నవల పఠనం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నవల పఠనం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, డిసెంబర్ 2018, గురువారం

విచ్చిన్న సంసారము

అంతః బాహ్య సున్నిత సంఘర్షణల జీవన చిత్రిక రవీంద్రనాథ్ ఠాగూర్  నవలిక "విచ్చిన్న సంసారము" 


ఏ పుస్తకాన్నైనా   చదివిన తర్వాత నా ఆలోచనలను పఠనానుభవాన్ని క్లుప్తంగానైనా వ్రాసుకోవడం నాకలవాటు. ఆ వ్రాసుకోవడమే యింకొంచెం వివరంగా చేస్తే మరీ బావుంటుందని నాకనిపించినప్పుడల్లా ఇలా వ్యాసరూపంలో నిలిచివుంటున్నాయి.  నూట పద్దెనిమిది యేళ్ళ క్రితం (1901) విశ్వకవి నష్టానిర్ (Nastanirh)  బెంగాలీ భాషలోనూ తరువాత వారే ఆంగ్లములోనూ (The broken Nest )  వ్రాసిన నవల యిది.  ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే  నిర్మించిన " చారులత (1964లో) చిత్రానికి మూల కథ యీ నవల. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క రహస్య ప్రేమ కథ అని కూడా అని చెప్పుకున్న కబుర్లను చదివాను. అంత పెద్ద విశేషాన్ని విన్న తర్వాత మనసు ఆగుతుందా చెప్పండి?. చాలా సార్లు ఆ చిత్రాన్ని చూసాను. కొందరి పరిచయాలలో చదివాను కూడా. అయితే బెంగాలీలోనూ ఆంగ్లంలోనూ చదవడం నాకు కష్టం కాబట్టి తెలుగులో వెతుకుతూ వుండేదాన్ని. నా శ్రమ ఫలించి "విచ్చిన సంసారము" పేరిట ఈ నవలను నేను చూడటం తటస్థించింది.  1955 లో  తెలుగులో మొదటి ముద్రణ వచ్చింది.  తెలుగు అనువాదం కారుమూరి వైకుంఠ రావు.వీరు కథాగుచ్చం  అనే పేరిట ఠాగూర్ కథలను నాలుగు సంపుటాలుగా తెలుగులోకి అనువదించారు.    


    భూపతి ధనవంతుల కుటుంబంలో పుట్టాడు అతనికి పని చేయవలసిన అవసరం లేదు. ఇంగ్లీష్ విద్యకూడా అభ్యసించాడు.  చందా కట్టి అనేక పుస్తకాలను తెప్పించుకునేవాడు కానీ యేనాడైనా చదివిన పాపానబోడు.  పత్రికలకు ఇంగ్లీష్ లో ఉత్తరాలు వ్రాయడం వ్యాపకంగా పెట్టుకుంటాడు. ఒక ఇంగ్లీష్ పత్రికను కూడా స్థాపిస్తాడు .  వరుసకు బావమరిది అయ్యే ఉమాపతి  ఇతనిని బాగా ప్రోత్సహిస్తూ ఉంటాడు.ఉమాపతి గతంలో ప్లీడర్ వృత్తి చేస్తూ అందులో నెగ్గలేక భూపతి చెంత చేరి పత్రిక పనిలో పాలుపంచుకుంటాడు  


భూపతి భార్య  చారులత. ఆమెకు ఇంట్లో పని చేయవలసిన పనే లేదు. పుస్తకాలు చదవడం అనే అలవాటువల్ల ఆమెకి సులువుగా కాలక్షేపం జరిగిపోతూ ఉండేది. భార్యకు  మరింత కాలక్షేపం అవుతుందని పల్లె నుండి  ఉమాపతి భార్య మందాకిని ని పిలిపిస్తాడు. మేనత్త కొడుకు అమల్  ని  యింటికి తీసుకొచ్చి ఆశ్రయమిచ్చి చదువుకోవడానికి సహాయం చేస్తూ అతనిని చారులతకు ఇంగ్లీష్ నేర్పించమని పురమాయిస్తాడు. 


 ఒకే వయసు వారైన  చారులత కు అమల్ కి బాగా స్నేహం కుదురుతుంది. చారులత  అమల్ కు పుస్తకాలు కొనుక్కోవడానికి కాలేజీలో మధ్యాహ్నం ఫలహారం చేయడానికి డబ్బులు ఇస్తూ ఉంటుంది. చారులత  అతిశయం లేదు కానీ   అభిమానవంతురాలు. తనకి రానిదేదైననూ రాదనీ వొప్పుకోవడం ఆమెకిష్టం వుండదు. ఆఖరికి వూలుతో మేజోళ్ళు అల్లడం రాదని  చెప్పకుండా బజారులో కొనుక్కోమని చెపుతుంది కానీ కొద్దిరోజులకే మేజోళ్ళను అల్లడం నేర్చుకుని  అల్లి అమల్  కి బహుకరిస్తుంది.మెడకి  చుట్టుకునే పెద్ద పూల  రుమాలును కూడా  అల్లి అతనికి బహుకరిస్తుంది.


చారులత అమల్ కలిసి భవనం వెనుక గల స్థలమును మంచి ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని కమిటీ వేసుకుంటారు.  భూపతికి తెలియకుండా రహస్యంగా ఆ  ఉద్యానవనము నిర్మించి అతనిని ఆశ్చర్య పరచాలని చారులత అభిలాష. ఆ ఉద్యానవనంలో చిన్న సరస్సు అందులో నీలివర్ణ తామర పుష్పాలను పూయించాలని హంసలు పెంచాలని ఆమె కల. ఆమె ఊహలు  అన్ని అబ్బురమైనవి.ఆలోచనలు సున్నితమైనవి. కలలను వాస్తవరూపంలో తీసుకురాగల సహకారం భర్త నుండి ఆమె ఆశించలేదు. అతనెప్పుడూ మిత్రులతో సాహిత్యచర్చలు చేస్తూ పత్రికలకు సంబంధించిన లెక్కలు చూసుకుంటూ భార్యకు కొద్దిగా నైనా  ప్రేమనివ్వాలనే ముఖ్య విషయాన్ని మర్చిపోతుంటాడు.   చారులత అమల్ ఇంటి వెనుక వున్న తోటలో తిరుగుతూ .. పుస్తకాలు చదువుతూ ఆడుతూ పాడుతూ కవిత్వాలు అల్లుకుంటూ వుంటారు. 


అమల్ కూడా చారులత లాగానే ఊహాశక్తి అధికంగా కలవాడు.  దోమ తెరలపై పెన్సిల్ తో లతలు గీసి  దానిని కుట్టుపనితో అందంగా ఉండేటట్లు చేయమని చారులతను అడగడం,  కవిత్వం వ్రాయడం అది చారులత చూసి ఆనందించి మరికొన్ని వ్రాయమని ప్రోత్సహహించడమూ అతను అనేక వ్యాసాలూ వ్రాసి పత్రికలకు పంపడమూ మంచి పేరు రావడమూ జరుగుతుంది. చారులతను కవ్వించి ఆమెలో ఉన్న సృజనాత్మక శక్తులను వెలికిదీయడంతోపాటు తనతో స్నేహానికి  , భావాలు పంచుకోవడానికి పలు విషయాలను  చర్చించడానికి తగిన వ్యక్తిగా భావిస్తాడు పైగా భూపతి చేసే సహాయమే కాకుండా   ఆమె వల్ల కూడా అధిక సహాయం పొందుతూ ఉంటాడు. కానీ ఆటకాయితనంగా చారులతను ఉడికించాలని చూస్తూ  మందాకినికి  తన రచనలు చదివి వినిపిస్తూ చారులతలో అసూయకు తెరదీస్తాడు  .


సమవయస్కుడైన అతని ఆకర్షణలో మోహంలో పడిన చారులత  అతను నామమాత్రంగా నైనా  ఇంకొక స్త్రీ కి ప్రాధాన్యం ఇవ్వడం భరించలేక  అపవాదులు వేయడానికి కూడా సిద్ధపడుతుంది.  మందాకిని  పై అక్కసుతో  ఆమెలో  వివేకం  ఆత్మహత్య చేసుకుంటుంది. అమల్ అప్పుడు గ్రహిస్తాడు. చారులతకు నచ్చనప్పుడు తానైనా అలాగే ఇంటి నుండి గెంటివేయబడటం జరుగుతుందని.కానీ మందాకినీ  భర్త ఉమాపతి భూపతిని మోసం చేస్తూ మిగుల్చుకున్న మొత్తాన్ని అక్కడినుండి దాటేయడానికే మందాకినీ వెళ్ళిపోతుందని తర్వాత అర్ధమవుతుంది.  అమల్ కి పెళ్ళిసంబంధాలు చూడమని   భర్తకి సూచిస్తుంది. చూసుంటే ..మీరు చూస్తే సరిపోతుందా నేను చూడొద్దా అని గొడవపెడుతుంది.  తీరా మంచి కుటుంబం అతనిని అల్లుడిగా చేసుకోవడానికి  అతనిని విదేశాలకు పంపడానికి  అంగీకరించే సరికి మళ్ళీ అంతలోనే తేరుకుని అతను  ఆమెకు దూరమవుతున్నట్లు గ్రహించి దుఃఖపడుతుంది. 

   

అమల్  వివాహం చేసుకుని విదేశాలకి వెళ్ళిపోయాక చారులత లోలోపల చాలా దుఃఖపడుతుంది. ఆమె దుఃఖాన్ని గుర్తించే స్థితిలో కూడా భూపతి వుండదు. బావమరిది చేసిన మోసాల వల్ల  అప్పులధికమై పత్రికను మూసివేసే పరిస్థితి వస్తుంది. అంతటి కష్టంలో ఉన్న తనకు సాంత్వన కల్గించే శక్తి భార్య దగ్గరే లభిస్తుందని తెలుసుకుని వడి వడిగా భార్య గదికి వస్తాడు వేళకాని వేళలో. అతను వచ్చేటప్పటికి ఏదో వ్రాసుకుంటున్న చారులత అప్రయత్నంగా ఆ పుస్తకాన్ని దాచేస్తుంది. నా భార్యకి  కూడా నాకు తెలియని రహస్యాలు వున్నాయా ఆమె కూడా నన్ను మోసగిస్తుందా అని తలపోస్తాడు. చారులత అమల్ గురించిన ఆలోచనలు ప్రక్కకు నెట్టి భర్త కిష్టమైన వంటలు చేస్తుంది.శ్రద్దగా అలంకరించుకుంటుంది. కానీ భార్యాభర్తలిరువురు ఎవరి ఆలోచనల్లో వారుండి స్తబ్దతను చేదించి  మనసులని కలబోసుకోలేకపోతారు.  


విదేశాలకి వెళ్లిన అమల్  తనకొక ఉత్తరమైనా వ్రాస్తాడని యెదురుచూస్తుంది. అమల్ ఏమైనా ఉత్తరం వ్రాశాడా అని పదే పదే అడుగుతూ ఉంటుంది.   అతని క్షేమ సమాచారం కొరకు ఆత్రుత పడుతుంది. అమల్ పదే పదే ఉత్తరం పంపడం కూడా ఖర్చుతో కూడిన పని కాబట్టి అంత కంగారు అవసరం లేదని భూపతి ఆ విషయాన్ని తేలికగా తీసుకోమని చెపుతుంటాడు. చారులత తన నగని రహస్యంగా అమ్మి ఆ డబ్బుతో అమల్ కి తంతి పంపుతుంది. తిరుగు తంతికి కూడా డబ్బు కట్టి పంపుతుంది. తిరిగి తంతి వచ్చే రోజుకి  భూపతిని  వూరికి వెళ్లి తన చెల్లిని చూసి రమ్మని పంపుతుంది. అయితే  ఆ తంతి నేరుగా భూపతి చేతుల్లో పడటమూ ఎక్కడో అతనిలో లీలామాత్రంగా ఉన్న అనుమానానికి తోడు రుజువు లభించడంతో భూపతి భార్యని అసహ్యించుకుంటాడు.ఆమెని శిక్షించనూలేక  క్షమించలేక మానసికంగా కృంగిపోతాడు.  దేశానికి మరో వైపునున్న బెంగళూరు నగరంలో వున్న వొక  పత్రికకు పని చేయడానికి ఒంటరిగా వెళ్లాలని నిశ్చయించుకుని చారులతకు చెప్పినప్పుడు ఆమె "మరి నేనూ" అని అడుగుతుంది.  అంతలోనే అతను భార్యపై జాలిపడి ప్రయాణానికి సిద్దమవమని అంటాడు. అతని అంతరంగం అర్ధమై ఆభిజాత్యంతో  ఆమె వద్దు అవసరం లేదు అంటుంది. ఇదీ కథ.  చారులతకు అమల్ రూపంలో  ఎదురైన ఆకర్షణ భర్త  ప్రేమరాహిత్యం, భూపతి మనః సంఘర్షణ, అమల్ కుర్రతనపు ఆలోచనలు,బ్రతకనేర్చిన తనమూ అన్నీ కళ్ళకు కట్టినట్లు ఉంటాయి. మానవుల సహజ బలహీనతలు  కలలు ప్రపంచమూ అన్నీ సహజంగా చిత్రికపట్టారు.  


ఈ నవల చదువుతున్నప్పుడూ తర్వాతా నాకు కల్గిన ఆలోచనలు 

బెంగాలీ కుటుంబాలంటేనే సంగీత సాహిత్యాలకు నెలవు.వారు మనకన్నా ఎంతోముందు ఉన్నారనేది నిజం. అందుకే ఇంత అందమైన రచన ఆలోచింపదగిన  సాంఘిక నవల అక్కడ రావడం తటస్థించింది. మనకు అలాంటి తెలుగు నవలలు యేమైనా వున్నాయా అని చదివినవాటిని గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేసాను కానీ నాకు అంత స్ఫురించలేదు కూడా. ప్రస్తుత కాలానికి ముడిపెట్టి ఈ నవలను వ్యాఖ్యానించడం సబబు కాకపోయినప్పటికినీ వ్యాఖ్యానించక తప్పడం లేదు. ఎవరి అభిరుచులు ఎవరి ఆసక్తులు వారివైపోయి పాలునీళ్ళు లా కలిసిపోవాల్సిన భార్యాభర్తల బంధాలు మొక్కుబడిగా మారడం వెనుక ఇదిగో ఇలాంటి కారణాలే ఉంటున్నాయి. పర స్త్రీ పురుష ఆకర్షణలు మొదలై  సంసార విచ్చిన్నానికి దారితీస్తున్నాయి.  పూలను సృష్టించినవాడే తుమ్మెదలను సృష్టించాడు కానీ  గొడ్డలిని సృష్టించలేదు. ఆ గొడ్డలిని మనమే సృష్టించుకుంటున్నాం కదా.  సంసారం విచ్చిన్నమైనదని భూపతికి  చదివిన పాఠకులకు తోస్తుందేమో కానీ నేను బాగా గమనించిన విషయం యేమిటంటే  చారులత దృష్టిలో అమల్ తో ఆమె కట్టుకోవాలనుకున్న కలల  గూడు రూపంలోకి మారకుండానే అవిసిపోవడం విషాదం అవుతూనే సంసారమనే గూడు కూడా  విచ్చిన్నమవుతుంది. 


వంద పేజీలకు పైన వున్న యీ నవల ప్రతీకారం అనే పెద్దకథతో కలిసి మొత్తం 144 పేజీలవరకు  వరకూ ఉంది. ఈ నవల  ధనవంతులైన బెంగాలీ బాబుల భద్రలోక అంతఃపుర స్త్రీల చపల చిత్తాన్ని,ప్రేమరాహిత్యాన్ని బట్టబయలు చేసింది. సత్యజిత్ రే   సినిమాటిక్ ముగింపు స్పష్టతనివ్వదు. ఒక ఆశావాదంతో కథ ముగుస్తుంది. కానీ ఈ నవల నిరాశ మధ్య కొనసాగుతూ ఉంటుంది.  ఠాగూర్ తన నలభయ్యోయేట వ్రాసిన పుస్తకం ఆయన మరణించిన తర్వాత పద్నాలుగేండ్లకి మన తెలుగులో అనువాదం అయిన నవల.


చారులత కు స్వంత ఖర్చుల కోసం కొంత ధనము ఇవ్వడం అని ఉదహరిస్తారు ఒకచోట. రచనలలో ఠాగూర్ లో అభ్యుదయ కోణాన్ని ఇక్కడ గమనించవచ్చు. అప్పటి బెంగాలీ ధనవంతుల కుటుంబంలో అలా ఉండేదో లేక ఠాగూర్ స్త్రీకి స్వంత ఖర్చుల కోసం ధనం ఇవ్వడం అవసరమని భావించాడో కానీ.. ఆ ప్రస్తావన బాగుంటుంది. 


చారులత మానసిక కల్లోలమూ, ప్రేమైక హృదయం,వివాహిత స్త్రీగా ఆమె వివేకమూ మొత్తంగా చూస్తే  ఆమెపై పాఠకునికి కొంత జాలి మరికొంత విచారమూ కల్గుతుంది.భూపతి అలా ఉండకుండా ఉంటె బాగుండేది అనుకుంటాం తప్ప ఆ పాత్రపైన కోపమూ వుండదు. ఏ ఒక్క పాత్రపైనా విముఖత లేదా  ప్రేమ కలగని నిశ్చల హృదయంతో పుస్తకము మూసేసి నిరామయంగా ఉండిపోతాము. అనుభూతికి అందని దృశ్యాన్ని యెంత వర్ణించినప్పటికినూ అనుభవానికి రాని రుచిని ఆస్వాదించినట్లే వుంటుంది కాబట్టి యింకా యెక్కువ చెప్పకుండా ముగిస్తాను.     


పనిలేనివాడు పొట్టు తీయకుండా పల్లీలు తిన్నట్టు అసలు సిసలు రచన చదవాలంటే The Broken Nest  ఆంగ్ల నవలను చదువుకోవడమూ, అబ్బా చదివే ఓపిక యెక్కడుందిలే అనుకుంటే Charulatha  ఇంగ్లీష్ సంభాషణలతో వున్న నలుపుతెలుపుల సత్యజిత్ రే చిత్రాన్ని,   కాస్త ఆకర్షణీయంగా వుండాలనుకుంటే రంగుల చిత్రాన్ని చూడటమూ చేయవచ్చును. తెలుగులో చదవాలనుకుంటే pdf లో చదువుకోవచ్చు.     


https://www.youtube.com/watch?v=SVuZLVrPq98 చారులత ఇంగ్లీష్ సంభాషణలతో ఉన్న చిత్రం ఇక్కడ అందుబాటులో ఉంది.

The  Broken Nest అనురాగ్ బసు భార్య Tani Basu ఈ చిత్రాన్ని మరొకసారి నిర్మించారు The Epic Channel లో అందుబాటులో ఉంది 


మరొక నవలను పరిచయం చేస్తూ మరొకసారి... 


విచ్చిన్న సంసారం _ రవీంద్రనాథ్ ఠాగూర్ 

19, డిసెంబర్ 2018, బుధవారం

మట్టి మనుషులు

ఈ మధ్య ఫేస్ బుక్ పై విరక్తి చెందిన నేను డార్క్ నాలెడ్జ్ ని (అవసరంలేని విషయ జ్ఞానం) వదిలించుకునే క్రమంలో మూడు నవలలు చదివాను అందులో వొకటి మట్టి మనుషులు. ఆ నవలని చదివిన తర్వాత నా స్పందన వ్రాయకుండా వుండలేకపోయాను. అలాగే పంచకుండా కూడా వుండలేక ఈ నవలా పరిచయం.
సాహిత్యం యేమి చేస్తుందంటే కుసంస్కారంతో మూసుకున్న కళ్ళను తెరిపిస్తుంటుంది. మనలో నెలకొన్న బేషజాలను రూపుమాపడానికి తోటి మనిషిని అర్ధం చేసుకోవడానికి అన్నింటికన్నా ముఖ్యంగా మన ఉరుకుల  పరుగుల బెరుకుల ప్రయాణాన్ని ఆపి కాస్త మనలోకి మనం తొంగిచూసుకోవడానికి లోకాన్ని మరింత అర్ధం చేసుకునే ప్రయత్నంలో ఊతగానూ వుంటుంది. మనిషిని మనీషిగా మార్చకపోయినా మనిషిగా మిగిల్చే సంస్కారాన్ని నేర్పుతుంది.
నేను ఈమధ్య వ్రాసుకున్న నా ఆలోచన అదే విధమైన అర్ధం స్ఫురించేలా వొక వాక్యమూ అక్కడ నాకు కనబడటం యాదృచ్చికమే అయినా నేను కొంత వుద్వేగానికి గురైనమాట వాస్తవం. ఆ వుద్వేగమే ఆ నవలను కంప్యూటర్ తెరపై ఏకబిగిన చదివే వూపునిచ్చింది.
ఈ మట్టి మనుషులు నవల మనుషుల గురించి వ్రాసినది అయినా మనుషుల కోసమే వ్రాసినది అని ఆనంద కౌసల్యాయన పుస్తకం గురించి చెప్పిన రెండు మాటల్లో అన్నారు. కాళిందీ చరణ పాణి గ్రాహీ వ్రాసిన మొట్టమొదట రచన యిది. తెలుగులో ప్రధమ ముద్రణ మార్చి 1958 అయితే అంతకు ముందు పాతికేళ్ల ముందే యీ నవల పుట్టింది. ఈ నవల రచయిత మొట్టమొదటి రచన కూడా.
పూరీ జిల్లాలో డెలాంగా గ్రామంలో ఒక రైతు కుటుంబానికి చెందిన యిద్దరన్నదమ్ముల కథ యిది. ప్రముఖ ముద్రణా సంస్థ ఆనందలహరి గ్రంధాలలో మొట్టమొదట గ్రంధం యిది. గ్రంధం అంటున్నానని గ్రాంథికంలో ఈ నవల ఉంటుందని అనుకోవద్దు. ఒరియా తెలుగు రెండు భాషలు రెండు కన్నులుగా భావించే పురిపండా అప్పలస్వామి గారు ఒడియా నుండి తెలుగులోకి అనువదించారు. అనువాదకాలం కేవలం రెండు మాసాలు అని ముందుమాటలో చదివి ఆశ్చర్యం వేసింది. ఈ నవలా రచయిత ముఖమైనా చూడకుండా నవలను చదివి అనువాదం కోసం అనుమతి తీసుకోవడానికి వేరొక రచయిత ద్వారా కాళింది చరణ పాణిగ్రాహి తో పరిచయం పెంచుకున్నారని రచయిత చెప్పుకున్నారు. ఈ పుస్తకం వెలువడగానే దీనికి నాటక రూపమూ కావ్య రూపముగా కూడా మారిందంటే పాఠక లోకంపై సమకాలీనులైన రచయితలపై యెంతటి గాఢముద్ర వేసిందో అర్ధం చేసుకోవచ్చు.
గ్రామ జీవనంలో ఆదర్శవాదాన్ని మూలవస్తువుగా తీసుకుని యీ నవల జీవం పోసుకుంది అనేకంటే రచనాకాలం నాటి భారతీయ గ్రామ స్వభావాన్ని, ఎవరి వృత్తి వారు చేసుకుంటూ కులమత ధనిక పేదా తేడాలు లేని ఆదర్శ జీవనాన్ని గ్రామస్తుల కల్మషం లేని మనసులను భోళాతనాన్ని మనకు పరిచయం చేస్తుంది. వృత్తిరీత్యా యెవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే అందరి పొయ్యిలోకి వెళ్ళే కట్టెల మోపు వోలె కలిసి ఉండేవారు. వారిలో ఒకరే భిన్నమైన వాడు. ఆ ఊరి మోతుబరి హరిమిశ్రా.
గ్రామస్తులను అర్ధం చేసుకోవాలనే మనకు కూడా గ్రామీణ నేపధ్యం వుండివుండాలి లేదా సహృదయత యెక్కువన్నా ఉండాలి. నాగరీకులకు అల్పంగా మూఢాచారాలుగా అనిపించే విషయాల్లో గ్రామీణులు బహు సున్నితంగా చూస్తారు లేదా బలీయమైన విశ్వాసంగానూ పరిగణిస్తారు. ఆఊరి గ్రామదేవత మంగళా అమ్మవారు. గ్రామస్తులందరికీ ఆమెను అండ దండ గా భావిస్తారు. పధానపడ గ్రామంలో శామపదాను యిల్లంటే ధర్మానికి నిలయం. ఎన్ని తరాలుగా ఆ యిల్లు కూలి పోయినా ధర్మాన్ని మాత్రం కూలిపోనివ్వని ఆ యిల్లంటే గ్రామస్తులందరికీ వల్లమాలిన అభిమానం. గ్రామస్తుల మధ్య చిన్నచిన్న తగాదా మొదలుకుని పెద్ద పెద్ద విషయాల దాకా శామపదాను మధ్యవర్తిత్వం ఆ వూరిని నిలబెడుతూ ఉండేది.
శామపదాను ఇలా అంటూ ఉండేవాడు. ఓరే.. మనమేమో దరిద్రులం. చిన్న చిన్న దొంగలం. సొరకాయ మీద గుమ్మడికాయ మీద మనం కన్ను వేస్తాం. ఆ ప్రెసిడెంట్ జమిందారూ షావుకారూ వీళ్ళు దొంగలు కాదు దోపిడీ గాళ్ళు. పట్టపగలు దబాయించే గదమాయించే కేసులు కోర్టులూ అని బెదిరించి మనల్ని బికారులని చేస్తారు మనుషులను తినే మొసళ్ళు వీళ్ళు.. పులులను మొసళ్ళను కోర్టులు ఏమీ చేయలేవు న్యాయమేమీ చేయలేదు అని.
శామపదానుకి ఇద్దరు కొడుకులు బరజు, చకడీ. బరజు కొద్దిగా చదువుకుని వుద్యోగం చేస్తూ ఉంటాడు. చకడి ఆ మాత్రం చదువు కూడా లేకుండా జులాయిగా తిరుగుతూ కాలక్షేపం కోసం దగ్గరలోనే ఉన్న పట్టణానినికి వెళ్లి తిరిగొస్తూ ఉండేవాడు. బరజుకి తమ్ముడికి పదేళ్లు తేడా. బరజు పెళ్ళై నలుగురు పిల్లలు కల్గిన తర్వాత ఛకడికి పెళ్ళవుతుంది. చిన్న కోడలు కాస్త ఉన్నత కుటుంబం నుంచి నగ నట్రా సారె చీరలతో ఘనంగా అత్తగారింటికి రావడం వల్ల అహంభావము నోటి దురుసు యెక్కువ. అలాంటి కోడలితో మాటామంచి లేకపోతే ఇంకా అహంకారం యెక్కువగా ఉంటుందనే ఆలోచనతో శామాపధాను భార్య ఆమెపై ప్రేమ కురిపించేది. అది అలుసుగా తీసుకుని ఆమె తోటి కోడలుపై దురుసుగా వ్యవహరించేది. శామపధాను భార్య చనిపోతుంది. ఆ దిగులుతో శామపధాను కూడా మంచం పడతాడు. భూమి ఉన్న రైతు వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగించాలి కానీ వుద్యోగం చేయడం మన వంశ ధర్మం కాదని బరజుకి భోదిస్తాడు శామపధాను.తండ్రి కోరికను అర్ధం చేసుకుని చేస్తున్న అమీను వుద్యోగం మానుకుని వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉంటాడు బరజు. శామపధాను కూడా మరణానికి చేరువవుతూ ఉంటాడు. మీ యిద్దరన్నదమ్ములు విడిపోకూడదు. పొలం మధ్య గట్టు పడకూడదు.కొంప మధ్య గోడ లేవకూడదు. ఇది మాత్రం నువ్వు చేయాలి అని బరజు దగ్గర మాట తీసుకుంటాడు. తల్లి మాటలు విని మాకోసం యేమి దాచి పెట్టావ్ తాతా అని అడుగుతారు పిల్లలు. శామపధాను వేలెత్తి పైకి చూపిస్తూ మీ కోసం ధర్మం, ధర్మం దాచిపెట్టాను అంటూ కన్ను మూస్తాడు.
హరిమిశ్రా ఆ ఊరి పంచాయితీ ప్రెసిడెంట్. ఎవరికి అప్పునిచ్చి వారికి ఉన్న చెక్కా ముక్కా మడి ని కూడా తన దాంట్లో కలిపేసుకోవాలని చూస్తూ ఉండే వ్యక్తి. శామపదాను వుండగా ఆ గ్రామంలో అతని ఆటలు సాగవు. ఇప్పుడు తండ్రి స్థానంలో తండ్రి కన్నా యెక్కువగా బరజు ఆ ఊరి వారందరికీ ప్రియపాత్రుడు అయ్యాడు. ఊరి జనంలోకన్నా ఇంట్లోనే చిచ్చులు పెట్టి అన్నదమ్మలని విడదీయాలని పన్నాగాలు పన్నుతాడు.
ఇక పెద్ద  దిక్కులేని యింట్లో తోడికోడళ్ళిద్దరూ తమలపాకుతో నేనొకటి అంటే తలుపు చెక్కతో నేను రెండు అంటా అనుకునే బాపతు. రోజూ ఒకరిమీద ఒకరు భర్తలకు పితూరీలు చెప్పుకునే వారు. చిన్న కోడలు.. ఆమెకు నలుగురు పిల్లలున్నారు నాకేమన్నా పిల్లా జెల్లా నేనెందుకు యెక్కువ పని జేయాలి అంటూ నిత్యం గొడవపడేది. ఆ గొడవుల మధ్యే కొన్నేళ్ళు గడిచిపోతాయి. ఛకడీ పనులు చేసేవాడు కాదు. పైగా భార్య మాటలు విని అన్నని వదినని మాటలు అంటూ వుండేవాడు. బరజు భార్యనే కోప్పడి,ఆమె వినక పోతే మౌనంగా మాటాడకుండా శిక్షించి తమ్ముడితో అతని భార్యతో గొడవలు పడకుండా సర్దుకుపోయేటట్లుగాను ఆమె వారిని ప్రేమించే రీతిలో భార్యలో మార్పు తీసుకువస్తాడు. ఉమ్మడి కుటుంబంలోనే పిల్లలకి పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. మనకి రావాల్సిన సొమ్ముకి లెక్కా పత్రం లేదు అంటూ చకఢి  చెవిలో పోరుతూ ఉండేది అతని భార్య. తండ్రి మాటను మనసులో ఉంచుకుని అన్నదమ్ములు విడిపోకుండా వుండటానికి చాలా చేసాడు బరజు. అయిననూ ఆ అగ్గి ఆరలేదు. కోతకు వచ్చిన పంటను వండిన బెల్లాన్ని తీసుకుని బజారులో అమ్ముకుంటాడు. అయిననూ బరజు తమ్ముడిని ఏమీ అనడు.
అప్పట్లోనే వూర్లో పేదవాళ్ళపై జులుం చూపి అన్యాయంగా దండిస్తాడు హరిమిశ్రా. ఊరందరూ బరజు మాటలతో ఏకం అవుతారు. కలిసికట్టుగా అన్యాయాన్ని యెదుర్కోవాలని మాట చేసుకుంటారు. ఓటమిని సహించలేక హరిమిశ్రా మరింత కక్ష పెంచుకుంటాడు. అతని చెప్పుడు మాటలు విని వెనుకనుండి భార్య రెచ్చగొడుతూ వుండటమూ వల్ల యెట్టకేలకు మొహమాటాన్నివీడి గొంతు పెద్దది చేసి అసలు విషయాన్ని వెల్లడిస్తాడు చకడి. పిల్లల పెళ్ళికి అయిన ఖర్చు వివరాలు ఆ లెక్క చెపుతూ నాకు సగభాగాన్ని పంచి ఇవ్వమని అడుగుతాడు. బరజు యేమీ మాట్లాడకుండా సమస్తం తమ్ముడికి వొదిలేసి చిన్ని బట్టల మూటతో భార్యా పిల్లలతో కలిసి వూరు విడిచి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళే దృశ్యాన్ని రామాయణ కావ్యంలో శ్రీరామచంద్రుడు తండ్రి మాట అనుసరించి కానలకేగుతున్నప్పుడు విలపించినట్లు వూరు వూరంతా బరజును అనుసరిస్తూ అతనికి వెళ్ళవద్దని ప్రాధేయపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఆఖరికి ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటే మట్టి మనుషులు నవల చదవాల్సిందే. ముఖ్యంగా రచనా దర్పణంలో కొండంత వాస్తవాన్ని కొంచెంగా మాత్రమే చూపగలం. ఊహలకి అందని మనిషితనం యెప్పటికప్పుడు సంస్కరింపబడుతూ వుండటం వల్ల నిజజీవితంలో దానిని చివరికంటా చూడగలం. మంచి సాహిత్యం ఆ మార్గంలో మనిషిని నడిపిస్తుంది.
పిల్లల కోసం ముందు తరాల వారు స్దిర చరాస్తులు వస్తువాహనాలు కాదు సంపాదించాల్సింది.. ధర్మం అని .. ఆ ధర్మమే మానవుని మనుగడకు సాక్షీభూతమై నిలుస్తుందని.. తమ పూర్వీకులు అదే పని చేసారని తనూ అదే పని చేసానని శామపధాను కొడుకుకి చెబుతూ .. అదే ధర్మాన్ని ఆచరింపమని కొడుకు బరజు ఛకడి లకు చెబుతాడు. నవలలోపాత్రల ద్వారా పలికించడం ఆచరింపజేయడమూ చేత ఆ రచయిత ధృక్ఫదం యేమిటన్నది సృష్టంగా తెలిసిపోతుంది. ఈ నవలలో నాకు బాగా నచ్చిన విషయం యిది.
ఇల్లు వొదిలిన కాలంలోనూ తమ్మునికి సమస్తం వొదిలేసి గమ్యం లేని ప్రయాణం చేస్తున్న ఆ రోజున కూడా పాండవులు అందరూ ఇలా అన్ని వదిలి అడవుల వెంట తిరగలేదా రామచంద్రుడు సీతతో కలిసి వనవాసం చేయలేదా.. అదీ ధర్మానికి కట్టుబడే కదా.. వారి బాటలోనే నేనూ అని అనుకుంటాడు బరజు.
పురిపండా అప్పలస్వామి గారి చక్కని బాషా సౌందర్యం ఆ అనువాదంలో నిండుకుని ఉంది. అక్కడక్కడా ఒడియా పదాలు ఉన్నప్పటికీ కింద ఫుట్ నోట్స్ ఇవ్వడం వల్ల చదవడానికి ఇబ్బంది లేకుండా హాయిగా వుంది. భారతీయ గ్రామీణ జీవనం తాలూకు ఆత్మ ఈ నవలలో ప్రతిబింబించింది. పాఠకుడు నవలాకాలంలోకి వెళ్ళి ఆ విరూపానదీ తీరంలో మంగళా అమ్మవారి సాక్షిగా ఆ పచ్చని చేలలో తిరుగుతూ కాయకష్టం చేసుకునే ఆ గ్రామీణుల అమాయకత్వంతో అమాయకంగా చైతన్యంలో చైతన్యంగా బరజు వెంట సహప్రయాణం చేస్తూ వుంటాం. ఈ నవలలో అంతగా లీనమై పోవడానికి కారణం మాత్రం నాదీ గ్రామీణ వ్యవసాయ నేపధ్యం కావడం వలెనే అనుకుంటున్నాను. ఉమ్మడి కుటుంబాలు లేకపోయినా కనీసం రక్తసంబంధీకుల మధ్యనైనా ఆత్మీయభావన నెలకొని ఉండటానికి చదివిన పాఠకుల మనసుని కాస్త తడి చేయడానికి ఈ నవలా పఠనం దోహదం చేస్తుందని నేను నమ్ముతున్నాను.
మరొక నవలా పరిచయంతో మరొకసారి. నమస్సులతో ..
  

ఇదిగో యీ  లింక్ లో యీ నవలను చదవచ్చు.  మట్టి మనుషులు -పురిపండా అప్పలస్వామి

  
   

15, ఏప్రిల్ 2017, శనివారం

తన్హాయి

ఓ..కాంత ..ఏకాంత గాధ.."తన్హాయి"



తన్హాయి నవలని చదవడం మొదలెట్టగానే కొంచెం ఆసక్తి. ఓహ్.. పెళ్ళయిన వారి మధ్య ప్రేమ చిగురించిందా!? ఏమవుతుందో..చూద్దాం అనుకుంటూ ఏకబిగిన చదవడం మొదలెట్టాను. చదువుతున్న కొద్దీ పరిచయం అవుతున్న ప్రతి పాత్ర లోను మరో నేను ప్రత్యక్షం అవుతున్నాను. కల్హార,కౌశిక్ ల ప్రేమ,వారి మానసిక సంఘర్షణ  నాకు తెలిసిన ఎవరిలోనో చూస్తున్నట్లు బలమైన భావన.


కౌశిక్ అనుకుంటాడు కల్హార మనసు నాది. ఆమె పూర్తిగా నా సొంతం. ఆమెని నాతొ కలసి జీవించడానికి ఒప్పించి నా భార్యకి తెలియకుండా.. ఆమెతో.. కలసి ఉండటం ని సాధ్యం చేసుకోవాలి. పెళ్ళైన తర్వాత వచ్చే ప్రేమలో ..ఆ ప్రేమని సొంతం చేసుకోవడంలోను ,మరొకరికి అన్యాయం చేస్తున్నామన్న భావనలోను యెంత మానసిక క్షోభ ఉంటుందో చదువు కుంటూ పోతుంటే టెన్షన్ మొదలయింది. ఆఖరికి ఏమవుతుందో అన్న టెన్షన్ తో ఆఖరి పేజీలు చదవడం నాకు అలవాటు. కానీ మనసు ఉగ్గ బట్టుకుని ఓపికగా చదవడం చేసాను. విదేశాలలో జరిగే పెళ్ళిళ్ళు,వారు తీసుకునే స్వేచ్చా నిర్ణయాలు అందువల్ల కుటుంబానికి జరిగే నష్టాలు గురించి ఆలోచిస్తూనేకౌశిక్, కల్హారల ప్రేమ ఒక తీరం చేరాలని ఆశించాను. కానీ కల్హార యెంత సంఘర్షణ అనుభవించింది. యెంత నిజాయితీగా తన మనసుని,భావాలని వ్యక్తీకరించగల్గింది అని నిశితంగా చూసేటప్పటికి ఆ పాత్ర పై నాకు అమితమైన ప్రేమ పుట్టుకొచ్చింది. చదివిన భాగాన్నే  మళ్లీ మళ్లీ చదివాను.


అపుడు ఈ నవలపై ఒక సమీక్ష వ్రాస్తే అన్న ఆలోచన వచ్చింది. అది ఒక సాహసమే అనుకున్నాను. ఎందుకంటే సమీక్ష వ్రాయడమంటే  ప్రతి పాత్రని నిశితంగా అర్ధం చేసుకోగల్గి ఏ పాత్ర పై అభిమానం ఏర్పరచుకోకుండా నిస్పక్షపాతంగా తప్పు ఒప్పులని చెబుతూ..వ్రాయాలేమో!కానీ నాకీ నవల చదవడం పూర్తయ్యేటప్పటికి “కల్హార”పాత్ర పైవిపరీతమైన అభిమానం పుట్టుకొచ్చింది. పెళ్లి అయిన తర్వాత పుట్టే ప్రేమ పై నెగెటివ్ ఫీలింగ్ ని అది సమంజసమే అని చెప్పడం సాహసం అని చెప్పను. అది సహజం అని కొందరైనా గుర్తించారు కాబట్టి అలాటి ప్రేమలోని లోతుపాతులని, కలసి బ్రతకాలి అనుకునే టప్పుడు ఉండే సాధ్యా సాధ్యాలని  చెప్పే ప్రయత్నం చేసారు నవలా రచయిత్రి.


మానసిక మైన ప్రేమ మాత్రమే సొంతం చేసుకుని బాధతో విడిపోయిన పెళ్ళయిన ప్రేమికులు కల్హార-కౌశిక్ లు. వారి మధ్య శారీరక సంబంధాలు కనుక నెలకొని ఉంటే వారి జీవిత భాగస్వామ్యులు చైతన్య,మృదుల అంత పాజిటివ్గా ఆలోచించ గల్గేవారా!? అన్న కోణంలోనేను చేసిన ఈ సమీక్ష. ఇది.


ప్రేమ ఒక భావ ఉద్వేగం,కొన్ని అనుభూతుల పుష్ప గుచ్చం.


పెళ్లి ..ఒక భాద్యత తో కూడిన ఆలోచనా స్రవంతి.


ఎవరి యెదలో ఎప్పుడు ఈ ప్రేమ జనియిస్తుందో ఎందుకు మరణిస్తుందో! మరణించి బ్రతికి ఉంటుందో ఎవరు చెప్పలేరు.


భావాలు,అభిరుచులు కలసినంత మాత్రాన ఎవరు స్నేహితులు అయిపోరు.కలవక పోయినా భార్యాభర్తలు కాకుండాను పోరు.


కానీ  ఆమె లేదా అతని ఫీలింగ్ ని తన ఫీలింగ్ గా అనుభూతి చెందే భావం మాత్రం ఖచ్చితంగా ప్రేమే!

ఆ ప్రేమలో స్వార్ధం ఉంటుంది కౌశిక్ ప్రేమలో స్వార్ధాన్ని  చూస్తాం మనం, కల్హార మనసు తనది అని తెలుస్తూనే ఉంది. ఆమె మనసు పై సర్వాధికారమ్  ఉన్నప్పుడు ఆమె శరీరాన్ని  తను కోరుకుంటున్నాడు.అది అతనికి తప్పుగా తోచలేదు. ఎందుకంటే  అతను పురుషుడు. ఏ పురుషుడు కూడా నీ మనసు మాత్రమే నాక్కావాలి  నీ శరీరం నాకు అక్కర్లేదు అనడు. తనువూ,మనసు కలిస్తేనే పరిపూర్ణం అనుకోవడం కద్దు.


అదే సంఘర్షణ కల్హార మనసులోనూ తలెత్తి..కౌశిక్ ని తను మనసారా కోరుకుంటున్నాని అర్ధం కాగానే.. భయం కల్గుతుంది.  అది ఆమెలో కల్గిన శారీరక , మానసిక స్పందనలకి పరాకాష్ట. అది మనం గుర్తించ గల్గుతాము కూడా.

కౌశిక్ ని ప్రేమించానని తెలియగానే ఆమె మనసులో తలెత్తిన సంఘర్షణ  అదే ప్రేమని కొనసాగించాలనే ఉద్దేశ్యం ఉంటే..తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యలు ఆమె కళ్ళ ముందు కదలాడి ఆమెని కట్టడి చేసి ముందుకు వెళ్ళనీయకుండా సంకెళ్ళు వేసాయి కానీ కౌశిక్ పై ఆమెకి కల్గిన ప్రేమని మొదలంటా తుడిచివేయలేక పోయింది అంటే మనసు యొక్క ప్రభావం మనిషిని శాసించ లేదని చెప్పకనే చెబుతుంది.


కౌశిక్ కల్హార ల మద్య ఒక ఆకర్షణ ,బలీయమైన మోహం,ఇద్దరు దగ్గరగా ఉండాలనే కాంక్ష కూడా కనబడుతుంది.వ్యక్తీ గతమైన భావనలకి విలువనీయకుండా ఇద్దరూ కూడా వారితో ముడిపడిన మిగిలిన వారి గురించి కూడా ఆలోచించుకుని విడివడటం “తన్హాయి” చదివిన పాఠకుల అందరి కి నచ్చిన విషయం.


కల్హార మరో రాజేశ్వరి కాలేదు. చినుకుకై పుడమి నోరు తెరిచి నట్టు కౌశిక్ ప్రేమకై ఆమె అంతరంగం పరితపించింది. అయినను మోహం తో అతని దరి చేరలేదు. కౌశిక్ ప్రేమలో ఆమెకి హృదయ సాంత్వన లభించింది. ఆమె స్నేహితురాలు మోనికా ఇంట్లో వారు ఇరువురు కలసినప్పుడు ప్రేమలోని ఒక ఉద్వేగం తో..వారు ఇరువురు ఆత్మీయంగా దగ్గరిగా ఒదిగిపోవడంలో ప్రేమ తప్ప దేహపరమైన కాంక్ష ఉండకపోవడాన్ని మనం చూడవచ్చు.


చైతన్యతో గడిపిన జీవితంలో ప్రేమ లేకపోయినా ఆ బంధంలో భద్రత ఉంది. తన కూతురి బాగోగులు,సమాజంలో ఒక గౌరవనీయమైన స్థానం కూడా ఉన్నాయి. అందు కోసమే ఆ ప్రేమని త్యజించింది.

హటాత్తుగా ఆమె కి లభించిన ప్రేమ పాత్ర లో కౌశిక్ ఇచ్చిన ప్రేమామృతం తో నింపబడిన తర్వాత కూడా ఆమె సంశయించింది. నిజాయితీగా తనలో కౌశిక్ పట్ల కల్గిన భావ సంచలనాలను చైతన్యకి చెప్పడం అన్నది సాహస నిర్ణయమే!ఇలా ఎందుకు చెప్పడం ? మనసులోనే దాచేసుకోవచ్చు కదా అన్న చిరాకు కల్గుతుంది. కానీ కల్హార తనను తానూ మోసగించుకొని,ఇతరులని మోసగించే గుణం లేని నిజాయితీ కల్గిన స్త్రీ.


చైతన్య కూడా  మీరివురి మధ్య సంబంధం అక్కడి వరకు వెళ్ళిందా అనే సందేహాన్ని పదే పదే వ్యక్తీకరిస్తాడు. అది ఒక అనుమాన పూర్వకమైన సందేహం,అవమాన పూర్వక మైన సందేహం కూడా. అలాంటి సందేహం పురుషునిలో ఉంటుందని తెలుసు కాబట్టీ.. కల్హార పాత్రని కౌశిక్ తో మమేకం చేయకుండా శారీరక సంబంధాలకి అతీతమైన ప్రేమ కూడా ఉంటుందని ఒక పాజిటివ్ దృక్పధాన్ని చెప్పే ప్రయత్నంలో సపహలీకృతం అయ్యారనే చెప్పవచ్చు.

రచయిత్రి ఈ కోణం లోనే.. కల్హార చుట్టూ ఒక బలమైన కోట గోడ కట్టారు. స్త్రీ మనసులో పెళ్లి తర్వాత కూడా ప్రేమ జనించడం సహజమైనదే! వివాహ బంధంలో మూడో మనిషి కి ప్రవేశం కొన్ని అసంతృప్తుల మధ్య మాత్రమే సులువు అవుతుంది. ఆ అసంతృప్తి కల్హార మనసులో ఉంది. ప్రేమ లేని పెళ్లి ఉంటుంది. ఉంది కూడా. అదే ప్రేమ ఉన్న మనుషులు ఒకటిగా కలసి ఉండటానికి అంతకి ముందు ఉన్న బందాలని త్రుంచుకు వెళ్ళ గల్గె సాహసం భారతీయ స్త్రీకి ఉండదు అని కాదు కాని ఆ సాహసోపేత నిర్ణయాలు తీసుకునే ముందు వివేకం కల వ్యక్తిగా ఆలోచించడం, నిజాయితీగా చెప్పడం  జీవితాంతం ఒక అనుమాన పూరితమైన ప్రశ్నకి సమాధానం తానూ చెప్ప గల్గినా కూడా ఆ ప్రశ్నని ఎదుర్కోడానికి తయారుగా తనని తానూ బలోపేతం చేసుకోవడం సామాన్య విషయమేమీ కాదు. చాలా మంది కల్హార పాత్రని చిన్న చూపు చూస్తారేమో కూడా! పెళ్లి అయిన స్త్రీకి మళ్ళీ ప్రేమ ఏమిటి? అన్న నిరసన భావం తో పాటు చైతన్య కాబట్టి అర్ధం చేసుకోగల్గాడు అన్న సానుభూతి చైతన్య పై కలగడం సాధారణ విషయం.


మనసు భావ సంచనల రూపం. దురదృష్టవశాత్తు మనసుని మనం నగ్నీకరించి చెప్పలేం. అలాగే మాట కూడా.మనం మాటకి ముసుగు వేస్తాం. కల్హార తన మనసుని ఎక్కువ కాలం దాచుకోలేకపోయింది. నిజాయితీగా ఏం చేయాలో చెప్పమని చైతన్యని అడుగుతుంది. ఒకవేళ అతను ఆమెని ద్వేషించి ఆమె నుండి విడిపోయినా కూడా ఆమె తప్పుకు ఆమె బాద్యురాలిగా చేసుకునే వ్యక్తిత్వం ఉన్న స్త్రీ.


ఇదే నవలలో  ఇంకా కొన్ని స్త్రీల పాత్రల కంటే కూడా ఆమె పాత్ర విభిన్నమైనది.

పవిత్రత అన్నది అది మానసికమా శారీరకమా అన్నది ఎవరికి వారు విలువనిచ్చుకునే విషయం. ప్రమాదవశాత్తు పడిన ప్రేమలో మనసు జారిపోయినా చాలా సందర్భాలలో కౌశిక్ సన్నిహితంగా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడల్లా అతనిని కట్టడి చేస్తూ ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది చైతన్య పదే పదే అడిగినప్పుడు కూడా తానూ మనసునే కోల్పోయింది కాని శరీరాన్ని కౌశిక్ తో పంచుకోలేదు అని చైతన్య కి చెప్పగల్గింది. అదే విషయం వారి మధ్య ఎడబాటు రాకుండా ఎడబాటు కానీయ కుండా కాపాడ కల్గింది. చైతన్య కూడా ఒక సాధారణ పురుషుడే! తన వైవాహిక జీవితం అనే కోట కి పగుళ్ళు ఏర్పడినాయి అని తెలియగానే తన పరువు-ప్రతిష్ట లకి భంగం వాటిల్లుతుందని బాదపడతాడు. భార్యకి తను ఏం తక్కువ చేసాడు ఇప్పుడేనా కల్హార ఇలా ప్రవర్తించడం,లేక ఇంతకూ ముందు కూడా ఇలాటి ప్రేమ కలాపాలు కొనసా గించి మభ్య పెట్టిందా లాటి ప్రశ్నలు తలెత్తుతాయి. అదే అభద్రతా బావం మృదుల మనసులో కూడా తలెత్తడం సహజం. 


కౌశిక్,కల్హార ల మధ్య శారీరక సంబంధం కనుక ఏర్పడి ఉంటే చైతన్య కానీ ,మృదుల కానీ ఆ విషయాన్ని అంతా తేలికగా తీసుకునే వారా!? ఇదంతా ఆలోచించేనేమో రచయిత్రి కౌశిక్,కల్హార మధ్య శారీరక దూరాన్ని ఉంచారు ఏమో అనిపించక తప్పదు.


ప్రేమలో మోహం కూడా మిళితమై ఉండటమే ప్రేమకి పరాకాష్ట. సంపూర్ణ ప్రేమ స్వభావాన్ని అనుభవంలోకి రానీయక ఒక ఆత్మీయ చుంభనంతో ఇరువురు ప్రేమికులని విడదీయడం వెనుక భారతీయ మనస్తత్వమే గోచరించింది. అదే ఇంకెవరు ఆయినా లేదా రంగనాయకమ్మ లాంటి రచయిత్రి అయి ఉన్నట్లు అయితే ఆ విషయం కి అంత ప్రాధాన్యత నివ్వరు. ప్రేమ అన్నది మనసుల కలయిక ,శరీరాల కలయిక అన్నదానికి ప్రాముఖ్యత నివ్వరు. నీ మనసులో ప్రేమే కావాలి నీ శరీరం వద్దు అనే ప్రేమికుడు ఎవరైనా ఉన్నారంటే నమ్మశక్యం కాదు.


మన భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ ఇంకా బ్రతికి ఉంది అంటే కారణం అదే! ప్రేమ లేకపోయినా పెళ్లి జరిగాక శారీరకమైన సంబంధం ద్వారా పురుషుడు స్త్రీతో అనుబంధం ఏర్పరచుకుంటాడు. ఆ అనుబందాన్ని బలోపేతం చేసుకుంటాడు.ఒకవేళ పురుషుడు వేరొక ఆకర్షణలో పడినా కూడా స్త్రీలు తప్పని సరి అయి సర్దుకుని ఉండే వారు కావడం వల్ల వివాహ వ్యవస్థకి భంగం వాటిల్లలేదు.


అదే స్త్రీల విషయంలోకి వచ్చేసరికి పెళ్ళికి ముందు ఎన్ని ఊహలు ఉన్నా పెళ్లి జరిగిన తర్వాత పురుషుడి చుట్టూ తన ఆలోచనలని అల్లుకుని..అందుకు అనుగుణంగా తనని తీర్చి దిద్దుకుంటూ అక్కడే జీవితాన్ని నిర్మించుకుంటుంది.


ప్రపంచం ఏమిటో తెలియని స్త్రీకి పురుషుడే ప్రపంచం. అందుకని ఏమో.. స్త్రీలని వీధి వాకిట నిలబడటానికి కూడా అభ్యంతరం చెప్పేవారు. ప్రపంచాన్ని చూసిన స్త్రీకి తనకి కావాల్సినది ఏదో తెలుసుకుంటుంది. ఆ తెలుసుకున్న క్రమంలో హద్దు దాటుతుంది. ఆ హద్దు దాటే ప్రయత్నంలో తనకి తానే చేటు చేసుకుంటుంది. అసంత్రుప్తులని బడబాగ్నిలా దాచుకుని కోర్కెలని అణచుకొని వివాహ జీవితంలో మగ్గిపోతుంది. నాకు కల్హార పాత్రలో ఇదే కనబడింది. సప్త సముద్రాలు దాటినా యెంత ఉద్యోగం చేసినా ఆమెలో కల్గిన ప్రేమ రాహిత్యం అన్న భావనని చైతన్య తుడిచి వేయగలడా? కౌశిక్ ని ఆమె మనసు నుండి తుడిచి వేయగలడా!? స్త్రీ ప్రేమ మానసికం. ప్రేమించిన వ్యక్తి ని ఆలోచనలోను,జ్ఞాపకాలలోను నింపుకుని ప్రేమని క్షణ క్షణం సజీవంగా ఆస్వాదించ గలదు. ఆ ఉత్తెజంతోనే బ్రతక గలననే నిబ్బరం తోనే కౌశిక్ తనని వీడి పోతుంటే కల్గిన బాధని అనుభవిస్తూ కూడా అలాగే నిలబడి పోయింది.


ప్రతి కలయిక ఒక విడిపోవడానికి నాంది అంటారు. వారి ఎడబాటు మాత్రం జీవిత కాలం బ్రతికి ఉండటానికి అని వారిద్దరికీ మాత్రమే తెలుసు. మరో ఇద్దరికీ తెలిసే అవకాశం ఉన్నా కూడా.. వారు మనిషికి ఇచ్చిన ప్రాముఖ్యత మనసుకి ఇవ్వలేదు కాబట్టి..సంప్రదాయమైన వివాహ జీవితం మాత్రం పై పై మెరుగులతో..లోపల డొల్ల గానే మిగిలి ఉంటుంది.


అవగాహన,సర్దుబాటు,రాజీపడటం,సమాజంలో గౌరవం ఈ నాలిగింటి కోసమే ఆ రెండు జంటలు  మరో రెండు హృదయపు శకలాల పై నిలబడి ఉన్నాయి అన్నది ఎవరు కాదనలేని సత్యం.


ఈ నవలలో నాకు అత్యంత బాగా నచ్చిన పాత్ర కల్హార. తనలో కలిగే భావనలకి ఎక్కడా ముసుగు వేయదు. అనవసరమైన పవిత్రతని ఆపాదించు కోదు. ఎప్పటికప్పుడు సహజంగా ప్రవర్తించడం కనబడుతుంది. రక్త మాంసాలు ఉన్న స్పందన కల్గిన స్త్రీగా ఆమె మనసులో కల్గిన భయాలని మరచిపోయే చోటు కౌశిక్ సాన్నిహిత్యమే అని ఆమెకి తెలుసు. అలాగే చైతన్యతో తన జీవితం లో కల్గిన లోటు కూడా ఏమి ఉండదు అని అనుకుంటుంది. కౌశిక్ ని ప్రేమించడానికి, చైతన్యని ద్వే షించాల్సిన పని లేదు అనుకుంటుంది. ఇద్దరి పైనా ఏక కాలంలో ప్రేమ కల్గినా కూడా అది తప్పు కాదనుకుంటుంది.


ప్రేమ లక్షణం బహుశా అదేనేమో!అది అందరికి నచ్చదు కూడా. ఇద్దరి పై ప్రేమ ఏమిటి..అది వళ్ళు బలిసిన ప్రేమ కాకపొతే అని తిట్టిన్చుకోవాల్సి వచ్చినా సరే రహస్యంగా ఉంచక ఏమో ఎందుకు కల్గిందో ఈ ప్రేమ అనుకునే స్వచ్చత కల్గిన స్త్రీ మూర్తి కల్హార. ఆమె ప్రేమని.. బహుశా కౌశిక్ కూడా పూర్తిగా అర్ధం చేసుకుని ఉండదు. ఒక్క మోనికా తప్ప.


ఒకే ఒక్క రోజు ఆయినా సరే అతనితో సన్నిహితంగా ఉండి సంపూర్ణ జీవితం ని గడపాలనే ఆకాంక్షని వ్యక్త పరుస్తుంది. అక్కడ మనసు,శరీరం రెండు కలసిన కలయికకి యెంత తపించిపోయిందో.. రచయిత్రి సహజంగా వ్రాశారు. అందులో ఎక్కడా కల్హార పాత్రని ద్వైదీ భావనలో  తేలియాడించనూ ఒక ఇనుప చట్రంలో ను బిగించలేదు. మనసు పిలుపు కన్నా కూడా శరీరం పిలుపు కూడా అంతే బలంగా ఉంటుందని కల్హార పాత్ర ద్వారా చెప్పడాన్ని  జీర్ణించు కోలేరేమోనన్న అనుమానం ఉంది. కాని అది సబబుగానే అనిపించింది.


తప్పు ఒప్పు ల దృష్టి తో చూస్తే..ఆంతా తప్పే! అసలు తన్హాయి నవల లో కల్హార పాత్ర చిత్రీకరణే తప్పు. మన మధ్య చైతన్యలు, మృదులలు ఎక్కువ శాతం, కౌశిక్ లు మరి కొంత శాతం అతి తక్కువ శాతం మంది మాత్రమే కల్హార లాంటి నిజాయితీ కల్గిన పాత్రలు ఉంటారు. రచయిత్రి నాలుగు పాత్రలలోనూ తన వ్యక్తి గత అభిప్రాయం ని జోప్పించినా జోప్పించక పోయినా అది పెద్ద పరిగణలోకి నేను తీసుకోలేదు. కల్హార పాత్ర చిత్రీకరణని చాలా మంది స్వాగతిస్తారు అనుటలో ఎట్టి సందేహం లేదు. కల్హార  వికసిత విరాజ కుసుమం.  బుద్భుదమైన భావ జాలంలోనుండి జనియించిన సహస్ర భావాలతో అరవిరిసిన పుష్పం..


తనలో కలిగే భావాలని,ఆలోచనలు స్వేచ్చగా వెల్లడించు కునేటప్పుడైనా నిజాయితీ లోపిస్తే ఈ మనుషులకి మనసు అనే వ్యర్ధ పదార్ధం ఎందుకు? అని నాకు అనిపించినది అంటే అంతలా కల్హార పాత్ర చుట్టూ నెలల తరబడి నా ఆలోచనలు చుట్టుకుని ఉన్నాయి.


పెళ్ళికి ముందు పెట్టుకునే డేటింగ్ గురించి , ఓపెన్ మేరేజ్ సిస్టం గురించి,వైఫ్ స్వాపింగ్ గురించి మనం చీత్క రించు కుంటున్నాం కానీ మన భారతీయ వివాహ వ్యవస్థలో సంప్రదాయ ముసుగులో ఎన్నో మనవి కాని విచ్చలవిడి తనాలు రాజ్యం యేలుతున్నాయి సంప్రదాయవాదులు పాశ్చాత్య నాగరికత తో మన వాళ్ళు చెడిపోతున్నారు అంటున్నారు .కానీ మన వారిలోనూ ఉండే బహు భార్యా తత్వాలు,అక్రమ సంబంధాలు మాటేమిటి!? కొన్ని భావజాలాల మధ్య స్త్రీ స్వేచ్చని అణగ ద్రొక్కిన వివాహ వ్యవస్థలో కల్హార లాటి వాళ్ళు తమ మనసుని తమలో పెళ్లి తర్వాత కల్గిన భావ ప్రకంపనలని వెల్లడి చేసే నిజాయితీ తనం అందువల్ల కలిగే పరిణామాలు మంచి-చెడులు  వాటి మధ్య వివాహ బందానికి ఇస్తున్న ప్రాధాన్యత అందరికి నచ్చి ఉండవచ్చును.


నాకు మాత్రం కౌశిక్ ప్రేమకి దూరం అవుతున్న కల్హార మనసులో వేదన కళ్ళముందు కదలాడుతుంది. ఆమె పాత్రపై సానుభూతి కల్గుతుంది. 


“ప్రేమయన నొక పంచభూతముల సమాహారమ్ము! అందు కలయికొక్కటేను, ప్రేమికుల ముందున్న దారి!!” అని సాఖీ గీతం. ఇదేమిటి వీరు ఇలా విడిపోయారు అన్న బాధ కల్గింది.కన్నీళ్లు వచ్చాయి.


మనసంటే అచ్చమైన నిజాయితీ. ఆ మనసుకి లభించే కూసింత ఆలంబన, లభించిన ప్రేమ,జీవన పర్యంతం కాపాడే స్నేహ హస్తం దొరికే చోట మనసు స్వేచ్చగా నిర్భయంగా మసలగల్గుతుంది.


కల్హార మనసుకి తనకి కావలసినది దొరికే చోటు కౌశిక్ హృదయం అని తెలుసు.ఇద్దరు వివాహితుల మధ్య అది సాధ్యం కాదు కనుకనే విడిపోయి ఆ ప్రేమని తలచుకుంటూ బ్రతక గలం అని .దూరం అవుతారు. మనసు ఏకాంతంలో తనని తానూ తరచి చూసుకుంటుంది. ప్రపంచం నుండి విడివడి ఆ ఒంటరి తనం లోనే, తనలోనే బ్రతుకుతూ కాసిన్ని మధుర జ్ఞాపకాలుతో సహజీవనం చేస్తుంది. అదే “తన్హాయి”


ఈ నవల లోని కథ పాతదే కావచ్చు. ఎందుకంటే వివాహం తరవాత ప్రేమ కూడా చాలా పాతదే! ఒక “సిల్సిలా” చిత్రం నా కనుల ముందు అలా కదలాడింది. ఆఖరిగా ఒకటి అనిపించింది. కల్హార-కౌశిక్ విడిపోయారు కాబట్టి ఇది ఒక “సిల్సిలా” చిత్రం లా ఉంది. లేకపోతే మేఘసందేశం అయి ఉండేది అని.


ఒక వివాహిత స్త్రీ మనసులోని భావ ప్రకంపనలని, అనుభూతులని అక్షరీకరించి “కల్హార” ని పరిచయం చేసినందుకు. కల్పన రెంటాల గారిని  అభినందించక తప్పదు.


అలాగే నేను గమనించిన ఒక చిన్న అంశం. కలువ పూలతో లక్ష్మి దేవిని పూజించడం కాదు.కమలాలు అని చెప్పాలి కదా! కలువ కి కమలానికి తేడా ఉంది. ఆ చిన్న విషయంని గమనించలేదేమో అనుకున్నాను. కొన్ని చోట్ల ఇంగ్లీష్ లో ఉన్న సంభాషణ లన్నిటిని తెలుగులో ఉంచితే బాగుండును కదా అనిపించింది కూడా.

ప్రతి పెళ్లి కాని అమ్మాయి, పెళ్లి అయిన స్త్రీ కూడా చదవాల్సిన నవల ఇది. “ఓ అపురూప ప్రేమ కావ్యం ” గా ఉదహరించుకోవచ్చు కూడా. *  _వనజ తాతినేని.


(ఈ స్పందన చాలా పాతది బ్లాగ్ లో భద్రపరుచుకునే క్రమంలో పోస్ట్ చేసింది ... ఇంతకు క్రితం "విహంగ " లో  మే  2012 సంచికలో ప్రచురితమైన  స్పందన ఇది . )


22, అక్టోబర్ 2013, మంగళవారం

చలం "ఊర్వశి "



వెళితే వెయ్యేళ్ళు  వెదుకుతావ్ ! చలం ఊర్వశి  పురూరవుడితో అన్న మాటలివి . ఒక స్త్రీ పురుషుడితో అన్న ఈ మాటలు బాగా నచ్చాయి

"పురూరవ" చలం విరచిత రేడియో నాటకం  వింటున్న ప్రతిసారి ఏవో కొత్త అర్ధాలు స్పురిస్తాయి. చలం రచనలు కూడా అంతే! పాఠకులు  వారి రచనలు పరిచయం లేకున్నా సరే ...  ఆయనేదో విచ్చలవిడి శృంగారం  గురించి వ్రాసాడట . ఆ పుస్తకాలు చదవడం దండగ అనేమాట ఎక్కువ వింటాం .

అసలు చలం రచనలు అందరూ చదవతగినవి కాదా ? అనే అనుమానంతోనే చదవడం ప్రారంభించి .. కొంత విసుగు తోచి అక్కడ పడేయడం మళ్ళీ చదవాలనిపించడం చదివినదే చదువుతూ ఆలోచించడం మొదలెడతాం .

మిగతా రచనల గురించి ప్రక్కన పెడితే  పురూరవ  గురించి నేను చదివి, విని  తెలుసుకున్న దానికన్నా .. నాకు  చలం   విరచిత "పురూరవ ' బాగా   నచ్చింది . పురూరవ ని నవలా రూపంలో చదవలేదు,. రేడియో నాటకం వినడం మాత్రమే  జరిగింది.



 చంద్రవంశం లో ప్రసిద్దుడైన పురూరవ చక్రవర్తి గురించి ఇంద్ర లోకంలో చెప్పుకోవడం విన్న ఊర్వశి  అతనిపై మోహం పెంచుకుని అతనిని తలపులలో నింపుకుని నాట్యం సరిగా చేయని కారణంగా గురువు భరతముని చేత శపిం పబడి   పురూరవుడిని వెదుక్కుంటూ మనుష్య లోకంకి  వస్తుంది.  ఈ రేడియో నాటకం ఇక్కడ నుండి ప్రారంభం అవుతుంది.

. పురూరవుడిని దగ్గరికి వెళ్లి  బిడియం లేకుండా తన ప్రేమని తెలియజేస్తుంది . అతని  తిరస్కారానికి గురయి  వెళ్ళిపోతుంది . వెళ్ళిన ఆమె కోసం వనమంతా , గుహ గుహ వెదుకుతాడు. ఆమెని కాంచి సంతోషపడతాడు

 "నీ అవసరాన్ని నీకు గుర్తించేటట్టు  చేసేందుకు...  నేను వెళ్ళిపోయాను    ".నువ్వెవరో నీకు తెలిపేందుకే వచ్చాను" అని

  "  స్త్రీ ముందు మోకరించటం నేర్చుకొని  నువ్వు ఏం  తెలుసుకున్నావ్ ? ఏం జీవించావ్ ? ఎంత అల్పుడివి నువ్వు " అంటుంది

ప్రేమంటే నీం తెలుసు    . నీ దృష్టి . విశాలం కాకుండా ఉంటుందా ?నిజంగా ప్రేమిస్తే....  

బలీయమైన , అజేయమైన ప్రేమ బంధం వల్ల  కాకపొతే  ఎందుకు నిన్ను వరిస్తాను ... అంటుంది పురూరువుడితో

ఎప్పటికి  గ్రహించవలసింది ... ఇంకొకరు చెప్పడం వల్ల ఎన్నడూ అర్ధం కాదు, క్రమంగా కాలంలో సొంత  అనుభవం  బోధించాల్సిందే ! మాటలతో నేర్చుకునే విషయాలు  చాలా అల్పం . ఎదుగు  విశాలంగా.. తెలుస్తాయి .  .
 తెలియడమంటే అర్ధం  ఏమిటి ?  అనుభవించే అర్హత కలగటం   అనుభవంతో తప్ప వికాసం  లేదని సూత్రమే  లేకుంటే  ఈ ప్రపంచమే అనవసరం ఆ అనుభవాన్వేషనే   మీ లోకంలో ఖేదానికి అసలు కారణం అంటూ అసలు నిజం బోధిస్తుంది

 స్వేచ్చా ప్రణయం గురించి, ఆనందం గురించి, స్త్రీ లాలిత్యం గురించి  ఇలా ఎన్నో విషయాలని పురూరవుడికి బోధిస్తుంది.    పురూరవుడి కోరిక మీదట అతనితో కలిసి రాజ్యానికి వచ్చి అతనితో కలసి  జీవిస్తూ తన ఆజ్ఞ కి బందీని చేస్తుంది  పురూరవుడు   భార్యని పోగొట్టుకుని ,రాజ్యాన్ని తనయులకి అప్పగించి  ఆమెతో కలసి వనాలకి వెళ్లి  తన్మయత్వంతో  మునిగిపోయి .. ఇరువురు  ఆత్మ సంయోగం ని అనుభవించాక .. ఊర్వశి  ఆజ్ఞా ని ధిక్కరించి వెళ్ళిన పురూరవుడికి  తనవేరో చెప్పి   ఆతనిని వీడి  ఈ లోకం నుండి నిష్క్రమిస్తుంది.

ఈ రచన చాలా చాలా నచ్చింది . ఊర్వశి  పాత్ర ని మలచిన తీరు  చాలా నచ్చింది .

పురుషుడు యుద్దంలో చూపే నేర్పు , రౌద్రం , శౌర్యం యుద్ధం చేయనప్పుడు కూడా కనబడకపోతే అవన్నీ నీలో చాలా అల్పం అన్నమాట . లేదా నేను చాలా అందురాలిని అన్నమాట ..

ఈ హర్మ్యాలు ,ఈ వనాలు వీటిని నిర్మించిన నీ  సౌందర్య భావం, ఐశ్వర్య వైభవం నీలో కాక వాటిల్లో కనబడితే నిన్నెవరు ప్రేమిస్తారు ?  తమ భర్తలలో ఈ విశాలత్వం ,దర్పం, ఘనత కనబడకనే స్త్రీలు భర్తలని కాక వారి ఐశ్వర్యాలని, వారి కీర్తి ప్రతిష్టలని  ప్రేమిస్తారు అన్న నిజం చెపుతూనే .. కార్య శూరత్వం  మనిషికి నైతికాభి వృద్దిని ఇవ్వాలి అప్పుడే నీవు జయించిన చక్రవర్తుల కిరీట మణులు నీ కళ్ళల్లో  మెరుస్తాయి..  అని ధర్మబోధ చేస్తుంది .

స్త్రీలు అనవసరమైన బేల తనం ప్రదర్శించి మగవాడిని బందీని చేయడం కన్నా ఆత్మాభిమానం ,జ్ఞానం కల్గి ఉండటమే గౌరవం కల్గి ఉంటుందని చెప్పడానికి ..ఇలా అంటుంది ..  

 " స్త్రీలలో వుండే హాని లేని నటనలు, గౌరవించడాలు, చనువులు,వగలు, ప్రణయ కోపాలు ఇవన్నీ నాకు తెలియక కాదు; ఇన్నేళ్ళూ వాటిననుభవించి అంతకన్నా గౌరవమైన ఉజ్జ్వలమైన ప్రేమకి అర్హుడివైనందునే నా స్నేహార్హత కలిగింది నీకు. నిన్ను లాలించడానికి కాదు; నిన్ను కాల్చి, కరిగించి, శుభ్రపరచి దేవత్వాన్ని ఇవ్వడానికి శపించారెవరో నన్ను"  - అని చెపుతుంది 

ఇక చలం రచనలలో కనబడే కవిత్వానికి ఇది ఒక మచ్చు తునక .. 

ఎంతకూ రాని కాంతి కై మౌనంగా పూరెక్కలమీద కన్నీరు కార్చే రాత్రి వలె నా విరహంలో నేనే అణగి పోతాను. 
_ అంటుంది  ఊర్వశి.

ఎన్నో సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వింటూ క్రొత్త అర్ధాలు ఏవో స్పురింపజేస్తూ ఉండే ఈ నాటకం మీరూ వినండి . 
 విని ..  ఊర్వశి  పాత్ర ద్వారా స్త్రీ అంతరంగాన్ని ఉన్నతంగా చెప్పిన చలం గారి పై విపరీతమైన అభిమానం పుట్టుకొస్తుంది .

జీవితానుభావం అనంతం , నిరంతర సుందర ప్రయాణం , ఎప్పుడూ చివరనేది లేని ఆనంద అనుభం .. పురూరవ  పాత్ర ద్వారా చెప్పించిన .. ఆ మాటలు  నిజంగా ఎవరికీ వారు అనుభవ పూర్వకంగా  తెలుసుకోవలసినవే!

(ఈ పోస్ట్ లో చిత్రం గూగుల్  సేకరణ  రాజా రవివర్మ చిత్రం ఇది )

31, మే 2013, శుక్రవారం

"కాలాతీత వ్యక్తులు" లో " ఇందిర"

కాలాతీత వ్యక్తులు  సమీక్ష




ఆకాశవాణి విజయవాడ కేంద్రం శతవసంత  సాహితీ మంజీరాలు కార్యక్రమం లో " కాలాతీత వ్యక్తులు " నవల ని ప్రసారం చేసినప్పుడు "ఇందిర" గురించి విన్నాను.  చాలా ఆసక్తిగా అనిపించింది.  

చాలా కాలం తర్వాత    మళ్ళీ కొన్ని నెలల క్రితం "కాలాతీత వ్యక్తులు " లో  కథా నాయిక ఎవరు అన్న సాహితీ వ్యాసం  (ఆంధ్రజ్యోతి - వివిధ - శ్రీ వల్లీ రాధిక ) చదివాను.

ఇటీవల  "కాలాతీతవ్యక్తులు" నవలని కొని చదవడం మొదలెట్టాను ఏకబిగిన చదివింప జేసిన ఈ నవల లోని పాత్ర లన్నింటి లోకి నన్నుఆకర్షించిన  పాత్ర "ఇందిర "

ఇందిర గురించి ఈ పరిచయం..

స్వాతంత్ర్యానంతరం వచ్చిన నవల లన్నింటిలోనూ కొన్ని నవలలను పంచకావ్యాల వంటివని సాహితీ కారులు పేర్కొన్నారు అందులో "కాలాతీత వ్యక్తులు " నవల ఒకటి .
ఈ నవలా రచయిత్రి డా ॥ పి.శ్రీదేవి.
మనకి స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ళకి వ్రాయబడిన సీరియల్ ఇది "తెలుగు స్వతంత్ర" లో 21 వారాల పాటు దారావాహికంగా వచ్చిన నవల ఇది. అప్పుడు గోరా శాస్త్రి గారు ఆ పత్రికకి సంపాదకులుగా ఉన్నారు
.
దేశ స్వాతంత్ర్యానంతరం పాశ్యాత్య నాగరికత ప్రభావంతో స్త్రీలలో వచ్చిన మార్పులకి, వారి ఆలోచన విధానంకి మధ్య తరగతి మనుషుల మనస్తత్వానికి ఈ నవల అద్దం పట్టింది
విశేషం ఏమిటంటే ఇప్పటి కాలానికి కూడా ఇందిర పాత్ర లాంటి స్త్రీలని మనం వ్యతిరేకిస్తూనే ఉండటం.

ఏబది అయిదు సంవత్సరాల క్రితం డా ॥ పి శ్రీదేవి గారు వ్రాసిన ఈ నవలలోని "ఇందిర" పాత్ర ఇప్పటి కాలంలోని చాలా మంది స్త్రీ పాత్రలకీ దర్పణం. స్త్రీ స్వతంత్రంగా ఆలోచించడం,సమాజం ఏమి అనుకున్నా పట్టించుకోకుండా తను బ్రతకాలి అనుకున్నట్లు బ్రతికీ తీరడం, తనదైన వ్యక్తిత్వం కల్గి ఉండటం, దానికి కాపాడుకోవాలని ప్రయత్నించడం ఇవన్నీ ఆ నవలలో గోచరిస్తాయి.

అసలు కాలాతీత వ్యక్తులు నవలలో ప్రధాన పాత్రధారిణి అనే విషయం పై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

"కల్యాణి" పాత్ర ఆ నవలలో మరొక ముఖ్య పాత్ర.

ఈ నవలలోని పాత్ర లన్నింటి కంటే ఇందిర పాత్ర పాఠకులని ఆకర్షిస్తుంది నవలలోని మిగతా పాత్రలన్నీ కూడా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అసలు ఈ పాత్ర లేకుంటే ఈ నవల ఇంత ప్రసిద్ది చెంది ఉండేది కాదు .

చాలా మంది కాలానికి అనుగుణంగా కాలగమనంలో ఒదిగిపోయి కాల ప్రవాహంలో కలసి పొతారు. కానీ ఇందిర అలాంటి వ్యక్తి కాదు. చిన్నతనంలోనే తల్లి మరణించినా తండ్రి దురలవాట్లు, భాద్యతా రాహిత్యం మధ్య స్వశక్తితో చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటుంది. చాలీ చాలని జీతం మధ్య అన్ని అవసరాలు తీరక పోవడం, తండ్రిని కూడా తానే పోషించాల్సి రావడం వల్ల కొన్ని సాంఘిక కట్టుబాట్లుని, లోక మర్యాదలని ఎదిరించింది. తనకి నచ్చిన రీతిలో హాయిగా జీవించడం నేర్చుకుంది. ఒక విధంగా కాలానికి లొంగకుండా తనకి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా చలించకుండా మనిషి కృంగకుండా వాటిని ఎదిరించి అవసరం అయితే ఇతరులని మోసం చేయడం, వారిని నిర్దాక్షిణ్యంగా ప్రక్కకి నెట్టించి పరిస్థితులని తనకి అనుకూలంగా మార్చుకుంటుంది.

అందుకే ఇందిర పాత్ర చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ ఈ నవలలో ప్రధాన పాత్ర ఇందిర. కాలాతీత వ్యక్తిగా కూడా ఆమెనే పేర్కొనవచ్చు. ప్రకాశంతో స్నేహం చేస్తుంది, షికారుగా అతనితో బీచ్ కి వెళుతుంది. ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తి తో సెకండ్ షో సినిమాకి వెళుతుంది. తన సరదాలు,అవసరాలు తీర్చుకోవడం కోసం వారితో చనువుగాను మెలుగుతుంది. పక్షి లా ఎగిరి పోయే స్వేచ్చ కావాలని తనకి ఆ స్వేచ్చ ఉనప్పటికి తన రెక్కలు పేదరికం అనే తడితో బరువెక్కి ఎగరలేకపోతున్నానని చెప్పుకుంటుంది.

తాను ఉంటున్న ఇంటి పై భాగంలో అద్దెకి ఉంటున్న ప్రకాశం తనతో పాటు తన గదిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటూ కాలేజ్ లో ఆన్సర్ చదువుకుంటున్న కల్యాణిల మధ్య చనువు పెరగడాన్ని గమనించిన ఇందిర ఈర్ష్య పడుతుంది. మగవారి దగ్గర కష్టాలు అన్నీ ఏకరువు పెట్టి సానుభూతి సంపాదించుకోవడం చేస్తుంది కల్యాణి అనుకుంటుంది.

ఇందిర పాత్ర ముక్కు సూటి దనం ఇలా ఉంటుంది.

"ఏమిటి ఆలోచిస్తున్నావ్" ప్రకాశం అని అడుగుతుంది ఇందిర
కల్యాణి గురించి అంటాడతను.

"అస్తమాను కల్యాణి కల్యాణి అంటావ్? నా గురించి ఆలోచించు, నేను అంత కన్నా ఎక్కువ బరువు ఈడ్చుకోస్తున్నాను, నా చదువుని మధ్యలో వదిలేసి ఉద్యోగం వెతుక్కోవలసి వస్తుంది. నాన్న సంగతి నీకు తెలుసు, అయినా గడియ గడియకు కాళ్ళు జాపి కూర్చుని ఏడవడం నాకు చేత కాదు, విశాలమైన కళ్ళు తిప్పి వల వలా ఏడ్చే స్తే నీ లాంటి జాలి గుండె కల మగ వాళ్ళు ఆదుకుంటారు. వాళ్లతో నేను కాలక్షేపం చేయలేను ఆమెలా జాలిగా కళ్ళు తిప్పడం నాకు చేత గాదు అంత నంగ నాచి తనం నాకు లేదు. నా బరువుతో ఇంకొకరి పై ఒదిగిపోయి కాలక్షేపం చేద్దామన్న దురాశ నాకు లేదు నేను బలపడి ఇంకొకరికి బలమివ్వాలనే తత్త్వం నాది " అంటుంది.

ఇందిర గురించి చదువుతున్నప్పుడు ఆ పాత్రపై అయిష్టం కల్గుతూ ఉంటుంది ఆమెలో ఈర్ష్య ని గమనిస్తాం ప్రకాశం కల్యాణి కి ఆకర్షితుదవుతున్నాడని తెలుసుకుని అతనిని తనవైపు మళ్ళించు కుంటుంది. పైగా కల్యాణి పై దుష్ప్రచారం చేసి ఆమె తన దారికి అడ్డురాకుండా చేసుకుంటుంది. అలాగే వసుంధర కృష్ణ మూర్తి పై ఇష్టాన్ని పెంచుకుంటుందని గమనించి అతనిని తెలివిగా తను దక్కించుకుంటుంది.

తనకి కావాల్సినదానిని బలవంతంగా అయినా దక్కించుకునే మనస్తత్వం ఆమెది.

ప్రపంచంలో ఒకరి కోసం ఒకరు ఏదీ చేయరు ఎవరి కోసం వాళ్ళే చేసుకుంటారు .. అది నాకు చేతనవును అనుకునే వ్యక్తి ఇందిర.

ప్రకాశం మేనమామ కుదిర్చిన పెళ్లి సంబంధాన్ని వదులుకుని ఆమె కోసం వచ్చినప్పుడు అతనిని తిరస్కరిస్తూ ఇలా అంటుంది.

"సాధారణంగా పిల్లలకి తల్లి దండ్రులు గార్డియన్ లాగా ఉంటారు నా దగ్గరకి వచ్చేసరికి తల్లక్రిండులై నేనే నాన్నకి గార్డియన్ కావాల్సి వచ్చింది ఆడదాని మనసు నీకు తెలియదు ప్రకాశం ! నేను నీకు ఉన్నాను ..నీ సమస్యలు,నీ బరువులు అన్నీ నా మీద వేయి అనగల్గే మగవాడు అవసరమైతే నా కోసం అన్నీ వదిలేసే మొగవాడు కావాలి, ప్రేమ కోరిన త్యాగం చేయలేనివాడు ప్రేమకి అనర్హులు. నీ మీద నేను చాలా మమకారం పెంచుకున్నాను నువ్వొక వెన్నుముక లేని మనిషివని నాకు తెలుసు. తోమగా తోమగా కొంత గట్టిపడతావు అనుకున్నాను. కొన్ని అనుభవాల తర్వాత అయినా ఒక మనిషిలా ప్రవర్తిస్తావనుకున్నాను. పుట్టుక నుండే నువ్వో సగం మనిషివి బీటలు వారిన వ్యక్తిత్వం. బాగు చేయాలని ప్రయత్నించాను కానీ అది నావల్ల కాదు.నీకు నాకు కుదరదు " అని నిర్మొహమాటంగా చెపుతుంది.

ఇదంతా చదువుతున్న పాఠకుడికి ఆమె పాత్ర పట్ల సరి అయిన అభిప్రాయమే కలుగదు. ఇందిర కొలీగ్ వైదేహి అన్నదమ్ములు ఆమెకి ఇష్టం లేని వాడిని చేసుకోమని బలవంతం చేస్తుంటే ఇల్లు విడిచి వచ్చేసి ఇందిర ఇంట్లో ఉంటుంది .. ఆమె ఇందిరతో ఇలా అంటుంది అమ్మాయిలు యాబై సార్లు సంతలో పశువుల బేరంలా నన్ను కూర్చోబెట్టి మాట్లాడటం నాకు ఇష్టం లేదు అంటే ఇందిర ఇలా అంటుంది . పశువు కాకపొతే మరో నందికేశుడు, జీవితమే పశువుల సంతలా అయినప్పుడు అమాయకంగా సుమతీ శతకంలో నీతులన్నీ వల్లే వేస్తే మనలని వెనక్కి నెట్టడం ఖాయం ఎలాగోలా తీర్ధంలో జనాన్ని మోచేతులతో నెట్టుకుని ముందుకు వెళ్ళడమే అంటుంది.

కావాలని కృష్ణ మూర్తికి దగ్గరవుతుంది తన జీవితం సుఖంగా సాగి పోవాలి అంటే కృష్ణ మూర్తి లాంటి వాడే తగిన వ్యక్తి అనుకుంటుంది అతనికి తగిన చదువు సంధ్యలు లేకపోయినా వెనుక ఉన్న ఆస్తిపాస్తులు ఉండటమే కాదు ఆ అస్తిపాస్తులే అతనిని నాశనం చేసాయి అనుకుంటుంది మనిషిలోని మంచి తనాన్ని గుర్తించి అతనితో జీవితాన్ని పంచుకోవడానికి ఒప్పుకుంటుంది.

ఇందిర ఏ పని అయినా మంచి అయినా చెడు అయినా తెలిసే చేస్తుంది మొహమాట పడటం అనేది అసలు ఉండనే ఉండదు. తన బ్రతుకు తను బ్రతకాలి అనుకున్నపుడు ఇతరులకి ఇబ్బంది కల్గించినా పట్టించుకోకుండా బ్రతకడం నేర్చుకుంటుంది. ఆమె అతిని ఎప్పుడూ ఇష్టపడదు, అతి ప్రేమ చూపించినా,అతిగా గౌరవించినా ఆమెకి ఇష్టం ఉండదు ఆమె ప్రవర్తన తెలిసి కూడా ఆమెని పెళ్లి చేసుకుంటానికి ముందుకు వచ్చిన కృష్ణ మూర్తి కూడా ఆ విషయాన్నే చెపుతుంది తానూ అతనికి లొంగి ఉండలేనని, తన వ్యక్తిత్వాన్ని చంపుకుని ఉండలేనని బ్రతుకంతా నిర్భయంగా బ్రతుకుతానని అంటుంది.

పురుషాధిక్య సమాజంలో మధ్య తరగతి కుటుంబం లో డుర్వ్యసనాల తండ్రికి కూతురిగా ఉండి సమాజ పోకడల్ని బాగా అర్ధం చేసుకుని తనని తానూ నిర్మించుకుంటూ, అవసరం అయితే తనని తానూ తగ్గించుకుంటూ, కొందరి బలహీనతలని తనకి అనుకూలంగా మలుచుకుంటూ నచ్చినట్లు ఉండగల్గే ఇందిర ఎక్కడా కూడా తొట్రుబాటు లేకుండా ఎలాంటి ముసుగు వేసుకోకుండా నిర్భయంగా, స్వేచ్చా ప్రవృత్తి తో కనిపిస్తుంది జీవిస్తుంది.

ఇందిర లాంటి స్త్రీని సమాజం హర్షించక పోవచ్చు సమాజంలో కల్యాణి లు లాంటి వారితో పాటు కానీ ఇందిరలు కూడా ఉంటారని చెప్పడమే కావచ్చు స్త్రీల ఆలోచనా విధానం మారుతుందని చెప్పడం కూడా ఈ రచనలో గోచరిస్తుంది.

మనుషులు ఏ లోపాలు లేకుండా ఉండరు. మనుషులు మనుషుల్లాగానే ఉండాలి తమలో ఉన్న లోపాలని సవరించుకుంటూ చైతన్యంగా ఆలోచించుకుంటూ ముందుకు సాగిపోవడమే మంచిదని "కాలాతీత వ్యక్తులు" నవల చెపుతుంది.


పాశ్చత్య నాగరికత ప్రభావంతో చదువులభ్యసించి ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలలో ఆలోచనా పరిణితి పెరిగి వారి వారి అభిరుచిల మేరకు, ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా జీవించాలనుకోవడం తప్పు కాదు జీవితాన్ని జీవించడం కోసమే అనుకుంటూ ముందుకు సాగే వ్యక్తి ఇందిర పాత్ర. కాలగమనంలో అందరూ మరుగున పడిపోతారు కాలానికి విభిన్నంగా నడుచుకుని తనదైన వ్యక్తిత్వంతో తన చుట్టూ ఉన్న వారి జీవితాలనీ కూడా ప్రభావితం చేస్తూ సాగగల్గితే వారు మరి కొంత కాలం గుర్తుండిపోతారు అది నవలలో పాత్రలు కావచ్చు నిజ జీవితంలో మనుషులు కావచ్చు.

ఈ నవలలోని ఇందిర పాత్రని నేడు అధిక సంఖ్యలో మన సమాజంలో నిత్యం చూస్తుంటేనే ఉంటాము . కానీ ఇప్పటికి కూడా "ఇందిర " ని హర్షించలేక పోతున్నాం. ఇంకా నవలలో మిగిలిన పాత్రలు కల్యాణి,వసుంధర, వైదేహి లాంటి స్త్రీల మధ్య "ఇందిర " కాలాతీత వ్యక్తి తానూ చీకటిలో ఉండాల్సి వచ్చినా వెరువని ధీర, చీకటిని చీల్చుకుంటూ వెలుగుతూ వచ్చిన ఇందిర.

(ఈ నవల దారావాహికంగా సాగి పూర్తి అయిన వెంటనే 8-2-1958 లో సి . సరళా దేవి ఒక సమీక్ష, 2000 సంవత్సరంలో డా॥వి చంద్రశేఖర రావు గారు సమీక్షించారు.

ఇందిర గురించి మనం చదవాలంటే ఇప్పుడు లభ్యమవుతున్న ఈ నవల లో జతపరిచిన రెండు సమీక్షల జోలికి పోకుండా ఆ నవల ని చదివితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం )

ఈ నవల విశాలాంద్ర ప్రచురణ

* ఈ వ్యాసం "సారంగ " వెబ్ పత్రికలో (ప్రధమ సంచిక ) తర్వాత మార్చి నెల "భూమిక " లోను ప్రచురితమైనది.


3, మార్చి 2013, ఆదివారం

రేగడి విత్తులు


ఈ రోజు నేను ఒక నవల పూర్తిగా చదివి తీరాలని పట్టుబట్టి కూర్చున్నాను

ఆ నవల పేరు "రేగడి విత్తులు"



 ఆ నవలని ఒక  వారం రోజుల క్రితం తిరిగి తిరిగి  చాలా ఇష్టంగా కొని తెచ్చుకున్నాను.

తానా  నవలల పోటీలో  రూ ॥ 1,20,000 లు బహుమతిగా గెలుచుకున్న మొదటి నవల.

ఈ నవలా రచయిత్రి    పైడి చంద్రలత

ప్రతి పుటలోను తెలుగు తనం ఉట్టిపడుతూ చదివిన దానినే మళ్ళీ ఇంకోసారి వెనక్కి వెళ్లి చదువుకుంటూ  దాదాపు పది గంటలు ఏకబిగిన ఆ నవలని చదివాను .

చాలా చోట్ల అరే ! మా కుటుంబం ఇందులో కనబడుతుందే అనుకుంటూ లీన మైన సందర్భాలు ఎన్నో!

నేను కదిలి కదిలి.. పోయి  దుఖించినప్పటి  తాలుకూ దృశ్యం చూడండి. దృశ్యం అని ఎందుకు అంటున్నానంటే అక్కడ వ్యవసాయం, భూమి తో ఏ చిన్న పాటి అనుబంధం ఉన్న వ్యక్తులైనా  అంతగా మమేకం కావాల్సిన రచనా భాగం  ఇది . అందులో నేను పూర్తిగా మమేకం అయిపోయాను

అదేమిటో ఇక్కడ చదవండి ..

రామనాధం తిన్నగా పొలం దగ్గరకి వెళ్ళాడు పున్నమ్మ అస్తికల మీద వేసిన మామిడి చెట్టు మహా వృక్షమై ఉంది
  ( ఈ దృశ్యమే నవల కవర్ పేజీ) రామనాధం మెల్లిగా వంగి మట్టిని చేతిలోకి తీసుకున్నాడు

ఈ మట్టి - ఈ రేగడి లోనే తన తల్లి ఒరిగింది ఈ రేగడి తల్లిలా లాలించింది ఈ రేగడి ఓ తండ్రిలా  తనకై పాఠాలు నేర్పింది ఓ  స్నేహితుడిలా  ఓదార్చింది దీనికి తనకి ఉన్న సంబంధం ఒక్క సంతకమేనా !? తన కొడుకు సులభంగా "అగ్రిమెంట్ రాసుకుందా మంటున్నాడు  ఏమని రాస్తాను అగ్రిమెంట్ ? తన ప్రాణాన్ని అమ్ముతాననా? తన తల్లిని ధారాదత్తం చేస్తాననా? తన తండ్రిని పరాయి పాలు చేస్తాననా?

రామనాదానికి చెంపలు తడి గట్టాయి

జంతు ప్రపంచానికి ఆవలగా మనిషి వేసిన మూడు అడుగులు .. బాష,వ్యవసాయం,లిపి అంటారు

ఈ నాటికి మనది వ్యవసాయ ప్రధాన దేశం వ్యవసాయమే జీవనాధారం  కానీ ఈనాడు మట్టిమీద మమకారం లేదు,వ్యవసాయం మీద ఆప్యాయత లేదు ఎక్కడ చూసినా వ్యాపార దృష్టి వ్యవసాయాన్ని వ్యాపార దృష్టితో చూస్తే ఎలా? ఓ ఏడు  ధనం కురుస్తుంది ఓ ఏడు కొట్టుకు పోతుంది  ఆటు పోట్లుకు తట్టుకు నిలబడితేనే రైతు

ఈనాడు వ్యవసాయ కుటుంబాల లోవారు డాక్టర్ లు  అవుతున్నారు ఇంజినీర్లు అవుతున్నారు వ్యాపారులు అవుతున్నారు వాళ్ళు ఏ  పని చేసినా వ్యవసాయం చేసినట్లే కష్టపడి పని చేస్తారు ముప్పై ఏళ్ళ నాడు నేను ఇక్కడ అడుగు పెట్టినట్లే ఎవడో ఒకడు రాకపోతాడా? ఈ గడ్డను బీడు కాకుండా కాపాడక పోతాడా? అంటూ ఆశావాదంతో అనుకుంటూ ఉంటాడు

ఆఖరికి  అదే పొలంలో కాపు సారా బట్టీలు పెట్టి ప్రక్కనే పచ్చగా ఉన్న పంటపై దాడి చేసి పంటని నేల  మట్టం చేసి వెళ్ళిన చోటనే .. రామనాధం ఆవేశం తో ప్రతిజ్ఞ బూనతాడు విత్తనాలతో ముడిచిన ఈ పిడికిలి దౌర్జన్యానికి లొంగదు నడిడ్డను ను వెతుక్కుంటూ వచ్చాం గని గడ్డను చేసాం మనల్ని మన గడ్డ మీదే నిలవనీయని విషాద పరిస్థితి వస్తే మరో నడిగడ్డ కు  పోదాం  ఈ భారత దేశంలో నదులకేం కొదువ ? ఈ గడ్డ  మనతో మమేకం చెందక ముందే మనం  మన గడ్డగా భావించాం మమేకం అయ్యాం తాద్యాత్మం చెందాం ఈ గడ్డ నుండి మానని వేరు చేసి చూస్తే పోరాటం తప్పదు మరో నడి  గడ్డను గని గడ్డ చేసేవరకు .. రామనాధం కంఠం ఖంగు మంటుంది

వాళ్ళు  మొక్కలని నాశనం చేసారేమో విత్తనాల్ని కాదు కదా! మళ్ళీ పొలం దున్ను కొత్త విత్తనాలు ఏద పెడదాం రేగడి విత్తులు విధ్వంసానికి లొంగవు రేగడి ఉన్నంత వరకు మబ్బు ఉన్నంత వరకు సూర్యుడు ఉదయిన్చినంతవరకు  విత్తులు మొలకెత్తు తూనే  ఉంటాయి

నా రేగడి విత్తులు చిరంజీవులు !

ఇది నవల ముగింపు

రెండు మూడు ప్రాంతాల బాష  కలసి ముప్పేటగా అచ్చు తెలుగు పదాలతొ.. ఈ నవల సరళంగా సాగి పోతుంది వ్యవసాయం లో వచ్చిన పెను మార్పులు, పంట భూములని వాణిజ్య పరంగా మార్చి వ్యవసాయం ని వాణిజ్యం చేసిన తీరు ముక్కారు పండే పంట పొలాలను చేపల చెరువులు రొయ్యలు చెరువులుగా మార్చడం క్రమేపి  వ్యవసాయం ని కనుమరుగు చేసే పరిస్థితులకి దారితీయడం లాంటి అనేక అంశాలు  ఈ నవలలో ఉన్నాయి

ఇంకా మన తెలుగు వారి  సంస్కృతి - సంప్రదాయాలు పెళ్లి ముచ్చట్లు , పాటలు , కొన్ని మూడాచారాలు అన్నీ ఉన్నాయి

హరిత విప్లవం కాస్తా జన్యు విప్లవంగా మారడం జన్యు విత్తనాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుకోవడం లాంటి విషయాలు ఎన్నో ఈ నవలలో కథ గా ఇమిడి పోయాయి .

రచయిత్రి వ్యవసాయమే వృత్తి  నేపధ్యంగా గల కుటుంబం నుండి వచ్చినందు వల్ల చాలా సునిశితంగా ఆలోచించి ఇతివృత్తంలో అనేక అంశాలని  జొప్పించి హృద్యంగా మలచగల్గారు .

ఒకటి రెండు సార్లు చదివితే కాదు,  ఈ నవల ని అనేక మార్లు చదవ గల్గితే ఇంకా చక్కని అనుభూతితో పరిచయం చేయ గలనేమో అనిపించింది కానీ ..

నా ఈ స్పందన  మీతో పంచుకుని  ఈ నవలని పరిచయం చేయాలని ఈ చిన్న ప్రయత్నం కొండని అద్దం  లో చూపినట్లు.

తప్పకుండా చదివి చెప్పండి  పుస్తక ప్రియుల అందరి దగ్గరా ఉండవలసిన నవల ఇది.

ఈ నవల  ఇచ్చట లభ్యం

విశాలాంధ్ర బుక్ హౌస్ (అన్ని ప్రదేశాలు)
ప్రభవ ప్రచురణలు (నెల్లూరు )
నవోదయ పబ్లిషర్స్ (విజయవాడ)

12, ఏప్రిల్ 2012, గురువారం

"మానవి " గురించి ఓ..మానవి..





"మానవి " గురించి ఓ..మానవి..

పెద్దల ఇష్టాలతో బేరసారాలు ముడిపడిన పెళ్ళిలో.. 

20  సంవత్సరాలు ఏదైతే తన సంపూర్ణ జీవితం అనుకుందో..ఆ జీవితం తనదికాదని తెలిసినప్పుడు..తన ఆశలు అడియాసలై.. కట్టుకున్న ఆకాశ హర్మ్యాలు పేక మేడలా కుప్పకూలిపోయినప్పుడు  కానీ భారతీయ వివాహ వ్యవస్థ లోని డొల్లతనం అర్ధం కాలేని  స్త్రీ.. వసంత. 

జీవితమంతా   వసంతంలా సాగిపోవాలనుకునే  అతి సామాన్యమైన స్త్రీ. 

ఆమె గుంటూరులో డిగ్రీ చదువుకునే రోజుల్లో కూడా విద్యార్ధి సమస్యలకి మద్దతునివ్వని, ఉక్కు కర్మాగార ఉద్యమంలో గళం కలపని బుద్దిగా ఒద్దికగా చదువుకుని డిగ్రీ పూర్తి చేసిన అమ్మాయి. 
రంగనాయకమ్మ నవలలోని మొగుడులాంటి మొగుడు తనకి దొరకగూడదని ప్రార్దిస్తూ,యద్దనపూడి నవలా నాయకుడు నాకు ఎక్కడ దొరుకుతాడులే ఆని అనుకుని నిరాశపడే అమ్మాయి. 

ప్రేమ దోమ లేకుండా తల్లిదండ్రులు కుదిర్చిపెట్టిన సురేష్ ని వివాహం చేసుకుని డాక్టర్ గారి భార్య అయింది. ఇద్దరి బిడ్డల తల్లి అయింది. నా ఇల్లు, నా సర్వస్వం నా భర్త, నా బిడ్డలే   నాప్రపంచం అనుకుంటూ అందులో ముని గిపోయింది.

భర్తకి టూత్ బ్రష్ పై  పేస్ట్ దగ్గరనుండి,బయటకి వెళ్ళేటప్పుడు ఇచ్చే కర్చీఫ్ వరకు స్వయంగా అందిస్తూ భాద్యతగా గృహిణిగా..తన కర్తవ్యమ్ నిర్వహించేది. తనకున్న ఇద్దరి కూతుళ్ళ లో లావణ్య అంటే ఎక్కువ ఇష్టం.ఆమె మాట  తుచ తప్పకుండా వింటుందని.  ఇక రెండో కూతురు నవత   అంటే..కొంచెం విముఖం.తన మాట అసలు వినదని.   చదువంటే పెద్ద ఆసక్తి లేని లావణ్యకి పెళ్ళి  చేసి అత్తగారైంది.  

అలాటి వసంత జీవితంలోకి .. వడగాల్పులా నీలిమని  తీసుకువచ్చి వదిలేసాడు భర్త సురేష్. 
కుటుంబంలో భార్య భర్తలమధ్య ప్రేమ,అనురాగం,సదవగాహన లోపిస్తే కుటుంబ వ్యవస్థ తాత్కాలికంగాను, శాశ్వతం గాను దెబ్బతినే అవకాశాలు ఉన్న్తాయి.  సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్య బలహీనతలు ఉండటం,సర్దుబాటు లేకపోవడం వల్ల వివాహ సంబందం తెగిపోవడమనేది జరిగిపోతుంది. 

ఈ నవలలో అదే జరిగింది. పెళ్ళయిన ఇరవై సంవత్సరాల కాలంలో ఏనాడు భార్య పై ప్రేమ  కలగ లేదని..తోటి డాక్టర్ నీలిమపై తనకు ప్రేమ కల్గినది అని ఆమెని వదులుకోవడం కష్టంగా ఉందని.. రహస్యంగా దాచి వసంతని మోసం చేసే ఉద్దేశ్యం తనకి లేదని  ఆమెకి  చెపుతాడు సురేష్. ఇకపై వసంత కలసి ఉండటం ఇష్టం లేదని కూడా చెపుతాడు.

అయ్యో! ప్రేమ అంటే ఏమిటి..? భర్తని నేను ప్రేమించాలని నాకు ఎవరు చెప్పలేదే..? అయినా మీ నాన్నకి ఇప్పుడు ప్రేమ ఏమిటే? ఇన్నేళ్ళ మా బంధంలో ప్రేమ లేకుండానే కాపురం చేసానా!? అని విస్తుపోయే సగటు భారతీయ స్త్రీ వసంత. 

ఇరవై ఏళ్ళు కాపురంచేసి భర్తపై హక్కులైతే సంపాదించుకుంది కానీ అతని మనసులో  తన పై ప్రేమ లేదని తెలుసుకుని మనసులో కుమిలిపోయి.. అమ్మా ! లావణ్యా..నా తరపున వఖల్తా పుచ్చుకుని అమ్మకి అన్యాయం చేయవద్దని మీ నాన్నకి నువ్వైనా చెప్పమ్మా! అని దీనంగా  వేడుకుంటుంది.

ఆ లావణ్య అనే కూతురు భర్త తో కలసి వచ్చి ఆస్తులని పంపకం చేసుకుని.. నాన్నని ఎలాగోలా నువ్వే ఓపికగా మార్చుకోవాలి గాని..మా అత్తవారింట్లో ఈ విషయం తెలిస్తే యెంత నామోషి అనే  కూతురిని చూసి వసంత నిర్ఘాంత పోతుంది. సగటు స్త్రీలా భర్తని నలభై ఏళ్ళ ప్రౌడ ప్రాయంతో..ఆకర్షించడానికి ప్రయత్నించి విపలమై..
భర్త పరాయి స్త్రీతో కలసి ఉంటూ తనని నిర్లక్ష్యం చేయడాన్ని భరించలేక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది.

ఆమెని బ్రతికించి వసంత స్నేహితురాలు రోహిణి ఇంటికి పంపించాక అక్కడ మరో స్నేహితురాలు  అవివాహితురాలు శాంత కి ఆమె స్నేహితుడు రాధాకృష్ణ కి గల సంబందాన్ని  అసహ్యించు కుంటూనే social  dis organisation  గురించి తెలుసుకుంటుంది. వివాహ వ్యవస్థలో లేని ప్రేమ గురించి, అంతకు క్రితం ఆమె ఎప్పుడో చదివిన నవలలోని భర్త ప్రేమ కోసం దేవులాడే ఆడవాళ్ళ గురించి  గుర్తు తెచ్చుకుని.. వారి స్థానంలో తనని పోల్చుకుని వ్యద చెందుతుంది.   

 పెళ్ళి  అనేది కుటుంబం సభ్యుల మధ్య,సమాజంలో ఇతర సమూహాల మధ్య లైంగిక సంబంధాలని క్రమ బద్దం అయితే చేయవచ్చోమో కానీ ప్రేమ ఆధారం లేని పెళ్ళి  అనే భవనం ఏదో ఒకనాడు కుప్పకూలి పోతుందని తెలుసుకుంటుంది. పురుషుల అక్రమ సంబందాలు,బహు వివాహాలు వల్ల ఇలాంటివి  జరగడం వివాహిత స్త్రీలకి అమితమైన బాధ కలగడం జరుగుతూనే ఉంది కదా! ఆమె విషయంలోను అదే జరిగింది

వసంత తను  సురేష్ భార్యగా  హోదా కోల్పోతానని బాధ పడుతూ సమాజంలో మొగుడు వదిలేసిన, లేదా మొగుడుని గుప్పిట పెట్టుకోలేనితనం అని  అందరూ ఎద్దేవా చేస్తారని బాధపడుతూ సంఘర్షణతో  పిచ్చిదయి పోయి  భర్త తో కలసి ఉండటం ఇష్టం లేక తన ప్రమేయం లేకుండానే భర్త నుండి విడదీయబడుతుంది.  చివరకు అన్నీ పోగుట్టుకున్న భావనలో జీవశ్చవంలా మారి చిన్న కూతురు నవతతో ఆమె ఉంటున్న విశాఖపట్నం చేర్చబడుతుంది. 

అక్కడ నవత స్నేహితులని,ఆమె స్నేహితులు ఆమె కలసి చేసే ఉద్య మాలని గమనిస్తూ  ఆనారోగ్యంగా ఉన్న ఉద్యమకారునికి  సేవే చేస్తూ తనలో ఉన్న తనని  గుర్తించుకుంటుంది. 

స్త్రీ కి జీవితం అంటే పెళ్ళి ,పిల్లలు,ఇల్లు మాత్రమే కాదని జీవితం లో వాటికి అధిక ప్రాధాన్యత నివ్వడం మూలంగా బలహీనమైన అనుబందాలు నిలబడలేనప్పుడు వ్యద చెందక తప్పదని గుర్తించింది వసంత. 

సిద్దాంతాల కోసం ఉద్యమంలో నడిచే వారు కొందరైతే, సిద్దాంతాలు ప్రక్కన పెట్టి ఇతరులకిమంచి జరుతుంది అనుకుంటే  ఆ విధంగాను నడిచే కొందరు  ఉద్యమ కారులుని,  అలాంటి లోకంని  తన కళ్ళతో తానూ చూసి ..నిర్ధారించుకుని వాటి గురించి అనర్ఘళంగా  మాట్లాడే స్థాయికి ఎదిగిన వసంతని చూస్తే మనకి ఆశ్చర్యం కల్గుతుంది.  ఈ వసంత ని  చూస్తే భర్త ప్రేమకి నోచుకోలేదని ఆత్మ హత్య చేసుకోబోయిన వసంత యేనా ఈమె అని అనుకుంటాం. 

ఆఖరికి కొన్ని నెలల తర్వాత చూసిన భర్త ని చూసి కూడా ఆమె మనసులో కోపం,భాద కలగకపోవడ అనే లక్షణాలని చూసి ఆశ్చర్య పోతాం.  చిన్న కూతురు మాటలతో, చేతలలో కనిపించే వ్యక్తిత్వం, ఆధారపడని తత్త్వం, స్నేహశీలత..ఇవన్నీ ఆమెకి ఒక  కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. 

నవత తన స్నేహితురాలు రాజ్య లక్ష్మి యవ్వన ఉద్రేకం లో చేసిన పొరబాటు ఆమె తనని వివాహం చేసుకో వాలనుకున్న  అతనికి   ఆ సంగతి చెప్పడం, ఎంతో  ఆదర్శ వాదులుగా కనిపించే ఉద్యమకారులు స్త్రీ శారీరక శీలానికి   ప్రాధాన్యత నిస్తూ సగటు మగవారిలా ప్రవర్తించడం, మరొక పురుషుడు..ప్రేమించినప్పుడు  అతను ఆమె వ్యక్తిత్వానికే  గాని శీలం అనే పదానికి  ఎక్కువ  విలువ ఇవ్వకపోవడం అనే విషయాలతో  (మనసుఅంగీకరినచని,సాంప్రదాయవాదులు ఆమోదించని) విషయాలు ) పాటు.. శాంత -  రాదాకృష్ణ మధ్య  ఉన్న పెళ్ళి  లేని ప్రేమ సంబంధాలు , ఆ సంబంధాలకి  సమాజంలో ఉన్న విలువ.. వాటికి ప్రాధాన్యత నివ్వకుండా.. వారికి నచ్చిన జీవన మార్గంలో నడిచే వారిని   ఈ నవలలో మరొక కోణంగా  చూస్తాం.మెదడుని తొలిచే ఆలోచనలతో  పెళ్ళి లేని ప్రేమల గురించి, సహజీవనం గురించి ఆలోచిస్తాం.

ఈ నవలలో నన్ను అమితంగా ప్రభావితం చేసిన పాత్ర "వసంత"
భారతీయ సాధారణ గృహిణిగా మనకి పరిచయమై.. నవల ముగింపుకి వచ్చేసరికి ఒక మనిషిగా, మానవిగా పరిణామ క్రమంలో ఎదిగిన స్త్రీగా చూపడం నాకు బాగా నచ్చింది. 

ప్రేమ లేకపోయినా కుటుంబం ఉంటుంది. 
అదే ప్రేమ లేని స్త్రీ-పురుష అనైతిక సంబంధాలు ఉన్నాయి.
ప్రేమని ఆశించి, ప్రేమని ఇచ్చి, ప్రేమని పొందుతూ  సమాజానికి  వెరవని , కుటుంబ కట్టుబాట్లు లేని స్త్రీ-పురుష సంబంద భాంధవ్యాలు  ఉంటాయని  వాటి గురించి  కూడా చెపుతుంది ఈ నవల. 

భారతీయ సమాజం లో కూతురిగా మాట వెల్లడించుకునే స్వేచ్చలేక, భార్యగా మారిన   ఇరవై ఏళ్ళ తర్వాత కూడా భర్త ప్రేమకి నోచుకోక,తల్లిగా బిడ్డలని ప్రభావితం చేయలేక,వారి మనసులో తల్లిగా మంచి స్థానం సంపాదించుకోలేక..అదే సమస్త  జీవితం అనుకుని బ్రతికిన వసంతకి జ్ఞానోదయం కలుగుతుంది. 

భర్త వద్దన్నప్పుడు ఏ ఆధారం లేకుండా పోతుందని,  ఏ భద్రతా లేదని భావించిన వసంత ..కళ్ళకి కదలిక వచ్చింది.కళ్ళు చూడటం నేర్చుకుంటాయి,నోరు మాట్లాడుతుంది,జీవ శక్తి నింపుకుని ప్రవహించడం మొదలెట్టి భార్య నుండి,తల్లి నుండి వేరై..ప్రవహించడం మొదలెట్టింది..

ఆడదాని జీవితంలో ఏదో ఒక రోజు మనిషిగా మానవిగా మారాల్సిన రోజు వస్తుందని,అట్లా మారే శక్తి లేకపోతే. మారడానికి ఏ ఆధారం లేకపోతే సర్వనాశనం అయిపోతాం అని, ప్రాణాలు ధారపోసి అయినా మనుషుల్లా మారడానికి కావాల్సిన శక్తి సంపాదించుకోవాలని చెపుతూ కూతురికి ఉత్తరం రాస్తుంది వసంత.

 అలాగే ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉండాలని ఆ జ్ఞానం రావడం చాలా అవసరమని మీ అమ్మ ఒకరి భార్యగా కాకుండా ఒక వ్యక్తిగా బతుకుతుందని గర్వపడమని,నలుగురుకి సాయం చేస్తున్నందుకు సంతోషించమని చెపుతుంది.    తల్లి ప్రేమని బిడ్డలు అర్ధం చేసుకోవాలని,బిడ్డలకి చాకిరి చేసి పెట్టె అమ్మలుగా చూడటం కాకుండా..మనిషిగా చూడటం నేర్చుకోమని చెపుతూ.. నువ్వు..నాలా ఒకప్పటి వసంతలా కాకుండా ఒక వ్యక్తిలా గుర్తించుకునే రోజు కోసం ఎదురు చూస్తాను" అన్జెప్పి  ఉత్తరం ముగిస్తుంది.

మన భారతీయ సమాజంలో లక్షలాది వసంతలు ఉన్నారు. కొద్ది గొప్ప తేడాలతో వారి జీవితాలు చాలా వరకు అలాగే ఉంటాయి. వివాహ వైఫల్యంతో,సమాజంలో చులకన భావం ఏర్పడుతుందని , పుట్టింటి వారి ఆదరణ ఉండదని ,  ఆర్ధిక భద్రత లేకపోవడం లాంటి  విషయాలతో..  వెనకంజ వేస్తూ .. జీవితం కొల్లగొట్టబడి.. జీవశ్చవాలుగా..మిగిలిన వారు కనబడతారు. వారికి ఏం కావాలో తెలియని స్థితిలో ఆత్మహత్యా ప్రయత్నాలతో, లేదా మానసిక వికలాంగులై బ్రతుకుతూ హిస్టీరియా రోగులుగానో,రాక్షసుల్లాగా ప్రవర్తించే వారిగానో మారిన వారందరూ గుర్తుకువచ్చి  వారందరిపైనా సానుభూతి కల్గుతుంది. 
అలాంటి వారందరూ  నిజాన్ని గుర్తించి మళ్ళీ  నడక మొదలెట్టి  జీవితాన్ని సాగించాలనే స్ఫూర్తి వంతమైన సందేశం  ఈ నవలలో ఉంటుంది.

1989   డిసెంబర్ చతుర నవలగా వచ్చిన ఈ నవల 1998లో ప్రధమ ముద్రణ వచ్చింది. అప్పటి నుండి.. నేను ఈ నవల కొంటూనే ఉంటాను. బలహీన మనస్కులైన వసంత లాటి స్త్రీల కోసం ఈ నవల  నా నుండి బహుమతిగా అందుతుంది. 
అవును వసంత లాంటి వసంతలు ఉండకూడదు. ఈ నవల చదువుతుంటే..ఎన్నో సార్లు హృదయం ద్రవించి పోతుంది. వసంత పాత్రలో నన్ను నేను చూసుకుంటే పుట్టెడు దుఖం ముంచుకొస్తుంది.నెమ్మదిగా లేచి నిలబడి తడబడి అడుగులు వేయడం నేర్చుకున్న వసంత గుర్తుకు వస్తుంది. 

స్త్రీ జీవితంలో ప్రేమ,పెళ్లి,పిల్లలు.. కొంత భాగం మాత్రమే పూర్తి భాగం మాత్రం అవి  కానే కాదు. అలా అనుకున్నప్పుడే వసంత లు లేకుండా.."మానవి"మాత్రమే ఉంటుంది. అందుకే..మానవి నాకు చాలా  ఇష్టమైన నవల అయింది.

నేను చదవడం నేర్చినప్పటి నుండి ఎన్నో పుస్తకాలు చదివాను. కానీ నన్ను అమితంగా ప్రభావితం చేసిందనడం కన్నా, నాకు నచ్చిన నవలల్లో  మొదటిది,ఆఖరిది  కూడా అయిన నవల ఇది.  స్త్రీ ఒక కూతురు,ఒక సోదరి,ఒక భార్య,ఒక తల్లి వీటి అన్నిటికన్నా ముందు ఒక  మనిషి అన్నది ఎరింగి ఉండాలన్నది ..ఓల్గా గారి అభిప్రాయం మాత్రమే కాదు.. స్త్రీల అందరి అభిప్రాయం.కూడా. అలా అందరు అనుకున్నప్పుడు నాకు "మానవి" నవల కొనడం అవసరపడదు. 

ఈ నవల దొరుకు చోటు నవోదయ బుక్ హౌస్, విశాలాంద్ర బుక్ హౌస్, ప్రజా శక్తి బుక్ హౌస్.     .

(మిత్రులు ఎక్కడైనా  ముద్రా రాక్షసాలు ఉంటే మన్నించగలరు) 

అలాగే ఈ పోస్ట్ పై ఆరోగ్యకరమైన చర్చకి ఆహ్వానం.

22, జులై 2011, శుక్రవారం

దాశరధి ప్రస్థానం -ఓ వెలుతురు బాకు


ఈ రోజు దాశరధి గారి జయంతి..

దాశరధి గారి మొదటి కవితా సంపుటి "అగ్నిధార"

ఆధునికాంధ్ర సాహితీ చరిత్రలో.. దాశరధి గారిది ఒక ప్రత్యేక అధ్యాయం.ఆయన తెలంగాణలో పుట్టడం మూలంగా..భారత స్వాతంత్ర్య పోరాటంలో..ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం  లేకపోయిందని.. చెపుతారు.దాశరధి అటు భారతావని మొత్తం స్వాతంత్ర్య సమర శంఖం పూరిస్తుంటే.. తెలంగాణం లో..ఆ ప్రాంత విముక్తి కొరకు పోరాడవలసి వచ్చినదంటే ..నిజాం పరపీడన వల్ల ప్రజలు ఎన్ని ఇక్కట్ల పాల్బడ్డారో !

దాశరధి తెలుగు దేశంలో ఒక భాగమైన తెలంగాణా స్వాతంత్రోద్యమానికి శంఖం  పూరించారు. ఆ  ఉద్యమంలో పాల్గొని ఎన్నో కష్ట నష్టములకి  గురి అయ్యారు. జైల్లోను,ఉద్యమంలోను.. బాధతో..కవితావేశంలో.. ఆయన వేలువరించిన ఎన్నో కవితా ఖండికలను..మనం దృష్టిలోకి..తీసుకున్నా అందులో..ప్రధానమైనది.."అగ్నిధార"

తెలంగాణా విముక్తి పోరాటంలో తెలుగువారల సమరగీతం దాశరధి లో..ప్రస్పుటంగా కానవస్తుంది.ఆయన ప్రజా కవి. ప్రేక్షకుని వలె కాకుండా ప్రజల కష్టనష్టాలలో  ..తానోకడిగా కలసిపోయి ఉద్యమ వీరుడిగా "పెన్'' అనే ''గన్"  పట్టి..గళం అనే బుల్లెట్ లు వెలువరించి..ప్రజా శక్తులతో కలసి జనంలో కవితావేశాన్ని కల్పించి కార్య రంగంలో..దూకించారు.

నిజం పాలనలో విసిగి పోయిన తెలంగాణా ప్రజల  ఆవేశం,ఆకాంక్షలన్నీ..దాశరధి కవిత్వంలో..ప్రతిబింబించాయి..రజాకార్ల దుండగాలతో ..ఆస్తుల దోపిడీలతో..గృహదహనాలతో ,స్త్రీల మాన అపహరణ లతో.. మారణ దారుణ కాండ కి అట్టుడికి పోయిన కాలంలో.. దాశరధి ఆగ్రహావేశంతో..

ఓ..నిజాం పిశాచమా!కానరాడు 
నిన్ను బోలిన రాజు మా కెన్నడేని 
తీగెలని తెంపి ,అగ్నిలో దింపినావు 
నా తెలంగాణా కోటి రతనాల వీణ

తర తరాల స్వప్నాల సుందర ఫలమ్ము 
స్వైర భారత భూమి చూపెడెనో  లేదో
విషం గుప్పించినాడు నొప్పించినాడు
మా నిజం నవాబు జన్మజన్మాలబూజు 

అచట పాపము దౌర్జన్య మావరించి  
తెలుగుదేశాన నెత్తురుల్ చిలికి 
మత పిశాచం పేదల కుతుక నమిలి
ఉమ్మివేసెను పిప్పి లోకమ్ము మీద 

నా తెలంగాణా  కోటి రతనాల వీణ 
తీవియలు తెగి  విరిగి నదించ కుండే 
నా తెలుగు జాణ ప్రాణమానాలు దోచి
ఈ నిజం పిశాచి  కన్నెర్ర చేసే..

ఇలా.. సాగింది..అగ్నిధార . సమర గీతమై నిలిచింది.నిజాం ..ప్రభుత్వం ఊరుకుంటుందా ? ఇనుపగొలుసులతో  బంధించి ఓరుగల్లు నగర వీధుల్లో..నడిపించింది. నిజామాబాద్ సెంట్రల్ జైలులో నిర్భందించింది. అగ్ని ప్రజ్వరిల్ల కుండా ఆపడం ఎవరి తరం? విప్లవ కవిత్వాన్ని జైలు గోడల మీద శిలాక్షరాలుగా  లిఖించాడు..దాశరధి.
ఆయన ప్రభావంతో..ఎందరో..ఉద్యమంలోకి దుమికి పనిచేసారు. 
తెలంగాణా స్వాతంత్రోద్యమ కవిత ..దాశరధి గళంలో.. పద్య,కావ్య రూపాలలో సాగినా.. ప్రజలు మెచ్చినది..అగ్నిధార..మాత్రమే !

దాశరధి కి కన్నతల్లి అంటే యెంత ఇష్టమో..తెలంగాణ మంటే   అంత ఇష్టం..ఆమెని వేనోల్ కీర్తించి.. తన "రుద్రవీణ" ని ఆమెకి అంకితం  చేసాడు.    

చివరకు నిజాం ప్రభువు..హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో..విలీనం చేసిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..సమైక్యంలోనే అర్ధం ఉందని తలచి.. సమైక్య భావనకి..నడుం బిగించి.. విశాలాంధ్ర సమైక్యత కోసం పద్యాలు వ్రాసారు. ..
తుంగభద్రానదీ భంగమ్ములిరుక్రేనా 
లోరసిపారుచు రుచు లరయు చుండ 
కృష్ణ వేణీ    తరంగిణీ నాలుకలుచాచి 
దారుల రెండిట "మజా"లరయుచుండ
గోదావరీ వీచికా దివ్యహస్త మ్ము 
లిరుకేలన్కుల మన్ను తరచు చుండ 
కోటి   కిన్నెరసాని మాటి మాటికి పొంగి 
రెండు వైపులా దరు లోడంగోనగా 

ఇటునటును తెల్గు  నేల లారటంనోంది
కలసి పోబో జూచున్న యట్టులనే దోచు 
కలిమివేయుము న తెలంగాణ తల్లి 
మూడుకోట్లునోక్కనే ముడి బిగించి ..

నా కోర్కె దీర్చుమమ్మా! 
నీవు మదీయశ్రు కణ  వినిర్మితమాలా 
నీక మ్ము సమర్పించెద 
గాక ,విశాలాంద్ర మనేడి కల నిజమగుతన్ .. అని నదుల నిలా సమైక్య సూత్రంగా వాడారు. 
ఇలా  ప్రాంతం కొరకు,విశాలాంద్రం  కొరకు....ఆయన కలం నర్థించినది.
పునర్నవం,ఆలోచనాలోచనాలు,తిమిరంలో సమరం.. ఇలా కావ్య సృష్టి సాగింది. 

ఎవడైనా మానవుడే-ఎందుకు ద్వేషించడాలు? రాక్షసి నైనా మైత్రికి రానిత్తును భయం లేదు!

హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభించదు -ఉదయం వినా నా కంటికి ఏ వస్తువు రుచించదు 

గతాన్ని కాదనలేను ,వర్తమానం వద్దనబోను ,భవిష్యత్ ఒదులుకోను ..కలం నా కంట మాల .. నా పేరు ప్రజా కోటి -నా వూరు  ప్రజా వాటి ..అంటారు. 

బాంబులలో బలం చచ్చి -పాములలో విషం చచ్చి 
ప్రేమములో బలం హెచ్చి -స్నేహంలో  శక్తి హెచ్చి
చిన్న పాటి అంకుశామున-గున్న ఏనుగును వంచే 
కొత్తరకం పడ్డాయి కనుగోన్నాను రండో !..అంటూ.. ఆయన పథం ని మనకి చూపారు. 

తిమిరంతో ఘన సమరం -జరిపిన బ్రతుకే అమరం 
కవితా తేజోవలయం-అవని శాంతికి అది నిలయం ..అని చెప్పారు. సందర్భాలు వేరువేరుల్లో.  

కమ్మని నా తెలంగాణ ..తొమ్మిది జిల్లాలేనా ? 
బహు లాంధ్రకు తెలంగాణ పర్యాయ పదం కాదా....అన్నారు. వేర్పాటు వాదాలు ని ఆయన మందలించారు. 

ఒక్క తెలుగు -ఒక్క  వెలుగు..అని నినదించారు. 

తల్లీ!నిను ముక్కలోనరించ దలచు వారి 
ఆశ అది ఆశలైయున్న అవసరాన 
నీ పదమ్ము ల్ల  పై తల మోపి నేడు 
చించు చుంటి ఆనందాశ్రు బిన్దువులును.. 
.
నవంబర్ ఒకటి..మనమంతా ఒకటి ..

సూర్య చంద్రులున్నంత వరకు తెలుగు జాతి ఏక సూత్రం పై నిలవాలని ఆయన  ఆకాంక్ష. 

కుడి కంటిని  ఎడమ కన్ను పొడిచేనా ?
కుడి చేతిని ఎడమ చేయి నరికేనా ? 
ఒక దేహం-ఒక గేహం మరిచావా ?
ఒక్క తెలుగు ఒక్క వెలుగు మరిచావా? 

విడిపోవుట -చెడిపోవుట 
విడిపోవుట -పడిపోవుట 
కలసియుంట గెలుచుకుంట 
తెలుగు విలువ తెలుసుకునుట ! 
గుండెను రెండుగా చీల్చు మొండితనం పనికి రాదు
మనుషులని ఏకం చేసే మంచితనం కావాలి.... 
ఇది.. ఆయన భావన. 

ఈనాటి స్వార్ద కుటిల రాజకీయ నాయకుల  పన్నాగాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షగా  రుద్ది.. ప్రాంతాల  పేరిట.వెనకబాటు తనం పేరిట వేరు కుంపట్లు పెట్టి  విధ్వంసాలు సృష్టించే.. నాయకులు.. ఆంద్ర ప్రాంతం వారిని నిజాం ప్రభువులతో పోల్చి.. తెలంగాణ వాదంతో..అవమాన పరస్తున్నారు. అసలు  తెలంగాణ ప్రజల వెనకబాటుతనం ఎందుకు ఉందో.. ఆలోచిస్తూ.. ప్రజల కవి.. వాస్తవ దృక్పధం కల్గిన సమరశీలి దాశరధి..ని ఒకసరి  పరికించి చూస్తే.. తెలుగు వారిగా వారు ఏం కోరుకున్నారో అర్ధం అవుతుంది.తెలుగు దేశాన్ని..ఇంతగా ప్రేమించిన కవి దార్శకనీయత..ఏమిటో..అర్ధం కావాలని..ఒక చిన్ని ఆశతో.. ఈ..వ్యాసం.  
ఆకాశవాణి విజయవాడ "ఏ" కేంద్రంలో  (2004 జూలై ఇరవైరెండు  న) సాహితీ కార్యక్రమంలో.. ప్రసారం  అయిన ..  నా  ప్రసంగ వ్యాసాన్ని కుదించి..ఈ పోస్ట్.. 

దాశరధి ప్రస్థానం -ఓ వెలుతురు బాకు. ఆ బాకు  అజ్ఞాన తిమిరాన్ని..చీల్చి చెండాడాలని.. .. ముకుళిత హస్తములతో..నా అభిమాన కవి..కి..పాదాభి వందనాలతో..