8, జులై 2020, బుధవారం
క్షమ మహోన్నత గుణం
26, నవంబర్ 2019, మంగళవారం
సమస్య ..ఒక కానుక
6, జూన్ 2018, బుధవారం
ముందు మాట..
" కుల వృక్షం " కథల సంపుటి ముందు మాట..
ఈ అక్షరాలపూలపై వాలిన పాఠక సీతాకోకచిలక మిత్రులకి స్వాగతం.
ఏ కథకా కథ వ్రాసాక నేను వెనుదిరిగి చూసుకుంటాను. ఓ స్వల సంతోష వీచిక మాటున అనంతమైన అసంతృప్తి. మంచి కథ వ్రాయాలని మళ్ళీ అనుకుంటాను. ఎందుకో వ్రాసిన యే కథ నాకు సంతృప్తినివ్వదు. నా కథలన్నీ జీవితంలోనుండి నడిచొచ్చిన కథలు. మూడొంతులు జీవిత సత్యానికి పావు వంతు కల్పనా శక్తిని జోడించి యీ కథలని వ్రాసాను .
కథలెలా వ్రాస్తారు అంటే నేను చెప్పలేను. వ్రాసిన తర్వాత ఇది కథగా బాగా కుదిరింది అని వేరొకరు చెప్పేవరకూ,పత్రికల వారు ఆమోదించేవరకూ అదొక సంశయం. వ్రాసే ప్రతి కథని సరికొత్తగా కథ వ్రాస్తున్నాననుకుని బెరుకు బెరుకుగా మొదలబెట్టడమే నాపని. కథ ముగిసినాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాను.
నేను రచయితనై సమాజానికి యేదో సేవ చేస్తున్నానని అనుకోవడంలేదు. నా రచనలు చదివి సమాజ పురోగవ్రుద్ది సాధిస్తుందనే భ్రమలు నాకు లేవు. నా కాలంలో నా చుట్టూరా ఉన్న ప్రపంచం యెలా వుంది ప్రజల జీవనం, జీవితాల్లో సంక్లిష్టతని నా దృష్టికోణంతో దర్శించి నా ఆలోచనలనకి అక్షర రూపమిస్తూ నా కాలాన్ని నమోదు చేసానని అనుకుంటానంతే !
నా మొదటి కథాసంపుటిని చదివిన మిత్రులిచ్చిన ప్రోత్సాహంతో రెండో కథాసంపుటిని మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కథా సంపుటిలో ఇరవై నాలుగు కథలున్నాయి. ఇందులో పదిహేను కథలు వివిధ పత్రికలలో వచ్చినవి. మిగతావి బ్లాగ్ లో ప్రచురించుకున్నవి. ఒక విధంగా నా స్వయం చోదకశక్తితో కథ వేదికపై నన్ను నేను నిలబెట్టుకుంటూ .. నేనుగా జయప్రదం చేసుకునే ప్రయత్నమిది. చదివి మీ సద్విమర్శలని ,సలహాలని అందించి నా అక్షరాన్ని పునీతం చేసి రాబోయే రచనలకి మరింత వన్నెనిస్తారని ఆశిస్తూ ..
వెనుదిరిగి చూసుకుంటూ ముందుకు నడుస్తున్న నా రచనా ప్రయాణంలో ఆగి కాసేపు మీతో ముచ్చటించే ఈ భాగ్యానికి మురిసిపోతూ .. .
నమస్సులతో ..
వనజ తాతినేని.
1, డిసెంబర్ 2016, గురువారం
విన్నవించుకోనీయండి ... ఈ చిన్నమాటని..
నా కథల సంపుటి "రాయికి నోరొస్తే" విడుదలైంది. అందులో నా మాట ఇలా ..
విన్నవించుకోనీయండి ... ఈ చిన్నమాటని .
చదువుకునేటప్పుడు కాలేజ్ మేగజైన్ లో వ్యాసాలూ చిన్న చిన్న కవితలు వ్రాసిన నేను తర్వాత తర్వాత ఆకాశవాణికి చిన్నచిన్న స్క్రిప్ట్ లు వ్రాసి,కవిత్వం వ్రాసి ప్రశంసలు అందుకుంటానని అప్పట్లో తెలియదు . అలాగే సొంత బ్లాగ్ ఒకటి రూపొందించుకుంటానని కూడా అనుకోలేదు. ఎప్పుడూ ఇలా చేయాలి అనుకోలేదు.చదవడం,వినడం ఒక వ్యసనం. వ్రాయడం కూడా అంతే అయింది. కాలక్షేపం కోసం కాదుగాని నాలో మెదిలే నిరంతర ఆలోచనలని పంచుకోవడం కోసం బ్లాగ్ వ్రాస్తూ వ్రాస్తూ కథలు కూడా వ్రాయడం మొదలెట్టాను.మిత్రులే కాకుండా నాకు తెలియని పాఠకులు కూడా ప్రశంసించడం ఆనందం కల్గించినప్పటికీ ఒకింత భయం కల్గింది. నేను సరిగా వ్రాస్తున్నానా అని నన్ను నేనే ప్రశ్నించుకోవడం మొదలెట్టాను . ఎంతోమంది రచయితలని చదువుతున్న నేను రచనలని బాధ్యతగా చేయాలని తెలుసుకున్నాను.
సాహిత్యం మనుషులని మారుస్తుందా అంటే మారుస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను,నాతో పాటు ఎందరో మిత్రులు బాహాటంగా ఒప్పుకున్న విషయం ఇది. నా అనుభవాలని ఇతరుల అనుభవాలని కూడా దృష్టిలో పెట్టుకుని , నా చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తూ రచనలు చేయడం ప్రారంభించాను. నేను వ్రాసిన ఈ కథలన్నీ చాలా వరకు నిజ జీవితంలో పాత్రలే ! వాస్తవ జీవితాలకి పావు వంతు కల్పన జోడించి పాఠకుల ముందు ఈ కథలని నిలబెట్టాను. పాఠకులు ఈ కథలని ప్రశంసించారు,విమర్శని అందించి నా కొత్త కథకి మంచి దారి చూపారు. ప్రతి కథ ప్రచురింపబడినప్పుడల్లా నేను మరింత నేర్చుకునేటట్లు సద్విమర్శలని అందించారు. అందుకే నేను ఇన్ని కథలు వ్రాయగల్గాను.
నేను అడగగానే ఎంతో ఒత్తిడితో కూడిన సమయాలలో కూడా తీరిక చేసుకుని ఉదార హృదయంతో కేవలం నాలుగు రోజులలోనే ప్రతి కథని చదివి ఏ కథకి ఆ కథ పై సమీక్ష వ్రాసి, ముందు మాట "వనవేదిక " ని వ్రాసి ఇచ్చిన "భువన చంద్ర " గార్కి వినమ్ర పూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అలాగే నా తొలి స్క్రిప్ట్ నుండి ఇప్పటి వరకు నేను ఏం వ్రాసినా మెచ్చుకుని నన్ను ప్రోత్సహిస్తూ నా ప్రధమ పాఠకురాళ్ళగా ఉన్న నా ఆత్మీయ నేస్తాలు కుసుమ కుమారి గారు , వైష్ణవి లకి నా మనఃపూర్వక ధన్యవాదాలు
బ్లాగ్ వ్రాస్తూ అప్పుడప్పుడు కథలు వ్రాసిన నన్ను మీరు కథలు బాగా వ్రాస్తారు, వ్రాయడం ఆపొద్దు అంటూ ఎల్లప్పుడూ ప్రోత్సహించిన ... ప్రియనేస్తం డా.సామాన్య కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు
కొత్త కలాలకి చోటునిచ్చి ప్రోత్సహించి సారంగ వెబ్ పత్రిక ద్వారా నా రచనలని పరిచయం చేసిన "కల్పన రెంటాల " గారికి "అఫ్సర్" గారికి, విహంగ వెబ్ పత్రిక "పుట్ల హేమలత "గారికి సదా కృతజ్ఞతలు.
భూమిక "కొండవీటి సత్యవతి " గారికి, కథలలో మణి పూసలని ఎరేరీ పాఠకులకి అందించే ఆంధ్రజ్యోతి ఆదివారం కథా విభాగం ఎడిటర్ "వసంత లక్ష్మి " గారికి, చినుకు "రాజగోపాల్ " గారికి మిగతా కథలని ప్రచురించిన ఇతర పత్రికల వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.
మీ కథలన్నీ ఒకచోట చదవాలి, కథా సంపుటి ఎప్పుడు తీసుకువస్తారు ..త్వరగా ఆ పని చేయండి అంటూ అలసత్వంతో ఉన్న నన్ను ముందుకు నెట్టిన అనేకానేక మిత్రులకి ఆత్మీయ వందనం.
నా అక్షరాలని ఇంత అందంగా పుస్తక రూపంలో అందించిన శ్రీ శ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు గారికి, అందమైన ముఖచిత్రాన్ని రూపొందించిన A.గిరిధర్ గారికి, డి.టి.పి చేసి నాకెన్నో సూచనలు అందించిన పద్మావతిశర్మ గారికి అందరికి ధన్యవాదాలు.
వనజ తాతినేని.
For Copies :
Navodaya Publishers Karl Marx Road, Vijayawada - 2 Ph. 0866 2573500
Navodaya Book House Kachiguda, Hyderabad
Prajasakti Book House, Chikkadapally, Hyd, and its branches in A.P.
e book : www.kinige.com
Printed at : Sri Sri Printers VIJAYAWADA - 520 002
Cell : 9490 634849