26, అక్టోబర్ 2015, సోమవారం

రెక్కల చూపు

ఇటీవల  "రెక్కల చూపు " కథల సంపుటి చదవడం జరిగింది . అందులో అన్ని కథలు బాగున్నాయి సాదా సీదా వచనంతో  ఆసక్తిగా పఠకులని అక్షరాల వెంట పరుగులు తీయించగల రచయిత్రి  శీలా సుభద్ర గారు , ఈ కథలన్నీ వివిధ పత్రికలలో ప్రచురించిన మరియు పోటీలలో బహుమతి పొందిన కథలే !

మన చూపుకి అందినంతవరకు కొంత స్పష్టంగానూ మరి కొంత అస్పష్టంగానూ  చూస్తూ ఉంటాం . రెక్కల చూపు .. ఈ పదం వినగానే ఏదో అర్ధం అయి కానీ భావన . చూపులకి రెక్కలు వస్తే .. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లి ఏది చూడాలనుకుంటే అది చూసి రావచ్చు . అలా చూపులకి రెక్కలు లేవు  కాబట్టే మనకి నిరీక్షణ. కొన్ని కథలని వివరంగానూ కొన్ని కథలని సూచనా ప్రాయంగాను పరిచయం చేస్తున్నాను .

ముఖ్యంగా మార్పు వెనుక మనిషి కథ చదివి మన జీవితాల్లో వస్తున్న మార్పుకి అనుగుణంగా మనం కూడా సర్దుకుపోవాల్సి ఉందని ఈ కథ చెపుతుంది. చక్కటి కథ . శ్రీ లక్ష్మి గారి కొడుకు రాజుకోడలు రమణీ   విదేశాలలో ఉంటాడు. ఆమెకి కొడుకు కూతురు పింకీని ప్రేమగా హత్తుకోవాలని చిట్టి పొట్టి కబుర్లు చెప్పుకోవాలని ఆరాటం .  రాజు నాలుగైదేళ్ళ  తర్వాత మాతృదేశం వచ్చి ఇక్కడ వాతావరణంలో ఇమడలేక మంచి నీళ్ళు కూడా కొనుక్కుని తాగుతూ  నాలుగురోజులైనా ఉండకుండా తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు తల్లి ఇచ్చిన స్వీట్స్ జంతికలు కూడా లగేజ్ ఎక్కువైందని వదిలేసి వెళ్ళిపోతాడు . పుట్టినప్పటి నుండి ఇక్కడ పెరిగిన వాడే కదా ! అంతలోనే విదేశాల అలవాటుతో ఇక్కడ ఉండలేనని వెళ్ళాడు అని శ్రీ లక్ష్మి తలచుకుని బాధపడుతుంది . కొన్నాళ్ళకి ఆమె పుట్టి పెరిగిన ఊరు కొనసీమకి  భర్త తో సహా వెళుతుంది. నగర జీవనానికి అలవాటైన వాళ్ళు అక్కడ బురదతో నిండిన నేలలో నడుస్తూ చిరాకు పడుతూ   కరంటు లేక  దోమకాటు ని భరిస్తూ వారం రోజులు ఉందామని వెళ్ళిన వాళ్ళు ఒక్క రోజుకే తిరిగి ప్రయాణ మవుతూ మార్పు వెనుక మనిషి పరిగెత్తాల్సిందే అనుకుంటారు . సౌకర్యానికి అలవాటు పడిన మనుషులు వేరొక చోట జీ వనానికి అలవాటైన మనషులు కొన్నేళ్ళ తర్వాత తిరిగి వచ్చినప్పుడు అతిధులై ఆ వాతావరణంలో ఇమడలేక ఇబ్బంది పడుతూ సొంత గూటికి చేరుకోవాలనుకోవడం మార్పు వెనుక మనిషి పరుగులు తీయడం తప్పదని ఈ కథ చెప్పింది .

కంచె కథ ..  ఈ కాలానికి అవసరమైన కథ. తల్లి బిడ్డని అన్ని వేళలా కంచె అయి కాపాడుకోవాలని చెప్పిన కథ  . చిన్నప్పుడే ఇంటి ప్రక్కతనిని ప్రేమించి పెళ్లి చేసుకుని బస్తీ కి వచ్చేసిన నాగమణి  వాళ్ళమ్మ నోరుగల మనిషి . ముగ్గురు పిల్లలని స్కూల్లో జేర్పించి పైసా ఫీజ్ కూడా కట్టకుండా  సంవత్సరాలు గడిపేస్తూ ఉంటుంది . దయతలచి పరీక్ష ఫీజ్ కూడా ఎవరో ఒకరు కట్టేస్తూ ఉంటారు .  ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమెని వదిలేసి వేరొక స్త్రీ తో ఉంటూ  కుటుంబాన్ని గాలికి ఒదిలేసినా నాలుగిల్లల్లో పని చేసుకుంటా పిల్లలని పెంచుకునే ఒంటరి తల్లి ఆమె . నాగ మణి ఎనిమదవ తరగతి చదువుతూ ఉండాగానే అబ్బాయిలతో స్నేహం చేస్తూ వాళ్ళతోపాటు స్కూల్  టెర్రస్ మీద  టీచర్లకి దొరికిపోతుంది . తల్లిని పిలిపించి బిడ్డని జాగ్రత్తగా పెంచుకోమని చెపుతారు టీచర్లు .  ఆ మాట విన్న నాగమణి తల్లి ఆవేశంతో ఆ పిల్లని కొట్టబోతుంది. మర్నాటి నుండి తనే స్వయంగా స్కూల్ దగ్గర ఒదిలిపెట్టి   మళ్ళీ స్కూల్ వదిలే సమయానికి వచ్చి వెంట తీసుకుని పోతూ .. బిడ్డ ఏ ప్రేమ ఆకర్షణ వలలో చిక్కకుండా ఏ తోడేళ్ళ బారిన పడకుండా కాపాడుకుంటుంది. రచయి త్రి ఈ కథని బాగా వ్రాసారు . కథ మన కళ్ళ ముందు దృశ్య రూపంలో కదిలిపోతుంది.

ఇంకో కథ గోవు మాలచ్చిమి. సరోగ్రసీ మదర్ గా అవతారమెత్తిన పేద మహిళ కథ  నవ మోసాలు మోసి తనది కాని తన బిడ్డని అమ్ముకునే తల్లి  యొక్క మనోభావాలని సున్నితంగా సృశించిన ఈ కథలో వెంకటలక్ష్మి నారాయణ  భార్యాభర్తలు ఉన్న అరెకరం పోలమమ్మి గల్ఫ్ దారిన పట్టిన నారాయణ  వెళ్ళిన కొన్నాళ్ళకే   చావు తప్పి కన్ను లోట్ట బోయి నట్లు  గోడకి కొట్టిన బంతిలా తిరిగి వచ్చేస్తాడు. చేసిన అప్పులు , చేయడానికి పనిలేకపోవడం ,ఆటో అద్దెకి తీసుకుని నడపడం ద్వారా వచ్చే డబ్బు ఆ ఆటో అద్దెకి సరిపోవడంతో  పిల్లలు కూడా పస్తులున్దాల్సి రావడంతో దగ్గర బంధువు మల్లేష్ చెప్పిన మాటలు విని భార్య గర్భం ని కూడా తొమ్మిది నెలలు పాటు అద్దె కి ఇచ్చే పని కి ఒప్పిస్తాడు . తొమ్మిది నెలలు మోసి పండంటి బిడ్డని కనీ  డబ్బిచ్చిన వారి చేతిలో పెడుతుంది ..దానితొ వారి ఆర్ధిక బాధలు తీరిపోతాయి . వెంకట లక్ష్మికి ఉపాధి దొరుకుతుంది .  కానీ డబ్బాశ తో మరొక  మారు ఆమెని  బిడ్డని కనీ ఇమ్మనడానికి  భర్త సమాయతం  చేస్తుంటే ... ఆమె ముందుకు కదలక కాళ్ళు దిమ్మ కట్టి పోయినట్లు అక్కడే పాతే సినట్లు నిలబడుతుంది కట్టు కొయ్యకి కట్టేసిన ఆవు దాని చుట్టూ బాధగా తిరుగుతూ ఉంటుంది . ప్రతి ప్రసవం మనిషికి పునర్జన్మ లాంటిది పుట్టబోతున్న బిడ్డపై ప్రేమతో తల్లి వాంతులని  వికారాలని భరిస్తూ తొమ్మిది నెలలు మోసి పురిటినొప్పులు భరించి బిడ్డని కంటుంది .  ఎవరో డబ్బు విదిల్చేసి పేగు బంధాన్ని తెంచేసి ఆ బిడ్డని లాక్కేలుతుంటే ఏమీ కానిదానిలా చూస్తూ ఉండటం మాత్రు హృదయం భరిచడం ఎంత కష్టమో స్త్రీకి మాత్రమే   తెలుసు . అందుకే కట్టు కొయ్య చుట్టూ తిరిగే గోవు మాలచ్చిమి తో వెంకట లక్ష్మిని పోల్చి మూగ వేదనని మన కళ్ళకి చూపించారు .  

ఈ కథల సంపుటిలో టైటిల్ కథ రెక్కల చూపు . చాలా దుఃఖ పెడ్తుంది కథ .  సావిత్రి భర్త యాదగిరి రిక్షా త్రొక్కుతూ ఉంటాడు. సావిత్రికి మేనమావ అవుతాడు . ఇంకో సంతానం లేని  సావిత్రి తల్లి కూడా వారి దగ్గరే ఉండేది ఒక రోజు సినిమాకని వెళ్లి   జరిగిన యాక్సిడెంట్ లో సావిత్రి భర్త కూతురు చంద్రకళ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోతారు . దెబ్బలు తగిలి కొన్నాళ్ళు మంచం లో ఉండి  సావిత్రి తల్లి చనిపోతుంది . చంద్రకళ కాకుండా సావిత్రికి ఇంకో ఇద్దరు కొడుకులు ఉంటారు . వేంకటేశు ,శ్రీనివాసు . సావిత్రి బీడిలు చుట్టుకుంటూ వచ్చే ఆదాయంతో ఇండ్లలో పని చేస్తూనూ పిల్లలిద్దరిని పోషిచుకుంటూ గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ ఉంటుంది వారికి స్కాలర్ షిప్ కూడా రావడంతో ఇబ్బందేమీ లేకుండానే జరిగిపోతుంది . వేంకటేశు తెలివికలవాడు పదవతరగతి వరకు చదువుకుని సిమెంట్ ప్యాక్టరీలో పనికి వెళ్ళే వాడు . కొన్నాళ్ళ తర్వాత పనికి వెళ్ళడం మానేసి ఏవేవో పుస్తకాలు చదువుతూ ఉండేవాడు . అప్పుడప్పుడు కొన్ని రోజులపాటు ఇంటికి రాకుండా కూడా ఉండేవాడు . ఒకసారి అలా వెళ్ళినవేంకటేశు  ఇక ఇంటికి తిరిగి రాదు .  అందరూ సినిమాల పిచ్చితో ఏ బొంబాయి కో  వెళ్ళాడని అనుకుంటారు  కొన్నాళ్ళకి ఒక ఉత్తరం వస్తుంది . అది చదువుకుని తల్లి సావిత్రి కన్నీరు మున్నీరు అవుతూ ఉంటుంది . ఆ ఉత్తరాన్ని చిన్న కొడుకుకి తెలియకుండా చూరులో దాసీ ఎవరు లేనప్పుడు  కొడుకు వ్రాసిన ఉత్తరం తీసి  చదువుకుంటూ  ఉంటుంది . ప్రతి రోజు కొడుకు వస్తాడనిఎదురు  చూస్తూ ఉంటుంది , ఆ ఉత్తరం కూడా వానకి తడిసి అక్షరాలూ మసక బారినా అలాగే ప్లాసిక్ కాగితంలో చుట్టి దాచుకుంటుంది . శ్రీనివాస్ పదవ తరగతి పాసై ఆ ఊర్లోనే కరంట్ పనికి వెళుతూ ఉంటాడు . మధ్యలో ఆతను కూడా ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటాడు , తల్లి ఆ పుస్తకాలు చదవడం చూసి తొట్రు పడతాడు . పరీక్షలు అయినాక పుస్తకాలు చదవడం ఏమిటంటే జగ్గన్న ఇచ్చాడని చెపుతాడు  జగ్గన్న అంటే వేంకటేశు దోస్త్ కదా ! ఏం  చెప్పిండు అని అడుగుతుంది . తొందరలోనే అన్న వస్తాడని చెప్పాడని చెపుతాడు. కానీ వెంకటేసుకి బదులు అర్ధరాత్రి వేళ  పోలీసులు  వస్తారు . భయంతో తలుపు  కాదు కదా కిటికీ తలుపు కూడా తీయనివ్వదు సావిత్రి . తెల్లవార్లు భయంతో వణికిపోతూ సూర్యోదయంకి తలుపులు తీస్తారు . ఇంటి వెనుకప్రక్క ఒక గొనె సంచీని చూస్తారు అందులో రక్త సిక్తమైన వెంకటేష్ బట్టలు పెన్ , డైరీ ఇవి కనబడతాయి . జరిగింది అర్ధమై సావిత్రి కూలబడిపోతుంది . ఆమె చూపు చివర వేంకటేశు శ్రీనివాసు లాంటి ఎందఱో కనబడతారు .  ఈ కథ చదివాక మరే కథ చదవలేము. దుఃఖంతో హృదయం భారమవుతుంది.  పేద కుటుంబాల లోని పిల్లలు ఎంతో  కొంత చదువుకుని కుటుంబానికి ఆధారం కాకుండా  విప్లవ సాహిత్యం చదివి పోరు బాట పట్టి అకాల మరణం పాలవుతున్న తీరుని ఎంతో  హృద్యంగా, నర్మ గర్భంగా  చెప్పారీ కథలో.

విద్యల వ్యాపారాన్ని విద్యని కొనుకునే వారి గురించి ఆలోచింపజేసే విధంగా చెప్పిన కథ అంగడి . స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళ యినా పేదవారికి చదువు అందని ద్రాక్ష ఎందుకవుతుందో చెప్పే కథ . వెనుకబడిన కులాలు తరగతుల వారికి పాఠశాలలో ఉచిత విద్య లభిస్తుందని చెప్పేదెవరు ? వారికి తెలిసేది ఎలా అని దిగులు పడతారు . పేదవాడి రిజర్వేషన్స్ మీద పడి  ఏడిచే అగ్ర కులాలవారికి సరైన్న మార్కులు రాకపోయినా ఇంజినీరింగ్ సీట్ కొనుక్కోగల స్తోమత  ప్రవల్లిక లాంటి కుటుంబీకులకి ఉంటుంది కానీ చంద్రిక లాంటి పిల్లలు బాగా చదువుతున్నా కాలేజీ  మెట్లు ఎక్కే పరిస్థితులు లేని వారి ఆర్ధిక స్థితిగతులు ఎప్పటి మారవు చదువు అంగటి సరుకే అని చక్కగా చెప్పారు రచయిత్రి.

వందేమాతరం పాట  సరిగా పాడకపోతే గాంధీ తాతకి కోపం వస్తుంది కదు  నాన్నా ! అప్పుడేమో ఇంగ్లీష్ వాళ్ళతో యుద్ధం చేయలేక  ఓడిపోతే మనం మళ్ళీ వాళ్ళ క్రిందే పని చేయాల్సి వస్తుంది . అందుకే పాట  చక్కగా పాడాలని మాస్టారు  అన్నారు అవునా నాన్నా ! అని  అమాయకంగా ప్రశ్నించినప్పుడు తన మాటలకి మురిసి పోయి గుండెలకి హత్తుకుని తన బుగ్గల మీద ప్రేమగా ముద్దెట్టుకున్నాడు తండ్రి . ఆనాడు అమాయకంగా అడిగిన మాటలు ఇప్పుడు గుర్తొచ్చిన పరమేశానికి చేతికి తడిగా తగిలింది చెంప .  ఇలా ముగుస్తుంది కథ .   స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశకాలు దాటాయో లేదో  మళ్ళీ మనం విదేశీ వ్యాపారుల కబంధ హస్తాలలో చిక్కుకుపోతున్నాం. మల్టీ నేషనల్ మార్కెట్ ట్రెండ్ మన చిన్న వ్యాపారస్తులని ఎలా నామ రూపాలు లేకుండా చేస్తున్నతీరుని ఆలోచింపజేస్తూ  వ్రాసిన కథ   ఆరోహణంలో అవరోహణం.   అందరూ తప్పక చదవాల్సిన కథ .
ఈ రెక్కల చూపు సంకలనంలో మొత్తం పద్దెనిమిది కథలున్నాయి . వస్తువు దృష్ట్యా అన్నీ మంచి కథలే ! ఏ కథకి ఆ కథ బావుంటుంది . కొన్ని సహానుభూతినీ కల్గిస్తే కొన్ని కథలు ఆలోచింపజేస్తాయి . సుభద్ర గారి చూపు చాలా విశాలమైంది . కనుకనే ఇప్పటి సామాజిక అంశాలన్నింటిని  కథలుగా మలిచారు .  చాలా కథలు ఆమె అనుభవంలో నుండి వచ్చినవిగా కూడా తోస్తుంది . సుభద్ర గారి రచనలలో స్త్రీల జీవితాల్లో తిష్ట వేసి ఉన్న వేదనని దానికి కారణమైన పురుష అహంకారాన్ని సున్నితంగా విమర్శిస్తూ సాగే ఒక స్త్రీ గొంతుక ఉంది . ఈ సంపుటిలో కథలన్నీ కూడా స్త్రీల జీవితాలలో ఉండే అసహాయత, అంతులేని వేదన కల్గి ఉన్నాయి .  కానీ విశేషం ఏమిటంటే  స్త్రీలు దుఖాన్నీ మోస్తూనే అవసరమైనప్పుడు ఆత్మ విశ్వాసంతో దైర్యంగా బ్రతికి తీరాలనే తపన కల్గి ఉంటాయి . 

చిరుజల్లు కథలో భార్యకి పుట్టబోయేది ఆడపిల్ల అని తెలుసుకున్న భర్త బిడ్డని వద్దనుకున్న ప్రయత్నంలో ఆమె శాశ్వతంగా తల్లి కాలేని పరిస్థితి కల్గినప్పడు శారీరక అనారోగ్యంతో పాటు మానసిక అనారోగ్యం కల్గి నాలుగు గోడలకి పరిమితమయ్యి భర్త నిర్ణయాన్ని కాదనగల్గే దైర్యం ఎందుకు లేకపోయిందో అని తనని ప్రశ్నించుకునే పాత్ర రజని , పెళ్ళికి ముందు ఎన్నో పుస్తకాలు చదువుతూ ఎన్నో విషయాలు చెపుతూ చర్చలలో  ఉత్సాహంగా  పాల్గొంటూ ఉండే లైబ్రేరియన్ జయంతి పెళ్లి తర్వాత  భర్త పిల్లలు నాలుగు గోడల మధ్య పరిమితమై  మేల్ ఇగో ని సంతృప్తి పరచలేక  పుస్తకాలని చదవడమనే ఇష్టాన్ని కొనసాగించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన స్త్రీ కథ , ఆడపిల్ల సంపాదనతో కుటుంబ అవసరాలని తీర్చుకుంటూ ఆమెకి పెళ్లి మాట తలపెట్టకుండా కుటుంబం కోసం అరగదీసే తల్లిదంద్రులున్నప్పుడు తనకేం కావాలో ఆలస్యంగా నయినా తెలుసుకునే మహాలక్ష్మి ఊరేళ్ళాలికథలో .కుటుంబాలని బట్టీ కాకుండా సంస్కారం,మంచితనంతో మనుషులని అంచనా వేస్తూ సుమతి స్నేహానికి విలువనిచ్చే రంజనీ పాత్ర ఉన్న కథ "నివురు" పిడికెడంత ప్రేమకోసం  ఆలంబన కోసం పెళ్ళైన వాడు అని తెలిసి కూడా తన హృదయంలో చోటిచ్చి జీవితంలో భాగమైనా తనకి తన పిల్లలకి కేమికాని పురుషుడుకి ఎంత మాత్రం చోటివ్వకూదనుకునే  సావిత్రి కథ "మూసిన తలుపులు"   ఆడవాళ్ళకి చదువులెందుకు ఉద్యోగాలెందుకు అని స్వార్ధంగా ఆలోచించడం  మగవాళ్ళకే కాదు  ఆడవాళ్ళకి ఉంటుందని తెలిపే కథ "మాయేంద్రజాలం " కథ  వీటన్నింటిలోనూ స్త్రీల గొంతుకే వినిపిస్తుంది . అలాగే మనుషుల్లో మానవత్వం ఇంకా ఉండే అన్నదానికి గుర్తుగా  రోడ్డు ప్రక్కన పడి ముసలమ్మ పట్ల   ముగ్గురు యువకులు చూపిన శ్రద్ద దయ "పరిమళించిన మొగ్గలు" కథ  పేదవాళ్ళకి కడుపు నిండా  తిండే కాదు తలదాచుకోవాడానికి చిన్న  గుడిసె కూడా  లేకుండా సంపన్నుల ఇళ్ళమధ్య నుండి వారిని తరిమేస్తే అకాల మరణం పాలైన బుడ్డీమా కథ "చితికినకల"  నట్టింట్లో తిష్ట వేసిన టీవి ప్రభావంలో కొట్టుకొని పోతూ మనుషుల మధ్య మాటా మంచి లేకుండా ఇల్లాళ్ళు  వ్యాపార ప్రకటనలకి అనుగుణంగా కొనుగోలుకి అలవాటు పడి ఇల్లు గుల్ల చేసుకునే  వైనం చెప్పిన కథ "రంగుల వల" కథ  అన్నీ మన చుట్టూ ఉన్న జీవితాల్లోని కథలే. 

మనిషికి హితం కల్గించేదే సాహిత్యం అంటారు . అలాంటి సాహిత్య ప్రయోజనమే ఈ కథలలో అంతర్లీనంగా ఉంది .  ఆమె కథలని సమీక్షించే వయసు అనుభవం కూడా నాకు లేదు . కథలు చదివిన తర్వాత నాకు కల్గిన స్పందనకి ఈ అక్షర రూపం . కొండని అద్దంలో చూపించే ప్రయత్నం  మాత్రమే  ఇది . అందరూ తప్పకుండా చదవాల్సిన కథలు ఇవి అని మాత్రం చెప్పగలను  

23, అక్టోబర్ 2015, శుక్రవారం

పిడికిట్లో పూలు

బస్ దిగి రేడియో స్టేషన్ వైపు అడుగులు వేసాను . గేట్ ప్రక్కనే  కొబ్బరి బొండాల బండి.   దాహంగా ఉందని అటువైపు అడుగులు వేసాను
ప్రక్కనే  కమలాలు అమ్ముతున్న సైకిలిస్ట్.
లోపలినుంచి  ఇద్దరు మహిళలు వచ్చి  "కమలాలు  ధర ఎంత ?" అడిగారు
" కేజి నలబై రూపాయలండీ"
 " అంతకన్నా తక్కువకి రావా ?"
"ముప్పై తొమ్మిదికి కూడా రావండీ ! "
"చూడు..  జనం ఎంత డిమాండ్ గా ఉన్నారో ! ఛీ .. మనకే  ఏమి చేతకాక చస్తున్నాం . తెల్లవారుఝామునే లేచి  రోడ్డున పడొచ్చి డ్యూటీలు చేసినా నాలుగైదునెలలకి కూడా  జీతాలు పడవు. అందులో పది శాతం కటింగ్" నిసృహగా అంది పచ్చ చీరామె
అలా వెళ్ళి క్యాంటిన్లో కూర్చుందాం పద .. అంటూ అటువైపు అడుగులేసారు. నేను కలవాల్సిన వ్యక్తి  కూడా అక్కడికే వచ్చి కలుస్తానని చెప్పడంతో   నేను వారి వెనుకనే క్యాంటిన్ లోకి వెళ్ళాను. వాళ్ళు  మూలగా ఉన్న ఓ టేబుల్ ని వెదుక్కుని కూర్చున్నారు 
వినాలని కాకపోయినా కాలక్షేపం కోసం వారి మాటల్ని వినడంపై దృష్టి పెట్టాను .
 "అవును మరి ! తోటోడు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకోవాలన్నట్టు..  ప్రెవేట్ చానల్స్ తో పోటీ పడి ఈ 04:53 కి ప్రసారం మొదలెట్టినా వారితో దీటుగా విషయాన్ని అందించే విషయంలో వెనుకబడే ఉన్నామన్నది  మనవాళ్ళకెప్పుడర్ధం  అవుతుందో ! వార్తలు తప్ప రెండు గంటలు పాటు భక్తి గీతాలు వినలేక చస్తున్నామని శ్రోతలు చెప్పే అభిప్రాయం  ఎవరికి కావాలి ? ఎయిర్ లోకి ఏదో ఒకటి వెళ్ళిందే లెక్క " అంది ఎల్లో చుడీదార్ వేసుకున్నామె
"ఆ రజని చూడు... ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ మీద ఎంత దైర్యంగా కంప్లైంట్  చేసిందో  గుర్తుకొస్తే  ముచ్చటేస్తుంది. మనకంత దైర్యం ఎక్కడ చచ్చింది ? "  " మనం కంప్లైంట్ చేస్తే  విచారణ చేస్తున్నామంటూనే డ్యూటీలకి దూరం చేస్తారు, రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్టు వారి స్థానాన్ని మరొకరితో భర్తీ చేస్తారు . చిన్నదో పెద్దదో ఏదో ఒక ఆధారంగా ఉన్న ఉద్యోగం పోతుందని వాడి చేష్టలని తప్పని సరై భరించేవారిలో మనమూ  ఉన్నాం "
  “అవును పైకి చెప్పుకోవడమూ సిగ్గు చేటు కూడా అన్నట్లు “
"ఆ పోగ్రాం ఎగ్జిక్యూటివ్  రిటైర్ అయ్యే వయసులో కూతురి వయస్సు ఉన్న వారితో కూడా అసభ్యంగా ప్రవరిస్తాడు. స్టేషన్ డైరెక్టర్ మేడమ్ కూడా అన్నీ తెలిసి మౌనం వహిస్తారు. తోటి  ఆడవాళ్ళ బాధలని ఆమె కూడా అర్ధం చేసుకున్నట్లు ఉండదు, రజని ఎంత బాధపడిందో . ఆఖరికి వేరే సెక్షన్ కి మార్చమని కూడా రిక్వెస్ట్ చేసింది  అయినా ప్రయోజనం లేదు .  ఆఖరికి ఉద్యోగం మానేసి వేరే ఊరుకి మారిపోయింది  ప్చ్ పాపం ." 
"ఎంతైనా అక్కడ స్కిల్స్ పేరిట అగ్రకులాల వారికి పెద్ద పీట వేయడం, తతిమా వారిని అణగద్రొక్కడం ఇప్పటిదా ఏమిటీ ? అరవై ఏళ్ళకి పైగా జరుగుతున్నదే! అది ఇప్పుడూ జరుగుతుంది అందులో కొత్తేముందే? "
" అవును .. పేరెన్నిక గల కార్యక్రమాల నిర్వహణంతా వాళ్ళ వాళ్ళ గుప్పిట్లోనే ఉంటుంది. ఎక్కడన్నా చూడు.. ఆ కులం వాళ్ళకే పట్టం కడతారు   ఇవి  మనలాంటి  కాజువల్ ఉద్యోగస్తుల కష్టాలు మాత్రమే కాదు. డైరక్ట్ గా రిక్రూట్ చేసుకున్న ఉద్యోగులకి కూడా ఈ బాధ తప్పడం లేదు  కులం పేరిట, మతం పేరిట వాళ్ళని వెనక్కి వెనక్కి నెడతారు కదా !" 
"అసలు ఆ కృష్ణ  ఎప్పుడూ ఆన్ లోనే ఉంటాడు . డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ! కమర్షియల్స్ కూడా వెళ్ళవు ఒకోసారి.  వరుసలో పాటలు పెట్టేసి క్యాంటీన్ లోనూ, గేటు వెలుపల ముచ్చట్లు పెడతాడు  అతని మీద ఎలాంటి యాక్షన్ ఉండదు  " 
ప్రసారమయ్యే  కార్యక్రమాలలో ఉన్నంత  ఉన్నత బాషా సంస్కారం  వారి మాటల్లో కాగడా పెట్టి వెతికినా కనబడదు , వారి క్రింది ఉద్యోగాల చేసే వారిపై అశ్లీల పదజాలం తో చేసే కామెంట్స్.. వినకూడదనే అనుకుంటాం కానీ వినక తప్పదు ఏం చేస్తాం ఖర్మ కాకపొతే ! 
 "వాడి ప్రవర్తన రోజురోజుకి శృతి మించిపోతుంది.  ఏం చేయాలి ? డ్యూటీ చేసేటప్పుడు వచ్చి ఎదురుగా కూర్చుంటాడు, ఈవెనింగ్ డ్యూటీ అయిన తర్వాత పైన ఆఫీస్ గదిలోకి రా ! నేను అక్కడే ఉంటాను అంటాడు నేను ఏదైతే అదవుతుందని  వెళ్ళకుండానే వెళ్ళిపోయాను  మొన్నటికి మొన్న కాంట్రాక్ట్  పెట్టడానికి వెళ్ళినప్పుడు  పై నుంచి  క్రింది దాకా చూసి  " బాగున్నావ్ " అన్నాడు.
 ఈ రోజు  ఎదురుగా వచ్చి కూర్చుని  గంట సేపు  కూర్చుని ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెపుతూ  తినేసేటట్లు చూస్తూ .."మన పరిచయమయ్యి ఏడాదయ్యింది నా అప్లికేషన్ సంగతి పట్టించుకోవడం లేదు" అంటూన్నాడు. ఇంతకన్నా అడ్వాన్స్ అయితే చూస్తూ ఊరుకోను . తగిన బుద్ధి చెపుతాను అంటున్న చుడీదార్ అమ్మాయిని వారిస్తూ   "కూల్  కూల్ . ఆ పని చేయడం వల్ల నువ్వు అల్లరి పడటం తప్ప ఏమి ఉండదు . ఉద్యోగం చాలా అవసరం కదా ! " పచ్చచీరామె.
"ఇది కళలకి నిలయమే కాదు ఈర్ష్యా ద్వేషాలకి, కుతంత్రాలకి, కుయుక్తులకి, ఆడవాళ్ళని చెరబట్టే  వేదిక  కూడా అనుకుంటే సబబుగా ఉంటుంది "
ఇలా  వేదన కలబోసుకున్న వాళ్ళ మాటలు వినడంలో మునిగి పోయాను . తర్వాత తేరుకుని   " అబ్బో .. ఇక్కడ కూడా ఇలాంటివి  చాలానే ఉన్నాయే ! " అనుకున్నాను. కాసేపటి  తర్వాత వారిద్దరూ  బై  చెప్పుకుని వెళ్ళిపోయారు . నేను ఎదురుచూస్తున్న మనిషి రానే లేదు.  రిసెప్షన్ లోకి వెళ్లి కనుక్కుంటే .. ఆ రోజు రికార్డింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయని రేపు రమ్మని చెప్పారు . 
ఆ రోజు వెళ్ళిపోయి .. మరుసటి రోజు తొమ్మిదింటికల్లా రేడియో స్టేషన్ కి వెళ్ళి రిసెప్షన్ లో కూర్చున్నాను . నిన్న నేను చూసిన అమ్మాయిలలో చుడీదార్ వేసుకున్న   అమ్మాయి .. అటు ఇటు తిరుగుతూ రెండు సార్లు కనబడింది . ఎవరామె ? అని అక్కడే కూర్చున్న ఇంకొకామెని అడిగాను  "ఇప్పుడు FM లో డ్యూటీ చేస్తున్నారు కదా ! రీతూ అంటే ఆమే ! వండర్ఫుల్ వాయిస్ " అని అడ్మైరింగ్ గా చెప్పింది .
"ఓహ్.. ఆమె ఈమేనా ? మనిషికి వాయిస్ కి సంబంధమే లేదు "  అన్నాను .
కొత్త ఆర్జేస్ ఎంపిక జరుగుతుందంటే  నేను  అప్లై చేసాను  ఆడిషన్ టెస్ట్ కి వచ్చాను  ఎవరెవరో వస్తున్నారు .. రికార్డింగ్ రూమ్ లోకి వెళుతున్నారు, వస్తున్నారు. ఇంకా నా వంతు రావడం లేదు  విసుగ్గా ఉంది . అయినా సరే వేచి ఉండక  తప్పదు . చిన్నప్పటి నుండి కలలు కన్న  ఉద్యోగం . ఒక్క  ఆడిషన్ టెస్ట్ లో  సెలెక్ట్ అయితే  చాలు ..తనకున్న మాటల చాతుర్యం,  ఆంధ్రాంగ్ల  జాతీయ భాషల్లో ఉన్న పాండిత్యంతో  ఆర్జే సీట్ లో కూర్చుంటే చాలు  దున్నేయనూ ... అనుకుంటూ ఓపికగా కూర్చున్నాను. పదకొండు గంటలయింది .
రీతూ ...స్టూడియో లో నుండి బయటకి వస్తున్నారు . వెళ్ళి పరిచయం చేసుకోవాలనుకున్నాను . మళ్ళీ మనసు మార్చుకుని నేను కూడా ఆర్జే  అయిన తర్వాతనే కో ఆర్జే గా  గర్వంగా పరిచయం చేసుకోవాలని ఆగిపోయాను.
అనుకున్నట్టుగానే .. నేను ఆడిషన్ టెస్ట్ లో పాస్ అయ్యాను . మూడు నెలల ట్రైనింగ్ పిరియడ్ అయిపోయిన తర్వాత  నేను కలగన్నట్టు ఆర్జే అయ్యాను . 
 రీతూ తో నాకు బాగానే పరిచయం పెరిగింది. అప్పుడప్పుడూ ఆమె రిలీవ్ ఆయే టైం నేను డ్యూటీ లో కి వెళ్ళేసమయాలప్పుడు  ఓ అరగంట సేపైనా మాట్లాడుకునేవాళ్ళం , ఆర్జే గా  పదేళ్ళ  అనుభవం ఉన్న ఆమె ఎన్నో మెలుకువలు , తెలియని విషయాలు చెప్పేవారు . ఎంతో నిబద్దతతో పని చేస్తున్న ఆమె నాకు బాగా నచ్చేసింది కూడా .  ఒక రోజు చెప్పులు లేకుండా స్టూడియోలో అటు ఇటు తిరుగుతున్న ఆమెని చూసి" రీతూ గారు  ".... అని పిలిచాను. దగ్గరకి రాకుండానే .. చెయ్యి ఊపి హాయ్ చెప్పింది . నేనే దగ్గరకి వెళ్ళి.. ఏంటీ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నారు ? అన్నాను .
"చెప్పు తెగింది" అంది నవ్వుతూ
ఎవరినయినా పంపి కొత్త చెప్పులు తెప్పించుకోకూడదా ?
ఏమైందిలే! ఇప్పుడు వెళ్ళిపోతున్నా కదా ! కొనుక్కుంటాను అంది .
"ఏమో బాబు! మీకేం నామోషీ అనిపించడంలేదా? నేనైతే  చెప్పుల్లేకుండా ఒక్కడుగు కూడా బయట పెట్టను. అదీ ఇలా ఆఫీస్ లో అయితే అసలు తిరగను " అన్నాను .
 "అచ్చాదిత శరీరాన్ని అనచ్చాదితం చేసి చూసే చూపుల తాకిడికన్నా  అనచ్చాదిత పాదాలు భూమిని తాకడటంలో  ఉండే ఇబ్బంది చాలా తక్కువ.  ఇందులో  ఎంతో  ఆనందం,  ఈ   స్పర్శ చాలా  బావుంది  తెలుసా ? "  నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి అనుభవమవుతుంది "అంది.
ఆమె మాటల్లో ఏదో విషయం స్పురించింది .
"ఇంతకీ చెప్పు ఒకటే తెగిందా రెండు తెగాయా? వివరంగా చెప్పాలి " ఉత్సాహం అడిగాను 
"ఒక చెప్పు తెగిందా... రెండు చెప్పులు తెగాయా అన్నది ప్రశ్న కాదు . ఏ చెప్పు తెగినా నడకకి ఇబ్బందే కదా ! " అంటూ  స్టూడియోలోకి వెళ్ళిపోయింది.
ప్రోమోస్ చేస్తూ ఉన్నప్పుడూ దొరికిన గాప్ లో .. ఏం జరిగిందో చెప్పకూడదా .. అంటూ ఆసక్తిగా అడిగాను .
ఆమె నవ్వేసి ఊరుకుంది కాని చెప్పలేదు
ఈ లోపు  అసలేం జరిగి ఉంటుందో  అన్నది ఊహించుకుంటూ  ఉన్నాను.  ఆ  ముసలి నక్క పోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఈ రోజు కూడా FM సెక్షన్ లోకి వెళ్ళి కూర్చుని వాడి పైత్యం అంతా వెళ్ళగ్రక్కిందే  కాకుండా అడ్వాన్స్ అయి ఉంటాడు . అప్పుడు రీతూ అతనిని కాలికున్న చెప్పు తీసుకుని ఎడా పెడా బాదేసి ఉంటుంది. అందుకే చెప్పు తెగి ఉంటుంది .. ఇలా ఊహించుకుంటేనే కానీ నాకు  మనసు శాంతించలేదు .
ప్రోమోస్ రికార్డింగ్ పూర్తయ్యాక "రండి నా బండి  మీద చప్పల్ షాప్ కి వెళదాం , తర్వాత  బసేక్కి వెళ్ళిపోదురుగాని " అంటూ పిలిచాను.  
 "మనం పుట్టినప్పుడు చెప్పుల్లేవ్, నడక నేర్చినప్పుడూ చెప్పులు లేకుండానే నడక మొదలెట్టాం . మన కాళ్ళకి రాళ్ళు , ముళ్ళు గుచ్చుకోకూడదని అమ్మ,నాన్న చెప్పులేసి రక్షణ ఇస్తారు కానీ  చెప్పులు లేకుండా నడవడం కూడా నేర్పి ఉంటే ఆ నడకలో ఉన్న విలువ నీకీపాటికి తెలిసి ఉండేది . నాకు అలా నడవడం అలవాటేలే ! " అని నవ్వి ముందుకు నడిచింది. నా కర్ధమయింది  ఇక ఆమె తన ఆర్జే జాబ్ కి బై చెప్పేసిందని.
మరుసటి రోజు పేపర్లో అనధికార మహిళా ఉద్యోగులని వేధిస్తున్న అధికారి, లైంగిక వేధింపులు భరించలేక ఆర్జే ఆత్మహత్యా ప్రయత్నం.
త్వర త్వరగా ఆ హెడ్డింగ్ క్రింద ఉన్న వార్తా వివరాలన్నీ చదివాను. ఆత్మహత్య చేసుకోబోయిన అమ్మాయి రీతూ ఏమో అనుకున్న నాకు  ఆవార్త మా కేంద్రంలో పని చేస్తున్న అమ్మాయికి సంబంధించినది కాదని తెలియడం కొంత రిలీఫ్ నిచ్చింది కానీ ఆలోచిస్తూనే ఉన్నాను. ఆరోజు  సీనియర్ ఆర్జేల మాటల్లో  ఇలాంటి వేదింపుల మాటలు చాలానే విన్నాను. ఇక్కడ ఒక్క చోటనే కాదు  అన్ని చోట్లా అంతే ! కనబడని హింస. అభద్రత మధ్య ఉద్యోగం చేయాల్సిందే !   ఎందుకు ఆడపుట్టుకనిచ్చావ్ భగవంతుడా ?  మగవాడి చేతుల్లో నలిగి పొమ్మనా ?  " కౌంట్ లెస్ ప్లవర్స్ క్రషుడ్ ఫరెవర్"
డ్యూటీ చార్ట్ చూసుకోవడానికి వెళ్ళాను. అక్కడ అందరూ ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఆర్జే గురించే మాట్లాడుకుంటున్నారు
"ఈ నిమ్న కులాలు వాళ్ళున్నారు చూడండి! ... వారికి మనపై ఎప్పుడూ ఏడుపే ! ఇలాంటి ఆత్మహత్యా ప్రయత్నాలు చేసి తప్పుడు కేసులు పెట్టి వార్తలలోకి వెళతారు . తర్వాత డబ్బు పుచ్చుకుని కేస్ విత్ డ్రా చేసుకుంటారు . నా సర్వీస్ లో ఎన్ని చూడలేదు ఇలాంటివి ..  అంటూ ఒక సీనియర్ అనౌన్సర్ అసహ్య వ్యాఖ్య వింటుంటే ఒళ్ళు మండిపోయింది 
వాళ్ళు పొతే పోయారండి. ముందు వీళ్ళకి వస్తుందిగా తిప్పలు .. తీసుకెళ్ళి ఎక్కడో మూలాన వేసేస్తారు . అర్ధాంతరంగా మారిన దానికి ఫ్యామిలీ ఎంత సఫర్ అవ్వాలి పిల్లల  చదువులు అన్నీ డిస్ట్రబ్ అవుతాయి ..అని ఇంకొకరు 
ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించి ఉంటే అలా చేసుంటుంది? బ్రతకడం కష్టం అంటున్నారు. తన డైరీ లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు  ఎన్నో వ్రాసి ఉన్నాయట. ఆమె తమ్ముడు ఆ డైరీని చానల్ వారికి చూపుతున్నాడు... సాక్ష్యం అంత బలంగా ఉంటే.. కాదంటారేమిటండి.. అని ఇంకొకరు.   
ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ  ప్రక్కకి వెళ్లాను "వూస్తున్న ఉరికొయ్యల సాక్షిగా ...ఈ దేశంలో ఆడదాని భయం మగవాడి అహంకారం రెండు చిరంజీవులే ! " ఒక కవి వాక్యం గుర్తుకొచ్చింది.  ఇలా ఆత్మహత్య చేసుకోవడం  కంటే   వేధించేవాడిని  దైర్యంగా  కొట్టి  రోజుకొక  చెప్పు తెగ కొట్టుకున్నా తప్పు లేదు  కసిగా  అనుకున్నాను .  
పదకొండింటికి జరిగిన స్టాఫ్ సమావేశంలో మా ఎస్ డి  పేపర్లలో న్యూస్ చూపించి ఆ పేపర్ ని విసిరి కొడ్తూ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగినిల వల్ల మన స్టేషన్  పరువు గంగలో కలసి పోతుంది. అన్నీ తప్పడు ఆరోపణలే ! "
ఆమె అలా  వెనకేసుకుని రావడం చూస్తే అసహ్యం కల్గింది. "స్టూడియోలో ఉన్న అన్ని గదుల్లోనూ  సి సి కెమారాలేర్పాటు చేయిస్తే ఎవరు నిజం చెపుతున్నారో, ఎవరు అబద్దం చెపుతున్నారో తెలిపోతుంది కదా..మేడమ్" అన్నాను  నేను .
ఆవిడ చురుక్కున నా వంక చూసింది. 
"కొందరికి అంతరాత్మనే కళ్ళు మూసుకుపోయినా కెమెరా  మాత్రం కన్ను కప్పుకోదు మేడమ్! రీతూ గారు  ఇక్కడెందుకు జాబ్ చేయడం మానేసారో , విరిజ ఎందుకు కంప్లైంట్ ఇచ్చారో అలాంటి వాటన్నింటికి సాక్ష్యాలు  అవే చూపుతాయి కదా  ".. నాకెంతో ఇష్టమైన  ఉద్యోగం  ఉంటుందో లేదోనని కూడా ఆలోచించకుండా అడగాల్సిన నాలుగు మాటలడిగి బయటకి  వచ్చేసాను.
(సమాప్తం )

21, అక్టోబర్ 2015, బుధవారం

ఆధునిక భారతం - ఆధునిక మహిళ

శతాబ్దాల చీకటి పురులు విప్పి నాట్యం చేస్తున్న చోట 

కొన్ని వెలుతురు రువ్వలని  గువ్వల్లా 

సమానాకాశంలో ఎగరేయాలని కదం ద్రొక్కుతూ ఆమె 


విద్యా  ఉద్యోగ  ఆధార దారంతో పైకెగసే తపస్సు  

ఆ దారాన్ని కత్తిరించే పనిలో ఒకరు  

అహంకార ఖడ్గం ఝుళిపిస్తూ ఇంకొకరు

మెదడులో మొలకెత్తిన చివురులని  చీల్చేస్తూ కొందరు 

మాటాడమని  అనుమతిచ్చిన నోరే  

వేనవేల చేతులై  గళాన్ని నొక్కేస్తూ మరి కొందరు   

అంతర్జాతీయ అంగడి సరుకుని చేస్తూ అందరూ 

అడుగడుగునా అంధకార బంధురమే..


ఇన్నాళ్ళుగా సాధించిన విజయానికి సాక్ష్యమడిగితే

తొలకరి చినుకుకి పచ్చ  పొత్తిళ్ళు పరవలేని పుడమిలా చూసింది 

జవాబు దొరకని ప్రశ్నల పొదిని మోస్తూన్నట్లుగా  యోచిస్తుందామె

అయినా ఆమిప్పుడు  ఆధునిక  భారతంలో ఉంది 


అదెక్కడుంది ! ఎలా ఉందంటే ...  ?.  


మనుషులు కామ వృక్షాలై కోరికల పూలు పూస్తున్నట్లు

భావప్రకటన మొలకలని గొడ్డలితో నరికేస్తుందన్నట్లు

నిత్యం దృశ్యీకరణ శత్రువు చేతుల్లో చస్తూ బ్రతుకుతున్నట్లు

మత విద్వేషాల పడగ నీడలో భయపడుతూ భంగపడుతూ 

సంప్రదాయపు ముసుగులో ఛాంధసుల పిడివాదాల మధ్య నలుగుతూ

శుష్క దేహంతో నిప్పుల గుండాల మధ్య నడక సాగిస్తూ

మేల్ చ్వావినిజం నోట్లో మై చాయిస్ ఆవగింజై నానుతుంది


ఆధునిక భారత స్త్రీ చరిత్రని పునర్ లిఖిస్తుంది

అన్న  గురజాడ మాటని నిజం చేస్తూ ..


నా ముందొక  చిత్రం దృశ్యా దృశ్యంగా .

నలబయ్యిల్లో పడుతున్న ఓ ప్రమద

ఆమె తనువంతా ఆశల ఆకు పచ్చని చీర

ఎరుపు పసుపు మేళవింపు గల కొంగేమో

గాలికి రెప రెపలాడుతున్న జెండా లా ఉంది

నల్లని కురులలో సూర్య చంద్రులిద్దరిని అలంకరించుకుని ఉంది

ఆమె తలకి రెండువైపులా లేతపచ్చని

రెండాకుల కొమ్మలని కిరీటంలా అలంకరించుకుంది


తల ప్రక్కగా పైకి లేచిన కుడి చేయి

చూపుడు వ్రేలు మధ్యవేలు కలిసి

సాధించిన విజయాన్ని చూపుతున్నాయి

ఆమె ఎడమ చేయి గుప్పిలి బిగించి

బొటన వ్రేలిని క్రిందికి చూపిస్తుంది

శతాబ్దాల నడకలో ఆమె అతని వెనుకే కానీ

ఇప్పుడామె స్వరం ఉరుముతుంది

కళ్ళల్లో తటిల్లత నాట్యం చేస్తూ ఉంటుంది


అనుభవాల కుంకుమ భరిణ ని తెరిచి బొట్టు పెట్టి

హక్కుల పేరంటానికి ఆహ్వానిస్తుంది

పర్దా లని గోళ్ళతో చించేస్తుంది

అంటరాని తనాన్ని ఉప్పు  నీళ్ళలో జాడించి

కుహనా మేధస్సుకి సంప్రోక్షణ చేస్తుంది


స్త్రీల అస్తిత్వమంటే 

చెప్పుక్రింద తేలు కాదు నలిపేయడానికి 

తోక త్రొక్కిన త్రాచు లాంటిదని  

నిద్రాణంలో ఉన్న మగువలు  మేల్కొంటే 

పర్వతాల కూసాలే కదులుతాయనే నిజాన్ని చాటుతూ    

 ప్రతి మగువ మండే భాస్వరం కావాలంటూ   

గౌరవాల నిశ్శబ్దాన్ని భగ్నం  చేయాలన్నట్లు సాగుతుందామె

మనిషి తనానికి ఆనవాలమయ్యి నడుస్తుంది

గమనమే గమ్యంగా . 


18, అక్టోబర్ 2015, ఆదివారం

13, అక్టోబర్ 2015, మంగళవారం

ద్వారాల మాట

మొన్నటి దాకా మనసు భోషాణానికి

గోడలే తప్ప కిటికీలు దర్వాజాలు లేని వాళ్ళం

ఇప్పుడిప్పుడే అక్షర గవాక్షం గుండా 

హరితవనాల వైపు తొంగి చూస్తున్న వాళ్ళం



పాక్షికంగానో పరోక్షంగానో బాధలనుభవించడం తప్ప

భావాలని వెల్లడించుకోలేని వాళ్ళం

రోజుకొకసారైనా ప్రేమ జడివానలో

తడ వాలనుకుంటున్న వాళ్ళం

కురిసినప్పుడైనా

దోసేడైనా దాచుకోలేని అసహాయురాళ్ళం



మెడలపై కత్తిని పెడుతున్నా

కత్తి మొన మీద అస్తిత్వాన్ని వెదుక్కుంటున్న వాళ్ళం

సంపదలనిచ్చే హక్కులధికారాలకంటే

బంధాలనల్లుతూ ప్రేమార్హతకై తపించిన వాళ్ళం



మొన్న మొన్నటిలాగానే అంత కన్నా ఎక్కువగానే

ఇప్పుడు మా విలువల్ని త్రుంచేసి వలువలూడ్చేసి

అరచేతిలో కావాల్సిన అవయాన్ని చూసుకుంటూన్నావ్

కామోద్దీపం కావించుకుంటూ ఆకలిగొన్న రాకాసిలా

మామధ్య సంచరిస్తున్నావ్ .



తినాలనుకున్నప్పుడల్లా ఇన్స్టంట్ పుడ్ లా ఓ ఆడతనాన్ని

చేజేక్కించుకునాలనుకునే వేటగాడి మనస్తత్వాన్ని

నిల్వాహారాలని వెచ్చజేసుకునే ఓవెన్ లా

ఇంట్లో ఓ ఆడది ఉండాలనుకునే అవసరాల ఆలోచనకి నీళ్ళొదలి చూడు

సత్యాన్ని చూడు …



మీకన్నా ఒక ద్వారం ఎక్కువున్న వాళ్ళం

ఆ ద్వారం నుండే లోకాన్ని చూడటానికి అనుమతిచ్చిన వాళ్ళం

నిత్య సాంగత్యపు గాయాల సలుపు తీరకుండానే

జీవనౌషదాన్ని పూసుకుంటూ యంత్రాల్లా పరిగెడుతున్నవాళ్ళం


ద్వారాల పైనే ఉన్న మీ కాముక దృష్టిని మరల్చి

360 డిగ్రీలకోణంతో చూపులని విశాలత్త్వంతో నింపండి

ఎటు తిప్పినా ఇద్దరం కలసి తిరగాల్సిన వాళ్ళమే కదా

ఎదురుపడుతూ నైనా వెనకగానైనా నడవాల్సిన వాళ్ళమే కదా

ప్రేమతోనూ చెపుతున్నాం .. పరుషంగానూ చెపుతున్నాం

ఎలా చెప్పినా మీరిది వినే తీరాలి ఇది రుధిర ద్వారాల మాట

ఇది దశమ ద్వారాల మాట.


13/10/2025.

10, అక్టోబర్ 2015, శనివారం

కల కల్లలై

1.

ఉన్నట్టుండి  నల్లటి  పువ్వులని విరబూసిన ఆకాశం 

చల్లని గాలితో ఆహ్లాదంగా రాలుతున్న చినుకుల  రెమ్మలు 

ఆర్తిగా కొంగు పట్టి వాటిని జవురుకుంటున్న నేల కన్నె 

ఒడిలో విత్తు పగిలి  మూడు ఋతురాత్రులు తెల్లారితే చాలు  

 పచ్చని కాంతితో పిగిలిపడుతూ పూర్ణ కుంభిణిలా శోభించే  పుడమి

 ప్రసవ వేదన  తర్వాత  బిడ్డని  చూసుకున్న తల్లి  చిరునవ్వులా  ఖాళీ భూమిలా 


2.

రైతులుగన్న ఆ  ఎడతెగని కలలు కల్లలై ఆశలవిసిపోయి 

గుండె నెఱ్ఱులిచ్చిఅపహాస్యాలకి కుటుంబాలనిచ్చి

ఋణాల కరాళ నృత్యతాండవంతో  బెదిరిన గొడ్డై  

ఉరిత్రాళ్ళకి తలలిచ్చి  మట్టిలో మట్టిలా కలసి 

మనసున  దొలిచే ప్రశ్నలా  మనుజుడి ఉనికెలా అంటూ ... 

నిలిచాడెదుట.



9, అక్టోబర్ 2015, శుక్రవారం

గోడలు

గోడలు


సంప్రదాయానికి  ఆధునికానికి మధ్య అడ్డుగా నిలిచేవి

మనుషుల మధ్య మొలిచినవి  కూల్చలేనివి

వీటి గురించి కాదు నేను చెప్పేది

ఒడలంతా చెవులు కళ్ళున్నట్టు గుండేమో రాయి అయినట్టు

మనసేమో వెన్నలా చల్లగా ఉన్నట్టుండేవి 

ఏకప్పునైనా తనపై నిలుపుకుంటూ 

ఆత్మ స్వేచ్చకి అర్ధంగా నిలిచినట్టు ఉండేవి 



సున్నం తాటి బెల్లం గానుగ వేసి కట్టినందువల్లనేమో

నాలుగుతరాల మా ఇంటి కథలని  అవలీలగా చెప్పేసేవి  

మా నానమ్మ తాతయ్యల మంచి మనసులకి ఆనవాలుగా 

తెల్లగా ఎప్పుడూ చలువ తేమనే  పంచేవి అవి

మనుషులని పీటలని పళ్ళేలని చేయడమే కాదు

నిచ్చెన వేసుకునేందుకు ఆధారంగా నిలిచినవి 

మా పురుషుల అహంకారాలని

పోసుకోల కబుర్లని పొల్లు బోకుండా చెపుతూ

నిరసన తెలుపుతూన్నట్లుగా పెళికలు రాల్చేవి

మా అమ్మ కన్నీటి చెలమలని పీల్చుకుని

సహానుభూతిగా బొట్లు బొట్లుగా చెమ్మని జార్చేవి 



నాకంకెలని అక్షరాలని నేర్పినవి

నా పిచ్చి గీతల ముగ్గులల్లరిని భరించినవి

పెద్ద పండుగక్కూడా కొత్త చీరవేసుకోకుండా

నా చిత్రకళా కౌశలాన్ని పదే పదే ప్రదర్శించిన త్యాగమయిలు అవే !



ఆడపిల్లవంటూ బేధాలు చూపినప్పుడు

నా మూగ ఊసులన్నింటిని ఓర్పుగా విని

నాకు స్నేయితంగా నిలిచినవి  

నన్ను నిలువెల్లా హత్తుకుని ఓదార్పు నిచ్చినవి 

నన్ను నిటారుగా నిలబెట్టినవి కూడా అవే

వెన్నానించి సాగిలబడితే

పచ్చని చెట్టులా సేదదీర్చేవి

ఎప్పుడింటికి వెళ్ళినా చూపులతో కుశలమడిగి

ఆత్మీయంగా చేతుల్లల్లి పరామర్శించి

వెనుక నుండో ముందు నుండో

నిలువెల్లా హత్తుకుని వీడ్కోలు చెప్పి వస్తాన్నేను



ఇంటికి వచ్చాక కూడా ఇంకా ఆ చూపులు 

నన్ను తడుముతున్నట్టే ఉంటాయి

వాటితో  తప్ప వేటితోనూ  గోస చెప్పుకోలేనేమో

పదే పదే మెదులుతుంటాయి సజీవ జ్ఞాపకంగా

అవంటే  రాళ్ళు సున్నం మాత్రమే కాదు 

చరిత్రలని చెప్పే నిలువెత్తు సాక్ష్యాలు మాత్రమే కాదు

అనురాగాలని అనుభవాల కథలని 

భాధలని గాధలని ఆర్ద్రంగా చెప్పేవి

మనకై మనం వ్రాసుకున్న చేవ్రాలు లాంటివి గోడలు. 


7, అక్టోబర్ 2015, బుధవారం

సౌందర్య పిపాస


మట్టిపాత్ర లాంటి మనిషి మట్టిలో కలిసిపోయేలోగా

అనుభూతుల వర్షంతో నింపుకోవాలి ఒలకబోసుకోవాలి


నలుపు తెలుపుల జీవితం రోట్లో

కాలం రోకలి పోటుకి చిందే అమృత క్షణాలు

పిండై పోయిన ఘడియలు తిరిగి రానే రావు


లోలోతుల్ని తెలుసుకోలేని మనిషి

పై పైన తేలే హంసలా ఎగిరిపోక తప్పదు


గుండె పుప్పొడి రేణువులని చిట్లిస్తుంది

చినుకులు ములుకుల్లా తగులుతుంటాయి

సంకెలకి చిక్కని హృదయం మేఘమై తేలిపోతుంది


అంతర్నేత్రానికి అంటిన సౌందర్య సారమంతా

అనంత దీప్తమైన ఈ ప్రకృతి ఆకృతి యే కదా !


ప్రభూ !... ఈ మట్టి పాత్ర ని ఇలాగే నింపుతూ ఉండు .










2, అక్టోబర్ 2015, శుక్రవారం

అమ్మ కోసం


అమ్మా ! ఎక్కడున్నావమ్మా !! 


ఒకసారి కనిపించమ్మా ! నాతొ మాట్లాడమ్మా !!


అమ్మలమైనా .. 

ఇంకా అమ్మ ఒడిలో పసి పాపలా అల్లుకోవాలనుకుంటున్నామమ్మా 

ఇక అమ్మా అని  ఎవరిని పిలుస్తారు ? మీ నోటికి తాళం పడిపోతుంది అని భవిష్యత్ ని బహు సుందరంగా చెప్పావు కదమ్మా ! 

నేను చచ్చిపోతున్నానంటే భయంలేదు 

కానీ నా బిడ్డల ముద్దుమురిపాలు బాగా చూసుకోలేదు 

బిడ్డలపై భ్రమత తీరలేదని లోలోప క్రుంగి పోయావు కదమ్మా ! 


అమ్మా ! నీ బాధలు చూడలేక .. ఎప్పుడు చచ్చిపోతావమ్మా  అని కర్కశంగా అడిగాను కదమ్మా ! 

అలా అడిగినందుకేమో అలిగి నీ తలవైపు పడుకున్న మాతో మాట మాత్రం కూడా చెప్పకుండా బిడ్డలకి  నిద్రాభంగం కల్గించ కూడదని నిశ్శబ్దంగా వెళ్ళిపోయావా అమ్మా !


నువ్వు ఇష్టపడి చేయించుకున్న నల్లమద్ది నవ్వారు మంచం మంగళగిరి నులక మంచం మార్చి మార్చి పడుకోబెడతానని చాలా రోజులు ఎదురు చూసాయమ్మా !


మళ్ళీ రామ్మా ! పసి పాపలా అయినా రామ్మా ! నిన్ను మళ్ళీ చేతల్లో పట్టుకుని కళ్ళల్లో పెట్టుకుని భద్రంగా చూసుకుంటాను . 


నిండుగా పూసిన మందార చెట్టుని ఎక్కడ చూసినా గుప్పున నువ్వే గుర్తుకొస్తావమ్మా,గుండె చెరువై పోతుందమ్మా! 

నువ్వు పడమటి చెరువు వైపు మేళతాళాలతో  ఇప్పుడే వెళ్ళినట్లు ఉంటుంది 

నువ్వు లేని ఇంటికి  వెళ్ళ బుద్దే కాదు వేళ్ళ పై  లెక్కపెట్టుకుని కాళ్ళకి సంకెళ్ళు వేసుకుంటాం  ఎవరున్నారక్కడని బాధగా ప్రశ్నించుకుంటాం !


ఏ పూల వనాల్లోనో ఉంటావని నీ నిలువెత్తు చిత్రానికి పూల మాల కూడా వేయకుండా నా తల వైపే పెట్టుకుని పడుకుంటానమ్మా ! నీవిచ్చిన రక్తం, నీ తెలివితేటలు,నీ జ్ఞానం మాలో ప్రవహించి మమ్మల్ని ధీర లగా నిలబెట్టాయని గర్వంగా  చెప్పుకుంటాం . మమ్మల్ని కళ్ళారా చూసుకోవడానికైనా ఒక్కసారి   వచ్చి వెళ్ళమ్మా ! సోదెమ్మ వెళతా ఉంటే పిలవాలని ఉంటుంది .పెదవులపై మాట అలాగే నిలబడి పోతుంది . సోదెమ్మ రూపంలో నువ్వొస్తే కదిలి కదిలి ఏడ్చి దుఖభారం తీర్చుకోవాలని ఉంటుంది .  


నీ  ముద్దుల మనుమడి తో తనివి తీరా ఆడు కోలేదు కదా !  ఇప్పుడు నాకు మనుమడో మనుమరాలో రావడానికి మా మామ గారు నువ్వు పోటీ పడతారనిపిస్తుంది.

అమ్మ లేని మేము అనాధలమయ్యామనిపిస్తుంది. అమ్మా ! ఎక్కడున్నావమ్మా !!


దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు  గాంధీ జీ జయంతి రోజుకి మధ్య అర్ధశతాబ్దానికి ఒక్కటంటే ఒక్క ఏడు పైన  ఈ భూమి పై బాధలని అనుభవించడానికే పుట్టిన నువ్వు వెళ్ళడమే సబబు అనుకుని కాస్త తెరిపిన పడతాము కానీ .. అమ్మమ్మ ని చూడటానికి వెళ్ళినప్పుడల్లా  నువ్వు ఎంత పసిగా రాలిపోయావో అని ఏడుపు ఎగదన్నుకొస్తుంది 


మమ్మల్ని చూసి చిన్నక్క పిల్లలని చుట్టాలందరూ  నిన్నే తల్చుకుంటారు. మన వూరు వెళితే ..  అరుగుల పై  కూర్చున్న వాళ్ళందరూ పలకరిస్తూ వాళ్ళమ్మ రంగు రూపు ఒక్కరికన్నా రాలేదే ! గంజి పెట్టి ఇస్త్రీ చేసిన ఆ చక్కని  చీర కట్టే  గుర్తుకొస్తున్నాయని   చెపుతుంటే  . దిగులుని దాచుకుని నవ్వి వాళ్ళని దాటేసి వెళ్ళడం  గుర్తొస్తుంది . 


అమ్మా ! ఒక్కసారి రామ్మా !!  ఇక్కడ మాకెవరున్నారమ్మా ! కొన్నాళ్ళుగా తల్లడిల్లి పోతున్నామమ్మా! నీ రక్త స్పర్శ ఎవరు కదిలించినా కళ్ళు కడవలవుతున్నాయమ్మా !


నీ కనుకొసటిన రాల లేక ఆగిపోయిన కన్నీటి చుక్క నాలో దుఃఖ సంద్రాన్ని దాచి నిన్ను తలచుకున్నప్పుడల్లా  తీరాన్ని తాకుతుందమ్మా  ! ఇప్పుడే చెల్లి నేను మాట్లాడుకుని నిన్ను తల్చుకున్నాం . 


ఇప్పుడీ వ్రాతలు చూసి గుండె పగిలేలా ఏడుస్తుంది నీ చిన్న కూతురు.  నీకిష్టమైన నీ కొడుకుకి నువ్వు బాగా ప్రేమించే  నీ చిన్న కూతురికి నిన్ను ఈ అక్షరాలలో చూపి  ఏడిపిస్తున్నా నమ్మా ! 


నా చేతి వ్రాతని చూసి ఎంత మురుసుకునే దానివో కదా ! ఇప్పుడు కథలు కవిత్వాలు వ్రాస్తున్నానంటే ఇంకెంత మురుసుకునే దానివో కదా ! అవి చూడడానికైనా ఒక్కసారి రామ్మా ! 


నువ్వు రావని నాకు  ఏడుపొస్తుంది . పిచ్చిదానిలా ఏడుస్తావెందుకు అని మందలించి ఓదారుస్తానికైనా  రామ్మా ! 


(పదిహేడేళ్ళ క్రితం మాకు దూరమైన అమ్మ నిన్నో మొన్నో తప్పి పోయినట్లు ఉంటుంది నాకు . 

అమ్మ కోసం వ్రాసిన ఈ అక్షరాలూ నాకు అపురూపం . అందుకే పంచుతున్నా ! అందరూ అమ్మ చెప్పిన మాట వినండి . అమ్మని ప్రేమించండి ప్లీజ్ !!)




1, అక్టోబర్ 2015, గురువారం

జారిపోయిన రోజు



పేదరాసి పెద్దమ్మ ఆరబోసిన పసుపు కుంకుమలని
దొంగిలించిన సూరీడు తేలి తేలి వస్తుంటే
శుభోదయాల సారాన్ని మనసు నిండా నింపేసుకుంటున్నా
అంబరాన పక్షులేసిన దారుల గుండా
చూపు సారిస్తూ వలసపోయిన  పక్షిలా నువ్వు
తిరిగి వస్తావేమోనని దారితప్పుతావని కాపుగాస్తున్నా
ఆకాశపు వృక్షం విస్తరించిన మేఘపు కొమ్మ జాలి జూపి
కాసిని చినుకులు రాల్చితే సేదదీరుతున్నా
తెలి మేఘాల మధ్యగా కనబడుతున్న నక్షత్రాలని లెక్కిస్తూ
కోయని దోసెడు జాజి పూల దాపున మలిగిన కమలాన్ని అవుతున్నా
గాలి మోసుకొస్తున్న కబుర్లని
ఒడలెల్లా ఒదిగి శ్రావ్య  రవంగా మార్చిన వెదురు
నీలా తీపి గాయమై సలుపుతున్నా సహిస్తున్నా
కనురెప్పల దాహానికి వాయిదా వేసి
రాత్రి కొసన వేలాడే నెలవంకతో
జామంతా సహవాసం చేస్తూనే ఉంటున్నా
గూడు లేని గువ్వనై తలుపులు మోయని గుమ్మాన్నై
తెరిచిన హృదయంతో విరహమయ్యానో విఫలమయ్యానో
కానీ సగం కోసం సహనమవుతున్నా
మోహ భ్రాంతికి గురయ్యావో
కాలసర్పం వేసిన కాటుకి బలి అయ్యావో
జాడ మాత్రం తెలియక రోజులో జారిపోయా
జాలిగా మరో రోజుకి మారిపోయానలాగే ..