7, ఫిబ్రవరి 2022, సోమవారం

తల్లి

రసోత్కృష్టం - నిగమ

కథల ఒడ్డున.. కాసాపు ఆగుదామా! 

 సృష్టిలో ఉత్కృష్టభావాన్ని భాగాలుగా విడగొడితే అందులో మాతృప్రేమకే అగ్రస్థానం లభిస్తుంది. అది పశువైనా శిశువైనా సరే. జంతువులు పశుపక్ష్యాదులు అనేక కీటకజాతులలో మాతృప్రేమ సొంతంగా మనుగడ సాగించేంతవరకే పరిమితంగా వుంటుంది. తర్వాతంతా ఆ సంతతి ప్రకృతిలో తమలాగానే ఇంకొకటిగా అనుకుంటూ మనుగడ సాగిస్తాయి. 

ప్రత్యేకంగా మనిషికి మాత్రమే కొన్ని బంధాలు అనుబంధాలు జీవితాంతం పెనవేసుకుని వుంటాయి.
అందులో ప్రతి మనిషికి అమూల్యమైనది మాతృప్రేమ. మాతృ ప్రేమకు మించిన ప్రేమ ఉంటుందా లోకంలో అని ఆశ్చర్యపడటం వింతేమి కాదు కూడా. 

ఇటీవల కాలంలో  అప్పుడప్పుడూ మాతృత్వ లక్షణం మసకబారుతున్నదా అనే అనుమానాలు పొడజూపినట్లనిపించినా.. అనేకానేక ఉదంతాలు విన్నా చూసినా చదివినా హృదయం చెమరిస్తుంది. అమ్మ ప్రేమకు మన అణువణువు అంజలి ఘటిస్తుంది. 
 
చాలాకాలం క్రిందట ఒక ఉర్దూ కథ చదివాను. ఆ కథ చదివిన పిమ్మట చాలా దుఃఖం కల్గింది. ఆ దుఃఖాన్ని అనుభవించడం ప్రతి మనిషికీ చేతనవును కూడా మరీ హృదయం అంత పాషాణం కాకపోయినట్లైతే!

మనకుతల్లి లేదా అమ్మ అనే భావనే అపురూపం. తల్లిబిడ్డలది నాభీసంబంధం. ఎక్కడో  దూరంగా బిడ్డకు ఇసుమంత కష్టం కల్గినా నొప్పి కల్గినా.. అది అమ్మ మనసుకు తెలిసిపోతుంది. బిడ్డ క్షేమం కోసం తల్లడిల్లుతుంది. వీలైతే ఆ బాధ తాను భరించి బిడ్డకు ఆ బాధనుండి విముక్తి కల్గించాలని తపన పడుతుంది. కానీ దేహమానసిక బాధలు ఎవరివి వారే భరించాల్సిరావటం ప్రకృతిచ్చిన శిక్ష. 

ఈ కథలో తల్లి అత్యంత సాధారణమైన తల్లే. ఆమెలో ఏ ప్రత్యేకతలు లేవు. అయితే మాత్రమేం.. ఆమె నిరంతర ఆలోచనా స్రవంతి కొడుకు చుట్టూనే. అతని బిడ్డల చుట్టూనే. ఏనాడు చిన్న ఆరోపణ కూడా చేయని ఆమె తల్లి ప్రేమ మనల్ని వెక్కివెక్కి ఏడిపిస్తుంది. ఎన్నో ఏళ్ళ తర్వాత తనను చూడవచ్చిన బిడ్డకు రాచమర్యాదలు జరిపించాలని ఘనమైన అతిధి సత్కారాలు చేయాలని అతనికీ అతని బిడ్డలకూ కానుకలనివ్వాలని తపించిపోయింది. ఆ కొడుకుతో పాటు కథ చదువుతున్న మనం కూడా  ఉద్విగ్నతకు గురవుతాం. కొడుకు పశ్చాతాపంతో మొదలైన కథ ముగింపుకొచ్చేసరికి అణువణువును కరిగించి కన్నీటి వర్షంలో తడిపేస్తుంది. ఒక స్త్రీ రచయితగా మరొక స్త్రీ అంతరంగ చిత్రణను అద్భుతంగా ఆవిష్కరించిన కథను అందరూ చదివితీరాలనే ఆకాంక్షతో ఈ కథను పరిచయం చేస్తున్నాను.. 

మీరూ  ఈ కథను చదవండి. మనలో ఆవిరైపోతున్న మానవత్వ విలువలను మేలుకొలుపుతుందీ కథ. మనని కనిపెంచిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదని మనను సున్నితంగా హెచ్చరిస్తుంది.

 రుకైయ్యా రీహానా వ్రాసిన “తల్లి"  కథను నేను చదివిన ఉత్తమకధలలో ఒకటిగా బహుళా త్రైమాసిక వెబ్ సంచికలో పరిచయం చేస్తున్నాను చదవండీ. 
                                                     -నిగమ

రచయిత పరిచయం


రుకైయ్యా రీహానా ఉన్నత విద్యావంతురాలు. స్త్రీ జీవితాన్ని చిత్రించడంలో అసమానమైన ప్రతిభావంతురాలు. ఉర్దూ కధాసాహిత్యంలో విశిష్టస్థానాన్ని సంపాదించుకొన్నది. ఆమె రచనలలో మానవహృదయంలోని ఆంతరంగిక వేదనా, మాతృత్వ, నారీత్వములలోని తీపి, ప్రధానస్థానాన్ని ఆక్రమిస్తవి. “తల్లి" ఆమె ఉత్తమకధలలో ఒకటి.


“తల్లి"

మాష్టరు హమీద్ ఢిల్లీలో బారహటోటేలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు. అతడి అసలు నివాసస్థానం రషీదాబాదులోని వహాడీ మొహల్లా, అతని తండ్రి రషీదాబాదులో కంచరి పనిచేస్తూఉండేవాడు. హమీద్ బాల్యంలో తన పేటలోని మసీదులోనూ, తరువాత కొద్ది రోజులు ముల్లా సాహెబు బడిలోనూ, ఆ తరువాత తండ్రిగారి ఇష్ట ప్రకారం కొంతకాలం తాలూకా స్కూలులోనూ చదువుకొన్నాడు. హమీద్ ఉర్దూ ప్యాసయిన రోజుల్లో రషీదాబాద్ లో ప్లేగువ్యాధి వ్యాపించి హమీద్ తండ్రిని బలిగొన్నది. ఆయన అంత్యకర్మలన్నీ పూర్తి చేసిన తరువాత హమీద్ తల్లి దగ్గర లెఖ్ఖ చూచుకొంటే డెబ్బయి రూపాయలు మిగిలినవి. మిడిల్ ప్యాసయిన తరువాత హమీద్ కు ఇంగ్లీషు గూడా చదువు కొందామని అభిలాష కలిగినది. కాని ఎలాగా చదువుకోవడం?

వీరి పేటలో ఉండే ఒకాయన ఢిల్లీలో పోలీసుగా ఉండడంవల్ల హమీద్ రెండు మూడు సార్లు ఢిల్లీని గురించి విని ఉన్నాడు. అందువల్ల తల్లి దగ్గర పది హేను రూపాయలు తీసుకొని మెల్లగా ఢిల్లీ చేరుకొన్నాడు.

పోలీసు కానిస్టేబుల్ నసరుల్లాఖాన్ ఇల్లు ఎలాగ తెలుసుకోవడం, చచ్చి చెడి అతని ఇల్లు తెలుసుకొన్నాడు. నసరుల్లాఖాన్ హమీద్ తండ్రిని బాగా ఎరుగును. అందువల్ల అతను హమీద్ ను ఆదరించి తన ఇంట్లో ఉండి చదువుకోడానికి అవకాశం కలుగజేశాడు. నసరుల్లాఖాన్ ఇంట్లోనే ఉంటూ హమీద్ మూడు సంవత్సరాల్లో పదో క్లాసుకు వచ్చాడు. లెఖల్లో హమీద్ నిధి. ఒక సహాధ్యాయుడికి పాఠం చెప్పడం ప్రారంభించి నెలకు ఏడు రూపాయలు సంపాదించడం ఆరంభించారు. ఏడు రూపాయలు తన భోజనానికి సరిపోతవి గనుక వేరుగా ఉంటానని తాను ఎంత బ్రతిమి లాడినా నసరుల్లాఖాన్ అంగీకరించనందున, హమీద్ విధిలేక అక్కడే ఉండిపోయినాడు.


‘ఆ విధంగా పది నెలల్లో హమీద్ డెబ్బయి రూపాయలు రొట్టం నంపాదించాడు. తల్లి దగ్గరనుండి తెచ్చినవి పది రూపాయలు మిగిలి ఉన్నవి. ఒకసారి తల్లి రెండు రూపాయలు మనియార్డరు పంపించింది. మొత్తం అతని దగ్గర ఎనభయి రెండు రూపాయలు పోగుపడినవి. స్కూలుకు వేసవికాలపు సెలవులిచ్చారు. నసరుల్లాఖాన్ గూడా సెలవు బెట్టాడు. ఇద్దరూ కలిసి రషీదాబాద్ వచ్చారు.


అప్పటికి హమీద్ తల్లి దగ్గర భర్త అంత్యక్రియలు చేయగా మిగిలిన డబ్బు పన్నెండు రూపాయలు మిగిలి ఉన్నవి. ఇంటిముందున్న పనసచెట్టు అమ్మడంవల్ల ప్రతి సంవత్సరం పాతిక రూపాయిల ఆదాయం వస్తూ ఉండేది. ఇంటికి పోయేటప్పటికి తల్లి హమీద్ కు వివాహసంబంధం మాట్లాడి సిద్ధంచేసి పెట్టింది, ఆ డబ్బు హమీద్ దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టి ఏదోవిధంగా హమీద్ వివాహం పూర్తిచేసింది. పెళ్ళి అయిన ఏడోరోజున తిరిగి హమీద్ ఢిల్లీ వెళ్ళాడు. ఆ సంవత్సరం పరీక్షలో కృతార్థుడు అయినాడు.


ఇక ఉద్యోగం ఒక ప్రైవేటు స్కూల్లో కొద్దిరోజులు నౌకరీ కుదిరింది. తరువాత ఇంకొక స్కూళ్ళో ఆ తరువాత ఇంకొక స్కూళ్ళో -చివరకు ఒక స్కూళ్ళో అతని పని చూసి సంతోషించి ఆ స్కూలు ప్రధానోపాధ్యాయుడు అతడి ఉద్యోగం ఖాయంచేశాడు.నెలకు ఇరవయి రూపాయల జీతం. ఇక వేరే కాపురం పెడతానని హమీద్ నసరుల్లాఖాన్ ను అడిగారు.


ఒంటరిగా కాదు. భార్యనుగూడా తీసుకొనిరమ్మని నసరుల్లాఖాన్ మూడు రూపాయలు అద్దెకు ఒక చిన్న ఇల్లు కుదిరించి పెట్టారు. హమీద్ ఖాన్ రషీదాబాద్ వెళ్ళి భార్యను తీసుకొచ్చి ఆ ఇంట్లో కాపరం పెట్టాడు. రషీదాబాద్ లో తల్లి ఒంటరిగా ఉండిపోయింది.


హమీద్ భార్యను ఢిల్లీ తీసుకొనివచ్చి ఏడు సంవత్సరాలు గడిచింది. అతనికి ముగ్గురు మొగపిల్లలూ, ఒక ఆడపిల్లా పుట్టారు. వారిలో ఒక మొగపిల్లవాడూ, ఆడపిల్లా చనిపోయినారు. హమీద్ భార్యకు గూడా చాలా జబ్బు చేసింది. ఒకసారి హమీద్ కు ఎండదెబ్బ తగిలి పది హేను రోజులు మంచంలోనే ఉండిపోయినాడు. అటుస్కూల్లో పని పెరిగి పోయింది. ఇటు జీతం ముప్ఫయి రూపాయలయింది. పదిరూపాయలు ప్రైవేటు చెప్పి సంపాదించేవాడు. కాని ఢిల్లీ లో ఆ డబ్బు అతనికి ఏమాత్రమూ సరిపోయేది కాదు. తల్లి రషీదాబాద్ రమ్మని ఉత్తరాలమీద ఉత్తరాలు వ్రాసేది. కాని డబ్బులేక తల్లిని చూడవలెనని ఎంత కుతూహల మున్నా హమీద్ రషీదాబాదు పోలేకపోయినాడు.


రోజూ ఉదయమే లేచి మసీదుకు  పోయి నమాజు చేసుకోవడం, ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఖురాన్ లోనుండి ఒక అధ్యాయం పారాయణం చేయడం అతనికి అలవాటు. మసీదు నుంచి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు రోజూ ముసలి చాకలిది జానకి నడుము వంగిపోయి కర్రపోటు వేసుకొంటూ చాకిరేవుకు పోతూ కనపడేది, కాని ఎందువల్లనో ఐదు రోజులనుండి జానకి కనపడడం లేదు, హమీద్ కు ఆశ్చర్యం వేసింది. జానకి కనపడని రోజు లేదే: ఎందువల్ల ఐదు రోజులనుండి కనపడడంలేదో తెలుసుకుందామని జానకి ఇంటికి వెళ్లాడు, జానకి ఏమైందని అక్కడివాళ్ళను ప్రశ్నిస్తే విన్నరాత్రి చనిపోయిందని వాళ్ళు జవాబు చెప్పారు.


జానకి చనిపోయిందని వినగానే హమీద్ గుండె గుభీలుమన్నది. జానకికి హమీద్ కు ఏమి సంబంధమున్నదో భగవంతునికి తెలియాలి , స్కూలుకు పోయినాడు. అక్కడ అతనికి ఏమీ తోచలేదు. ఏదోవిధంగా కాలక్షేపం చేసి స్కూలు వదలి పెట్టగానే ఇంటికి చేరాడు. భార్య “శరీరం బాగాలేదా ?" అని అడిగింది. ఏమీ వినిపించుకోలేదు. తెల్లవార్లూ అతనికి నిద్ర పట్టలేదు. మర్నాడు బక్రీదు. స్కూలుకు సెలవు. స్టేషన్ కి పోయి రషీదాబాద్ కు టిక్కెట్టు కొన్నాడు. రైల్లో పడ్డాడు. బక్రీదురోజు పగలల్లా రైల్లోనే గడిచింది. నమాజులేదు. కుర్బానీ లేదు. ముసలితల్లి ధ్యాసే. కళ్ల ముందు ముసలితల్లి కన్పించడమారంభించింది. తెల్లబడిపోయిన వెంట్రుకలు, ముడతలు పడిపోయిన శరీరం, వంగిపోయిన నడుము.

 

భార్య, పిల్లలమీద మక్కువవల్ల హమీద్ ముసలి తల్లిని మర్చిపోలేదు. నాలుగైదుసార్లు ఏడెనిమిది రూపాయలు తల్లికి మనియార్లరు గూడా పంపించాడు. ఆ డబ్బు పంపినప్పుడల్లా తనూ, తన పిల్ల లూ చాలా ఇబ్బంది పడే వాళ్ళు, తన తల్లికి ఉత్తరాలు వ్రాసినప్పుడు పిల్లలచేత గూడా ఆ ఉత్తరాల మీద ఏవో గీతలు గీయించేవాడు. ఆ పిచ్చిగీతలు చూసి తన తల్లి సంతోషించవలెనని అతని అభిప్రాయం. అతని భార్య గూడ వ్రాయడం నేర్చుకొన్నది. అత్తగారికి సలాములు తెలియపరుస్తూ ఉండేది. అటునుండి తల్లి మాటమాటకి రమ్మనీ పక్క ఇంటి దర్జీఆమె చేత ఉత్తరాలు వ్రాయిస్తూ ఉండేది. వచ్చే సంవత్సరం పంట రోజుల్లో తప్పక వస్తానని వ్రాసేవాడు. కుటుంబంతో పోవాలి. చేసేది ఉద్యోగం గనుక యేవోకానుకలు తీసుకొనిపోవాలి. పళ్ళు ఫలాలు తీసికొనిపోవాలి. అందుకు డబ్బుగావాలి. వచ్చే జీతంతో తిండి గడవడమే కష్టంగా ఉండేది. అందువల్ల ఎప్పటికప్పుడు ప్రయాణం ఆపుకొనేవాడు. కాని జానకి మరణవార్త వినిగుండె పగిలినట్లయి ఆగలేక ఒంటిరిగా బయలుదేరాడు.


బక్రీదునాడు సూర్యాస్తమయం సమయానికి హమీద్ రషీదాబాద్ చేరాడు. పైనుండి భోరున వర్షం కురవడం ఆరంభించింది. అతనికి స్మృతి వచ్చినట్లయింది, గొడుగుమాత్రం చేతులో ఉన్నది. అయ్యో! గుడ్డలన్నా తెచ్చుకోలేదనుకున్నాడు. గొడుగు వేసుకొని బయలు దేరాడు. జనం   నివసించే చోట నీళ్ళు నిలవగూడదనే ఆరోగ్య సూత్రం గ్రామస్తులకు అర్ధమే అయ్యేది కాదు, అర్థమైనా వాళ్ళు పట్టించుకొనే వాళ్పుకాదు. మోకాళ్ళతోతు నీళ్ళలో పడుతూ, లేస్తూ మెల్లగా యింటికి చేరుకొన్నాడు. తలుపు లోపల వేసి ఉన్నది. తలుపు తట్టాడు. "అమ్మా ! అమ్మా !" అని పెద్దగా పిలిచాడు.


లోపుల నుండి ఒక లావుపాటివాడు వచ్చి తలుపులు తెరిచాడు. బక్రీదు పిండివంటలన్నీ తిని అరగడానికి నిద్రబోయి అప్పుడే లేచినట్లు కనపడ్డాడు, హమీద్ ను గుర్తు బట్టి మూడు సంవత్సరాల క్రితం ఆ యిల్లును కొన్నట్లున్నూ. హమీద్ తల్లి దర్జీ ఆమె ఇంట్లో వున్నదని చెప్పాడు. తలుపు వేసుకొని లోపలికి వెళ్ళిపోయినాడు.


హమీద్ కు అడుగు ముందుకు పడలేదు. ఇల్లు కూడా అమ్మవలసినంత కష్టంలో తల్లి పడిపోయింది కాబోలు ననుకున్నాడు. వనపచెట్టు ఆదాయంతో కాలక్షేపం చేస్తున్నదనుకొని చాలా పొరపాటు చేశాననుకున్నాడు. ఆ తల్లికి మొఖం చూపించడమెలా , ఎంత స్వార్ధం తనలో బలిసిపోయింది. తన పిల్లల మంచినీ, తన మంచినీ తను చూసుకున్నాడే గాని ముసలి తల్లిని గురించి ఆలోచించనైనా లేదుగదా అని పశ్చాత్తాన పడ్డారు. మెల్లగా దర్జీఆమె ఇంటిదగ్గరకు కాళ్ళీడ్చుకుంటూ చేరాడు. తలుపు కొట్టబోయాడు. చెయ్యి లేవలేదు. మెల్లగా తలుపు కొట్టాడు. "అమ్మా !" అని పిలిచాడు. దర్జీ సోతి వచ్చి తలుపు తీసింది. హమీద్ ను గుర్తు బట్టింది. “హమీద్ వచ్చాడు. హమీద్ వచ్చాడు" అంటూ లోపలకు పరుగెత్తింది.


హమీద్ తల్లి ఈమధ్య ఆసక్తతవల్ల ఇంట్లో అటూ ఇటూ  నడవడం కూడా మానుకొన్నది, ఆమె కళ్ళు కూడా ఏమీ కన్పించేవి కావు. కాని హమీద్ వచ్చాడనడంతోనే ఆ సంతోషంలో ఎక్కడ నుండి శక్తి వచ్చిందో ఠఫీమని లేచి వాకిట్లోకి దూకి హమీద్ ను ఆలింగనం చేసుకొన్నది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె శరీరంలో ఎముకలు తప్ప ఏమీలేవు. తలమీద వెంట్రుకలు తెల్లబడి పోయినవి. నడుము వంగిపోయింది. మెడ శిరస్సు భారాన్ని గూడా వహించలేకుండా ఉన్నది. ప్రేమవల్లనో, లేక ముసలి తనం వల్లనో ఆమె శరీరం వణక నారంభించింది. చాలాసేపు ఇద్దరూ మాట్లాడలేకపోయినారు. చివరకు తల్లి మెల్లగా కంఠం పెకలించుకొన్నది "నాయనా , చాలా దూరం నుండి వచ్చావు. గుడ్డలన్నీ తడిసిపోయినవి. గుడ్డలు మార్చుకో, టీ తీసుకొని వస్తాను, పిల్లలంతా కులాసాగా ఉన్నారా ?" అని ప్రశ్నించింది.


అమ్మా, ఇల్లు అమ్మివేశావా ? నాకు తెలియజేయలేదేమి " అని అడిగాడు.

“నాయనా! నీకు తెలియజేస్తే మాత్రం నువ్వేమి చేస్తావు, నీకు మాత్రం కష్టాలు తక్కువగా ఉన్నవి గనుకనా, కానీ. ఈ దర్జీ సోతి నాకు చాలా సహాయం చేస్తున్నది. నీ కష్టాలు మీకు గాక నా బాధ కూడా మీకెందుకు నాయనా, ఈ జన్మలో నిన్ను చూడలేనేమో అనుకున్నాను, నువ్వు వచ్చావు" అన్నది.


హమీద్ కళ్ళవెంట బొటబొటా నీళ్లు కార్చాడు. ఇల్లు నలువైపులా కలయ చూచాడు. ఎదుట చిన్న మంచం మీద దర్జీ ఆమె ఇద్దరు పిల్లలూ నిద్రబోతున్నారు. ఒక పిల్లవాడు కింద ఆడుకుంటున్నాడు.

దర్జీ సోతి పొయ్యి రాజేస్తున్నది. ఆమె తొడుక్కున్న రవిక వీపుమీద చిరిగిపోయి పున్నది. గుడ్డలు మాత్రం తెల్లగానే ఉన్నవి.. బక్రీదు పండుగ కదూ!


"అమ్మా , రోజూ నీవు ఇక్కడనే నిద్రపోతూ ఉంటావా?"


“కాదు నాయనా ! ఆమె ఈ గదిలో పిల్లలతో పడుకొంటూంది. నేను అవతల గదిలో పడుకొంటాను" అన్నది తల్లి.


“అమ్మా! నీవు ఇంకా పనిచేస్తూనే ఉన్నావా? చేతులు పని చేయనిస్తున్నయ్యా!”

"చేతులు బాగానే ఉన్నవి గాని కళ్ళు మాత్రం నెల రోజుల నుండి కనపడడంలేదు నాయనా"


“కళ్ళు కనపడడంలేదా ? అన్నాడు ఆతురతతో హమీద్,


తల్లి హమీద్ తలను చేతితో నిమిరింది. చెయ్యి బుగ్గలదాకా పోనిచ్చింది. అతని తలను తన హృదయానికి హత్తుకొన్నది. చిరునవ్వు నవ్వింది. "నాయనా, కళ్ళు కనపడడం లేదా అంటున్నావా , నాయనా నీవు కనపడుతూనే వున్నావు. రోజూ సూర్యుడు కనబడతాడు అంతే. మిగిలిన వస్తువులు ఏమీ కనబడవు. చిన్న పిల్లవాడు కులాసాగా ఉన్నాడా? వాడి వయస్సెంత? అని అడిగింది.


“సంవత్సరంన్నర"


“అయితే చొక్కా, టోపీ వాడికి సరిపోతవి" అంటూ ఒక పాత గుడ్డల మూట విప్పి అందులోనుండి ఒక చొక్కాను, బుటేదారీ పనిచేసి యున్న ఒక టోపీని బయటకు తీసింది.


"మజీద్ కోసం ఇవి తయారుచేశావా ? అని హమీద్ కన్నీళ్ళు కార్చాడు.


కాదు నాయనా సలమా కోసం కుట్టి తయారు చేశాను. పంపుదామంటే నీవు రానేలేదు. తరువాత సలమా చచ్చిపోయిందని ఉత్తరం వ్రాశావు అని చొక్కా వంక చూసి కన్నీళ్ళు పెట్టుకొన్నది. లేచి లోపలికి వెళ్ళిపోయింది. టీ తెచ్చి ఇచ్చింది. తాగారు. తల్లి మంచం మీద కూర్చొని ఉండిపోయినాడు.


ఏమిటేమిటో ఆలోచనలు హమీద్ తనను తాను మరచి పోయినాడు. అలా రెండు గంటలు గడిచింది. పక్క ఇంటి నసీబన్ గూడా వచ్చింది. నసీబన్, హమీద్ తల్లి, సోతి వంట ఇంట్లో ఏమేమిటో చేస్తూ ఉండిపోయినారు.


సుమారు ఎనిమిది గంటలకు హమీద్ తల్లి బయటికి వచ్చి “నాయనా! భోజనానికి లేవమన్నది.

అప్పటికి హమీద్ కు కొద్దిగా నిద్రపట్టింది. ఉలిక్కి పడి లేచాడు.


బీద స్థితిలో ఉన్నది గనుక తల్లి జొన్నరొట్టె తయారు చేసి ఉంటుందనుకొన్నాడు. కాని వడ్డించిన పదార్థాలను చూసి ఆశ్చర్యపడ్డారు. కబాబు, మేక గుండెకాయ కూర, పొరాటాలు, మినప్పప్పు పప్పు గారెలు,మామిడి కాయ పచ్చడి, ఒక కప్పులో మీగడి, ఒక ప్లేటులో వండిన మామిడి పండు ముక్కలు ఘుమఘుమ లాడుతున్నవి. ఇంత బీదతనంలో ఉన్న తల్లి ఈ సామానంతా నెలా సేకరించిందా అని ఆలోచించాడు. భోజనం చేశాడు. భోజనం చేసినంత సేపూ తల్లిదగ్గర కూర్చొని లోకాభిరామాయణం చెప్పింది. కొసరి కొసరి వస్తువులు వడ్డించింది. తృప్తిగా భోజనం చేశాడు. లేచి చేతులు కడుక్కొని మంచం మీదకు చేరాడు.


దర్జీఆమె, నసీబన్ ఇద్దరూ బయటకు వెళ్ళి కొంత సేపట్లో తిరిగి వచ్చారు.

తల్లి హమీద్ దగ్గరకు వచ్చింది. “నాయనా ! ఒక్క మాట చెపుతాను. వింటావా ?" అని అడిగింది.

హమీద్ మొఖం వెలవెల బోయింది. గుండె దడదడ లాడింది. బహుశా తల్లి తనతోగూడా ఢిల్లీ వస్తానంటుందనుకొన్నాడు. లోలోపల అనేక ఆలోచనలు తనకు వచ్చే జీతం చాలా కొద్ది, ఢిల్లీ లో ఆ కొద్ది జీతం మీద అంతమంది బ్రతకడం ఎలాగా? భార్యా, పిల్లలూ, తల్లీ యింత మందినీ తను పోషించగలడా . తల్లి వంక అలాగే చూస్తూ ఉండి పోయినాడు.


"నాయనా నీవు పట్టణంలో ఉండేవాడివి. నౌకరీదారుడివి. నేను పరాయవాళ్ళ పంచల్లో తలదాచుకొంటున్నాను. నీకు ఎలా మర్యాద చేయగలను నసీబన్ ను పంపించి ఖాన్ సాహెబుగారి ఇంట్లో ఒక గది బాగు చేయించాను. మంచం, పక్కా వేయించాను. కాని నీవు నాతోబాటే ఉంటే బాగా ఉంటుందని నా మనస్సు కోరుతున్నది. ఈ ముసలిముండతో కూర్చోమంటే నీకు మనస్సుకు ఏమి కష్టం కలుగుతుందోనని చూస్తున్నాను. భయపడుతూ ఉన్నాను. నాయనా ! నా కోరిక పూర్తిచేస్తావా, అని భయపడుతూ అడిగింది.


"అదుగో, మంచం కూడా తెప్పించాను" అని ఎదుటపరచి ఉన్న మంచం చూపించింది.

తల్లి మాటలకు హమీద్ గుండె కరిగిపోయింది. నోటనుండి మాట రాలేదు. "అమ్మా! నీ దగ్గర ఉండకపోతే నేను యింకెక్కడకు పోతాను” అన్నాడు.


తల్లి ఆనందసంభరితురాలైంది. హమీద్ శిరస్సును ఆఘ్రాణించింది. నసీబన్ ను పిలిచి మంచం తన గదిలో వేయించింది. ఒకమూట విప్పి తెల్ల దుప్పటి బయటకు తీసింది. ఆ దుప్పటిమీద రకరకాల లతలు కుట్టి ఉన్నవి. ఆ మూటలోనుంచి రెండు దిండ్లు బయటకు తీసింది. తెల్లటి గలీబులు తొడిగి ఉన్నవి. చిన్న సీసాలోనుంచి అత్తరు తీసి గలీబులకు అత్తరు రాసింది. మంచం కింద ఒక పీక్ దానును పెట్టించింది. ఢిల్లీ పూల నల్ల చెప్పుల జోడు - కొత్తది - మంచం కాళ్ళ వైపున పెట్టి "నాయనా ! అలసిపోయినావు. ఈ మంచం మీద పడుకొని నిద్రబొమ్మన్నది.

హమీద్ ఈ తమాషా అంతా చూస్తున్నాడు. యా అల్లాహ్ ఈ సామనంతా ఎలా వచ్చింది . చివరకు తల్లిని అడిగాడు.


రషీదాబాద్ గూడా చిన్న బస్తీ లాంటి గ్రామమే. అన్నీ ఈ ఊళ్లోనే దొరికినవని జవాబు చెప్పింది.


"అమ్మా! భోజనం సంగతి సరే. ఈ చెప్పులు, ఈ పీక్ దాను. ఈ దుప్పటి ఇవన్నీ ఎలా కొన్నావు ?"

తల్లి వేడివేడి కన్నీళ్లు కార్చింది. మాతృదేవతా వాత్సల్యం అనుపమానం "ఏడు సంవత్సరాలు ఎదురు చూశాను. ఇల్లు అమ్మాను. పొట్ట బిగించుకొని నీ కోసం, నీ పిల్లల కోసం ఈ వస్తువుల్ని సేకరించాను. నీ కోసం ఎదురు చూసిచూసి కళ్ళు కాయలు గాచినవి. నాయనా ! ఈ వస్తువుల్ని సేకరించడానికి ఏడు సంవత్సరాలు వల్లింది. సల్మాను చూడనే లేదు " అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. .


తల్లి మాటలను విని శాంతిదేవత ఆ చిన్నగదినిండా తన రెక్క లను విప్పింది. ఇక ఎవరూ ఏమి మాట్లాడలేదు.


తెల్లవారిపోతుంది హమీద్ తల్లి ఇక కళ్లు తెరవలేదు.


***********



కామెంట్‌లు లేవు: