16, సెప్టెంబర్ 2024, సోమవారం

దిక్సూచి

 'గంగతల్లి ఎపుడు శాంతంగా వుంటదో, ఎపుడు ఉగ్రం దాల్చుద్దో ఎవరికీ తెలియదే అమ్మి!  మన బతుకులే అటాటివి. నీ రాత అనుకోవాలి. దా! శానా పొద్దాయ. నిన్న కూడా నీవేటి సరిగా తిన్లేదు.  కూసింత అన్నం తిందరి. నీవు తింటేనే నా ఆకలి తీరిద్ది. ఈ ముసలి పేనం అర్ధం జేసుకోమ్మీ"

రాజమ్మ తన జీవితంలో ఎంతటి విషాదాన్ని దాచుకుని “మీనా” ని పెంచి పెద్దజేసిందో ఆమె కేమి తెలుసు!? సముద్రాన్ని నమ్ముకుని బతికే గంగపుత్రుల జీవితాలు ఎలా వుంటాయి? వారి బతుకీత ఎలాంటిది? 

మీనా ఎదురుచూపులు ఫలించాయా.. !? 

కథ వినండీ.. “దిక్సూచి -శారద పోరాల “ 

విశాలాక్షి సాహిత్య మాస పత్రిక నిర్వహించిన

సముద్రం కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ  వినండీ.. 





15, సెప్టెంబర్ 2024, ఆదివారం

వ్యవసాయం వొక్కటే కాదు

 Back to roots.. 

143 కోట్ల భారతదేశం.. ప్రపంచ దేశాలకు పెద్ద మార్కెట్ వనరు. కానీ మన దేశం యువత పని నైపుణ్యం పెంపొందించుకోలేక కొత్త సవాళ్ళను ఎదుర్కోలేక ప్రభుత్వ సబ్సిడీలు ప్రోత్సాహకాలు అందక.. ఉద్యోగ భద్రత లేక విదేశాలకు వున్నత చదువుల పేరిట ఉద్యోగ అవకాశాలు పేరిట విమానాలు ఎక్కుతున్నారు. 

లక్షల మంది విద్యార్థులు బిలియన్ డాలర్స్ ఫీజులు చెల్లించి విదేశీ యూనివర్సిటీ లను ఆర్ధికంగా ఆదుకుంటున్నాయి. కంపెనీలు నష్టాల్లో నడుస్తూ ఉద్యోగులను తగ్గించుకుంటూ వస్తుంది. కొత్త ఉద్యోగాలు లేవు వున్నా ఏడెనిమిదేళ్ళ అనుభవం తప్పనిసరి. ఇప్పుడు వెళ్ళిన లక్షలమంది విద్యార్దుల్లో 90% మందికి OPT లో జాబ్ దొరకడం కష్టం. H1b వచ్చినా జాబ్ రావడం కష్టం. OPT అయిపోతుంటే CPT లోకి మారతారు. మళ్ళీ ఫీజులు మోత. నాలుగైదు ఏళ్ళ నుండి USA వెళ్ళిన విద్యార్దుల్లో ఐదేళ్ళు పూర్తైనాక సగం పైగా మంది తిరిగి వచ్చేస్తారు. 

పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా.. అక్కడే చూరును పట్టుకుని వేలాడేవాళ్ళ గురించి చెప్పలేం. కానీ కొద్ది సంవత్సరాల్లో  లక్షలమంది తిరిగి వస్తారు. అది నిజం. 

రానున్న కాలం అంతా పుడ్ ఇండ్రస్ట్రీ దే! ఎందుకంటే పెరిగే జనాభాకి మారుతున్న వాతావరణ పరిస్తితులకు అనుగుణంగా ఆహార ఉత్పత్తుల ఎగుమతి కి ప్రధాన కేంద్రం భారతదేశం కావచ్చు. 

టెక్నాలజీ మనిషి పని ని సులభతరం చేస్తుందేమో మిగతా గ్రహాల మీద ఇళ్ళు కూడా కట్టిస్తుందేమో కానీ.. మనిషి పొట్ట నింపలేదు. గుప్పెడు గింజలు పండించలేదు. వ్యవసాయ ఆధారిత రంగాలకు సమశీతోష్ణ మండలమైన మన దేశం పెద్ద పీట వేసుకునే మార్గాలు బోలెడు. యువత ఆ వైపు దృష్టి సారించితే చాలా మంచిది. 

ఉదాహరణకు విదేశాల్లో రెస్టారెంట్ లో పని చేయడం కన్నా మన దేశంలో house cleaning డాట్ కామ్ పెట్టుకుని పదిమందికి పని చూపించవచ్చు. బాగా బతకవచ్చు. ఆ పనికి బోలెడు డిమాండ్ కూడా. 

ఇలా బోలెడు మార్గాలు. వెతుక్కోవాలి. 

ఏం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రా బాబూ.. పాతిక ఎకరాల పొలం మంచి ఇల్లు కోట్ల లో డబ్బు వుండి కూడా 33 ఏళ్ళు వచ్చినా పెళ్ళి కాకుండా తల్లిదండ్రుల అతి గతి పట్టించుకోకుండా.. ఇండియా వస్తే ఉద్యోగం పోద్ది ఏమో అనుకుంటూ వున్న వలసజీవుల కోసం brain drain ల కోసం, అక్కడ చాలీ చాలనీ జీతాలతో క్రెడిట్ కార్డ్ అప్పులతో hypocrisy తో బతుకుతున్న NRI ల కోసం బాధపడుతున్నాను. వారి కోసం రాజు-వెట్టి కథ రాసాను. 

బతకడానికి.. అనేక అవకాశాలు. డాలర్ కలలు కల్లలు ఇకపై. 

విదేశాలనుండి తిరిగి వచ్చిన అందరూ… వ్యవసాయం చేస్తారని చేయమని కాదు, అనేక వృత్తులు వున్నాయి. మనను చూసి ఇంకో పదిమంది అదే రంగంలోకి వచ్చినా సరే.. అవకాశాలు వుండనే వుంటాయి. పని ని గౌరవించే సంస్కృతి రావాలి మన దేశంలో. పక్క వాళ్ళతో పోల్చుకోవడం మానేసి పోటీ పడాలి. సాప్ట్వేర్ ఉద్యోగాల్లో నిత్యం కొత్త కోర్సులు నేర్చుకుంటూ అప్ డేట్ అవడం లేదూ… అలాగే! 

వ్యవసాయంలో హైబ్రిడ్ వల్ల రసాయనిక ఎరువులు గుమ్మరించడం వల్ల  మితిమీరిన పురుగుమందు వాడకం వల్లా జరిగిన జరిగే నష్టం ఇంతా అంతా కాదు. ఆధునిక వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయం చేయకపోతే భూమి పనికి రాదు. మనుషులు మాయం అయిపోతారు. ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది. మిద్దె తోటల ఉద్యమం ఈ basics మీదనే సక్సెస్ అవుతుంది. మీ ఆహారం మీరే పండించుకోండి అన్నది విలువైన concept. 

నేను కథలో చెప్పినది వ్యక్తి కేంద్రకం. అది సమిష్టి గా మారినప్పుడు ఫలితాలు ఎక్కువగా వుంటాయి. కథ కాకుంటే నవల లో అయితే ఇంకా విపులంగా చర్చ నడిచి వుండేదేమో! చూద్దాం… నవల రాస్తానేమో! 

వ్యవసాయానికి మంచి రోజులు రావాలి. వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు రావాలి. YouTube లో 

Gunapati’s Channel వుంటుంది చూడండి.. గ్రామీణ ప్రాంతం యువ జనుల స్యయంకృషిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పరిచయం చేస్తుంది ఆ చానల్. 




14, సెప్టెంబర్ 2024, శనివారం

ఓ అమ్మ కథ

 కథ చాలా బాగుంది...... తల్లి ... బిడ్డల మీద ప్రేమతో... నాటిన మొక్కలలో బిడ్డలను చూసుకుంటుంది . రైల్వే లైన్ కోసం జరుపుతున్న భూసేకరణలో కొంత స్థలము ఆ మొక్కలు పోతాయని తెలిసి దిగులు పడుతుంది. పెళ్ళై అత్తవారింటివెళ్లిన కూతురు రాలేదు . అలాగే తతిమ్మా ఇద్దరు కొడుకులు రాలేరు. బిడ్డలా కోసం ఎదురుచూస్తున్న ఆమెకు నిరాశే మిగులుతుంది. ఆఖరికి బిడ్డల్లాగా భావించే చెట్లు నేల  కూలిపోతే ఆ తల్లి వేదనకు అంతు  ఏది ? వలస వెళ్లిన బిడ్డలు ఎప్పుడో ఒకప్పుడు తిరిగివస్తారనే ఆశ గా చూసే తల్లికి వాళ్ళు రారని తెలిసినప్పుడు ..జీవశ్చవమే కదా ! గుండెలని పిండేసే బరువైన కథ.  రెక్కలు వచ్చాక అంతే ... అందుకేనేమో ..పక్షలు రెక్కలొచ్చాక పిల్ల పక్షులను పట్టించుకోవడం మానేస్తాయి

కథ వినండీ.. 




​⁠ 

13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

మనిషి -మట్టి

 కథ చదవడానికి సమయం లేదా!? అయితే వినండీ.. 

రాజు-వెట్టి -వనజ తాతినేని సరికొత్త కథ వినండీ..  

మనం కడుపుకు వొక ముద్ద తింటున్నందుకు మట్టికి దాస్యం చెయ్యాలి. మట్టి కి మనిషికి అదే విడదీయరాని బంధం. 

తల్లి గర్భం నుండి బయటపడినప్పటి నుండి తిరిగి మట్టిలో కలిసే వరకూ మట్టి తోనే అనుబంధం. ఒక బంధం విడిపోతే మరొక బంధం లతలా పెనవేసుకుపోతుంది. ఒక ఆశ నశిస్తే మరొక ఆశ చిగిరిస్తుంది. నడిపిస్తుంది. ఇదే తరతరాల జీవితం. ఇదే జీవితం. 



12, సెప్టెంబర్ 2024, గురువారం

రాజు-వెట్టి

 


కారు ఊరిని వెతుక్కుంటూ బయలుదేరింది. 

గూగుల్ మ్యాప్ సాయంతో ఊరు చేరిన చంద్ర డ్రైవర్ తో  “ఆంధ్ర దేశంలో ఊళ్ళన్నీ ఇలాగే వున్నాయా?”


“ఆ.. ఇలాగే వుంటాయండీ. రైతువారీ పద్దతి ఇప్పుడు ఎక్కడుందండీ,  జనం అంతా సిటీల్లోనే కదా వుండేది” . వివరణో ఆరోపణో అంతు చిక్కలేదు.


 “ఎప్పుడో ముప్పై ఏళ్ళ కిందట మా తాత చనిపోయినప్పుడు వచ్చాను. సరిగ్గా ఇల్లు కూడా  గుర్తు పట్టలేను.లీలగా జ్ఞాపకం. తండ్రి భూషణరావుకి ఫోన్ చేసాడు. ఎంగేజ్ వస్తుంది.  “ఎవరితోనో మాటల్లో వున్నారు. ఈలోపు  ఊరంతా తిరిగి చూద్దాం. గుడి వుంటుంది మా ఇంటికి దగ్గర్లో”  సూచన ఇచ్చాడు.  ఊరి వీధులన్నీ చుట్టేస్తుంటే అక్కడక్కడా  అరెకరంలో కాకపోయినా పది ఇరవై సెంట్ల స్థలంలో వున్న ఇళ్ళు దైన్యవదనాలతో వెలిసిపోయిన రంగులతో  ముందు వాకిట్లో జిల్లేళ్ళు మొలిచి వెనక పెరడంతా పిచ్చి చెట్లు అలవికాని తీగలు అల్లుకుని లోపలికి అడుగుపెట్టడానికి వీలుకాకుండా వున్నాయి. పరీక్షగా మనసుపెట్టి చూస్తే   దీపం పెట్టే దిక్కు కోసం అలమటిస్తూ గత జ్ఞాపకాలతో ఊపిరి పీల్చుకుంటున్నట్టు వున్నాయి. కొన్ని ఇళ్లు రేపో మాపో కూల్చివేయబడటానికి సంసిద్దంగా వున్నాయన్నట్లున్నాయి. 


మనుషులు ఈ ఇళ్ళను నిర్మించుకునేటప్పుడు  తమ భావి తరాలు  రాజ్యాలు ఏలినట్టు ఊరిని ఏలాలనుకుని ఎన్నెనో ఊహలు కలలు ఆశలతో  ఉత్సాహంతో ఇల్లు కట్టించుకుని  వుంటారు!? వందేళ్లు గడిచినా చెక్కు చెదరని ఆ ఇళ్ళల్లో వారసులు లేకున్నా సరే మనుషులైనా ఉండటం లేదు. బదులు ఎలుకలు పందికొక్కులు పాములు గబ్బిలాలు రాజ్యమేలుతూ భీతిగొల్పుతున్నాయి అనుకున్నాడు చంద్ర. 


గుడి దగ్గరకు చేరుకున్నాక.. అక్కడికి దగ్గరగా వున్న ఇల్లును గుర్తించాడు. వీధి దర్వాజాకి అటునిటూ గోడపై నిలిపిన ఎద్దుల బొమ్మలు. ఠీవిగా కనబడుతున్నా పాకుడుబట్టి నల్లబడిపోయి కళ కోల్పోయి పెచ్చులూడిపోయి గత వైభవ చిహ్నాలుగా మిగిలివున్నాయి.  దర్వాజా పక్కన నల్లటి రాతి పలక పై తాత తాత పేరు. లంకా రామచంద్రయ్య. ఆయన పేరే తన పేరు కూడా!  తరాలు మారుతూ నాగరికత అద్దుకుంటూ తన దాకా ప్రయాణించింది. దర్వాజా తలుపులు మూసి తాళం వేసి వుంది. పగలగొట్టడానికి కూడా సాధ్యపడని ఇత్తడి తాళం అది. అప్పుడు వచ్చాడు పొలం కౌలు కు చేసే తిరుమలరావు. తనను పరిచయం చేసుకుంటూ “వచ్చేటప్పుడూ ముందుగా చెప్పాల్సింది బాబూ!” అన్నాడు.


 “లోపలికి వెళ్ళడానికి వీలవుతుందా”. 

అతను గొడ్డలి కొడవలి తెచ్చి కాస్త దారి శుభ్రం చేసాక  వరండా వరకూ వెళ్ళడం వీలైంది. సింహద్వారం ముందు వున్న మెట్లపై కూర్చుని చుట్టూ పరికించాడు. రాతి పలకల్లోంచి రావిచెట్లు మొలుచుకొచ్చి మనిషి ఎత్తును దాటి కొమ్మలు విస్తరించాయి. 


“శుభ్రం చేస్తానే వుంటామండీ మళ్ళీ పుట్టుకొస్తాయి.కొబ్బరిచెట్లకాయలు మామిడికాయలు వొక్కటి మిగలనీయరండీ,గోడలు దూకి కోసుకెళ్ళిపోతారు” 

గోడలవైపు చూసాడు. ఏడడుగులెత్తు. పెదవులు విచ్చుకున్నాయి చంద్ర కి.

 

ఇల్లు లోపల కూడా చూద్దురుగాని రండి. తాళం తీసి లోపలికి నడిచాడు. మాస్క్ తగిలించుకుని లోపలికి వెళ్ళాడు. చీకటి గుహలా గబ్బిలాల నిలయం లా తోచింది. “అంతా పాడుబడిపోయిందండీ, స్థలమే కానీ ఇల్లు ఏ మాత్రం పనికిరాదు అండీ”  అభిప్రాయం వెలిబుచ్చాడు తిరుమలరావు.  ఫోన్ టార్చ్ వేసుకుని వేలాడుతున్న సాలెగూడులు తెంచుకుంటూ ఇల్లంతా తిరిగిచూసాడు చంద్ర. 


ఆజానుబాహుడు ఒంటిమీద ఎర్రమట్టి రంగు తేలుతూ  ముతకపంచె చొక్కా  పైపంచె వేసుకుని తలపాగా చుట్టుకుని లావుపాటి వెండి కడియం తొడిగిన దండ చేతిలో  చేతి కర్ర ఊతగా చేసుకుని నిలబడ్డ వృద్దుడు కళ్ళముందు కదలసాగాడు. కుడి చెవి కి కుట్టిన బంగారు కాడ దానికి వేలాడే బుళాకు  దట్టమైన కనుబొమలు  విశాలంగా వుండే నుదురు పెద్ద పెద్ద కళ్ళు కోటేరేసిన ముక్కు  గుబురు మీసాలు  నిడుపాటి గడ్డం ఎర్రని పెదవులు సాగదీసి పళ్ళన్నీ కనిపించేలా నవ్వే నవ్వు. తన వెనుక నీడలా అనుసరిస్తున్నట్టు అనిపించసాగింది చంద్ర కి.  


“ ఉరమరగా తొంబై ఏళ్ళు ఈ ఇల్లు కట్టి. నాకు అప్పటికి యాభై యేళ్ళు పై మాటే, మారేడుమిల్లి కొయ్యలగూడెం  అడవులకు వెళ్లి నల్లమద్ది టేకు చెట్లు నరికించి దూలాలు చేపిచ్చి గానుగ సున్నంతో కట్టిన ఇల్లు. ఐదుగురు కొడుకులకు ఐదిళ్ళు కట్టిచ్చా” అని ఆ మనిషి చెబుతున్నట్టు  తను విన్నట్టు వుంది అనుకున్నాడు.


 బ్లాక్ మ్యాజిక్ సినిమాలు గుర్తొచ్చి మనసులో చిన్నపాటి జంకు.దాన్ని జయించడానికి.. తిరుమలరావుతో మాట కలుపుతూ “మీ పిల్లలు ఏమి చేస్తారు అడిగాడు. “డిగ్రీ దాకా చదువుకున్నారండీ. ఉద్యోగాలు రాలేదండీ. ఆ అమెజాన్ లో స్విగ్గీ జొమాటో ల్లోను డెలివరీ బోయ్ లుగా పనిచేసి ఎదుగుబొదుగు కనబడక తిరిగి వచ్చేసారండీ. నాలుగు గేదెలను కొన్నాం. రోజుకు ఇరవై లీటర్ల పాలు అమ్ముతాం. ఒకడు ఆ పని చేస్తాడు. ఇంకొకడు మునగతోట వేసి అంచులెంట ఆర్గానిక్ కూరగాయలు పండిస్తాడండి. ఈ ఏడు మా సొంత పొలంలో రెండు ఎకరాల జెముడు మొక్కలు వేసామండీ. ఇప్పుడిప్పుడే కాయలు వచ్చాయండీ. మరో రెండు ఏళ్ళకు చేనంతా పూర్తి పంట కొచ్చేత్తది అండీ.  గర్వం తొంగిచూసింది.  తను బ్యాక్ యార్డ్ లో కూరగాయలు పండించినప్పటి సంతోషం లాంటిది వెయ్యరెట్లు పైనే కనబడింది చంద్ర కి. 


మళ్ళీ అతనే అన్నాడు. “బాబయ్యా..మీరు ఈ  ఇల్లు అమ్మాలనుకుంటే ఎవరికీ అమ్మబాకండి బాబూ! నేనే కొనుక్కొంటాను. ఏళ్ళ తరబడి మీ భూముల్ని కంటికి రెప్పలా చూసుకొన్నాను  కూడానండీ, మీఇంటి మనిషినే అనుకుని కాస్త తక్కువకే ఇయ్యాలండీ” అన్నాడు వినయంగా. 


 చంద్ర నవ్వి ఊరుకున్నాడు. 

 

“మీ బాబాయి గారితో మాట్టాడి మీరు వెళ్ళిపోయేలోపు ఇల్లు అమ్మకం ముగిచ్చేసుకుని  రిజిస్ట్రేషన్ కూడా చేయిచ్చుకుంటే పనై పోద్ది బాబూ! మీ నాన్న గారిని ఎప్పుడడిగినా అబ్బాయిని రానీ వాడు సంతకాలు చెయ్యాలిగా అని దాటేత్తున్నారు. మీరు వచ్చారుగా.. అందుకే తొందరపడుతున్నా.  మీ బాబాయి గారిని పిలిచి మధ్యవర్తులను పెట్టుకుని మాట్టాడుకుందాం”. ఈ ఇంటిని తను సొంతం చేసుకుంటే కానీ నన్ను  కదలనిచ్చేటట్టు లేడు అనుకున్నాడు చంద్ర. ఇంటి బయటికి వచ్చి చుట్టూ తిరిగి చూసి మళ్ళీ గుమ్మం ముందు మెట్టు మీద కూర్చుని ముఖం తుడుచుకుని బాటిల్ లో నీళ్ళు తాగి.. వరి పొలం, మామిడితోటకి కూడా వెళదాం అన్నాడు. 


“అలాగేనండీ.. తమరు కాఫీ టిఫిన్ పుచ్చుకున్నాక వెళదాం, మా ఇంటికి రండి” అన్నాడు తిరుమలరావు.  


“దారి మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం  తిరిగి వెళ్ళేటప్పుడు చూద్దాం. పొలానికి కారు వెళుతుంది కదా?”


“మీ పొలాలకు రాజమార్గం పడిపోయింది.” నేను బండి మీద వెళతా వుంటా మీరు మావెనకాలే రండి” దారి తీసాడతను. 


వెనుక సీట్లో కూర్చుని ఇరుపక్కలా వున్న పంటపొలాలను చూస్తూంటే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించిందతనికి.  ఖాళీ మాగాణి పొలం చూసుకుని మామిడితోటకు వెళ్లారు. మూడు రకాల ఫల భారంతో మామిడి చెట్లు ఏదో సందేశాన్ని ఇస్తున్నట్టు వున్నాయి. డ్రైవరు, తిరుమలరావు ఆవకాయ కు పనికొచ్చే కాయలు పక్వానికొచ్చిన కాయలు కోసి అట్ట పెట్టెల్లో ప్యాక్ చేసుకోవడానికి తోట లోపలికి వెళ్ళారు. కారు సీట్ సరిజేసుకుని విశ్రాంతిగా పడుకొని రెండు రోజులుగా వస్తున్న కలలను విశ్లేషించుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. నిద్ర ఆవహించింది.  మళ్ళీ  చెవి పక్క గుస గుస వినిపించింది. ఆ చెవి పోగు వున్న మనిషే.గంభీరమైన ఆ గొంతు లో వేదన పొంగిపొర్లుతా వుంది.


“అనిమనుమడా! మా అప్పుడు చెరువు పక్కగా వుండేవి ఈ ముదిరాజుల ఇళ్ళు.ఇప్పుడు ఊరంతా విస్తరించాయి. రైతు కుటుంబాలు వ్యవసాయం వొదిలేసి పోతే  ఆ పొలాలను నమ్ముకుని వ్యవసాయం చేస్తూ పాడి పంటలు ఊతగా చేసుకుని వాళ్ళిప్పుడు మన ఇళ్ళను పొలాలను కొనుక్కోగల స్థితిమంతులు అయ్యారు. మన వాళ్ళేమో బియ్యం దొరకని దేశంలో ఏవేవో తిని సర్దుకుంటున్నారు. సత్యం చెబుతాను వినుకో, ఎప్పుడైనా భూమి ఉన్నోడిదే రాజ్యం. పంట పండించిన వాడికే నోట్లోకి నాలుగువేళ్ళు వేళ్ళే కాలం మళ్ళీ వస్తుంది చూడరా! నేను చెప్పేది నిజం అవుద్ది. రాసి పెట్టుకో.  కాస్తో కూస్తో వున్న భూమిని ఇల్లును అమ్మవొద్దు రా తండ్రీ!” అభ్యర్ధన. 


మళ్ళీ.. ఆ గొంతే.. “అదిగో కనబడుతున్న పాటిదిబ్బలన్నీ వొకప్పుడు మనవే!  పొగాకు వేసేవాళ్ళం. బాయి నీళ్లతో మోట తోలి తోట తడిపే వాళ్ళమి. అదంతా నా కొడుకులకి పంచి ఇస్తిని. వాళ్ళు వాళ్ళ కొడుకులికి అప్పజెప్పితిరి. అందరూ అమ్ముకుని పోయారు. నా మనుమడి కూతురు అదే మీ పెద్ద తాత కూతురు. చర్చికి రాసి ఇచ్చింది ఆ స్థలం. ఆ పక్కనే మీ తాతకిచ్చిన స్థలంలో దేవుడి బండలుండేవి. వినాయకుడు సుబ్రహ్మణ్యస్వామి అమ్మవారు అయ్యవారు అంతా వుండిరి. వారికి కప్పు లేకుండే. ఎన్ని తరాలుగా అట్లా వుండిదో నాకు తెలియదు. పట్టించుకునే నాధుడు లేకపోతే గుడి ఏంటి ఇల్లేంటి అన్ని శిథిలమే!  ఆ శిథిల శిల్పాలు ఎక్కడెక్కడ వాళ్ళో ఎవరెవరో వచ్చి ఎత్తుకుపోయే. ఇప్పుడు ఆ భూమి లేకపోయే. ఒకప్పుడు బొడ్రాయి మన ఇంటి వెనక వుండేది. ఇప్పుడు దక్షిణపు పక్క ఊరంతా కాలగర్భంలో కలిసిపోయే! నేను పోతిని నా కొడుకులు పోతిరి వాళ్ళ కొడుకులు మూడొంతులు పోతిరి. ఊరొదొలి పోతిరి నగరం వొదిలి పోతిరి దేశం వొదిలి పోతిరి.  అట్టా పోయినవాళ్ళు ఎప్పుడో వొకసారి వొచ్చి ఉన్న కాసిని భూముల్ని ఇళ్ళని అమ్మకుంటింటిరి. ఇంకా అమ్ముకోవడానికి నీలా ఊరికి వస్తిరి. నాకు మనసంతా గింజుకుంటది. దుఃఖం తడిపేస్తది.” ఆ మనిషి పొగిలి పొగిలి ఏడుస్తున్న శబ్దం, కట్టవేయలేని దుఃఖం.కట్టడి చేయలేని దుఃఖం. గుండెని మెలిపెడుతున్న దుఃఖం.


“మనుమళ్ళు, ముదిమనుమళ్ళు, అనిమనుమళ్ళు నగరాల్లో మహా నగరాల్లో విదేశాల్లో తలదాచుకోవడానికి ఇంత నీడ కోసం  నేల విడిచి సాము చేస్తూ గజాల్లో తమను తాము ఇరికించుకుంటూ పాతిక ముప్పై ఏళ్ళు బ్యాంక్ లకు తమను తాము తాకట్టు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఈ ఇళ్ళన్నీ ఏం కావాలి, ఈ భూములు ఏమి కావాలి!?  నేనూ, పంచపాండవుల్లాంటి నా కొడుకులు ముప్పొద్దులా రెక్కలు ముక్కలు చేసుకుని  అరక దున్ని ఆరుగాలం కళ్ళలో వొత్తులేసుకుని పంట పండించి కొండపల్లి నవాబులకు సగం పైగా శిస్తులు కట్టితిమి. మిగిలినయ్యే పొతింగా సర్దుకుంటూ పాలు అమ్మి పెరుగు అమ్మి నెయ్యి అమ్మి పిడకలమ్మి గంజి తాగి కాణీ కాణీ కూడబెట్టి దివాణం వాళ్ళదో అగ్రహారం వాళ్ళదో భూముల్ని కొని సాగుజేస్తిమి. కష్టపడి నూట యాభై ఎకరాలు చేస్తిమి.నాలుగక్షరాలు చదువుకొని వచ్చి మీ ఎకరాలు  మీరు సాగు చేసుకోమంటిమి. చదువు చంకనేసుకుని మనవళ్ళు ఊరు దాటెల్లి వాళ్ళ  పిల్లల చదువుల కోసమని వ్యాపారం కోసమని భూములని అవగ్గా అమ్ముకుంటురి. “ 


“ఇక్కడ పండించే వాడు లేక భూమాత పిక్కటిల్లుతుంది. అవగ్గా ఈ భూములన్నీ అమ్ముకుని పోయి ఒక ఐదారు సెంట్లలో ఇల్లు కొంటావ్.. ఈ మట్టిని అమ్ముకుని పోయి అక్కడ మట్టిని మనసారా హత్తుకుగోలవా? నీకో సంగతి తెలుసా!  మట్టికి మనిషికీ ఎగతెడని బంధం. మునిమనుమడి కొడుకా!. నీ పూర్వీకులెవరని నీ బిడ్డలు అడిగితే నువ్వు తడుముకోకుండా సమాధానం చెప్పగలవా? వాళ్ళు నడయాడిన నేల ఇది అని గర్వంగా చెప్పగలవా? చూపగలవా? 

నేను కూడా మూడవ తరగతి చదువు చదివినాను లే! అప్పుడప్పుడు దొరలతో కూడి షికారికీ పోయేవాణ్ని. మైలారం నాటక సమాజం లో నాటకాలు ఏసినాం చూసినాను.ఇంగ్లీషు రవ్వొంత తెలుసు నాకు.


“మనిషి అంటే what about అంటే నీకెన్ని భాషలు వచ్చు ఎన్ని డిగ్రీలు చదివినావు ఎన్ని కోర్సుల్లో ప్రావీణ్యం సంపాదించావు అన్నదే కాదు.. నువ్వు పుట్టిన దేశం నువ్వు ఆడిపాడిన నేల నీ పూర్వీకులు ఎవరు? వారి వృత్తి ఏమిటి, మీ ఆచారాలేమిటి? అన్నవి కూడా! మనిషి అంటే ఏడు తరాల సంస్కృతి. అది నీ రక్తంలో ప్రవహిస్తూ వుండాలి. తిండికి గడవకపోతే  వలసలు పోవాలి. మితిమీరిన కోర్కెలతో పోయి అవస్థలు పడకూడదు.ఆడ చానామందికి నిలవ వీడలేదు చేయడానికి నౌఖరీ లేదు అంట. ఆ అరకొర బతుకులు మీకెందుకు నాయనా!”


“ఆన్లైల్ చదువులు ఆన్లైన్ ఉద్యోగాలు ఒళ్ళొరగని పనులు రకరకాల పైత్య వాత రోగాలు. ఇతర దేశాల నుండి కొనుక్కొచ్చిన దినుసులు ధాన్యాలు ఫ్యాక్టరీ పాలు కొనుక్కొని తింటూ తాగుతూ మీరంతా ఆ శీతల దేశంలో ఏం సంతోషంగా వుండినారు చెప్పు. నువ్వు నీ బిడ్డల్ని తీసుకుని ఊరికి వచ్చేయ్ రా అయ్యా! ఇక్కడ  మూడు కాలాలు ఆరు బుుతువుల గొడుగులో వుండటానికి ఇల్లు దున్నుకోవడానికి నేల తాగడానికి స్వచ్ఛమైన నీరు నీ బిడ్డలకు చదువుకోవడానికి బడి గుడి అన్నీ వుండాయి. పరాయిచోట అస్థిమితంగా బతికే బతుకు నీకెందుకు రా అయ్యా! మనం కడుపు కి వొక ముద్ద తింటున్నందుకు మట్టికి దాస్యం చెయ్యాలి. మట్టి కి మనిషికి అదే విడదీయరాని బంధం.  అనిమనుమడా! నా బంగారు తండ్రీ! నువ్వు నీ మూలాల్లో సద్దుకుని చల్లంగా వుండరా! ఈ భూముల్లో పంట పండించుకుని తృప్తిగా తినండి. తరాలు తరాలు చల్లగా వుండండి. నువ్వు తిరిగి రాకపోతే నా ఆత్మ క్షోభిస్తూనే వుంటది. క్షోభిస్తూనే వుంటుంది.అది గుర్తుంచుకో..నే పోతన్నా బిడ్డా! పోతున్నా.”


వీపు పై కొరడా ఝళిపించినట్లై ఉల్కిపడి మేలుకున్నాడు చంద్ర. టైమ్ చూసుకున్నాడు. గంటన్నర పైనే అయింది తను విశ్రమించి. కల గన్నట్టు లేదు. ఎవరో తన పక్కనే కూర్చుని మాట్లాడిపోయినట్లు వుంది. వాటర్ బాటిల్ తీసి సగం పైనే గటగటా తాగేసాడు. కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు.  తిరుమలరావు డ్రైవరు మామిడికాయల బాక్స్ లు డిక్కీ లో నింపుతున్నారు. మండించే ఎండ బదులు ఆకాశమంతా నల్ల  మేఘాలు వొక దానితో వొకటి అల్లుకుంటున్నాయి. చిక్కుముడులు వేసుకుని విడదీసుకోవడం కుదరదన్నట్లు మెరుస్తూ ఉరుముతూ  కాసేపు కుండపోత  కురిసి బరువును తగ్గించుకుని అంతలోనే తేలిపోయాయి. చంద్ర మనసులో తిష్ద వేసుకుని మెదడులో రూపుదిద్దుకున్న ఆలోచనల మేఘాలు మాత్రం ఇంకా బరువెక్కి వున్నాయి


తిరుమలరావు ఇంటి దగ్గర ఆగి ..టీ తాగి హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమైనారు. మధ్యలో విజయవాడ కు వెళ్ళి ఇల్లు బేరం కుదర్చమని గుర్తుచేసాడు తిరుమలరావు. బాబాయి ఇంటికి వెళ్లాడు. ఆత్మీయతలు పంచుకుని అతిథి మర్యాదలు అయ్యాక ఇల్లు అమ్మాలనుకున్న సంగతిని బాబాయ్  తనే ప్రతిపాదించాడు. “మీ నాన్న వ్యాపారాలు చేసి సంపాదిచ్చాడు.నాకేం వుంది?  పెన్షన్ మీద బతుకుతున్నాను. ఆడపిల్లలకు భారీగా పెళ్లిళ్లు చేసి అంతా అమ్ముకుంటిమి. రోగానికి రొష్టు కి డబ్బు కావాలి గా. వెంటనే అమ్మేద్దాం” అన్నాడు. అలాగే బాబాయ్ ! నాన్నను తీసుకుని వచ్చే వారంలో మళ్ళీ వస్తాను” అన్నాడు చంద్ర.


ఇంటికి చేరాక భూషణరావుకి  చెబితే “ఇప్పుడెందుకురా అమ్మడం, ఆంధ్ర కు ఔటర్ రింగ్ రోడ్డు వచ్చిందిగా. దానికి లోపల్నే వుంది మన ఊరు. ఇప్పుడొద్దులే!” అన్నాడాయన. ఆ మంచి రేటేదో ఇప్పుడే వస్తుంది. నా  ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుండే. వాడికి అప్పజెబుదాం. మీ అన్నదమ్ములిద్దరూ కలిపి మాట్టాడుకోండి అని పురమాయించాడు. 


ఆ రాత్రి చంద్ర  భార్య లత తో మాట్లాడుతూ పల్లె విశేషాలు చెప్పసాగాడు. అతని మాటల్లో సంతోషాన్ని గ్రహించింది.  ఆలోచనల లోతును పసి గట్టింది.


“రిటన్ వచ్చేద్దాం అనుకుంటున్నా! నువ్వేమంటావ్”లతా?” అడిగాడు.


“ ఆ…ఇక్కడ మాత్రం ఏముంది లెద్దూ! స్వేచ్ఛగా బతుకుదామనుకుని వచ్చి ఏడాదిలో సగం రోజులు అడుగు బయటకు వేయకుండా నాలుగు గోడలకు బందీ.  అయిన వాళ్ళందరిని వదిలేసుకుని ఇక్కడ బానిస బతుకుతున్నాం. ఎప్పుడు ఊడిపోద్దో తెలియని ఉద్యోగం  విపరీతమైన వర్క్ లోడ్. జూబ్లీ హిల్స్ లో పుట్టి పెరిగిన కోటీశ్వరుడి కూతుర్ని అన్నమాటే కానీ ఇక్కడ గొడ్డు చాకిరీ తో చచ్చిపోతున్నా. రొటీన్ లైఫ్. వెనక్కి వెళ్లిపోదాం అనిపిస్తుంది నాక్కూడా” అంది విసుగ్గా..  


“నిజం కదా లతా! వచ్చిన జీతం అంతా ఇంటి కోసం కారు కోసం తీసుకున్న అప్పులు కట్డడానికి, మెడికల్ ఇన్సూరెన్స్లు  క్రెడిట్ కార్డ్ లకు సరిపోయే! ఐదు రోజులు పని రెండురోజులు ఇంటికి కావాల్సినవి తెచ్చుకోవడంతో సరిపోధ్ది. అదీ కాక  ఎప్పుడు ఎక్కడ గన్ పేలిన చప్పుడు వినబడుద్దేమోనన్న భయం. పక్క నున్న వాడిని నమ్మలేని భయం. కొంతమందికి కొందరంటే ఇష్టంలేదు. ఆ కొందరికి మనలాంటి వారిని చూస్తే ఇష్టం లేదు.దాడులు దోపిడీలు తిరస్కారమైన చూపులు.H1b ముద్ర వేయించుకున్న బానిసలం అనిపిస్తుంది. వద్దు, ఇవన్నీ వద్దు. వచ్చేద్దాం. ఈ ఒత్తిడితో కూడిన జీవితం మనకి వొద్దు. మనుషుల అవసరాలు తీర్చే డాలర్ లు సంపాదిస్తున్నాం అన్నమాటేగానీ..  మన మానసిక అవసరాలన్నీ మన నేల తోనే ముడిపడి ఉంటాయి అని నాకు బాగా అర్ధమవుతుంది. నీతో డిస్కస్ చేసాక కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నాను.  నువ్వు వొప్పుకున్నావ్ థాంక్యూ డియర్”  మనఃస్పూర్తిగా అన్నాడు చంద్ర. 


వారం రోజుల తర్వాత అనుకున్న దానికన్నా ఎక్కువ ధరకు ఇల్లు అమ్మకం జరిగిపోయింది. అన్నదమ్ములిద్దరూ డబ్బు పంచుకున్నారు. రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్ పై  పేరు చూసి అన్నదమ్ములిద్దరూ ఆశ్చర్యపోయారు.ఎల్ ఆర్ చంద్ర సన్నాఫ్ భూషణరావు. 


“ఇది తాత ముత్తాతల ఆస్థి. ఎవరికో ఎందుకు అమ్మడం? అది నాక్కావాలి. నేను తిరిగి వచ్చేస్తున్నాను.ఈ ఊరిలోనే వుంటాను” అన్నాడు చంద్ర. భూషణరావు కొడుకు వైపు విసుగ్గా చూసాడు. తిరుమలరావు ముఖం మాడ్చుకున్నాడు.బాబాయి భార్య ధర తక్కువకు ఇచ్చేసారు అని గోలచేసింది. మేనత్తలు మేము పుట్టి పెరిగిన ఇల్లు పరాయి  పాలు కాలేదని సంతోషించారు. 


నెల రోజుల్లో లతా పిల్లలిద్దరూ హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడే పిల్లలిద్దరికీ స్కూల్‌ అడ్మిషన్ తీసుకున్నారు.  చంద్ర రిమోట్ జాబ్ చేస్తూనే.. దగ్గరుండీ ఇల్లు బాగుచేయించుకున్నాడు.  ప్రతిరోజూ గుడికి వెళ్ళి ఇలవేల్పు పట్టాభిషిక్త రామచంద్రుడిని దర్శించుకుని  ఆధునిక వ్యవసాయం చేసుకునేందుకు శక్తినిమ్మని కోరుకున్నాడు. లత ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి ఉవ్విళ్ళూరుతుంది.వివరాలు సేకరిస్తుంది. 


తనకు కలలో కనబడిన పెద్దమనిషి చిత్రాన్ని గీయించుకుని  ఫ్రేమ్ చేయించుకుని వచ్చాడు చంద్ర. వెలుగులు విరజిమ్మే ఇంట్లో హాల్లో ఆ చిత్ర పటాన్ని పెట్టించాడు. జీవకళ ఉట్టిపడుతూ వున్న ఆ చిత్రపటాన్ని చూసి “ఎవరు డాడీ ఈయన !? అని అడిగాడు చంద్ర కొడుకు. “మా తాత తాత ఆయన. నేను ఐదవతరం వాడిని, నువ్వు ఆరోతరం, ఏడో తరం కూడా ఈ నేల పైనే వర్ధిల్లాలి” అన్నాడు ఆలోచనల్లో ఆశలు అల్లుకుంటూ. కల యో నిజమో భ్రాంతి యో… ఏదో వొకటి  తనలో నిబిడీకృతమైన ఆలోచనలు ఇలా వాస్తవరూపంలో సాక్షాత్కరించడం  ఏనుగెక్కినంత ఆనందంగా వుంది చంద్ర కి.


“మా తాత కూడా ఇదే పోలికల్తో వుండట్టు జ్ఞాపకం వుందిరా అబ్బాయ్!” అన్నాడు భూషణరావు. వ్యాపారంలో పండిపోయిన మనిషి. కొడుకు కోసం తమ వారసులు అమ్ముకున్న భూములను కొనడానికి ప్రయత్నిస్తున్నాడు.చంద్ర తల్లి మణి పెద్దలు కలలో కనబడుతున్నారంటే వారిని మనం మర్చిపోయామని. అమావాస్య రోజున పితృ తర్పణాలు వొదలాలి అని అన్నదమ్ములిద్దరినీ హెచ్చరించింది. తిరుమలరావు అతని కొడుకులిద్దరూ పిలిస్తే పలకడానికి సిద్దమైపోయారు. చంద్ర వారి అభివృద్ధికి సాయం చేస్తానని మాటిచ్చాడు. 


ఆ రాత్రి  బహుళ పంచమి మసక వెన్నెల్లో ఆరుబయట నులక మంచంపై పడుకుని.. కనీ కనబడని నక్షత్రాలను వెతుకుతూ..తన పూర్వీకులను తల్చుకున్నాడు. “నాన్న ముత్తాతా! అని తాతా!  ఇదిగో చూడు, నువ్వు కోరుకున్నట్టే మన ఇంటికి వచ్చేసాను. నువ్వు చెప్పినట్టు తల్లి గర్భం నుండి బయటపడినప్పటి నుండి తిరిగి మట్టిలో కలిసే వరకూ మట్టి తోనే మనిషికి అనుబంధం. ఒక బంధం విడిపోతే మరొక బంధం లతలా పెనవేసుకుపోతుంది. మళ్లీ  ఆ బంధం విడిపోతుంది. ఒక ఆశ నశిస్తే మరొక ఆశ చిగిరిస్తుంది. నడిపిస్తుంది. ఇదే తరతరాల జీవితం. ఇదే జీవితం అని నాకర్ధమైంది”. అన్నాడు. 


ఊరి వారందరూ దారిన వెళుతూ ఆ ఇంటి వీధి ద్వారానికి ఒక వైపు నల్లని గ్రానెట్ రాయిపై బంగారు రంగులో మెరుస్తున్న  “లంకా రామచంద్రయ్య నిలయం” రెండో వైపు పలకపై  “అనిమనుమడు లంకా రామచంద్ర” అనే పేర్లతో ముచ్చటగొల్పుతూ  కళకళలాడుతున్న ఆ ఇంటిని చూస్తూ మా పిల్లలు కూడా వెనక్కి వచ్చేస్తే బాగుండ్ను అనుకుంటారు. వాళ్ళ ఆశలు బిడ్డల ఎత్తుకు ఎగురుతాయో లేదో కాలమే చెప్పాలి. 


*********************సమాప్తం***********************







10, సెప్టెంబర్ 2024, మంగళవారం

నీట చిత్తరువు

 నువ్వు చెప్పిందంతా ప్రేమంటావా?" ఎంత వద్దనుకున్నా నామాటల్లో కఠినం.

"ప్రేమో కామమో ఆయన్నీనాకు తెలియదు. ప్రేమంటే ఈడుకి సంబంధం లేదు. ఈడు జారిపోయాక ఆ ప్రేమ కూడా వానకి తడిసిన ఆకు మీద మురికిలా కారిపోతుందంటే నేను వొప్పుకోను. చిన్నప్పుడు నుండి అతను నా మనసులో వుండాడు. నా మనసుదాకా వొచ్చినాడు నా వొళ్ళంతా కమ్ముకున్నఅతనొక్కడే, అదంతా కాదుకానీ బాగా అర్ధమయ్యేలాగా చెపుతా ఇనుకో, నా కాలి చిటికెనేలు గోరు నుండి నా తల్లో వెంట్రుక చివరిదాకా నిండి వున్నోడు నేను చచ్చేదాకా నాతో వుండేవాడు అతను ఒక్కడే. పెపంచమంతా వందనుకోనీ వెయ్యి రాళ్ళేయనీ.. అతనే నా దృష్టిలో మగోడు. అతనే నా మొగుడు" అంది.

నారాయణమ్మ వైపు అయోమయంగా చూసాను



7, సెప్టెంబర్ 2024, శనివారం

దేవుడా కాపాడు

 దేవుడా కాపాడు -శశాంక్ సీతారాం

కొంకణీ మూలం:అనువాదం:శిష్టా జగన్నాథరావు. 

మహేశ్ పాఠశాల విద్యార్ధి. ఆ పసి మనసులో  ఓ కోరిక. ఎొందుకు ఆ పిల్లవాడు అలాంటి కోరిక కోరాడు!? దేవుడా.. కాపాడు అని పదే పదే ప్రార్ధించాడు? 

కథ వినండీ.. 



6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

తృతీయ ప్రకృతి

 తృతీయ ప్రకృతి -వనజ తాతినేని

 "అమ్మా నే చెపితే వినవేమ్టి ! నేను ఇప్పుడు మధు ని కాదు, మధుబాలని . నేను అమ్మాయిగా మారిపోయి మూడేళ్ళు అయింది మీరందరూ ఇప్పుడిట్టా మదూ మధూ...   అని పిలుస్తా ఉంటే నాకు ఎలర్జీ ! నేను అమ్మాయిని మధుబాల అని పిలువు " చెప్పింది ఆమె 

చేతిలో ఉన్న కొత్త పేంటు చొక్కాని విసిరి పారేసి “నా ఖర్మ రా.. పుట్టినప్పుడు మగ లంజ కొడుకువుగానే పుడితివి గదరా,పదేళ్ళు వచ్చేదాకా తాడిచెట్టుని నిలబెట్టినట్టు నిలబెట్టి నేనే నీళ్ళు పోసినాను కదరా! గడ్డలు మీసాలు వచ్చినాయి ఇంకా నువ్వు ఆడగా ఉండింది ఎక్కడరా .."  అడిగింది . 

" నేను బొంబాయిలో ఆడదానిగా మారిపోయా .." చెప్పింది 




5, సెప్టెంబర్ 2024, గురువారం

వియోగాంతే

 End of separation

వియోగం అంతమైందా!? అనంత వియోగంతో శారద జీవితం తెల్లారిపోయింది.

కొందరు రచయితలు కథ ను చంపేసి శాశ్వతంగా బతికివుంటారు. అలాంటి కథ ఇది. తప్పకుండా వినండి.  




4, సెప్టెంబర్ 2024, బుధవారం

కల్మషాలు కరుగుతాయా?



కొండలు బ్రద్దలై పిండి పిండి గా మారి ఇసుకరేణువులుగా మారిపోతున్నాయి.మట్టి కరిగిపోతుంది. ఉన్నట్టుండి మనషులు మాయమైపోతారు.కానీ మనుషుల మనస్సల్లోని కల్మషాలు కరిగిపోవడంలేదు. విచిత్రంగా మనుషుల మనస్సుల్లోని కల్మషం కరిగిపోయిన రోజు వొకటి వుంటుంది. అది వరద వచ్చినరోజు. ఆ వొక్కరోజే ఆ వూరి మనుషులందరూ కులం జాతి మతం అన్నీ మర్చిపోయి కలసి మెలసి వుంటారు. మర్నాడు మళ్ళీ మాములే! మనుషుల కల్మషాలు కరగాలంటే రోజూ వరద రావాల్సిందేనా.. అభద్రతా భావంలో నుండి పుట్టిన వైరాగ్యం ఆ వొక్క రోజే ఆ ఊరి వారందరినీ కలిపి వుంచగల్గుతుందా!? ఆలోచింపజేసే కథ. తప్పక వినండీ..

మనుషుల మనసు మురికిని ప్రక్షాళనం చేసే ప్రళయం రాలేదు కాబట్టి మనిషి మురికిగానే వున్నాడు. 

ది స్పేట్ అనే పేరుతో శ్యామ్ బెనగల్ ఈ కథ ను దూరదర్శన్  కోసం చిత్రీకరించారు.

వరద- సత్యం శంకరమంచి (అమరావతి కథలు నుండి) 




3, సెప్టెంబర్ 2024, మంగళవారం

కులట

 సంఘంలో మర్యాదస్తుల్లా మెలిగే నికోలై పెట్రోవిచ్ కోల్పకోవ్ లాంటి వ్యక్తులు అతని భార్య లాంటి వారు అనేకులు. పాపం!! పాషా లాంటి స్త్రీలు.. అవమానంతో దుఃఖిస్తూ వుంటారు. ఈ కథ లో ఎవరు కులట!? ఈ కథ కు అనువాదకులు సరైన శీర్షిక ను ఇవ్వలేకపోయారనిపించింది. ఆంగ్లంలో The Chorus Girl. రష్యన్ భాష లో ఏం శీర్షిక వుందో దానిని బట్టి “కులట” శీర్షిక పెట్టి వుండవచ్చు. కానీ ఈ శీర్షిక నాకు నచ్చలేదు. 

“వంచన” అనే శీర్షిక సరైనది అనిపించింది. Anton Chekhov  “ The Chorus Girl “ వినండీ… 



2, సెప్టెంబర్ 2024, సోమవారం

విజయవాడ వరద కు కారణం

 


ఎక్కడో ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దులలో కొండప్రాంతలలో పుట్టిన బుడమేరు..

A.కొండూరు,మైలవరం,జి.కొండూరు మండలాల గుండా విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలోకి ప్రవహిస్తుంది..

బుడమేరుకి రెడ్డిగూడెం నుండి కోతుల వాగు,జి.కొండూరు మండల గంగినేని నుండి పులివాగు,(మా ఇంటి పక్క నుండి వెళ్ళుతుంది)మునగపాడు(మా గ్రామం)నుండి బీమ్ వాగు,CH మాధవరం నుండి లోయవాగు,గడ్డమణుగు లోయప్రాంతం నుండి దొర్లింతలవాగు ఉపవాగులుగా ఉన్నాయి..


సరిగ్గా 20ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది. వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది. 20ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో దానికి మూల్యం నేడు చెల్లించుకుంటున్నారు. 20ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. ముఖ్యంగా 2019 నుండి జగన్ పాలనలో వైకాపా నాయకుల కబ్జాకి బలైంది బుడమేరు..అసలు బుడమేరుతో విజయవాడ మునకకు ముఖ్య కారణం YS రాజశేఖర్ రెడ్డి..


విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానదికంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా దానికి ముప్పు పొంచి ఉంది.2005లో చివరి సారి బుడమేరు బెజవాడ పుట్టిముంచింది. 2005సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపుకు గురైంది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్‌ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువున ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది.


ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్‌లో గరిష్టంగా 11వేల క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70వేల క్యూసెక్కులకు చేరింది. బుడమేరు ప్రవాహాన్నినియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్‌ను కూడా 70వ దశకంలో నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్‌ మీదుగా నగరంలోకి ఇది ప్రవేశిస్తోంది.


2005లో వచ్చిన వరదలకు కారణాలను వివరిస్తూ దేవినేని ఉమామహేశ్వరరావు గారు,సీపీఐ అనుబంధ రైతు సంఘం నాయకుడు కొల్లి నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం చూపకపోతే కృష్ణా జిల్లాకు ఎప్పటికీ ముంపు పొంచి ఉంటుందని ఆందోళనకు దిగడంతో ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి స్వయంగా విజయవాడ వచ్చారు. విజయవాడలో ఉన్న వరద పరిస్థితి మొత్తాన్ని ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు. బుడమేరు ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే దానిని మళ్లించడం ఒక్కటే మార్గమని భావించారు.

పోలవరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలో కలిపే డిజైన్ అప్పటికే ఖరారైంది. బుడమేరు ప్రవాహానికి దిగువన పోలవరం కుడికాల్వ కృష్ణానదిలో గుర్తించి అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని అధికారులకు నాటి సీఎం వైఎస్సార్‌ సూచించారు. విజయవాడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపులు సరి చేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూస్తామని, వరదల్లో నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్నకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


పోలవరం కుడి కాల్వ నిర్మాణంలో భాగంగా 2007-08 నాటికి బుడమేరు దిగువ ప్రవాహాన్ని కుడి కాల్వలోకి మళ్లించారు. కొత్తగా మరో కాల్వను తవ్వకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్‌ నుంచి వచ్చే జలాలను కృష్ణా నదిలో కలిపే కాల్వలోకి మళ్ళించారు.ఇక్కడే సాంకేతికంగా ఓ సమస్య తలెత్తింది. పోలవరం కుడి కాల్వను గరిష్టంగా 37,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు.


విటిపిఎస్‌ మీదుగా ప్రవహించే కాల్వలకు అంత సామర్థ్యం లేదు. వాటిని వరద ప్రవాహానికి అనుగుణంగా పెంచాలని ప్రతిపాదనలు ఉన్నా, థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ లోపల కాల్వలను విస్తరించే పరిస్థితి లేకపోవడంతో బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాల్వల సామర్థ్యం పెరగలేదనే వాదన ఉంది. దీనికి తోడు కృష్ణానది ముఖ ద్వారంలో ఉన్న నిర్మాణాలు కూడా వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.


విటిపిఎస్‌ నుంచి కృష్ణా నదిలోకి బుడమేరు వరద నీరు చేరాలంటే కృష్ణానదిలో నీటి మట్టం తగిన స్థాయిలోఉండాలి. కృష్ణా నదిలో ఎగువ నుంచి వరద కొనసాగే సమయంలో బుడమేరు నుంచి వచ్చే వరద ప్రవాహం నదిలోకి చేరదు. అదే సమయంలో పోలవరం కుడి కాల్వ నుంచి నీటి విడుదల కొనసాగితే వరద ప్రవాహం దిగువన విజయవాడ వైపే వెళ్లాల్సి ఉంటుంది.


20ఏళ్ల నిర్లక్ష్యానికి మూల్యం....

20ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో విజయవాడ నగరంలో న్యూ రాజరాజేశ్వరి పేట, సింగ్‌నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. రోజుల తరబడి ప్రజలు వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. బుడమేరుకు వెలగలేరు రెగ్యులేటర్ దిగువన మళ్లింపు చేపట్టగానే విజయవాడకు వరద ముంపు తప్పిపోయింది.


2008 నుంచి విజయవాడ రూరల్‌ మండలంలో వేగంగా నిర్మాణాలు విస్తరించాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా నగరంలో మరో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం పరిధిలో న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్‌టెన్షన్‌, నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి. అంతకు ముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతమనే సంగతిని పూర్తిగా విస్మరించారు.


2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కిన సంగతి కూడా ప్రజా ప్రతినిధులు విస్మరించారు. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. సుందరీకరణ పేరుతో నగరానికి రక్షణగా ఏర్పాటు చేసిన వ్యవస్థల్ని రాజకీయ నాయకులు యథేచ్ఛగా ధ్వంసం చేశారు. కాలనీలకు కాలనీలను విస్తరించి నివాస ప్రాంతాలను విస్తరించడంలో 2009 నుంచి విజయవాడలో ఎన్నికైన ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్,వైసీపీలకు ఇందులో ఎక్కువ భాగస్వామ్యం ఉంది.

బుడమేరు ఉగ్రరూపం దాల్చినపుడు నీటి ప్రవాహానికి అనుగుణంగా పలు చోట్ల మలుపులు ఏర్పడ్డాయి. రెండు, మూడు దశాబ్దాల క్రితం నాలుగైదేళ్ల క్రితం బుడమేరుకు వరదలు వచ్చినా పంట పొలాలు మాత్రమే నీట మునిగేవి. బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఊళ్లను ముంచెత్తుతున్నాయని, విజయవాడ, నిడమానూరు ప్రాంతాల్లో ఉన్న “యూ ” టర్నింగ్‌లను సవరించాలని 20ఏళ్ల క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది.


బుడమేరును ఆక్రమణల నుంచి విడిపించి దాని గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించాలని ప్రతిపాదించారు. విజయవాడ మార్కు రాజకీయం ఆ పనుల్ని అడ్డుకుంది. ఇళ్లను తొలగిస్తే ఊరుకోమని హెచ్చరించడంతో ప్రభుత్వం కూడా వదిలేసింది. ఇదే అదనుగా బుడమేరును యథేచ్ఛగా ఆక్రమించేశారు. ఇక విటిపిఎస్‌ నుంచి ప్రవహించే వరద ప్రవాహ మార్గంలో ఉన్న నిర్మాణాలు కూడా విజయవాడ ముంపుకు కారణమవుతున్నాయి. వాటిని సరిచేసే సంకల్పం ఏ పార్టీకి లేకపోవడమే ప్రస్తుత పరిస్థితి కారణమైంది.


ప్రపంచంలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సుకు నీటిని అందించే నీటి వనరుల్లో బుడమేరు ఒకటి, పశ్చిమగోదావరిలో తమ్మిలేరు, ఎర్రకాల్వలతో పాటు కృష్ణాలో బుడమేరు కొల్లేరుకు ప్రధాన నీటి వనరుగా ఉంటుంది. కొల్లేరులో వరద ప్రవాహాన్ని స్వీకరించకుండా ఆక్రమణలతో నిండిపోవడంతో వరదలు దిగువకు చేరడంలో జాప్యం జరుగుతోంది. ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రవహించే వర్షపు నీరంతా బుడమేరు ద్వారా 170కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి కొల్లేరును చేరుతుంది.


విచిత్రం ఏముంటే పగలు కూడ పరదాలతో తిరిగినోడి భజన బృందం గాళ్ళు..Z + కేటగిరి 70 సంవత్సరాల నవయువకుడు ప్రజలలో తిరుగుతుంటే వెటకారం చేయడం.

సేకరణ. శీలం శేషురెడ్డి Facebook వాల్ నుండి.