29, డిసెంబర్ 2019, ఆదివారం

అమరావతి విధ్వంసం తగదు

అమరావతి ఇకపై  రాజధాని గా ఉండబోదు అన్న ప్రకటన వల్ల  లేదా మార్పు వల్ల  నాకు వ్యక్తిగతంగా నష్టం లేదు. లాభం లేదు.


సామాజికపరంగా చూస్తే  ఒక ఐదేళ్లపాటు ఈ ప్రాంతంలో జరిగిన ట్రేడింగ్ ఏదైనా ఉందంటే అది అమరావతిని కేంద్రంగా  చేసుకుని పెరిగినదే. ఈ రాజధాని పరిధిలో అందరిని అభివృద్ధి వైపు ఊరించిన అంశం ఇది. అనేకమంది  పెట్టుబడులు పెట్టారు. ఎక్కడెక్కడ వున్నవాళ్ళందరూ  ఇల్లు కట్టుకోవాలని పిల్లలు చదువులు ఇక్కడే కొనసాగాలని ఇక్కడే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . అలాంటివారికి ఈ నిర్ణయం ఆశానిఘాతం. పల్లెల నుండి ఇతర పట్టణాల నుండి వచ్చి మా ఊరులో ఎంతోమంది ఇళ్ళు కొనుక్కున్నారు. రాజధాని రావడం మూలంగా మా వూరు ఈ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందటం కాదు. ఇది అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం.

కానీ అమరావతి ప్రాంతంలో అక్కడ జరిగిన  జీవన విధ్వంసం    ఏదైతే ఉందొ ..ముఖ్యంగా వ్యవసాయ విధ్వంసం అది మళ్ళీ పునరుద్దించలేనిది. భూములిచ్చిన రైతుల వితరణ దాని వెనుక వారి అభివృద్ధి ఆకాంక్ష ఆ ప్రాంతం చుట్టూ కేంద్రీకృతమైన అభివృద్ధి ఆనవాలు అవన్నీ యిపుడు  నాశనమైపోతాయి. 


ఆనాడు ప్రతిపక్షంలో వుండి  ఒప్పుకున్న నాయకుడు ఈ రోజు కుంటిసాకులు చెప్పి మార్చాలనుకోవడం బాగోలేదు. వారికి అసలు దీనిపై అవగాహన శూన్యం. వ్యతిరేక భావనలు మినహాయించి ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు. అన్ని వేల ఎకరాల పొలం రూపు రేఖలు మారిపోయాక ఎన్నో కుటుంబాల ఆశలు ధ్వంసం అవుతుంటే వారు రోడ్డున పడుతుంటే అలాంటి నిర్ణయాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేనూ నా ప్రాంతమూ ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలు భావోద్వేగాలు త్యాగాలు  అక్కడి అభివృద్ధి అంతా సామాజిక అభివృద్ధి అనుకుంటానండీ. అవి పరిణామక్రమంలో జరుగుతున్న జరిగిన మార్పులు. వాటిని ఇప్పుడు మార్చాలనుకోకూడదు. అందరూ ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు వారి స్వార్ధం  కోసం అమరావతిని మార్చకూడదు. 


ముఖ్యంగా .. నేను చెప్పేది ఏమిటంటే ..ఎంతోమంది విదేశంలో నివసిస్తున్నవారు సాఫ్ట్ వేర్  ఉద్యోగస్తులు ఇక్కడ అభివృద్ధి కోసం కలలు కంటున్నారు. మాతృదేశానికి తిరిగి  వచ్చేయడానికి. వారి ఉద్యోగాలకు అనువుగా.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని. వారి కష్టాన్ని ఇక్కడ పెట్టుబడులుగా  పెట్టారు.అదంతా యిపుడు ఏమైపోవాలండీ? ఆర్ధిక అనిశ్చితితో చాలామంది  నిత్య మానసిక క్షోభతో కూలిపోయే చెట్లల్ల వున్నారిప్పుడు. నాయకుల వ్యక్తిగత ద్వేషాలు వారి వ్యక్తిగత అభివృద్ధి ఈ ప్రాంత ప్రజలను అధోగతి పట్టించడం భావ్యమా?  ఇక్కడ చదువుకున్న పిల్లలు వలసలు వెళ్లిపోతున్నారు ఆ తల్లిదండ్రుల మానసిక క్షోభ ..వలస వెళ్లిన చోట వారికి కలుగుతున్న కష్టాలు,జీవన  సంఘర్షణ వెళ్ళినచోట  గుర్తింపు రాక వెట్టి చాకిరి చేస్తూ అయినవాళ్లకు దూరంగా వాళ్ళు పడే బాధలు వర్ణనాతీతం . ముఖ్యంగా ... "అమరావతి "  ఈ ఆంధ్ర  రాష్ట్ర ప్రజల కలల రూపం. అది వాస్తవ రూపం దాల్చకుండా ప్రజలే తింటున్న వాళ్ళ కంచంలో నీళ్లు పోసుకున్నారు. ఇంతకన్నా ఊహించిన అభివృద్ధి ఇప్పుడు మారాలన్న చోటులో రాదు. మౌలిక వసతులు అమరావతికన్నా వేరొక చోట మెరుగ్గా వుండవు. ఇది సత్యం.  ఇది కేవలం నాయకుల వ్యక్తిగత అభివృద్ధి కోసం జరుగుతున్న మార్పు. కనబడేది 29 గ్రామాలే కానీ ప్రజలు పతనమయ్యే కనబడని కోణాలు ఎన్నో .. నేను ఒక మామూలు మనిషిగా స్పందిస్తున్నా .. బహుశా నేను ఆలోచిస్తున్న తీరు కొందరికి సున్నితంగా కనబడవచ్చు. హాస్యాస్పదంగా కనిపించవచ్చు . అయ్యో ఇలా అవుతుందేమిటి అనుకునే సామాన్య మానవులు నా చుట్టూ వేలమంది . 


మళ్ళీ రాజధాని పేరిట ఇంకోచోట వేల  ఎకరాల భూములను నాశనం చేయొద్దు...ప్లీజ్ . అభివృద్ధి చేయాలంటే అనేక మార్గాలు. రాజధానులు పెట్టాల్సిన పని లేదు.



     

17, డిసెంబర్ 2019, మంగళవారం

మనిషి చెట్టుకు సంతోషపు పూలు

మార్గశిర మంచులో సూరీడు కూడా కాస్త బద్దకంగా ఆవలించి మెల్ల మెల్లగా రావడానికి కూడా ఇష్టంలేనట్టు తప్పనిసరిగా వెళ్ళాలి కదా అనుకుంటున్నా సమయాలలో .. ముక్కు ఎగబీల్చుకుంటూ .. బాల్కనీ రెయిలింగ్ పై చేతులానించి మంచుభారంతో కదలలేక కదలలేక ఆకులను పూవులను మొహమాటంగా కదుల్చుతూ వున్న పూపొదలను చూడటం నాకిష్టమైన వ్యాపకం. ఆ పూపొదలపై కువకువలాడుతూ సరాగమాడుకున్నట్లుండే బుల్లి పిట్టలు పసుపు పచ్చ సీతాకోకచిలకలను కన్నార్పకుండా చూస్తుంటానని కళ్ళు నొప్పి పుట్టినప్పుడు కానీ తెలియని మైమరపు తనంలో నా సమయాలు గడవడం ఆనందదాయకం కూడా !

ఈ రోజు ఉదయం .. ఎదురుగా రోడ్డవతల బడ్డీకొట్టు బరువైన యువతి తన ఇంటికి వస్తున్న బంధువును  చూసి చటుక్కున లేచి తన రెండు చేతులను విశాలంగా చాచి ఇరవై అడుగులు దూరం ముందుకు నడిచి ఆత్మీయంగా ఆ బంధువుని ఆత్మీయంగా హత్తుకుని చెంపకు చెంప ఆంచి స్వాగతం పలికే మనోహర దృశ్యం చూడటానికి నా కనులు అదృష్టం చేసుకున్నాయని చెప్పాలి. ఇలా ఎందుకు అంటున్నానో మీకర్ధమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. 

ఆ మనోహర దృశ్యం నుండి మళ్ళీ పూపొదలపై నా దృష్టిని పారించినప్పుడు నాకనిపించింది.. కోయకుండా మిగిలి ఎండిన పూలు తరువుకొక సంరంభ చిహ్నమే  కాదు వాటిని గాంచిన మనకు కూడా నిన్నటి అనుభూతి జ్ఞాపకం మరొక తీరులో కనబడుతుంది. మనిషి చెట్టుకు సంతోషపు పూలు నిలువెల్లా పూచే సమయాలవి.

ఈ మధ్య ప్రేమంటే ఏమిటీ అనే ప్రశ్న ..పుట్టుకొచ్చింది. అందరూ తలా ఒక వ్యాఖ్యానమిచ్చారు. "ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే" ... సిరివెన్నెల గారి సాహిత్యం. నా దృష్టిలో ప్రేమంటే .. విశ్వసనీయత నిశ్చింత. కేవలం ఈ రెండిటితోనూ ప్రపంచంలో ఎక్కడైనా తిరిగి భద్రంగా యింటికి వస్తామని నమ్మకం లేకపోవడమే ఇప్పటి అసలైన విషాదం కూడా! 

ప్రేమంటే ..కాంతిని వెదజల్లి మనసుకు కల్గించే శాంతి. ఆ శాంతి కోసం మనుషులు పరిసరాలు కూడా స్వచ్ఛంగా ఉండాలి మనముంచాలి కదా ..అని అనుకుంటూ ..  అందెశ్రీ పాట "మాయమయిపోతున్నాడమ్మా మనిషన్నవాడు " ను గుర్తుకు తెచ్చుకున్నాను. 






7, డిసెంబర్ 2019, శనివారం

ఇంతకన్నా ఇంకేం కావాలి !?

నా కథలపై ... ఒక మంచి పాఠకురాలి స్పందన

రమాదేవి గారూ ... రచయితకు పాఠకుడు దొరకడమే అదృష్టం అని అనేకసార్లు చెప్పివుంటాను . పాఠకులు తెలిపే స్పందన చూస్తే అది నిజమనిమరింత అదృష్టం పట్టిందని అనుకుంటాను కూడా . మీరు చాలా ఆసక్తిగా పుస్తకాలు అడగడటం ..నేను మీకు పిడిఎఫ్ లో మాత్రమే పంపగల్గడం ఒకింత సిగ్గుపడ్డాను కూడా నేను . ఆ పిడిఎఫ్ లో వున్న రెండు కథా సంపుటాలను చదివి మీ స్పందన తెలిపినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఒకరకంగా ..ఇది నాకొక నూతన ఉత్సాహం. టోటల్లీ పెన్ డౌన్ చేసే అంత నిరాశలో కూరుకుపోయిన నాకు మీ స్పందన కొత్త ఊపిరి.

మీకు నేను చిన్న వివరణ యిచ్చుకుంటున్నాను . నా కథలన్నీ ..ఐ మీన్ నేను వ్రాసిన కథలన్నీ ..నా అనుభవంలో నుండో ..నాకు తెలిసిన వారి అనుభవంలో నుండో వ్రాసినవి ... కథ వ్రాయడం అంటే కల్పన కాదు నాకు . కథలలో బాగా లీనమైపోతామని చెప్పే పాఠకుల భావోద్వేగం నాకు పరిచితమే. ఆ భావోద్వేగాన్ని అణుచుకుని కథ వ్రాయడానికి నేను చాలా శ్రమపడతాను. ఒకోసారి పూర్తిగా విఫలమవుతాను.

ఈ సాయంత్రం నాకుచాలా సంతోషాన్నిచ్చింది. ఇక రాబోతున్న మూడవ సంపుటిలో మరింత పరిపక్వతగా వ్రాసిన కథలే ఉంటున్నాయి. అవి కూడా చదవండి చదువుతూనే వుండండి .. నన్ను నాలాంటి మరికొందరి రచయితల కథలనూ చదివి వారిని ఇలాగే మీ స్పందనతో అభినందిస్తారని ఆశిస్తూ.. మీ స్పందన తెలపండి ..తెలుపుతారు కదూ .. మీరు బ్లాగర్ అయితే మీ బ్లాగ్ చిరునామా తెలియజేయగలరు. facebook లో మీ రాతలే మిమ్మలను గుర్తుపట్టడానికి నాకు ఊతం మరి :)

నేను ముందుగా ఒక పాఠకుడిని ..ఎప్పుడూ పాఠకుడిగా ఉండటానికే ఇష్టపడతాను. రచయితను కావడం యాదృచ్చికమే రమ గారూ .. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు . మీ అనుమతి లేకుండా .. మీ స్పందనను ఇలా పోస్ట్ చేస్తున్నందుకు మన్నించాలి. నమస్తే !

రమాదేవి గారి స్పందన ... విద్యుల్లేఖ లో ఇలా .

చెప్పాలనిపించింది....

rama devi

4:47 PM (4 గంటల క్రితం)

వనజ గారు మీరు రెండు పుస్తకాలు పంపించడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది నాలుగు మాటల్లో చెప్పలేను... రాయికి నోరొస్తే ఈ కథల పుస్తకం కొంచెం సౌమ్యంగా నెమ్మదిగా పారే నదిలా కొన్ని ఒక్కసారిగా నదిలో విసిరే రాయి సృష్టించే కల్లోలం కానీ కుల వృక్షం పుస్తకంలో కథలన్నీ మాత్రం జారే జలపాతం లోని వేగాన్ని.. సముద్రంలోని అలల ను ఒడిసి పట్టుకున్నట్టుగా ఉంటాయి.. కుల వృక్షం పుస్తకంలో చాలా కథలు ఇదివరకు చదివినవే.. ఏవో ఒకటి రెండు అసలు చదవలేదు అనుకుంటా.. అయినా కూడా ప్రతి కథ మళ్లీ ఇప్పుడు కొత్తగా చదువుతుంటే మొదటి సారి చదివినప్పుడు ఎంత ఆసక్తి ఉంటుందో.. అంతే ఆసక్తిని ఒక్క రవ్వంత కూడా తగ్గించకుండా మీ కథలన్నీ చదివిస్తాయి.. ప్రతి కథ మనసుని బంధించి ఆలోచనలోకి ఉవ్వెత్తున నెట్టేస్తుంది...

ప్రతి ఒక్క కథ చదువుతున్నప్పుడు దృశ్య రూపకంగా కనిపిస్తుంది.. ఏ ఒక్క కథ కూడా అ ఇలా కాకుండా ఇంకోలా ఉంటే బాగుండు అని నాకు ఒక్కసారి కూడా అనిపించలేదు.. ప్రతి కథ చదివే టపుడు ఎలా అనిపిస్తుంది అంటే ..ఆ కథంతా మీరు దూరం నుంచి చూస్తూ చెబుతున్నట్లుగా అనిపిస్తుంది.. ఎక్కడ ఇది ఒక ఊహ ..కల్పన అని కూడా అనిపించదు..

మీ రచనలలో అందరూ అమ్మాయిలు లేదా స్త్రీలు చాలా ఉన్నతంగా ఉంటారు అంటే నిజంగా మన జీవితంలో ఇటువంటి సంఘటన ఎదురైతే మీ రచనలలో స్త్రీ స్పందించిన విధంగానే స్పందించడమే సబబు అని నాకు అనిపిస్తుంది..

మీ కథలను అందరూ ఒప్పుకుంటారా అని నేను అనను ఎందుకంటే నేను చూసిన వాళ్ళ మధ్యనే చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్లు కూడా కొన్ని అంశాలను వాళ్లు కథలుగానే ఒప్పుకోడానికి ఇష్టపడతారు.. తప్ప నిజంగా అటువంటి ఆత్మగౌరవం గల స్త్రీలు ఉంటారు అని ఒప్పుకోలేరు..

వనజ గారు మీ పుస్తకానికి రివ్యూ రాయాలి అంటే ప్రతీ కథకీ ఒకటి రాయాలి.. ప్రతి కథ రెండు వాక్యాలలో చెప్పడం కుదరదు.. నీ పుస్తకాలు చదివించాలి అంటే ఒక కథని చెప్పినా చాలు మిగతా కథల కోసం వాళ్లే వెంటపడి చదివేస్తారు...

ప్రతి కథలో మీరు కనిపిస్తా రండి అది నిజం మీరు తెలియకముందే మీ బ్లాగ్ చదివాను.. అందులో కథలు చదివాను..అప్పుడు కూడా నా అభిప్రాయం అదే కథలు మీకోసం రాసుకుంటారు మీరు ఉంటారు ఈ కథలో రచయిత్రి తన జీవితంలో నుంచి అనిపిస్తాయి అంటే ఆ జీవితాన్ని అనుభవించారని కాదు మొత్తానికి మీరు ఆ కోణాలన్ని చెప్పగలరు అనిపిస్తుంది..

మీ కథలు చదువుతున్నప్పుడు శరత్ చంద్ర నాయకి గుర్తొస్తుంది...(తోడికోడళ్ళు సినిమాలో సావిత్రి పాత్ర)... జీవితానికి భయపడడం అనేది ఆ నాయకి లక్షణం కానేకాదు...

మీరు పుస్తకాలు పంపించడం వలన ఆ కథల్ని వరుసగా చదువుతుంటే ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను... మీకు నా ధన్యవాదాలు వనజ గారు

మీకు హృదయపూర్వక ధన్యవాదాలు రమ గారూ .. 




3, డిసెంబర్ 2019, మంగళవారం

రచయితలూ మాములు మనుషులే!

మనుష్యులు మనుష్యుల్లాగానే ఉంటారు

రచయితలైనంత మాత్రాన భిన్నంగా ఏమీ ఉండరని... కొంతమంది రచయితలను సమీపంగా చూసినప్పుడే తెలిసింది. అందుకే మనిషిని మనిషిగానే కలవడమే తప్ప రచయితగానే పాఠక అబిమానిగానో కలవడం నాకిష్టం ఉండదు. నా అనుభవంలో కొందరిని గమనించి ... ఇప్పుడు మరింత దూరంగా ఉంటున్నాను. 



నాలుగేళ్ళ క్రితం ఒక రచయిత్రి (విదేశాల్లో ఉంటారు) ఇక్కడ సాహిత్య రాజకీయాలు గురించి చెపుతూ ..ఇద్దరు రచయిత్రుల గురించి చెపితే .. నేను ఆ విషయాన్ని తేలికగా తీసుకుని ..ఈమె తోటి రచయిత్రుల మీద ఇలా విషంగ్రక్కుతున్నారేమిటి . వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళ జాణతనాలు వాళ్ళ లాబీయింగ్ లు గురించి ఈమె యింత అసహ్యంగా మాట్లాడటం తప్పు కదా ... అని నిరసన తెలిపినట్లు ఆమెతో మాట్లాడటం మానేసాను . ఐ మీన్ .. ఆమె నెంబర్ ని బ్లాక్ చేసి ఫ్రెండ్షిప్ కట్ చేసాను. ఏళ్ళు గడుస్తున్న కొద్దీ  మనుషుల స్వభావాలు తెలుస్తున్న కొద్దీ .. లోతుగా అర్ధం చేసుకున్నదాన్ని బట్టి ఆమె చెప్పబోయిన విషయాలు నిజమని నాకనిపిస్తుంది. అబ్బబ్బ ..ఎక్కడ లేనివన్నీ ..ఇక్కడే ఉన్నాయబ్బా ... నాకు త్వరగా విరక్తి కల్గింది. రాత నుండి, నిర్మొహమాటంగా మాట్లాడటం నుండి విముక్తి కల్గించు తండ్రీ .. రాత గీత అనకుండా ..ఏదో నర్మగర్భంగా మాట్లాడుతూ అదోమాదిరి కాలక్షేపం చేస్తాను అని బుద్దిగా వినాయకుడి ముందు గుంజీలు తీసి దణ్ణం పెట్టుకున్నాను.


ముఖ్యంగా కాస్త పేరున్న పెద్ద రచయితల కుళ్ళు మనస్తత్వాలు అహంకారాలు తామే సమాజాన్ని  ఉద్దరించేస్తున్నామనే  విరగబాటుతనాలు సంఘాల పేరుతో పనిచేస్తూ  తోటి మనుషులను మిగతా సంఘాల్లో వారిని వెలివేసినట్టు చూడటం నిజాయితీకి సత్యదూరంగా గ్రూప్ రాజకీయాలు చేయడం ఇక రివ్యూ ల కోసమైతే కాకాలు పట్టడం రివ్యూలు వ్రాసేవారిని ఆత్మా బంధువులు అనుకోవడం ..కొద్దీ నెలల కాలంలోనే ప్రముఖ రచయితలు అయిపోవడం ప్రముఖులతో పొగిడించుకోవడం కోసం ఏ అధమ స్థాయి కైనా దిగజారడం ఇవీ ..స్థూలంగా కొందరి రూపాలు.


మనం వద్దన్నా ఫోన్ చేసి .. వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని వినిపిస్తారు. బిందెడు నీళ్ల కోసం వీధిలో కొట్లాడుకునే మనుషుల స్థాయిలో పేరు కోసం వీళ్ళు పడే తాపత్రయాలు దిగజారుడుతనాలు చెవినపడే కొద్దీ అర్ధమవుతున్న కొద్దీ అసహ్యం కల్గింది. ఇలాంటి వాళ్ళ ఒరవడిలో పడి సీనియర్ రచయితల రచనలు అనేక సంకలనాలలో చోటు చేసుకోక కావాలని చేసే నిర్లక్ష్యాల వల్ల నిజమైన పాఠకులకు దూరం అవుతున్నాయి. మంచి సాహిత్యం గుర్తింపులేక మరుగునపడకపోయినా పాఠకులకు అందక తెలియకుండా పోతుంది. పుస్తకాలు కొనేవాళ్లే లేకపోవడం తెలుగు సాహిత్యానికి పట్టిన దుర్గతి అయితే .. అసలు మంచి రచనలు వెలుగులోకి రాక .. వచ్చినవి చెత్త అవడం మూలంగా మరింత దుర్గతి పట్టబోతోంది. ఒక సీనియర్ రచయిత వ్యాఖ్యను ఉదహరిస్తాను. "ఇప్పటి రచనలలో వక్రమార్గం కనబడుతుంది.  కొనియాడబడుతున్న రచయితలలో చాలామంది pervert గా వున్నారు. ఇది సాహిత్యానికి చాలా చేటు చేస్తుంది " అన్న రచయిత మూడు భాషల్లో ప్రావీణ్యులు. ఒక భాషలో నుండి మరొక భాషలోకి తర్జుమా చేసే రచయిత. వారు సమకాలీన సాహిత్యాన్ని నిత్యం చదువుతూనే వుంటారు. 



వినదగు నెవ్వరు చెప్పినా ..అని మాత్రం అనుకోవడం లేదండీ .. నేనిప్పుడు ఒకే ఒకామెతో మాట్లాడతాను ..ఆమెతో కూడా మాటలు బంద్ చేస్తే ..ఈ సాహిత్య విషయాలు రచయితలూ గురించి మాట్లాడటం మొత్తం బంద్ అయిపోతుంది. హాయిగా వుండాలని అనుకుంటున్నాను. సాహిత్య ఉద్దండుల్లారా ..స్రష్ఠల్లారా మీకూ మీ కోటరీలకూ  మీ లాబీయింగ్ లకు మీ రాజకీయాలకు మీ మెచ్చుకోళ్ళకు మీ కుయుక్తులకు మీ పురస్కారాల అవార్డుల పిచ్చికి  శతకోటి వందనాలు. 


రచనల్లో కన్నా రచయితల జీవనవిధానంలోనే ..ఎన్నో కథలు వున్నాయి. అందరూ అనేక పాత్రలు . ఒకొకరి  దగ్గర ఒకో ముసుగు బయటకు తీస్తారు . వారందరికీ లౌక్యం వుంది. రచయిత రచన ఒకటిగా ఉండాలని లేదు. వారి రచనలకూ వారి ప్రవర్తనకు హస్తిమశకాంతరం   బేధం వుంది.  అందుకే వారిని అర్ధం చేసుకోవడం కష్టం. అందరికి దూరంగా వుంది అక్షరాలకు సన్నిహితంగా ఉండటం వలన మనసుకి హాయి శాంతి కలుగుతాయని కాస్త ఆలస్యంగా గ్రహించాను. 





1, డిసెంబర్ 2019, ఆదివారం

స్త్రీ జాతికి మరణ శాసనమైన యువత అరిషడ్వర్గాల ఉచ్చు

 స్త్రీ జాతికి మరణ శాసనమైన యువత అరిషడ్వర్గాల ఉచ్చు  
ఇటీవల జరిగిన ఒక యదార్ధ సంఘటన ..కి అక్షర రూపం. మీ పిల్లలు కూడా ఇలా చేస్తున్నారేమో ..గమనించుకోండి. 

పట్టణానికి దూరంగా  నిత్యం వేలాది వాహనాలు రణగొణ ధ్వని వినబడే రహదారి నుండి రెండు పర్లాంగుల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో  ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ కాలేజ్. ఉదయం పదకొండు గంటల సమయం. తరగతులు జరుగుతున్నాయి. పనివారు హాస్టల్ గదులను శుభ్రం చేస్తున్నారు.

ఆ క్యాంపస్ కి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్న సరిత మేడమ్ రోజూ లాగానే  కారిడార్ లో సంచరిస్తూ పరిశీలన చేస్తూ.. మధ్యలో కాసేపు నిలబడింది. ఆమె వయసు నలబైకి పైన.  అందంగా వుంటుంది. ఆ అందానికి  తగ్గట్టు మంచిగా రెడీ అవుతుంది. గౌరవభావం కల్గించేలా వస్తాధారణ చేస్తుంది. అపుడు ఆమె నిలుచున్న చోటుకు  రెండు గదుల తర్వాత  సిక్ రూమ్ వుంది.  ఆ గది నుండి బయటకు వచ్చిన ఒక స్టూడెంట్ రెండు రోజులగా జ్వరంతో బాధ పడుతూ సెలవుతీసుకుంటున్నాడు.   అతని పేరు హరీష్ .    ఆ గదికి ఎదురుగా వున్నబిల్డింగ్  గదులలో క్లాస్ లు జరుగుతున్నాయి. ఆ క్లాస్ లు అతను హాజరయ్యే క్లాస్ లే కావడంతో నిలబడి వింటున్నాడనుకుంది ఆమె.

ఆ స్తూడెంట్ ని పలకరిస్తూ  దగ్గరకు వెళ్ళింది. "ఏం ..హరీష్.. ఎలావుందీ జ్వరం తగ్గింది కదా ... క్లాస్ లకు వెళ్ళిపోతావా అని పలకరించింది. "పర్వాలేదు మేడమ్ ..ఈ రోజు ఆగి రేపటికి క్లాస్ లకి వెళ్ళిపోతాను " అన్నాడు. ఓకే ..ఇక్కడెందుకు నిలబడతావ్ ..క్లాస్ లో పిల్లలు నీ వంక చూస్తుంటారు లోపలి వెళ్లి రెస్ట్ తీసుకో .. "అని చెప్పి కొద్దీ దూరంలో వెళ్లి నిలబడి మెయిన్ గేట్ వైపు చూస్తూ పరిశీలిస్తూ నిలబడింది. కొన్ని నిమిషాల తర్వాత..లోపలి వెళ్ళకుండా ఇంకా అక్కడే నిలబడి ఉన్న హరీష్ వైపు దృష్టి సారించింది. అతను వెంటనే తన ప్యాంట్ జిప్ తెరిచి తన   జననాంగాన్ని  బయటకు తీసి అటుఇటు వూపుతూ ఆమెకు చూపించి సైగ చేసాడు. ఆమె షాక్ తింది. సిగ్గుతో తలవంచుకుని  తన గదిలోకి వెళ్ళిపోయింది .

స్టాఫ్ అందరికి ..నాన్ టీచింగ్ స్టాఫ్ మెస్ స్టాఫ్  తో సహా అందరిని  మూడు గంటలకు కాన్ఫరెన్స్ హాలుకి తప్పని సరిగా రమ్మని సర్క్యులర్ పంపింది. అందరికీ ఆశ్చర్యం. అకస్మాత్తుగా ఎందుకీ సమావేశం అని ఆలోచిస్తున్నారు. అదే సమయానికి హరీష్ తల్లిని మాత్రమే తప్పనిసరిగా రావాలని ఫోన్ చేసి చెప్పింది. ఆమె జ్వరంతో ఉన్న పిల్లాడు ఎలా వున్నాడో అనుకుని కంగారుపడుతూ కాలేజ్ కి చేరుకుంది.మూడింటికి కాన్ఫరెన్స్ హాలుకి చేరుకున్న కొందరు ఆమెకు సన్నిహితముగా వుండే వారు  .."ఎందుకు మేడమ్.. ఈ అత్యవసర సమావేశం ? ఏం జరిగిందో చెప్పండి. సస్పెన్స్ భరించలేకపోతున్నాం"  అని అడిగారు. వెయిట్ ప్లీజ్ .. అంది ఆమె.  సరిగ్గా మూడు గంటల అయిదు నిమిషాలకు ..హరీష్ ని ఆ హాలుకి పిలిపించింది. అతని తల్లి అనేక అనుమానాలతో అర్ధం కానీ భయాలతో టెన్షన్ తో లేచి నిలబడి .ఏం జరిగింది మేడమ్ ..అని అడిగింది.

ప్రిన్సిపాల్ లేచి నిలబడి హరీష్ దగ్గరికి వచ్చింది. మృదువుగా కూల్ గా "నాన్నా ..హరీష్ .. పొద్దున్న నేను కారిడార్ లో నిలబడి ఉన్నప్పుడు .. నువ్వు నాకు తీసి చూపించావు కదా .. అది తీసి ..ఇప్పుడు మీ అమ్మకు చూపించు. ఇక్కడున్న స్త్రీలందరికీ కూడా చూపించకు. కేవలం మీ అమ్మకు మాత్రమే చూపించు చాలు . నా  కన్నా మీ అమ్మ చాలా అందంగా ఉంటుంది. ఇంకా నా వయస్సు కన్నా కూడా వయసులో చాలా చిన్నది. నీకు అన్ని సమయాలలో అందుబాటులో కూడా ఉంటుంది. తీసి చూపించి సహకరించమని నాకు చేసినట్లు సైగ చేయి "  అంది అందరికి వినబడేటట్లు. అందరిలో కొందరు  ఆశ్చర్యంతో నోరు తెరిచారు. కొందరు కిసుక్కున నవ్వారు. కొందరు వాడిని చెప్పు తీసుకుని ఎడాపెడా వాయించాల్సింది మేడమ్ అన్నారు ఆవేశంగా.

హరీష్ తల్లి అవమానంతో ..కోపంతో దుఃఖంతో లేచి నిలబడింది. హరీష్ దగ్గరకు వెళ్లి చెప్పు తీసుకుని ఎడా పెడా వాయించేసి తుపుక్కున ముఖాన ఊసి .."మేడమ్ .. వీడు యిక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి వీలులేదు.  ఇక చదువుకోవడానికి కూడా అనర్హుడు. టీసీ ఇచ్చేయండి మేడమ్" అని అడిగింది. హరీష్ చేసిన తప్పుకు మౌనంగా తలొచుకుని నిలబడే వున్నాడు. అతన్ని అక్కడే వొదిలేసి ..తల్లిని తీసుకుని ఆఫీస్ రూమ్ కి వెళ్లి .. అతన్ని ఇంటికి పంపించే పనిలో పడింది ప్రిన్సిపాల్ మేడమ్ .

ఇంత సస్పెన్స్ క్రియేట్ చేయడం ఎందుకు ? ఆ పని చేసిన వాడిని అప్పుడే చెప్పుతో కొట్టి బయటకు పంపించాల్సింది అని కొందరు, పాపం తల్లి ఏం చేస్తుంది ..వీడివికృత చేష్టలకు ఆమెను అనడం న్యాయమా అని కొందరు ..ఈ కాలం పిల్లలు ఇట్టాగే చచ్చారు వయసు వరస వావి ఏమి లేకుండా .. సినిమాలు అట్టా  నేర్పుతున్నాయి అని కొందరు. అలా తలొక రకంగా వ్యాఖ్యానించుకుంటూ వెళ్లిపోయారు.

నాకు మాత్రం ఆ ప్రిన్స్ పాల్ మేడమ్ సరిగ్గాన్నే ప్రవర్తించింది అనిపించింది. ఏ మాత్రం ఆవేశానికి లోనుకాకుండా ..కూల్ గా ప్రవర్తించి ..మంచి నిర్ణయం తీసుకుంది. ఎవరికీ తెలియకుండా తల్లిదండ్రులను  అతన్ని మాత్రమే పిలిపించి .. మీ అబ్బాయి ఇలా చేసాడు అని చెప్పడం కూడా సరైనది కాదు. మా వాడిది తప్పై పోయింది మేడమ్ . క్షమించండి వాడి తరపున మేము మీ కాళ్ళు పట్టుకుంటాం అని కాళ్ళావేళ్ళు పడేవారు తప్ప .. ఇలాంటి పరిష్కారం ఉండేది కాదు. ప్రిన్సిపాల్ విజ్ఞతతో వ్యవహరించారు.

హరీష్ ప్రవర్తన నేటి యువతలో చాలామంది  ఆలోచనా విధానానికి పరాకాష్ట.  కన్నందుకు తల్లిదండ్రులు వారిని సంస్కారవంతులుగా పెంచడంలో విఫలం అయ్యారని చెప్పవచ్చు. అసలు ఇల్లు మాత్రమే కాకుండా సమాజం యేమి  నేర్పుతుంది పిల్లలకు .. ఇది ఆలోచించుకోవాలి మనం.  ..