‌ భుజాల మీద చేతులేసింది. మాటలకు నిర్వచనాలు లేవు.బరువైన అడుగుల చప్పుడు వినపడింది. నార్జిస్‌ మరియమ్‌ మోచేతిని నెమ్మదిగా తట్టింది. మరియమ్‌ తలెత్తి తన కన్నీటి తెరలలోంచే నార్జిస్‌ను చూసింది. తన కళ్లని తెల్లని మస్లిన్‌ దుపట్టాతోతుడుచుకుంది. ‘ఎటెన్షన్‌’లో నిలబడింది.తాళంలో చెవిని తిప్పి వీలైనంత నెమ్మదిగా తలుపు తెరిచింది. జైలు సూపరింటెండెంటు ఇనుప తలుపుని గట్టిగా గోడకు తగిలి పెద్దగా ధ్వని వచ్చేటట్టు తీశాడు.‘‘సర్‌! పిల్లవాడు నిద్రపోతున్నాడు. మేల్కొనగలడు’’ మరియమ్‌ నమ్రంగానే అంది.


‘‘నోర్ముయ్యి! వాడు నీ పిల్లవాడు కాడు’’ సూపరింటెండెంట్‌ అసహనంతో అన్నాడు.‘‘సర్‌! బిగ్గరగా మాట్లాడవద్దు. ప్లీజ్‌’’ యువ మేజిస్ట్రేట్‌ నిద్రపోతున్న మెహెదీ వైపు చూస్తూ, కనుబొమలు తుడుచుకుంటూ అన్నాడు.సూపరింటెండెంట్‌ భృకుటి ముడివేస్తూ చిరాగ్గా చూశాడు. ‘ఈ కొత్త ఆఫీసర్లు తమ గురించి ఏమనుకుంటారు?’ అనుకుంటూ పొంగి వస్తున్న కోపాన్ని అణచుకున్నాడు. తన అధికారిక విధానాన్ని మెదలుపెట్టాడు. మొదట నార్జిస్‌ని ఫొటోతోనూ పుట్టుమచ్చలతోనూ సరిపోల్చి గుర్తించాడు. యధావిధిగా ఒక పత్రాన్ని తెరిచి, దాన్ని బిగ్గరగా చదివాడు: ‘‘నేను.. క్షేమకరుడూ.. దయామయుడూ అయిన అల్లా పేరున ప్రారంభిస్తున్నాను..’ అని మొదలుపెట్టి ఇలా ముగించాడు. ‘‘మరణం ధ్రువీకరించబడేంత వరకు నేరస్తురాలిని ఉరితియ్యాలి.’’మెడికల్‌ ఆఫీసర్‌ ముందుకు వచ్చాడు. నార్జిస్‌ నాడినీ, గుండె కొట్టుకోవడాన్నీ పరీక్షించాడు. నిశ్శబ్దంగా తల ఊపాడు. సూపరింటెండెంట్‌ అతని చేత కొన్ని కాగితాలపై సంతకాలు పెట్టించాడు. యువ మేజిస్ట్రేట్‌ ఆ సంతకాలను ధ్రువీకరించాడు. సూపరింటెండెంట్‌ గదిని విడిచి వెళ్లాడు.డిప్యూటీ సూపరింటెండెంట్‌ మరియమ్‌కు సంజ్ఞ చేశాడు. ఆమె ముఖం కంచులా కఠినంగా ఉన్నట్లనిపించింది. ఆమె కళ్లు నేలవైపు చూస్తున్నాయి. నార్జిస్‌ చేతుల్ని వెనక్కు వంచి ఒక చర్మపు తాటితో కట్టింది. మరియమ్‌ వేళ్ల వెచ్చదనం నార్జిస్‌కు తగిలింది. ఆమె ఒంటరిగా లేదు. లోపలా బయటా చాలామందే ఉన్నారు.సాయుధులైన రక్షకులు బ్యారెక్స్‌ని ఈసరికే కాపలా కాస్తుంటారు ప్రధాన ద్వారం వద్ద పన్నెండు మంది వార్డెన్లు ఈసరికే వారి వారి స్థానాల్లో ఉంటారు ప్రతివారి తుపాకీలోనూ పది బుల్లెట్లు ఉంటాయి నార్జిస్‌ సోదరుడు జైలు గోడల వెలుపల బయలులో కూర్చొని ఉంటాడు.


నార్జిస్‌కు మెహెదీ ముఖం కనపడుతోంది. ఆమె వాడినే కన్నార్పకుండా చూస్తోంది. మేట్రన్‌ నుంచి సంజ్ఞ అందుకుని మరియమ్, నార్జిస్‌ను ‘‘పద బీబీ’’ అంది.నార్జిస్‌ ఒక్క అడుగు ముందుకు వేసింది వెనక్కు తిరిగి మెహెదీ వైపు చూసింది. వాడు నిద్రలోనే కదిలాడు. చిన్నగా మూలిగాడు వాడికేదో పీడకల వచ్చి ఉంటుంది. నార్జిస్‌ గుండెను ఏదో పిండేసినట్లయింది. ఆమె తన కళ్లలో ఉబుకుతున్న కన్నీటిని అతి ప్రయాస మీద ఆపుకుంది. ఆమె తన ఆశల్నీ తనవంటి వారి ఆశయాల్నీ భగ్నం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లూ చేసిన వారి ముందుంది. కాని ఆమె ఓటమిని అంగీకరించలేదు. ఈ చివరి క్షణాల్లో తాము గెలిచిన సంతృప్తి వారికెందుకివ్వాలి?యువ మేజిస్ట్రేట్‌ కళ్లు ఆమె దృష్టిని వెంబడించాయి. ‘‘ఆ పిల్లవాడు ఎక్కడుంటాడు?’’ అని మేట్రన్‌ని అడిగాడు. నార్జిస్‌కు తన ఊపిరి తోడివేసినట్లయింది. తన సోదరుణ్ణి అగ్నిపరీక్షకు గురిచేస్తోంది.మేజిస్ట్రేట్‌ కనుబొమలు ముడిపడ్డాయి. నార్జిస్‌ వైపు పరీక్షగా చూశాడు. వరండాలో ఉన్న వార్డెన్‌ను పిలిచాడు. ‘‘సర్‌’’ అంటూ వార్డెన్‌ ముందుకొచ్చాడు.‘‘ఆ పిల్లవాణ్ణి జాగ్రత్తగా ఎత్తుకో’’ అన్నాడు.‘‘సర్‌. నేను వాడిని ఎత్తుకోవచ్చా?’’ అంది మరియమ్‌.‘‘సరే, వాణ్ణి బీబీతో పాటు అక్కడి వరకు తీసుకురా...’’‘‘కానీ, సర్‌! జైలు మాన్యువల్‌ అందుకు అంగీకరించదు’’ డిప్యూటీ సూపరింటెండెంట్‌ కలగజేసుకున్నాడు.‘‘నీ జైలు మాన్యువల్‌ తగలబెట్టు’’ అంటూ యువ మేజిస్ట్రేట్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మరియమ్‌ ముందుకొచ్చి మెహెదీని ఎత్తుకుంది. వాడు కదిలాడు. త్వరలోనే తిరిగి గాఢనిద్రలోకి జారుకున్నాడు.డిప్యూటీ సూపరింటెండెంట్‌ పర్యవేక్షణలో ఉరి ఖైదీ బిడారు బయల్దేరింది.


ఇద్దరు పోలీసులు దారి చూపుతున్నారు. మరో ఇద్దరు వెంబడిస్తున్నారు. నార్జిస్‌ మధ్యలో ఉంది. ఆమెకు కుడివైపున ఒక వార్డెన్, రెండోవైపున మరియమ్‌ ఉన్నారు. మరియమ్‌ భుజాన మెహెదీ ఉన్నాడు.నార్జిస్‌ చూపు మెహెదీపై స్థిరంగా ఉంది. అందరూ ముందుకు నడిచారు. ఆరుబయట అందమైన చల్లని రాత్రి నిష్క్రమించనుంది. నింగీనేలా కలసిన సుదూర తీరంలో ఉదయభానుడు ప్రభవించనున్నాడు. వెలిసిపోతున్న వెన్నెలలో వధ్యశిలా వేదిక నార్జిస్‌ కంటబడింది. పైకి దారితీసే మెట్లు కూడా స్పష్టంగా కనపడసాగాయి. మరణం భూమి లోతుల్లోనికి కృంగిపోతోంది. అధఃపాతాళాన్ని చేరడానికి పైవైపు మెట్లని ఎందుకెక్కాలో ఆమెకు అర్థం కాలేదు. ఉరిశిక్ష అమలు చేసే తలారివైపు చూసింది. అతడి పిల్లలు ఈరోజు ఉరివల్ల తండ్రి తెచ్చిన రాబడితో సంతోషిస్తారు. ఒక ఉరికి పది రూపాయలు చెల్లిస్తారు. నిజంగా అది వారికి ఎక్కువ మొత్తమే. ఆ డబ్బుతో చాలా కొనుక్కోవచ్చు.‘‘మరియమ్‌!’’ నార్జిస్‌ గొంతు ఆ నీరవ నిశ్శబ్దంలో ఒక మెరుపులా మెరిసింది. ‘‘బీబీ! మీ సేవలోనే ఉన్నాను.’’ వార్డెన్‌ మరియమ్‌ గొంతు కన్నీటితో గద్గదమైంది.ఇక్కడ ఈ స్థితిలో యజమాని ఎవరో, సేవకులెవరో చెప్పడం కష్టం. మృత్యువు అందర్నీ ఒకే పంక్తిలో నిలుపుతుంది. నార్జిస్‌ మరియమ్‌ను దగ్గరగా రమ్మని సంజ్ఞ చేసింది. మరియమ్‌ ముందుకు వంగింది. ఆమె భుజం మీద నిద్రపోతున్న మెహెదీ ఉన్నాడు. నార్జిస్‌ బంధనాలున్న చేతులతోనే మెహెదీని తాకే వ్యర్థ ప్రయత్నం చేసింది. అంతలోనే ఆగిపోయింది.మెహెదీ నిద్రలోనే నవ్వుకుంటున్నాడు. బహుశా దేవతా కన్యలతో ఆడుకుంటున్నాడు. నార్జిస్‌ తన జీవనఫలం, తన ప్రతిమ అయిన మెహెదీ వైపు నీరు నిండిన కళ్లతో చూసింది. వాడి నుదుటినీ, బుగ్గల్నీ ముద్దాడటానికి వంగింది.ఒక జీవితం మరో జీవితానికి వీడ్కోలు చెబుతోంది. నార్జిస్‌ వధ్య శిల మెట్లు ఎక్కింది. తలారి ఆమె ముందు వంగాడు. ఆమె కాళ్లను బంధించాడు. ఆమె ఛిద్రమవుతున్న ప్రపంచ దృశ్యాన్ని కడసారి చూపు చూసింది. దాన్ని మనసులోనే పదిలపరచుకుంది.కళ్లు మూసుకుంది. ఆ దృశ్యం ఆమెలో ముద్రించబడింది.చంద్రుడు అస్తమించిపోతున్నాడని ఆమెకు తెలుస్తోంది. ధ్రువనక్షత్రం ఆకాశంలో ప్రకాశిస్తోందని తెలుస్తోంది. మెహెదీ దేవతా కన్యలతో ఆడుకుంటున్నాడని తెలుస్తోంది. సూర్యుడు ఉదయించబోతున్నాడని తెలుస్తోంది.దేవుడి పవిత్రమైన పేరు మీద నిర్దేశించబడిన నిర్ణయం అమలు కాబోయే క్షణం ఆసన్నమైంది. 


Titliyan Dhoondhne Wale, 


ఉర్దూ మూలం : జహీదా హీనా, పాకిస్తాన్‌


అనువాదం: టి.షణ్ముఖరావు 






30, జనవరి 2019, బుధవారం

తల్లి

" తల్లి " ఎలా ఉంటుందో ఏడు దశాబ్ధాలకు పూర్వం వ్రాసిన కథను చదివి మీకు పరిచయం చేయబోయే ముందు నా మాట. మీరు మంచి బిడ్డలైతే మీకు ఇది వర్తించదు. ఎవరికీ వర్తించకుండా వుండాలని  నా ఆశ కూడా. 

ఆథునిక కాలంలో  కన్నవాళ్ళను కూడా కంటినిండా చూసుకునే  సమయం డబ్బు రెండూ  ఖర్చు పెట్టడానికి సముఖంగా లేరు. యాంత్రికమవుతున్న జీవనవిధానంలో  చుట్టపు  చూపుగా అయినా ఓ రోజును ఖర్చు పెట్టగల్గినపుడు ఆ తల్లిదండ్రులు  యెంత సంతోషిస్తారో అన్నది మనలో ప్రతి ఒక్కరికీ అనుభవమే కదా !

అయితే మనుషులలో సున్నితత్వం చచ్చిపోతుంది. వ్యక్తిగత అవసరాలు ఆనందాల వేటలో పడి ఇంకొకరికి కొన్ని నిమిషాల సమయం కూడా కేటాయించలేని స్వార్ధపరులైపోతున్నారు. కన్నవాళ్ళు మాత్రం కడుపు తీపితో  బిడ్డల కోసం  కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఏడ్చి ఏడ్చి  కళ్ళు కూడా పోగుట్టుకుంటున్నారు. అనేక వృద్దాశ్రమాలు వారికి కేరాఫ్ అడ్రెస్  గా మిగులుతున్నాయి. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని  చెప్పే మాటలు చెవిలో శంఖం పెట్టి చెప్పినా మరుక్షణంలో ఇంకో చెవిలోనుండి వదిలేస్తున్నారు. చాలా విషయాలు చెప్పడం కంటే బలంగా నాటుకునేటట్లు చూపించడం, చదివించడం ద్వారా మనుషుల్లో కనీస ఆలోచన కల్గించవచ్చని నాకనిపిస్తూ ఉంటుంది. హృదయానుగతమైన సంస్కారం లేనివారికి చదవడం మూలంగా సాహిత్య సంస్కారం అబ్బుతుంది కాబట్టి.. కొంచెం ఓపిక చేసుకుని .. ఈ పోస్ట్ వ్రాస్తూ  ఈ ..కథను పరిచయం చేస్తున్నాను. 

ఉర్దూ కథ ఇది ఇది. కథ పేరు "తల్లి " రచయిత రుకైయ్యా రీహానా.  1946 లో  ఒక సంకలనంలో మొదటి ముద్రణ వచ్చింది. అనువాదం: వేమూరి ఆంజనేయశర్మ 

అయితే నేను పరిచయం చేస్తున్న కథలో  అతుకు బొతుకు  జీవితంలో తల్లిని తాము నివసించే నగరానికి తీసుకువెళ్ళలేక తల్లిని చూడటానికి రాలేక ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఒక కొడుకు హఠాత్తుగా ఒక రోజు తల్లిని చూడటానికి వెళతాడు. తల్లి అక్కడ ఎలాంటి స్థితిలో ఉంటుంది. పండగపూట వెళ్లిన అతనికి ఎలాంటి విందు భోజనం వడ్డిస్తుంది.మూట విప్పి  తాను  దాచిన కానుకలను భద్రంగా కొడుకుకి అందించి తృప్తి పడి   తెల్లవారేసరికి .. ఏమవుతుంది ? 

కథ చదవండి..   తల్లి  ఈ  లింక్ లో 

pic courtesy :Google Pics 



28, జనవరి 2019, సోమవారం

విశ్వ కథా వీధి కథలు

వాడ్రేవు చిన వీరభద్రుడు గారు పరిచయం చేసిన విశ్వకథా వీధి ఐదో సంపుటిలోనూ ఆరుకథల్నీ ఆవురావురావురుమంటూ చదివాను. వాటి గురించి నా స్పందన.
“గుల్లీ” చదివాను. ప్రమాణం యెంత గొప్పది. ఎంత గొప్ప మనసు. విలువలు పాటించడంలో వున్నతి ధనిక పేదలో లేదు. అలాగే గుల్లీలో భూతదయ, దాదూ పై అల్లుకున్న ప్రేమ గొప్పగా వున్నాయి. ఛగన్ లాంటి గుంటనక్క ఉంటారని చెప్పిన కథ యిది.
"కసి" కథలో గఫార్ కసి సంస్కారవంతమైనది. అతనికి నా సెల్యూట్. వడ్డించిన భార్య చేతులను తన చేతులలోకి తీసుకుని కృతజ్ఞత తెలియజేసాడు. ఆ భావన యెంత సంతోషం కల్గిస్తుందో అనుభవిస్తే కాని తెలియదు. ఒక చేయి విరిగినా రెండో చేత్తో యువకుడిని కాపాడిన తక్షణ సంస్కారం మెచ్చుకోతగినది.విప్లవాలు ఎందుకు వస్తాయో ప్రజలెందుకు ఉద్యమిస్తారో అరటిపండు వొలిచి తినిపించినట్టు పరిచయం చేసేకథ యిది.
"డేగ" కథ మర్చిపోలేని కథ. తీవ్రవాదులను, క్రీడాకారులను ఇలాగే తయారు చేస్తారేమో ఇంకా చెప్పాలంటే ఇప్పటి మన ప్రభుత్వాలు సంక్షేమ పధకాలు ద్వారా ప్రజలకు కష్టపడకుండా సోమరులను చేసి ముప్పు తెచ్చుకోబెట్టారని నాకనిపించింది. పాపం రహీమ్ అనిపించలేదు. అతనికి అది సంతోషమే కల్గించినందుకేమో.
"దొంగ" కథ ...ఒక సామెతను గుర్తు చేసింది. కథలో యజమాని సేవకురాలు కాబట్టి ఆ సామెత పొసగక పోయినా సమంజసం కాకపోయినా " మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కడం లాంటిది"
"పిల్లలు -ముసిలివాళ్ళు" కథ చదివి విచలితమైపోయాను .యుద్ధం ఎందుకు చేసుకుంటారు రాజుగారి కోసం. యుద్ధంలో ఎంత బాగా చంపగలితే అంత గొప్ప. శత్రువు దగ్గర హృదయం ఉండదు శత్రువు దగ్గర హృదయం ఉండదు అంతే. కథ ముగింపు వాక్యాలు దుఃఖభరితంగా ఉంటాయి. వాక్యం ఎంత శక్తివంతంగా వ్రాయవచ్చో తెలిపే కథ యిది.
"ఆఖరి ఉత్తరం" ఆలోచింపజేసే కథ. బాగుంది. ప్రేమ కథలెప్పుడూ బాగుంటాయి. వృద్ధాప్యపు జ్ఞాపకాలలో స్థిరంగా ఉండేది యవ్వనమే. ఆ వృద్ధుడు తన ప్రేయసికి ఒక లేఖ వ్రాస్తాడు. స్వార్ధంలేని ప్రేమఒక్క భగవంతుడికే సాధ్యమవును అని చెపుతూ నా జీవితంలో సుఖ దుఃఖాలు రెండూ నీతోనే వచ్చాయి. ఆ రెండింటి కోసమూ నీ ముందు కృతజ్ఞుడిని నేను అంటాడు. కానీ అతను వ్రాసిన ఆఖరి ఉత్తరాన్నిప్రియురాలికి పోస్ట్ చేయకముందే అతను చనిపోతాడు. ఆ వృద్ధుని కొడుకు ఆ ఉత్తరాన్ని చూసి నాన్న రహస్యాలు మనకి తెలియడానికి వీల్లేదంటూ ఆ ఉత్తరాన్ని కాల్చేస్తాడు. కానీ తండ్రి మనసును తెలుసుకోలేకపోయానని దుఃఖిస్తాడు. మనో వైజ్ఞానిక కథ.
ఈ కథల్లో పరిచయమైన చాలా పదాలకు అర్ధం తెలుసుకోవాల్సి వుంది. పురిపండా గారి అనువాద రచనలు చదివి ఉండటం వల్ల అనువాద కథలే అనిపించలేదు.ఈ కథలను మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి. కాలక్షేపపు కథలు కావివి. మంచి కథలను పరిచయం చేసిన వాడ్రేవు చిన వీర భద్రుడి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
విశ్వ కథా వీధి ఆరు భాగాలు కలిపి కథా సంకలనం గా పునర్ముద్రణ కాబోతుంది. కథాప్రపంచం వారు ప్రచురిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతుంది. తప్పకుండా కొని చదువుకోవాల్సిన కథలివి.


27, జనవరి 2019, ఆదివారం

మొక్కలండీ మొక్కలు

మొక్కలండీ మొక్కలు

స్నేహ మందారంతో 
నది వొడ్డున వేచి చూస్తున్నానా
నువ్వు నలుగురిని పోగేసుకుని 
నలుపు గురమెక్కి దండయాత్రకు దౌడు తీసావు.

నీ వొరలో ద్వేషమనే కరవాలం వున్నంతవరకూ
దాని పిడిపై నీ పిడికిలి పదేపదే బిగుసుకుంటుంది. 
ప్రేమ విత్తనాలు వెదజల్లని భూమి 
ఎడారి వనాలై విస్తరిల్లుతుంటుంది.

ఇసుక తుఫాను చుట్టేయక ముందే
ఒయాసిస్ లకై వెతుక్కోక ముందే
పాతుకుపోతున్న పగను పక్కన బెట్టి 
కాసిని ఖర్జూరపు,అంజూరపు మొక్కలైనా 
నాటుకుందాం రా...

కొన్నాళ్ళకి మన పిల్లల పిల్లలకైనా
తీయని ఫలాలు దక్కుతాయి.
నమ్మకంగా చెపుతున్నా..
నగుమాటు మాటలనుకోకు మిత్రమా!

Pic Courtesy  Pinterest  

26, జనవరి 2019, శనివారం

చిన్న కథ


పిచ్చోళ్ళు  -వనజ తాతినేని

"చరిత్రను తవ్వుకుని తరచిచూసుకుని ముందేసుకుని యిప్పుడేమి చేద్దామని " చిరాకు పడుతుంది ఆమె.
"అందరూ ఆహా, అలాగా, ఎంత అన్యాయం అంటుంటే నువ్వు ముఖం చిట్లిస్తావెందుకు?నలుగురితో నారాయణ అనక. నీకు శత్రువులు పెరుగుతున్నారు జాగ్రత్త" హెచ్చరిస్తారు సన్నిహితులు.
కొన్నాళ్ళ తర్వాత..
"నా లోపలి శత్రువుతో పోరాడటానికే సమయం చాలడం లేదు. అందుకే అపుడపుడూ బయట శత్రువులను విపరీతంగా ప్రేమిస్తుంటా. ప్రేమిస్తే ప్రశాంతంగా వుంటారు తెలుసా " అంది ఆమె జుట్టు పీక్కుంటూ
"నటించడం పాత్రల వంతు. జీవించడం మనుషుల వంతు. అదివరకటిలా నీలాగే నువ్వుండు గుర్తు పట్టడానికి వీలుగా" అన్నారు భయంగా ఆమెని ఆ స్థితిలో చూస్తున్న సన్నిహితులు
ఆమె తన చుట్టూ జుట్టు పీక్కుంటున్న వాళ్ళకు చెపుతుంది "పాపం పిచ్చోళ్ళు వాళ్ళు" అని. తర్వాత వెక్కి వెక్కి యేడ్చింది.

24, జనవరి 2019, గురువారం

పువ్వులాంటి మాట

పువ్వులాంటి మాట 


నువ్వు నేను నాణానికి చెరోవైపు 

మనద్దరిది పూర్తి సత్యంకాదు పూర్తి అబద్ధం కాదు

నేను ప్రేమ హస్తాన్ని అందిస్తాను 

గతంలో పొరబాట్లను తలచుకుని సిగ్గిల్లుతూనే 

నువ్వు నన్ను క్రోధంగా చూస్తూ  మరింత ద్వేషిస్తూ  

దూరం జరుగుతావు వునికి బలపరుచుకుంటూ


రాతి గదుల మధ్యనో సమాధులలోనే దేవుడు 

లేడనే సంగతి తెలిసి కూడా 

కారణాలు వెతుక్కుని మరీ ద్వేషించుకునే మనం 

ఇంకోచోట కుక్కలా విశ్వాసం చూపిస్తూ తోకలూపుతుంటాం 

కాల నాళికలో జీవిత క్రమమంతా  ఇమిడి పోతుండగా 

కలం పోటులో విషం చిమ్ముకోవడం యెందుకు.

కడదాకా ద్వేషాన్ని మోయడమెందుకు . 


చేతికి చిక్కని సంశయాల మనసును

చుట్టుకునే పొగమంచు తెరలను 

వామ హస్తంతో  కొద్దిగా పక్కకు జరిపి 

పువ్వుల్లాంటి  ఒక చిన్న మాట కలుపుకుందాం 

మట్టి పరిమళాన్ని మట్టిలో కలిసిపోయేదాకా 

ఆస్వాదిద్దాం. రా ..మిత్రమా .. 

చేయి చేయి కలిపి అసలు శత్రువును అంతం చేద్దాం

మట్టి మూలం ఒకటే అని రుజువు చేద్దాం.




5, జనవరి 2019, శనివారం

रंग उनकी छाया


ఈ రోజుల్లో యెవరి జీవితంతో వాళ్ళు పోరాడలేక చస్తుంటే మధ్యలో వీరిలాంటి వారితో పోరాటం మరీ కష్టం అయిపోతుంది. ఎక్కడ చూసినా మనుషులమధ్య సత్సంబంధాలు మాయమైపోతున్నాయి. అయినవాళ్ళ మధ్య ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళ మధ్య కూడా యెన్నో విబేధాలు అగాధాలు. యధాలాపంగానే ఆ మనుషులు గురించి యీ ముచ్చట. మనుషుల మనస్తత్వాల గురించే యీ ముచ్చట.

వందమంది పొగడ్తల మధ్య వొక్కరన్నా విమర్శించాలి. లేక పోతే నాకసలు నిద్రబట్టి చావదు.. విమర్శించే వారే నా అసలైన మిత్రులు అన్నాననుకోండి.

మరురోజు యెవరికి వారూ విమర్శించే వాళ్ళలో ముందుంటారు.

సమయాన్నిబట్టి స్పందించేవారే పొగడ్తల పూల మాల చేతిలో లేనివారే అసలైన మిత్రులు అని నాకు తెలుసు.. అని మళ్ళీ అనాల్సివస్తుంది.

ఏది వెలుగు యేది చీకటి !? ఈ మాయా ప్రపంచంలో..

అతుకుల బొతుకులు భూమికే తప్పడంలేదు ఇక మనిషి యెంత ? అని భారంగా నిట్టూర్చడమే.

పెదవి విప్పి కష్టమేమిటో చెప్పకుండా శ్రమ పడుతూ నవ్వుతూ నటిస్తూ బ్రతుకుతుంటారు కష్టం విలువ తెలిసివారు.

చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లే కష్టం పేరు చెప్పుకుని కష్టపడకుండా సుఖపడుతున్నారు బ్రతకడమెలాగో తెలిసిన వారు.తీసుకోవడం అంటే ఇవ్వడమంత తేలికైన పని కాదని అర్దంకాని అర్ధజీవులు వారు. వారు కష్టపడేవాళ్ళను చేతకానివాళ్ళగా జమకడతారు. మనుషుల స్వభావం యెలాంటిదంటే తనవాళ్ళే అయినా వారు బాగుంటే మనసొప్పదు. ఎప్పుడూ బాధలు పడుతూ నిస్సహాయంగా ఉంటే వీళ్ళకి లోలోపల ఆనందం. సహాయం చేసినట్టు చేస్తూనే వెన్నువిరిచే మాట్లాడటం వీరికి అలవాటు. కాలం కలిసొచ్చి ఆర్ధికంగా బాగున్నా భరించలేరు. తనకున్నది వేరేవారికి వుండకూడదు. తనకు లేనిదీ వేరేవారికి వుండకూడదు. ఇలాంటి తీవ్రమైన మనస్తత్వం కల్గి వుంటారు.

ఇక వాళ్ళు స్నేహం విషయంలో యెలా వుంటారంటే..

మనుషులతో స్నేహంగా వుండాలంటే వాళ్ళ గురించి తెలియకుండా వో పూసేసుకోవడంతో మొదలెడతారు.పరిచయం అవ్వగానే వాళ్ళను అమాంతం కావిలించుకోవడం వాళ్ళ యింట జొరబడిపోయి సలహాలివ్వడం ఇదిగో యిదిలాకాదు యిలా చేయాలని వుచిత సలహాలివ్వడం, పెత్తనం చేయడం సాధారణం అయిపోతుంది వీరికి. చిన్న చిన్న అవసరాల నుండి పెద్ద పెద్ద సాయాలు దాకా స్నేహం ముసుగులో మనుషులను బకరాలు చేయడం వీళ్లకు అలవాటు. నా అంత నిజాయితీ పరులు లేరంటూనే లోపల అంతులేని రహస్యాలు నేర్పరితనముగా దాచేసుకోవడం వీరికి కరతలామలకం. సాయం చేసినట్టు పైకి నటిస్తూనే వెనుక గోతులు తవ్వడం. వీళ్ళ స్నేహం యెలా వుంటుందంటే రక్త సంబంధీకులని కూడా గడ్డిపోచల్లా ప్రక్కకు తోసేయడం స్నేహితుల ముందు అయినవాళ్ళన్నీ ఈసడించుకోవడం తీసి తీసి పడేయడం. కష్టంలో రక్త సంబంధీకుల పక్కన నిలబడినదానిని కూడా గొప్పగా చెప్పుకోవడం పరిపాటి. అక్కడ వారు చేసింది కూడా యేమీ వుండదు. యెవరు లేకపోయినా జరిగేవి జరగక మానవు కదా! స్నేహితులముందు అయినవాళ్ళని యెంత దుష్టులుగా చిత్రీకరిస్తే అంత సానుభూతి కురుస్తుంది అనే చీఫ్ ట్రిక్స్ (అల్ప బుద్ది) కల్గి వుండటం. ఇంతా చేసి రక్తసంబంధీకులకన్నా స్నేహితులే ముఖ్యం అనుకున్న వాళ్ళకి ఆ స్నేహాలు కలకాలం నిలబడతాయా అంటే అదీ వుండదు. మూణ్ణాళ్ళ ముచ్చటే అదీ. మంచివాళ్ళతో స్నేహం పొద్దు పడమటికి వాలేటప్పుడు పెరిగే నీడలాంటిదని వూరికే చెప్పలేదు పెద్దలు.

ఇలాంటివారు అర్ధం చేసుకోవాల్సింది యేమిటంటే..

ఎంత ప్రాణ స్నేహితులైన యెంత తోడబుట్టినవారైనా యెవరి మనస్తత్వాలు యెవరి ఆర్ధిక పరిస్థితులు వారికి వుంటాయి. పరిధులు ప్రమేయాలు గుర్తించకుండా అన్నింటిలో జొరబడిపోయి వీళ్ళు చెప్పినది జరగడం లేదన్న అహంతో విమర్శించడం అసలు చేయకూడదు. వ్యంగంగా చులకనగా మాట్లాడటం, దుమ్మెత్తిపోయడం యివి వాళ్ళ లక్షణాలైయితే అవచ్చు కానీ యెంత సొంతవాళ్ళైనా పరాయి వాళ్ళ మీదైనా తమ అభిప్రాయాలు రుద్దాలనుకోవడం తమ మాటే చెల్లాలనుకోవడం సమంజసం కాదు.


ఇంకో విషయం యేమిటంటే తమ పిల్లలే విజ్ఞానఖని, గని, తెలివికలవాళ్ళగానూ, తతిమ్మా వాళ్ళ పిల్లలు ఎందుకు కొరగాని వాళ్ళగానూ, అసమర్థులుగానూ చిత్రించడం మాట్లాడటం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను చిన్నబుచ్చడం మంచిదికాదని గాయ పడతారని తెలియని వయసుకూడా కాదు వాళ్లది.

గాయపడిన వాళ్ళు మౌనంగా వుంటారు. గాయపరిచినవాడు ఇంకనూ చెలరేగి కారుకూతలు కూస్తాడు. ఎక్కడ ఆపాలో తెలిసినవాడు విజ్ఞుడు కాబట్టి ఆ స్నేహాన్నో ఆ బందుత్వాన్నో అక్కడితో కత్తిరించేసి ప్రశాంతంగా బతుకుతారు. అలా బ్రతకడం కూడా యిష్టం వుండదు వారికి. గూఢచారి అవతారం యెత్తి కొత్త కొత్త ఐ.డి లతో సంచారం చేస్తూ వుంటారు. ఈర్ష్యా ద్వేషంతో మండిపడేవాడు యెక్కడా ప్రశాంతంగానూ ఆరోగ్యంగానూ వుండలేరు ఇక వారిని భగవంతుడే కాపాడాలి.


నాలుక విషం పూసిన కత్తిలాంటిది. విషపూరితంగా మాట్లాడితే మనసులు విరిగిపోతాయి. మళ్ళీ అవి అతకడం కష్టం. మనుషులు మానసికంగా మరణించాక భౌతికంగా బ్రతికున్నా లేనట్టే లెక్క.


మనుషుల రంగులు నీడలు అర్ధమయ్యాక భౌతిక మానసిక దూరాలు మరింత పెరుగుతాయి. 


PS : ఎవరికైనా apt గా అనిపిస్తే వ్రాసిన ఆ తప్పు నాది కాదు. అలాంటి మనస్తత్వం కల్గి వుండటం కల్గి వున్నవాళ్ళు తారసపడటంగా మాత్రమే భావించాలి.

 (పాత పోస్ట్ .. పొరబాటున డిలీట్ అయింది .. మళ్ళీ ప్రచురిస్తున్నాను