నా మాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నా మాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జులై 2020, బుధవారం

క్షమ మహోన్నత గుణం


క్షమ మహోన్నత గుణం

మనిషి శారీరకంగా ఆర్ధికంగా బలహీనమైనపుడు.. ఆ మనిషి ఎన్ని తప్పులు చేసినా అంతకుముందు మన మననును బాధ పెట్టినా అవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా.. వారిని ఆదరించి నీకు మేమున్నాం అని భరోసా కల్గించడం మానవీయ లక్షణం. రోగాన్ని రోగ గ్రస్త శరీరాన్ని మనం నయంచేయలేకపోయినా అప్పటి వారి మానసిక స్థితి శరీర దౌర్భల్యానికి ఆదరణతో కూడిన సేవ సాంత్వన కల్గించే మాటలను తప్పకుండా అందించాలి. మనుషుల హృదయాలు రాతి హృదయాలు కరగనివయితే కాదు.. కదా!

మంచిమనుషులకు కోపం తాటాకు మంటలాంటిదంటారు.. కదా.. అలా వుండగల్గాలి. ఎవరూ తప్పులు చేయనివారు లోపాలు లేని వారు వుండరు. క్షమ మనిషిని మహోన్నత శిఖరాల మీద కూర్చుండబెడుతుంది అంటారు కదా.. నిజానికి చాలామంది డబ్బు లేక సరైన వైద్యం లేక పోరాడి అలసి అలసి నిస్సహాయస్థితిలో మరణిస్తారు. కొంతమంది అహంకారంతో అన్నీ వుండి కూడా ఆత్మీయులు లేక అలమటిస్తారు.

మనం భగవంతుని ముందు క్షమసత్వం చెప్పుకున్నట్టే మనవారి ముందు చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రేమ వాత్సల్యం ఎరిగినవారు వారే గ్రహిస్తారు. ఎన్ని కన్నీళ్ళు కుమ్మరించిన మాట చేసిన గాయం మానదు.. అయినా వారినీ క్షమించాలి.

ఉమర్ ఖయ్యామ్ రుబాయీ కి తెలుగు అనువాదం చూడండి. -చలం అనువాదం.,

“భరించే నీక్షమ నాకండగా వుండగా
నా పాపభారాన్ని చూసి నాకేం భయంలేదు.
నా చరిత్ర ఎంత నల్లనిదైనా
నీ కరుణ నన్ను కడిగి శుభ్రంచేస్తే
నీ సమక్షంలో నిలవడానికి నేను జంకను”.

PS: ఇలా అని మనం భగవంతుని ముందే కాదు మన వారి వద్ద అన్నాము అనిపించుకోవడానికి అభిజాత్యం ప్రదర్శించవద్దు. గంగ లాగ పొంగి వచ్చి యమునలా సంగమించేదే ప్రేమ. ప్రేమించడానికి ఒక సాప్ట్ కార్నర్ వుంటుంది ప్రతి ఒక్కరిలో. అది చాలు.


26, నవంబర్ 2019, మంగళవారం

సమస్య ..ఒక కానుక



నేను కుండీలో పెంచే మొక్కల్లో ముఖ్యమైనది "మరువం " పాక్షికంగా సూర్యరశ్మి తగిలే చోటులో మరువం బాగా ప్రవర్ధమానం అవుతుంది. పూలు కరువైనప్పుడు మరువం, తులసి దళాలు పూజకు వాడుకుంటాను. అయినా గాలి గట్టిగా వీస్తే చాలు మరువం వాసన కాఫీ వాసనలా చుట్టుపక్కల వ్యాపిస్తుంది. 

ఒకోసారి మరువం తుంచనప్పుడు ఎండిపోతుంది. అప్పుడప్పుడు ఎండిపోయిన మరువం కొమ్మలను దెచ్చి ఇష్టమైన పుస్తకాలలో పెడుతూ వుంటాను. పెట్టిన పేజీని చదివి అందులో విషయాన్ని చదువుకుని మురిసిపోతాను. పుస్తకాలు బహుమతిగా ఇచ్చినప్పుడు మరువం పెట్టి యిస్తూ వుంటాను. కొన్ని రోజుల క్రిందట  పది దాకా మరువం కొమ్మలు ఎండిపోయి కనిపించాయి. వాటిని తీసుకొచ్చి .. పరుపు పై చక్కగా పేర్చి ఉంచిన పుస్తకాలపై .నుండి ఒక పుస్తకం తీసుకుని అందులో కొన్ని కొమ్మలుంచాను. కొన్ని బట్టల  బీరువాలో పెట్టాను. 

మళ్ళీ యెందుకో ఆసక్తి కలిగి మరువం కొమ్మలు పెట్టిన పుస్తకం చేతిలోకి తీసుకుని ఆ కొమ్మలు పెట్టిన చోటున ఏమి వ్రాసి వుందో చూసుకున్నాను. సమస్యలు అనే కానుక. ఆహా అనుకున్నాను. ఆ కానుక మనకి మనం తెచ్చుకున్నది కావచ్చు ఇతరుల ద్వారా మనకు కలగడం కావచ్చు. ఏమైనా సమస్యలను కానుకగా స్వీకరించక తప్పదు. .సమస్యలు అనుభవాల దండలో పూలు. జ్ఞాపకాలు పూలు వాడినా ఆ పరిమళాన్ని అంటి పెట్టుకున్న దారపు పోగులు. 

సమస్యలు అందరికీ వస్తూ ఉంటాయి. వాటిని ఎలా యెదుర్కొన్నామన్నదే జీవితం. 
చాలా పుస్తకాలు మూడు పెట్టెలవరకూ ఇతరులకి ఇచ్చేసాను. మరికొన్ని పుస్తకాలు చదువుకొని ఇమ్మని మా కిట్టీ సభ్యులకు బట్వాడా చేస్తున్నాను. ఒకరినుండి మరొకరు మార్చుకుని చదువుకోమని. ఒక ఫ్రెండ్ "వేయిపడగలు "అడిగింది. తీసుకెళ్లి యిచ్చాను. మూడునెలలు టైమ్  లిమిట్ పెట్టి అప్పటికి చదివేయాలని చెప్పాను..   

అక్షర క్రమంలో సర్దుకోవాలని కింద పరచి .. అలమారాలు చెమ్మగా ఉన్నాయని ..పుస్తకాలన్నిటినీ పరుపు పై పవళింపజేశాను. ఏమిటో ..నాకీ సమస్య  :) ఎదుర్కోవాలి తప్పదు. 
పెద్దలగా మన పిల్లలు తమకు సమస్యను ఎలా కొని తెచ్చుకుంటారో .. వాటిని ఎలా పరిష్కరించుకుంటారో చూస్తూ ఉండటం తప్పదు. పెద్దలాగా సలహా ఇవ్వబోతే ... నీకెందుకు అని కసురుకుంటారు కాస్త సున్నితమైన వాళ్ళైతే .. I'll Take Care. don't worry అంటారు. సమస్య వాళ్ళ చేయి దాటిపోయేదాకా చూసి అప్పుడు మనం కల్పించుకోవాలన్నమాట. అప్పుడు సమస్యలు ఒక కానుకే అనుకోవాలన్నమాట.నా లిస్ట్ లో వున్నా  కొంతమంది పిల్లలకు ఇది సెటైర్ .. :)  అవకాశం వస్తే పెద్దలు దెప్పకుండా వొదులుతారా యేమిటీ  :) 

ఈ విషయం అంతా రాసాక ..ఇంకొన్ని మాటలు చెప్పాలనిపిస్తుంది. పేజీ తెరిచి చూడటం అందులో వున్న విషయాన్ని చదువుకుని sync చేసుకోవడం అన్నది .. నా బైబిల్ మిత్రులని చూసి నాకు అంటుకుని ఉంటుందనిపిస్తుంది  :) ఆరునెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారట అని నానుడి కదా ! 

పని కట్టుకుని చేసే మత  ప్రచారం చాపక్రింద నీరులా మనని చుట్టుకుంటుంది. అది రాజకీయ దురుద్దేశ్యంతో కూడుకున్నదని మనకి తెలియనిది కాదు. అది ఏ మతమైనా సరే ! మనిషికి మతం ముఖ్యం కాదు.. నా చుట్టూ ఉన్న విషయాలపై కథ వ్రాయాలి అనేంత బలంగా మత విషయాలు రాజకీయ కోణాలు బలంగా వేళ్ళూనుకుంటున్నాయి.  దేవాలయాలు చరిత్ర కూడా బాగా గమనిస్తూ ..అనేక విషయాలు తెలుసుకుంటున్నాను. మనిషికైనా దేశానికైనా సమస్యలు కానుకలు అనుకోవాలి. అంతకు మించి పోరాటం చేయాలి తప్పదు.





 

6, జూన్ 2018, బుధవారం

ముందు మాట..




" కుల వృక్షం  " కథల సంపుటి ముందు మాట..
 
ఈ అక్షరాలపూలపై వాలిన పాఠక సీతాకోకచిలక మిత్రులకి స్వాగతం.
ఏ కథకా కథ వ్రాసాక నేను వెనుదిరిగి చూసుకుంటాను.  ఓ స్వల సంతోష వీచిక మాటున అనంతమైన అసంతృప్తి. మంచి కథ వ్రాయాలని మళ్ళీ అనుకుంటాను.  ఎందుకో వ్రాసిన  యే కథ నాకు సంతృప్తినివ్వదు. నా కథలన్నీ జీవితంలోనుండి నడిచొచ్చిన కథలు. మూడొంతులు జీవిత సత్యానికి  పావు వంతు కల్పనా శక్తిని జోడించి  యీ కథలని వ్రాసాను .
కథలెలా వ్రాస్తారు అంటే నేను చెప్పలేను. వ్రాసిన తర్వాత ఇది కథగా బాగా కుదిరింది అని వేరొకరు చెప్పేవరకూ,పత్రికల వారు ఆమోదించేవరకూ అదొక సంశయం. వ్రాసే ప్రతి కథని  సరికొత్తగా కథ వ్రాస్తున్నాననుకుని  బెరుకు బెరుకుగా మొదలబెట్టడమే నాపని. కథ ముగిసినాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాను.
నేను రచయితనై సమాజానికి యేదో సేవ చేస్తున్నానని అనుకోవడంలేదు.  నా రచనలు చదివి సమాజ పురోగవ్రుద్ది సాధిస్తుందనే భ్రమలు నాకు లేవు. నా కాలంలో నా చుట్టూరా ఉన్న ప్రపంచం యెలా వుంది ప్రజల  జీవనం, జీవితాల్లో సంక్లిష్టతని నా దృష్టికోణంతో దర్శించి నా ఆలోచనలనకి అక్షర రూపమిస్తూ  నా కాలాన్ని నమోదు చేసానని అనుకుంటానంతే !
నా మొదటి కథాసంపుటిని చదివిన మిత్రులిచ్చిన ప్రోత్సాహంతో రెండో కథాసంపుటిని మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కథా సంపుటిలో ఇరవై నాలుగు కథలున్నాయి. ఇందులో పదిహేను కథలు వివిధ పత్రికలలో వచ్చినవి. మిగతావి బ్లాగ్ లో ప్రచురించుకున్నవి.  ఒక విధంగా నా స్వయం చోదకశక్తితో కథ వేదికపై  నన్ను నేను నిలబెట్టుకుంటూ ..  నేనుగా  జయప్రదం చేసుకునే  ప్రయత్నమిది. చదివి మీ సద్విమర్శలని ,సలహాలని అందించి నా అక్షరాన్ని పునీతం చేసి  రాబోయే రచనలకి మరింత వన్నెనిస్తారని ఆశిస్తూ ..
వెనుదిరిగి చూసుకుంటూ ముందుకు  నడుస్తున్న నా రచనా ప్రయాణంలో ఆగి కాసేపు మీతో ముచ్చటించే ఈ భాగ్యానికి మురిసిపోతూ .. .
                                                                                   నమస్సులతో ..
                                                                                  వనజ తాతినేని.

   

1, డిసెంబర్ 2016, గురువారం

విన్నవించుకోనీయండి ... ఈ చిన్నమాటని..



నా కథల సంపుటి "రాయికి నోరొస్తే" విడుదలైంది. అందులో నా మాట ఇలా ..

విన్నవించుకోనీయండి ... ఈ చిన్నమాటని .

చదువుకునేటప్పుడు కాలేజ్ మేగజైన్ లో వ్యాసాలూ చిన్న చిన్న కవితలు వ్రాసిన నేను తర్వాత తర్వాత ఆకాశవాణికి చిన్నచిన్న స్క్రిప్ట్ లు వ్రాసి,కవిత్వం వ్రాసి ప్రశంసలు అందుకుంటానని అప్పట్లో తెలియదు . అలాగే సొంత బ్లాగ్ ఒకటి రూపొందించుకుంటానని కూడా అనుకోలేదు. ఎప్పుడూ ఇలా చేయాలి అనుకోలేదు.చదవడం,వినడం ఒక వ్యసనం. వ్రాయడం కూడా అంతే అయింది. కాలక్షేపం కోసం కాదుగాని నాలో మెదిలే నిరంతర ఆలోచనలని పంచుకోవడం కోసం బ్లాగ్ వ్రాస్తూ వ్రాస్తూ కథలు కూడా వ్రాయడం మొదలెట్టాను.మిత్రులే కాకుండా నాకు తెలియని పాఠకులు కూడా ప్రశంసించడం ఆనందం కల్గించినప్పటికీ ఒకింత భయం కల్గింది. నేను సరిగా వ్రాస్తున్నానా అని నన్ను నేనే ప్రశ్నించుకోవడం మొదలెట్టాను . ఎంతోమంది రచయితలని చదువుతున్న నేను రచనలని బాధ్యతగా చేయాలని తెలుసుకున్నాను.

సాహిత్యం మనుషులని మారుస్తుందా అంటే మారుస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను,నాతో పాటు ఎందరో మిత్రులు బాహాటంగా ఒప్పుకున్న విషయం ఇది. నా అనుభవాలని ఇతరుల అనుభవాలని కూడా దృష్టిలో పెట్టుకుని , నా చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తూ రచనలు చేయడం ప్రారంభించాను. నేను వ్రాసిన ఈ కథలన్నీ చాలా వరకు నిజ జీవితంలో పాత్రలే ! వాస్తవ జీవితాలకి పావు వంతు కల్పన జోడించి పాఠకుల ముందు ఈ కథలని నిలబెట్టాను. పాఠకులు ఈ కథలని ప్రశంసించారు,విమర్శని అందించి నా కొత్త కథకి మంచి దారి చూపారు. ప్రతి కథ ప్రచురింపబడినప్పుడల్లా నేను మరింత నేర్చుకునేటట్లు సద్విమర్శలని అందించారు. అందుకే నేను ఇన్ని కథలు వ్రాయగల్గాను.

నేను అడగగానే ఎంతో ఒత్తిడితో కూడిన సమయాలలో కూడా తీరిక చేసుకుని ఉదార హృదయంతో కేవలం నాలుగు రోజులలోనే ప్రతి కథని చదివి ఏ కథకి ఆ కథ పై సమీక్ష వ్రాసి, ముందు మాట "వనవేదిక " ని వ్రాసి ఇచ్చిన "భువన చంద్ర " గార్కి వినమ్ర పూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

అలాగే నా తొలి స్క్రిప్ట్ నుండి ఇప్పటి వరకు నేను ఏం వ్రాసినా మెచ్చుకుని నన్ను ప్రోత్సహిస్తూ నా ప్రధమ పాఠకురాళ్ళగా ఉన్న నా ఆత్మీయ నేస్తాలు కుసుమ కుమారి గారు , వైష్ణవి లకి నా మనఃపూర్వక ధన్యవాదాలు

బ్లాగ్ వ్రాస్తూ అప్పుడప్పుడు కథలు వ్రాసిన నన్ను మీరు కథలు బాగా వ్రాస్తారు, వ్రాయడం ఆపొద్దు అంటూ ఎల్లప్పుడూ ప్రోత్సహించిన ... ప్రియనేస్తం డా.సామాన్య కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

కొత్త కలాలకి చోటునిచ్చి ప్రోత్సహించి సారంగ వెబ్ పత్రిక ద్వారా నా రచనలని పరిచయం చేసిన "కల్పన రెంటాల " గారికి "అఫ్సర్" గారికి, విహంగ వెబ్ పత్రిక "పుట్ల హేమలత "గారికి సదా కృతజ్ఞతలు.

భూమిక "కొండవీటి సత్యవతి " గారికి, కథలలో మణి పూసలని ఎరేరీ పాఠకులకి అందించే ఆంధ్రజ్యోతి ఆదివారం కథా విభాగం ఎడిటర్ "వసంత లక్ష్మి " గారికి, చినుకు "రాజగోపాల్ " గారికి మిగతా కథలని ప్రచురించిన ఇతర పత్రికల వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.

మీ కథలన్నీ ఒకచోట చదవాలి, కథా సంపుటి ఎప్పుడు తీసుకువస్తారు ..త్వరగా ఆ పని చేయండి అంటూ అలసత్వంతో ఉన్న నన్ను ముందుకు నెట్టిన అనేకానేక మిత్రులకి ఆత్మీయ వందనం.

నా అక్షరాలని ఇంత అందంగా పుస్తక రూపంలో అందించిన శ్రీ శ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు గారికి, అందమైన ముఖచిత్రాన్ని రూపొందించిన A.గిరిధర్ గారికి, డి.టి.పి చేసి నాకెన్నో సూచనలు అందించిన పద్మావతిశర్మ గారికి అందరికి ధన్యవాదాలు.

వనజ తాతినేని.

For Copies : 

Navodaya Publishers Karl Marx Road, Vijayawada - 2 Ph. 0866 2573500 

Navodaya Book House Kachiguda, Hyderabad 

Prajasakti Book House, Chikkadapally, Hyd, and its branches in A.P. 

e book : www.kinige.com 

Printed at : Sri Sri Printers VIJAYAWADA - 520 002 

Cell : 9490 634849