26, ఆగస్టు 2020, బుధవారం

నీటి జాబిలి కాదు మేరు శిఖరం


కవి సాంఖ్య పక్షం,అయినా వాళ్ళు నిందిస్తారు 
అవును వాళ్ళు అసభ్యపు మాటలతో గుండెల్లోగునపాలు దించుతారు

వాళ్ళ రక్తమంతా కులద్వేషంతో కుతకుత ఉడుకుతుంటుంది.

వ్యక్తి పూజకు సమాజ హితానికి తేడా తెలియని మూర్ఖశిఖండులు.

అవినీతి గొంగళిలో పంచభక్ష్యాలు భుజిస్తూ.. పక్కవాడి పళ్ళెంలో మెతుకులను కాజేయాలని పన్నాగాలు

జగన్నాథ రధచక్రాలు వస్తున్నాయ్ అని రంకెలేస్తూ ఎగిరెగిరి పడతారు సరే రాత్రి వేళకు కన్ ఫెషన్ చెప్పుకుంటూ మోకరిల్లుతారు అవసరమైన చోట కాళ్ళు పట్టుకుంటారు

ఆరడుగులు నేల చాలన్న సత్యాన్ని విస్మరించి ఆరొందల పరగణాల భూదాహంతో దప్పికగొని వుంటారు

సురపానానికి స్వాగత ద్వారాలు తెరిచి అమృతమని భ్రమింపచేసి విషపు ఉక్కుకౌగిలిలో నలిపిపడేస్తుంటారు మొసలి కన్నీరు కారుస్తుంటారు రోజుకొక రంగు మారుస్తున్న ఈ ఊసరవెల్లులు

రెండున్నర శతాధికదినాలు దీర్ఘంగా అవిశ్రాంతంగా సాగుతూ మోయలేని బరువుతో కృంగి కృశించి వేదనతో ఆక్రోశంతో అలమటిస్తూ ఆశల చూపులతో బొంద విడిచి పెట్టాయో.
బతికివున్నవాళ్ళు శాపనార్ధాలు పెడుతూ రాజకీయరాబందుల ఇనుప గోళ్ళకు చిక్కి రక్తమోడుతున్నాయో

వేలమంది ప్రజల జీవన విద్వంసం కనబడటంలేదా.. ఈ గాంధారి పుత్రులకు.. 
ఇంటింటికి వొక కథ వేల కుటుంబాల అంతులేని వ్యథ
వేయి పడగల విషనాగు రోజుకొకతూరి విషం చిమ్ముతూనే వుంది .
గారడివాడి మాయాలా మూడు రాజధానుల ఆట ఆడుతూనే ఉంది మాయాలాంతరు ధరించిన రాక్షస మాయ మట్టిదిబ్బలుగా స్మశానవాటికగా మార్చజూస్తేనో  నమ్మశక్యంగా లేదిపుడు

పోరాటదీపం భావితరాల చేతుల్లోకి మారిందిపుడు. నిత్యం పబ్బం గడుపుకోవడానికి ఇది నిత్యాగ్ని హోత్రం కానేరదు. హరితుల పోరాటం వస్త్రంలో దారంలా అభివృద్దిగాముల  ఆరాటం

చట్టం ఎవరికీ చుట్టం కాదు
జడలు విప్పిన అరాచక దృశ్యాలను కళ్ళకు కట్టిన గంతలు
విప్పుకుని మరీ న్యాయదేవత చూస్తూనే ఉంది

కొందరు సత్యగాములు  ఘోషిస్తూనే వుంటారు సముద్రంలా
అది ఆత్మఘోష మాత్రమే అనుకుంటే పొరబాటు. అది పెను ఉప్పెనై  ముంచెత్తడం ఖాయం.
అమరావతి నీటి జాబిలి కాదు  కుయుక్తితో నీలిరంగుఅద్దిన పదహారు కళల ఖ్యాతి చంద్రికుల మేరు శిఖరం 
మసకబారిన జాబిలివెలుగులకు  చీకట్లు తృటికాలం అది ఉండదు కలకాలం   
సత్యమేవ జయతే !!



కామెంట్‌లు లేవు: