30, అక్టోబర్ 2017, సోమవారం

వితరణ

వితరణ (కథ )

 

చదవండి ఫ్రెండ్స్ .. (ఉషోదయ వెలుగు పత్రికలో ప్రచురణ )


దసరా పండుగ వస్తుందంటేనే సరదా ఇంటి గుమ్మం ముందు తచ్చాడుతూ ఉంటుంది. రోజంతా బద్దకంగా చేసే ఇంటిపనిని త్వరత్వరగా ముగించుకుని సంప్రదాయంగా చక్కగా ముస్తాబై ..రోజుకొక అలంకారంలో శోభిల్లే అమ్మని కనులారా వీక్షిస్తూ మనసారా ధ్యానిస్తూ .. పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో గడపడమంటే ఎంతో ఇష్టం వైష్ణవికి. కానీ ఈసారి ఆమెకి పూర్తి అవకాశం చిక్కలేదు సెలవలకి వచ్చిన పిల్లలతో, వారిరాకని పండుగగా భావించి వచ్చిపోయే బంధుమిత్రులతో ఇల్లంతా సందడిగా ఉంది. తెల్లవారుజ్హామునే లేచి గుడికి వెళ్ళింది. గుడి చుట్టూ ప్రదక్షణం చేసుకుని ..గుడి ఆవరణలో పద్మాసనం వేసుకుని కూర్చుని మౌనంగా అమ్మని ప్రార్ధించుకోసాగింది.

ఆమె ప్రశాంతతని భగ్నం చేస్తూ "ఏమ్మా..శాంతమ్మ గారూ! బాగున్నారా ? చాలా రోజుల తర్వాత చూస్తున్నాను మిమ్మల్ని " అంటూ ఎవరిదో పలకరింపు. "దేవుడి దయ వలన అంతా బాగున్నారు. మనమరాలి చదువు పూర్తైపోయింది. ఇక ఇంటికి వచ్చేసాను. అయిదేళ్లపాటు రోజూ ఉదయాన్నే తన దర్శన భాగ్యాన్ని కల్గించిన కంచి కామాక్షి ఇక మీ ఊరు వెళ్ళమని చెప్పింది. అమ్మ అజ్ఞ ఇస్తే తప్పుతుందా ? " అంది.

"అదృష్టవంతులు, అన్నేళ్ల పాటు రోజూ ఆమె దర్శన భాగ్యం కల్గింది మీకు. నాకు ఒక్క రోజు కూడా సెలవీయదు ఇల్లు. ఏదో ఇంటికి కూసింత దూరంలో ఉన్నాను కాబట్టి ఈ గుడికైనా రావడం".. అంది మీనాక్షమ్మ.

"మా వూరు వెళ్లి అక్కడే ఉందామనుకునే లోపే అక్కడొద్దు. ఆ ఇల్లు అమ్మేస్తున్నాం, వచ్చి మా పుట్టింట్లో ఉండండి అంది కోడలు విజయ. అదీ అమ్మ ఆజ్ఞే అనుకుంటున్నాను"

"అత్తా కోడలు ఒకే ఇంటి ఆడపడుచులు కదా ! అన్నదమ్ములతో కలిసి ఉండే అదృష్టం దక్కిందని భావించాలి మీరు" .

"అంతే,అంతే ..ఎనబై యేళ్ళ వయసులో పుట్టిన ఇంటిలో ఉండే భాగ్యం రోజూ చీకటితో దేవుడికి సేవచేసుకునే భాగ్యం ఇచ్చిన భగవంతుడిని యేమి కోరుకోను ..అందరూ చల్లగా ఉండాలని తప్ప." ..అంది శాంతమ్మ.

"మీ అబ్బాయి ఆర్ధిక పరిస్థితి బాగోలేదని వింటున్నాను,నిజమేనా" అని అడిగింది మీనాక్షమ్మ.

" పది లక్షల అప్పుంటే కోట్లు అప్పు ఉన్నాయని చెప్పుకోవడం లోకం తీరు. ఏమిటో, వాడికి అన్నిటిలోనూ ఎదురే. యే వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా కలిసి రావడం లేదు. అందులో ఇద్దరు పిల్లలని డొనేషన్ కట్టి మెడిసన్ చదివించడం అంటే మాటలా ! చెప్పండి. ఏవో వొడిదుడుకులు ఉన్నమాట వాస్తవమే కానీ ..అంత అప్పుల బాధ లేదు. వాడికేమిటమ్మా,కోట్లు ధర పలికే ఇరవై ఎకరాల భూమి ఉంది. భగవంతుడి దయ ఉంటే అన్నీ దాటేయవచ్చు.."అని చెపుతున్న ఆమెని ఆసక్తిగాను,అబ్బురంగానూ చూసింది వైష్ణవి. జీవితాన్ని కాచి వడపోసిన ఆమె మాటలు హృదయంతో తీసుకునేటట్లు ఉన్నాయి అనుకుంది. శాంతమ్మ గారికి నమస్కారం మామ్మ గారూ అంటూ నిండు మనస్సుతో నమస్కరించింది.

సౌభాగ్యవతీ భవ,దీర్ఘాయష్మాన్భవ, ..అని దీవించి .. అమ్మా ..నేను పెద్దదానిని అయిపోయాను.. ఈ వొత్తులు,నువ్వుల నూనె తీసుకుని వెళ్లి ఆ కాలభైరవుడి ముందు దీపం వెలిగించి రా ..అని వైష్ణవికి పురమాయించింది.

మీరే దీపం వెలిగించకూడడా ! అంది వైష్ణవి.

"ఎవరైతే ఏమిటమ్మా .. దేవుడు ముందు దీపం వెలిగించామా అజ్ఞానమనే చీకటి తొలగించామా అన్నదే ముఖ్యం. పాపం,పుణ్యం అన్నీ ఎవరి ఖాతాలో వేయాలో భగవంతుడికి తెలుసు. మనం కేవలం నిమిత్త మాత్రులమి మాత్రమే "అంది.

ఆ మాటలతో శాంతమ్మ గారిపై పూజ్యభావం కల్గింది వైష్ణవి. అప్పటి నుండి వారి పరిచయం దినదినాభి వృద్ధి చెందసాగింది.రోడ్డుకి అవతలి వైపున శాంతమ్మ గారి ఇల్లు ఇవతలి వైపున గుడి ఉండటం మూలంగా .. రోడ్డుపై వెళ్ళే వాహనాల రద్దీలో ఆమె రోడ్డు దాటటం కష్టంగా ఉండేది. వైష్ణవి వేకువఝామునే త్వరత్వరగా బయలుదేరి వచ్చి ఆమెని రోడ్డు దాటించి గుడిలోపలికి తీసుకుని వచ్చేది. శాంతమ్మ గారు చెప్పే అనేక భక్తీ విషయాలు, యాత్రా అనుభవాలు చాలా ఆసక్తిగా ఉండేవి. రోజూ దైవ దర్శనంతో పాటు శాంతమ్మ గారి దర్శనం కల్గకపోతే యేదో వెలితిగా ఉన్నట్టు ఉండేది వైష్ణవికి. దసరా పోయి దీపావళి వచ్చింది..దాన్ని ఆనుకునే కార్తీకం వచ్చింది. వేకువనే నాలుగు గంటలకల్లా దీపాలు పెట్టె వరుసలో శాంతమ్మ గారూ వైష్ణవి పోటీ పడేవారు. ఎప్పటిలాగానే ..ఈ నువ్వుల నూనె వడ్డించు తల్లీ, ఈ వొత్తులు తీసుకెళ్ళి ఆ దీపారాధన కుంది లో వేసి రామ్మా .. అంటూ వైష్ణవి చేతికి ఆ వస్తువులని అందించేది.

శాంతమ్మ గారు అందరిని ఆప్యాయంగా పలకరించేది, ఇతరులు చెప్పేదాన్ని ఓపికగా వినేది కూడా ! సహృదయం ఉన్న వ్యక్తే కాదు ..అందరికి పెట్టే గుణం ఉన్న వ్యక్తి కూడా ! ప్రతి రోజూ ఇంటి ముందు తోటలో కాసిన జామకాయలనో, నారింజ కాయలనో, సీతా ఫలాలనో పనివాళ్ళ చేత జాగ్రత్తగా కోయించి సంచీకి వేసి పెట్టేది. వైష్ణవి సాయంతో ఆ బరువైన సంచీని గుడిలోపలకి తెప్పించి.. గుడికి వచ్చిన అందరికి జాకెట్ ముక్క ఓ పండో ఫలమో పెట్టి వారి చేతికిచ్చి తృప్తి పడేది. ఒకో రోజు నాన పెట్టిన శెనగలు, కందులు కూడా తెచ్చి అందరికి పంచేది.

"నా కోడలు రాక్షసి, మేనకోడలని కొడుక్కి  చేసుకుంటే నరకం చూపుతుంది. కొడుకేమో రేసులకి వెళ్ళడం, క్రికెట్ బెట్టింగులు కట్టడం. నా భర్త నుండి వచ్చిన ఆస్తులని అన్నింటిని కర్పూరంలా కరిగించేశారు. ఇక కోడలి ఆస్తి మాత్రమే ఉంది. నేను కనబడితే చాలు భర్త మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తూ తిట్టిపోస్తుంది . ఈ వయసులో ఒక్కదాన్ని వండి వార్చుకునే ఓపిక ఎక్కడుంది నాకు. పుట్టింట్లో ఉంటె మాత్రం మేనల్లుళ్ళ భార్యలు ఎందుకు వండి పెడతారు. ఓపిక లేకపోతే కొడుకు ఇంటికే వెళ్ళాల్సింది. ఇప్పటిదాకా వాళ్ళ పిల్లలకేగా చేసి చేసి వచ్చారు. ఇప్పుడొచ్చి మా ఇంట్లో కూర్చుంటే ఎట్లా అని అంటుంటారు. ఆ అనే మాటలేవో నా ముందు అనరు ఇంటికొచ్చిన బంధువుల దగ్గర అనడం నేను విన్నాను. ఈ బతుకు ఎట్లా తెల్లారుతుందో..? " అని చెప్పుకుని బాధపడింది.

ఒక రోజు వైష్ణవి గుడికి రావడం ఆలస్యమైంది. అప్పటికే గుడికి వచ్చిన శాంతమ్మ గారు రావి చెట్టూ కట్టిన చెప్టా మీద కూర్చుని పూజ కోసం వచ్చిన ఒకామెకి వొత్తులు,నూనె ఇచ్చి దీపం వెలిగించమని అడిగింది. ఆమె అలా చేయడానికి తిరస్కరించడమే కాకుండా "అదేంటి మామ్మగారూ ! మీకు అలా నువ్వుల నూనె, వొత్తులు చేతికి ఇవ్వడం మంచిది కాదని తెలియదా ? అని తీవ్రంగా ప్రశ్నించింది. "లేదమ్మా నాకు తెలియదు. ఓపిక లేక అడుగుతున్నాను కానీ ఒకరికి మంచిది కాదని తెలిస్తే నేను అలా ఎందుకు చెపుతాను" అంది.

ద్వజస్థంభం దగ్గర దణ్ణం పెట్టుకుంటున్న వైష్ణవి ఇవన్నీ వింటూనే ఉంది. అంత పెద్ద వయసు వచ్చింది ఆమెకి . గుడిలోకి వచ్చి మరీ అబద్దాలు చెపుతుంది. తెలిసినవారు ఎవరూ పత్తితో చేసిన వొత్తులు,నువ్వుల నూనె చేతికి ఇవ్వరు ..ఇంకొకరు ఇస్తే తీసుకోరు,శని దోష నివారణ కోసం చేస్తూ ఉంటారు అలా . అని వివరంగా చెపుతుంది ఆమె

వైష్ణవికి వెంటనే తట్టింది శాంతమ్మ గారు నీలం రంగు జాకెట్ ముక్కలని మాత్రమే పంచి పెడుతుంది అని. కొందరు ఆమె ఇస్తున్నవేవీ తీసుకోకుండా వెళుతున్నారేమిటో అనుకునేదాన్ని. అందుకు కారణం ఇదా ..అనుకుని ఆశ్చర్యపోయింది. ఎన్నో సూక్ష్మ విషయాలు తెలిసిన ఆమెకి ఈ విషయం తెలియదంటే వైష్ణవికి కూడా నమ్మశక్యం కాలేదు. అప్పటిదాకా శాంతమ్మ గారి మీద ఉన్న గౌరవం చటుక్కున జారిపోయింది.

జరిగినవేమీ తెలియనట్లే .. రోజూ లాగానే శాంతమ్మ గారి దగ్గరకి వచ్చి ఈ రోజు ఆలస్యం అయిపోయింది. మీరు తొందరగానే గుడికి వచ్చేసారే మామ్మగారూ, రోడ్డు ఎవరు దాటించారు మిమ్మల్ని అని అడిగింది.

ఎలాగోలా నిదానంగా నేనే దాటానమ్మా ! ఇదిగో ఈ వొత్తులు నూనె తీసుకుని వెళ్లి దీపం వెలిగించి రా ..అంటూ వైష్ణవి చేతికి ఇచ్చింది. వైష్ణవి మాములుగానే తీసుకుంది. అంతకు ముందు శాంతమ్మ గారిని తీవ్రంగా ప్రశ్నించిన స్త్రీ మళ్ళీ వచ్చి వైష్ణవిని చేతితో వారిస్తూ.. "అలా ఆమె చేతిలో నుండి ఆ వస్తువులని ఎప్పుడూ తీసుకోకండి. శని దోష నివారణ కోసం ఇస్తూ ఉంటారు అని .. ఇదిగోండి మామ్మగారు మీకు ఇందాక చెప్పాను అయినా మళ్ళీ మీరు ఆమె చేతికి అవే వస్తువులని మళ్ళీ ఇచ్చారు. మనం మాత్రమే బాగుండాలని అనుకోవడం కాదండీ ఇతరులూ బాగుండాలి అనుకునేవాళ్లు ఎప్పటికీ మీలా చెయ్యరు. అంత వయసు రాగానే సరికాదు, అన్ని తీర్ధయాత్రలు చేసాను అని చెప్పుకుంటే సరికాదు. మంచి అన్నది మనం చేసే పనుల్లో ఉండాలి. అందరూ ఎవరి విశ్వాసం కొద్దీ వాళ్ళు గుడికి వస్తూ ఉంటారు,పూజలు,అభిషేకాలు చేయించుకుంటారు తప్ప మనం మన రాతలని దోషాలని ఇంకొకళ్ళకి అంటించాలని చూడరు. ఇది మీకు మంచిది కాదు" అని దులిపేసింది.

"అంత పెద్ద పెద్ద మాటలెందుకు పోనీ లెండి, నాకు ఏమీ తెలియదు కాబట్టి సహాయం చేస్తున్నాననుకుని ఆమె చెప్పేవన్నీ గుడ్డిగా చేసాను. ఆమెకి తెలిసి చేసింది అంటే .. ఆ పాపం ఆమెకే ! పైన భగవంతుడున్నాడు ఆయనే చూసుకుంటాడు అవన్నీ ! అంటూ దీపం వెలిగించి వచ్చింది.

శాంతమ్మ గారు వైష్ణవి చేయి పట్టుకుని "అమ్మా ! పెద్దమనసు చేసుకుని నన్ను క్షమించమ్మా ! ఇక ఎప్పుడూ అలా చేయను. పుత్ర ప్రేమతో .. గుడ్డిదాన్నై ఏదో బిడ్డకి దుష్ట గ్రహాలూ పట్టి పీడిస్తున్నాయి నివారణ కోసం అలా చేయమంటే చేస్తున్నాను తప్ప ఎవరికీ కీడు కలగాలని కాదు. నన్ను నమ్మమ్మా" ..అంటూ పమిట చెంగుతో కళ్ళు తుడుచుకుంది

"అయ్యో ..అలా అనకండి మామ్మ గారూ .. ఈ లోపం అంతా మీలో లేదు, మీలాంటి నాలాంటి ఎందరికో పండితులు పుర్రెలకి అంటించిన జాడ్యం ఇది. దేవుడు అన్నిచోట్లా ఉన్నాడనుకుంటూనే నిత్య జీవితంలో కలిగే అశాంతులని తగ్గించుకోవడానికి,మానసిక నిబ్బరం పెంచుకోవడానికి ప్రశాంతత కోసం గుడికి వస్తాం తప్ప మన బాధలని ఇంకొకరి బదిలీ చేద్దామని కాదు. మనం చేతితో ఇచ్చినంత మాత్రాన ఇంకొకరు పుచ్చుకున్నంత మాత్రాన అన్ని బాధలు సమసిపోతాయనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. మంచిని ఇతరులకి పంచడమే వితరణ. నేనూ మీలో మంచినే చూసాను. ఎవరిది పాపమో పుణ్యమో నాకు తెలియదు. మీరే అంటారుగా పాపం,పుణ్యం అన్నీ ఎవరి ఖాతాలో వేయాలో భగవంతుడికి తెలుసు. మనం కేవలం నిమిత్త మాత్రులమి మాత్రమే అని అంది వైష్ణవి.

"చిన్నదానివైనా భగవత్తత్వాన్ని వొంటపట్టించుకున్నావ్. చల్లగా ఉండమ్మా" ..అంటూ మనఃస్పూర్తిగా దీవించింది శాంతమ్మ.



27, అక్టోబర్ 2017, శుక్రవారం

మరుగేల మబ్బు ముసుగేల

నాకిష్టమైనపాట


ముగ్గురి హృదయాల సున్నితమైన  అలజడి అద్భుతమైన బాణి  సుతిమెత్తగా కోసేస్తుంది. ప్రతిరోజూ విన్నా .. విసుగువేయని పాట. "అల్లుడు గారొచ్చారు " చిత్రంలో "హరిహరన్ " పాడినపాట. ఇదే చిత్రంలో .. రంగు రంగురెక్కల సీతాకోక చిలుక పాట కీరవాణి కూడా చాలా బాగుంటుంది. 


పాట సాహిత్యం :


మరుగేల మబ్బు ముసుగేల

ఓ చందమామా ఓ చందమామా

మనసున మల్లెలు విరిసిన వేళ

మమతల పల్లవి పలికిన వేళ

మౌనమే మోహన రాగమయే వేళ

మరుగేల మబ్బు ముసుగేల

ఓ చందమా..మా ఓ చందమా..మా


కాంచన కాంతుల కాంచన బాట కనపడలేదా

కొమ్మన కూసిన కోయిల పాట వినపడలేదా

ఉలి తాకిన శిల మాదిరి ఉలికులికి పడుతోంది ఎదలో సడి

చలి చాటున మరుమల్లెకి మారాకు పుడుతోందో ఏమో మరి

చెంతకు చేరే సుముహుర్తాన ఆశలు తీరే ఆనందాన

మౌనమే మోహన రాగమయే వేళ


మరుగేల మబ్బు ముసుగేల



మాటకు అందని ఊసులు లేవా చూపులలోనా

చూపులు చేరని సీమలు లేవా ఊహలలోనా

కనుచూపులో చిగురాశలు బరువైన రెప్పల్లో బంధించకు

మది వీధిలో స్వప్నాలకి సంకెళ్ళు వేసేటి జంకెందుకు

ఊయలలూపే మృదుభావాలు ఊపిరి తీగను మీటే వేళ

మౌనమే మోహన రాగమయే వేళ

మరుగేల మబ్బు ముసుగేల

మరుగేల మబ్బు ముసుగేల


మనం చూసే వీడియో పాటకి వినే ఆడియో పాటకి తేడా ఉంటుంది . 

చరణాలు అటుదిటు  మారిపోయి ఉంటాయి.


ఈ పాటకు మా నాన్న గారి అవార్డ్ లభించింది అని కీరవాణి గారు "స్వరాభిషేకం " కార్యక్రమంలో చెప్పారు . శ్రోతలకు వీనులువిందు చేసినపాట  కీరవాణి గళంలో కూడా వినడం బాగుంటుంది. మరకతమణి కీరవాణి గారి స్వరకల్పన అంటే నాకు చాలా ఇష్టం . ఏ పాటకు ఆ పాటే బాగుంటుంది. కొన్ని నాసిరకం పాటలు పాటలు కూడా ఉన్నాయేమో .. ఆ పాటలను వెదికి వినడం నాకు సరదానే కానీ .. పాటలన్నింటిలో 90% సాహిత్యపరంగా సంగీతపరంగా ఆకట్టుకున్నవే !

ఆ పాటలన్నింటిలోనూ నాకు చాలా ఇష్టమైన పాట యిది.






10, అక్టోబర్ 2017, మంగళవారం

మెత్తని వొడి


మన తెలంగాణ "హరివిల్లు"  08/10/2017 లో నేను వ్రాసిన కథ "మెత్తని వొడి" చదవండి మరి.

అత్త వొడి పువ్వువలె మెత్తనమ్మా .. ఆదమరిచి హాయిగా ఆడుకోమ్మా ! ఆడుకుని ఆడుకుని అలసిపోతివా ? ఎఫ్ ఎమ్ లో  నాకెంతో పాట వస్తుంది. దుఃఖం ముంచుకొచ్చిందిఇక నన్నెవరు చూస్తారని  దుఃఖ  పడుతున్న సమయంలో కూడా తన దుఃఖాన్ని మరిచి తన కొడుకుతో పాటు ఆమెని ఓదార్చింది తను కాదు. నిన్ను చూసుకోవడానికి నేను లేనూ ..ఏడవకు అని. ఇప్పుడన్నీ నెపాలు తనపై వేసి అందరి మధ్య తననే దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎంతైనా ఆమె అత్త కదా ! ఎంత బాగా చూసుకోవాలనుకున్నా ఆమె అమ్మ కాలేదు కదా
 మా అత్తగారికి నాకు అసలీమధ్య పొసగడం లేదుఆమె కూడా తల్లిలాంటిది అని గర్వంగా చెప్పుకునే నేను ఇలా చెప్పడంకూడా సిగ్గు కల్గిస్తుంది. కోడలినైన నా పై ఆమెకి అకారణ ద్వేషం మొదలైంది కొన్నేళ్ళుగా  ! ఆమె అనుభవించిన సౌకర్యవంతమైన జీవితంకన్నా పై మెరుగు జీవితంలో ఉన్నానని ఆమె ఈర్ష్యకి కూడా అసలు కారణం కావచ్చుమా మామగారు చనిపోయాక ముగ్గురు కొడుకులు ఎవరింట్లో ఉండమన్నా ఉండదు. పోనీలే ఆమెకి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండటం ఇష్టం. ఓపిక ఉన్నన్నాళ్ళు ఉంటుందిలే అని ఊరుకుంటాము కాస్త అనారోగ్యంగా ఉంటే చాలు కొడుకులని వదిలేసి మేనమామ కూతురిని, పిన్ని కొడుకుని పిలిపిచ్చుకుని వాళ్ళని హాస్పిటల్ కి తీసుకు వెళ్ళమని అడుగుతుంది. మేమున్నాం కదా .. కొడుకులని కోడళ్ళని వదిలేసి మమ్మల్ని అడుగుతుంది ఏమిటని వాళ్ళు అనుకుంటారు అలా చేయకండి అంటే మా మాటలు విననట్టే ఉంటుంది. ఆరోగ్యం పట్ల అనేక జాగ్రత్తలు మంచిదే కానీ లేని రోగాలు ఉన్నాయని ఊహించుకుని అందరి స్పెషలిస్ట్ ల చుట్టూ తిప్పిన తర్వాత కానీ ఆమె ఆరోగ్యం బాగుందన్న నమ్మకం చిక్కేది  కాదుఅన్ని విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటుంది కానీ సమయానికి భోజనం చేయదు. ఏమైనా అంటే నన్నెవరు చూడనవసరంలేదు, వృద్దాశ్రమాలున్నాయి అక్కడికి వెళ్ళిపోతాను అని ప్రక్క వాళ్ళతో చెపుతూ ఉంటుంది. ఆమెని ఒంటరిగా వదిలేసి ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా వీలవని పరిస్థితి. మీ ఇంట్లో ఉండటానికి నాకు భయం అంటుంది. ఎవరూ ఎక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఆమె మాత్రం ఉత్తర,దక్షిణ,పడమటి  తీర్ధ యాత్రలు చేసి వచ్చిందికొడుకుల దగ్గర  రిమోట్ తీసుకుని మరీ అన్నిఛానల్స్ లన్నింటిలోనూ  వచ్చే  సీరియల్స్ ఏమాత్రం మిస్ కాకుండా మార్చి మార్చి  చూస్తుంది. ఆమెకి ఇష్టమైతే ఎక్కడికైనా రెడీ అయిపోతుంది. మేము వెళదామనుకున్న చోటుకి రమ్మంటే ..అబ్బే నా ఆరోగ్యం బాగాలేదు,నేను రాను మీరు వెళ్ళిరండి అంటుంది అదెంత ముఖ్యమైన బంధువుల ఇంట్లో జరిగే వేడుకైనా సరే ! అమెరికాలో ఉన్న మనుమడికి ఫోన్ చేసి ఐపాడ్ అడిగి తెప్పించుకుంది. దానిని ఉపయోగించటం నేర్చుకుని యూ ట్యూబ్ లో పాత సినిమాలు చూస్తూ ఉంటుంది
అసలు ఆమెకి నాకు ఒక జనరేషన్ తేడా ఉంది. అయినా నాతో ఆమె పోటీ పడాలని చూస్తుంది.   ఇక  ఇంటెడు చాకిరినీ,  ఎదుర్కొన్న అనేక కష్ట నష్టాలని కూడా  గడ్డిపరకని చేసేస్తుంది అత్తగారు.  ఎన్ని తప్పులు చేసినా కొడుకులని సమర్దిస్తూనే ఉంటుంది. కోడళ్ళ పై దృతరాష్ట్ర ప్రేమని ప్రదర్శిస్తూ ఉంటుంది.   తల్లిదండ్రులు ఉచితంగా కని పారేసి అరణంగా ఆడపిల్ల బతుకునే  రాసిచ్చినట్లు  పుస్తకమూ చదవనీయక ప్రపంచ జ్ఞానం చెంత సేదదీరనీయక మనసుకి వెసులుబాటు లేక నాలుగు గోడల మధ్య  బందీని చేసిన తీరుని బాహాటంగానే నిరసిస్తూ ఉంటానే కానీ చొరవచేసి నా ఆనందం కోసం ఏ మాత్రం చొరవజేసి గడప దాటటానికి సాహసం చేయని  నేనుఈడేరని బాధల మధ్య రక్కసి గాయాల రసి కారుస్తున్నప్పుడు ఉండే బాధని మౌనంగా భరిస్తూనే ఉంటాను. ఆ మాత్రం నిభాయించుకోకపోతే యెట్లా అనుకుంటూ సర్దుకుపోవడం అలవాటైపోయింది  కూడా ! పైగా  వృద్దాప్యాన్ని అర్ధం చేసుకోవడం ఎలా అనే పుస్తకాలు అనేక ఆర్టికల్స్ చదువుతూ ఉంటాను.సానుభూతితో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాను. సరిక్రొత్త చీరలు ధరించడం,ప్రయాణాలు చేయడం, బంధువుల మధ్య ఆమెని ఆమె కొడుకులని గొప్పగా వర్ణించుకోవడం అంటే భలే సరదా ఆమెకి. వెనుక వినబడే వ్యాఖ్యానాలు వింటూ ఉంటాం కాబట్టి అలా ఉండొద్దు అని చెపితే కూడా అర్ధం చేసుకోవడమూ కష్టమే ! నేను లేనప్పుడు ఎవరొచ్చినా నాపై చాడీలు చెప్పడం అలవాటైపోయింది కూడా !
 ఆమెకి అనారోగ్యంగా ఉన్నప్పుడు మా ఇంట్లోనే ఉంటారు. ఆమెకి  నాకూ  అస్తమానూ పంచుకునే విషయాలేం  ఉంటాయి ఒకవేళ ఉన్నా వంట సంబందిత విషయాలు, చుట్టపక్కాల కబుర్లు తప్పకాలక్షేపం కోసం ఒకరిపై ఒకరు చెప్పుకునే చాడీలు నాకసలు అలవాటు లేదు.   పుస్తకాలు చదవడమో, ఫేస్ బుక్ చూడటమో, చిన్న చిత్రాలు చూడటమో నాకున్న వ్యాపకం. లేదా  ఫ్రెండ్స్ తో మాట్లాడటం నాకిష్టం. వాళ్ళతో సమానంగా ఆమెతో మాట్లాడే విషయాలు ఏముంటాయంటే  ఒప్పుకోదు. ఆరోగ్యం సమకూరినాక తనింటికి వెళ్ళిపోయి పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించినా  నోరిప్పి మాట్లాడకపోతే ఎలా ఉంటాను అని చెపుతూ ఉంటుంది.  
 వృద్ధులకి పిల్లలతో పాటు ఆస్థిలో సమభాగం తీసుకోవడం కూడా సబబు కాదనిపిస్తూ ఉంటుంది నాకు. శారీరక దుర్భలత్వం వచ్చేసినా సరే తగని అహంతో నాకేం తక్కువ ..ఏంటి నన్ను వాళ్ళు చూసేది అన్నట్టు ఉంటుంది వారి ప్రవర్తన. ఆమె వయసుకి ఏ గుడికో వెళ్ళడం,ఆమె వయసు ఉన్నవారితో కాలక్షేపం చేయడం అలవాటు చేసుకోవాలి కానీ .. కోడళ్ళు వెళ్ళిన చోటుకల్లా ఆమెని తీసుకువెళ్ళడం సబబుగా ఉండదని అర్ధం చేసుకోదు. పెద్దవయసు వచ్చినాక మనం ఏం చెపితే అది చేయాలి చేయక ఏం చేస్తారు అన్న పెంకితనం, తమ మాటే వినితీరాలనే పట్టుదల పెంచుకుంటే ఎవరేం చేయగలరుప్రస్తుతం ఆమె వయసు డెబ్బై ఎనిమిదేళ్ళు. ఎవరికైనా చెప్పేటప్పుడు ఓ పదేళ్ళు తగ్గించి చెపుతూ ఉంటుంది ఆమె పెద్ద కొడుకుకి కూడా అరవై ఏళ్ళు దాటిపోయాయి. కోడళ్ళ వయసుని మాత్రం ఓ పదేళ్ళు ఎక్కువ లేక్కేసుకుని అన్నేళ్ళు ఉండవు నీకు అంటుంది. అలా అడిగినప్పుడల్లా వొళ్ళుమండిపోతుంది నాకు
నేనూ కొత్తపాత్ర లో  అదీ అత్త గారి హోదాలో మారినాక  కూడా నాపై పెత్తనం చేయాలని చూస్తున్న మా అత్తగారిని అర్ధం చేసుకోవడం కష్టమేమీ కాలేదు. నాకూ ఆమెకి ఎంత తేడా ! అని బేరీజు వేసుకోకుండా ఉండలేకపోతున్నాను.
 అన్నింటికన్నా ముఖ్యంగా  ఆమె ప్రవర్తించిన  తీరుకి నా మనసు  విరిగిపోయింది. భర్త చనిపోయిన కోడలి దగ్గర తోడుగా ఉండాల్సిన ఆమె కోడలిని  నిర్దాక్షిణ్యంగా ఒంటరిగా వదిలేసి  తన ఇంటికి వెళ్ళిపోయిన ఆమెలో తల్లి మనసు ఉందని ఎలా నమ్మమంటారు ? నాదగ్గర ఉండి  ఉంటే ఒకరికొకరు తోడుగా ఉండే వారిమి కాదా ? కిలోమీటర్ దూరం లోపులోనే ఉన్నాసరే నెలరోజుల తర్వాత  గానీ ఇంకో పని పడిన రోజున గానీ ఈ  ఇంటికి రాని ఆమెలో   అమ్మని చూసుకోవడం సాధ్యమేనా ? అదే నా కన్నతల్లైతే  అలాంటి స్థితిలో అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళగలదా ?
నేనిప్పుడు  పసి పాపనేం కాదు అలాగే  ఆమెలో మాతృత్వం గిడసబారిపోయిందని నేననుకోవడంలేదు. ఆమెని పసి పాపలా చూసుకోవాల్సిన రోజు నాముందు ఉంటుందేమో ..ఎవరు చెప్పొచ్చారు చెప్పండిఅసలీ కోడళ్ళకి అత్తగారిని ఆడిపోసుకోవడమే పని. మళ్ళీ కథలు కూడా చెపుతున్నారని అనుకోకండి.   ఇలా  చెప్పడంలో కూడా ఆమెపై ద్వేషం యేమాత్రం లేదని మీరు అర్ధం చేసుకుంటే చాలు. లోకంలో ఆమెలాంటి వారుంటే కాస్త కోడళ్ళని అర్ధం చేసుకుంటారని నా ఆశ కూడా !

ఆఖరిగా ఒకమాట .. మెత్తని ఒడి ఒకటి ఉంటుందని ఆడపిల్లలకి చెపుతూనే ఉండాలి. ఎందుకంటే వారు ఎప్పుడూ  పాపలు అమ్మలు అత్తలు కూడా కదా


2, అక్టోబర్ 2017, సోమవారం

హీరోయిజం








ఒక రోజు ..
అభిమాన నటుడి వెనుక నీడగా, చెంచాల్లాగా మారితే ఏం వస్తుంది? డబ్బా కొట్టుకోవడం తప్ప.
మన రోల్ మోడల్ మనకి గుండెల్లో ఉండాలి. మనకి ప్రతిపనిలో స్పూర్తి కల్గించాలి
ఎవరినో గుడ్డిగా అనుసరించడం అంటే మఱ్ఱి చెట్టు క్రింద మొక్కలా మారిపోవడమే ! ఎవరి అస్తిత్వం వారు కాపాడుకోవాలి ..అదే అసలు గుర్తింపు ..అని చెప్పాను నాకొడుక్కి.
NTR, NBK, JrNTR ల మత్తులో నుండి బయటపడ్డాడు. తన పరిధిలో తనొక హీరో ఇప్పుడు.

ఇంకో రోజు ..
గాంధీ మహాత్ముడంటే అసలు వొప్పుకోను. నీకు తెలియదు వూర్కో .. అమ్మా ..అంటాడు.
గాంధీ ఆచరించిన వ్రతం అహింస మార్గం ప్రపంచం మొతానికే ఆదర్శం .. అందుకే ఆయనే నా హీరో అన్నాను.
ఉత్తర కొరియా అణుపరీక్షలతో ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్నరోజులివి.
గాంధీ అహింసా మార్గం విలువ తెలుసుకోవాల్సిన రోజులు కూడా ఇవే ... ఈ రోజే కాదు ..ఎప్పటికీ ఎప్పటికీ ..కూడా !

మైల్లవరపు గోపి గారు వ్రాసిన సినీ సాహిత్యం చూడండి ..ఎంత ఆర్ద్రత నిండి ఉంటుందో .. గాంధీ పుట్టినదేశం చిత్రంలో పాట యిది

గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం ఈశ్వర అల్లా తేరేనాం సబకోసన్మతి దే భగవాన్
భేదాలన్నీ మరచి మోసం ద్వేషంవిడచి మనిషి మనిషిగా బ్రతకాలి ఏనాడూ నీతికి నిలవాలిః బాపూ ఈ కమ్మని వరమే మాకివ్వు అవినీతిని గెలిచే బలమివ్వు
ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం బానిసభావం విడనాడి ఏజాతి నిలుచునో అది జాతి బాపూ నీ చల్లని దీవెన మాకివ్వు నీ బాటను నడిచే బలమివ్వు --