18, ఆగస్టు 2025, సోమవారం

ముందు మాట

 దుఃఖపు రంగు  కథా సంపుటి ఈ లింక్ లో లభ్యం అవుతుంది. 


https://amzn.in/d/0MAJEhL



“దుఃఖపు రంగు” కథా సంపుటికి ముందు మాట రాసిన వారు “పద్మజ సూరపురాజు “ 

వారికి.. హృదయ పూర్వక ధన్యవాదాలు. 🙏

ఇందులో 24 కథలు వున్నాయి. కథా ప్రేమికులు ఈ పుస్తకాన్ని చదివండి.. 👍😘


‘Close-up’ ఇరానియన్ సినిమా లో ఒక పేదవాడి నోట్లోంచి వస్తుందొక మాట, “ పుట్టిన ప్రతి ఒకరికీ వారి భావాలను వ్యక్తం చేయాలనీ, తన గొంతు వినిపించాలనీ తీవ్రమైన కోరిక ఉంటుంది, హక్కూ ఉంటుంది.” 


మూడు ప్రాథమికావసరాలతో సమానంగా అవసరమైనది మనిషికి వ్యక్తీకరణ. రచనకు ఊరికనే ఉపక్రమించరు ఎవరూ. అన్యకారణాలు ఎన్ని ఒకవేళ ఉన్నా ఒక రచనక్రియ వెనక ముఖ్య ప్రోద్బలం మనిషికి, తనుంటున్న ఈ ప్రపంచం తనకు ఏవిధంగా అర్థం అవుతున్నదో, తన ఉనికి ఈ జీవప్రవాహంలో కలగచేయగల ప్రకంకపనలేమాత్రమని తను అనుకుంటున్నాడో,  ఈ లోకానికి అరిచో, మెల్లగానో చెప్పాలని అనుకోవటమే.

భావాన్ని ప్రాణం లా మోస్తూ చిరంజీవిగా నిలబడిపోయే అక్షరం మానవులందరూ ఆరాధించే ఊర్వశి.


యుగాలుగా వేల పుటల సాహిత్యం వస్తూనే ఉన్నా రచించటానికి విషయం ఇంకా ఉంటూనే ఉంటోంది. ఎన్ని మానవ మస్తిష్కాలో అన్ని దృక్పథాలు మరి. బాధలూ, వాటి కథలూ సరేసరి. 

ఒక పరిహాసం ఆ మధ్య చెలామణి అయింది. స్త్రీలు పురుషులు ఒక సభలో వారి వారి కష్టాలు చెప్పుకోవటానికి గుమి కూడారుట. ఒక స్త్రీ తన జాతి తరఫున నిలబడి చెప్పుకుంటూ పోతోందిట ఆడవాళ్ళు పడే కష్టాలు ఇవీ ఇవీ అంటూ. చివరకు “ఒక్క కష్టం ప్రపంచంలోది చెప్పండి మేము పడనిదంటూ ఉంటే?” అని సవాల్ చేసిందిట. వెంటనే ఒక అర్భకుడు లేచి నిల్చుని “ఒకటున్నది మీరు పడని కష్టం; అదేంటంటే బయటికి వెళ్ళబోసుకోకుండా నిశ్శబ్దంగా కష్టాన్ని భరించే కష్టం మాత్రం స్త్రీలు పడరు.” అన్నాడట. 

 ఆమె అన్నదిట “ఆ హక్కు కూడా మానుంచి హరించకండి, బాధలు వెళ్ళపోసుకోవడం అనే కోరికను బౌద్ధ భిక్షుణీలు కూడా తప్పించుకోలేకపోయారు” అని.


పురుషుడికి జన్మ ఎత్తాక వెయ్యి సమస్యలు ఉంటే స్త్రీకి వెయ్యినొకటి ఉంటాయి, అతనితో కలుపుకుని.

దేశకాలాల బేధం పాటించకుండా ఒకటే విధంగా కాసే ఎండ పితృస్వామ్యాధికారం కదా మరి. 

మెల్లిమెల్లిగా మారుతూ వస్తున్న సామాజికపరిస్థితి వెనక పుంఖానుపుంఖాల స్త్రీ అణిచివేత గూర్చి సాహిత్యం రావటాన్ని మించిన ప్రభావవంతమైన తిరుగుబాటు లేదు.


ఎంత వ్రాసినా ఇంకా కొంత మిగిలి ఉండబట్టే ఇంకా రాయవలసి వస్తోంది స్త్రీ కి, ఇప్పటికీ. 

బహుముఖీన అభివృద్ధి జీవనంలో వస్తే, సమస్యలూ బహుముఖీనంగా ఉంటున్నాయి. 


అవన్నీ జీవితంలో దశలవారీగా ఎదుర్కుంటున్న తోటి ఆడవారిని చూసినప్పుడు ఆ సమస్యలను మూలాలతో పట్టుకునే ప్రయత్నం చేసిన రచనలు వనజ తాతినేని గారివి. 

వార్తాపత్రికల్లో చదివినవో, కర్ణాకర్ణిగా విన్నవో విషయాలు గా కథలల్లకుండా, సమీపం నుంచి తరచి చూసిన స్త్రీ జీవితాల్లోని అణచివేత, దుఃఖం ఆమెతో రచనలు చేయించాయి. 


సమస్యలకు, అందునా స్త్రీ సమస్యలకు కరువున్న దేశం కాదిది. ఆడ పిల్లల ప్రథమ సమస్య ప్రాథమిక విద్య; అటు బడిలో ఇటు ఇంట్లో. మొదటి కథ, ‘మాతృ హృదయం’ లో విషయం, నాలుగిళ్ళల్లో పాచిపని చేసుకుని పిల్లల్ను పోషించే సింగిల్ వుమన్ కు పిల్లల పెంపకం లో ఉండే కష్టం. చాలా సున్నితమైన అంశం ఎత్తుకున్నారు ఇక్కడ రచయిత్రి; సామాన్యంగా అందరూ చర్చించే ఆ స్థితిలో ఉన్న వారి ఆర్థిక సమస్యో, శ్రమదోపిడియో, లైంగిక అత్యాచారమో కాకుండా. అమ్మూ వాళ్ళమ్మ తన ప్రాణమంతా ధారపోసైనా పిల్లలకు చదువు చెప్పిస్తే కనీసం వాళ్ళకైనా పాచిపని చేసే తన గతి పట్టదనుకునే ఆశ తో ఉంటుంది. పిల్లలతో బడికి వెళ్ళు , సరిగా చదువు అంటూ కఠినంగా ఉండే ఆమెను ఎదుగుతున్న పిల్ల సరిగ్గా అర్థం చేసుకోదు. “అమ్మకు నేనంటే ప్రేమ లేదు, రెండో పెళ్ళి చేసుకున్నా నాన్న నే మేలు, ఆయన, ఆయన మరోభార్య దగ్గరికి వెళ్ళినా బావుంటుంద”ని అనుకునే అమాయకురాలు. ఇది చాలా సహజంగా ఎదిగే పిల్లలున్న ఇళ్ళల్లో కనపడే పిల్లల, ముఖ్యంగా ఆడపిల్లల మనస్తత్వధోరణి; అమ్మకు నాకంటే చెల్లి ఇష్టం, లేదా తమ్ముడు ఇష్టం అనుకోవటం. 

తల్లీ తండ్రి రెండు బాధ్యతలు ఒక తల్లే తలకెత్తుకోవలసి వచ్చినపుడు, తండ్రి కమశిక్షణలో, భయంలో పెరిగే పిల్లలకు దొరికే తల్లి అనునయం తల్లి ఒంటి చెయ్యి అందివ్వలేదు. అన్నమూ తనే పెట్టాలి, భయమూ తనే పెట్టాలి. పిల్లలకది నిరంకుశత్వం అనిపిస్తుంది.

వనజగారి కథలు నిస్పృహతో విషాదంతో మిగిలిపోవు. 

ఆవిడ తన స్త్రీ పాత్రను వివేచన, కార్యశీలత తో నింపుతారు. అదొక ఎంతో ఆవశ్యకమైన ఆశావహ దృక్పథం.

ఈ కథలో, మొదట్లో కఠినంగా “కనిపించిన” సవతి తల్లి అటూఇటూకాని అపరిపక్వమైన మనసుతో, తన తల్లిని, ఆమె మాత్రమే ఇవ్వగల రక్షణను దూరం చేసుకుని తన దగ్గరకు మాటిమాటికీ వస్తున్న పిల్ల తన తల్లి ప్రేమను అర్థం చేసుకుని తిరిగి తల్లి దగ్గరకు వెళ్ళాలంటే తను ఎలా వర్తించాలో అలా ప్రవర్తిస్తుంది. 

ఇదొక గొప్ప అడుగు; చెల్డ్ సైకాలజీ వస్తువుగా సంకలనంలో మొదటి కథకు ఎంచుకోవటం.


నడిచి నడిచి ఎంతో పురోగమించాం అనుకున్నా ఆడది మొదట చతికిలబడేది ఎక్కడో అందరికీ తెలుసు. 

అలా అంచెలవారీగా జీవితంలోని వివిధ మజిలీలలో స్త్రీలను ఎదగనీయకుండా నిరోధించే శక్తులతో పారాటం ఇరవై మూడు కథల వస్తువు.


స్త్రీ sexuality ని, ఆ విషయంగా ఆమె ఎంపికలను ఏకపక్షంగా సమర్థిస్తూనో విమర్శిస్తూనో కాకుండా ఆ విషయ సంబంధమైన నిర్ణయాలవల్ల ఎదురయ్యే పర్యవసానాలకు తన పాత్రలు పడే సంఘర్షణను, అందులోంచి ఆ స్త్రీలు దర్శించుకున్న సత్యాలను రచయిత్రి తను తటస్థంగా ఉండి నమోదు చేస్తారు. ఇది కూడా ఒక మేలైన రచనా లక్షణం. 

 

కోడలి వైపు నిలబడిన అత్తలు, స్నేహితురాలికి అండగా నిల్చిన మహిళలతో ఈ కథలు పునరుద్ఘాటిస్తునే ఉన్నాయి బలంగా,  స్త్రీలకు స్త్రీలు శత్రువులన్న అపకీర్తి చెరిగిపోయిన కాలం లో ఉన్నామని.


ఎదురు దెబ్బలు తిన్నా ఎక్కడా ధీరత్వం, ఆత్మగౌరవం జారవిడకుండా ఓటమీ గెలుపూ రెంటినీ తమ బాధ్యతగా స్వీకరించినవారే ఈ కథల్లో స్త్రీలు.


స్త్రీ అస్తిత్వపోరాటం ఎంత ముఖ్యమైన విషయమో పర్యావరణ స్పృహ, నగరీకరణ నష్టాలు, పల్లెటూళ్ళలో వాస్తవమైన రాజకీయాలు; కుల వర్గాల మధ్య ప్రచ్ఛన్నమైనవి, అసలు రాజకీయాలు…ఇలా ఏ అంశం కథకు ఎత్తుకున్నా దాని ఉపరితలాలు మాత్రం చూసినట్లు కాకుండా విషయం లోతులకెళ్ళి సమస్య మూలాలను పట్టుకోగలిగితేనే ఈమె రచనకు ఉపక్రమిస్తారు.

అదే, ‘బిహైండ్ హర్ స్మైల్’, ‘పూవై పుట్టి’ అని సెలబ్రిటీల జీవితాల ఆధారంగా వ్రాసిన కథల్లో, సదరు వ్యక్తుల గౌరవానికి భంగం కలగనీయని పద్ధతిలోనే ఆ జీవితాల్లో వైఫల్యాలకు కారణమైన సంగతులను సహానుభూతితో ట్రీట్ చేసారు ఈ కథల్లో.


ముఖ్యమైన జరీపోగు ఈ ఇతివృత్తాల నేతపనిలో ఏమిటంటే కాస్త ప్రేమ, అనురాగం, గౌరవం, కోరుకునే మహిళ అంతరంగపు అసలు రంగును చూపిస్తూ నిలబెట్టటం. ఈ అంతరంగాన్ని ఆడది భుజం మీద వేసుకు తిరిగితే వాటిల్లే ప్రమాదం తెలుసు కాబట్టే స్త్రీ ఎప్పుడూ తన ఆంతర్యాన్ని ఒక దుర్గ్రాహ్యమైన కవచం తో రక్షించుకోవాలని పటిష్టంగా చెప్పటం కూడా. 

ఈ కథలను ఒక మాటలో నిర్వచించాలంటే చెప్పవలసిన మాట స్త్రీ ఒక అజేయ. పరిస్థితులు కానీ మరో పురుషుడు కానీ మరో ఆడది కానీ పడగొట్టలేని అజేయత్వాన్ని సాధన చేసే ప్రయాణపు కథలివి.


ఎంత ఉద్వేగాల పుట్ట నో స్త్రీ, అంతగా సంయమి కూడా కాగలు.

-పద్మజ సూరపురాజు. 


పుస్తకం కావల్సిన వారు వివరాలకు సంప్రదించగలరు 


Get your copy now


balabooks.in

Whatsapp 9908091509. 

16, ఆగస్టు 2025, శనివారం

బ్రతుకు పాట

 ఎ సామ్ ఆఫ్ లైఫ్

హెన్రీ వాడ్స్‌వర్త్ లాంగ్ ఫెలో




(A Psalm of life...

H.W. Longfellow........)


బ్రతుకు పాట 


జీవిత ఒక ఖాళీ స్వప్నం అని 

దుఃఖం నిండిన సందర్భాల్లో 

నాకు చెప్పవద్దు 

నిద్రలోకి దిగిన ఆత్మ చచ్చిపోయింది 

పరిస్థితులు  ఏవీ కనిపించినట్టుగా 

ఉండడం లేదు 

జీవితం వాస్తవమైనది 

ఎంతో విలువైనది 

స్మశానానికి చేరుకోవడం దాని లక్ష్యం కాదు 

నువ్వు దుమ్ములోకే తిరిగి కలవాలి, కానీ 

అది అలా నీ ఆత్మ కోసం ఎక్కడా చెప్పబడలేదు 


విలాసాలు లేవు 

విచారమూ లేదు 

మనదారికి అవి ఏమీ ముగింపు కాదు 

అవి మన దారే కాదు 

కానీ చేతల్లో....

నిన్నటికన్నా ఈరోజు ఎంత దూరం

ముందుకు ప్రయాణించేమనేదే.....


కళ శాశ్వతమైనది 

ఉన్న సమయం మాత్రం తరిగిపోతోంది 

ఇంక మన గుండెలు ఎంత దిటవుగా ఉండినా సరే 

శవయాత్ర ముందు మ్రోగుతున్న డప్పు లాగే  కొట్టుకుంటూ వున్నాయి

 


ప్రపంచం లోని విశాలమైన యుద్ధ రంగంలో

ఈ జీవితపు క్షణ కాల మజిలీలో 

నోరులేని వాడివిగా ఉండకు 

తోలుకెళుతున్న పశువులాగా ఉండకు 

నిత్యం యుద్ధం చేస్తున్న నాయకుడిలాగే ఉండు 


భవిష్యత్తుని నమ్మకు 

అది ఎంత ఆహ్లాదంగా ఉన్నప్పటికీ 

చచ్చిపోయిన గతాన్ని తనని తాను 

మట్టి చేసుకోనీ 

జీవిస్తున్న వాస్తవంలోనే కార్యాచరణ కానివ్వు 

హృదయం పెట్టు అన్నింటా 

ఇక పైన భగవంతుడున్నాడు 


గొప్పవారి జీవితాలు మనకు గుర్తుచేసేది 

మన జీవితాలను మనం అత్యుత్తమమైనవిగా చేసుకొమ్మనే......

మరి వెళ్ళిపోయేటప్పుడు మన వెనుక 

కాలం ఇసుక తిన్నెల్లో మన అడుగుల గుర్తులు 

వదిలి వెళ్లాలని 


కాలి గుర్తులు, అవి బహుశా నట్ట నడి సముద్రపు 

 అతి భయంకరమైన గొప్పదైన రూపం నుండీ బయటపడిన నావికుడు __

అందరిచేతా తృణీకరించబడ్డ 

తాను ప్రయాణించిన నౌక  చిధ్రమైన ఒక సోదరుడు

వాటిని చూసి మరలా బ్రతుకు దారి పట్టవచ్చు 


మళ్ళీ మనం లేచి నిలబడాలి 

ఎటువంటి సంక్షోభం లో నైనా నిలబడే దమ్ముతో 

ఇంకా ఎప్పటికీ గెలుస్తూనే ఉండాలి 

ఎప్పటికీ ఈనీతిని అనుసరిస్తూనే ఉండాలి 

శ్రమ పడ్డం ఎలాగో నేర్చుకోవాలి 

నిరీక్షించడం కూడా నేర్చుకోవాలి ....


తెలుగు అనువాదం: 

P. సింహాద్రమ్మ



21, జులై 2025, సోమవారం

ప్రశ్నలు - సమాధానాలు

 నా రచనా వ్యాసంగం గురించి ఎవరైనా అడుగుతారా.. అనుకునేదాన్ని. 

“మా వంశీ “.. 

ఇలా ప్రశ్నలు సంధించారు. నేను చాలా సంతోషంగా నా సమాధానాలు ఇచ్చాను . 

ఆసక్తి  ఉంటే  మీరూ చదవండి.

************

వనజ తాతినేని - వనజ గారు - మ్హీఖు ఖొషెన్స్ వ్హేయ్హభడ్ఢవి - సమ్ధానం షెప్థే షెఫ్ఫంఢి ళేఖుంఠే మ్హీఖీ హిష్ఠం 


******

1.మీ కలం మాట్లాడగలిగితే, మీరు దానిని పుచ్చుకుని రాసిన కథల గురించి అది ఏమి చెబుతుంది?


1.జ) “ఇంత బరువైన కథలు రాయించావు ఏమిటి తల్లీ!? నీకు పురుష ద్వేషమా!?”

 అంటుంది.


2.రచయిత్రిగా మీకోసం మీరు కొన్ని రాస్తారు, అందులో సందేహం లేదు - మీకోసం మీరు రాసుకున్న వాటికి బయటి పాఠకుల కోసం రాసే వాటికి మీ రచనా స్వరం మార్పుకు లోనవుతుందా? ఒక వేళ లోనైతే ఎంత శాతం? ముప్ఫై శాతం, 40 శాతం, 60 శాతం, 90 శాతం? అలా ఏమీ లేదు, పాత్రలను బట్టి కథను బట్టి అన్ని కథలకు వేటి స్వరం వాటికే ఉంటుందని మీ అనుకోలా? 


2.జ) పాఠకుల కోసం రాసే కథలకు పది శాతం వరకూ నా రచనా స్వరం మారుతుంది. తప్పదు అది.


3.ఆధునిక కథలు చెప్పే మీరు పాత సాహిత్యం ఎంత చదివారు? విస్తృతంగానా? మధ్యస్థంగానా? అసలు ఏమీ చదవలేదా? 


2. జ) మధ్యస్థంగా చదివాను


4.మీరు తెలుగు సాహిత్యంలో ఒక కథను - అది మీదైనా, మీకు నచ్చిందైనా - తిరిగి వ్రాయగలిగితే, అది ఏమిటి? ఎందుకు?


4. జ) కలాపి (మన్నెం సింధు మాధురి రచన) అనే కథ నాకు నచ్చింది. అదే కథను నేను  తిరిగి రాస్తే  ఒక భారతీయ స్త్రీ ఏడుసార్లు విడాకులు ఇవ్వదు. విడాకులు ఇవ్వడం ద్వారా మాజీ భర్తల నుండి పొందిన భరణాన్ని బాధిత స్త్రీలకు ఉదారంగా పంచదు. భారతీయ సమాజంలో స్త్రీ ఒకసారి విడాకులిచ్చి రెండవ వివాహంలోకి అడుగుపెట్టడమే సాహసోపేత నిర్ణయం తెలివి తక్కువ ఆలోచన కూడా! ఇక సహజీవనం గురించి నేను మాట్లాడను. 


5.తెలుగు మహిళగా ఉండటం అనేది మీ కథా ఇతివృత్తాలను, మీలోని మహిళ ఎలా ప్రభావితం చేస్తుంది? ప్రేమించే అమ్మలానా? బాధలు పడే భార్యలానా? బేఫికర్ బాబమ్మ లానా? 


5.జ) ముందుగా నేనొక స్త్రీ ని.  నా కథా ఇతివృత్తాలన్నీ కాల్పనికం కాదు. కొన్ని కథలు నేను రాయకముందు రాసిన తర్వాత కూడా కల్లోల పడటం వాస్తవం. “లాస్ట్ మెసేజ్”, “రెండు లక్షలు”, “మాతృ హృదయం” కథలు నాకు పరిచితమైన స్త్రీల కథలే! “ ఔనా” కథ షాకింగ్ కథ. రాయడానికి సంకోచించాను. దశాబ్దం తర్వాత రాసాను. కథలు రాయడం పాఠకుల కొరకు కాబట్టి రచయితగా ఆలోచిస్తూనే..  సాటి మహిళగా సహానుభూతి ని ప్రదర్శిస్తూనే నిరసన స్వరాన్ని కొరడాలా ఝళిపిస్తాను. నేనెప్పుడూ ప్రేమించే అమ్మ నే. కథల్లోని పాత్రలను కూడా అమ్మ లాగానే ప్రేమిస్తాను.వీలైనంత వరకూ సరైన దారిలో నడపడానికి ప్రయత్నిస్తాను.


6.మీ జీవితం తెలుగు కథో, కవితో అయితే, దాని శీర్షిక ఏమిటి?


6.జ) జీవిత కథ 


7.మీ రచన యొక్క సారాంశాలకు ఏ తెలుగు పదం లేదా పదబంధం న్యాయం చేయగలదని మీరు అనుకుంటున్నారు?


7.జ) ఆక్రోశం


8.జీవితాన్ని తిరిగి రాయటం, అందులోని బాధల్ని ఎడాపెడా రాసి అసలే జీవితాలని బరువుగా లాగుతున్న మనుషుల మనసు మీదో, మేధ మీదో, హృదయం మీదో - ఒక మేరు పర్వతం బరువు చేసి  కుమ్మరించటం అనేది బాధ్యత గల రచయిత్రిగా ఎంత మటుకు సమర్థిస్తారు? 


8.జ) మూడు తరాల స్త్రీల వెతలు, గృహ హింస, అణచివేత చూసాను. స్వయంగా అనుభవించాను. నిత్యం చూస్తున్నాను. కోపం,ఆవేశం,ఆక్రోశం,బాధ ప్రకటించాలనిపిస్తుంది. పురుషులందరూ చెడ్డవారని నేను అనడం లేదు.బాధిత స్త్రీల కొరకు ఏదో చేయాలనే తపన నా చేత రాయిస్తుంది. నా కథలు బరువుగా వుంటాయి. ఒప్పుకుంటాను.నాకు హాస్యరసం వొలికించడం చేతకాదు. ప్చ్.. 


9.చరిత్రలో మీకు నచ్చిన ఒక తెలుగు మహిళా రచయిత్రి ఎవరు? ఎందుకు?


9) జ. ఓల్గా. ఎందుకు అంటే… నా పరిస్థితి ని బట్టి ఆమె రచనల వైపు ఆకర్షితురాలినయ్యాను.20 వ శతాబ్దంలో  స్త్రీల కొరకు ఆమె తన గళాన్ని బలంగా వినిపించారు. రచనలను కూడా బలంగా చెప్పగల్గారు.


10.మీ పుస్తకం మరొక భాషలోకి అనువదించబడాలన్న కోరిక మీకు ఉంటే ఈ క్రింది నాలుగు భాషల్లో ఏ భాషను ఎంచుకుంటారు?  - సవర భాష, భోజ్ పురి భాష, బెంగాలీ భాష, ఆంగ్లం. ఆ భాషే ఎందుకు?


10.జ) ఆంగ్లం. ప్రపంచ దేశాలకు మన తెలుగు  సాహిత్యం (కథ) ఏం ప్రతిబింబించింది అని తెలియాలని.


11.తెలుగు సాహిత్యం స్త్రీత్వం యొక్క సంక్లిష్టతలకు న్యాయం చేసిందని మీరు అనుకుంటున్నారా, లేదా? లేదనుకుంటే చేయవలసింది ఇంకా ఎంత ఉన్నది? ఒక ఇరవై శాతం, నలభై శాతం, వంద శాతం? 


11)జ. తెలుగు సాహిత్యం స్త్రీత్వం యెక్క సంక్లిష్టతలకు న్యాయం చేయలేదు. స్త్రీలకు ఆలోచించే శక్తి  సంపాదించే మార్గం, స్వేచ్ఛగా వుండే వాతావరణం లభించిందన్నమాటే కానీ ఇంకా సమస్యల వలయంలోకి నెట్టింది.చదువులు ఉద్యోగాలు ఉన్నాయన్న మాటే కానీ గౌరవం తగ్గింది.రక్షణ తగ్గింది. చాకిరీ హింస పెరిగాయి.కానీ పురుష దృష్టి ఇంకా మారలేదు. స్త్రీలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లా పరుగులు పెడుతుంటే  పురుష సమాజం పాస్ట్ పాసింజర్ లా నడుస్తుంది. కుడి ఎడమ స్త్రీ పురుషుడు మధ్య తేడా కచ్చితంగా వుంటుంది. అలాగే స్త్రీ పురుషుల మధ్య కూడా! ఇరువురి మధ్య అవగాహన వుంటే తప్ప కలిసి మనుగడ సాగించలేరు.  ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది.విడాకులు ఎక్కువయ్యాయి. కుటుంబం కూలిపోయి ఒంటరితనం చిరునామా అయింది. సాహిత్యం మనిషికి హితం కల్గించాలి.మనుషులను విడదీయకూడదు. సాహిత్యం చేయవలసినది చాలా వుంది.


12.మీరు రాయడం ప్రారంభించినప్పుడు ఎవరైనా మీకు ఇచ్చిన సలహా ఏమిటి?


12.జ) మా ఇంటి పురుషులు  నేను రాయడాన్ని ఇష్టపడలేదు కానీ స్త్రీలందరూ రాయమని ప్రోత్సాహం అందించారు. మా అత్తమ్మ నా ప్రతి రచన చదువుతారు. వ్రాసిన విషయాలను చెప్పిన తీరును మెచ్చుకుంటారు. ఆమె అనుభవాలను సూక్ష్మంగా విప్పి చెబుతారు. కొత్త విషయాలను అందిస్తారు. 


13.మీరు ఇప్పటికిప్పుడు భవిష్యత్తు తరం (అనగా ఒక ముప్ఫై ఏళ్ళ తర్వాతి) తెలుగు మహిళా రచయిత్రులకు లేఖ రాయగలిగితే, అది ఏమి చెబుతుంది? వాళ్ళకు తెలుగు వస్తుందో లేదో, అప్పటికి తెలుగు భాష బతికి ఉంటుందో లేదో అన్న గోడ మీది లౌక్య వాక్యాలు చెప్పొద్దు. మీరు ఇప్పుడు వాళ్ళకు ఏం చెప్తారు? అంతే! 


13.జ) “మీరు పూర్తిగా కాల్పనిక కథలు రాయండి. ఇష్టపడితే  పాఠకులు చదువుతారు.లేదా మీ అనుభవాలను బట్టి ఇతరుల అనుభవాలను విని వాటిని బట్టి సమన్వయంతో రాయండి.  మీ అనుభూతులను రాయండి అంతే  తప్ప కమర్షియల్ రైటర్ ఫేమస్ రైటర్ అనిపించుకోవడానికి నానా రకాల చెత్తను పైత్యాన్ని నింపి పాఠకుల పైకి విసరవద్దు. కత్తి కన్నా కలం పదునైంది. భావ వ్యాప్తి సమాజాన్ని పెడదారి పట్టిస్తుంది”. అని.


14.మీ రచనల్లో ఒక రచన ఆధారంగా ఒక తెలుగు సినిమా తీస్తే, అందులో విలన్ రమ్యకృష్ణ అయితే, మీరు ఆ విలన్ క్యారెక్టరుకు ఇచ్చే ఊతపదం ఏమిటి? 


14. జ) మైండ్ దొబ్బిందా లేక పైత్యం పెరిగిందా!? 


15.మీరు మీ రచనా శైలిని ఒక తెలుగు వంటకంగా వర్ణించగలిగితే, అది పులిహోర అవుతుందా? తీపి బొబ్బట్టు అవుతుందా? కళ్ళనీళ్ళు తెప్పించే ఉల్లిపాయ అవుతుందా? పానీపురీ అవుతుందా? ఇంకేదన్నానా? 


15.జ) వెల్లుల్లి కారం కూరిన కాకరకాయ 


16.రచయిత్రిగా, మామూలు మనిషిగా మీకు ఏయే భావోద్వేగాలు ఇష్టం (విడివిడిగా. రచయిత్రి మనిషి రెండూ ఒకటే అయితే అప్పుడు ఆ ఉద్వేగం ఏమిటి?) 

 

16.జ) నేను రచయిత్రి గానూ మాములు మనిషి గానూ రెండూ ఒకటే!  నన్ను చలింపజేసేవి  ప్రేమ దుఃఖం.ఇవి రెండూ సమానస్థాయి లో వుంటాయి. కరుణ ఆర్ద్రత నన్నంటి పెట్టుకుని వుంటాయి. కోపం తాటాకు మంట. దృఢత్వాన్ని (కఠినంగా) కలిగి వుండటానికి నేను సాధన చేస్తాను. (ఇది రహస్యం)😊👍 


17.మీ పాత్రలు మీతో తిరిగి మాట్లాడగలిగితే, వారి పాత్రల కర్మ గురించి, విధి గురించి, నా పాత్ర ఇలా తీర్చిదిద్దారేమి అని ఏ పాత్ర ఎక్కువగా ఫిర్యాదు చేస్తుంది అని మీరనుకుంటున్నారు?


17) జ. “ఇంటి పేరు” కథ లో “సువర్ణ” లాస్ట్ మెసేజ్” కథ లో “ధాన్యమాలి”.  సువర్ణ కథలో ధీర. నిజ జీవితంలో పలాయనవాది. “ధాన్యమాలి” ఇంత బోల్డ్ గా ఎలా రాసావు? నన్ను నడిరోడ్డుపై సిగ్గు శరం మానాభిమానాలు  ఒదిలేసిన స్త్రీగా నిలబెట్టావు. రచయిత బాధ్యత మరిచావా?  అని నన్ను నిలదీసాయి. అప్పటినుండి బుద్దిగా తెలివిగా రాస్తాను. 


18.మీరు రాతలు ఎక్కువగా రాసే సమయం ఏది? పొద్దు పొద్దున్నే, మిట్టమధ్యాహ్నం, సాయంత్రం, ఊళల అర్థరాత్రి? ఎందుకు? 

  

18.జ)ఏదో చెప్పాలని తపన పడ్డప్పుడు మాత్రం అర్థ రాత్రి సమయంలోకూర్చుని రాసేస్తాను, ఎక్కువగా తెల్లవారుజామున రాస్తుంటాను. 



19.మీరు మీ రైటింగ్ డెస్క్‌కు కానీ ల్యాప్ టాపుకు పేరు పెట్టవలసి వస్తే, మీరు దానికి ఏ తెలుగు పేరు పెడతారు?


19.జ) అక్షర మాత 


మాగంటి వంశీ మోహన్ గారికి ధన్యవాదాలు. 🙏 20/07/2025