కథా విశ్లేషణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కథా విశ్లేషణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, జనవరి 2023, గురువారం

కుటుంబ భద్రత లో దృశ్యభూతం

 ఈస్తటిక్ సెన్స్  కథాసంపుటిలో 'దృశ్యభూతం’  కథపై విశ్లేషణ/వ్యాఖ్యానం  అందించిన  వారణాసి నాగలక్ష్మి గారికి ధన్యవాదములు  


మొబైల్ ఫోన్లలో ఇతర దృశ్య మాధ్యమాల్లో అందుతున్న రకరకాల నీలిచిత్రాలూ, పసి వయసులోనే వాటికి ఎక్స్పోజ్ అవుతున్న పిల్లలూ, ఫలితంగా వారిలో ఏర్పడుతున్న మానసిక సమస్యలూ - ఒక పెద్ద భూతంలా తల్లిదండ్రులని భయపెడుతున్న ఈ సమకాలీన సమస్యని వనజ తాతినేని గారు ‘దృశ్యభూతం’ కథగా మలిచి, ఒక చక్కని పరిష్కారాన్ని కూడా సూచించారు. 


పిల్లలు కావాలనుకుంటున్న భార్యాభర్తలూ, చిన్న పిల్లలున్న తల్లిదండ్రులూ తప్పక చదవాల్సిన కథ ఇది. తీరికలేని ఉద్యోగాలతో సతమతమవుతూ, నెల తిరిగేసరికి చేతికొచ్చే జీతాలకి ముందుగానే సిద్ధమై ఉన్న ఈ ఎం ఐ ల లెక్కలతో సంతృప్తి లేని జీవితాలు గడుపుతున్న యువదంపతులు నేటి సమాజంలో ఒక ముఖ్య భాగమైపోయారు. వీళ్ళు తమ పిల్లలపెంపకం కోసం జీతమిచ్చి పెట్టుకునే సహాయకుల మీద ఆధారపడుతున్నారు గాని ఇద్దరిలో ఒకరు ఇంటిని చూసుకుంటూ తక్కువ రాబడిలో జీవితాన్ని గడిపే ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. భద్రత నివ్వని, నిలకడ లేని ఉద్యోగాలూ దీనికి ఒక కారణమే. 


ఏదేమైనా ఈ పరిణామం వెనుక కనుమరుగైపోయిన పూర్వకాలపు ఉమ్మడి కుటుంబ వాతావరణమూ,  వెల్లువై ముంచెత్తుతున్న అంతర్జాలపు మాయాజాలమూ ఉందన్నది కాదనలేని సత్యం. అపురూపంగా కని పెంచుకుంటున్న ఒకరిద్దరు పిల్లలకి సర్వ సౌకర్యాలూ అమర్చాలని సంపాదన పెంచుకునే ప్రయత్నాల్లో తలమునకలవుతున్న యువదంపతులు ప్రతిచోటా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ భద్రతని గాలికొదిలేయకుండా, రెంటి మధ్యా ఒక సమతుల్యత సాధించడమనేది నేటి యువదంపతులకెదురుగా ఉన్న పెద్ద సవాలు! ఈ సవాలుని వారెంత సమర్ధంగా ఎదుర్కొంటారనే దాని మీదే రేపటి సమాజపు పునాదులున్నాయి.  




8, జనవరి 2023, ఆదివారం

ఔనా!? వొక టార్చ్ లైట్

"ఈస్తటిక్ సెన్స్" కథాసంపుటి లోని "ఔనా!?" కథకు వ్యాఖ్యానం అందించిన జ్వలిత గారికి ధన్యవాదాలు


ఔనా..? -జ్వలిత


బ్రౌన్ నిఘంటువు ప్రకారం కథ అనగా ఇంచుక సత్యమైన కల్పిత ప్రబంధం. కథ చెప్పువాడిని "కథకుడు" అని కథ చెప్పే విధానాన్ని "కథనం" అని చెప్పే విషయాన్ని "కథితమ" అని అంటారు.

 

తెలుగు కథ లేదా కత (Telugu Story) తెలుగులో ఒక సాహితీ ప్రక్రియ. తెలుగు అకాడమి నిఘంటువు ప్రకారం కథ అంటే కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్య గ్రంథం. సాధారణంగా చిన్నపిల్లలకు నిద్రపోవడానికి పెద్దలు చిన్న చిన్నకథలు చెప్పడం అలవాటు.  తెలుగులోను, ఇతర భారతీయ భాషలలో కొత్త కథ పుట్టి  నూరేళ్ళు దాటి చాన్నాళ్ళయింది. ఈ నూటిరవై సంవత్సరాలలో లక్షకు పైగా కథలు రచించబడ్డాయి. ఇవి ఎక్కువగా దిన, వార, మాస పత్రికలలో ప్రచురించబడుతున్నాయి. కొన్ని కథా సంకలనాలు ప్రత్యేకంగా ముద్రించబడ్డాయి. ఈ కథలు ముఖ్యంగా నీతి, ధర్మం, సాహసం, ఔదార్యం, శృంగారం వంటి విషయాలతో పాటు తత్కాల సామాజిక అంశాలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రధాన వస్తువుగా నడుస్తాయి. కరోనా కథలు, వానకథలు, జిల్లాల వారి కథలు, చేతివృత్తి కథలు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇతర సాహిత్య ప్రక్రియలన్నింటికన్నా కథకి ఆదరణ ఎక్కువ.

 

కథ పర్యాయపదాలు చరిత్ర, గాథ, వృత్తాంతం. కథ ప్రకృతి అయితే కత వికృతి. కథలు చెప్పేవాడిని 'కథకుడు' అంటారు. కథ చెప్పే స్త్రీలను కథయిత్రులు అన్నారు సినారె. కథలో ప్రధాన పురుషుడు 'కథానాయకుడు', ప్రధాన స్త్రీ 'కథానాయకురాలు'. కీర్తిశేషుడైన లేదా మరణించిన పురుషుడు 'కథాశేషుడు', మరణించిన స్త్రీ 'కథాశేషురాలు'. కథకు నిర్వచనాన్ని అనేకులు తమకు తోచినట్టు చెప్తూ వచ్చారు.

 

ఈమధ్య ఎక్కడో చదివినట్టు గుర్తు..


అగ్నిపురాణంలోని ఒక శ్లోకంలో "దీర్ఘంగా కాక పొందికగా ఉండడం, ఉదాత్తత కలిగి ఉండడం, సంభ్రమాశ్చర్యాలు కలిగించి కరుణ అద్భుత రసాలను పోషించడం, ఆనందాన్ని కలిగించడం కథానిక లక్షణాలు" - అని చెప్పబడిందని.

 

తాతినేని వనజగారితో పది సంవత్సరాలుగా పరిచయం. వారి రచనలకు అభిమానిని. వారు రాసిన 'ఔనా..' కథ చదివినప్పుడు సంబ్రమాశ్చర్యాలతోపాటు దుఃఖం కలిగింది. 1970 నుండి నేను చూసిన అనేక మంది స్త్రీలలో 'మీనమ్మ'  వంటి వారు కళ్ళ ముందు కదిలారు.

 

ఔనా.. కథను ఆసాంతం ఆగకుండా చదివేస్తాం. రచయిత్రి తన అనుభవం చెప్తున్నట్టు కథ మొదలుపెట్టడంతో పాఠకుల్లో ఆసక్తిని పెంచారు. ఇదొక టెక్నిక్.. నేనే కాదు మీనమ్మ వంటి స్త్రీలనెందరినో మీరంతా చూసే ఉంటారు.ఈ 'ఔనా..?' అనే ప్రశ్నను కథలో అనేక కోణాల్లో జొప్పించి సమాజంలో నెలకొన్న డొల్లతనాన్ని మన కళ్ళముందుంచారు…

 

దేవాలయాలకి తల్లీకొడుకులు కలిసి వెళ్ళినా అనుమానిస్తారా…? 

 

దైవదర్శనానికి వచ్చే భక్తులకు కులాలవారి, ప్రాంతాల సత్రాల కేటాయిపులు.. అందులోనూ రెకమెండేషన్లుంటాయా..?

 

మండల పూజలు, దీక్షలతో భూతప్రేతాల బాధను తొలగించు కోవడానికి దేవాలయాలకు వస్తారా..?

 

ప్రేమ రాహిత్యంతో బాధపడే వారంతా మీనమ్మ వలె చేయవచ్చునా..?

 

మానసిక రుగ్మతలతో, కుంగుబాటుతో బాధపడే స్త్రీలందరికీ 'అప్రేమ' ప్రధాన కారణం కాదా.. ఇందులో కుటుంబం, సమాజం బాధ్యత ఏమీ లేదా?

 

ప్రేమ రాహిత్యంతో బాధపడి ఆత్మహత్యలు చేసుకోడం కంటే.. మీనమ్మ ఎంచుకున్ళ మార్గం సరైనదే కదా? 

 

మానవ సంబంధాలలో లైంగికత లేని స్నేహం, ప్రేమ అబాసు పాలవడం దుష్ప్రచారాలకు గురి కావలిసిందేనా..? 

 

వంటి అనేక ప్రశ్నలు కనిపించాయి నాకు. కథలో ఎక్కడా రచయిత్రి ప్రవేశించి న్యాయ సూత్రాలను, ధర్మ సూక్తులను బోధించ లేదు. ఒక జరిగిన సంఘటనను ప్రత్యక్ష సాక్షిగా చెప్పుకుంటూ పోయారు.

 

రాయవలసిన కొన్ని విషయాలను రాయకూడదనే సందేహంతో పదిసంవత్సరాలుగా అంతఃసఘర్షణకు లోనయి.. రాయకుండా వుండలేని పరిస్థితిలో ధైర్యం తెచ్చుకొని కథరాశానని పరోక్షంగా చెప్పారు.

 

బ్రౌన్ నిఘంటువు ప్రకారం కథ అనగా ఇంచుక సత్యమైన కల్పిత ప్రబంధం.. 'ఔనా..' కథలో అదే ఉన్నది.. కల్పితం ఏది? సత్యం ఏది ? పసిగట్టవలసినది పాఠకులే..

 

'ఔనా..?' కథలో నాకు బాగా నచ్చిన మాటలు, కథకు సెంట్రల్ పాయింట్, పంచ్ డైలాగ్ లాంటి మాటలు...

 

'బొట్టా..! మనిషన్న వాడికి అన్ని దశల్లోను ప్రేమ, శాంతి దొరకాలి. సముద్రం నుంచి కొంత, బిడ్డల నుంచి కొంత, నాయన నుంచి కొంత, అమ్మ నుంచి కొంత, సేయితుల నుంచి కొంత, భర్త నుంచి కొంత, బిడ్డల నుండి కొంత ఇట్టా అందరి నుండి కొం కొంత గ్రాసం ప్రేమ జవురుకుంటే కానీ ఈ కట్టె చల్లారదు' అని మీనమ్మ తాత మీనమ్మతో చెప్పిన మాటలు.

 

కథలో ఒక చారిత్రక పౌరాణిక అంశాన్ని కూడా ప్రస్థావించారు రచయిత్రి. 'కూతురిని మోహించిన రాజును పచ్చల బండగా పడివుండమని శపించింది అంటగా. మరి నేను కొడుకు వరుసయ్యే వాడిని మోహించాను కదా! లోలోన నేను ఏ బండనవుతానో అని భయం అనుకుంటా.. మనిషి బతికి వుండగా కోరికతో పెయ్య కాలుతుంటే చచ్చినాక పాప పుణ్యాల గురించి చింత ఎందుకు అంటా నేను' అని చెప్తుంది మీనమ్మ  రచయిత్రి తో.

 

'Man is social animal'.. మనిషి సంఘజీవి, ఒంటరిగా దేనినీ ఆస్వాదించ లేడు, అనుభవించలేడు.. ఇప్పటి మనిషిలో స్వార్ధం పెరిగి.. అన్ని రకాల పేరుకు పోతున్నాడు. బ్రమల్లో కూరుకు పోతున్నాడు. కానీ మనిషన్న వాడు కష్టం, సుఖం, మోహం, దాహం, ద్రోహం, గెలుపు, ఓటమి, వేరొకరితో పంచుకోవడం హ్యూమన్ సైకాలజీ. అలా పంచుకునే అవకాశం లేనప్పుడు. మానసికంగా కుంగిపోతారు. కథలో మీనమ్మ జీవితాంతం చెప్పలేక కుంగిపోయిన అంశం Lack of Love' ఎదుర్కొన్న సమస్య 'అప్రేమ' ప్రేమ రాహిత్యం.


చివరికి పొందిన కొడుకు వంటి యువకుని నుండి పొందిన 'ప్రేమ' దాని ద్వారా కలిగిన విజయ గర్వంతో కూడిన సంతృప్తి, దానిని ఎవరికో ఒకరికి చెప్పుకోవలనే తాపత్రయం, మన బుజ్జమ్మకు చెప్పుకునేలా చేసింది. ప్రపంచంలో 90 శాతం ఆడవాళ్ళు మీనమ్మ వలె అప్రేమతో అశాంతితో బాధపడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు.

 

స్త్రీలలో వివాహేతర సంబంధాలున్న వారు కూడా చాలా వరకు సెక్సు కోసం కాదు ప్రేమరాహిత్యం నుండి బయట పడటానికే అని నా అభిప్రాయం… అంతే కాదు ప్రేమరాహిత్యంతో బాధపడుతున్న స్త్రీలను లోబరుచుకునేందుకు ప్రేమను స్నేహాన్ని నటించి మోసం చేసే వారే ఎక్కువ సమాజంలో… ఆవిషయాన్నే మీనమ్మ మాటల్లో..


'నలభై ఏళ్ళ కాపరంలో మొగుడి గుండెల మీద పడి ఆదమరిచింది లేదు. నా మనస్సు సేదదీరింది లేదు. కంటికి కనబడని వియోగ దుఃఖం ఏదో ఎప్పుడూ నన్ను అంటిపెట్టుకునే వుండేది. అందుకే ధైర్యం చేసాను. ఈ నలభై రోజులు వాడు నన్ను ప్రియంగా చూసుకున్నాడు. వాడు నా ఆకలిని గుర్తించాడో అశాంతిని కనిపెట్టాడో దుఃఖాన్ని అర్ధం చేసుకున్నాడో కానీ నలభై రోజుల నుండి మరో లోకంలో విహరింపజేసాడు. స్వర్గం అంటే ఇట్టాగే వుంటుందేమో అనిపించింది అనుకో, ఇప్పుడు నా మనసుకు తృప్తిగా పరమశాంతిగా వుంది. ఇలా చేసినందుకు నేనేమి సిగ్గుపడటం లేదమ్మాయ్! పాపభీతి బిడియం నేన్నేం వెంటాడటంలేదు. దేవుడు సాక్షిగా చెబుతున్నా. నువ్వు నమ్మాలి' …..అంటది.


అంతే కాదు మీనమ్మ తనకు దక్కని ఆత్మీయత ఆదరణ ఎలా పంచిందో రచయిత్రి బాగా చెప్పారు.."మా తాత పెద్ద కవిలే కవిత్వం రాసినాడు. గజళ్ళు చదివేవోడు... నోరారా విప్పి చెప్పేవాడు. జమీన్ రైతు చదివి వినిపిస్తా వుండేవాడు. మా నాయన చిన్నగా వున్నప్పుడే మా అవ్వ చనిపోయిందంట. మళ్ళీ పెళ్ళిచేసుకోకుండా నలుగురు బిడ్డలను కాపాడినాడు. రోజు ఆయన వొళ్ళే కూర్చుని ఇన్న మాటలే అనుకో బాగా గమనం వుండాయ్…..


"ఆయనెందుకు చెప్పాడో కానీ ఆయన చెప్పినవేమి నాకూ దొరకలేదు. ఆకులు పోకలు అందుకున్నప్పుడు నుండి ఎదురు చూపే మిగిలింది. మొగుణ్ని మనసు నిండా కరువుదీరా కౌగలించుకున్నది లేదు. ఈ ఆకలి శరీరానిది కాదు. మనసుది బిడ్డల పెళ్ళిళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు పుడుతున్న కొద్దీ.. ముసలిదాన్ని అయిపోతున్నాను, నా మనసు ఆకలి తీరకుండా ఏడ చచ్చిపోతానేమోనని వొకటే దిగులయ్యేది. నేను మాత్రం జీవమున్న ప్రతిదాన్ని నిండా కావిలించుకుంటాను. పిల్లలు, పిల్లల పిల్లలను దూడను పెయ్యను కుక్కను మేకను పిల్లిని ఆఖరికి అంతంతలావు మానులను కూడా వాటేసుకుంటాను. అయినా మనసుకు నెమ్మది లేదు. కంటినిండా నిదుర పట్టేది కాదు. ఆఖరికి నా ఆకలిని కనిపెట్టినవాడు ఒకడు కనిపించాడు. కుడియెడంగా నా కొడుకు వయస్సు వున్న వాడు. వాడిని తగులుకున్నాను. తప్పా ఒప్పా అని ఆలోచించలేదు నేను. శరీరానికేనా భోగానుభవం మనస్సుకు ఉండొద్దూ, ఆకలిగా వున్నప్పుడు అందుబాటులో వున్నది తిని ఆకలి తీర్చుకున్నట్టు మొగుడు పెళ్ళాం మధ్య కాపురం సక్రమంగా వర్దిల్లినా వాళ్ళమధ్య గాఢానురాగం లేకపోతే అది ఓటి కుండ లెక్కే…" అంటుంది. ఇది చెప్పడానికి చాలా ధైర్యం కావాలి… 


కథలో మీనమ్మ కథంతా అనంతపురం యాసలో నడిపించినా రచయిత్రి తన స్వంత మాండలీకంలో  కొంత చెప్పారు… 


బుజ్జమ్మ కొడుకు 'నువ్వు పిచ్చివాళ్ళతో కూడా ఫ్రెండ్ షిప్ చేస్తావమ్మా..' అనడం కొస మెరుపయితే.. కథలో చివరన తాను అడగకుండా మరిచి పోయిన ప్రశ్నలను రచయిత్రి మనను అడగమని ఎస్సైన్ మెంట్ ఇస్తుంది పాఠకులకు.

 

మొత్తానికి కొన్ని ముఖ్యమైన కోణాలకు టార్చ్ లైట్ వేశారు వనజగారు. వారికి అభినందనలు .





6, జనవరి 2023, శుక్రవారం

సంఖ్య కాదు డబ్బు కాదు -జీవితం

 శ్రీమతి వనజ తాతినేనిగారు పరిచయం అక్కర్లేని రచయిత్రి. పైకి సాధారణంగా కనిపించే జీవితాల పైపొరలు తొలగించి లోపలి మర్మాన్ని సమర్ధవంతంగా ముందుంచుతారు.  ప్రస్తుతపు కథ "రెండు లక్షలు". అది కేవలం ఒక సంఖ్య కాదు. అలాగే డబ్బు మాత్రమే కాదు. జీవితాలని నడిపించే చోదకశక్తి. అది పరిస్థితులని, మనుషులనీబట్టి మంచికీ చెడుకీ కూడా నడిపిస్తుంది.

భూషణం అసమర్ధుడు. డబ్బు లేదు. చిన్న రైతు. ఆస్తికి సరిపడా అప్పులున్నవాడు. అన్నిటినీమించి భార్యకి విలువ యివ్వనివాడు. ఈరోజుని సమాజంలో జరుగుతున్న పెళ్ళిళ్ళలో చాలావరకూ విలోమ వివాహాలంటే అతిశయోక్తి లేదు. ఏమీ చాతకాకపోయినా, పెత్తనం మాత్రం వదలని మగవారి చేతిలో స్త్రీ ఎలా వోడిపోతుందో కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. శారద భర్తకన్నా తెలివైనది. కష్టపడుతుంది. నీతిగా బతకాలనుకుంటుంది. తనకి చేతనైంతలో కొద్దోగొప్పో సంపాదించి అతనికి సాయపడుతుంది. అతనికి తాగుడికికూడా తనే ఇస్తుంది. అదంతా అతను గుర్తించని కష్టం. ఇంత చేసినా ఆమె మాట ఎక్కడా నెగ్గనివ్వడు. అతని తోబుట్టువులమధ్య ఆమెకి ఎలాంటి విలువా వుంచడు. ఒక స్త్రీ ఇంటికి ఆదాయవనరు అయికూడా పరాధీనగా ఎలా మారిపోతుందో  స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ కూతురు వుమకి పెళ్ళి కుదుర్చుతాడు భూషణం. రెండులక్షల కట్నం. అదీ వెంటనే ఇవ్వక్కర్లేదు. పెళ్ళికూడా  శక్తి కొలదీ చేయచ్చు.  పెళ్ళికొడుకు ఫణీంద్ర. బాగా డబ్బు, దానికి సరిపడా దగుల్బాజీతనం వున్నవాడు. ఆడవారిమీద వ్యాపారం చేస్తాడు. ఎలాంటి విలువలూ, వావివరుసలూ వుండవు.  శారదకి అతనెలాంటివాడో తెలుసు. భర్తకి చెప్తుంది. సంబంధం వద్దని వారిస్తుంది. అతను వినడు. కూతురికి చెప్తుంది. చదువైతే మంచిసంబంధం తనే చూసి చేస్తానంటుంది. ఆమెకి అర్థమవదు. అర్థమవటానికి ఇద్దరు పిల్లలు పుట్టేంత సమయం, ఒక తప్పటడుగూ అవసరమౌతాయి.

ఇంట్లోవాళ్ళకి అంత గొప్పసంబంధం తమని వెతుక్కుంటూ రావటమే గొప్ప. పెళ్ళిరోజంతా దిగులుగా ఆలోచనలతోనే గడుపుతుంది శారద. అదేరోజు పొరపాట్న గంజిలో జారిపడి, కాలు విరిగి హాస్పిటల్లో పడుతుంది శారద. ఆమె లేకుండానే పెళ్ళి, అంపకాలు జరిగిపోతాయి. ఇంట్లోంచీ వచ్చేసి వేరే వుంటూ తన బతుకు తను బతుకుతుంటుంది. దానికి ఒక బలమైన కారణం వుంటుంది. దాన్ని కారణంగా ఎవరూ వప్పుకోరు. ఆఖరికి కూతురుకూడా.  

మిగిలింది రెండులక్షల కట్నం బాకీ. ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని తీర్చలేడు భూషణం. తను తీర్చాలని కష్టపడుతుంది శారద. అత్తని తన మార్గంలోకి రమ్మని ప్రోత్సహిస్తాడు ఫణీంద్ర. పక్కదారి పడుతుంది ఉమ. అది అవకాశంగా తీసుకుంటాడు ఫణీంద్ర. తన వ్యాపారంలోకి ఆమెనీ లాగాలనుకుంటాడు. ఆమె యింట్లోంచీ వెళ్ళిపోతుంది. ఆమెని వెతికే క్రమంలో శారద యింటికి వస్తాడు ఫణీంద్ర. ఆ సందర్భంగా అతనన్న మాటలద్వారా మనుషులకి జీవితంపట్ల గల రెండునాలుకల ధోరణిని  రచయిత్రి సమర్ధవంతగా చూపించి కథకి అందమైన ముగింపు ఇచ్చారు.  

వనజ గారు తన అముద్రిత కథలను సంపుటిగా తీసుకురావాలనుకోవడం సాహసమైన నిర్ణయం. ప్రచురణ వేదికల రాజకీయాల వల్ల గ్రూప్ ల వల్ల తమ రచనలకు వేదిక లభించకపోవడం వల్ల రచయితలు నేరుగా కథాసంపుటాలు ప్రచురించుకోవాల్సివస్తుంది. అందులో కొంత నష్టం ఉన్నప్పటికీ ఈ పని సమంజసనీయమైంది అనిపిస్తుంది. ఈ కథా సంపుటిలో లో ఒక కథకు సహరచయితగా  నేను విశ్లేషణ వ్రాయాల్సిరావడం గౌరవంగా భావిస్తూ .. రచయితకు అభినందనలు తెలియజేస్తూ ... -శ్రీదేవి సోమంచి. 



29, డిసెంబర్ 2022, గురువారం

స్త్రీ జాతికి విముక్తం

ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటిలోని “విముక్తం” కథ పై వ్యాఖ్యానం రాసిన పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలతో.. 
 'కాదేదీ కవిత కనర్హం' అని శ్రీ శ్రీ అన్నారు గానీ, కథకు కూడా ఏదీ అనర్హం కాదు - దేన్నైనా కథగా రూపొందించే నైపుణ్యం తగినంత అధ్యయనం రాసేవారికి వుంటే..వనజగారు రాసిన 'విముక్తం' కథలోని వస్తువు అరుదైనది. ఈకాలంలో ఇది అరుదైనదేనా?
అర్దనగ్నంతో అశ్లీలభంగిమల డాన్స్ లతో వున్న ఇప్పటి సినిమాలు, అరచేతిలో పోర్న్ వీడియోలు చూపించగల మొబైల్ ల ప్రభావంతో చాలామంది మగవాళ్ళ బుద్ధి వంకర తిరుగుతోంది - అందువల్ల అరుదైనదనీ చెప్పలేం.
'విముక్తం' లో కరుణ, ఆమె తల్లి సుగుణమ్మ, భర్త రాజు లు కథను నడిపించిన ప్రధాన పాత్రలు. రాజు తల్లిదండ్రులు, కరుణ పనిచేసే హాస్పిటల్ డాక్టరు కథకు సహాయక పాత్రలు.
కరుణ ఒక నర్సు. రాజు ఆసుపత్రి నిర్మాణంలో పనిచేసిన బేల్దారి. రాజును కరుణ ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. పెళ్ళాయ్యాక తెలుస్తుంది - రాజు ఒక సుఖవాసి అనీ, తాగుడు వ్యసనమైన వాడనీ.
కరుణ కాన్పుకు ఆమె తల్లి సుగుణమ్మ చేదోడువాదోడుకు వస్తుంది. రాజు కన్ను సుగుణమ్మ మీదపడి, ఆమె అక్కడున్న మూడునెలల్లో ఆమెను కబళించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఆమె లొంగదు. కూతురికి చెప్పదు. కరుణ తన మొగుడి దుర్నీతిని గ్రహించి మందలిస్తుంది. ఒకరాత్రి తాను పడుకొని వుండగా, రాజు లేచి వెళ్ళి పక్కగదిలోని సుగుణమ్మపై లైంగికహింస చేయబోతాడు. మెలుకువ వచ్చిన కరుణ మూలనున్న గొడ్డలితో నరుకుతుంది.
ఈ సంఘటన అరుదైనదేనా? కరుణ తన మొగుడిని నరకడమనే సన్నివేశం అరుదైనదే కావచ్చు. కథలోని ప్రధాన అంశం....??
కథలో రాజు తన భార్య తల్లిని(అత్త)ను కబలించాలని చూశాడు. సమాజంలో మరొకచోట మరొకరిని కావచ్చు. ఒకచోట పెళ్ళికాని మరదలి(భార్య చెల్లెలి)ని కావచ్చు, పెళ్ళై భర్త పోయిన వదిన(భార్య అక్క)ను కావచ్చు.
మగాడిలో ఇట్లాంటి దుర్నీతికి తమ ఆర్ధిక స్థాయిలేవీ అడ్డురావు. హైక్లాస్ కుటుంబాల్లో, లోక్లాస్ కుటుంబాల్లో అనే తేడా ఏముండదు. ఇదొక దుర్దమ మానసికరుగ్మత. తన తల్లిని కానీ, చెల్లెలిని కానీ, అక్కను కానీ తన భర్త అనేవాడు కబలించాలని చూస్తే ఆ బాధితురాళ్ళ వ్యధతో సమంగా ఆభార్యా వ్యధ పడుతుంది.
ఈ అంశాన్ని 'కథ' గా చేయాలనుకున్న రచయితను అభినందించాలి. ఇది సాధారణ 'కథాంశం' కాదు. మనోవిశ్లేషణతో కూడుకున్న క్లిష్టమైన అంశం. రచయితకు మనోవిశ్లేషణ సామర్థ్యం వుండాలి. పాత్రల మానసిక స్థితి స్వరూపాలు చదువరికి కనిపింపజేయాలి. అప్పుడే అది ఒక రిపోర్ట్(పోలీస్ రిపోర్ట్ లేదా న్యూస్ రిపోర్ట్) కాకుండా 'కథ'గా మారి అనుభూతి నిస్తుంది. అట్లని మనోతాత్వికతనంతా ఏకరువు పరిస్తే మనోవైజ్ఞానిక వ్యాసమయే ప్రమాదమూ వుంది. దాన్ని సమన్వయపరుచుకునే బాధ్యత రచయితదే.
ఈ అంశాన్ని 'కథ' గా రూపొందించడంలో వనజగారు సఫలమయ్యారు. పాత్రల మానసిక స్థితిస్వరూపాలను మనకు ఎరుకపరచడంలో  రచయిత సఫలం అయ్యారు కానీ  ఎక్కడో కొంత కొరత వుంది. రాజు దుర్మార్గంపై ఏవగింపు కలుగుతుంది. అదే సమయంలో కరుణ, సుగుణమ్మలపై సానుభూతి కలుగుతుంది. 
మగవాడి అహంకారానికి  దౌష్ట్యానికి గురవతున్న సమయంలో స్త్రీలందరూ సుగుణమ్మలా మానసిక బలహీనత ఆవరించి ప్రతిఘటించలేని స్థితిలో నైనా వుంటారు లేదా కరుణ లా ఆవేశంతో తెగింపుతో తమను తాము రక్షించుకోవాలన్న సృహలో ఆ పురుషుడిపై ఎదురుదాడి చేసి రక్షించుకోగల దైర్యాన్ని ప్రదర్శిస్తారు. 
ఈ కథలో కరుణలో తెగింపుతో పాటు ఇతరుల ప్రాణాలు చాలా విలువైనవన్న సృహ కల్గినటువంటి స్త్రీ అవటం మూలంగా.. ఆమె పై పాఠకుడికి వ్యతిరేక భావం ఏర్పడకుండా చక్కని వాక్యంతో కథను ముగించారు. అటవిక న్యాయం మానవ సమాజంలో సహజమైనదిగా చిత్రీకరించడం తగదని  రచయిత పాటించాల్సిన విచక్షణను బహుచక్కగా ప్రదర్శించారు. 
ఇటువంటి అంశాన్ని 'కథ' గా రూపొందించిన రచయితకు మనసారా అభినందనలు.
-పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి 


24, డిసెంబర్ 2022, శనివారం

ఋణ బంధాలు

ఈస్తటిక్ సెన్స్  కథాసంపుటిలో

 “ఋణ బంధాలు” కథకు ఆర్ దమయంతి గారూ వ్యాఖ్యానం రాసారు. వారికి ధన్యవాదాలతో 🙏


ఇవ్వడం మాత్రమే తెలిసిన చేతులకి రాగద్వేషాలుండవు..కరుణ తప్ప!' అని చెప్పిన కథ! - 'ఋణ బంధాలు'

 

"వాళ్ళతో నాకున్న పరిచయం, స్నేహం ఈనాటిది కాదు. కొన్నేళ్ళది. నేనంటే వాళ్ళకెంత మర్యాద, ఎంత మన్నన! గడపలోకెళ్తే  ఎంత ఆనందపడిపోతారంటే..'రండి..రండి! ఇవాళెంత సుదినం! మీ రాక మాకెంతో ఆనందం.."-  అంటూ అత్మబంధువులకంటే మిన్న గా ఆహ్వానిస్తారు. 'మనది జన్మజన్మల బంధమన్నంత..' ప్రాణం గా మాట్లాడతారు.  ఇదంతా నిజం గా నిజం. కానీ, ఎప్పటి వరకు అంటే - నాకివ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వమని అడగనంత వరకే!" - అని అంటాడు ఓ గొప్ప అనుభవజ్ఞుడైన రచయిత. ఇది అక్షర సత్యం. ఆ నగ్నసత్యానికి దర్పణం పట్టిన కథే - శ్రీమతి వనజ తాతినేని గారు రాసిన 'ఋణ బంధాలు' కథ.

మేలైన వ్యసనాలలో అతి ప్రమాదకరమైన వ్యసనం అంటూ ఏదైనా వుందీ అంటే, అది ఖచ్చితం గా - అడిగిన వారికి లేదనకుండా అప్పు లివ్వడం! కొని తెచ్చుకున్న మనో వ్యధ అంటూ ఏదైనా వుంటే..  తీసుకున్న వాడు, ఋణం చెల్లించకుండా పెట్టే బాధలు..ఇతరులతో చెప్పుకోలేక లోలోన కుమిలిపోవడం! ఆ టార్చర్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. జీవిత కాలం లో ప్రతి మనిషీ ఈ రకమైన అనుభవాన్నుంచి తప్పించు కోలేనివారే!

మనిషి కీ మనిషి కీ మధ్య ఆర్ధిక సంబంధాలు వుండొచ్చు కానీ,  స్నేహితులతో కానీ, అయిన వాళ్ళతో కానీ, రక్త సంబంధీకులతో కానీ పైసా తో కూడిన లావాదేవీలకు దూరం గా వుంటం వల్ల బంధాలు నిలుస్తాయి. కథలో కరుణ కూడా సరిగ్గా ఇలానే అభిప్రాయపడుతుంది.

నీ డబ్బు నీ చేతిలో వున్నంత వరకే అది నీది. పరుల చేతి కిచ్చాక, అది ఇక పరాయిది..నీ సొమ్ము నీకు తిరిగి వచ్చే దాకా..దిగులే మరి.

- కాళ్ళు పట్టుకున్నాడని కరిగిపోయి, స్యూరిటీల మీద సంతకంపెట్టడం,   చేతులు పట్టుకున్నాడని..జాలితో కదిలిపోయి, తల తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చివ్వడం - ఆ పైన అతను అడ్రెస్ లేకుండా పోయాక దిగులుతో మంచమెక్కడం..ఇదంతా - సుఖాన వున్న ప్రాణాన్ని కష్టాల పాలు చేసుకోవడం వంటిదే. ఆదుకోబోయి, ఆపదల్లో చిక్కుకోవడం అంటే ఇదే మరి!

మిత్రుడు బాధల్లో వున్నాడని ఇంటి అవసరాలని కూడా పక్కకి పెట్టి దాచుకున్న మొత్తాన్నిఎత్తి ఋణమివ్వడం అంటే అది తనకి మించిన మంచితనం అవుతుంది. కాదు. తన జీవితాన్నే ముంచెత్తేస్తుంది. ఈ రకమైన జాలి ఖచ్చితం గా బలహీనతే! మంచి తనం కూడా నరాల బలహీనతే అని అందుకే అంటారు ప్రఖ్యాత రచయిత గోపీచంద్.  

' నీ స్నేహితునికి డబ్బిచ్చి అతన్నొక మతిమరపు మనిషిని  చేయకు.' అంటూ జోక్ పేల్చాడు ఓ అనుభవజ్ఞుడు.  నిజమే. అప్పు తీసుకున్న వాడికి తిరిగి ఇవ్వాలని గుర్తుండదు మరి.

అసలు అప్పులిచ్చి ఇన్ని అవమానాలు, బాధలు పడే కంటే అదే మొత్తాన్ని శక్తి కొద్దీ దానం గా ఇస్తే ఎంత శాంతి గా వుంటుంది! ఇటు ఇల్లూ, అటు మనసూ, మనిషి కి  కూడా ఎంత ప్రశాంతం గా వుంటుంది! సరిగ్గా ఇదే గీతా బోధన చేస్తాడు, కథలో తల్లికి - ఆ కుమారుడు. ఈ రోజుల్లో యువకులు ఎంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు, ఎలా ముందు జాగ్రత్తలు తీసుకుంటారో చెప్పడానికి కథలో ఇతని పాత్ర ఓ నిదర్శనంగా పేర్కొనాలి.

ఇదొక వైనం అయితే, మనిషి ని నమిలేసే మరో ఋణ బాధేమిటంటే..

ఎవరికైనా పైసా బాకీ వున్నా, తీర్చే దాకా నిద్ర పట్టని అస్థిమితం తో కొట్టుమిట్టాడటం.

కథలో సగ భాగం - అప్పులి చ్చి ఆగమైన వారి సంగతైతే, మిగిలిన సగ భాగం, బాకీ తీర్చడం కోసం పరుగులు తీసిన ఓ నిజాయితీ పరురాలి కథనం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది.  

ఈ రండ సమస్యల ఘర్షణా సంఘర్షణల మధ్య నలిగిన ఓ మంచి మనసున్న మగువ కథ - ఋణబంధాలు.

కూరల బండి వాడి బాగు కోరి అప్పు ఇస్తుంది - కరుణ. అతను తనకివ్వాల్సిన డబ్బుని తిరిగివ్వకుండా మాయమైనప్పటి బాధ కంటేనూ, తను అతనికివ్వాల్సిన చిన్న మొత్తాన్ని చెల్లించడం కోసం పరుగుపరుగున మరీ వెదకి పట్టుకుంటుంది. చివరకి ఆ మొత్తాన్ని అతని చేతికందించి, గుండెల మీదున్న కొండంత భారాన్ని దింపుకుని, హాయిగా నిట్టూర్చుతుంది.  

చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ మంచి గుణాన్ని చూస్తాం. వాళ్ళకి అప్పు అంటే భయం. పైసా బాకీ వున్నా సరే, తీర్చే దాకా నిద్రపట్టదు. తిరిగి ఇచ్చే దాకా మనసుకి చెయిన్ పట్టదు.  

కథలో కరుణ కున్న ఈ పాటి నీతి నిజాయితీలు - వేల కోట్లు అప్పులు చేసి, విదేశాలకు పారిపోయిన బడా దొంగలకు వుంటే ఎంత బావుణ్ణు కదా అనిపిస్తుంది.  

వాస్తవ సంఘటనలని ఆధారం గా చేసుకుని, వినూత్నమైన కథాంశంతో సహజ రీతిలో, తనదైన శైలిలో, కథని రక్తి కట్టించారు - రచయిత్రి. కథ ఆసాంతం ఆసక్తి కరం గా చదివించారు.

సంభాషణలో వినోదం వుంది. దాని వెనకే విషాదమూ దాగుంది.   మనిషి అసలు నైజాన్ని చాటుతూనే, తస్మాత్ జాగ్రత్త సుమా అనే విలువైన సందేశాన్ని కూడా అందచేస్తుంది -కథ.

'ఈ కథ నా కథ లా వుందే చెప్మా!' అని ప్రతి పాఠకుడునీ తన రచనలో   నిమగ్నం చేస్తూ కథ రాయడం రచయిత్రి రచనా ప్రతిభకి ఓ తార్కాణం అని చెప్పాలి.

వనజ గారి కలం నుండి మరెన్నో వినూత్న కథాంశాలతో కూడిన మంచి మంచి కథలు రావాలని, రాయాలని మనసారా కోరుకుంటూ, మరిన్ని కథా సంకలనాలు వెలుగు చూడాలని ఆశిస్తూ..


శుభాభినందనలతో..

ఆర్.దమయంతి.



14, డిసెంబర్ 2022, బుధవారం

సౌందర్య హింస - ఈస్తటిక్ సెన్స్

 


ఈస్తటిక్ సెన్స్ కథకు వ్యాఖ్యానం అందించిన   - డా.గీతాంజలి భారతి గారికి ధన్యవాదములు .


తెలుగు సాహిత్యం లో  రచయిత్రుల పరిమితి స్రీవాద పరిమితిని దాటి సమాజంలో మానవ జీవితం చుట్టూ అలుముకున్న  అనేక సంక్షోభాలను కుల, మతతత్వాలు ,ప్రాంతీయ సమస్యలు మొదలుకొని , రైతుల దళితుల ఆదివాసీల జీవితాల మీద  ప్రపంచీకరణ ప్రభావం, పోస్ట్ మోడర్నిజం ., విప్లవోద్యమం  కథా వస్తువులుగా స్వీకరించి రాయడం మొదలై చాలా కాలం అయ్యింది. భిన్న అస్తిత్వాలకు, వర్గాలకు  చెందిన స్రీల విషయంలో పురుషాధిక్యత., గృహ హింస., అణిచివేత ,అవిద్య,  మూఢనమ్మకాలు ., స్రీల పునరుత్పత్తి హక్కుల మీద., సాంస్కృతిక., రాజకీయ.మానసిక ఆర్థిక కారణాలను విశ్లేషిస్తూ  కూడా చాలా సాహిత్యం వచ్చింది. స్రీల శరీరాల చుట్టూ అల్లుకున్న పురుష లైంగిక రాజకీయాల మిత్ ని బద్ధలు కొడుతూ స్రీలను చైతన్యవంతం చేసిన సాహిత్యం  చాలా వచ్చింది.  ఈ సాహిత్య ప్రభావం వల్ల పురుషాధిక్యత అనిచివేతలను ఎదిరిస్తూ హింసని ప్రశ్నిస్తూ..కుటుంబ హింసా వలయం నుంచి బయటకు వచ్చి తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకున్న స్రీలేందరో ఉన్నారు.. ఇంటి పని , వంట పని, రెండు పనుల ఆదనపు శ్రమ ,ఉత్పత్తి  , పునరుత్పత్తి విషయాల్లో జరిగే దోపిడీ గురంచి స్రీవాధులు విస్తృతంగా రాస్తూనే ఉన్నారు ఒక్క కథా రూపంలోనే కాదు కవిత్వం., నవలలు చాలా వచ్చాయి.అయితే మూసి వున్న పడక  గదుల్లో దాంపత్యం.,సంసారం,శృంగారం, సరసం పేర్లతో.,ముసుగుతో శ్రీల శరీరాల మీద నిశబ్దంగానో.. శబ్దం చేస్తూనో జరుగుతున్న  కనిపించీ., కనిపించని లైంగిక హింస గురించి ఇంకా మరింత సాహిత్యం రావాల్సి ఉంది.1990 సంవత్సరాల ముందు పాత తరానికి చెందిన  రచయిత్రులు ఫ్యూడల్ వ్యవస్థలోని పితృస్వామ్య హింసని..గృహ హింసని కథావస్తువు తీసుకునీ రాసినా..లైంగిక హింసని పెద్దగా తీసుకోలేదు. రచయిత్రుల వస్తువుల మీద పురుషు సమాజం లేదా  రచయిత్రుల కుటుంబాల్లో సెన్సార్ షిప్ ఉండేది.. కథా వస్తువు ఎన్నిక పట్ల పరిమితులు ఉండేవి. కానీ 1990 తరువాత ఈ పరిమితులు దాటి రచయిత్రులు ముఖ్యంగా స్రీవాదులు విస్తృతి పెంచుకున్నారు. స్రీల లైంగికత కి సంబంధించి భిన్నమైన అంశాలను ధైర్యంగా రాస్తూ వచ్చారు. ఇప్పుడు చాలా స్వేచ్ఛగా సెక్స్ & సెక్సువాలిటీ మీద గొప్ప , సమాజానికి కావలసిన కథలు రాస్తున్నారు.


అయితే ప్రస్తుత వర్తమాన కాలంలో  స్త్రీల సమస్యల మూలాలు పితృస్వామ్య భూస్వామ్య విలువల నుంచి వేళ్ళూనుకొని ఇప్పటి ఆధునిక కాలపు టెక్నాలజీతో వికృతంగా విస్తరించి మరీ ముఖ్యంగా వైద్యం, వ్యాపార మీడియా రంగాల్లో స్త్రీల మనశ్శరీరాలపై అత్యంత దారుణమైన పద్దతుల్లో అమానవీయ రూపాల్లో తన ప్రభావాన్ని చూపిస్తుంది. 


పితృస్వామ్యం పెట్టుబడీ మూలంగా కొనసాగే కార్పొరేట్ వైద్య వ్యవస్థ రెండూ కలసి స్త్రీల దేహాలను ఒక నిత్య హింసల కొలిమిగా మార్చిపడేసింది. స్త్రీలను ఒక లైంగిక వస్తువుగా చూసే దృష్టి ఈ ఆధునిక సాంకేతికత మరింత పెంచింది. అది అభివృద్ది, వెసులుబాట్లు ముసుగు వేసుకుని. ఈ టెక్నాలజీ ముసుగులోనే  స్త్రీలపై పురుషుల అణచివేత. అదే క్రమంలో స్త్రీల లొంగుబాటు అసంకల్పితంగా కొనసాగుతుంది. ఈ సర్ధుబాటు పెనుగులాటల్లో ఆధునిక స్త్రీ డిప్రెషన్ లాంటి మానసిక మనోలైంగిక వ్యాధులకు లోనవుతూనే స్త్రీల లైంగికతను, దేహాలను అణచివేసి లేదా తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాన్ని కుటుంబం రాజ్యం వ్యవస్థ తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి.


స్త్రీ పురుష సంబంధాల్లో దాంపత్య జీవితంలో లైంగిక హింస అనేది సంసారం శృంగారం సరసం పేరిట ఎన్నెన్ని మోసాలతో కుట్రలతో చొచ్చుకుపోతూ స్త్రీల దాంపత్య జీవితాల్లోని సంక్షోభాన్ని నింపడం గురించి తక్కువ సాహిత్యం వచ్చింది. ముఖ్యంగా స్త్రీల దేహాల్ని మార్కెట్ సరుకుగా మార్చాక, ఆధునిక వైద్య వ్యవస్థలో పురుషుడి ఆనందమే కేంద్రంగా మొదలైన స్త్రీ లైంగిక అవయవాల్లో యోని రొమ్ములు ముఖం పెదవులు ముక్కు నిర్మాణాల్లో  పురుషుడిని సంతృప్తి పరచటానికి కావాల్సిన ఖరీదైన సర్జరీలు వచ్చి చేరాయి. స్త్రీ శరీర కొలతలను ఆదేశించే పురుషుల యిష్టాల చుట్టూ స్త్రీల జీవితాలు మానసం పరిభ్రమిస్తూండేలా వైజైనో ప్లాస్టీతో  ఎక్స్ట్రా నాట్ యోని ద్వారానికి వేయించుకొని టైట్ చేయించుకోవడం భర్తను ఆనందపరచడానికి చిన్న రొమ్ములలో  ప్రమాదకరమైన సిలికాన్ ఇంప్లాంట్స్ వేయించుకుని శరీర కొలతలను కుదించుకోవడం  విశాలం చేసుకోవడం, దేహం అందం చుట్టూ తమ వ్యక్తిత్వాలను స్థంబింపజేసుకోవడం వైపుగా  స్త్రీల మీద ఒక వేట కొనసాగుతుంది. దీనికి తోడు పురుషులకీ వెసులుబాటు వున్నా స్త్రీల శరీరాల మీద జరిగే అనేక వైద్య చికిత్సా పద్దతులు.


రొమ్ము కేన్సర్ కి దారితీసే మాలా డీ హార్మోన్ ల వాడకం, సిజేరియన్లు,  హిస్టెరెక్టమీలు, మగపిల్లాడి కోసం ఆడపిల్లల్ని కంటూనే వుండే నిర్బంధ ప్రసవాలు లేదా అబార్షన్లు, రీ కానలైజేషన్ ఆపరేషన్లు అన్ని కోతలు కుట్లు స్త్రీల కేంద్రంగానే నిర్ణయించబడతాయి. స్త్రీలు, శరీరాలు-జీవితాలు ఈ పురుషాధిపత్య వ్యవస్థలో కార్పోరేట్ వైద్య వ్యవస్థలో ఒక ఎలుక-కుందేలు కప్పల్లా పరిశోధనకు వాడబడే ఎక్స్ పెరిమెంటల్ యానిమల్స్ గా చూడబడుతున్నాయి లేదా వాడబడుతున్నాయి. స్త్రీల లైంగికానందాన్ని నియంత్రించే లేదా పూర్తిగా ఆపివేసే జననాంగాలలోని క్లిటోరిస్ ని కట్ చేసేసే కృూరమైన సర్జరీ ఇప్పటికీ ముస్లిం సమాజంలో చాలా చోట్ల స్త్రీల జీవితాలని శాసిస్తుంది. స్త్రీలు బాహ్య జననాంగాలు లేకపోవడమే అందమూ-సౌశీల్యమూ ప్యూడల్ ఆదిమ పురుష సమాజానికి. కానీ అదే కొనసాగుతున్నది. స్త్రీల వ్యక్తిత్వాలను కుంచింపజేస్తూ పురుషుడి దైహిక అవసరాలకు అనుగుణంగా మార్చుకునే సర్జరీల చుట్టూ కోట్ల వ్యాపారం నడుస్తున్నది. లెక్కకు మించి కాస్మొటిక్స్ నించి రొమ్ములను పెద్దగా మార్చుకునే సిలికాన్ సర్జరీల వరకూ ముక్కును మార్చే రైనోప్లాస్టీ సర్జరీ నుంచి వెజైనా బిగువుచేసే హస్బెండ్ స్టిచ్ లేదా ఎక్స్ట్రా నాట్ వరకూ ఏది అందం?  పురుషావసరాలకు తగ్గట్టుగా తమ శరీర నిర్మాణాలను మార్చుకుంటూ కొత్త రూపాల్లోకి మారడమా లేదా తిరస్కరించి తమ వాస్తవ రూపాలని ప్రేమిస్తూ ఆత్మగౌరవంతో నిలబడ్డమా?  ఏది ఈస్తటిక్ సెన్స్!?


ప్రముఖ రచయిత్రి వనజ తాతినేని గారు తన ఈస్తటిక్ సెన్స్ కథలో ఈ వస్తువుని లోతుగా చర్చించారు. స్త్రీలతో ఈ సర్జరీలు చేయించి పురుష స్వామ్య వ్యవస్థను నిలదీసి ప్రశ్నించారు. తను సృజించిన మైథిలి పాత్ర ద్వారా ఆమె కొడుకు కోడలితో చేయించబోయే అకృత్యాన్ని నిరశించారు.

స్త్రీల నైనా పురుషుల నైనా aesthetic sense వైపు తరిమింది ఎవరు...వ్యవస్థ. స్రీలను కేవలం సెక్సువల్  ఆబ్జెక్ట్స్ గా మార్చి వ్యాపారం చేసుకుంటున్న ప్రపంచ మార్కెట్ ..ఆర్థిక వ్యవస్థ. కథలో ఈ రెండు అంశాల మీద చర్చ చేస్తూ అనేక ప్రశ్నలను సంధించారు రచయిత్రి వనజ గారు.


మైథిలి ఎమ్మెల్యే. తన ప్రాంతంలో  గిరిజన ఆదివాసీల హక్కుల కోసం కోసం పనిచేసే రాజకీయ కార్యకర్త కూడా. మైథిలి స్నేహితురాలి కూతురు ప్రియ. ప్రియ ఫ్రెండ్ పద్మ. ఈ ముగ్గురు స్త్రీలు కథలో ప్రధాన పాత్రలు. ముగ్గురిలో పూర్తి స్థాయి చైతన్యవంతమైన పాత్ర మైథిలి అందరికంటే వయస్సులో పెద్దది. సమాజంలో స్త్రీల స్థితి పట్ల స్పష్టమైన సైద్దాంతిక అవగాహన వున్నది. ప్రతిమాటా హక్కుల విలువల కోణంలోంచి మాట్లాడుతుంది. మైథిలి ప్రియ అమ్మ మంచి స్నేహితురాళ్ళు. ప్రియ తల్లి అందగత్తె. అదే శాపంగా మారి భర్త అనుమానంతో వేగ లేక భర్తతో విడిపోయి ఒంటరి స్త్రీ గా ప్రియ ను కష్టపడి పెంచుతుంది. ప్రియ కు తన తల్లి పట్ల అపరిమిత ద్వేషం. ఎందుకంటే ఆమె తను అందగత్తెనని గర్వం. 

తన కూతురికి తన అందం రాలేదని ఎద్దేవా చేస్తుంటుంది. తనను బాడీ షేమింగ్ చేసే తల్లిని మించిపోవాలని ప్రియ రెండు రైనోప్లాస్టీ సర్జరీలు డెంచర్ సర్జరీ చిన్ని గడ్డం కోసం జీనియో ప్లాస్టీ చేయించుకుంటుంది. ఇన్ని కాస్మొటిక్ సర్జరీస్ చేయించుకోవడానికి ప్రియ కు బాగానే ఖర్చవుతుంది. ఎంతంటే  ఆరోగ్యం బాగోలేని కన్నతల్లి వైద్యం కోసం డబ్బు మిగలనంత లేదా తన సర్జరీల ఖర్చు కోసం మాత్రమే డబ్బు మిగుల్చుకునేంతగా. ప్రియ ప్రయారిటీస్ లో అమ్మ లేదు అందం తప్ప. సహజంగా లేవమ్మీ! మనసుకు శాంతినిచ్చే అడవిపూల సౌందర్యం లేదు. కుండీలో పెంచిన గులాబీలా ఉన్నావు అంటుంది మైథిలి ప్రియతో. 

అమ్మకన్నా నేనే అందం అని మురిసిపోతున్న ప్రియను చూస్తూ.. సౌందర్యంగా లేకపోవడం లోపం కాదు. ఉన్నతమైన విద్యే ఆత్మవిశ్వాసం. అబద్దంలో అందంగా బతకగల్గుతాం అనుకోవడం మూర్ఖత్వం అంటుంది ప్రియతో. అందానికి వున్న విలువ వ్యక్తిత్వాలకు ఎందుకు లేదని బాధ పడుతుంది. 


ప్రియ స్నేహితురాలు 43 ఏళ్ళ పద్మ ఇండియాకి ప్రత్యేకించి సిలికాన్ ఇంప్లాంటేషన్ చేయించుకోవడం కోసం వస్తుంది. ఆమెకు పదహారు పదేళ్ళ పిల్లలు వుంటారు. బి టెక్ తర్వాత అమెరికా వెళ్ళి నాలుగేళ్ళు ఉద్యోగం చేసి పెళ్ళి చేసుకుని పిల్లల పెంపకం కోసం ఉద్యోగం మానేస్తుంది. పద్మ భర్తకు భార్య శరీరం పట్ల అసంతృప్తి. ఆమెకున్న చిన్న రొమ్ములు హిస్టెరెక్టిమి తర్వాత  పొత్తి కడుపు క్రింద పడ్డ నిలువు కోత. నీతో సంసారం చేయబుద్దవడంలేదు. విడాకులిచ్చి వేరే పెళ్ళి

చేసుకుంటానని నిత్యం బెదిరించే భర్త . సంసారాన్ని కాపాడుకోవడం కోసం సంసారంలో మూడవ మనిషి రాకుండా వుండటం కోసం సిలికాన్ ఇంప్లాంటేషన్ కి సిద్దపడుతుంది. పద్మే కాదు, ప్రియ కూడా మైథిలి కొడుకు శశాంక్ కోసం సిలికాన్ ఇంప్లాంటేషన్ కి సిద్దపడి వస్తుంది. అది విన్న మైథిలి ఆగ్రహంతో కుమిలిపోతుంది. 


శశాంక్ లో పద్మ భర్తలో భార్యల శరీరాలను బాడీ షేమింగ్ చేయడం అనే అవకరం వుందని స్త్రీలను అందం మాయాజాలంలో ముంచెత్తి తమ చెప్పుచేతల్లో వుంచుకునే భర్త,  మార్కెట్ రెండింటి మాయాజాలాన్ని తిరస్కరించాలని చెబుతుంది.


ఎవరో తమను ప్రేమిస్తేనో.. ఎవరినో తాము ప్రేమిస్తేనో తమకు అస్థిత్వం వుందనుకోవడం తప్పనీ తమను తామే ప్రేమించుకోవాలని  అప్పుడే మన జీవితాన్ని జీవించినట్లనీ లేకపోతే పరాధీనమైపోతామని చెప్తూనే

అసలైన సౌందర్యం అంటే మన జీవితాన్ని మనం జీవించే కళ  అనీ .. అదే ఈస్తటిక్ సెన్స్ అని చెపుతుంది మైథిలి. 


ఎవరో తమను గుర్తించాలన్న సౌందర్యాభిలాష కంటే నిన్ను నీవు ఉన్నతీకరించుకునే సౌందర్యాభిలాషే నిజమైంది. అదే ఈస్తటిక్ సెన్స్ అని రచయిత నొక్కి చెప్పిన కథ ఇది. 


ఉల్లిపాయలోని ప్రతి పొరకీ కన్నీరు తెప్పించే గుణం ఉన్నట్లు, పురుషుడి ప్రతి చర్యా స్త్రీ దుఃఖానికి కారణం అవుతుంది. అలాంటి పురుషుల కోసం తమ దేహాల్ని సర్జరీలతో మార్చుకోవడం సౌందర్యకాంక్షకు బలి అయిపోవడం అవసరమా.. సౌందర్యకాంక్ష వెనుక ఎడతెగని హింస వుంది. కార్పోరేట్ వ్యాపారం వుంది. అందంగా లేని స్త్రీలు ఎన్నో విజయాలు సాధించారు అంటూ ఆఫ్రికన్-అమెరికన్ సౌజర్న్ ట్రూత్ తో పోలిస్తే మిస్ ఇండియాలది మిస్ యూనివర్స్ లది ఏ పాటి అస్థిత్వ నిరూపణ అంటూ.. భర్తల సౌందర్యకాంక్షలకు బలై పోవడానికి సిద్దపడిన ప్రియ పద్మలను ఆవేదన కూడిన స్వరంతో మందలిస్తుంది మైథిలి.


స్త్రీలను కాస్మొటిక్ సర్జరీస్ అనే హింసా కూపాల్లోకి తోసేస్తూ వ్యక్తిత్వం లేని మగవాడి చేతుల్లో బాహ్యరూపాలు మారిపోయే బొమ్మల్లా.. కీలు బొమ్మల్లా మార్చేసే ప్యూడల్ పితృస్వామ్య వ్యవస్థ లోని దోపిడీనీ క్రూరత్వాన్ని మాలిన్యాన్ని వికృతాన్ని…  కార్పోరేట్ వైద్య వ్యవస్థలోని దోపిడీని క్రూరత్వాన్ని…   స్త్రీలు దాంపత్య జీవితాల్లో మౌనంగా అనుభవించే లైంగింక హింసలకు మగవాడి వికారమైన పడగ్గది ఈస్తటిక్ సెన్స్ ని బహిర్గతం చేసే కథలు వనజ తాతినేని గారు మరిన్ని రాయాలని కోరుతూ.. ఈ అవకాశాన్ని నాకిచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ… ఈ కథాసంపుటి లోని మిగతా కథలన్నీ పాఠకుల మనఃచక్షువులు తెరుచుకునే విధంగా వుంటాయని ఆకాంక్షింస్తూ.. వనజ తాతినేని గారికి అభినందనలతో..డా. గీతాంజలి భారతి. హైదరాబాద్.





24, నవంబర్ 2022, గురువారం

వాస్తవికత ఊహ పడుగు పేక ల కలనేత ఈ “ఊహ”

 ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటిలోని “ఊహల మడుగు” కథ కు సహ రచయిత కవి డా. కాళ్లకూరి శైలజ గారి వ్యాఖ్యానం. ధన్యవాదాలు శైలజ గారూ… 🙏💐

ఊహల మడుగు

--------------------

కథా రచన రచయిత కు ఒక సవాలు. పాఠకునికి  అనుభవం. తెలుగు భాషలో ఏడాదికి సుమారు లక్ష కథలు ముద్రణకు వస్తాయని ఒక అంచనా. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు వార్తలు, విశేషాలు, సంఘటనలు....ఇవన్నీ చెప్పే నోటి నుంచి వినే చెవికి వెళ్లే లోపు జరిగేదంతా కథన ప్రక్రియే అనిపిస్తుంది. అందరం కథకులమే! కానీ కథా రచయిత ఇంకొంచెం పరిశ్రమ చేస్తాడు.బుల్లితెర మీద, దిన -మాస పత్రిక లలో, వందలాది  కథల మైదానంలో పచ్చిక లా ఇబ్బడిముబ్బడిగా వస్తూ కొత్తదనం కోసం ఉవ్విళ్ళూరుతున్న రోజులివి. గమనిస్తే వీటిలో ఎలిమెంట్ ఆఫ్ సర్ ప్రైజ్ దిశగా ప్రయాణం జరుగుతోంది. పాఠకుల సంఖ్య కోసం,మార్కెట్ కోసం జరుగుతున్న ప్రక్రియలేమో అని ఒక సందేహం వస్తుంది కూడా.ప్రస్తుతం ఉన్న సాంకేతికత సహాయం తో  విశ్వసాహిత్యంలో ఏ మూల ఏ రచయిత ఏ కొత్త ప్రయోగం చేసినా దాన్ని అందరూ త్వరగా అంది పుచ్చుకోగలుగుతున్నారు. పైగా గ్లోబలైజేషన్ వలన భావోద్వేగాలలో కూడా సామ్యం పెరిగింది.  

                ఇవన్నీ ఇలా ఉండగా సమాజంలో ప్రతి వ్యక్తి జీవితం తన చుట్టూఉన్న వారితో చేరువయ్యే ఒక దగ్గరితనం వచ్చింది.దీనికి సోషల్ మీడియా ఒక కారణమని చెప్పాలి. ప్రతివారికి భావప్రకటన స్వేచ్ఛ, తమలాంటి అభిరుచులు, ఆశలు, స్థితిగతులున్న వారు ఇంకా  ఎవరున్నారో, వారిని  గురించి తెలుసుకోవడం సాధ్యపడుతోంది. కొన్ని ప్రత్యేకమైన జీవిత గాథలు  వెలికి వచ్చాయి.రచయితలు అట్లాంటి వారి మానసిక సంఘర్షణను కథగా మలచడం  మొదలుపెట్టారు.

          వనజ తాతినేని గారి  "ఊహల మడుగు" అనే కథ చదవగానే నేను ఒక విశిష్టమైన పఠనానుభూతిని పొందాను.కథనం, పాత్రచిత్రణ ,కథలోని పరిసరాలు,సంఘటనల అల్లిక---- ఇవన్నీ శిశిర ఋతువులో నెమ్మదిగా లోకాన్ని రోజురోజూ  అధికమౌతూ మంచు తెర ఆవరించినట్టు ,పాఠకుల మనస్సును కమ్ముకుంటాయి.

      కథ ఒక సారి కాదు రెండు మూడు సార్లు చదివించుకుంటుంది.మొదటి సారి దిగ్భ్రాంతి  తో కూడిన కన్ఫ్యూజన్ వస్తుంది.రెండవసారి వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి చదువుకుంటాం. 

      ఇక మూడోసారి రచయిత పక్కన నిలబడి బుద్దిగా,ఎరుకతో ప్రతి వాక్యాన్ని  చదువుతాం .అలా అని కథలో సంక్లిష్టత లేదు.నిజం చెప్పాలంటే ఇది కథ కాదు.యథార్థ జీవితంలో ఇందులోని కథానాయిక తో పాటు మనం కూడా నడుస్తూ ఉంటాం.

      కథానాయకురాలు పుట్టుకతో వచ్చే ఒక అవకారం తో పాటు, దివ్యాంగురాలు కావడం ఒకానొక జన్యుపరమైన డిఫెక్ట్, మరొక దురదృష్టకరమైన వైరస్ దాడి.

కారణాలు ఏవైనా ఫలితం అనుభవించేది మటుకు ఆ వ్యక్తి మాత్రమే కదా!

ప్రపంచంలో ఏ మూల చూసినా అటువంటి వారి పట్ల సహానుభూతి కన్నా,వారి నిత్య జీవన భారమే ఎక్కువ  శాతం సమస్యలకు  కారణమౌతుంది. దీనిని చాలా స్పష్టంగా ,సృజనాత్మకంగా 'డీల్" చేయడం రచయిత్రి యొక్క కథనంలో ఉన్న అభినివేశాన్ని తెలియజేస్తోంది.

                      'సర్రియలిజం' అంటే వాస్తవికత ,ఊహ పడుగు,పేక ల కలనేత గా ఉండడమని, మనందరికీ తెలుసు. 

కొంచెం వివరాల్లోకి వెళ్దాం.మనం ఏ మాటలు పైకి చెప్తామో వాటికి రెండు రెట్లు స్వగతంలో అనుకుంటాం.ఎలా ప్రవర్తిస్తామో దానికి మరెన్నో రెట్లు అంతరంగంలో తర్జనభర్జనలు పడతాం.చాలాసార్లు పర్యవసానాన్ని గురించి ఆలోచించి,మన ప్రవర్తనను మార్పు చేసుకుంటూ ఉంటాం.అలా చేయగలిగితే పరిణితి సాధించినట్టే . 

      ఈ కథలోని  కథానాయిక చేతన,

అంతశ్చేతన,ఉపచేతనల నడుమ ఊగిసలాడే భావ చిత్రాలను రచయిత్రి తర్కానికి లోబడి ఉంటూనే ఆశ్చర్యకరమైన విధానంలో వర్ణించారు.

           అన్ని విధాల ఆరోగ్యవంతులైన మనుషుల్లో భావోద్వేగాలను ఒక సరళరేఖలో  అమర్చినట్లయితే, దురహంకారం- ఆధిపత్య ధోరణి ఒకపక్క, ఆత్మన్యూనతా భావం- నిరసన వల్ల వచ్చే హింసాత్మక ధోరణి మరో పక్క ఉంటాయి.రచయిత్రి ఆ రెండో పక్కనున్న భావోద్వేగాలను స్పృశించడం ఈ కథలోని విశిష్టమైన అంశం.

                        ఈ తరహా కథలను విజయగాథలు గా చిత్రించే మోహం సర్వసాధారణం.చాలా సార్లు కథ ముప్పావు భాగం గడిచేసరికి కృషి ఫలితంగానో,అసంబద్ధంగానో, ఊహించని చోట నుంచి లభించే మంచితనం వల్లనో ఆ అభాగ్యులు కాస్తా భాగ్యవంతులైపోతారు.అంటే వారికి  డబ్బొస్తుందని కాదు; జీవితం లో ఏమి కోల్పోయారో వాటన్నింటినీ పొందినట్టు చూపిస్తారు.వారిని అవహేళన చేసిన వారంతా తల  దించుకుంటారు;ఒక్కోసారి సంపూర్ణ మానసిక పరివర్తన కూడా వచ్చేస్తుంది.

ఇది పాఠకుడికి, రచయితకు ఒక భద్రతా భావాన్ని ఇస్తుందేమో తప్ప , సత్యావిష్కరణ జరగదు.కృతకమైన సన్నివేశంగా మిగిలిపోతుంది.       అలాంటిది వనజ గారు కథా  శీర్షిక  "ఊహల మడుగు"అంటూ  హెచ్చరిస్తూ కథలోకి తీసుకెళతారు.

      వాస్తవికత,కల ఈ రెండూ కానిదే ఊహ. ఊహ మెలకువలో జరుగుతుంది.ఒక్కోసారి అది కల్పనామయ జగత్తుగా మారి, ఆ వ్యక్తిని అబద్ధపు జీవన విధానం వైపు మళ్ళించే ప్రమాదం కూడా ఉండవచ్చు.కథలో ఈ తప్పిదం జరగకుండా, వనజ గారు చాలా జాగ్రత్తగా వ్యవహరించారనిపించింది.

     ఊహను నాటకంలో,చలన చిత్రంలో అయితే చూపించడం సులభం.కాస్త blurred images

చూపటం వలన సాధ్యమవుతుంది.

               కథల్లో  ఊహకు ముందో వెనుకో, 'జరిగింది ఊహ' అని స్పష్టంగా తెలియజేయడం మనం ఇంత వరకూ చదివి ఉన్నాం.ఈ కథలో రచయిత్రి శైలి విభిన్నంగా ఉండడం వలన చదివిస్తుంది.ఇందుకు రచయిత్రి అభినందనీయురాలు.

        అక్కడక్కడా కొన్ని categorical statements  చేస్తూ,ఊహ ఏదో ,వాస్తవికత ఏదో అన్నది 'ట్రెజర్ హంట్' గేమ్ లోలా రచయిత్రి కొన్ని జాడలను విడిచిపెట్టారు.వీటిని అందిపుచ్చుకోవడమే పాఠకుడు చేయవలసిన పని.

              ఉదాహరణకు,

1. “ ఆశ్చర్య పోతున్న వారితో ఇలా మాట్లాడాలని రిహార్సల్ వేసుకుంటున్నాను”.....

2.“అవమానించ బడ్డ మనసుకు ఊహ లైనా శాంతి కలిగించేవే కదా”.....

ఇవి పాఠకుడికి కథ మీద పట్టు సాధించడానికి వ్రాయబడ్డ వాక్యాలు.


కథలో వచ్చే సైకియాట్రిస్ట్ పాత్ర ఇచ్చే సలహాలు రెండో పట్టు.


ఇక తల్లికి,కథానాయికకు మధ్య ఉన్న అనుబంధం గురించి తప్పకుండా చెప్పుకోవాలి.దివ్యాంగురాలైన  కూతుర్ని కన్న తల్లి--వరుసగా నిరాశ- నిస్పృహ- తప్పనిసరై భరించే తత్వం-దుఃఖం అనే దశల్లోంచి  ప్రయాణించి, ప్రయాణించి చివరకు acceptance లోకి, ఆ తర్వాత ప్రేమ లోని అత్యంత పవిత్రమైన 'ఆప్యాయత' అనే ఆవరణలోకి ఎలా అడుగులు వేసిందో మనం కూడా ఆ ఉద్వేగాలన్నింటినీ అనుభవిస్తే తప్ప అర్థం కావు.ఈ కధలో అమ్మ ఒక శక్తివంతమైన ప్రతీక. ఆమెను ఆదర్శ మానవి (ideal  humanbeing)అనుకోవచ్చు.

                                            “అందరూ అమ్మలా ప్రేమను మాత్రమే పంచడం ఎంత బాగుంటుంది?”

  ఈ వాక్యం తరువాత కధానాయిక తలపుల్లో మెదిలిన భావనను వనజ గారు అత్యంత అద్భుతంగా ఆవిష్కరించారు.ఆ వాక్యాన్ని పాఠకులు చదివినప్పుడు రచయిత ఉద్దేశ్యం ,గమ్యం,ఉత్తమాభిరుచి అవగాహన లోకి వస్తాయి.అంత గొప్ప వాక్యాన్ని మరి నేను కూడా వ్యాసంలో వ్రాసి తీరాలి కదా! ఈ వాక్యాన్ని వ్రాయడానికి ఎంతో గర్వంగా ఉంది.                                             

     “అప్పుడు నా ఆలోచనలు ఇంత భయంకరంగా ఉండవని అదో ఆశ”.

మళ్లీ కథనంతా చదవండి.నాతో మీరంతా ఏకీభవిస్తారని ఎదురు చూస్తూ ఉంటాను.

      ఆఖరి పేరా లో కథానాయిక తన పేరు చెప్పింది.పాఠకుడు సరిగ్గా చదివితే అసలీ వాక్యం అవసరం లేదనిపిస్తుంది.ఎందుకంటే కథ ప్రారంభంలోనే

“అమ్మ నాన్న పెట్టిన పేరును సార్థకం చేసుకునే భాగ్యం”

అంటూ ఒక వాక్యం మనకు ఎదురౌతుంది.

ఒకవేళ కథ చదివే తొందరలో దాన్ని మిస్సయితే,రచయిత్రి మళ్లీ మనకు చెప్పారు.ఇప్పుడైనా చదువుకోవచ్చు.

       మొత్తం మీద 'మానసిక విశ్లేషణ' అనే సాంప్రదాయకమైన పద్ధతిలో కాక, 'మనోధర్మాన్ని పరిశీలించడం" అనే కొత్త ప్రక్రియతో రచయిత కృతకృత్యురాలు అయ్యారు.

       ఈ కథలో ఉన్న సంఘటనలన్నీ తర్కానికి నిలబడగల సంబంధ బాంధవ్యాలను కలిగి వుంటాయి.ఇది శుద్ధ ప్రామాణిక గణిత సూత్రంలా అనిపిస్తుంది.

       మంచి కథను అందించిన వనజ తాతినేని గారికి హృదయపూర్వక మైన అభినందనలు.


కాళ్ళకూరి శైలజ . 




 

15, నవంబర్ 2022, మంగళవారం

లాలిత్యం - తీవ్రత

 ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటిలో "పైడి బొమ్మ " కథకు వ్యాఖ్యానం రాసిన శశికళ ఓలేటి  గారికి ధన్యవాదములతో .. ఆ కథ పరిచయం . 

పైడి బొమ్మ...నా మనోగతం.

అలనాటి రామచంద్రుడికి అశ్వమేధ యాగ నిర్వహణకు తన ధర్మపత్ని స్థానంలో స్వర్ణ సీత‌ అవసరమయ్యింది. ఈ కధలో రామచంద్రరావు గారికి...ధర్మబద్ధంగా తాళి కట్టిన భార్య అధర్మ మార్గాన్ని ఎంచుకుంటే....ఆపద్ధర్మంగా ఆదరించి,చేరదీసిన మహిళ....అత్యంత ఉన్నతంగా సతీధర్మాన్ని నెరవేర్చి, ఆయన ఏకపత్నీవ్రత దీక్షకు భంగం రానీయకుండా.. ఎటువంటి హోదాను,ఎటువంటి ఆర్ధిక భద్రతను కోరుకోకుండానే....తన సత్ప్రవర్తనతో, త్యాగనిరతితో, ఆధ్యాత్మిక నడవడితో... నిస్వార్థంగా...ఆయననూ, ఆయన పిల్లలను ఆదరించి, అలరించిన తీరు అద్భుతంగా తన కథ పైడిబొమ్మలో మలిచారు శ్రీమతి వనజ తాతినేని గారు.‌

     పద్మవల్లీ ఆండాళ్ళు గురించి రాస్తూ..." అలుపన్నది లేకుండా గానుగ రోలులో కణెంలా తిరుగుతూ పనిచేసేది!"...అంటుంది ఈ కథ చెప్పే నీలోత్పల, రామచంద్రరావు గారి మనవరాలు.‌ తన తాతయ్య దృష్టిలో నిజమైన నీలోత్పల ఆండాళ్ళు. బురదలో పుట్టినా...తన అస్థిత్వాన్ని హుందాగా లోకానికి చూపించే పద్మం లాంటిది ఆండాళ్ళు.ఆమెను తన పైడి బొమ్మగా వర్ణిస్తూ...తాతగారు తన జీవితంలోని ముఖ్య ఘటనలు, కుటుంబ సభ్యుల వంచనలు, మలుపులు, భార్యను దూరం పెట్టి,‌ఆండాళ్ళును ఆదరించవలసి వచ్చిన పరిస్థితులు, ఆండాళ్ళు... ఆయన పిల్లలను,మనవరాలినీ... సక్రమంగా పెంచి, ఆయనకు స్వధర్మపాలనలో అడుగడుగూ‌ తోడుగా నిలిచిన ప్రతీ వివరాన్నీ ఆయన డైరీలో రాసుకుంటారు.

     ఆయన నిష్క్రమణ ను స్థితప్రజ్ఞతతో స్వీకరించి..ఆశ్రమవాసం చేసి , అక్కడే తనువు చాలిస్తుంది ఆండాళ్ళు. అదే ఈ కధకు ఆరంభం.

        మానవ సంబంధాల్లో లోటుపాట్ల‌ గురించి మనకు అనేక పితూరీలు ఉంటాయి. నిజానికి తరచి చూసుకుంటే...ఎక్కడో అక్కడ మనకు జీవితంలో సమతుల్యత లభిస్తుంది. రామచంద్రరావు గారికీ,ఆయన పిల్లలకూ‌ అదే జరిగింది... ఆండాళ్ళు రూపంలో. సరోజ నెరవేర్చలేని కర్తవ్యాలు తను నెరవేర్చి, భర్తకూ,పిల్లలకూ..ఆమె పంచలేని ప్రేమను తను అందించి...ఆ ఇంటి ఇలవేల్పు అయ్యింది ఆండాళ్ళు...అది కూడా పూర్తి‌ నిష్కామంగా, నిస్వార్థంగా...ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా. 


           వనజగారి శైలిలో ఎంత లాలిత్యముంటుందో...అంత తీవ్రత కూడా ఉంటుంది. కుటుంబాల్లో పైకి పొక్కనీకుండా, కప్పెట్టేసే కొన్ని నగ్నసత్యాలు, అనైతిక ప్రవర్తనల గురించి... ఆమె చాలా కఠిన వైఖరి తో తమ కధల్లో చర్చిస్తారు. ఏ ఒక్క వాక్యమూ అసంబద్ధంగా ఉండదు. కధకు‌ అవసరమైన ప్రతీ రసాన్నీ సమపాళ్ళలో వాడుకుంటారు...ఆ విధంగా పాఠకులను తన కధనంలోకి నేర్పుగా లాగేసుకుంటారు. ఆ పాత్రల మధ్యనే తిరుగాడిన పాఠకులకు...కథ తాలూకు సారాంశం ,సందేశం చాలా గాఢంగా హత్తుకునిపోయి ఉంటుంది. 


       తమ కుటుంబానికి అంత సేవ చేసిన ఆండాళ్ళు...ఎవరూ లేని అనాధలా ఆశ్రమంలో చనిపోవడాన్ని...కథకురాలు నీలోత్పల తీవ్రంగా గర్హిస్తుంది. తాతగారి ఆస్తులు తీసుకున్న ఆయన పిల్లలు...ఆయన అత్యంతంగా ప్రేమించిన ఆండాళ్ బాధ్యత తీసుకోలేదన్న అసంతృప్తి ,ఆక్రోశం అడుగడుగునా వ్యక్తపరుస్తుంది. అక్కడ మనకు ఆమెలో రచయిత్రి నిష్పక్షపాత వైఖరి అడుగడుగునా కనిపిస్తుంది.


         నీలోత్పలకు తన తాతగారు ఒక హీరో. ధర్మం తప్పని రాముడంతటి వారు. కధలో ఎక్కడా కూడా ఆయన మీద పల్లెత్తు మాట వెయ్యలేదు. అయితే వయసులో ఉన్న సౌందర్యవతి అయిన భార్యను వదిలేసి, నెలల తరబడి వ్యాపార నిమిత్తం ఆమెకు దూరంగా ఉంటూ...ఆమెకు దారితప్పే అవకాశం ఆయనే ఇచ్చారు. స్త్రీకి వివాహం ద్వారా ఆర్ధిక,సాంఘిక భద్రతతో పాటూ లైంగిక సుఖం కూడా అవసరం అన్నది మౌలిక సూత్రం.‌ భార్య అక్రమ సంబంధాన్ని ఉదాసీనంగా తీసుకుని,ఆమెను పరిత్యజించి,పిల్లలను దూరం చేసి,ఆండాళ్ళును చేరదీసి...ఆయన అదే తన నైతిక విజయం అనుకోడం కాస్త అసంబద్ధంగా ఉంది. అదే ఆయన భార్యను సంస్కరించి, ఆమెను సమాదరించి,ఆమెకో వ్యాపకాన్ని సృష్టించి...ఉద్ధరించి ఉండుంటే...ఆయన మహోన్నతుడు అయ్యుండేవారు.‌అప్పుడు కథ వేరుగా ఉండేది. కధా సమయం యొక్క కాలమాన పరిస్థితులు, వ్యక్తుల మానసిక స్థితిగతులు, సంఘమర్యాదలు‌ కూడా పరిగణనలోకి‌ తీసుకుని ,‌రచయిత్రి కధలోని మలుపులను సృష్టించి ఉంటారు. 

ఇకపోతే క్రిష్ణమాచార్య పాత్ర. ఒక పాత్రత‌ ఉన్న కులంలో పుట్టి పాతకుడిలా ప్రవర్తించిన వ్యక్తి.బహుశా బ్రాహ్మణ కులానికున్న vulnerability రచయిత్రి వాడుకున్నట్టు అనిపించింది.‌ ఏ కులమో తెలియని ఆండాళ్ళు ఔన్నత్యాన్ని,అగ్రకులస్థుడయిన క్రిష్ణమాచార్య దిగజారుడు తనంతో పోల్చడానికి ఆ పాత్ర సృష్టించినట్లు ఉన్నారు రచయిత్రి. స్త్రీ జారుడు మెట్లు మీద ప్రయాణమే చెయ్యకూడదు.చెయ్యడం మొదలు పెడితే...ఆమెది అధోగతే,పతనావస్థే. అక్కడ బ్రాహ్మణుడున్నా, మరొకరున్నా...అదే పరిస్థితి.

       రచయిత్రి కధనాన్ని ఆద్యంతం చాలా ఆసక్తికరంగా కొనసాగించారు.‌డైరీలో పేజీలను నీలోత్పల మధ్యమధ్యలో తీసి చదవడం వలన,అక్కడక్కడా క్రోనలాజికల్ గా మనకు చిన్న అయోమయం ఉంటుంది.‌కానీ అంతలోనే మనకు అసలు విషయం అవగతం అవుతూ ఉంటుంది.‌డైరీలో ...తన మనోవ్యధను, భావోద్వేగాలను, ఆండాళ్ళు పట్ల ఎనలేని కృతజ్ఞతాభావాన్ని, భార్య వంచన పట్ల ఎగిసిపడిన దుఃఖావేశాన్నీ రామచంద్రరావు గారు రాసుకున్న తీరు హృదయానికి హత్తుకునేలా ఉంటుంది.  

ఒక అర్ధశతాబ్దం క్రిందట... చాలా గ్రామీణ నేపధ్యం ఉన్న వ్యాపార కుటుంబాల్లో...మానవ సంబంధాల్లో నెలకొని ఉన్న అనిశ్చితిని... కథావస్తువు గా తీసుకుని,తన అనుభవజ్ఞతతో, అద్భుతమైన శైలి, నైపుణ్యం తో,ఒక పరిపూర్ణమైన కధను అందించిన తాతినేని వనజ గారు సదా ప్రశంసనీయులు, అభినందనీయులు.‌ సహా రచయితగా ఈ కథను  నేను విశ్లేషించడం గౌరంగా భావిస్తూ ..వనజ గారి అముద్రిత కథా సంపుటికి అభినందనలు తెలియజేస్తూ .. 

ధన్యవాదాలతో

శశికళ ఓలేటి

టెన్నిసీ, యుఎస్ఏ.




24, అక్టోబర్ 2022, సోమవారం

మాతృత్వపు హక్కు రద్దు కోరిన తల్లి

 ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటిలో “ప్రేమే నేరమౌనా!?” కథ పై కథా సమీక్ష  (వ్యాఖ్యానం) అందించారు -రాధ  మండువ. అది మీకు పరిచయం చేస్తున్నాను. రాధ మండువ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.. 

***********

వనజ తాతినేని గారు  బ్లాగర్ గా, కవయిత్రిగా, రచయిత్రిగా పదేళ్ళకు పైగా పరిచయం. ఆమె తన అముద్రిత కథలను సంపుటిగా  వెలువరించే క్రమంలో ఒక కథని పరిచయం చేయమని అడిగిన వెంటనే అంగీకరించాను.   

"ప్రేమే నేరమౌనా!?" కథను చదివిన తర్వాత కథను విశ్లేషించాలన్న ఆసక్తి కలిగింది. కథ చదువుతుంటే ఆ కథలోని కథానాయకి పై ఇష్టం ఏర్పడింది.  ఆమె ఆలోచనా పరిథి లోని విస్తృతి ఆశ్చర్యం కలిగించింది.

సాధారణంగా కనిపిస్తూ అసాధారణమైన కథగా ముగియడం ఈ కథలోని విశేషం. జీవితం ఇలా కూడా ఉండవచ్చు లేదా మలుచుకోవచ్చు కదా అనిపించింది.  

ఎన్నో ఆలోచనలు మనలో కదలాడుతాయి - ఆవేదన కలిగించేవి.  కుటుంబ బంధాలనే సంకెళ్ళ నుండి, తన మానసిక వేదన నుండి స్త్రీ విముక్తి కోరుకోకూడదా!? అనేదే ఈ కథలో చర్చించుకోవలసిన విషయం.

స్త్రీలకూ వ్యక్తిత్వ సృహ ఉండాలన్న మేల్కొలుపు ఈ కథా నాయకి దేవకి లో కలిగింది.  కలగడమే చైతన్యమైతే ఆమె నిర్ణయం పాఠకులకి  ఒక విభ్రాంతిని కలిగిస్తుంది. 

స్త్రీలు  కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోయాను అనే ఆరోపణలు చేసుకుంటూనో లేదా అర్ధం చేసుకున్న కుటుంబ సభ్యుల మధ్య వారి   సానుభూతితో  బ్రతుకుతూనో ఉండాలి తప్ప తమకి ఇష్టం వచ్చినట్లు ఉండకూడదా!? తమకి నచ్చని వాటిని స్వేచ్ఛగా వ్యక్తీకరించకూడదా!!? లాంటి భావాలు పాతవే కానీ వాటిని సరికొత్తగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా రచించడం, ముఖ్యంగా కథ ముగింపులో ఓ బలమైన కెరటం ముఖాన్ని తాకిన అనుభూతిని కలిగించడంలో రచయిత్రి ప్రతిభ కనపడుతోంది.  

*

ఇక కథలోకి వెళితే - 

ప్రేమించి పెళ్లి చేసుకున్న దేవకి భర్త సహకారంతో ఉన్నత చదువులు చదువుకుని, ఉద్యోగం సంపాదిస్తుంది. ఇద్దరి బిడ్డలకి తల్లి అవుతుంది. వారి పిల్లల పెంపకం భర్త చేతికిచ్చి ఆమె ఆదాయ వనరుగా  మారిపోయింది. అది ఎంతలా అంటే -  తండ్రి గారాబంలో పిల్లలిద్దరూ తల్లి మాటను లక్ష్య పెట్టనంతగా...  తల్లిని గడ్డిపోచలా తీసి పారేసేంతగా... 

ప్రేమ, గౌరవం ఇవ్వాల్సిన పిల్లలే ఆమెని మానసిక వ్యాధిగ్రస్తురాలిగా ముద్ర వేశారు. క్రమశిక్షణ లేని,  సోమరిపోతులైన,  సంపాదనాపరులైన పిల్లల మాటతీరు, ప్రవర్తన భరించలేకపోతుంది.  వారికి భర్త వంతపాడటం జీర్ణించుకోలేకపోతుంది.

ఏం చెయ్యాలో నిర్ణయించుకునే కోర్టు మెట్లెక్కింది.  జడ్జితో తన ఆక్రోశాన్ని స్పష్టంగా చెప్పగలిగింది.  'తన  భర్తనుండి, పిల్లలనుండి గౌరవం, ప్రేమ కావాలి అని కోరుకున్నాను, అవి లభించవని గ్రహించాను' అని చెప్పిందే తప్ప వాళ్ళని నిందించలేదు.  ఈ నేల మీద నిలబడటానికి తనకి కొద్దిపాటి ఊతం చాలు అనుకోగలిగింది కనుకనే తన సంపాదన ని  నాలుగు భాగాలు చేయమని కోరింది.  ఆమె ఆలోచనల్లో దూరదృష్టి, ఆమె నిర్ణయంలో స్పష్టత ఉంది.

దేవకి తీసుకున్న నిర్ణయం, కోర్టులో జడ్జి గారితో ఆమె  మాట్లాడిన విధం, భర్త కానీ, పిల్లలు కానీ ఆమె తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి మాటలు అంటారో ఊహించడంలో ఆమె  చూపించిన పరిపక్వత ...  కథ చదివితే పాఠకులకి అర్థం అవుతుంది. 

ఆమె ఆలోచనల్లోని పరిపక్వత నేటి ప్రతి స్త్రీలోనూ ఉండాలనిపించింది.  రచయిత్రి వనజ తాతినేని గారు స్త్రీల అంతరంగాలని ఆవిష్కరించడంలో గొప్ప పరిశీలన చేశారనిపించింది.  ఓ స్త్రీని మరో స్త్రీ మాత్రమే అర్థం చేసుకోగలదు అనే సత్యం మరోసారి ఋజువయింది.

పాత్ర యెక్క ప్రతి ఆలోచననూ, ఆమె తీసుకోబోతున్న నిర్ణయాన్ని పాఠకులు అర్ధం చేసుకోవడానికి అవకాశమిస్తూ వనజ గారు కథని మలిచారు.  

పాఠకులకు అందాల్సిన కోణాలు మరెన్నో చర్చకు రావడానికి అవకాశాన్ని కూడా ఇచ్చారు.  

కులాంతర, మతాంతర ప్రేమ వివాహాలలో స్త్రీ నిమ్న కులానికి చెందినదైతే ప్రతి భారతీయ వివాహంలో ఉండే పురుషాధిక్యతతో పాటు కుల అహంకారాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందనే సూక్ష్మమైన విషయాన్ని కథలో జొప్పించి ప్రతిభావంతంగా చెప్పగలిగారు.

ఆధిపత్యభావన, అహంకారపు ధోరణులను భరించలేక నలిగిపోతున్న ఎంతో మంది స్త్రీల ఆవేదనే ఈ కథ.  

గుర్తుండిపోయే కథను రాసిన వనజ గారికి అభినందనలు. ఆమె అముద్రిత కథా సంపుటి "ఈస్తటిక్ సెన్స్" కథా సంపుటిలో చోటు చేసుకున్న మిగతా కథలను,   సహరచయితల  విశ్లేషణలను చదవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. 

వనజ తాతినేని గారికి మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ    -  రాధ మండువ.




12, అక్టోబర్ 2022, బుధవారం

నల్లకాకి - తెల్లమనసు - కోకిల తల్లి

 కోకిలతల్లి -విశ్లేషణ వి. శాంతి ప్రభోద

సాధారణంగా మనం కాకిని పాపానికి ప్రతీకగా చూస్తాం. 

గత జన్మలో చేసిన పాపాలన్నీ కాకి రూపంలో ఎగిరి పోతాయని నమ్ముతాం. 

కానీ నల్లని కాకి లోని తెల్లని మనసును గమనించం. 

తన జాతికి చెందని కోకిల గుడ్లు పొదిగే దయాగుణాన్ని, సేవా హృదయాన్ని  గుర్తించం.  

వనజ తాతినేని గారి "కోకిల తల్లి" లో ఒక సాధారణ గృహిణి కరుణ గుర్తించింది.   

కాకికి ఉన్న సంస్కారం, క్షమాగుణం, నిస్వార్ధం మనిషిని అయిన  తనకు లేవేంటి అని ప్రశ్నించుకుంటుంది ఈ కథలోని ప్రధాన పాత్ర కరుణ. 


ఈ ప్రకృతిలోని పక్షులు, పువ్వులు , పచ్చని చెట్లు, పువ్వులను వాటి జీవన సంరంభాన్ని సరిగ్గా పట్టించుకోము.  పరిశీలించం. అన్నిటికీ సమయం లేదనుకుంటాం. 

 కానీ ఈ కథలో ప్రధాన పాత్ర కరుణ నిశితంగా గమనిస్తుంది. 

ఆమె గమనిస్తున్నట్టు చెట్టుకు , పువ్వుకు , ప్రకృతికి , కాకికి తెలుసో తెలియదో .. కానీ ఆమె వాటిని ప్రతి రోజూ పరిశీలిస్తూనే ఉంటుంది. మౌనంగా సంభాషిస్తూనే ఉంటుంది. 

బహుశా వాటికి ఆ విషయం తెలియక పోయి ఉండొచ్చు. తెలిస్తే అవి అప్రమత్తంగా ఉంటాయేమో .. అంత సహజంగా ఉండలేవేమో ..!

బిడియపడుతూ ఉంటాయేమో..! 

అక్కడ నుండి వెళ్ళిపోతాయేమో.!


మనిషి అలికిడి ఉన్నచోట పక్షులు అప్రమత్తంగా ఉంటాయి. 

ఇక్కడ ఈ కథలో కరుణకి కాకికి స్నేహం కుదరడం వల్ల, ఆమె పెట్టే ఆహారం వల్ల కాకికి ఆమె నుంచి ఎటువంటి హాని లేదన్న భరోసాతో ఉంది. 


ఒకరి భాష ఒకరికి తెలియకపోయినా వాటి కదలికల ద్వారా, శబ్దం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కరుణ. 


ఆహారం సేకరించలేని ముక్కు విరిగిన మగ కాకికి కూడా  అంతకు మునుపు జతకట్టిన ఆడకాకి ఆహారం సేకరించి పెట్టడం చూస్తే మంచాన పడిన భర్తకు  తెచ్చిపెట్టి పొట్ట నింపే, సేవ చేసే స్త్రీ కనిపించింది. 


కారణాలేవైనా జతగాడు దూరమైన కాకి తర్వాతి కాలంలో మరో మగ కాకితో జతకట్టడం చూసినప్పుడు మానవ సమాజం కూడా అంత స్వేచ్ఛగా జతగాళ్ల విషయంలో ఉంటే మహిళలు అనవసర బరువు మోయాల్సిన అవసరం ఉండదు కదా!


ప్రపంచంలో అన్నింటికన్నా తల్లి ప్రేమ గొప్పది అంటారు.  స్వచ్ఛమైందని చెప్తారు.  నిస్వార్ధమైందని, విశాలమైందని అంటారు. 

తన బిడ్డ ఎలా ఉన్నా, అందంగా ఉన్నా లేకపోయినా, రంగు ఉన్నా లేకపోయినా , లోపం ఉన్నా కన్నతల్లికి తన బిడ్డ అందంగా కనిపిస్తుంది.  ఆ తల్లి బిడ్డ పై చూపే ప్రేమ, ఆదరణ, సంరక్షణ కూడా అంతే అందంగా ఉంటుంది. 

అది మనిషైనా, పక్షి అయినా, జంతువైనా ఏ జీవి అయినా బిడ్డకు కష్టం రాకుండా కాపాడుకోవడానికి యత్నిస్తుంది తల్లి.


కాకి గూట్లో కళ్ళు తెరచిన కోకిల పిల్ల తొలిసారి గొంతు విప్పగానే గమనించిన కాకులు చేసిన గోల విన్న తల్లి కాకి  రివ్వున వచ్చి, తోడేళ్ళ గుంపు బారిన పడి విలవిల్లాడుతున్న జింకపిల్లలా ఉన్న కోకిల పిల్లను కాపాడింది.  బిక్క చచ్చిపోయిన కోకిల పిల్లను ముక్కుతో పరామర్శించి తన రెక్కలను గొడుగుగా కప్పి రక్షణ ఇస్తుంది. నీకు నేనున్నానన్న భరోసా నింపుతుంది.  

 

సొంత తల్లి ప్రేమకు నోచుకోని పిల్లలను కన్నబిడ్డ మాదిరిగా  ఆదరించిన కాకి ఔదార్యం చూసి ఆశ్చర్యపోతుంది కరుణ.  కాకి అంటే గౌరవం రెట్టింపు అవుతుంది. 


శ్రీకర్ మరణం అంచులో ఉన్నప్పుడు భార్య కడుపున పుట్టని బిడ్డలను ఆమెకు  చేరువ చేయాలని ప్రయత్నించినప్పుడు, అంత ఔదార్యం తనకు లేదని వారి బాధ్యత తీసుకోలేనని,  తల్లితండ్రి లేని ఆ బిడ్డలకు నీ ఆస్తిపాస్తులు ఏమిచ్చుకున్నా నాకు అభ్యంతరం లేదు,  నేను నా కొడుకును తప్ప మరెవ్వరినీ నా బిడ్డలుగా పెంచలేనని నిర్ద్వందంగా చెప్పింది కరుణ,

చుట్టూ ఉన్న పరిసరాల్ని, పరిమళాల్ని తనలో ఇముడ్చుకుంటూ అందులో ఇమిడి పోతూ ఉండే కరుణ కాకిని  గమనించడం మొదలు పెట్టాక కోకిల పిల్లకు తల్లి అయి కాపాడుకునే తల్లి సహజ ప్రేమకు ఫిదా అవడమే కాక తనలా ఎందుకు ఉండ లేకపోయిందని ప్రశ్నించుకున్న కథ "కోకిల తల్లి' . 

.

సృష్టిలో స్త్రీ , పురుషుడు ఇద్దరూ ఒకరికొకరు అవసరం. ఎవరి ప్రాముఖ్యత వారిదే.  పునరుత్పత్తి ప్రక్రియ అనివార్యం.  వివాహం ద్వారా ఒక  స్త్రీ ఒక పురుషుడు మధ్య బంధం ఏర్పడుతుంది. ఒకే గూట్లో నివాసం మొదలవుతుంది.  నిరంతర సంబంధం ఏర్పడుతుంది. కలిసి జీవించడంలో, కలిసి భావాలూ వినిమయం చేసుకోవడంలో, కలిసి బాధ్యతలు పంచుకోవడంలో, భావోద్వేగాలు తెలుసుకుంటూ మసలుకోవడం ద్వారా ఇద్దరి మధ్య స్నేహబంధం, భార్య భర్తల బంధం దృఢమవుతుంది.

కానీ, ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, తన లైంగికతకు ప్రాధాన్యం ఇచ్చి తన పురుషత్వానికి విలువనిచ్చి తనతో జీవితం పంచుకోవడానికి వచ్చిన స్త్రీ జీవితాన్ని అగాధంలోకి తోసేస్తుంటారు చాలామంది పురుషులు.  

నీతి, నైతికత, కట్టుబాట్లు వగైరా వగైరా ల భారం స్త్రీల  భుజస్కంధాలపై వేసి పైలా పచ్చిస్ లా తిరిగేస్తుంటారు  భారతీయ పురుషుడు.  

భారతీయ మహిళ తన అనుకునే భద్రపురుషుడి జీవితం కోసం పూజలు , నోములు , వ్రతాలతో కాలక్షేపం చేస్తుంది. తానొక గొప్ప కుటుంబాన్ని నిర్మించుకుంటున్నాని భ్రమల్లో బతుకుతూ ఉంటుంది.  అతని ప్రేమ తనకే సొంతం కావాలని తాపత్రయపడుతుంది.  అతని క్షేమమే తన క్షేమం అని తలుస్తుంది.  


కోకిల తల్లి లో  కరుణ భర్త శ్రీకర్ సగటు భారతీయ పురుషుడు. ఇంట్లో ఎంత కమ్మని తిండి ఉన్నప్పటికీ బయట రుచుల కోసం వెంపర్లాడుతుంటాడు.  మగవాడిగా అది తన హక్కు అని  భావిస్తాడు.  


ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలని అనిపిస్తున్నది.  ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే మగవాడెప్పటికీ తప్పుకాదట. 

ఆడవాళ్ళతో తిరిగిన కస్టమర్ ని ప్రాసిక్యూట్ చెయ్యకూడదట .. ఆహ్హాహ్హా ఏమి తీర్పు?! 

ఈ తీర్పులు ఏమి చెబుతున్నట్లు .. స్త్రిని కామ దృష్టితో చూడడం, ఆమెను లైంగికంగా వాడుకోవడం అతని తప్పుకాదు. కానీ అతనికి చేరువైన ఆమెది తప్పట!

స్త్రీ పురుష సంబంధాల్లో ఉన్న డొల్ల తనాన్ని పోగొట్టి సహజమైన , నిర్మలమైన స్నేహ సంబంధాల్ని ఏర్పరచి పెంపొందించాల్సిన స్థానంలో స్త్రీల స్థాయిని మరింత పలచన చేయడం,  దిగజార్చడం కదా..

ఎన్నో పోరాటాలతో ఉద్యమాలతో సాధించుకున్న చట్టాల స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ,  చైతన్యవంతం కావాల్సిన సమాజాన్ని అగాధంలోకి తోసే తీర్పు కదా..!

మగాడు జీవితాంతం తోడు నీడగా ఉంటానని బాస చేసిన భార్యతో కాకుండా ఇతర స్త్రీలతో సంబంధాలు ఏర్పరచుకోవడం తప్పు కాదని, అది తన మగతనానికి చిహ్నమని విర్రవీగే మగవాళ్ళకి కొమ్ములిచ్చి మరింత భద్ర పురుషుడిగా మార్చిన తీర్పు కదా... 


కోకిల తల్లి కథలో కరుణ భర్త శ్రీకర్ కూడా అటువంటి విలాసపురుషుడే.  తన చిత్త ప్రవృత్తి నేరం కాదని భావించే రకం.  పురుషాహంకారం నరనరాల్లో జీర్ణించుకున్న అతను కట్టుకున్న భార్య, కన్నకొడుకు కంటే ఇతర సంబంధాల్లోకి వెళ్లి వాళ్ళకే సమయం , సొమ్ము ఖర్చు చేసే లాలసుడు.  అలాంటి వాళ్లకు కోర్టులు చట్టాలు శిక్షలు వేయరేమో కానీ ఆత్మగౌరవంతో బతికే స్త్రీ అతని పోకడలను క్షమించదు.  


సహజ సునిశిత మనస్కురాలైన కరుణని అతని ప్రవర్తన ఆందోళనకు, ఆవేదనకు గురి చేసింది. 

నీ లాగే నేను ప్రవర్తిస్తే అని ప్రశ్నిస్తుంది.  బుసలు కొట్టే అతను ఆ ఆలోచన భరించలేడు. అదే గనుక జరిగితే ఆమెను ముక్కలు ముక్కలుగా నరికేస్తా అనే అహంభావి. సగటు పురుషుడు. 

అటువంటి వ్యక్తి భార్యగా తన స్థానం నిలబెట్టుకోవడం కోసం, భద్రపరచుకోవడం, సర్దుబాటు చేసుకోవడం కోసం నేలబారుగా ప్రవర్తించి తన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టలేని కరుణ, భార్యాభర్తల బంధాన్ని లాభనష్టాల కాటాలో చూడని కరుణ లోకం దృష్టిలో మొండిది. లౌక్యం తెలియనిది. మొగుడిని కొంగున కట్టుకోవడం తెలియనిది.    


స్త్రీ పురుష సంబంధాల్లో ఉన్న అసమానతలు, డొల్ల తనాన్ని , ద్వంద నీతిని వేలెత్తి చూపే కథ కోకిల తల్లి. 

పిట్టతో, చెట్టుతో , పువ్వుతో మాట్లాడుకుంటూ వాటిలా విశాలంగా వికసించడానికి ప్రయత్నించే కరుణ  కథ కోకిల తల్లి.  


భక్తి పేరుతొ పూజల పేరుతో ఎదుటివారు పెంచుకున్న మొక్కల పూలను తస్కరించడం, చెప్పా పెట్టకుండా కోసేయ్యడం అదేమని అడిగితే అయ్యో దేవుడి పూలు ఆమాత్రం కోసుకోకూడదా అంటూ ఎదురుదాడి చేస్తుంటారు. కస్టపడి, ఇష్టపడి మొక్కలు పెంచుకున్నవారి మనసు ఎంత బాధపడుతుందో అర్ధం చేసుకోరు.  దేవుడి పేరుమీద నిర్ధాక్షిణ్యంగా  మొక్కనుండి వేరు చేసేసి, తాము పుణ్యం పొందాలని తాపత్రయపడిపోతుంటారు కొందరు. 

కానీ ఈ కథలో కరుణ పక్కింటి తోటలో పూలను యిష్టంగా చూసి చూపులతోనే వాటిని తుంపి కనురెప్పలపై వాటి భారాన్ని నెమ్మదిగా మోస్తూ పదిలంగా తెచ్చి ఆదిదంపతుల పాఠం ముందు ఉంచుతుంది.  

పూవు తుంచకుండా, హాని కలిగించకుండా మనసుతోనే అర్పణ చేయడం రచయిత్రి భావుకత, గొప్ప భావన. 


వివాహేతర బంధంలో పురుషుడికి చేరువైన స్త్రీని అల్పంగా చూసిన హైకోర్టు లాగే కొత్త కొత్త అందాలు వెతుక్కునే తన భర్త శ్రీకర్ తో బంధం కొనసాగించిన స్త్రీని నెరజాణ అనడం పంటికింద రాయిలా అనిపించింది. 


వి. శాంతి ప్రబోధ   





3, అక్టోబర్ 2022, సోమవారం

చిట్టి గుండె - మరువలేని కథ

ఈస్తటిక్ సెన్స్  కథాసంపుటిలో “చిట్టి గుండె” కథ “విశాలాక్షి మాస పత్రిక” జూన్ 2022 లో ప్రచురితమైంది. 

ఆ కథ పై MR అరుణకుమారి గారి వ్యాఖ్యానం పరిచయం చేస్తున్నాను. ధన్యవాదాలు అరుణకుమారి గారూ.. 🙏

14 కథలు 14 మంది సహరచయితల వ్యాఖ్యానం. 

#ఈస్తటిక్_సెన్స్ #వనజతాతినేని

************

 "చిట్టి గుండె"   మరువలేని కథలాగే  నా గట్టి గుండె కూడా మరవలేని ఇదే కథ నేను పనిచేసిన ఒక ఊరిలో జరిగింది.  ఏళ్లు గడిచినా మరపు మడతల్లో నుండి అప్పుడప్పుడు గుల్లలో నుండి బయటకు వచ్చే నత్తలా ఆ జ్ఞాపకం , అబ్బాయి రూపం.. నన్ను కాసేపు కలవరపెడుతుంది.         

వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో ఒప్పుకోలేదు అని అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మాయి మరో పెళ్లి చేసుకుని భర్త ,పిల్లలతో బాగానే ఉంది. నాకు బోల్డంత సందేహం !అమ్మాయి కూడా ప్రేమించింది కదా!  అబ్బాయి ప్రాణం తీసుకునేంత ప్రేమ గాఢత అమ్మాయి ప్రేమలో లేదా? ఉంటే తనూ చనిపోవాలి కదా! ( పాపం శమించుగాక!  ఈ మాట "ప్రేమ"  పైన  ప్రేమే! అబ్బాయి ప్రాణత్యాగం పట్ల బాధ, సానుభూతే)  ప్రేమ ఎంత మధురమో  ప్రియురాలు అంత కఠినం ! పిరికి వాళ్లకు ప్రేమించే అర్హత లేదు అనుకుని గమ్మునుండి పోయాను.       

నా వరకు నేను అన్నింటికన్నా "జీవిత" మే ముఖ్యమైనది ..విలువైనది అనుకుంటాను. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు తీసే అధికారం ఎవరికీ లేదు.      ప్రేమకు ఎన్ని నిర్వచనాలు ఉన్నా సరే ప్రేమంటే రెండు మనసుల మధ్య ఏర్పడే అనుబంధ వారధి! ఆ వారధి అనురాగం, ఆత్మీయత, అవగాహనలతో ఏర్పడవచ్చు. వయసు, వ్యామోహం, ఆకర్షణలతో కూడా ఏర్పడవచ్చు. వన్ సైడ్ ..టూ సైడ్ కూడా ఉండవచ్చు.  అయితే  ఏ ప్రేమ వారధి బలంగా ఉంటుందో మనకు తెలుసు. ఆ బలమైన వారిధి కూడా పరిస్థితుల ప్రభావం వల్ల వివాహ బంధబాట కాలేకపోవచ్చు.ఆమాత్రానికే ప్రాణంతీయడం ,తీసుకోవడం చెయ్యకూడదు.      

అన్ని ప్రేమ పెళ్లిళ్లు సక్సెస్ కానట్లే పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కూడా విచ్చిన్నం అవుతున్నాయి. లోటుపాట్లు వివాహబంధంలో లేదు. ఆ బంధం లో ఉన్న వ్యక్తుల సర్దుబాటు ,అవగాహనా, అన్యోన్యత లో ఉన్నాయి. అదే ప్రేమంటే ! ఒక వ్యక్తి లోని ప్లస్ పాయింట్ లతోపాటు మైనస్ పాయింట్ లనూ అర్థం చేసుకోవడమే" ప్రేమ"!  ఎందుకంటే ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా సంపూర్ణుడు కాదు. కాలేరు కూడా!    పసి వయసులో మన కుటుంబం, సభ్యులు, పరిసరాలు, బంధుమిత్రులు, సమాజం ,బడి ,గురువులు ...ఎవరైనా ..ఏ సంఘటన అయినా  సరే  మన మనసులను తాకేది గాఢమైన ముద్ర వేస్తుంది అనడంలో లో సందేహం లేదు. అది మనలో ఒక బలమైన నమ్మకాన్ని కలిగిస్తుంది. దానిలో నుండి బయటకు రావడం చాలా కష్టం .అలా రావడానికి మానసిక పరిపక్వత ,మేధో వికాసం చాలా అవసరం. అప్పుడు మన ద్వేషాలు ..ప్రేమగా, సానుభూతిగా, సహానుభూతిగా... రూపాంతరం చెంది అర్థం చేసుకునే దిశగా మార్పు చెందుతాయి.     

ఈ కథలో పద్మ లో కలిగిన మార్పు అభినందనీయం. వివేకం, విచక్షణ ..కొత్త పరిష్కార మార్గం అన్వేషిస్తుంది . అది మార్గనిర్దేశం అవుతుంది.  ఎందుకంటే ఒక కథ చదివి పాఠకులు మారిపోతారా? అది కథే కదా! అనుకుంటే పొరపాటు .ఒక కథ సజీవచిత్రణతో  సాగితే అది తప్పకుండా మన మనసును స్పర్శిస్తుంది. ఏ కథలో నైతే పాఠకులు తమను తాము చూసుకుంటారో.. అదే మంచి కథ .అలాంటి కథలో పరిష్కారాలు ఆశావహ దృక్పథంతో, ధైర్యాన్ని,  ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలా ఉండాలి.  " చావు"  ఏ సమస్యకూ పరిష్కారం కాదు అని బలంగా చెప్పాలి.     మమతల పొదరిల్లు.. అనుబంధాల ఆనందాలలో..  బతుకునావ  లాహిరి లాహిరి లాహిరే! బాధల సుడిగుండంలో ఏ చిట్టి గుండె చిక్కువడదు.


         -  యం.ఆర్. అరుణకుమారి,  చిత్తూరు.

చిట్టిగుండె  కథ ఇక్కడ లింక్ లో చదవవచ్చు. 




26, సెప్టెంబర్ 2022, సోమవారం

ఆధిపత్య అహంకార పీడ జాడలను విడిచిన ‘కుబుసం’

“ కుబుసం” కథ  ఈస్తటిక్ సెన్స్ కథాసంపుటిలో  ఉన్న కథ. వెబ్ పత్రికలో ప్రచురింపబడిన కథ. అంజని యలమంచిలి ఈ కథకు వ్యాఖ్యానం రాసారు. చదవండీ.. వారి వ్యాఖ్యానం. 



సూర్యుడికి గ్రహణం పడుతుంది. 


చంద్రుడికి గ్రహణం పడుతుంది. 


మహిళకూ గ్రహణం  పడుతుంది. 


సూర్యచంద్రులకు పట్టిన గ్రహణం కొద్ది నిమిషాల్లో వదిలేస్తుంది. 


కానీ మహిళలకు పట్టిన గ్రహణం... 


అనాదిగా తరతరాలకు పట్టి పీడిస్తున్నది. 


మహళలకు పట్టిన ఆ గ్రహణం తాలూకు అనేక రూపాలే ఈ ‘కుబుసం’ కథ. 


సాంప్రదాయాల సంకెళ్లను ఛేదించకుండా స్త్రీ జాతికి స్వేచ్ఛా సమానత్వాలు లభించవని చాటిచెప్పే  కథ ఈ కుబుసం.  


ప్రేమ్ చంద్ తన ‘కర్మభూమి’ నవలలో  కార్యోన్ముఖులు, సాహసులు, త్యాగశీలురైన స్త్రీ పాత్రల్ని సృష్టించినట్లుగానే... ఈ కథలో రచయిత్రి వనజ తాతినేని  సృష్టించిన రామేశ్వరి పాత్ర కూడా అంతటి ఔన్నత్యం వున్న వ్యక్తిత్వం గలది.  


అందుకే అంటాడు చలం... ‘స్త్రీకి కూడా శరీరం వుంది. దానికి వ్యాయామం యివ్వాలి.ఆమెకీ మెదడు వుంది. దానికి విజ్ఞానం యివ్వాలి. ఆమెకు హృదయం వుంది.  దానికి అనుభవం యివ్వాలి అని


స్త్రీల శరీరంపైన, ఆలోచనలపైన, హృదయంపైన అడుగడుగునా అనాధిగా ఈ సమాజం పెడుతున్న అనేక ఆంక్షల వొత్తిడిని కుబుసంలా విడువగల్గితేనే... స్త్రీ కుబుసం విడిచిన నాగులా చైతన్యశీలిగా మారుతుంది. 


గతంలో ఒక తరం స్త్రీలందరూ బడి మెట్లు ఎక్కేందుకు కుటుంబాన్ని వొప్పించడానికి ఎంతో నొప్పిని భరించారు. తర్వాత తరం వారు ఉద్యోగం చేయడానికి కుటుంబంతో యుద్దాలే చేశారు. తర్వాత తరం ఆస్తి హక్కు పొందడానికి సమాన హక్కులు సాధించడానికి లింగ వివక్ష లేని కుటుంబం కోసం సమాజం కోసం కృషి చేస్తూనేవున్నారు. 


కుబుసం కథలో రామేశ్వరి కూడా అదే చేసింది. పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఆడ పిల్లలకు చదువు అందని ద్రాక్ష. తనకు లభించని  చదువుకునే స్వేచ్ఛను ఆస్థి హక్కును నచ్చిన వ్యక్తితో కోరుకున్న వివాహాన్ని కూతురికి లభించేటట్లు చేయడానికి శతవిధాలా కృషిచేసింది. కుటుంబ సహకారం లభించకపోయినా ఆర్థిక స్వావలంబన దిశలో నడక సాగిస్తూ పురుషాహంకార పితృసామ్య భావజాలాన్ని అడుగడుగునా ఎదిరిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచింది. రామేశ్వరి ఒక తరానికి ప్రతినిధి. కచ్చితంగా చెప్పాలంటే రచయిత కాలానికి చెందిన స్త్రీ ప్రతినిధి. 


ఎన్ని విప్లవాలు నడిచినా పర్వాలేదనే ధోరణిలో కళ్లు మూసుకొని, 

తలవొంచుకొని తప్పుకెళ్లే ఈ సమాజంలో  కుటుంబ వ్యవస్థకు  ప్రమాదం జరుగుతుందంటే కూలిపోతుందంటే మాత్రం... దాన్ని ఆధారం చేసుకుని అధికారం చెలాయిస్తున్న పురుషాధిక్య సమాజం విపరీతమైన కలవరపాటుకు గురవుతుంది.  


అలాంటి పురుషాధిక్యతకు నమూనా... అతిపెద్ద ఉదాహరణ... ఈ కథలోని వీరయ్య పాత్ర.  


సాంప్రదాయం పేరుతోనో, కట్టుబాట్ల పేరుతోనో స్త్రీలపై జరిగే అణచివేత, 

పురుషాధిక్య పెత్తందారీతనాన్ని జయించి, తన కుటుంబాన్ని కుటుంబాన్ని ప్రగతిపథం వైపు నడిపించేందుకు... కుటుంబంలోని పురుషాధిక్యతను ఎదిరించి... భర్తను, పిల్లలను ఒక ఉన్నతమైన మార్గం వైపు మళ్లించగలిగిన చైతన్యం, ఔన్నత్యం కలిగిన పాత్ర రామేశ్వరి. 


గ్రహణం విడిచిన సూర్యుడు జగజగ్గీయమానంగా, గ్రహణం విడిచిన చంద్రుడు ఎంతో ప్రశాంతతో కనిపించినట్లుగా... రామేశ్వరి కూడా చుట్టూ వున్న అనేక సమస్యలను ఓపికతో, చాకచక్యంగా పరిష్కరించుకొన్న తీరును నాగును వీడిన కుబుసంతో పోల్చడం.. రచయిత్రి యొక్క అక్షర విన్యాసానికి,  రచనా కౌశలానికి నిదర్శనమని చెప్పొచ్చు.

 

వాస్తవానికి ఈ కథాంశం సాధారణమైనదే. సమాజంలో నిత్యం మన కళ్ల ముందు కనిపించే సంఘటనే. కానీ, ఈ కథలోని శైలి, శిల్పం అసాధారణం. 


రామేశ్వరి పాత్రను నడిపిన తీరు వల్లే  ఈ కథకు ఇంతటి ప్రాధాన్యత సమకూరింది.  


ఒక సందర్భంలో ‘రామేశ్వరి అలా ఎక్కువ కాలం మౌనంగా వుండలేకపోయింది. ఉత్సాహంగా కదిలే కాళ్లను, చేతులను స్తబ్దత నుండి విముక్తి కల్గించి పనికి మళ్ళించింది’ అంటూ రామేశ్వరి పాత్ర నైజాన్ని, ఆమె స్వేచ్ఛా ప్రియత్వాన్ని, ఆమె చైతన్యశీలతను సుస్పష్టంగా చెబుతారు రచయిత్రి.  


మరో సందర్భంలో తన పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బుతో కొన్న భూమిని తన పేరున ఎందుకు పెట్టలేదని భర్తని ప్రశ్నిస్తుంది. 


‘మా నాయన ముందు ఈ మాట అనేవు. కత్తి తీసుకుని నరుకుతాడు’ 


అంటాడు రామేశ్వరి భర్త సిద్ధప్ప.  


ఈ ఒక్క వాక్యం సీమలో ఒక సాధారణ రైతు కుటుంబంలో వుండే ఆధిపత్యం వీరయ్యలో కనిపిస్తే... తండ్రి ముందు కనీసం మాట్లాడలేని ఒక మామూలు వ్యక్తిగా సిద్ధప్ప కనిపిస్తాడు. 


అంతేకాదు... సిద్ధప్ప మాటకు రామేశ్వరి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది.  


అంత చేతకాని వాళ్లు ఎవరూ లేరులే ఇక్కడ’ అంటుంది.  


అలాగే  ఇద్దరు బిడ్డలు చాలని,  పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటానంటుంది రామేశ్వరి.  


ఇంకో రెండుతూర్తు చూద్దాం. ఆపు అన్నాడు వీరయ్య.


ఆ మాటలేవీ లెక్క చేయకుండా ఆపరేషన్ చేయించుకుంటుంది రామేశ్వరి. 


అప్పుడు అందరి ముందు భార్య చెంపపై కొట్టి తన అధికారం ప్రదర్శిస్తాడు సిద్ధప్ప.   


లోను డబ్బుతో ఒక పాడి గొడ్డును కొంటుంది. 


సొంతగా నూనె గానుగ పెట్టాలనుకుంటుంది.  


మగ పెత్తనం సాగే ఆ ఇంట్లో రామేశ్వరిని అడుగడుగునా అణచివేయాలని చూస్తారు. పిల్లలకు కాన్వెంట్ చదువులు చెప్పించాలనుకున్నప్పుడు కూడా ఇంట్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.ఇలాంటి సందర్భంలో ‘మా వాటా ఎంతొస్తే అంత మాకు పంచి ఇవ్వండి’ అంటూ వీరయ్యను నిలదీస్తుంది రామేశ్వరి. 


తనపై చెయ్యెత్తిన మామను ఎదిరిస్తుంది.  


కొడుకుని, మనవడిని ఇంట్లోవుంచి, కోడలిని, మనమరాలిని వీధిలోకి నెట్టేస్తాడు వీరయ్య.అలాంటి సందర్భంలోనూ ధైర్యం కోల్పోకుండా... 


ఎదురింటి వారి ఆశ్రయం తీసుకుంటుంది. 


పొలం పనికి, కోళ్ల ఫారంలో పనికి వెళుతూ ధైర్యంగా బతుకుతుంది. 


ప్రభుత్వం ఇచ్చే సాయంతో ఇల్లు కట్టించుకోవాలని అనుకున్నప్పుడు సొంత స్థలం కోసం...  ఊరి పెద్దల దగ్గర పంచాయితీ పెట్టించి మరీ పదిసెంట్ల భూమిని రాయించుకుంటుంది. 


భర్తను, కొడుకుని కూడా ఇంటికి రప్పించుకుంటుంది.  


పిల్లల చదువు విషయంలోనూ  ఆడపిల్లకు అంత చదువెందుకని అడ్డుతగులుతాడు సిద్ధప్ప. 


ఆ సందెవేళ.. భర్తకు వినబడేలా 


‘తాను సృష్టించిన స్త్రీ తన తలనెక్కింది


తాను సృష్టించిన స్త్రీ తన ఒడికెక్కింది


తాను సృష్టించిన స్త్రీ బ్రహ్మ నాలుకెక్కింది


తాను సృష్టించిన స్త్రీ నారాయణుని ఎడదకెక్కింది


అందువల్ల... స్త్రీ స్త్రీకాదు, స్త్రీ అబల కాదు... స్త్రీ రాక్షసి కాదు


స్త్రీ ప్రత్యక్ష కపిల సిద్ధ మల్లికార్జునుడే కనవయ్యా..’ 


అంటూ వచనం చదువుతుంది. అది అర్థం చేసుకున్న సిద్ధప్ప.. ఆ తర్వాత ఎప్పుడూ బిడ్డల మధ్య ఆడ మగ భేదం చూడలేదు.


ఎదురైన అన్ని ప్రతికూలతలను... తనకు అనుకూలంగా మార్చుకుంటూ... కొడుకును ఇంటర్ లో చేర్పిస్తుంది. 


కూతురు మల్లి బిటెక్ పూర్తి చేస్తుంది.  


తల్లి మాదిరిగానే ఆత్మవిశ్వాసంతో ఎదుగుతుంది. 


తల్లి మాటలను నిత్యం  మననం చేసుకుంటుంది.  ‘


ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడి సంపాదించుకున్న రోజే ప్రేమ పెళ్లి ఆలోచన చెయ్యాలి. ఆడమగ పిల్లలు కలిసి చదువుకునేచోట అనేక ఆకర్షణలు వుంటాయి. అలాంటి సాలెగూడులో పడకుండా బాగా చదువుకో. తర్వాత నీకిష్టమైన వాడిని ఎంచుకో. అంతేకాని తప్పుదారి పట్టకు’ అని మల్లికి చెప్పించడం ద్వారా రామేశ్వరి పాత్ర మరో మెట్టు ఎక్కుతుంది. 


మల్లి ప్రేమ విషయంలోనూ  అండగా నిలుస్తుంది.  


వీరయ్యదగ్గర పంచాయితీ నడుస్తుంది.  


వీరయ్య ఎలా ఒప్పుకుంటాడో తెలిసిన రామేశ్వరి... ఒక అబద్ధం చెప్పి, మల్లి పెళ్లి తాను ప్రేమించిన వాడితోనే చేసేందుకు మార్గం సుగమం చేస్తుంది.  


ఆ విషయంలో మల్లిని క్షమాపణ అడుగడం ద్వారా తన ఔన్నత్యాన్ని మరోసారి చాటుకుంటుంది రామేశ్వరి. 

 

అంతేకాదు... 


పెళ్లికి ముందు రోజే.. నాలుగు సెంట్ల స్థలాన్ని కూతురికి సర్వహక్కులతో రాసిస్తుంది. 


తల్లిదండ్రులకు బిడ్డలందరూ సమానమే. 


మన అబ్బాయికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పు అని భర్తకు చెబుతుంది. కులాంతర వివాహం చేసుకుంటున్నందుకు ఆస్తిని చెల్లికి రాసినందుకు పెళ్లికి రానని కొడుకు చెప్పినట్లు సిద్ధయ్య చెబుతాడు.

 

అప్పుడు రామేశ్వరితో చెప్పించిన మాట రచయిత్రి పోరాట పటిమ కి నిదర్శనం. 


‘నేను జీవితకాలం యుద్ధాలు చేస్తూనే వుండటానికి ఓపిక తెచ్చుకుంటాను తప్పేదేముంది’ అంటుంది రామేశ్వరి.  


కథ ముగింపు కూడా అద్భుతంగా మలిచారు వనజ తాతినేని.


 రామేశ్వరి అత్తారింట అడుగుపెట్టిన నాటినుంచి ఆమె ఎదుర్కొన్న ప్రతి సంఘటనలోనూ సిద్ధప్పకు పాము కుబుసం కనిపిస్తుండేది.


 సిద్ధప్ప దాన్ని చూసి భయపడేవాడు.  


‘ఇంట్లోకి వెళ్లి భార్యని నిద్ర లేపబోయి ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె ముఖం చూసి వద్దులే అనుకుని బయటకు వచ్చాడు. 


గడ్డి దూయడానికి వామి దగ్గరకు వెళ్లాడు. 


భయం భయంగా గడ్డివాము మీద చెయ్యేసి గడ్డిని దూసాడు


 రెండు వాట్లు దూసాక గడ్డితో పాటు మధ్యలోకి తెగని అయిదున్నర అడుగుల కుబుసం చేతిలోకి వచ్చింది.   


కుడికాలి దగ్గర జరజర మని శబ్దం. కదలకుండా ఊపిరి బిగబట్టి నిలుచున్నాడు. 


అప్పుడే కుబుసం విడిచిన గోధుమవన్నె తాచు నిగనిగలాడుతూ... బిరబిర సాగిపోయింది. 


ఆ మెరుపును ఎక్కడ చూసినట్లనిపించింది. 


గుర్తు చేసుకోడానికి ఒక్క క్షణం కళ్లు మూసుకున్నాడు. 


రామేశ్వరి కనుల  మెరుపు అది.  


ఆమె ఆలోచనలు చెల్లుబాటు అయిన ప్రతిసారీ ఆమె కళ్లలో వెలిగే మెరుపు అది’.  


ఇక్కడే రచయిత్రి యొక్క ఆలోచన, శిల్పం లోని వైవిధ్యం పతాకస్థాయికి చేరుకుంటుంది. కథ ఎత్తుగడ ముగింపు  కూడా  రచయిత నైపుణ్యం కనబడింది.కథకు శీర్షిక “కుబుసం” సరిగ్గా సరిపోయింది. 


ఈ కథలోని రామేశ్వరి... అణచివేతను ఎదుర్కొనే మహిళాలోకానికి ప్రతినిధి.అందరికీ  రామేశ్వరి ఎదుర్కొన్నటువంటి సమస్యలే వుండకపోవచ్చు. కానీ... సమస్య ఏదైనా, అణచివేత ఏ రూపంలో వున్నా దాన్ని ఎదుర్కోవాలి. తనకు అనుకూలంగా మలచుకోవాలి.  కుటుంబానికి, సమాజానికి వెలుగు దివ్వెగా మారాలి.  రామేశ్వరి ఆలోచనలు ఆత్మ విశ్వాసంతో కూడిన ఆచరణ కుబుసం విడిచిన పాముకు ప్రతీకగా కథా సంవిధానం వుండటం వల్ల మంచి కథను చదివిన అనుభూతితో పాటు ఇంకా రచయిత చెప్పని కథను ఖాళీలను పూరించుకుంటూ ఈ కథ మిగిల్చిన ఆలోచనలు పాఠకుడిని వెంటాడతాయి.


రామేశ్వరిలా ..కుబుసం విడిచిన తాచు నిగనిగలాడుతూ... బిరబిర సాగిపోయినట్లు... ఈ వ్యవస్థలో ఎదురయ్యే 

ప్రతిఘటనలు తొక్కుకుంటూ స్త్రీ బిరబిర సాగిపోవాలి.  అప్పుడే గురజాడ వారు అన్నట్లు... ‘ఆధునిక స్త్రీ  చరిత్రను పునర్లిఖిస్తుంది’. 


మంచి కథను రాసిన వనజ గారిని అభినందిస్తూ.. “ఈస్తటిక్ సెన్స్” కథాసంపుటికి  శుభాకాంక్షలు తెలుపుతూ..



- అంజని యలమంచిలి