15, డిసెంబర్ 2025, సోమవారం

కదంబ వనవాసిని

 నేను ప్రకృతి పువ్వుల చిత్రాలను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను కదా! ప్రకృతి ప్రేమికురాలిని. వీలైనంత వరకు పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటాను. పర్యావరణ స్పృహతో కొన్ని కథలు రాసాను. “నిర్మాల్యం” అనే కథ పై కొంత విమర్శ కూడా వచ్చింది. “బయలు నవ్వింది “ కథ నాకిష్టమైన కథ. పర్యావరణ కథలు ఇంకా కొన్ని కథలు వున్నాయి. ఈ రెండు కథల్లో ఒకటైనా పర్యావరణ కథల్లో చోటుచేసుకుంటాయా అంటే చెప్పలేం. కథాసంకలనాలు ప్రచురించే సంపాదకుల దృష్టి కి కొందరి కథలు అస్సలు కనబడవు. సాహిత్యం లో ఈ గ్రూపిజం వల్ల.. కొందరి కథలు క్రియాపూర్వకంగా భద్రంగా దాపెట్టబడతాయి. అందుకే .. నా ఈ కథలను ఫేస్ బుక్ పాఠకులకు పదే పదే పరిచయం చేస్తున్నాను. ఈ రెండు కథలు నా బ్లాగులో ఉన్నాయి. మీకు ఆసక్తి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో వున్న లింక్ ల ద్వారా వెళ్ళి కథలు చదవండి. కథలు మీకు నచ్చుతాయి అని ఆశిస్తూ.. మీ స్పందన కూడా తెలియజేయండి. ముందస్తు ధన్యవాదాలు. కథలు నచ్చకపోతే ఎందుకో అన్నది కూడా చెప్పేయండి.

బ్లాగ్  లో మీకెదురుగా ఎడమవైపు నా కథలు అనే 

చోట.. కథల లిస్టు ఉంది. “బయలు నవ్వింది” 

“నిర్మాల్యం” అనే చోట క్లిక్ చేసే కథ లోకి వెళ్ళి పోతారు. Happy Reading.. 

ఇక ఈ ఫోటో గురించి చెప్పాలంటే… ఇది ఒక అత్యుత్తమ చిత్రం. ఆ ఎండిన గోధుమరంగు పువ్వుల రజను.. ఏమిటనుకున్నారు!? కదంబపుష్పాల రజను అది. మా గృహ సముదాయం ముందు  తూర్పు వైపు కాంపౌండ్ వాల్ కి ఆనుకుని వరుసగా  కదంబ వృక్షాలు వేసారు. నేను వచ్చినప్పుడు అవి చిన్న మొక్కలు. ఐదేళ్లకు మూడు అంతస్తుల ఎత్తు పెరిగిపోయాయి. శ్రావణంలో పూలు పూయడం మొదలెట్టి దసరా వరకూ పూలు పూసేవి. ఆ చెట్ల మీద అనేక రకాల పక్షులు గూళ్ళు పెట్టుకుని వుండేవి. రోజులో 14 గంటలు సంగీత ఉత్సవమే మాకు. 

ఓ శ్రావణ మాసపు ఉదయం నేను పూజ కి పూల కోసం కిందకు వెళితే.. పరుపు పర్చినట్టు పువ్వుల రజను పడి వుంది. వెంటనే ఫోటోలు తీసుకున్నాను. అప్పుడు “ఈస్తటిక్ సెన్స్ “ కథా సంపుటి తెచ్చే ప్రయత్నంలో వున్నాను. ఒక ఆలోచన వచ్చింది తడవు వెంటనే పైకి వెళ్లి ముగ్గు పిండి తెచ్చి.. ఇలా రాసి ఫోటో తీసాను. కవర్ పేజ్ గా సెట్ అవుతుందని చూసాం కానీ .. అంత బాగోలేదా ఆ ప్రయత్నం. ఈ ఫోటో మాత్రం ఇలా మిగిలిపోయింది. 

కాంపౌండ్ వాల్ నెర్రెలు ఇచ్చాయని కదంబ వృక్షాలపై గబ్బిలాలు వేలాడుతున్నాయని ఆ చెట్లు ఆఫ్రికన్ తులిప్ చెట్లూ.. మొదళ్ళతో సహా తీయించారు. అప్పుడు నేను USA లో వున్నాను. మా ప్రక్కింటి శాంతి ఫోన్ చేసారు. చెట్లన్నీ తీసేయిస్తున్నారు అని. వీడియో కాల్ చేసి చూపించారు. కళ్ల వెంట నీళ్లు కారిపోయాయి. వద్దని చెప్పడానికి వీల్లేదు. అద్దెకి వున్నవాళ్ళ అభిప్రాయాలు ఎవరికి కావాలి !? అనుకున్నాను. మూడేళ్లు దాటింది కదంబ చెట్లు నరికించేసి. ఆ జ్ఞాపకం మాత్రం ఇలా మిగిలింది. కదంబవృక్షం అమ్మ వారి స్వరూపం అంటారు. ఆ సెంటిమెంట్ కాకపోయినా ఆ వృక్షాలు పక్షులకు నివాసంగా వున్నాయి. ప్రకృతి అనంతంగా శోభిల్లింది. .. ఆ కొరత తీరేది కాదు. ఆ చెట్ల స్థానంలో Lantana పొదలు పెరిగి వున్నాయి. ఆ చెట్ల వేర్లు మిగతా మొక్కలకు harmful అంట. Lantana పూలపై వాలే సీతాకోకచిలుకలు గోరింట చెట్టుపై సంచారం చేసే బుల్లి పిట్టలు ఇప్పుడు నా నేస్తాలు. నా పొద్దు అలా గడుస్తూ వుంటుంది వాటిని చూస్తూ… 

ఈ ఫోటో మాత్రం .. తీపి గుర్తు. ❤️❤️🎈రేపటి పూలన్నీ ఈ రోజు విత్తనాలలో దాగి వుంటాయి. నా ఆలోచనల విత్తనాలు ఈ కదంబ వృక్షాలను (మొక్కలను) తప్పకుండా నాటతాయి.. సొంత తావులో.   శ్రీగిరి భ్రమరాంబిక మల్లన్న  తల్చుకుంటే ఇట్టే అయిపోతుంది. విశ్వాసం వుంది కూడా!

వనజతాతినేని #vanajatatineni #greentales #వనజవనమాలి #పర్యావరణకథలు




కామెంట్‌లు లేవు: