31, డిసెంబర్ 2017, ఆదివారం

ఆశలెప్పుడూ..

ఆశలెప్పుడూ లేతగా ఉండాలి.ముదిరితే పండి రాలిపోతాయి.

కాబట్టి .. చిన్న చిన్న ఆశలతో మారిన కేలండర్ లోకి మనమూ మారిపోదాం.

అందరూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు చెప్పుకుంటుంటే ..

అప్రయత్నంగా దాశరధి గారి గేయం గుర్తుకువచ్చింది.


"అన్నార్తులు అనాధులుండని ఆ నవయుగమదెంత దూరం 

కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో

పసిపాపల నిదుర కనులలో  మురిసిన భవితవ్యం ఎంతో

గాయపడిన కవి గుండెలల  రాయబడని కావ్యాలెన్నో..."

మనచుట్టూ ఉన్న సమాజం కోసం ఇలాంటి పెద్ద కలలు కనడం అవసరం కూడా అనిపించిది.

అంతలోనే ..మనసు ఇలా వెక్కిరించింది .

ఓసి ..పిచ్చి మొహమా ! ఇప్పుడేగా ఆశలు లేతగా ఉండాలి అన్నావ్ !

కలలు కూడా రాత్రి పూటే కనాలి.

నువ్వు పగటి కలలు కంటున్నావ్  సుమా ..అని హెచ్చరించింది

 ప్చ్ ..ఆశలో ,కలలో, భ్రమలో ..

క్షణాలని సూర్య చంద్రుల సాక్షిగా ప్రసవిస్తున్న కాలమా ..


ఆగదులే ఈ అడుగు - ఎందుకనో నీ గర్భంలో దాచుకున్న చరిత్ర నడుగు ..

అని అంటూ ..  ప్రవాహంలా సాగిపోవడమే మనపని.

మిత్రులందరికీ,బంధువులందరికీ  నూతన సంవత్సర శుభాకాంక్షలు.

(ప్రత్యేకించి అందరికి చెప్పలేను కాబట్టి  ఈ పోస్ట్)






22, డిసెంబర్ 2017, శుక్రవారం

ఎలా చెపుతున్నాం !?

ఆది అనంత శబ్ద్ ఓం హై.. అని హిందూ ధర్మం చెపుతుంది అంటే నేను విన్నాను,  గుడ్డిగా నేను నమ్ముతాను , అలా అని నా విశ్వాసాన్ని ఇతరులెవరైనా అంగీకరించకపోయినా మౌనంగా ఊరుకుంటాను తప్ప వివాదానికి దిగను. 

ఎందుకంటే వేదాలు శాస్త్రాలు పురాణ ఇతిహాసాలు  అన్నీ నేను చదవలేదు వాటిని అర్ధం చేసుకోగల జ్ఞానం నా దగ్గర లేదు. ఆది అనంత శబ్దం ఓం  అని నేను అనుకోవడం పట్ల ఇతరులకి ఏమీ హాని లేదు కదా ! :) 

ప్రతి జాతికి,మతానికి. దేశానికి .ఇంకా చెప్పాలంటే ప్రతి కుటుంబానికీ తమవైన ఒక సంప్రదాయం ఉంటుంది . ఆ సంప్రదాయం ప్రకారమే నడవాలనుకుంటారు. ఏ దేశంలో ఉన్నా తమదైన సంప్రదాయాన్ని వొదులుకోవడం కష్టం .  కాలక్రమేణా అనేక  జాతులు రీతులు .సంప్రదాయాలు కలిసిపోయి కొత్త సంప్రదాయాలు ఏర్పడతాయి. మళ్ళీ అదొక సంప్రదాయంగా మారుతుంది. అనేక తరాల తర్వాత  నవ్యరీతులు తో జీవనం గడుపుతున్న వారిని ..అల్లదిగో ఆ సంస్కృతికి ఆ స్మృతికి వారసులు మీరు. మిమ్మల్ని ద్వేషించడమే మా పని. ఇంకా చెప్పాలంటే ద్వేషించడమే మా హక్కు అనే కొందరిని చూస్తూ ఉంటాం  వాళ్ళ బారిన పడకుండా మౌనంగా మన మార్గాన మనం నడుచుకుంటూ వెళ్ళడమే . ఇతరులకి హాని చేయకుండా వాళ్ళ మనసులని కష్ట పెట్టకుండా .. చదువు సంస్కారం అంటే ఏమిటో , సాంప్రదాయం అంటే  ఏమిటో తెలుసుకుని చైతన్యంగా,వివేకంగా నడవడమే ! మతం కన్నా దేశభక్తి కన్నా మానవత్వం మిన్న అని నేను ఒప్పుకుంటాను.  అలాగే పౌరులకి  దేశభక్తీ తో మెలగండి అని ఎవరూ చెప్పనవసరం లేదు. దేశ ద్రోహానికి పాల్పడకండి అని చెప్పడం సబబు. ఉత్తమ ఫలితాన్ని ఆశించాలనుకున్నప్పుడూ ఎలా చెపుతున్నాం అనేది కూడా చూసుకోవాలి అని నా అభిప్రాయం.  




చిన్నప్పుడు నుండి నేను రేడియోలో విన్న దేశభక్తి గీతం ఇదిగోండి ..మీరూ వినండి . "జయ భారతి -వందే భారతి"

19, డిసెంబర్ 2017, మంగళవారం

జపాకుసుమాల జావళి

మా వరండా తోటలో విరబూసిన .. మందారాలతో ..ఒక చిత్రాన్ని రూపొందించాను . 
చూడండి  మరి ..
ఈ చిత్రంలో వినిపించిన సంగీతం ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారంచేసే "క్రాంతిరేఖలు " కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ అని గమనించమనవి.
 ధన్యవాదములతో ..

వీడియోని చూడండి ఈ లింక్ లో .. 



ప్రశ్న ఒక్కటేగా !

ప్రశ్న ఒక్కటేగా !

సమాధానాలు పై వన్నీ ఎందుకయ్యాయి అని ఆశ్చర్యపోవడం

ఇదీ చిన్న విషయమేగా అని కొట్టిపారేయలేని నీ స్థితిని

మరొకమారు గుర్తుచేస్తున్నా .. మిత్రమా !

**********

ఏం చేస్తున్నావింట్లో ఒంటరిగా

కాస్తలా బయటకి రావచ్చుగా అని నీ ప్రశ్న

గోడలతో మాట్లాడుతున్నా,బయటకొచ్చి చేసేది అదేగా అంటాను

*******

నలుగురిలో కలవకుండా ఉండటానికి యేదో ఒక వొంక వెతుక్కుంటాను

వ్యక్తిత్వాన్ని చంపుకుని నటనల ముసుగేసుకుని పొగడటం

పొగిడించుకోవడం అనివార్యంగా మారకుండా..

**********

గుర్తింపు పేరు ప్రఖ్యాతులు జలతారు పరదాల్లాంటివని

చీకట్లో తప్ప తమ జిలుగులని విరజిమ్మ లేవని అనుభవమయ్యాక

ఆర్టిఫిషియల్ గా(అసహజంగా ) విచ్చుకుంటున్న మొగ్గల మధ్య

పరిమళించి నలుగురి కంటాపడనీ అడవిపూల వునికి ఎందుకని..

**************

సరిహద్దులకావల జరిగే సభల్లో సన్మానాలకై

వరుసలో వేచి ఉన్న ప్రయాణికుడి పరాభవం నాకెందుకు గానీ

పార్కులో పిల్లల మధ్య పద్యాన్ని నిలబెట్టి

సామూహిక గానంలో గొంతుకలుపుతుంటాను.

********************

కవితో కథో .. అక్షరాల సీతాకోక చిలకలై విహరించాల్సింది

పని ప్రదేశాలలోనో ,పాఠశాలల వనాల్లోనో కానీ

రాజకీయ వేదికలపై కాదనీ .

(ప్ర తె మ స లో చోటు దొరకలేదని బాధపడే వారి కోసం)


18, డిసెంబర్ 2017, సోమవారం

అడవి పూవందం

ఈ అడవి పూవందం చూడండీ ! 
అచ్చు మన గోగు పువ్వు లా గా ఉంది కానీ గోగు పువ్వు మాత్రం కాదు . బ్రెజిల్ లో  బొటానిక్ గార్డెన్లో ఉంది . అలాగే అక్కడక్కడా ఆఫ్రికా అడవుల్లో కనబడుతుందని చదివాను . గూగుల్ సెర్చింగ్ లో ఈ అందం ఆకర్షించి వివరాల కోసం ప్రయత్నిస్తే చాలా కష్టం మీద వివరాలు దొరికాయి. ఆ వివరాలు చిత్రం క్రింద పొందుపరిచాను. .. చూడండి . 


Turnera subulata Sm.
Common name
English: White buttercup
Classification
Kingdom: Plantae (2505)
  Phylum: Magnoliophyta (2404)
    Class: Magnoliopsida (2036)
      Order: Malpighiales (93)
        Family: Passifloraceae (10(family description)
          Genus: Turnera (3)
           Epithet: subulata Sm. (3)

subulata => awl-shaped
Characteristics
Climate: tropical
Habit: herb
Flower colour: yellow

Flower: Botanical Garden, Brasilia, DF, Brazil; 3/2012 © (కాపీ రైట్ ఉన్న చిత్రం ఇది ) 

Pinterest సౌజన్యంతో .. ఈ చిత్రం. 



9, డిసెంబర్ 2017, శనివారం

ఏమడిగాను నిన్ను ?


చూడు, నీ కోసం ఏమి తెచ్చానో..
మనసంత స్వచ్చమైన సుకుమారమైన పువ్వులని
గిలిగింతలు పెట్టే సంభాషణా చాతుర్యాన్ని
గండు కోయిల రాగాలని అడవిపూల సుగంధాన్ని
వేయి వేణువుల నాట్యాన్ని
గతజన్మలోని జ్ఞాపకాలనీ

చిన్నపిల్లలా మారాం చేస్తున్నావ్ అనుకున్నానిన్నాళ్ళు కానీ
హటం వేసుకుని  రాతి గోడల మధ్య కూర్చున్నావని.
రేయంతా జాగారమే...
మూసుకున్న రెక్కల వెనుక ఈ రెప్పల వెనుక
రేపటి మన  కలల వస్త్రాన్ని నేస్తూ...

ప్రొద్దున్నే లేచి ఈ భిక్షువుని  తిరస్కారంగా చూస్తూ
చేయి విసురుతావని తెలుసు
కోపంగా రాల్చిన  పుప్పొడి మాటలనేరుకుంటూ
నవ్వుకుంటాను. మరింత  వోపికనివ్వమని వేడుకుంటాను. 

ఏమడిగాను నిన్ను?
హృదయంలో కాస్తంత జాగా నే కదా !
నాలుగునాళ్ళు నీతో కలిసి చేసే
ప్రయాణం కోసమే కదా ఈ అర్దింపు.




4, డిసెంబర్ 2017, సోమవారం

వాట్టే సాంగ్ ..



ఈ పాట వినడమే కానీ ..ఎప్పుడూ చూడనే లేదు . చిలక జోస్యం చిత్రంలో పాట.  చంద్రమోహన్ - రాధిక లపై చిత్రీకరించిన యుగళగీతం. 
వేటూరి గారి సాహిత్యం , సంగీతం : కె వీ , మహదేవన్ 
గళం : పి.సుశీల ,ఎస్.పి.బాలసుబ్రమణ్యం గార్లు .  

ఎదలో మోహన లాహిరీ
ఎదుటే మోహన అల్లరీ
ఈ అల్లరి పల్లవిలో..మల్లెల పల్లకిలో
ఊరేగేదెప్పుడో మరి
ఎదలో మోహన లాహిరి
ఎదుటే మోహన సుందరి
ఈ అల్లరి పల్లవిగా..ఇద్దరు ఒక్కరుగా
పెనవేసుకుపోతే సరి
ఎదలో మోహన లాహిరి
ఎదుటే మోహన అల్లరి
చరణం 1:
చంద్రమోహనం ఆ వదనం
చందన కలశం ఆ నయనం
చంద్ర మోహనం ఆ వదనం
చందన కలశం ఆ నయనం
ఆ చల్లని వెచ్చనిలో.. వెచ్చని కౌగిలిలో
నే కరిగేదెప్పుడో మరీ
చుక్కల నీడల వెన్నెల వాడల
రమ్మని చూపుల రాయని జాబులు
చుక్కల నీడల వెన్నెల వాడల
రమ్మని చూపుల రాయని జాబులు
రాతిరికొస్తే సరి.. సరాసరి..
ఎదలో మోహన లాహిరి
ఎదుటే మోహన అల్లరి
ఈ అల్లరి పల్లవిగా..ఇద్దరు ఒక్కరుగా
పెనవేసుకుపోతే... సరి
చరణం 2:
నవ్య నందనం ఆ జవనం
అమృతమధురం ఆ అధరం
నవ్య నందనం ఆ జవనం
అమృతమధురం ఆ అధరం
ఆ నవ్వుల మత్తులలో.. మత్తుల మెత్తనలో
నేనొదిగే దెపూడో మరీ ..ఆ ఆ ఆ...
దిక్కుల చాటుగా దేవుని తోడుగా
మక్కువ పందిట చిక్కని సందిట
దిక్కుల చాటుగా దేవుని తోడుగా
మక్కువ పందిట చిక్కని సందిట
ఒక్కటి అయితే సరి..సరే సరి
ఎదలో మోహన లాహిరి
ఎదుటే మోహన సుందరి
ఈ అల్లరి పల్లవిగా.. ఇద్దరు ఒక్కరుగా
పెనవేసుకుపోతే సరి
ఈ పాటని ఈ లింక్ లో వినేయండి ..వావ్ అనకపోతే ..సరి ..సరే సరి 




24, నవంబర్ 2017, శుక్రవారం

అమ్మ ఆశీస్సులు

ఛాయాచిత్రాలంటే ఇష్టపడని అబ్బాయి
అబ్బాయి కంటికెదురుగా ఎప్పుడూ ఉండటం సాధ్యం కాదు కదా !
ప్రతి సందర్భాన్ని మనసు పటంలోనే కాదు ఛాయాచిత్రాలలోను బంధించి ఉంచుకోవాలనుకునే అమ్మ.
అమ్మ క్లిక్ మనిపించినప్పుడల్లా అబ్బాయి చిరాకు పడటం,వద్దన్నానా అనడం
అమ్మ - అబ్బాయి మధ్య అతి సహజమైన విషయం. 
ఒక మనిషి నుండి " అమ్మ" గా మారిన అపురూపమైన రోజు
సూర్యచంద్రుల నక్షత్ర కాంతులన్నీ అమ్మ మనసులో విరిసిన రోజు ..ఈ రోజు.
అమ్మ కడుపు చల్లగా,అత్త కడుపు చల్లగా బ్రతకరా బ్రతకరా పచ్చగా ..
చిన్నీ బంగారం ..
ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..
చైతన్యవంతమైన జీవన గమనం తో..
స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ..
సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో
యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..
మనసారా దీవిస్తూ..
భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ...
హృదయపూర్వక శుభాకాంక్షలు ..
నిండు మనస్సు తో.. ఆశీస్సులు.. అందిస్తూ..
ప్రేమతో..దీవెనలతో.. అమ్మ.



22, నవంబర్ 2017, బుధవారం

చిత్ర కవితలు


ప్రయాణం ఆగినాక .. ఉండటానికి లేకపోవడానికి పెద్దగా తేడా ఏమీ లేదు
అప్పుడెక్కడో ఉన్నావ్ ,మరిప్పుడెక్కడో ఉన్నావ్ . చూపుకి చిక్కకుండా మనసుకి దక్కకుండా
గడ్డిపూవు జీవితాలు ఇవి,ముగియడమే ఓ ప్రహసనం .


ఒక కల చిట్లిపోయిన తర్వాత రెండవసారి కల కంటూ
అవి నిజమవుతాయనుకోవడమే "జీవితం "


కినుక
అందరి హృదయంలో నేనున్నానంటారు
నా హృదయంలో ఎవరున్నారో ఒక్కరైనా అడగరే  మరి !


బంధం
ఈ బాహువులు ప్రేమాయుధాలు
బిడ్డని సదా సంరక్షించడంలో
మరింత  బల సంపన్నమవుతాయి
మరీ పునీతమవుతాయి

21, నవంబర్ 2017, మంగళవారం

అంతర్జ్వలనంలో నుండి.....

ఈ రోజు నా బ్లాగ్ పుట్టిన రోజు.
బ్లాగర్ గా యేడు సంవత్సరాలు పూర్తి చేసుకుని యెనిమిదో సంవత్సరంలో అడుగిడబోతున్నాను. నిజానికి నేను నాలుగేళ్ళు కూడా క్రమబద్దంగా బ్లాగ్ వ్రాయలేదు, అయినా నా బ్లాగ్ కి సందర్శకుల రాక యెక్కువే అని గూగుల్ వీక్షకుల సంఖ్య చెపుతుంది. ఎన్నో వ్రాయూలని వుంటుంది. భుజంనొప్పి నిరుత్సాహం వల్ల వ్రాయడం తగ్గించాను.
ఈ రోజు నాకు బ్లాగ్ రూపొందించి యిచ్చిన నేస్తం "వైష్ణవి" గుర్తు చేసింది బ్లాగ్ పుట్టినరోజని. హృదయపూర్వక ధన్యవాదాలు వైషూ డియర్. పై పై మెరుగుల స్నేహ ప్రపంచపు లోగిళ్ళలో... అసలయిన స్వచ్ఛమైన చిరునామా రూపానివి నీవు.
మళ్ళీ బ్లాగ్ వ్రాస్తూ తీరికలేకుండావుండాలి... చురకత్తి నువ్వు అని ముందుకు నెట్టడానికి నాకు సమీపంలో లేవు... నా ప్రియ నేస్తాలందరూ ... నాకు దూరంగా వున్నా నాహృదయంలోనే వుంటారు. హృదయంతో వింటారు. .. నా సంగతులను... ఈ బ్లాగ్ ముచ్చట్ల రూపంలో.
ఏడేళ్ళు వొక కలలా గడిచిపోయాయి.. ఓ అల అలసి పోకుండా పడి లేస్తూనే వుంది. నవశకానికి దారిచూపింది. దాని వెనుక నువ్వున్నావు. सिर्फ़ तुम. వైషూ.. అందుకు నీకు మరీ మరీ కృతజ్ఞతలు.
నా బ్లాగ్ పుట్టినరోజు... నా మరో పుట్టిననరోజు. నన్ను నేను డైరీ మాదిరి చదువుకుంటూ, సమీక్షించుకుంటూ, విమర్శించుకుంటూ... బ్లాగ్ ఉలితో జీవనశిల్పాన్ని మలచుకున్నాను. ఇంకేమి కావాలి నాకు.. మొన్నీమధ్య సమకాలీన రచయిత వెంకట కృష్ణ గారు యిచ్చిన కితాబ్ "అంతర్జాలం నుండీ అంతర్జ్వలనంలోకి" చాలును కదా! నిజానికి నేను అంతర్జ్వలనంలో నుండి అంతర్జాలం లోకి నడిచొచ్చిన సంగతి నా ప్రియ మిత్రులకే తెలుసు .
పాఠకుల, వీక్షకుల అభిప్రాయాలు. ప్రోత్సాహం ఎల్లప్పుడూ సరి కొత్త ఊపిరిని అందిస్తూ ... 380580 మందిమి మీ బ్లాగ్ దర్శించామని ,149383 సహా బ్లాగర్లు నన్ను చదువుతూనే ఉన్నారని 10202 మంది నేను ఎవరా అని ఆసక్తిగా చూసారని చెపుతుంటే .. నాకు గర్వంగానే కాదు సిగ్గుగా ఉంటుంది ఎందుకు వ్రాయడం మానేసానా ..అని . కొన్నాళ్ళ తర్వాత వ్రాస్తూనే ఉంటాను . ప్రస్తుతానికి విరామసమయం. నా బ్లాగ్ మిత్రులు చాలా మంది ఇక్కడ మిత్ర బృందంలో ఉన్నారు ..వారికి ధన్యవాదాలు తెలుపుతూ ...
"వనజ వనమాలి" కి పుట్టినరోజు శుభాకాంక్షలు .



15, నవంబర్ 2017, బుధవారం

స్వభావం

స్వభావం 


ప్రేమో ద్వేషమో అభిమానమో ఆత్మీయతో అలకో ఆరోపణో


అన్నీ సహజంగా అప్పటికప్పుడు ప్రదర్శించడమే నా రీతి


వాటికి అడ్డుకట్టలేయాలని


యెప్పుడు యెంత బయటకు తీయాలో


యెక్కడెంత ముసుగు వేసుకోవాలో అని లెక్కలేసుకుండా


ఈర్ష్య అసూయో ఇసుమంత కూడా లేకుండా


సానుభూతి నసహ్యించుకుంటూ


జాలి దయ వర్షంలా ఎప్పుడు కురుస్తుందో తెలియకుండా


కురిస్తే ఆపకుండా ..


నిర్భయంగా నచ్చినదారిలో నడవవడమే నా మనిషి తనం




అడ్డుకట్టలేస్తే యే మాత్రం ఆగనిదాన్ని


భావనల మార్పుతో ప్రవహించే సెలయేటి సంగీతాన్ని


పదాల కనికట్టుతో కవితలల్లే అక్షర మంత్రదండాన్ని


ఈ పద్యమల్లే నేనే ఒక ప్రపంచాన్ని.


"నేను" అనే ఒక అహాన్నీ.


జ్వలనంలో బూడిదయ్యే వరకూ అది నీటిలో కరిగేంత వరకూ


యేమాత్రం నశించని..స్వభావాన్ని.




1, నవంబర్ 2017, బుధవారం

చిత్ర కవితలు

అక్కు పక్షులు

కనబడని పంజరాలెన్నో

ఈ ఆడ బ్రతుకులకు

అనుబంధాల సంకెళ్ళెన్నో

పేగు ని తెంచి జన్మ నిచ్చిన అమ్మలకు

ప్రేమతోనో బరువుతోనో తడిసిన రెక్కలతో

స్వేచ్ఛగా యెగరలేని అక్కు పక్షులు

ఈ ఆడమనుషులు.





***********************

లోపం లేని చిత్రం చింత లేని జీవనం

పరిపూర్ణమని భావించే జీవితం

అవి అసత్య ప్రమాణాలే !

కేవలం కవుల కల్పనలే !

జీవితమంటేనే...... 

అనివార్యమైన ఘర్షణ



*************************

మాధవ సేవ

భక్తులను సంఖ్యల లోనూ

కానుకులను ఆదాయంలోనూ

క్షేత సమాచారాన్ని తెలుసుకోవడం

నిత్యకృత్యమైన వేదన.



*************************

అనుభవం ఇలా చెపుతుంది .. 

సహనంతో నిశ్శబ్దంగా వుండండి 

నిందలు వేసిన నోళ్లె 

వేనోళ్ళ కొనియాడతాయని



******************************

రోజూ వచ్చే చీకటి దాపున

రాబోయే వెలుగు గురించి

కనే కలల వెలుగులే..

నిత్య దీపావళి.





30, అక్టోబర్ 2017, సోమవారం

వితరణ

వితరణ (కథ )

 

చదవండి ఫ్రెండ్స్ .. (ఉషోదయ వెలుగు పత్రికలో ప్రచురణ )


దసరా పండుగ వస్తుందంటేనే సరదా ఇంటి గుమ్మం ముందు తచ్చాడుతూ ఉంటుంది. రోజంతా బద్దకంగా చేసే ఇంటిపనిని త్వరత్వరగా ముగించుకుని సంప్రదాయంగా చక్కగా ముస్తాబై ..రోజుకొక అలంకారంలో శోభిల్లే అమ్మని కనులారా వీక్షిస్తూ మనసారా ధ్యానిస్తూ .. పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో గడపడమంటే ఎంతో ఇష్టం వైష్ణవికి. కానీ ఈసారి ఆమెకి పూర్తి అవకాశం చిక్కలేదు సెలవలకి వచ్చిన పిల్లలతో, వారిరాకని పండుగగా భావించి వచ్చిపోయే బంధుమిత్రులతో ఇల్లంతా సందడిగా ఉంది. తెల్లవారుజ్హామునే లేచి గుడికి వెళ్ళింది. గుడి చుట్టూ ప్రదక్షణం చేసుకుని ..గుడి ఆవరణలో పద్మాసనం వేసుకుని కూర్చుని మౌనంగా అమ్మని ప్రార్ధించుకోసాగింది.

ఆమె ప్రశాంతతని భగ్నం చేస్తూ "ఏమ్మా..శాంతమ్మ గారూ! బాగున్నారా ? చాలా రోజుల తర్వాత చూస్తున్నాను మిమ్మల్ని " అంటూ ఎవరిదో పలకరింపు. "దేవుడి దయ వలన అంతా బాగున్నారు. మనమరాలి చదువు పూర్తైపోయింది. ఇక ఇంటికి వచ్చేసాను. అయిదేళ్లపాటు రోజూ ఉదయాన్నే తన దర్శన భాగ్యాన్ని కల్గించిన కంచి కామాక్షి ఇక మీ ఊరు వెళ్ళమని చెప్పింది. అమ్మ అజ్ఞ ఇస్తే తప్పుతుందా ? " అంది.

"అదృష్టవంతులు, అన్నేళ్ల పాటు రోజూ ఆమె దర్శన భాగ్యం కల్గింది మీకు. నాకు ఒక్క రోజు కూడా సెలవీయదు ఇల్లు. ఏదో ఇంటికి కూసింత దూరంలో ఉన్నాను కాబట్టి ఈ గుడికైనా రావడం".. అంది మీనాక్షమ్మ.

"మా వూరు వెళ్లి అక్కడే ఉందామనుకునే లోపే అక్కడొద్దు. ఆ ఇల్లు అమ్మేస్తున్నాం, వచ్చి మా పుట్టింట్లో ఉండండి అంది కోడలు విజయ. అదీ అమ్మ ఆజ్ఞే అనుకుంటున్నాను"

"అత్తా కోడలు ఒకే ఇంటి ఆడపడుచులు కదా ! అన్నదమ్ములతో కలిసి ఉండే అదృష్టం దక్కిందని భావించాలి మీరు" .

"అంతే,అంతే ..ఎనబై యేళ్ళ వయసులో పుట్టిన ఇంటిలో ఉండే భాగ్యం రోజూ చీకటితో దేవుడికి సేవచేసుకునే భాగ్యం ఇచ్చిన భగవంతుడిని యేమి కోరుకోను ..అందరూ చల్లగా ఉండాలని తప్ప." ..అంది శాంతమ్మ.

"మీ అబ్బాయి ఆర్ధిక పరిస్థితి బాగోలేదని వింటున్నాను,నిజమేనా" అని అడిగింది మీనాక్షమ్మ.

" పది లక్షల అప్పుంటే కోట్లు అప్పు ఉన్నాయని చెప్పుకోవడం లోకం తీరు. ఏమిటో, వాడికి అన్నిటిలోనూ ఎదురే. యే వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా కలిసి రావడం లేదు. అందులో ఇద్దరు పిల్లలని డొనేషన్ కట్టి మెడిసన్ చదివించడం అంటే మాటలా ! చెప్పండి. ఏవో వొడిదుడుకులు ఉన్నమాట వాస్తవమే కానీ ..అంత అప్పుల బాధ లేదు. వాడికేమిటమ్మా,కోట్లు ధర పలికే ఇరవై ఎకరాల భూమి ఉంది. భగవంతుడి దయ ఉంటే అన్నీ దాటేయవచ్చు.."అని చెపుతున్న ఆమెని ఆసక్తిగాను,అబ్బురంగానూ చూసింది వైష్ణవి. జీవితాన్ని కాచి వడపోసిన ఆమె మాటలు హృదయంతో తీసుకునేటట్లు ఉన్నాయి అనుకుంది. శాంతమ్మ గారికి నమస్కారం మామ్మ గారూ అంటూ నిండు మనస్సుతో నమస్కరించింది.

సౌభాగ్యవతీ భవ,దీర్ఘాయష్మాన్భవ, ..అని దీవించి .. అమ్మా ..నేను పెద్దదానిని అయిపోయాను.. ఈ వొత్తులు,నువ్వుల నూనె తీసుకుని వెళ్లి ఆ కాలభైరవుడి ముందు దీపం వెలిగించి రా ..అని వైష్ణవికి పురమాయించింది.

మీరే దీపం వెలిగించకూడడా ! అంది వైష్ణవి.

"ఎవరైతే ఏమిటమ్మా .. దేవుడు ముందు దీపం వెలిగించామా అజ్ఞానమనే చీకటి తొలగించామా అన్నదే ముఖ్యం. పాపం,పుణ్యం అన్నీ ఎవరి ఖాతాలో వేయాలో భగవంతుడికి తెలుసు. మనం కేవలం నిమిత్త మాత్రులమి మాత్రమే "అంది.

ఆ మాటలతో శాంతమ్మ గారిపై పూజ్యభావం కల్గింది వైష్ణవి. అప్పటి నుండి వారి పరిచయం దినదినాభి వృద్ధి చెందసాగింది.రోడ్డుకి అవతలి వైపున శాంతమ్మ గారి ఇల్లు ఇవతలి వైపున గుడి ఉండటం మూలంగా .. రోడ్డుపై వెళ్ళే వాహనాల రద్దీలో ఆమె రోడ్డు దాటటం కష్టంగా ఉండేది. వైష్ణవి వేకువఝామునే త్వరత్వరగా బయలుదేరి వచ్చి ఆమెని రోడ్డు దాటించి గుడిలోపలికి తీసుకుని వచ్చేది. శాంతమ్మ గారు చెప్పే అనేక భక్తీ విషయాలు, యాత్రా అనుభవాలు చాలా ఆసక్తిగా ఉండేవి. రోజూ దైవ దర్శనంతో పాటు శాంతమ్మ గారి దర్శనం కల్గకపోతే యేదో వెలితిగా ఉన్నట్టు ఉండేది వైష్ణవికి. దసరా పోయి దీపావళి వచ్చింది..దాన్ని ఆనుకునే కార్తీకం వచ్చింది. వేకువనే నాలుగు గంటలకల్లా దీపాలు పెట్టె వరుసలో శాంతమ్మ గారూ వైష్ణవి పోటీ పడేవారు. ఎప్పటిలాగానే ..ఈ నువ్వుల నూనె వడ్డించు తల్లీ, ఈ వొత్తులు తీసుకెళ్ళి ఆ దీపారాధన కుంది లో వేసి రామ్మా .. అంటూ వైష్ణవి చేతికి ఆ వస్తువులని అందించేది.

శాంతమ్మ గారు అందరిని ఆప్యాయంగా పలకరించేది, ఇతరులు చెప్పేదాన్ని ఓపికగా వినేది కూడా ! సహృదయం ఉన్న వ్యక్తే కాదు ..అందరికి పెట్టే గుణం ఉన్న వ్యక్తి కూడా ! ప్రతి రోజూ ఇంటి ముందు తోటలో కాసిన జామకాయలనో, నారింజ కాయలనో, సీతా ఫలాలనో పనివాళ్ళ చేత జాగ్రత్తగా కోయించి సంచీకి వేసి పెట్టేది. వైష్ణవి సాయంతో ఆ బరువైన సంచీని గుడిలోపలకి తెప్పించి.. గుడికి వచ్చిన అందరికి జాకెట్ ముక్క ఓ పండో ఫలమో పెట్టి వారి చేతికిచ్చి తృప్తి పడేది. ఒకో రోజు నాన పెట్టిన శెనగలు, కందులు కూడా తెచ్చి అందరికి పంచేది.

"నా కోడలు రాక్షసి, మేనకోడలని కొడుక్కి  చేసుకుంటే నరకం చూపుతుంది. కొడుకేమో రేసులకి వెళ్ళడం, క్రికెట్ బెట్టింగులు కట్టడం. నా భర్త నుండి వచ్చిన ఆస్తులని అన్నింటిని కర్పూరంలా కరిగించేశారు. ఇక కోడలి ఆస్తి మాత్రమే ఉంది. నేను కనబడితే చాలు భర్త మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తూ తిట్టిపోస్తుంది . ఈ వయసులో ఒక్కదాన్ని వండి వార్చుకునే ఓపిక ఎక్కడుంది నాకు. పుట్టింట్లో ఉంటె మాత్రం మేనల్లుళ్ళ భార్యలు ఎందుకు వండి పెడతారు. ఓపిక లేకపోతే కొడుకు ఇంటికే వెళ్ళాల్సింది. ఇప్పటిదాకా వాళ్ళ పిల్లలకేగా చేసి చేసి వచ్చారు. ఇప్పుడొచ్చి మా ఇంట్లో కూర్చుంటే ఎట్లా అని అంటుంటారు. ఆ అనే మాటలేవో నా ముందు అనరు ఇంటికొచ్చిన బంధువుల దగ్గర అనడం నేను విన్నాను. ఈ బతుకు ఎట్లా తెల్లారుతుందో..? " అని చెప్పుకుని బాధపడింది.

ఒక రోజు వైష్ణవి గుడికి రావడం ఆలస్యమైంది. అప్పటికే గుడికి వచ్చిన శాంతమ్మ గారు రావి చెట్టూ కట్టిన చెప్టా మీద కూర్చుని పూజ కోసం వచ్చిన ఒకామెకి వొత్తులు,నూనె ఇచ్చి దీపం వెలిగించమని అడిగింది. ఆమె అలా చేయడానికి తిరస్కరించడమే కాకుండా "అదేంటి మామ్మగారూ ! మీకు అలా నువ్వుల నూనె, వొత్తులు చేతికి ఇవ్వడం మంచిది కాదని తెలియదా ? అని తీవ్రంగా ప్రశ్నించింది. "లేదమ్మా నాకు తెలియదు. ఓపిక లేక అడుగుతున్నాను కానీ ఒకరికి మంచిది కాదని తెలిస్తే నేను అలా ఎందుకు చెపుతాను" అంది.

ద్వజస్థంభం దగ్గర దణ్ణం పెట్టుకుంటున్న వైష్ణవి ఇవన్నీ వింటూనే ఉంది. అంత పెద్ద వయసు వచ్చింది ఆమెకి . గుడిలోకి వచ్చి మరీ అబద్దాలు చెపుతుంది. తెలిసినవారు ఎవరూ పత్తితో చేసిన వొత్తులు,నువ్వుల నూనె చేతికి ఇవ్వరు ..ఇంకొకరు ఇస్తే తీసుకోరు,శని దోష నివారణ కోసం చేస్తూ ఉంటారు అలా . అని వివరంగా చెపుతుంది ఆమె

వైష్ణవికి వెంటనే తట్టింది శాంతమ్మ గారు నీలం రంగు జాకెట్ ముక్కలని మాత్రమే పంచి పెడుతుంది అని. కొందరు ఆమె ఇస్తున్నవేవీ తీసుకోకుండా వెళుతున్నారేమిటో అనుకునేదాన్ని. అందుకు కారణం ఇదా ..అనుకుని ఆశ్చర్యపోయింది. ఎన్నో సూక్ష్మ విషయాలు తెలిసిన ఆమెకి ఈ విషయం తెలియదంటే వైష్ణవికి కూడా నమ్మశక్యం కాలేదు. అప్పటిదాకా శాంతమ్మ గారి మీద ఉన్న గౌరవం చటుక్కున జారిపోయింది.

జరిగినవేమీ తెలియనట్లే .. రోజూ లాగానే శాంతమ్మ గారి దగ్గరకి వచ్చి ఈ రోజు ఆలస్యం అయిపోయింది. మీరు తొందరగానే గుడికి వచ్చేసారే మామ్మగారూ, రోడ్డు ఎవరు దాటించారు మిమ్మల్ని అని అడిగింది.

ఎలాగోలా నిదానంగా నేనే దాటానమ్మా ! ఇదిగో ఈ వొత్తులు నూనె తీసుకుని వెళ్లి దీపం వెలిగించి రా ..అంటూ వైష్ణవి చేతికి ఇచ్చింది. వైష్ణవి మాములుగానే తీసుకుంది. అంతకు ముందు శాంతమ్మ గారిని తీవ్రంగా ప్రశ్నించిన స్త్రీ మళ్ళీ వచ్చి వైష్ణవిని చేతితో వారిస్తూ.. "అలా ఆమె చేతిలో నుండి ఆ వస్తువులని ఎప్పుడూ తీసుకోకండి. శని దోష నివారణ కోసం ఇస్తూ ఉంటారు అని .. ఇదిగోండి మామ్మగారు మీకు ఇందాక చెప్పాను అయినా మళ్ళీ మీరు ఆమె చేతికి అవే వస్తువులని మళ్ళీ ఇచ్చారు. మనం మాత్రమే బాగుండాలని అనుకోవడం కాదండీ ఇతరులూ బాగుండాలి అనుకునేవాళ్లు ఎప్పటికీ మీలా చెయ్యరు. అంత వయసు రాగానే సరికాదు, అన్ని తీర్ధయాత్రలు చేసాను అని చెప్పుకుంటే సరికాదు. మంచి అన్నది మనం చేసే పనుల్లో ఉండాలి. అందరూ ఎవరి విశ్వాసం కొద్దీ వాళ్ళు గుడికి వస్తూ ఉంటారు,పూజలు,అభిషేకాలు చేయించుకుంటారు తప్ప మనం మన రాతలని దోషాలని ఇంకొకళ్ళకి అంటించాలని చూడరు. ఇది మీకు మంచిది కాదు" అని దులిపేసింది.

"అంత పెద్ద పెద్ద మాటలెందుకు పోనీ లెండి, నాకు ఏమీ తెలియదు కాబట్టి సహాయం చేస్తున్నాననుకుని ఆమె చెప్పేవన్నీ గుడ్డిగా చేసాను. ఆమెకి తెలిసి చేసింది అంటే .. ఆ పాపం ఆమెకే ! పైన భగవంతుడున్నాడు ఆయనే చూసుకుంటాడు అవన్నీ ! అంటూ దీపం వెలిగించి వచ్చింది.

శాంతమ్మ గారు వైష్ణవి చేయి పట్టుకుని "అమ్మా ! పెద్దమనసు చేసుకుని నన్ను క్షమించమ్మా ! ఇక ఎప్పుడూ అలా చేయను. పుత్ర ప్రేమతో .. గుడ్డిదాన్నై ఏదో బిడ్డకి దుష్ట గ్రహాలూ పట్టి పీడిస్తున్నాయి నివారణ కోసం అలా చేయమంటే చేస్తున్నాను తప్ప ఎవరికీ కీడు కలగాలని కాదు. నన్ను నమ్మమ్మా" ..అంటూ పమిట చెంగుతో కళ్ళు తుడుచుకుంది

"అయ్యో ..అలా అనకండి మామ్మ గారూ .. ఈ లోపం అంతా మీలో లేదు, మీలాంటి నాలాంటి ఎందరికో పండితులు పుర్రెలకి అంటించిన జాడ్యం ఇది. దేవుడు అన్నిచోట్లా ఉన్నాడనుకుంటూనే నిత్య జీవితంలో కలిగే అశాంతులని తగ్గించుకోవడానికి,మానసిక నిబ్బరం పెంచుకోవడానికి ప్రశాంతత కోసం గుడికి వస్తాం తప్ప మన బాధలని ఇంకొకరి బదిలీ చేద్దామని కాదు. మనం చేతితో ఇచ్చినంత మాత్రాన ఇంకొకరు పుచ్చుకున్నంత మాత్రాన అన్ని బాధలు సమసిపోతాయనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. మంచిని ఇతరులకి పంచడమే వితరణ. నేనూ మీలో మంచినే చూసాను. ఎవరిది పాపమో పుణ్యమో నాకు తెలియదు. మీరే అంటారుగా పాపం,పుణ్యం అన్నీ ఎవరి ఖాతాలో వేయాలో భగవంతుడికి తెలుసు. మనం కేవలం నిమిత్త మాత్రులమి మాత్రమే అని అంది వైష్ణవి.

"చిన్నదానివైనా భగవత్తత్వాన్ని వొంటపట్టించుకున్నావ్. చల్లగా ఉండమ్మా" ..అంటూ మనఃస్పూర్తిగా దీవించింది శాంతమ్మ.



27, అక్టోబర్ 2017, శుక్రవారం

మరుగేల మబ్బు ముసుగేల

నాకిష్టమైనపాట


ముగ్గురి హృదయాల సున్నితమైన  అలజడి అద్భుతమైన బాణి  సుతిమెత్తగా కోసేస్తుంది. ప్రతిరోజూ విన్నా .. విసుగువేయని పాట. "అల్లుడు గారొచ్చారు " చిత్రంలో "హరిహరన్ " పాడినపాట. 

ఇదే చిత్రంలో .. “రంగు రంగురెక్కల సీతాకోక చిలుక” కీరవాణి గారి పాట కూడా చాలా బాగుంటుంది. 


పాట సాహిత్యం :


మరుగేల మబ్బు ముసుగేల

ఓ చందమామా ఓ చందమామా

మనసున మల్లెలు విరిసిన వేళ

మమతల పల్లవి పలికిన వేళ

మౌనమే మోహన రాగమయే వేళ

మరుగేల మబ్బు ముసుగేల

ఓ చందమా..మా ఓ చందమా..మా


కాంచన కాంతుల కాంచన బాట కనపడలేదా

కొమ్మన కూసిన కోయిల పాట వినపడలేదా

ఉలి తాకిన శిల మాదిరి ఉలికులికి పడుతోంది ఎదలో సడి

చలి చాటున మరుమల్లెకి మారాకు పుడుతోందో ఏమో మరి

చెంతకు చేరే సుముహుర్తాన ఆశలు తీరే ఆనందాన

మౌనమే మోహన రాగమయే వేళ


మరుగేల మబ్బు ముసుగేల



మాటకు అందని ఊసులు లేవా చూపులలోనా

చూపులు చేరని సీమలు లేవా ఊహలలోనా

కనుచూపులో చిగురాశలు బరువైన రెప్పల్లో బంధించకు

మది వీధిలో స్వప్నాలకి సంకెళ్ళు వేసేటి జంకెందుకు

ఊయలలూపే మృదుభావాలు ఊపిరి తీగను మీటే వేళ

మౌనమే మోహన రాగమయే వేళ

మరుగేల మబ్బు ముసుగేల

మరుగేల మబ్బు ముసుగేల


మనం చూసే వీడియో పాటకి వినే ఆడియో పాటకి తేడా ఉంటుంది . 

చరణాలు అటుదిటు  మారిపోయి ఉంటాయి.


ఈ పాటకు మా నాన్న గారి అవార్డ్ లభించింది అని కీరవాణి గారు "స్వరాభిషేకం " కార్యక్రమంలో చెప్పారు . శ్రోతలకు వీనులువిందు చేసినపాట  కీరవాణి గళంలో కూడా వినడం బాగుంటుంది. మరకతమణి కీరవాణి గారి స్వరకల్పన అంటే నాకు చాలా ఇష్టం . ఏ పాటకు ఆ పాటే బాగుంటుంది. కీరవాణి గారి పాటల్లో కొన్ని నాసిరకం పాటలు కూడా ఉన్నాయేమో .. ఆ పాటలను వెదికి వినడం కూడా నాకు సరదానే కానీ .. పాటలన్నింటిలో 90% సాహిత్యపరంగా సంగీతపరంగా ఆకట్టుకున్నవే !

ఆ పాటలన్నింటిలోనూ నాకు చాలా ఇష్టమైన పాట యిది.