రాయికి నోరొస్తే లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రాయికి నోరొస్తే లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జూన్ 2021, ఆదివారం

ప్రతి ఒక్కరూ చదవదగిన కథలు ’’రాయికి నోరొస్తే’’

రాయికి నోరొస్తే కథా సంపుటి సమీక్ష -మంజు యనమదల

 వనజ వనమాలి బ్లాగర్ గా అందరికి సుపరిచితులైన తాతినేని వనజ కథల సంకలం "రాయికి నోరొస్తే"లో కథలను చదువుతుంటే ఆ పేరెందుకు పెట్టారో అర్ధం అయ్యింది. తన చుట్టూ ఉన్న సమాజంలోని కష్టాలు, కన్నీళ్లు చూసి రాయిలా మారిన మనసుకి మాటలొస్తే అచ్ఛం ఈ రాయికి నోరొస్తే కథల్లోని పాత్రలే మన నిజ జీవితంలోని మన అనుభవాలే అనిపించక మానవు.  

ఇక కథల్లోని వెళితే ఆనవాలు కథలోని పేరు కూడా చెప్పుకోలేని ఓ భార్య చాటు భర్త, కొడుకుగా తన తండ్రికి అవసానదశలో ఆసరా కాలేక పోవడంలో పడే వేదనను, ఆస్తులు అడగడానికి పల్లెకు వెళుతూ గుండె లోతుల్లో దాగిన జ్ఞాపకాలను తడుముకుంటూ చివరికి తన కర్తవ్యాన్ని అద్భుతంగా నిర్వహించడాన్ని హృద్యంగా చెప్పారు. 

కాళ్ళ చెప్పు కరుస్తాదిలో పల్లెలోని ఆచారాలు, కట్టుబాట్లను, కులాల అహంకారాలను చెప్తూనే పల్లె మనసుల అభిమానాన్ని తమ దగ్గర పని చేసిన చిన్న పిల్లాడు యజమానురాలు తనపై చూపిన అభిమానానికి గుర్తుగా మథర్స్ డే రోజున అమ్మగా భావించి చీర పెట్టి ఆశీర్వదించమనడంలోని అనుభూతిని చక్కగా చెప్పారు. 

వెన్నెల సాక్షిగా విషాదంలో కులాల పట్టింపులకు బలైన ప్రేమను అందమైన మనసు పాటలతో దరి చేరని లేఖలో విషాదాన్ని వినసొంపుగా వినిపించారు. 

కూతురైతేనేంలో ఆర్ధిక బంధాలలో పడి ఎందరో పిల్లలు దూరమౌతున్న అనుబంధాల విలువలను ఓ తల్లి మనసు తన కూతురు గొంతానమ్మకోరికలను తీర్చడానికి ఆత్మార్పణ చేసుకోవడం చదువుతుంటే మన మనసులు కంటతడి పెట్టక మానవు. 

జాబిలి హృదయంలో మనసులు కలసిన బంధాలకు ఏ మతాలు, కులాలు,కట్టుబాట్లు అడ్డు రావని అద్భుతంగా చెప్పారు. ఇక ఈ సంపుటి పేరైన రాయికి నోరొస్తే కథలో నిజానికి నమ్మకానికి మూలమైన అమ్మానాన్నా బంధంలో హక్కులకు, బాధ్యతలకు మధ్య అహానికి, ఆత్మాభిమానానికి తరతరాలుగా జరుగుతున్న సంఘర్షణను చెప్పడంలో సఫలీకృతులయ్యారు. 

సంస్కారంలో ప్రతి మనిషికి,మతానికి మధ్య ఉండే విభిన్న ఆలోచనాసరళిలో ఉన్న ఆంతర్యాలను గౌరవించడం ఎలానో చెప్తూ, మనుష్యులు తనువు చాలించినా వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వమని చెప్పడం చాలా బావుంది. 

`కంట్రీ ఉమెన్ కూతురు కథలో మన సంప్రదాయపు కట్టుబొట్టు విలువను చెప్తూ అసలైన అందం ఆత్మ విశ్వాసంతో కూడిన వ్యక్తిత్వం అని చెప్తూ నేటి యువత వేగానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసారు. 

స్నేహితుడా నా స్నేహితుడాలో మనసు స్నేహాలు, రహస్య స్నేహాల మధ్యన పెరుగుతున్న అంతర్జాలపు వారధి, భావాల పంపకంలో ఆత్మల బంధాన్ని, అసలైన స్నేహాన్నిఅలవోకగా చెప్పేసారు. 

పాట తోడులో మానవత్వానికి, తోటి మనిషికి సాయపడటానికి గొప్ప కుటుంబంలోనే పుట్టనక్కరలేదని, ఆదుకునే మనసుంటే చాలని, ఇంకెన్నాళ్ళీ కథలో గుడిసెల్లో బతుకుల బాదరబందీలు, ఆడది ప్రేమను పంచడంలోనూ అదే కోపం వస్తే, తన సహనాన్ని పరీక్షిస్తే ఆదిశక్తిగా ఎలా మారుతుందో, మారాల్సిన ఆవశ్యకతను వివరించారు. మహిన్ లో చదువుకోవాలని ఉన్న ఓ పసి మనసు కుటుంబ పరిస్థితుల మూలంగా ఆగిన తన చదువు కోసం ఏం చేయడానికి నిర్ణయించుకుందో చెప్పడంలో ఆ భావోద్వేగాలు పలికించడంలో మనం రోజు చూసే సంఘటనలే కళ్ళ ముందు కనిపించేటట్లు చేసారు. 

మర్మమేమిలో మతాచారాలను అడ్డు పెట్టుకుని కొందరు ముసుగు వేసుకుని ఎలా మోసం చేస్తున్నారో దానికి పర్యవసానం మంచివాళ్ళు శిక్ష అనుభవించడం గురించి చాలా బాగా చెప్పారు. 

ఇంటిపేరుతో ఓ అతివ మనసులోని ఆవేదన తండ్రి, భర్త, కొడుకు వంటి బంధనాల నుంచి తనకంటూ ఓ అస్థిత్వాన్ని ఏర్పరచు కోవడానికి చేసిన ప్రయత్నం కనపడుతుంది. పలుచన కానీయకే చెలీలో స్నేహం ముసుగులో ఈర్ష్యను, అసూయను బయటపడకుండా పబ్బం గడుపుకునే ఈనాటి ఎన్నోకుటిల మసస్తత్వాలను, బేగం పేట్ ప్యాలస్ ప్రక్కనలో మన హడావుడి జీవితాల్లో మనముండి, మన దగ్గర పని చేస్తున్నవారి మానసిక స్థితిని అంచనా వేయలేని పరిస్థితులను, దూరపు కొండలు నునుపన్న అమెరికా వీసా జీవితాలను ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్నిచక్కగా అక్షరీకరించారు. 

లఘు చిత్రంలో మనం చూసే మనిషిలో మనకి తెలియని మరో కోణం ఉంటుందని తెర మీద కనిపించే జీవితాల్లో ఆ తెర వెనుక విషాదాన్ని పరిచయం చేయడం, వేశ్యల మనసు కథను వినిపించడం, ఇల్లాలి అసహనంలో పట్టణవాసంలో అపార్ట్మెంట్ జీవితాలు, అసహనపు ఘట్టాలు భరించే ఓ సగటు ఇల్లాలి మనసు ముచ్చట్లు, గడప బొట్టులో అర్ధం లేని సంప్రదాయాలకు మనం ఇచ్చే విలువల గురించి, ఇప్పుడు కూడా రావా అమ్మాలో తనలో తాను మథనపడుతున్న కూతురికి దూరమై తప్పనిసరి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకుని కూతురికి దగ్గర కాలేని తల్లి వేదన, బయలు నవ్విందిలో అవసరాలకు జ్ఞాపకాలను నరుక్కోవడం, నా అన్న బంధాలను తెంపుకోవడం వెనుక ఎంత విషాదం పెద్దల మనసుల్ని మెలిపెడుతుందో, ఆమె నవ్వులో అవసరానికి ఎలా వ్యాపారం చేయాలో, పురిటిగడ్డ కూలి బతుకుల్లో కష్టాలు, మగ బిడ్డ కోసం తపనతో భార్యనే కోల్పోవడం, లాఠీకర్ర కథల్లో బంధాల విలువలు, వ్యక్తిగత, ఉద్యోగ బాధ్యతలు ఎలా ఉండాలనేది సహాజ పాత్రలతో చక్కని శైలిలో చెప్పారు. ప్రతి కథలోనూ మనచుట్టూ తిరిగే పాత్రలతో, మనకు అలవాటైన, దగ్గరైన అనుభవాలను ఇవి మనం చూస్తున్నంతగా లీనమైపోయేటట్లుగా సహజంగా చెప్పడంలో రచయిత్రి కృతకృత్యులైయ్యారు. ప్రతి కథలోనూ మానవీయ దృక్పథం కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరు చదవదగ్గ పుస్తకం ఈ " రాయికి నోరొస్తే ".

17, జనవరి 2018, బుధవారం

పుస్తక పరిచయం ‘రాయికి నోరొస్తే’

అంజనీ యలమంచిలి  

27 జనవరి 2017 న వ్రాసిన పుస్తక పరిచయం 

‘రాయికి నోరొస్తే’ నా మాటల్లో....

---------------------------------------------

ముఖపుస్తకం... బ్లాగుకే పరిమితం కాదు...

నా గమ్యం అనంతం... నా అక్షరం అజరామం...

‘ఆనందం అర్ణవమైతే,

అనురాగం అంబరమైతే----

అనురాగపు టంచులు చూస్తాం,

ఆనందపు లోతులు తీస్తాం...’ అన్నట్టుగా..

తన భావాల వెల్లువలను..

తలపుల దాహార్తిని...

అక్షరాలుగా మలచి... కథలు, కవితలు చెక్కి...

వాటికో రూపం ఇస్తే... అదే ‘రాయికి నోరొస్తే’...

కృషివుంటే మనుషులు రుషులవుతారన్నట్టుగా

కృషి చేస్తే రాళ్లతోనూ మాట్లాడించొచ్చు అని

రుజువు చేశారు స్నేహితురాలు వనజ తాతినేని.

తొలి కథల సంపుటం వెలువరించిన వనజ గారికి

హృదయపూర్వక అభినందనలు...

***

ఇక ఈ పుస్తకం విషయానికొస్తే....

అర్థవంతం... చైతన్యవంతం అయిన శీర్షిక ‘రాయికి నోరెస్తే’.

అలాంటి ఒక భావస్పోరకమైన శీర్షికను ఈ కథల సంపుటికి పెట్టడంలోనే

రచయిత్రి ఉద్దేశ్యం అర్థమౌతుంది.

ఇందులో వున్నవి ఇరవై నాలుగు కథలు...

మన కళ్లముందు నిలుస్తాయి ఎన్నో జీవితాలు...

వాస్తవిక సజీవ దృశ్యాలు...

తన భావాలను, తన పరిశీలనలోని వివిధ అంశాలను

సూటిగా... స్పష్టంగా.... సరళంగా... హృదయాన్ని తాకేలా చెప్పారు ప్రతి కథలోనూ.

'ఆమెన‌వ్వు' క‌థలో స్త్రీలోని రెండు కోణాల‌ను చ‌క్కగా ఆవిష్కరించారు.

‘వ్యాపారం సాగ‌టానికి పైట కాస్త ప‌క్కకి జ‌రిపి, చిన్న చిరున‌వ్వు న‌వ్వుతున్నా...

అంత మాత్రానా రంకుదాన్ని అయిపోలేదంటూ..’ త‌న వ్యక్తిత్వాన్ని నిలుపుకునే ప్రయ‌త్నం చేస్తుంది.

త‌న టిఫిన్ బండి ద‌గ్గర‌కొచ్చేవారి క‌ళ్లలోని ఆక‌లిని త‌ట్టుకుంటూ...

క‌డుపులోని ఆక‌లిని తీర్చుతూ... కుటుంబానికి అండ‌గా నిలిచిన మ‌హిళ ఒక‌రు.

న‌గ‌ల‌షాపుల వాళ్లు, బ‌ట్టల షాపుల వాళ్లు, కార్ల షాపుల వాళ్లు ఆడాళ్లను చూపిస్తూ అడ్వర్టయిజ్‌మెంట్లు ఇస్తున్నారు.

వ్యాపారం బాగా సాగ‌డానికి చెమ‌ట‌లు క‌క్కే మా ఆవిడ‌ను చూపిస్తే త‌ప్పేమిటి... అంటాడు కృష్ణ‌.

ప్రపంచీకర‌ణ ప్రభావం మ‌న న‌ట్టింట్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌ మ‌హిళ‌ను వ్యాపార వ‌స్తువుగా చూపించ‌డం మ‌రింత ఎక్కువైంది.

ప్రపంచీక‌ర‌ణ ప్రభావాన్ని కృష్ణ పాత్ర ద్వారా చ‌క్కగా చెప్పించారు.

త‌ద్వారా భ‌ర్త చేతిలో వ్యాపార వ‌స్తువుగా మారిందొక యువ‌తి.

అలాగే....‘లఘుచిత్రం’ కథ. నిజం చెప్పాలంటే... హృద్యంగా వుంది. మనసును హత్తుకుంది.

ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకొని... కఠిన వాస్తవాలను బట్టబయలు చేసిన కథ ఇది.

ఇది కథకాదు... వ్యధ్యార్థ జీవితాల యధార్థ గాథ. కథ చెప్పిన తీరు కూడా ఆకట్టుకుంది.

‘దేవసేన కాళ్లపై పడుకున్న అభి... అమ్మ కాళ్ళపై పడుకున్నట్టే ఉంది. అప్రయత్నంగా ఆమె చేయి తల్లి చేయిలా మారిందంటూ...’ చెప్పడం హృదయాన్ని టచ్ చేస్తుంది. అంతలోనే చివరివాక్యం పెదాలపై నవ్వులనూ పూయిస్తుంది.

మరో కథ ‘గడప బొట్టు’. ఈ కథలో ఒక ఆవేదన వుంటుంది... ఒక ధిక్కారమూ వుంటుంది.

ఒక చైతన్యం వుంది.. ఒక సందేశం వుంది.

ఇంకో వందేళ్లు గడిచినా... నాగరికత ఎంత అభివృద్ధి చెందినా...

ఈ తరహా మూఢాచారాలు మన సమాజాన్ని అంత తేలిగ్గా వదలవు.

మీ కథలో సమాజాన్ని ఎదురించిన ఇద్దరు స్త్రీలున్నారు.

ఒకరు భర్త ఉండి... బొట్టు, ఇతర అలంకారాలకు దూరంగా ఉంటే,

మరొకరు భర్త లేకున్నా... చిన్ననాటి నుంచి తనకు అలవాటైన అలంకారాలను వదిలిపెట్టకపోవడం.

వీళ్లిద్దరూ తమ తమ మార్గాల్లో తమ అస్తిత్వాన్ని నిలుపుకొనేందుకు..

తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకునేందుకు కొన్ని కష్టాలను భరించారు... భరిస్తున్నారు... అయినా ఎదిరిస్తున్నారు.

ఇటువంటి వాళ్లు సమాజంలో అనేకమంది వున్నారు.

బొట్టు, మెట్టెలు, తాళిబొట్టును చూసి గాదు...

మమ్మల్ని మనుషులుగా గుర్తించండి అని ఎదురించి నిలబడాలి. ఈ సనాతన సంప్రదాయాల్ని బద్దలు కొట్టాలి.

అప్పుడే స్త్రీ తనను తాను నిర్మించుకోగలుగుతుంది... భవిష్యత్తరాలకు మార్గదర్శకమౌతుంది.

‘పురిటిగడ్డ’ కథ కూడా చాలా బాగుంటుంది.

ముఖ్యంగా ముగింపు హృద్యంగా వుంది. మనసును పిండేసింది.

వ్యవసాయం పనులు ప్రారంభం నుండి అవి ముగిసే వరకూ రైతూ కూలీల మధ్య ఉండే అనుబంధాన్ని కళ్లకు కట్టారు.

రైతు సాదకబాధలు... కూలీల వెతలు, ముఖ్యంగా వలస కూలీల వ్యధలు చక్కగా రాశారు.

కూలీల పనుల్లోని శ్రమైక జీవన సౌందర్యాన్ని చక్కగా వర్ణించారు.

అలివేలు మరణం... వారి సొంత ఊరికి వెళ్లడానికి ఆర్ముగమ్ ప్రయాసను అక్షరబద్ధం చేసిన విధానం బావుంది.

"ప్రతి ప్రసవం గండమని

ప్రతి నిమిషం మరణమని

తెలిసి కూడా కన్నతల్లులు

మరల మరలా కంటారు పిచ్చి తల్లులు"... అద్భుతమైన వ్యక్తీకరణ.

***

ఇలా ఈ పుస్తకంలోని 24 కథల గురించి చెప్పాలనే వుంది.

కాకపోతే చదివేవారికి విసుగుపుట్టిస్తానేమో అనే భయంతో మూడు నాలుగు కథల గురించే ప్రస్తావించాను.

మిగతా కథలు కూడా ఆద్యంతం ఆసక్తికరంగా చదివిస్తాయి.

వాస్తవిక ఘటనలను ఇతివృత్తాలుగా తీసుకొని...

వాటికి తనదైన చక్కని శైలిని జోడించి...

కొన్ని జీవితాలను ఈ కథల సంపుటిలో ఆవిష్కరించారు.

ఇలాంటి కథలు, కథా సంకలనాలు అనేకం వెలువరించాలని

మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా....

ఈ సందర్భంగా వనజ తాతనేని గారికి నా అభినందనలు.



6, నవంబర్ 2017, సోమవారం

అంతర్జాలం నుండీ అంతర్జ్వలనంలోకి

నా కథల సంపుటి "రాయికి నోరొస్తే " కథలపై ..రచయిత,విమర్శకులు జి. వెంకట కృష్ణ గారి సమీక్ష .. "అడుగు " వెబ్ మాసపత్రిక 2017 నవంబర్ సంచికలో వచ్చింది .
బ్లాగర్ ఫ్రెండ్స్ ..మీరూ చదవండి .. నాకెంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే అంతర్జాలం నుంచి అంతర్జ్వలనంలోనికి ..అంటూ పరిచయం చేసారు. నేనొక రచయితని అని చెప్పుకోవడం కన్నా నేనొక బ్లాగర్ ని అని చెప్పుకోవడం నాకు గర్వకారణం కూడా ..  వెంకట కృష్ణ గారూ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు .

ఈ లింక్ లో ..వెంకట కృష్ణ గారు వ్రాసిన సమీక్ష చూడండి .. అంతర్జాలం నుండీ అంతర్జ్వలనంలోకి

అంతర్జాలం నుండీ అంతర్జ్వలనంలోకి

October 26, 2017

– వెంకట కృష్ణ

తాతినేని వనజ ఒక బ్లాగర్.బ్లాగులో అనుభూతి కథనాలు రాస్తూ రాస్తూ, నెట్ నుండీ ప్రింట్ లోకి వచ్చారీవిడ.నెట్లో వున్న భావవ్యక్తీకరణ ప్రింట్ లోనూ వుండాలని రాయికి నోరొస్తే,అనే కథాసంపుటిని ప్రచురించారు.వర్చువల్ రియాలిటీ కళ్ళముందు నిజమవటమే యీమె కథలు పుస్తకరూపం దాల్చడం.ఇందులోని కథలు ఒకట్రెండు మినహాయిస్తే అన్నీ వాడిపోని వాస్తవికతలే.రెండు మూడు మినహాయిస్తే అన్నీ నగరజీవిత చిత్రాలే.అయితే అన్ని కథలోనూ సంప్రదాయ సంస్కృతే సమస్యగా నడిపిస్తుంది, పరిష్కారం అన్వేషిస్తుంది.అన్నీ కథలూ స్త్రీ దృక్కోణం నుండి నడిచే కథలు గానేకాకుండా పురుషదృక్కోణం నుండీ నడిచే కథలూ వున్నాయి.సర్వసాక్షి కథనాలతో పాటు మ్యూజింగ్స్ లాంటి అంతరంగకథనాలూ వున్నాయి.మధ్యతరగతి దృక్కోణం నుండి అన్నికథలూ నడిచినా ఆ జీవితమే కాకుండా అట్టడుగు వర్గాల కిందికులాల అనుభవాలూ కథల్లోకొచ్చాయి.స్త్రీవాద ఛాయలున్న కథలు రాసినట్టే,మధ్యతరగతి స్త్రీలు అవకాశవాదులుగా ప్రవర్తించడాన్ని కూడా చిత్రించారు.వెరశి యీమె కథలు ఒక మూసలో కి కుదించి చెప్పడానికి వీలులేనివి.

రాయికి నోరొస్తే-తన అనాది అనుభవాలను తప్పక మాట్లాడుతుంది.అట్లనే చైతన్యం లేని స్త్రీ కి చైతన్యం వేస్తే తనకు జరిగే అవమానాల్ని ప్రశ్నిస్తుందనే సూచనతో వనజ గారు కథ రాసారు.సాఫ్ట్ వేర్ రంగంలో వుండి దేశవిదేశాల్లో గడిపిన ఆధునిక జంటలో పురుషుడికి,సగటు భారతీయ పురుషుడికి లాగానే పుట్టిన పిల్లల తనకు పుట్టినవాళ్ళేనా అనే అనుమానమొస్తుంది.DNA టెస్ట్ చెయించుకొమ్మని పట్టుబట్టి చేయించాక అది తప్పని తేలుతుంది.అయినా భార్యను క్షమాపణ అడగడు, పశ్చాత్తాపం ప్రకటించడు.అలాంటివాడి వైఖరిని నిరసిస్తూ విడిపోయే స్త్రీ కథ యిది.ఎంత ఆధునిక వేషమేసినా భారతీయ మగవాడు నీచ ఆలోచనలు మానడానికి చెప్పే కథ.

ఆడమనిషి గా పుట్టి పెరిగీ చదుకొనీ యెదిగినప్పటి యింటిపేరు ఒక్కసారిగా మాయమై పెళ్లి తోవచ్చిన కొత్త/పరాయీ యింటిపేరు , తర్వాతి జీవితాన్నంతా శాశించడంలోని ఆధిపత్యాన్ని వివరిస్తుంది ఇంటిపేరు కథ.కుంకుమబొట్టు రూపంలో హిందూ సంప్రదాయం చేసే అవమానపు గాయం గుర్తులను గడపబొట్టు కథ వివరిస్తుంది.స్త్రీలకు యెదురయ్యే అనేక అసహనాలు మరీ ముఖ్యంగా యిప్పటికాలపు విపరీతాలవళ్ళ యెదురయ్యే అసహనాలను కొంచెం వ్యంగ్యపు చురకలతో చెప్పిన కథనం ఇల్లాలిఅసహనం.

పై కథలన్నీ అంతోయింతో స్త్రీ వాద దృక్పథం నుండి రాసిన కథలు.అయితే స్త్రీ (మధ్యతరగతి)లలో వుండే అవకాశవాదాన్ని యెత్తి పడుతూ యిదే రచయిత్రి మర్మమేమి,పలచన కానీయకే చెలీ,కూతురైతేనేమీ, ఆనవాలు లాంటి కథలూ రాసారు.

ఈమధ్యకాలంలో ముస్లిమేతర మతాలకు చెందిన ఆడపిల్లలు గూడా నఖాబ్ ధరించి ముఖం కనబడనీయకుండా తిరుగుతూన్నారు. మర్మమేమి కథ యీ పాయింట్ చుట్టూ అల్లబడింది.ఈ కథలో నఖాబ్ ధరించి మొగుడి కళ్ళుగప్పి ప్రియుడితో తిరిగే హిందూ అమ్మాయి వల్ల నఖాబ్ ధరించడం తప్పనిసరి అయిన ముస్లిం యువతి పొరబాటున ఆ బాధిత మొగుడి దాడికి గురవుతుంది.నఖాబ్ దుర్వినియోగం లో వున్న అవకాశవాదాన్ని ప్రశ్నిస్తుంది కథ.అనవసర చనువుతో వగలువొలకబోస్తూ అవకాశవాదం తో స్నేహితురాళ్ళు నూ వాళ్ళభర్తలనూ వుపయోగించుకొనే స్త్రీ లున్నారనీ అట్లాప్రవర్తిస్తూ పలుచనైపోవద్దని స్త్రీ లను హెచ్చరించే కథ పలుచనగానీయకే చెలీ.మహిళల్లోని నెగెటివ్ షేడ్స్ నూ చర్చకు పెట్టడం రచయిత్రి లోని నిష్కర్షను వెళ్ళడిస్తుంది.తల్లిదండ్రులను వ్యాపారాత్మకంగా చూడ్డంలో కొడుకులే కాదు కూతుళ్ళూ తీసిపోరని కూతురైతేనేమి కథలో అంతే నిష్కర్షగా వివరిస్తుంది.ఫ్యాషన్ పేరిట అవమానకరమైన అర్ధనగ్న వస్త్రధారణ చేసే యువతి పోకడలను కంట్రీ వుమెన్ కూతురు కథలో అంతే నిష్కర్షగా విమర్శిస్తుంది.ఈ కథలనే కాదు అవకాశమొచ్చినప్పుడంతా మగపెత్తనాలను నిలదీస్తూ రాసినట్టే స్త్రీ లోని ఆధిపత్యాన్నీ అవకాశవాదాన్నీకూడా యీ రచయిత్రి నిగ్గుదేలుస్తుంది యీ కథలు సంపుటిలో.

అగ్రవర్ణ మధ్యతరగతి జీవితాలను చిత్రించడానికే పరిమితమైపోకుండా యీ సంపుటిలోని ఇంకెన్నాళ్ళు లాఠీకర్ర కథలు కిందికులాల స్త్రీ లను వారిలోని సాహసాన్నీ తెగింపు నూ చిత్రించాయి. ఇంకెన్నాళ్ళు కథలో సాంబమ్మ రాంబాబనే మోసగాడి మాయమాటలకు మొగుడ్ని వదిలేసి వాడికి వూడిగం చేస్తుంది.రాంబాబు సాంబను ఎడాపెడా వాడేసుకొని అప్పులపాల్జేసి పారిపోతాడు.తిరిగి యింకో స్త్రీ తో వుండి, ఆమె మొగుడు తంతే మళ్ళా సాంబమ్మ వద్దకే వచ్చినప్పుడు యీ సారి సాంబమ్మ వాడి మాయలో పడకుండా తన్ని తరిమి కొడుతుంది.సాంబమ్మ వంటి స్త్రీ లు యింకెన్నాళ్ళో మగదురహంకారాల్ని భరించరనీ జీవితానుభవం యిచ్చిన చైతన్యం తో వదిలించుకుంటారనీ చెబుతుంది రచయిత్రి.అలాగే కింది కులాల వ్యక్తులు యెంతో మానవీయంగా చిన్నపాటి అపేక్షలకైనా సదా కృతజ్ఞత గా వుంటారని,వాళ్ళని ఆదరించాలనీ చెబుతుంది రచయిత్రి కాళ్ళచెప్పు కరుస్తాది కథలో.

ఈ సంపుటిలో ముస్లిం జీవితాలను సృజించిన కథలున్నాయి.కాజాబీ,అమాయక ప్రేమను వివరించే జాబిలి హృదయం కథలో,అనివార్య పరిస్థితులలో పెళ్ళయి పిల్లలున్న మాధవ్ తో ఒక స్నేహితురాలి లాగా వుండే కాజాబీని ప్రేమకూ ఆరాధనకూ ప్రతిరూపంగా చిత్రించింది రచయిత్రి.అయితే కథలో వాళ్ళిద్దరి అకాల త్యాగమరణం వాళ్ళకు పుట్టిన పిల్లల్ని అనాథల్ని చేస్తుంది.మహీన్ కథలో, చదువు పట్ల ఆసక్తి వున్న మహీన్ ను పేద తల్లి చదివించలేకపోతుంది. అప్పుడప్పుడు వచ్చి పోయే తండ్రి యిచ్చే డబ్బులతో యిల్లు గడవడమే కష్టంగా వుండడంతో, మహీన్ ఫీజు కట్టడానికి చౌరస్తాలో పూలమ్మడానికి సిద్ధమవుతుంది.ఈ కథలో ముస్లిం స్త్రీలు బహుభార్యాత్వం వల్ల యెదుర్కొంటున్న దైన్యం చిత్రితమైవుంది.ఇప్పుడు కూడా రావా అమ్మా,కథ ఆశా అనే చిన్న పిల్ల తల్లి కోసం పడే తపన.ముస్లిం వ్యక్తని ప్రేమించి పెళ్లి చేసుకున్న హిందూ అమ్మాయి ఒక పాప పుట్టిన తర్వాత అతడి దురలవాట్లు భరించలేక విడిపోతుంది.అయితే పాపను తనవెంట తెచ్చుకోలేకపోయిన విషాదంలో యీకథ, తండ్రి మరణం-తల్లిమారువివాహం,అనే రెండు సంఘటనల నడుమ నలిగిపోయే ఆశాను ఆమె తల్లినీ దుఃఖభరితంగా మిగిలిస్తుంది.

2012 నుండి 2016 మధ్యా యీ రచయిత్రి 24కథలు రాసింది.సొంత బ్లాగు లోనూ వెబ్ మాగజైన్ లోనూ రాస్తూ అచ్చు పత్రికలకు ప్రయాణించింది.బ్లాగ్ రచన సీరియస్ గా చేసేవారికి పత్రికా సంపాదకులు పెట్టే లిమిటేషన్స్ తో నిమిత్తం వుండదు.కథానిర్మాణాలనో,శిల్ప చాతుర్యమనో చెప్పుకునే అడ్డంకులు ఉండవు. స్పాంటేనీటీ ప్రథమగురువు.కాస్తా రాయగలిగిన శక్తివున్న వేలవేల బ్లాగర్లు మనకళ్ళముందు అభిప్రాయప్రకటన చేస్తున్న కాలమిది.అచ్చును కేరేజాట్ అనుకున్నాక వచ్చే ధార చాలా స్వేచ్ఛ గలిగినది.అయితే అది కొండకచో గాఢత లేనిది కూడా.వనజ గారి కథనంలో బ్లాగ్ రచనా స్వేచ్ఛ ఆద్యంతమూ అగుపిస్తుంది.విషయ పరిజ్ణాణమున్న ప్రతి మనసులోనూ జరిగే మ్యూజింగ్ ప్రతికథనూ నడిపిస్తుంది.ఆ స్వేచ్ఛ ఆమెను ఇన్ హిబిషన్ లేని రాతలు రాయడానికి అవకాశమిచ్చింది.వెన్నెలసాక్షిగా విషాదం,స్నేహితుడా నాస్నేహితుడా, లఘు చిత్రం లాంటి కథలు అందుకు వుదాహరణగా నిలుస్తాయి.

ఈ కథలు అర్బన్ కథలుగా అగుపించినా స్థలరీత్యా సంభవించినా వీటి మూలం గ్రామీణమే.కథల్లో వచ్చే కాంట్రడిక్షన్ లన్నీ పాత సాంప్రదాయానికి ఆధునికతకు జరిగే ఘర్షణలే. వీటి తీర్పరిగా యీ రచయిత్రి ఆధునికత వైపుండి భారతీయ సాంప్రదాయం లో వున్న అన్ని చెడుగుల్నీ నిరసిస్తుంది.అంతిమంగా మానవీయత ను ప్రోది చేసేదిగా నిలబడింది. ఈ మెకు పర్యావరణ అపేక్ష వుంది.బయలు నవ్వింది, ఆనవాలు లాంటి కథల్లో అది కనిపిస్తుంది.ప్రకృతి పట్ల పారవశ్యం వుంది.సంగీతమైతే యెప్పుడు వీలుకుదిరితే అప్పుడు తెలుగు సీనీగీతాల చరణాలుగా కథల్లో కొస్తుంది.బ్లాగర్ కున్న స్వేచ్ఛ రీత్యా వయ్యక్తిక అనుభవాల అనుభూతులను కథనం చేయదగ్గ నైపుణ్యం రీత్యా కథకురాలిగా నిలబడ్డ యీమె భవిష్యత్తు లో మంచి కథలు రాయాలని ఆశీంచడం ఆమె బాధ్యత ను గుర్తు చేయడమే. ఈ సంపుటిలోని ఆమెనవ్వు పురిటిగడ్డ లాఠీకర్ర కథలు ఆనుభవ కథనాలుగా అగుపించినా వీటిని మరింత పరిశీలనగా గమనించి సృజించివుంటే యీకథలు యిప్పటి కోస్తాంధ్ర ఆత్మను ఆవిష్కరించివుండేవి.ఆమె నవ్వు కథ యెదోమేరకు కోస్తావ్యాపార సామాజిక స్వభావాన్ని పట్టుకున్న కథ.పురిటి గడ్డ కథ కోస్తాకు వలస వచ్చిన యితర ప్రాంతపు (కూలీ లుగా మారిన) రైతుల విషాదకథ. యీ వలసలు యెందుకు జరుగుతున్నాయనే కోణాన్ని తెరిస్తే, వనజ గారు అర్థం చేసుకోవాల్సిన కుట్రలను అర్థం చేయించే ఆకాశం అనంతమైందని చెప్పేకథ. లాఠీకర్ర , కోస్తాంధ్ర గ్రామీణ ప్రాంత అట్టడుగు వర్గాలు , బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వస్తే , అనివార్యంగా యెదుర్కొనే రాజ్యహింస. ఈ మూడు కథలూ యీ సంపుటి రీత్యా రచయిత్రి లేటెస్ట్ కథలు.ఆ తర్వాతి రాబోయే కథలన్నీ మరింత వైవిధ్యం గా విస్తృతంగా వుండాలని కోరడం అత్యాశ కాదు.

************(*)************