27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

నామిని కథ

నామిని  గారి కథ .. ఒకటి ఈ రోజు చదివాను . కొన్ని తిట్లు కూడా ఈ కథలో ఎంత సహజంగా ఒదిగిపోయాయో,, చూడండి .

ఈ కథ నాకు నచ్చింది ..   "కడుపు కాల్చిన కన్న కూతురు"  ఈ కథలో కూతురు చనిపోతే కన్నతల్లి ఏడ్చిన ఏడుపుకి దేవుడు కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్టు .. బాపు గారు వేసిన   చిత్రం బాగా నచ్చింది.    అందుకే ఇక్కడ  షేర్ చేస్తున్నాను .





కాపీ రైట్ చట్టం క్రింద  ఈ రచన ఇక్కడ ప్రచురణ చేయడంలో .ఎవరికైనా అభ్యంతరం ఉంటే తెలియజేయండి ..వెంటనే తొలగించగలను.

సాకం నాగరాజ సాకం సుధాకర్ గార్లు (తిరుపతి ) వారి మేనకోడలు తేజోవతి జ్ఞాపకార్ధం ప్రచురించిన పుస్తకం నుండి ఈ కథని సేకరించడమైనది .
  

26, సెప్టెంబర్ 2013, గురువారం

చెప్పుకోండి చూద్దాం ..

ఇదేమిటో చెప్పుకోండి చూద్దాం ..

పచ్చి జామకాయ ముక్కలు
పచ్చిమిరపకాయలు

అల్లం

చింతపండు

వెల్లుల్లి పాయలు
జీలకర్ర


 ఉప్పు


కొత్తిమీర



 తాళింపుతో   రెడీ టూ ఈట్ జామకాయ పచ్చడి

:)

24, సెప్టెంబర్ 2013, మంగళవారం

ముకుళిత




"ముకుళిత"  ఈ పేరు వినగానే  ఆసక్తిగా  చూసింది మాలతి. 

అమ్మాయి పేరు బావుంది. అమ్మాయి కూడా బావుంటుందా ? అమితాసక్తి.


“అవును, అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. కాకపొతే కాస్త రంగు తక్కువ.మీకు నచ్చుతుందో లేదో ?” సంశయం.


పేరెన్నికగల మాట్రిమోని వారితో యెదురుగా కూర్చొని మాట్లాడుతున్నాడు రావుగారు, ఆయన కూతురు మాలతి    


“మీ మనుమడికి ముప్పై నాలుగేళ్ళు దాటుతున్నా కళ్యాణ ఘడియ తోసుకురావడం లేదన్న మీ బాధని  అర్ధం చేసుకోగలం . గత అయిదారేళ్ళుగా  యెన్ని  సంబంధాలు  మీ ముందు వుంచాం, వొక్కరైనా మీకు నచ్చారా ? పసుపుని వస్త్రకాయం పట్టినట్లు  అమ్మాయిలని  వొడపోత పడుతున్నారాయే !  ఆమ్మాయి రంగు తక్కువ , కుదిరికలు అంత బాగోలేవు  మరీ చెక్క బొమ్మలా ఉంది  అని వొంకలు పెట్టుకుంటూ పోతూ వుంటే ముదురు బెండకాయలా బ్రహ్మచారి ముదిరిపోతున్నాడు, కాస్త ఆలోచించడి రావు గారు. యెన్నోసంబంధాలు  కుదిర్చిన అనుభవంతో చెపుతున్నాను   ఇప్పటి అమ్మాయిలు చూస్తేనేమో ముప్పై యేళ్ళు దాటాయా? అంత  బాలా కుమారుడు మనకి జోడీ కాలేడులే అని యెగతాళిగా మాట్లాడుతూ నవ్వడం పరిపాటి అయిపోయింది .  అమ్మాయిల మాటలకి  మనసు చివుక్కుమంటున్నా వోర్చుకోక తప్పడంలేదు.  అదివరకటి కాలంకాదిది,  అమ్మాయిలనీ, గుండెల పై బరువుగున్నారు, గంతకి తగ్గ బొంత లాంటి సంబంధం చూసేసి చటుక్కున పెళ్ళి చేసి పంపిద్దామని అమ్మాయిల తల్లిదండ్రులు అనుకోవడంలేదు. ఆమ్మాయిల చదువులు అటకెక్కటంలేదు  మగ పిల్లలతో సమానంగా చదివి సమానంగా ఉద్యోగాలు చేస్తూ  పెళ్ళి సవాల్ ని వొడుపుగా  విసిరి కావాల్సినదానిని చేజిక్కించుకుంటున్నారు . అబ్బాయిలేమో చదువుకుని అందంగా ఉండి ఉద్యోగం చేయనవసరం లేని అమ్మాయిల కోసం గాలిస్తున్నారు .  ఓ.మాదిరి చదువులు చదివి, గొప్ప అందగత్తెలు కాకున్నా కాస్త మధ్యరకంగా ఉన్నా సరే అమ్మాయిల  కలల వాకిళ్ళు విదేశీ ద్వారంలో తెరుచుకోవాలని ఉబలాటపడుతున్నారు. ఇలాంటివన్నీ మీరు అర్ధం చేసుకుని  యేదో వొక లోపం వున్నా సరిపెట్టుకోవాలి”  అని వున్నమాటే చెప్పింది  లక్ష్మి.


ప్రక్కనే వున్నరావు గారి కూతురు  మాలతి కల్పించుకుని  "రంగు విషయంలో నాకు పెద్ద పట్టింపు లేదు మనమందరం   అనుకునే బంగారు రంగు కాంతులీను శరీరఛాయలో  అందం దాగి ఉండదు . మనం మన కళ్ళతో పాటు హృదయంతో కూడా చూడగల్గితే  అమ్మాయిల యొక్క  అందమంతా వారు  సంపాదించిన జ్ఞానం తాలూకూ వెలుగంతా కళ్ళలో కాంతులీనుతూ ఉంటుంది. వారి ఆత్మవిశ్వాసం అంతా వారి మాటల్లో  ప్రకటితమవుతుంది . వారి వివేకం అంతా బాహ్యంగా వారి కదలికలలో కనబడుతుంది వారి ఆలోచనా విధానమంతా స్పందించే తీరుని బట్టి అంచనా వేయవచ్చు. " అమ్మాయి చదువుకుందా ? వివేక వంతురాలేనా అన్నదే ముఖ్యమండీ" అని సైకాలజీ సబ్జక్ట్ చదువుకున్న మాలతి  చెప్పింది.


మాలతి గారి మాటలు విన్న లక్ష్మి తల పట్టుకుంది. అణువణువూ ఇంతగా పరిశీలించే వీరికి తగిన సంబంధం కుదర్చగలనా ? అనే అనుమానం  ఆమెకి  యెప్పటిలాగానే  కల్గింది. ఎలాగోలా ఈ పెళ్ళి కుదిరితే బావుండును. నాలుగు లక్షలు ఇస్తామన్న రావు గారి మాట తెగ ఊరిస్తుంది.మరి కొంత  డబ్బు వేసుకుని డైమండ్ నెక్లెస్ కొనుక్కోవాలి . తనకన్నా వెనుక మాట్రిమోని స్టార్ట్ చేసిన రాణి  యెప్పటి నుండో  డైమండ్ నెక్లెస్ పెట్టుకుని తిరుగుతూ డాబు ప్రదర్శిస్తుంది అనుకుంది మనసులో.


  డైమండ్ నెక్లెస్ కళ్ళ ముందు మెదలగానే విషయం  తొందరగా ముందుకు జరపాలని తోచి  "అమ్మాయిని ముందుగా మీరు చూస్తారా? యెక్కడికైనా  గుడికి కానీ  పార్క్ కి కాని పిలిపించమంటారా ? "


"ఆ అమ్మాయి ముందు మాకు  నచ్చి, తర్వాత అబ్బాయికి నచ్చితేనే వారితో విషయం మాట్లాడదాం . అప్పటి వరకు యే  విషయం వారికి చెప్పకుండా ఉండటమే మంచిది" కండీషన్ చెప్పారు రావు గారు.


"అలాగే  రేపు శుక్రవారం అష్టమహా లక్ష్మి గుడికి  అమ్మాయిని పిలిపించుదాం . మీరు చూసి   యే  సంగతి చెపితే తర్వాత విషయం మాట్లాడుకోవచ్చు"   అంటూ తన ముందు ఉన్న ఫోన్ నంబర్ లిస్టు లో  ముకుళిత నాన్న నంబర్ ని వెతికి కాల్ చేసి విషయం చెప్పింది.   మీరు ఆరున్నరకి గుడి దగ్గరికి చేరుకోవాలి అని చెప్పి  చేతికి ఉన్న వాచ్ లో టైం చూసుకుంటూ లేచి నిలబడింది ఇంకా యెక్కువసేపు  అక్కడే వుంటే  మరిన్ని ప్రశ్నలు వేస్తారని ఆఫీస్ బయటకి నడచింది.


ఆమెతో పాటు బయటకి నడుస్తూ మాలతి “ ఈ అమ్మాయైనా సంజయ్ కి నచ్చుతుందంటారా నాన్నగారూ” అంది


“ఏమోనమ్మా ! వాడిష్టం. వీళ్ళు చెప్పినదాని ప్రకారం అమ్మాయికి ముప్పై ఏళ్ళు దాటాయి. ఎందుకని ఆ అమ్మాయికి యింకా  పెళ్ళి కాలేదో ?” అనుమానం వెలిబుచ్చాడు .


“మనలాగానే  ఆ అమ్మాయికి అనేక గొంతెమ్మ కోర్కెలు వున్నాయేమో యెవరు చూసారు ?” మాలతి విసుక్కుంది.

 

 “మన  బంధువులలో సంజయ్ వయసున్న వారికి యేడెనిమిది యేళ్ళు వున్న పిల్లలు కూడా ఉన్నారు . వాళ్ళ దాకా ఎందుకు?   వాడి కన్నా చిన్నది.మన రమ్య కి మాత్రం ఇద్దరు పిల్లలు పుట్టి చక్కగా స్కూల్కి కూడా వెళ్ళిపోతున్నారు . ఒక్కగానొక్క కొడుకు విదేశాలకి వెళ్లి చదువుకుని అక్కడే  వుద్యోగం చేసుకుంటున్నాడు . గుణవంతుడు ,వెనుక బోలెడంత ఆస్తిపాస్తులు  అయినా వాడికి కళ్యాణ ఘడియ రావడం లేదని నేను బాధపడుతుంటే మీరేమో వచ్చిన సంబంధాలన్నిటిని యిలా వొంకలు  పెట్టి చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది”  అని వెళ్లి విసురుగా కారు లో కూర్చుంది.


“పెళ్ళంటే మాటలా ?  నేనలా  అన్నీ  వివరంగా చూసి మీ ముగ్గురికి పెళ్ళిళ్ళు చేయబట్టే  మీరందరూ సుఖంగా సంతోషంగా వున్నారు”  సమర్ధించుకున్నారు రావు గారు .


మర్నాడు సాయంత్రం "అష్ట మహాలక్ష్మి " గుడికి చేరుకున్నారు .


ముకుళిత , ఆమె తండ్రి కూడా వచ్చారు.  చామాన ఛాయకన్నా వొకింత  తక్కువ రంగుతో  విశాల నయనాలు, సంపెంగ లాంటి ముక్కు, గడ్డం క్రింద చిన్న నొక్కు , నవ్వకుండానే నవ్వినట్లు ఉండే  పెదవులు, చక్కని  జుట్టు  అయిదడుగుల ఆరంగుళాల  యెత్తులో పొందికగా వున్న ఆమెని చూడగానే మాలతికి బాగా నచ్చేసింది . తండ్రికి కూడా అదే విషయం చెప్పింది. రావు గారు కూడా అమ్మాయి రంగు తక్కువ అంటూనే వొప్పుకోక తప్పదు అన్నట్లు తల ఊపారు.


మాలతి  ముకుళితకి కొడుకు సంజయ్ వివరాలు అన్నీ చెప్పి సంజయ్  ఫోన్లో మాట్లాడాలంటే కాస్త  మొహమాట పడతాడు. అతనితో మాట్లాడాలనుకుంటే  ఫేస్ బుక్ లో చాట్ చేయవచ్చు అని సంజయ్  ఐడి ఇచ్చింది.


 మీ ఇద్దరూ మాట్లాడుకుని త్వరలోనే మీ  అంగీకారం తెలిపితే  వెంటనే వివాహం చేయాలన్న కోరికని బయట పెట్టింది. ఆమె ఆత్రుత ని అర్ధం చేసుకున్నట్లు చిన్నగా నవ్వింది ముకుళిత.


ఆ రోజు రాత్రి సంజయ్ కి తనే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది ముకుళిత . 


సంజయ్  ఆమె రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తూ  “మీ పేరు చాలా బావుంది యెవరు పెట్టారు” అడిగాడు ఆసక్తిగా . 


"అమ్మ" చెప్పింది. ఓ..నాలుగైదు రోజుల పాటు చిన్న చిన్న సంభాషణలతో మొదలైన వారి  చాట్ సీరియస్ విషయాల వైపు మళ్ళింది


"పెళ్ళైన తర్వాత కూడా మీరు వుద్యోగం చేయాలనుకుంటున్నారా? " సంజయ్ ప్రశ్న 


"నాకిష్టమైనంతకాల వుద్యోగం చేస్తూనే వుంటాను"


"ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, నేను సంపాదిస్తున్నాను నా వెనుక బోలెడు ఆస్తి పాస్తులు ఉన్నాయి"


"ఉద్యోగం చేయాలనుకున్నది నా అభిరుచి కూడా అవుతుందని మీరెందుకు అనుకోకూడదు"  ఆమె యెదురు  ప్రశ్న 


"అవసరం లేనప్పుడు యెందుకు  శ్రమపడటం  ?"


"నా స్కిల్స్ అన్నీ సొసైటీకి వుపయోగపడాలి. సొసైటీకి వుపయోగపడనప్పుడు నా యీ చదువు నిరర్ధకం అవుతుంది కదా? " ఆమె వాదన వినిపించింది.


"ఇల్లు చక్కబెట్టుకోవడం, మంచి తల్లిగా ఉండటం గురించి కూడా ఆలోచించవచ్చు కదా!" అతని మనసులోని కోరిక 


"ఇలాంటి ప్రశ్నలు వేసి భార్య ఇంటికే పరిమితం కావాలని కోరుకోబట్టీ నేనిన్నాళ్ళు పెళ్ళికి అంగీకారం తెలుపలేదు . మీరిప్పుడూ యిదే కోరుకుంటున్నారు.సారీ !  నన్ను అలా వుండాలని  శాసించే వారిని నేను పెళ్ళి చేసుకోలేను నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే వొకతను కూడా యిలాంటి అభిప్రాయాలే వెలిబుచ్చాడు. నన్ను ప్రేమిస్తున్నాడు అనే భావన కన్నా నా వ్యక్తిత్వాన్ని  గౌరవించిన వారంటనే నేను యెక్కువ యిష్టపడతాను నా అంతగా నేను యిష్టపడితే తప్ప వొకరి భావాలని, ఆలోచనలని బలవంతంగా మోయలేను. బలవంతంగా నాపై రుద్దాలని ప్రయత్నించినప్పుడల్లా నేను నా చుట్టూ ఒక చట్రాన్నిబలంగా బిగించుకుంటాను లుక్ లైక్ టచ్ మి నాట్ .


వెరీ గుడ్ మీ పేరుకి అసలైన నిర్వచనంలా వుంటారన్నమాట . నవ్వుతూ సంజయ్ కామెంట్ .


“నా కొలీగ్ ఒకతను రెండేళ్ళు నన్ను వాచ్ చేసి చేసి నా యిష్టాలు అయిష్టాలు తెలుసుకుని నాకు యెలా  ఉంటే నచ్చుతుందో తెలుసుకుని  సరిగా అలాగే ప్రవర్తిస్తూ నాకు దగ్గరయ్యే ప్రయత్నం చేసాడు అతనికి నా అందం తెలివితేటలు అన్నీ నచ్చాయేమో కానీ వాటితో పాటు  అతనికి నేను సంపాదించే డబ్బు కూడా చాలా అవసరం వుద్యోగం తప్పకుండా చేయాల్సిందే అని చెప్పాడు. అతనికి నో చెప్పాను.  ఎవరో ఒకరులే  నన్ను యిష్టపడితే చాలు పెళ్ళి చేసేసుకుని జీవితాంతం అతనిపై పడి బ్రతుకుదాము అనుకునే మనిషిని కాదు, అల్లాగే అతని ఆర్ధిక అవసరాలకి డబ్బు సంపాదించే యంత్రాన్ని కాదు. అవసరాలకి ముసుగేసి ప్రేమ నటించే మనుషులంటే నాకు అసహ్యం. అలా అని అతనిని నేను ద్వేషించనూ లేదు. అతనికి నో చెప్పాననే అక్కసుతో నా పై  అపవాదులేసి నేను అతను ప్రేమించుకున్నామని  వివాహం తర్వాత  అతను నన్ను వుద్యోగం మానేయమని  చెప్పానని అందుకు నేను అంగీకరించలేదని  నా జీతం డబ్బు అంతా నా తల్లిదండ్రులకే ఇవ్వాలని షరతు పెట్టానని ప్రచారం చేసాడు.  ఆమె గురించి అడగకుండానే చెప్పింది .. 


అప్పుడు మీరు ఫీల్ అవ్వలేదా ?సంజయ్ సందేహం 


నేను ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నాను. ఎవరైనా  నా అనుమతి లేకుండా నా నీడని కూడా తాకడం సాధ్యం కాని పని. నా తోటి బాటసారుల పట్ల అభావమే తప్ప అభద్రతా భావమే లేదు నిరభ్యంతరంగా మీ ముసుగులు తీసేసి నడవండి. వెలుతురులో తడవండి, ఈ పువ్వుల్లా నవ్వండి,నాలా ఉండండి అని చిన్న మెసేజ్ పంపాను. ఆత్మ విశ్వాసం తొంగి చూసింది ఆమె మాటల్లో 


“ఇంతేనా,మీ లేట్ మేరీడ్ వెనుక కారణాలు యింకేమైనా వున్నాయా?” అతని అనుమానాలు . 


“వచ్చిన ప్రతి సంబందానికి వొంకలు  పెట్టి పంపుతున్నానని యింట్లో వాళ్ళు , కావాల్సిన వ్యక్తిని నేనే వెదుక్కునే ప్రయత్నం చేసాను అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. వొకరిని ప్రేమించాననుకుని అపోహ పడ్డాను బహుశా అది ఆకర్షణ ఏమో! అతను ప్రేమిస్తున్నాడు అనుకుని భ్రమ పడ్డాను.అతనికి భార్య పిల్లలు ఉన్నారని తెలిసినప్పుడు షాక్ కొట్టినట్లై దూరం జరిగాను. ప్రేమ పైనే కాదు మనుషులపైనే నమ్మకం పోయింది చెప్పింది 

 

“మనుషులు అందరూ ఒకే విధంగా ఉండరు. మీలా ఆలోచించేవాళ్ళు ఉండవచ్చు” అన్నాడు సంజయ్ .


“నాలాంటివారు వుంటారో లేదో నాకు తెలియదు . నేనిలాగే వుంటాను  నాణానికి బొమ్మ బొరుసు రెండు వుంటాయేమో కానీ నా గురించి నేను చెప్పినా నా గురించి యింకొకరు  చెప్పినా ఇలాగే ఉంటుంది నా ప్రేమ లో పూర్తిగా ప్రేమే ఉంటుంది , నా ద్వేషం లోనూ ద్వేషమే ఉంటుంది. నాలో ద్వైదీ భావనలేవి ఉండవు. కలగా పులగమైన భావనలతో, అయోమయస్తితిలో, నాకు నేనే అర్ధం కాని స్థితిలో నేనుండను. నా గీత నేనే గీసుకుంటాను, నేగీసిన గీతని నేనే చేరిపేసుకుంటాను తప్ప వేరొకరికి ఆ అవకాశమే మిగల్చను” గర్వంగా చెప్పుకుంది 


"మీ గురించి చెప్పారు మరి నా గురించి అడగలేదు" అడిగాడతను 


"నేను చెప్పిన మూడు విషయాలు మీకర్ధమైయితే నేను మీకు నచ్చనని ఖచ్చితంగా  నాకు తెలుసు. నచ్చనప్పుడు మీ గురించిన విషయాలు అడగడం అవసరం కాదు కదా !  అందుకే  ఈ ముకుళిత ముడుచుకునే ఉంటుంది వికసింపజేసే కిరణం తాకేవరకు" తెలివిగా చెప్పింది 


“మీరు నాకు నచ్చారు . ముఖ్యంగా మీ నిజాయితీ చాలా నచ్చింది నా గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఏమైనా అడగవచ్చు”


అవసరం లేదు . మీ గురించి అంతా తెలుసుకున్నాకే .. ఇంకోసారి పెళ్ళి చూపులకి సిద్దమయ్యాను . పెళ్ళి అంటేనే ఒక  లైఫ్ టైమ్ కమిట్మెంట్,  పూర్తి నమ్మకం,  కొన్ని సర్దుబాటు ,  ఇరువురి మధ్య అవగాహన కావాల్సినవి ఇవే !


 "మీరు నాకు పూర్తిగా  నచ్చారు. నేను మీకు నచ్చినట్లేనా?" అడిగాడతను 


"పెళ్ళి తర్వాత నేను యెలా  వుండాలన్నది మీరు చెప్పనేలేదు. అది స్పష్టంగా చెప్పాలి " అడిగింది . 


"నేను మొదటే చెప్పాను కదా! హౌస్ వైఫ్ గా  వుంటే చాలు . " అతని కోరిక . 


"సరే నండీ, ఆలోచించుకుని  మీ అమ్మ గారితో  నా నిర్ణయం చెపుతాను  bye.. అండీ " గౌరవంగా చాట్ ముగించింది 

"bye .. అండీ. సంతోషకరమైన వార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను " చెప్పాడతను . 


మరుసటి రోజు ఉదయాన్నే నిర్ణయం కోసం మరింత  సమయం వేచి ఉండనీయక ముకుళిత  మాలతికి ఫోన్ చేసింది. 


"ముకుళిత  చెప్పు ! నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం” అడిగింది మాలతి.

 

"సారీ అండీ,మీ అబ్బాయిని నేను పెళ్ళి చేసుకోవాలనుకోవడం లేదు " చెప్పింది . 


శుభవార్త వస్తుందని ఆశించిన మాలతికి తీరని ఆశాభంగం ఎదురైంది . 

 

“మీ అబ్బాయికి ఉన్నత చదువులు  చదువుకుని, వుద్యోగం చేయని  యిల్లు  దిద్దుకోగల అందమైన అమ్మాయి కావాలి. భర్త చదువు వుద్యోగం, సంపాదించే డాలర్లు, ఆస్తిపాస్తులు అందచందం చూసి మురిసిపోయే అమాయకమైన అమ్మాయి అయితే మరీ మంచిది. అది అతని కోరిక. నేనలాంటి  అమ్మాయిని కాదు కాబట్టి భర్త అనే తోడూ కోసం  వుద్యోగం, తల్లిదండ్రులు, మాతృ దేశం  యివ్వన్నీ  వదిలేసుకుని అతనికి పూర్తిగా నచ్చిన విధంగా నేను మారలేను. నేనే కాదు, ఈ తరం ఆడపిల్లలెవరూ అంత వ్యక్తిత్వం  చంపుకుని బ్రతకలేరు. వివాహం అనేది స్త్రీ పురుషులిద్దరికీ అవసరమే! కీవలం స్త్రీకి వొక్కరికే అవసరం  అన్న అభిప్రాయం మార్చుకుంటే మంచిది.” చెప్పి తనే లైన్ కట్ చేసింది. 


ఈ సంబంధం కూడా చెడగొట్టుకున్నాడా ? తల పట్టుకుంది మాలతి 


ఈ కాలం అమ్మాయిలూ యెంత  ఫాస్ట్ గా ఉన్నారు ?  యెంత  ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ? ముకుళిత లాంటి అమ్మాయిలు  తమకేం కావాలో  తెలుసుకుని  మంచి  ఆలోచనా  ధోరణితో  యెంత  స్పష్టంగా  మాట్లాడుతున్నారు!  వీళ్ళు  పెళ్ళి చేసుకుంటే అసలా పెళ్ళిళ్ళు సఫలం అవుతాయా? మగవాళ్ళ అహంకారం అడుగడుగునా తలెత్తి  అణగద్రొక్కాలని   చూస్తుంటే  యీ తరం అమ్మాయిలది ఆత్మ విశ్వాసమో, అతి విశ్వాసమో అర్ధం కాకుండా తయారయ్యారు.  అందుకే పెళ్ళైన  మూన్నాళ్ళకే  పెళ్ళిళ్ళు పెటాకులైపోతున్నాయి.  చలం  ఆశించిన   స్త్రీల  స్వేచ్ఛ యిదేనేమో ! ఇక వీడికి పెళ్ళి కావడం చాలా కష్టమేమో! వీడు ఆడపిల్లై పుట్టినా బాగుండేది అనుకుని దిగులుపడింది మాలతి.

23, సెప్టెంబర్ 2013, సోమవారం

దుఃఖ రహితం

దుఃఖం అనివార్యమైనది.

వాన బారిన ,  ప్రేమ బారిన, దుఃఖం బారిన పడకుండా ఎవరు ఉండలేరేమో !  దుఖానికి మూలకారణం స్పందించే హృదయం ఉన్నందు కేమో!

అసలు దుఃఖం  ఎందుకు వస్తుంది ?  ఒకోసారి  మనది కాని దుఃఖాన్ని  అనుభవిస్తాము  మనం అనుకున్నవి జరగనప్పుడు నిరాశ కల్గుతుంది అప్పుడే కాదు ఇంకెప్పుడు మనం అనుకున్నవి జరగవనే భయంతో కల్గిన  ఊహ కూడా దుఃఖాన్ని పుట్టిస్తుంది .

ఈ జీవితం చాలా చిన్నది . అందులో యవ్వన కాలం మరీ చిన్నది . యవ్వన కాలం లో లభించిన ఆనందం ద్వారానే మిగిలిన రెండు దశలు ఆనందకరంగా జరుగుతాయనీ చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఏ పొత్తానికి  ఆ పొత్తం  దుఃఖ చాయలు అంత అంటకుండా జాగ్రత్త పడటమే మనకున్న మార్గం

దుఃఖానికి  హేతువు  కోరికలు ఉండటమే .. అని  గౌతమ బుద్దుడు చెపితే . కోరికలు లేకుండా మనిషి మనుగడ ఎలా సాగిస్తాడని మనకి సందేహం కలుగవచ్చు . అందుకే మితిమీరిన కోర్కెలు ఉండటం మూలంగా  అవి నెరవేరక దుఃఖాన్ని  అనుభవించిక తప్పని పరిస్థితి

దుఃఖ కడలిని యెద .న  దాచవచ్చు గాని  కనుల పొరలు నదులని ఆపతరమా?

కఠిన శిలలని ఒరుసుకుంటూ జలం ప్రవహించి  ప్రవహించి కడలిని చేరినట్లు ... వెలుగుకి చోటిస్తూ రేయి తానంతట తానే  తొలిగినట్లు ...

నిజమేదియో గ్రహించ గల శక్తి ఉన్నప్పుడు . దుఃఖం  మన దరికి చేరకుండా దూరంగా తొలగిపోతుంది .

దుఃఖాన్ని ఎన్నడూ   పంచని నవ్వులని  మాత్రమే పంచే  ఆప్తులని చూసినప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది

దుఃఖంలో నుండి  దుఖం లోకి జారిపోనివ్వకుండా అభయ ముద్ర నిచ్చి వారి  ముద్రలని దుఃఖ నీడన పడకుండా .. మనకి దిశా నిర్దేశం చేసే "గైడ్ " అవసరం ఉంటుంది కదా !

పార్దునికి కృష్ణుడు ఉన్నట్లు,  ఆమ్రపాలికి  బుద్ధుడు శరణ్యం అయినట్లు ...  మనకి ఆధ్యాత్మిక గురువులు అవసరం ఎంతైనా ఉంది. వారిని వెదుక్కుంటూ ... వెళుతూ .. తెలుసుకున్నవి  కొన్ని ...

ఈ జీవితమే ఒక నాటక రంగం ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు  రావటం మన చేతుల్లో లేదు పోవుట మన చేతుల్లో లేదు ..ఎవరి పాత్ర వారు నటించడమే !


19, సెప్టెంబర్ 2013, గురువారం

అనువుకాని వేళ

అనువుకాని వేళ
వయస్సుతో సంబంధం లేకుండా ఆడవారి పై జరిగే అత్యాచారాలని అరికట్టడం ఎవరి పని కావడంలేదు . ఆ అత్యాచారాలని అరికట్టడానికి ఎవరికీ వారు జాగ్రత్తలు తీసుకోవల్సినదే ! మొన్నెప్పుడో నేను ఆడవారికి లైసెన్స్ తుపాకీలు ఇవ్వాలి అప్పుడైయినా భయపడతారని వ్యాఖ్యానించాను . అది కూడా కరక్ట్ కాదు మహిళల చేతుల్లో ఉన్న తుపాకీలు లాక్కుని వారిపై అత్యాచారాలు చేసి చంపేసి పోతారు అని ఒకరు తిరిగి వ్యాఖ్యానించారు

అసలు పగలు రాత్రి తేడానే లేకుండా ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయేటప్పుడు ఆడవాళ్ళని బయటకి వెళ్ళ కూడదు అని చెప్పడం కూడా సబబు కాదు ఎందుకంటే ఇల్లు పదిలం కాదని అనిపిస్తుంది కాబట్టి.

రెండేళ్ళ క్రితం ఒకసారి,నాలుగు నెలల క్రితం ఒకసారి .. అసలు ఇంట్లో నుంచి బయటకి వెళ్ళడం గురించి కూడా ఆలోచించుకోవాలి అని అనుకున్నాను కూడా . చిన్నప్పటి నుండి నాతొ పాటు పెరిగి నా స్వభావం తెలిసిన మా చెల్లెలు కూడా నేను విపరీతంగా భయపడటం చూసి ఆశ్చర్యపోయింది .. తర్వాత నేను కూడా అనుకున్నాను అంత అభద్రతా భావం పనికిరాదేమో నేను అనవసరంగా భయపడుతున్నానని.

అలా భయపడటానికి గల కారణం చెపుతాను ..

రెండేళ్ళ క్రితం మా విజయవాడ పట్టణంలో  "తెలుగు సినిమా పాట -చరిత్ర " డా॥ పైడిపాల గారి పుస్తకావిష్కరణ జరిగింది .. ఆ సభకి ముఖ్య అతిధులుగా "ఎస్.పీబాలసుబ్రహ్మణ్యం " గారు ,"సిరివెన్నెల " గారు వస్తున్నారు , పైగా ఆ సభని నిర్వహిస్తున్నది "ఎక్సరే సాహితీ సంస్థ " కాబట్టి నేను తప్పకుండా వెళ్ళాలి . అంతకన్నా ఎక్కువగా నేను ఎంతగానో అభిమానించే ..."సిరివెన్నెల " గారిని స్వయంగా చూడటం ,మాట్లాడం అన్నది  చేజార్చుకోకూడదని ఆ సభకి వెళ్లాను ..

ఆ కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  జరిగింది.  విజయవంతంగా సభ జరిగింది . నేను సిరివెన్నెల గారితో మాట్లాడి వారి "ఆటోగ్రాఫ్ " ని తీసుకున్నాను . అంతవరకూ సంతోషం. సభ పూర్తీ అయినది . ఎవరి దారి వారిది . ఆ రోజు నేను నా ద్విచక్రవాహనం ని బయటకి తీయలేదు . ఇంటి ముందు బస్ ఎక్కి,కళాక్షేత్రం ముందు బస్సు దిగవచ్చని .. హాయిగా బస్ ప్రయాణం చేసాను. అదే పొరబాటు అయిపొయింది. సభ ముగిసిన తర్వాత నేను బయటకి వచ్చి బస్ స్టాప్ లో నిలబడ్డాను ఎంత సేపటికి బస్ లు రావడం లేదు. ఎందుకో నాకు అర్ధం కాలేదు.అలాగే వేచి  చూస్తున్నాను . నా చుట్టూ పోకిరీవాళ్ళు పోగవుతున్నారు. పైకి దైర్యంగా ఉన్నా .. లోపల భయం . వెంటనే .. ఒకరి అడిగాను .. "ఏమండీ బస్ లు రావడం లేదు ఎందుకని ? అండర్ బ్రిడ్జ్ క్రింద పనులు జరుగుతున్నాయి " అటు బస్ లు  రావడం లేదు. మీరు బస్ స్టాండ్ కి వెళ్లి బస్ ఎక్కాల్సిందే " అని చెప్పారు . కాస్తంత దూరం నడిస్తే బస్ స్టాండ్ వచ్చేది కదా ! బుద్ది లేకుండా  ఇంత సేపు ఇక్కడ నిలబడి ఈ పోకిరీ వాళ్ళ బారిన పడ్డాను అనుకుని గబా గబా బస్ స్టాండ్ వైపుకి దారి తీశాను ఇద్దరు నా వెనుక ఫాలోఅవుతూనే ఉన్నారు . నా తోటీ ప్రయాణికులు అనుకున్నంత తేలికగా .. నేను పైకి దైర్యం కూడా గట్టుకుని .. బస్ స్టాండ్ వైపు వచ్చాను .

విజయ వాడ నగరంలో నడి బొడ్డున , పైగా కూత వేటు దూరంలో పోలీస్  కంట్రోల్ రూమ్,అక్కడే ఉన్న   బస్ స్టాప్ లో నిలబడ్డ ఆడవాళ్లకే రక్షణ లేకుండా ఉన్నప్పుడు ..  ఇక  మారుమూలల్లో ఆడవాళ్ళకి రక్షణ ఎలా ఉంటుంది ?

ఆ అనుభవంతో నేను చాలా భయపడి పోయాను .  రాత్రి వేళల్లో జరిగే సభలు సమావేశాలు లాంటి వాటికి వెళ్ళడానికి  స్వస్తి చెప్పాను .

ఇలాంటి ఇబ్బందులు ఇవైతే  సాహితీ సభలు,సమావేశాలలో సంస్కారం ముసుగు వేసుకున్న వాళ్ళు   మరి కొందరు. నా ఫేస్ బుక్ ప్రెండ్ ఒకరు చెప్పారు . ఆమె రాజధాని నగరంలో ఒక విశ్వవిద్యాలయంలో వర్క్ చేసేవారు . ఆమెకి సాహిత్యం పట్ల చాలా ఆసక్తి . కవిత్వం వ్రాస్తారు . సభలు సమావేశాలకి తరచూ వెళుతూ ఉంటుంది . ఒక ప్రముఖ సాహితీ వేత్త .. ఆమెని "నాతో  లాంగ్ డ్రైవ్" కి రమ్మని పదే పదే  ఆహ్వానించడం,మొబైల్ కి అశ్లీల సంభాషణలు పంపడం మొదలెట్టేసరికి సభలకి వెళ్ళడం మానుకుంది. ఫోన్ నంబర్ మార్చుకుంది . ఇంట్లో భర్తకి చెపితే అవొక ఇబ్బందులు . నిన్ను నేను కవిత్వాలు,కథలు గట్రా వ్రాయమన్నానా !? సభలకి తిరగమన్నానా ..?   ఇల్లు వదిలేసి సభలకి సమావేశాలకి తిరిగితే ఇలాగే అంటాడే, వాడేమిటి.. ప్రతి ఒక్కడు అలాగే అంటాడు " అని తిట్టి పోసాడంట  ఆమె భర్త . ఆమె ఆవిషయం చెప్పి కన్నీరు పెట్టుకున్నారు  ఆ విషయం అలా ఉంచితే .. ఇక నా రెండో అనుభవం గురించి....

గత మే నెలలో మా బంధువుల అమ్మాయి పెళ్ళి జరిగింది మెహందీ పంక్షన్ కి మా కుటుంబం మొత్తం వెళ్లాం... అందరం ఆడవాళ్ళమే!   మెహందీ పంక్షన్ లో పాటలు,డాన్స్ , క్విజ్ కార్యక్రమం ఆస్వాదిస్తూ టైం పదిన్నర అయింది అన్న సంగతి చూసుకోలేదు. టైం చూసుకుని ఉలికి పడి ఎదో గబా గబా కతికి .. ఆ పంక్షన్ హాలు నుండి బయట పడ్డాము. వదిన ,మేనకోడలు ఒక వైపుకి వెళ్ళాలి, నేను చెల్లెలు ఒకవైపుకి రావాలి .. బస్ సౌకర్యం ఉంటె .. ఎవరూ వెహికిల్స్ అంటుకోము. (అదొక మాయ రోగం అని ఇంట్లో మగవాళ్ళు తిడతారు కాని భద్రత సమస్య అని అర్ధం చేసుకోరు )

మేము పంక్షన్ జరిగిన పెద్ద హోటల్ నుండి బయటకి వచ్చి కొంచెం దూరంలో ఉన్న బస్ స్టాప్ వైపు నడుస్తున్నాం. ఒక కారు మా వెనుకనే వస్తుంది మమ్మల్ని దాటి ముందుకు వెళ్లి ఆపి లిఫ్ట్ కావాలా అని అడిగాడతను. మేము పట్టించుకోకుండా  ముందుకు నడవసాగాం . మళ్ళీ కారు మమ్మల్ని దాటి వెళ్లి ఆపి .. మాతో మాట్లాడటానికి ప్రయత్నించాడు . ఆ విషయం మా చెల్లెలు తో చెప్పాను . " మనకి తెలిసిన వాళ్ళు ఎవరైననేమో  అక్కా.. ఎందుకు అలా భయపడతావ్ !?  " అని చిరాకు పడింది . "లేదు మనకి తెలిసిన వాళ్ళు కాదు" అన్నాను . "మనం ఇంత మందిమి ఉన్నాం, ఎవరేమి చేస్తారు? నీకు అన్ని భయాలు ఎక్కువయ్యాయి "అని కోప్పడింది

వదిన వాళ్ళు వెళ్ళాల్సిన వైపు బస్ లే రావడం లేదు . ఆటో లో వెళ్ళండి అని మా చెల్లెలు ,వద్దని నేను అలా వాదన గడచి ఎలాగైతేనేమి బస్ వచ్చింది వాళ్ళు వెళ్ళారు .. "అమ్మయ్య " అనుకుని నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాను . మా చెల్లెలు నేను బస్ ఎక్కి ఇంటికి వచ్చేసాను . తర్వాత మా చెల్లెలు అమ్మాయితో చెపుతుంది ." పెద్దమ్మ .. అదివరకటిలా కాదు విపరీతంగా భయపడుతుంది" అని  చెప్పి... నవ్వుతుంది

నా భయాలకి కారణం ఏమిటంటే .. ఆటో వాళ్ళు కూడా చాలా ప్రమాదకరంగా తయారయ్యారు ఒకసారి  వదిన, మేనకోడలిని తీసుకుని ఆటోలో వెళుతుంటే వాడు మెయిన్ రోడ్ ప్రయాణం వదిలి వేరే రూట్ల ద్వారా ఆటో నడిపాడని భయ పడింది వదిన .   అల్లాగే నా ఫ్రెండ్ ఒకరు హాండ్ ప్రింట్స్, బాతిక్ యూనిట్ నడుపుతూ ఉంటారు . విజయవాడలో అంతగా ఆర్డర్స్ లేవని హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు ఇద్దరు ఆడపిల్లలు . వారి చదువులు కూడా అక్కడే !  చాలా కష్ట జీవి. ఆమె ఆర్డర్స్ కోసం హైదరాబాద్ లో చాలా లోపలి ప్రాంతాల లోకి కూడా వెళ్లి ఆర్డర్స్ తెచ్చుకునే వారు. ఆమె బస్ ప్రయాణమే చేసేవారు . సిటీ అవుట్ స్కర్ట్స్  బస్ స్తాపులలో నిలబడి ఉన్నప్పుడు అంతే..  ప్రక్కనే కారు ఆపి డోర్ తీసి నిలబడే వారట. అలాంటి రెండు మూడు సంఘటనల తర్వాత ఆమె భయపడి పోయి .. పిల్లలని కాలేజ్ హాస్టల్ లో జాయిన్ చేసి  మళ్ళీ విజయవాడకి వచ్చేసారు . " ఆడవాళ్ళు నిజాయితీగా బ్రతకడం చాలా కష్టమండి . హైదరాబాద్ అంటేనే భయం వేసింది " అంటారు ఆమె. ఇలా నా చుట్టూ ప్రక్కల వారి అనుభవాలు .., మన చుట్టూరా జరుగుతున్నా సంఘటనలు చూస్తుంటే .. ఎంతో దైర్యవంతురాలినైన నేను ఉలికిపడుతూ ఉంటానన్నది నిజం .

అసలు ఈ విపరీత దోరణులకి కారణం ఏమిటి ? కనిపించిన ప్రతి ఆడవారిని  తుచ్చంగా చూసే సంస్కృతీ పెరగడానికి కారణం ఏమిటీ!? ఎటువైపుకి వెళుతున్నాం మనం ..? బాహ్య ప్రపంచంలోకి వెళ్ళకుండా ఎలా ఉండగలరు ? ఎవరి పనులు, ఎవరి ఉద్యోగాలు వారివి . ప్రతి ఒక్కరికి బ్రతుకు పోరాటం, ఒంటరిగా ప్రయాణించక తప్పనిసరి పరిస్థితులు ఉంటాయి.  కనిపించిన ప్రతి వారిని కాముక దృష్టితో చూసే ఈ మాయదారి లోకంలో ఎలా బ్రతకడం ?

నేనైతే ఆడపిల్లలని పదే పదే హెచ్చరిస్తూనే ఉంటాను. "వాడికి ఏం పోయిందో ,నాకు అదే పోయింది " అని అనుకుని సరిపెట్టుకుని బ్రతకగల విశాల దృక్పథం మన భారతీయ స్త్రీలలో రాదు, రాదు గాక రాదు. అలా వచ్చిన రోజున ఇన్ని అత్యాచారాల కేసులు పోలీస్ రికార్డ్ లలో నమోదు కావు , దిన పత్రికల నిత్య వార్తలకి బలి అవవు.

 "అత్యాచారం అన్నది భౌతిక, మానసిక దాడి"  మానసికంగా మనం దృడంగా ఉండగల్గిన పెంపకాలలో పెరగడం లేదు. అనుక్షణం అభద్రతాభావంలో, సమాజం లో నలుగురు ఏమనుకుంటున్నారో అని భయపడుతూ నలుగురి మధ్య  మధ్య తరగతి మందహాసంతో పళ్ళ బిగువునా అన్నీ భరిస్తూ .. బ్రతికే మనుషులం . ఖచ్చితంగా చెప్పాలంటే .. భారతీయ సంస్కృతిని నరం నరం జీర్ణించుకుని శారీరక పవిత్రతని కాపాడు కోవాలనుకునే ఆలోచనలు కల్గిన స్త్రీ జాతి వారసులం " అందుకే .. అనువుకాని వేళ బయట తిరగకండి " అని చెపుతాను.

చదువుంది, ఉద్యోగం ఉంది , సమాన హక్కులు ఉన్నాయి, మా వస్త్రధారణ  మా ఇష్టం  అనుకుని భ్రమపడి  మృగాల బారిన పడకండి. మన జాగ్రత్తలో మనం ఉండటం తప్పు కాదు కదా!

ఇలా నేను ఎదుర్కొన్న రెండు సమస్యల వల్ల ఒంటరిగా బయటకి వెళ్ళడం అంటేనే ఆలోచించే స్థితికి వచ్చేసాను . 45 ఏళ్ళు దాటిన నేనే ఇలాంటి పరిస్థితులని చూస్తే .. ఇక యువతుల సంగతి ఏమిటీ?
వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ! ముఖ్యంగా తల్లులకి చెప్పేది ఏమిటంటే .. వాళ్ళే తమ  బిడ్డలని కాపాడుకోవాలి తప్పదు

అత్యాచారాలకి  బలి కాకుండా ఉండాలంటే ..  సాధ్యమైనంత వరకు ఒంటరిగా వెళ్ళడం మానేయాలి అని చెపుతున్నాను

.     

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

శిక్షా ఓ హెచ్చరిక

ఉరిశిక్షలు అత్యాచారాలని నిలుపు చేస్తాయా..?  ఇంకా జరుగుతూనే ఉన్నాయి .  అంటూ క్రొత్తగా కొందరు ఉరి శిక్షల్ని వ్యతిరేకిస్తూ ..నిరసన తెలియజేస్తున్నారు. డిల్లీ లో జరిగిన రేప్ నిందితులకి  శిక్ష అమలుపరచడాన్ని నేను హర్షిస్తాను . ఇలాంటి అత్యాచారాలు జరగకుండా చేయాలంటే  అందుకు మనం ఏంచేయాలి ..  అందరికి భాద్యత ఉంది కదా .. !.

అత్యాచారాల భారతం .. లో ఎవరి తప్పు ఎంత ? సినిమాలు,మీడియా or అతి తేలికగా లభిస్తున్న దృశ్య మాధ్యమ అశ్లీల చిత్రాలు

వీటి నిరోధం కోసం ఎలాంటి చట్టాలు ఉన్నాయి ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి ? సామాన్యుడికి అనేక సందేహాలు. సామాజిక అవగాహన పేరిట మీడియా అత్యాచారాల నిరోదానికి దోహదం చేస్తుందా ? ఇంకా ప్రేరేపిస్తుందా?

ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలని పంచుకోండి ..

అలాగే నా బ్లాగ్ లో అదివరకు పోస్ట్ చేసిన  ఈ పోస్ట్ చూడండి .


http://vanajavanamali.blogspot.in/2011/06/blog-post_17.html





నేరం ఎవరు చేసినా శిక్షించడంలో జాలి,సానుభూతి ఉండకూడదు . క్షమించడం అంత తేలిక కాదు . నేర నిరోదానికి  శిక్షా   ఓ  హెచ్చరిక కూడా ..  

16, సెప్టెంబర్ 2013, సోమవారం

జగ్గయ్యపేట రంగు రాళ్ళు చాలమ్మా ! .

ప్రతి రోజూ మెయిల్ బాక్స్ చెక్  చేసుకునేటప్పుడు.. నవ్వుకోవాలో, ఏడవాలో, జాలి పడాలో తెలియని పరిస్థితి.  .

నేను .. మెయిల్ బాక్స్ ఓపెన్ చేసానా .. ఇదిగో.. ఇలా ఉంటాయి విద్యుల్లేఖలు ..

"వనజా  ఐ యాం ఆనంద్  29  ఫ్రం బెంగళూరు, మ్యూజిక్ లవర్ , డు   యు మేరీ  మీ .."  మెయిల్ ఓపెన్ చేయకుండానే పైన కనబడుతూఉంటుంది .  వెంటనే గుండె గుబేల్  మంటుంది కానీ  కొంచెం సేపటిలోనే  తేరుకుని

నేనిలా అనుకుంటాను.." నీ బొంద, నా  కొడుకుకి  ఇంకో మూడేళ్ళు ఉంటే  నీ అంత వయసు ఉంటుంది . నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటిరా ? ఏదో రాంగ్ ID  కి పంపినట్టున్నావ్ ! పనిచూసుకో .. వెళ్ళవయ్యా వెళ్ళు  వెళ్ళూ." డిలీట్ బాక్స్ లోకి పంపేస్తాను.

మళ్ళీ తెల్లవారే .." వనజా ఐ వాంట్ సి యు ప్లీజ్ ! డు  యు మేరీ  మీ" ఇలా ఉన్న మెయిల్ చూసి చిరాకు వచ్చేస్తుంది .

"ఒరేయ్ నీకు  ఒకసారి చెపితే అర్ధం కాదా ! వెర్రి ముండా  కొడకా .. నీకేమన్నా పైత్యమంటరా ? ఒకే పాటలు ఇష్టపడినంత మాత్రాన  పెళ్ళిళ్ళు  చేసేసుకుంటారటరా!?  ఇప్పుడు నిజంగా నాముందుకు వస్తే పీలర్ తో తోలు తీసి ఉప్పు, కారంలో పొర్లించి మరీ...  బెంగుళూరుకి ప్లైట్ ఎక్కిస్తా .. ముందు నా ముందుకు రారా చూద్ద్దాం ".. అంటూ  మళ్ళీ డిలీట్ బాక్స్ లోకి పంపేస్తాను.

ఆ పైనే .. నీకు  ఈ రోజు మంచి అవకాశం  కలసి వస్తుంది ..కావాలంటే . మీ  జాతకంలో ఈ రోజు ఏం జరుగుతుందో  ఇక్కడ చూసుకోండి  అంటాడు .Horoscop  free  వాడు .

"నా జాతకం వద్దు, నీ పిండా కూడు వద్దు .. పోరా బాబు పో .. నీ దారి నువ్వే చూసుకోరా" అని వాడిని బలవంతంగా డిలీట్  బాక్స్ లోకి పంపుతాను

ఇంకొకటి ..  "వనజా!  మీరు సామ్సంగ్ గెలాక్సీ   ఫోన్ గెలుచుకున్నారు 664 రూపాయలకే ".అంటాడు ఇంకొకడు .

సామ్సంగ్ గెలాక్సీ .. ఆ .. నాకొద్దు .. నా iphone 5 ఉంది ముద్దు ముద్దుగా .. నువ్వు ఫ్రీగా ఇస్తానన్నా నాకొద్దు పోవయ్యా.. అంటూ గిరాటు వేసినట్లు .. వాడిని  డిలీట్  బాక్స్ లోకి పంపుతాను

 కేవలం వెయ్యి రూపాయలకే మీరు  యెన్ఐఐటి సర్టిఫికేట్ పొందవచ్చు వివరాలకు సంప్రదించండి  అని మెయిల్ లో కనబడి మూర్చపోయాను . ఓర్ని! ఇంత  సులభమైన  పద్దతిలో  యెన్ఐటి పూర్తయిపోతుంటే మన ఆంద్ర వాళ్ళు కిండర్ గార్డెన్ స్కూల్ దగ్గరనుండే ఐ ఐ టి కోచింగ్ కోసం కార్పోరేట్ స్కూల్స్ కి,  కాలేజ్ లకి లక్షలు లక్షలు ఖర్చుపెట్టేవాళ్ళు కదా ! తెలియక  వారికి ఎంత అన్యాయం జరిగిపోయింది . ఇవాళ కనీసం ఒక వందమంది పేరెంట్స్ కైనా..  ఈ విషయం తెలియజేయాలని కంకణం కట్టుకున్నాను .
 ఇక తరువాత  మెయిల్ చూస్తే .. "వనజా ! మీకు కేవలం  150 రూపాయల ప్యాక్ తో  ఐ  బ్రోస్ , పేషియల్ , పెడిక్యూర్, మేనిక్యూర్, బాడీ వాక్స్ అన్నీ ఇస్తాం. మా పార్లర్ కి ఒకసారి  విజిట్ చేయండి " .. అంటూ ఉంటుంది

ఓర్ని ! ఇంత ఛీఫ్ .ఆఆఆఆఆఆఅ    మొన్నీమధ్య నా హెయిర్ స్టైల్ ట్రిమ్  చేయించుకుంటేనే  650 దొబ్బేసారే ! ఎంత మోసం అనుకుంటూనే .. ఓహో .అర్ధమయిందిలే !  పంక్షన్స్  సీజన్ అయిపోయిందిగా తల్లీ .. ఈగలు తోలుకుంటున్నారా .. అనుకుంటూనే  .. నాకు ఇలాంటివి అలవాటు లేదండి.. నేనంత నాగరికం కాదులే! పూర్ విల్లెజ్ వుమెన్ ని...  అంటూ  వారిని సాగనంపేస్తాను

మీ హాస్పిటల్ బిల్ల్స్ ఎవరు  పే చేస్తారు?  అంటూ అడుగుతారు...   ఇంకొకరు  

 మీకు పుణ్యం ఉంటుంది అదేదేదో మీరు" పే"  చేసేయండి . చాలా రోజుల నుండి టోటల్ హెల్త్  చెకప్ చేయించుకోవాలి అనుకుంటున్నా,, అంటూ .. వారిని పంపేస్తాను

"బెస్ట్ ఇన్స్యూరెన్స్ పాలసీ చేయమంటారా? .. అంటారు ఇంకొకరు

అబ్బే ! అవసరం లేదండి ..కోట్ల  రూపాయలు ఆస్తులు ఉన్నా..చాలా మందికి లాగానే  మాకు రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డ్ ఉందండీ ..  మాకు ఆ కార్డ్  ఉన్నదన్నమాట మీకు తెలిసినట్లులేదు.   మీతో నాకవసరం లేదండీ .. వెళ్లి రండి .. అంటూ మర్యాదగానే పంపిస్తాను .

డాలర్ రేట్ ఎక్కువైతే ఏమిటండి ? మా ట్రావెల్  పాక్ తీసుకోండి ..ఎంజాయ్ చేసి రండి హాట్ హాట్ బిల్స్ తర్వాత  మేమిస్తాం అంటాడు ట్రావెల్  హాట్ వాడు .

 ఇంత వరకు ప్రక్కనే ఉన్న పాపికొండలు చూడటానికే వెళ్ళలేదు .. మా రూపాయి అంత  ఎత్తు ఎగరలేదులే బాబు .. ఇంకో జంటని వెతుక్కొ.. అంటూ వాడిని బలవంతంగా డిలీట్ బాక్స్ లోకి  తోసేస్తాను

"వనజా .గెట్  మేరీడ్ అగైన్ ?" రెండవ పెళ్ళిళ్ళు చేసే ఓ  వివాహబంధ డాట్ కమ్ .. వాడు అడుగుతున్నాడు

ఒక్కసారి పెళ్ళి  చేసుకోవడానికే  చాలా  కష్టంగా మా అత్తారింటి వాళ్ళ మెడలు ఒంచేసా .. మళ్ళీ రెండో సారి పెళ్ళా ! మొన్నేగా  "స్వాతి వాళ్ళ అమ్మ"  పెళ్లి గురించి  "సారంగ " లో చెప్పించా.. ఆ కథ నేనే వ్రాసానని నీకు తెలియదా .. బుద్దిలేని వెధవ  .. రెండో పెళ్లి అంట రెండో పెళ్లి... అంటూ  తిడుతూనే..

 మా వారికి ఫోన్ చేసి "ఏమండీ! వీడెవడో నన్ను రెండవ  పెళ్లి చేసుకుంటావా ? అని అడుగుతున్నాడండి, ఏం  చెప్పమంటారు?" అని అడిగాను . అందుకు ఆయన ఇలా చెప్పేరు "నేనన్నా కొన  ప్రాణంతో  మిగిలివున్నాను వాడికి  బతుకు మీద ఆశ లేకపోతే యిప్పుడే చేసుకోమనవే! నేను వెంటనే విడాకులిచ్చేస్తా!" అని  ..

"ఇదిగో.. మా వారి మాటలు విన్నావా..? వెనక్కి తిరక్కుండా పరిగెత్తు" ...అంటూ వాడిని పంపించాను .

అమ్మయ్య ! ఇవాల్టికి  ఇక్కడ పిల్టర్  అయిపోయిందికాబట్టి  అవసరమయినవి చూసుకుందాం .. అని పనిలో మునిగిపోయాను

ఇంతలో లాండ్ లైన్ మ్రోగింది . అబ్బా.. ఇప్పుడు అక్కడి వెళ్ళాలంటే ఈ సిస్టం ముందు నుండి లేవాలి . లేచి వెళ్ళేటప్పటికి రింగ్ ఆగిపోతే కాల్  బాక్ చేయాలి .  ఎవరైనా సోది వేస్తారు వాళ్ళ బిల్ కాదుగా...  అనుకుంటూ మోకాలు నొప్పి కలుక్కు మంటున్నా .. గబా గబా వెళ్లి రిసీవర్ తీశాను . ఎవరో అపరిచితురాలు .

మేడమ్ .. కాంతి ఎంటర్ ప్రైజెస్  నుంచి కాల్ చేస్తున్నాం . మీ ఫోన్ నంబర్ లక్కీ నంబర్ గా  సెలెక్ట్ అయింది . నాలుగు చిమ్నీస్  ఉన్న   గ్యాస్ స్టవ్  600 రూపాయలకే ఇస్తున్నాం . మీ  ఇంటి అడ్రస్ ఇస్తే డోర్ డెలివరీ ఇస్తాం అడ్రెస్స్ చెప్పండి మేడం .. చాలా మర్యాదగా అడిగింది.

ఏమ్మా .. ఫోన్ నంబర్ ఇచ్చిన టెలీఫోన్  డైరక్టరీ ఇంటి నంబర్ ఇవ్వలేదా తల్లీ  అని మనసులో అనుకుని ..  వద్దమ్మా ! రెండు చిమ్నీలు ఉన్న స్టవ్ పైనే గిర గిర తిరిగి  గంట లోపలే వంట చేసి పడే స్తున్నా... నువ్వు నాలుగు పొయ్యిల స్టవ్ తెచ్చి పెడితే అరగంటలో వంట చేసి అక్కడ పడేసి .. ఫేస్ బుక్  లో కూర్చుంటా .. మా ఆయన తిట్లు నుండి కాస్త నన్ను బ్రతకనీ తల్లీ! అంటూ ఫోన్  పెట్టి పడేసాను .

మళ్ళీ ఇలా ఫేస్ బుక్ ముందు కూర్చున్నానా .. మొబైల్ రింగ్ అయింది . ఎవరిదో .. ఈ కొత్త నంబర్ !!??
అనుకుంటూ .. హలో .. అన్నాను.

"మేడమ్ .... ఈ మొబైల్ నంబర్  మీదేనా అండీ? " అడిగింది . "అవునండీ ..  తొమ్మిదేళ్ళ  నుండి అచ్చంగా నాదేనూ, మీకేమిటి సందేహం?"  అనడిగాను  .

మీరు చాలా లక్కీ మేడం ! .. హైదరాబాద్ భాగమతి పెరల్స్ వారు .. లక్కీ డీప్  తీస్తే మీ నంబర్ సెలక్ట్ అయింది . మా షాప్ వార్షి కోత్సవం  సందర్భంగా మీకు నలబై వేల రూపాయలు విలువ చేసే ముత్యాల హారం కేవలం 3,300 రూపాయలకే వస్తుంది . మీ అడ్రెస్స్ చెపితే మీకు వి.పి.పి లో పంపబడుతుంది మీరు ఆ డబ్బు కట్టి తీసుకొవచ్చు . అని చెప్పింది .

మా బంగారు తల్లే! మీ తెలంగాణా వారిది  ఎంత ఉదార హృదయం . నేను సీమాంధ్రా మనిషినని తెలియక నాకు బహుమానంగా   ముత్యాల హారం  ఇస్తున్నారు కానీ,  ముత్యాలు నా ఒంటికి సరిపడవు తల్లీ! మా జగ్గయ్యపేట రంగు రాళ్ళు చాలమ్మా   నాకు "  అంటూ ఫోన్ కట్ చేసాను .

నేను ఎంత మూర్ఖురాలినో కదండీ! ఎన్ని ఆఫర్లు .. ప్చ్ .. ఒక్కటన్నా ఉపయోగించుకోవడం రావడం లేదు అనుకుంటున్నాను .

మావారు అప్పుడప్పుడూ అంటూ ఉండేవారు .. "తింగరి బుచ్చి" అని

నిజమేనేమో.. అనుకుంటున్నారా ! ఇలాంటి వెధవ ట్రిక్  లకి పడిపోవడానికి .. నేనేమన్నా .."ఒట్టి  వనజ " అనుకుంటున్నారేమో .. హా.. నేను  బ్లాగర్ "వనజ వనమాలి " అని తెలియదు కాబోలు . :) :)

(రోజూ  అనేక రకాల మార్కెటింగ్ మాయాజాలం కి గురి కాకుండా, బలి కాకుండా   ఉండటం చాలా కష్టం సుమీ !అనుకుంటూ సరదాగా ఈ పోస్ట్ .. హాయిగా నవ్వేసుకోండి నచ్చితే నాలుగు అక్షింతలు వేయండి)
.


11, సెప్టెంబర్ 2013, బుధవారం

నాయనమ్మ చెప్పిన కథ



అది వర్షా కాలం . ధర్మం  కుంటి  నడక నడుస్తున్నా నెలకి నాలుగు వానలు కురిసే కాలం .

 కృష్ణానదీ గమనంలో రెండు పాయలుగా చీలిపోయి మధ్యలో ఉన్న దివిసీమ గ్రామాలు.
పడవ మీద యేరు దాటి అవతలకి వెళ్ళడమే తప్ప రవాణా సౌకర్యం అంతగా లేని ఆ ఊర్లకి ..  వేరే మార్గమే లేదు .

ఆ రోజు ప్రొద్దుట నుండి  తెర్లు  తెర్లుగా  కడుపులో నొప్పి వచ్చిన మాదిరిగా జల్లులు పడుతూనే ఉన్నాయి . యేరు ఉదృతంగా ప్రవహిస్తూనే ఉంది .. అయినా ఆ ఏటి తీరాన పుట్టి పెరిగిన వారికి ఏటి నడకలు తెలుసు కాబట్టి  అటునిటు రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు . నాలుగు పడవలు  అటుఇటు తిరుగుతూనే ఉన్నాయి .  వాన కురుస్తూనే ఉంది చీకటి పడుతుండగా .. యేరు దాటి ఆవలోడ్డుకి వెళ్ళిన పడవలు  రెండు తిరిగి రానేలేదు .
ఈవల ఉన్న రెండు పడవలు  ఇక అటువైపుకి వెళ్ళ నట్టే!

పడవ రాముడు  ఏటి ఒడ్డున ఉన్న పాకలో కూర్చుని తీరిగ్గా చుట్ట కాల్చుకుంటూ ఉన్నాడు . అంతలో అదరాబదరా.. పరిగెత్తుకుంటూ .. ఏటి ఒడ్డుకి వచ్చి నిలబడింది రంగమ్మ..  చేతిలో తాటాకు గొడుగు ఉంది .. ఆ గొడుగు క్రింద  పదేళ్ళ కొడుకుని తడవకుండా చూసుకుంటూ తానూ తడుస్తూ మనిషి అంతా ముద్ద ముద్దగా తడిసి పోయి  ఒంటికి చుట్టుకుపోయిన చీరతో నడక కష్టంగా సాగిస్తూ వచ్చింది .

ఆమెని చూసి ఇప్పుడు ఈ మనిషిని యేరు దాటించాలి కాబొలు.. ఒక్క మనిషి కోసం ఆవలోడ్డుకి ఏమి  వెళతాం ? ఎక్కడోచోట  చుట్టాలో, తెలిసిన వాళ్ళో ఉండి  ఉంటారులే ! పడవ  వెళ్ళదని  చెప్పేస్తే పొలా ? పెందరాడే  ఎక్కడో చోట .సర్దుకుంటాది ... అని మనసులో అనుకుని

ఇప్పుడు ఆ పక్కకి ఎల్లేదానికి కుదరదమ్మా.. ఇక రేపోద్దునే  పడవ  విప్పేది .కేకేసి  చెప్పాడు .

అయ్యో! అలా అంటే  ఎట్టాగయ్యా .. పిల్లగాడికి బాగోకపోతే ఆచార్యుల గారి దగ్గరకి తీసుకొచ్చా..  ఒళ్ళు మాడిపోతా ఉంది  ఇట్టా ఉన్న బిడ్డని పెట్టుకుని ఎవరింటికి పోతాను .. ? అదీగాక ఇంటి కాడ పాలు తాగే  పసి పిల్ల ఉంది . పాలు తీయాల్సిన గేదెలు ఉన్నాయి. ఇద్దరమే ఉన్నామని అనుకోకుండా కాస్త అటుప్రక్క దింపయ్యా ! బతిమలాడుకుంది

రంగమ్మ మాటలు విననట్టే..లేచి నిలబడి తుండు ముక్క దులుపుకుని తలకి చుట్టుకుంటూ ఊరివైపుకి  అడుగులు వేయసాగాడు . ఆడమనిషి అంతలా బతిమలాడుతుంటే అలా వెళ్ళిపోవడం న్యాయంగా ఉందా ! వచ్చే  సాలుకి ధాన్యం కొలిచేటప్పుడు నాలుగు మానికలు ఎక్కువ కొలిపిస్తాను ..కాదనకుండా  రాయ్యా .. నన్ను కాస్త దించి రా..
కావాలంటే  మా ఇంటికాడే అన్నం తిని గుడికాడ పడుకుందువు  గాని ..  అని బ్రతిమలాడింది.

అయినా రాముడు వినడంలేదు .. అప్పుడు రంగమ్మ ఒక మాట అంది . నువ్వు గనక నన్నుఅవతలోడ్డున దించితే .. నీకొక బహుమానం ఇస్తాను " అంది .

"ఏమిస్తావు" అడిగాడు వాడి మనసులో వంకర ఆలోచనలు

" మా ఆయనకీ కూడా చూపనిది నీకు చూపిస్తాను " అంది .

ఆ మాట వినగానే నడుస్తున్నవాడల్లా  గిరుక్కున వెనుదిరిగాడు . పడవ తాడు విప్పుతూ .." మాట తప్పకూడదు" అని హెచ్చరించాడు

 "ఇచ్చిన మాట తప్పను"  అంటూ ...  ఆమె మరో మారు మాట ఇచ్చింది

సన్నగా వర్షం కురుస్తూనే ఉంది . తాటాకు గొడుగు క్రింద పిల్లవాడు .. కురుస్తున్న జల్లులో తడుస్తున్న ఆమెని చూస్తూ .. రంగమ్మ ఇచ్చే బహుమతి ఏమై  ఉంటుందా.. అని  ఆలోచిస్తూ .. లభించబోయే బహుమానం కోసం   ఆత్రంగా  చూస్తున్నట్లు .. ఆవలోడ్డుకి  త్వరత్వరగా తీసుకువెళ్ళి .. పడవ ఆపాడు .

రంగమ్మ ముందు దిగి .. తర్వాత పిల్లవాడిని దించుకుని పదేళ్ళ పిల్లవాడిని చంకన వేసుకుని .. నడక సాగించింది .

ఆమె వెనుకనే .. రాముడు   నడవసాగాడు .. ఆమె వడి వడిగా అడుగులువేసుకుంటూ వెళ్ళిపోతుంది ...

నాకు ఇస్తానన్న బహుమానం ఇవ్వలేదు .అంటూ  దారికెదురుగా ...వెళ్లి అడ్డంగా నిల బడ్డాడు .

సరే ! చూపిస్తాను .. ఉండు అంటూ .. పిల్లవాడిని క్రిందకి దించింది  రంగడి ఎదురుగా నిలబడింది .  అప్పుడామే మొహం  మీద సన్నటి వెలుగు పడతా ఉంది ..  ఆ వెలుతురు లోనే .. ఆమె నుదుట ఉన్న కుంకుమ ని గట్టిగా తుడిచేసుకుంది .

రాముడు కి  ఆమె ఎందుకల్లా చేస్తుందో అర్ధం కాలేదు . ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు . .. నుదు టున ఉన్న కుంకుమంతా  శుభ్రంగా తుడి చేసుకున్నాక.. "ఇదిగి.. ఇది మా  ఆయన చూడకుండా ఉండేది ..నువ్వు చూసేది " అంది .

అమ్మ నీయమ్మ ! ఎంతటి జాణవే  నువ్వు !  అనుకుని ఉసూరుమంటూ ..వెనుదిరిగాదు రాముడు  .

అప్పటి కాలంలో నుదుట కుంకుమ లేని భార్యని భర్త చూడలేడు . ఎందుకని అంటే .అతను మరణిస్తే తప్ప ఆమె నుదుట కుంకుమ లేకుండా ఉండనే ఉండదు . రంగమ్మ అందుకే ..భర్త చూడనిది చూపిస్తాను అని అంత  నమ్మకంగా చెప్పింది .

నాకు ఈ కథ తలచుకున్నప్పుడల్లా తెగ నవ్వు వచ్చేస్తూ ఉంటుంది .

ఇలాంటి కథలెన్నో మా నాయానమ్మ నాకు చెప్పేది . ఆ కథలలో ఎక్కువగా.. మగవారి అవకాశవాదం ,ఆడవాళ్ళ సమయస్పూర్తి ,ఆపద వస్తుందనుకున్నప్పుడు .. ఆడవారు ఎలా తమని తాము కాపాడుకునేవారో ,చాకచక్యంతో పనులు చేయించుకునే వారో ..లాంటి విశేషాలు ఉండేవి .

ఏదో ఒక సామెత ఉంది కదా ! యేరు దాటేదాక పడవ  మల్లాయ్ ! ఏరు దాటాక ఓటి  మల్లాయ్ (కరక్టేనా ?}  అనడం  ఇలాంటిదే అనుకుంటాను .

ఇక ..కొన్ని విషయాలలో .. నేనెలా ఉంటానంటే .. చెపుతాను

నాయనమ్మ చెప్పే కథలలో ,... సాంప్రదాయం, కొన్ని మూడాచారాలు ఉండేవి  . ఇప్పుడు కాలం లో చూస్తే భర్త భార్య నుదుటున కుంకుమ కాకపోయినా స్టిక్కర్ బిళ్ళ అయినా చూస్తున్నాడా? అని అనిపిస్తూ ఉంటుంది  బొట్టు లేకుండానే .. పతి  దేవుడు ముందు ..నేను తిరిగేస్తూ ఉండేదాన్ని ఒకోసారి గాజులు, ఆభరణాలు కూడా బరువే! వాటికి వ్యతిరేకం అని కాదు . ఎందుకో నిరాసక్తత .

 ఏ పార్టీలకో, శుభ కార్యాలకో,గుడికో వెళ్ళేటప్పుడు తప్ప ఇంట్లో ఉండే  మహిళలు కళ్ళకు కాటుక పెట్టుకుని ... నుదుటున కుంకుమ పెట్టుకుని,  మట్టిగాజులతో, తలలో పువ్వులతో కళ  కళ  లాడుతూ తిరుగుతూ ఉన్నారంటే నిజంగా గ్రేటే ..కదా!

అలాంటి వారందరికీ మహిళలకి వందనం .

నిజం చెప్పొద్దూ ..నేను అలా ఉండను .. నన్ను చూస్తే ఏ కొత్త మతం పుచ్చుకున్నానో అనుకునే ప్రమాదం ఉంది కూడా!  బొట్టు, అలంకారాలు మనసుకి నచ్చితే చేసుకోవాలి, బలవంతంగా కాదని నేను అనుకుంటాను. ఖచ్చితంగా చెప్పాలంటే మనసుకి నచ్చి నట్టు చేస్తాను .

ఒక మనిషి మరణిస్తే అలంకారాలన్నింటిని  బలవంతంగా త్యజించాలి అనుకునే దానికి నేను పూర్తీ వ్యతిరేకం. మా తాత గారు మరణిస్తే  మా..నానమ్మని  నిండుగా అలంకరింపజేసి ..నలుగురిలొ కూర్చోబెడుతుంటే రోజు అభ్యంతరం చెప్పేవాళ్ళం. పద్నాలుగో రోజు .. ఏవేవో చెయబొతుంటే  చేయనీయకుండా బలవంతంగా అడ్డుకున్నాం కూడా.

ప్రతి నిత్యం ముగ్గులు పెట్టుకుంటాం . దీపం పెడతాము  కొన్ని సంప్ర దాయాలు తప్పనిసరిగా పాటిస్తాం.
కానీ ఏదీ బలవంతంగా ఆచరించం .

( ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ .. అలాంటి పాటలు మీకు ఇష్టం ఉండవా ? అలాంటి పాటలు గురించి చెప్పరు   అని  ఒక  ఫ్రెండ్ అడిగారు .. అప్పుడు ఈ కథ .. గుర్తుకొచ్చింది).

10, సెప్టెంబర్ 2013, మంగళవారం

నకిలీ

ఈ మధ్య సోషల్ నెట్వర్క్స్ లో  మనుషులని విభజించే వారు ఎక్కువ అయ్యారు .  వాళ్ళ సమూహాల్లోకి వేరొకరిని రానివ్వకుండా అంటరానితనం తో వెలివేసుకుని తాము మాత్రమే  గొప్ప అనుకుని డబ్బాలు కొట్టుకోవడం, వాళ్ళని వాళ్ళే పోగుడుకోవడం, పొగడడానికి నలుగురిని ప్రత్యేకంగా నియమించుకోవడం చూసాను .

కులం , మతం , జాతి, వర్ణం .. ఇవే కావాలి వీళ్ళకు. ఆ దృష్టితోనే   విమర్శ పేరుతొ చీల్చి చెండాడుతారు. అజ్నాతలగా ఉండి తామే  విజ్ఞాన సర్వస్వం  అన్నట్టు .. అజ్ఞాత కామెంట్లు, ఫేక్ ఐ డి లు .. ఛీ చీ...

మనుషులుగా పుట్టినందుకు ,కాస్త అక్షరం ముక్కలు నేర్చుకున్నందుకైనా  హుందాగా మెలిగితే బావుండును.

జీవన నేపధ్యాల పట్ల ఆసక్తి తగ్గించుకుని .. చుటూ పేక్ ల వల వేయకుండా ప్రతి విషయం  పట్ల  "అసలు  - నకలీ" అనుమానాలకి తావివ్వకుండా  ఉంటే  బావుంటుంది  అనుకుంటున్నాను .



మూలాలని కాదు  వెతకాల్సింది .. వ్యక్తిత్వ నిర్మాణాలని చూడండి ...

                                                                                     -  ఫీలింగ్స్  విత్ ..పైట్  ఫర్  రైట్





6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

మంజీరమైనాను నీ పాటలో..





"మంజీరమైనాను నీ పాటలో, మందారమైనాను..నీ తోటలో.." చరణం వినిపిస్తుంది
మగత నిద్రలో మరో లోకంలో సంచరిస్తున్న మాధవ్ .. ఉలికిపడి మేలుకున్నాడు. ఎక్కడనుండో వినవస్తున్న పాటని వినడానికి హృదయం రిక్కించి మరీ వెతుక్కుంటున్నాడు. పాట అయిపోయింది కానీ యెక్కడ నుండి పాట విన వస్తుందో తెలియ రాలేదు.
ఇంటి చుట్టూ వెలిసిన భవన సముదాయాలలో నుండి ఆ పాట విన వచ్చిందని అర్ధమయింది. అర్ధరాత్రి సమయం కాబట్టి ఆ పాట వినే వారి ఆచూకి కనుక్కోవడం చాలా కష్టమని తెలుసు . తల త్రిప్పి ప్రక్కనే నిద్రిస్తున్న భార్యని చూసాడు. పగలంతా పనులతో అలసిపోయి వుందేమో ఆదమరచి నిద్ర పోతున్న ఆమెకేసి చూస్తే వాత్సల్యం.. కల్గింది . ప్రేమగా ఆమె తలపై చేయి వేసి మృదువుగా నిమిరాడు . ఆ సున్నితమైన స్పర్శకే ఆమె కదిలింది,నిద్రలోనే మాధవ్ చేతిని తీసుకుని చెంపకి భుజానికి మధ్య ఆనించుకుని మాధవ్ పడుకున్న వైపుకి తిరిగి పడుకుంది.స్పర్శ యిచ్చిన నిశ్చింత, ప్రేమ యిచ్చిన భద్రత ప్రపంచంలో యేది కూడా యివ్వలేదేమో, తన చేయి విడవకుండా పట్టుకున్న ఆమెనే చూస్తూ పడుకుని ఆ గదిలోనుండి బయటకి రాలేని మాధవ్ మదిలో కొద్ది సేపటి క్రింద విన్న పాటే మెదులుతుంది .
ఒక మది గాయం గేయమై ఆవేదనతో.. ఆలపించే వేళ..
ఆ "వేదన " వినడం కూడా మధురమైన వేదనే.
ఒకోసారి తనది కాని వేదన కూడా తనదిగా అనుభవిస్తూ వుంటాడతను;అదొక ఆనందం. .
ఆ పాట విని విని ఆ పాటకి వీరాభిభిమాని అయిన మాధవ్ ఆ పాట విన్న ప్రతి సారి గాడమైన వేదనని రోజుల తరబడి అనుభవిస్తూ అందులో లీనమైపోతాడు. ఒక రకమైన మౌనం ఆవహించి యెవరు పలకరించినా అయోమయమైన స్థితిలో సమాధానాలు యిస్తూ వుండటం జరుగుతుంటుంది .
అవన్నీ గుర్తించే సునిశిత దృష్టి , తీరిక కూడా లేని సత్య మాధవ్ మౌనానికి కారణం ఆర్ధిక యిబ్బందులు వల్ల కాబోలు పాపం యెప్పుడూ ఆయన అలా ఆలోచిస్తూ వుంటారనుకుంటుంది .
తనలో వేదనని తానూ తప్ప మరొకరికి పంచడం యిష్టం లేని మాధవ్ కొంత నిర్లిప్తతతో వుంటాడన్నమాటే కానీ, తన భాద్యతని యే మాత్రం మర్చిపోడు, అసలు నిర్లక్ష్యం చేయడు. భార్యని, పిల్లలని అపురూపంగా చూసుకుంటూనే వుంటాడు . కళ్ళు మూసుకుని తన గురించి తానే విశ్లేషించుకుంటున్న మాధవ్ కనుల నుండి ఒక కన్నీటి చుక్క బయటకి వద్దామా వద్దా అన్నట్టు ఆగిపోయింది .
అంతలోనే మళ్ళీ అంతకుముందు  విన్న పాటని  గాలి అలలతో మోసుకొస్తుంది.ఈ పాటని యెవరో తనకిలాగానే యిష్టపడేవారైతేనే పదే పదే రీ ప్లే చేసుకుని వింటారనుకోగానే చప్పున మంచం పై నుండి లేచి కూర్చున్నాడు. భార్య నుండి చేయి విడిపించుకుని కిటికీ వద్దకి వచ్చి నిలబడ్డాడు . దోమతెరలు అమర్చి వుండటం వల్ల కిటికీ తలుపులు తెరిచే వున్నాయి కిటికిలో నుండి బయటకి చూసాడు. తమ యింటి ఖాళీ స్థలానికి  ఆన్చి కట్టబడిన అయిదంతస్తుల భవనంలో నుండి ఆ పాట వినబడుతుందని గుర్తించాడు . అలాగే ఆ పాట వింటూ నిలబడి పోయాడు.
మౌన స్వరాల యీ  పంజరాన కలిసాను కడలేని స్వప్నాలలో,విధినటనాలలో, ఋతుపవనాలలో యెన్నాళ్ళు యీ వేదన  యెన్నాళ్ళు యీ వేదనా ..?
మాధవ్ తనని తానూ ప్రశించుకున్నట్టు వుంది.
ఇది నా జీవితాలాపన.. ప్రియ దేవాతాన్వేషణ ... యేమైనదో, యెట దాగున్నదో, యెన్నాళ్ళు యీ  వేదన యెన్నాళ్ళు యీ  వేదన ?
తనని తానూ ప్రశ్నించుకుంటూ.. మది గాయాలుగా మధు గేయాలుగా మార్చుకుంటూనే వున్నాను కదా  ఈ పాటలో లాగానే అనుకున్నాడు. అంతలోనే పాట ఆగిపోయింది
అతని మనసులో పీఠం వేసుకుని వున్న రాధ కళ్ళలోకి ప్రాకింది. ఆమె గురించిన జ్ఞాపకాలు వెంటాడుతుండగా .. మంద్రంగా మువ్వల చప్పుడు అతని చెవులని తాకింది . ఆ చప్పుడు కాళ్ళకి ధరించే మువ్వల పట్టీల సవ్వడి .. మాధవ్ బాషలో చెప్పాలంటే మంజీర నాదం . కానీ అతనికి వినవచ్చే చప్పుడు నడుస్తున్నప్పుడు వినిపించే శభ్డం తాలూకూ లా అనిపించలేదు ఎవరో.. మువ్వల పట్టీని చేత పట్టుకుని పైకి ఎగురవేస్తూ క్రింద చేతులలో అందుకుంటూ ఆ రవళులని యెంతో  యిష్టంగా వింటున్నట్లు అనిపించింది . అలా చాలా సేపు వినబడుతూనే వున్నాయి.ఆ రవళులు వినపడెంత వరకు వుండి తర్వాత వచ్చి మంచంపై పడుకున్నాడు.
"ఏమిటండీ, నిద్ర రావడం లేదా, చైతూ చదువు గురించేనా ఆలోచిస్తున్నారు? ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది . మీరు ఆలోచిస్తే మాత్రం వాడికి బాగా చదువు వస్తుందా యేమిటీ వచ్చి పడుకోండి.  ఆ కళ్ళ క్రింద చారలు చూడండి మీ ఆలోచనలకి గుర్తుగా యెలా పెరుగుతున్నాయో అంటూ కోప్పడింది సత్య.
ఏమి మాట్లాడకుండా కనులు మూసుకున్న అతనిని చూస్తూ " ఎంత అందమైన కనుదోయి యీ  కళ్ళే కదూ పెళ్ళి చూపులలో తన కళ్ళతో కలసి తనకి గాలం వేసింది " అనుకుంది సత్య. అమ్మాయి పుడితే బావుండును  మీ పోలిక వస్తే భరత నాట్యం నేర్పించవచ్చు, హావభావాలు బాగా పలుకుతాయి " అనేది . అలాంటి కళ్ళలో యేదో నిరాశ తారట్లాడుతూ వుందని ఆమె యెన్నడూ గుర్తించలేదు కూడా.
కనులైతే మూసుకున్నాడు కాని మాధవ్ మనసు మెలుకువగా వుంది. ఆ మెలుకువలో  వో ఇరవయ్యి యేళ్ల జ్ఞాపకం దాగుంది .
రాధ అందమైన అమ్మాయి అనేకంటే చాలా చురుకైన అమ్మాయి. నాజూకు తనం కన్నా మెత్తని స్వభావ౦లో కనబడేవి. ఏదో తెలియని ఆకర్షణ. ఆమె వైపు లాగేస్తూ వుండేది. పరిచయస్తుల అమ్మాయి. తను సిమెంట్ ప్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ అదే వూర్లో వుంటున్న అన్నయ్య వాళ్ళింట్లో వుండేవాడు. డ్యూటీ లేనప్పుడు పగలు పడుకుని నిద్ర పోతూ వుంటే తన నిద్రని చెడగొడుతూ  వరండాలో కూర్చుని సందడి సందడి చేస్తున్న వారిని మందలించాలని కోపంగా వెళ్ళిన మాధవ్ ఆమెని చూసి టక్కున ఆగిపోయాడు.
ఇదిగో, మాధవ్ నేను యెప్పుడూ నీతో చెపుతూనే వుంటానే "రాధ" అని  ఆ అమ్మాయే యీ అమ్మాయి అంటూ పరిచయం చేసింది . ఒకసారి ఆమె వైపు చూసి లోపలికి వచ్చేసాడు . ఆమెకి వదినతో సహవాసం. ఎప్పుడూ పాటలు పాడుకుంటూ వుండేది, యెన్నెన్నో పాటలు పెదవులపైనే ఉండేవి.  ఎప్పుడైనా యింటికి వస్తే మాధవ్ తో మాట్లాడితే ఆ మాటల్లో పాటల ప్రస్తావనే యెక్కువగా వుండేది. పాటంటే ఆమెకి అంత యిష్టం . తనతో ఎప్పుడూ దెబ్బలాడుతూ వుండేది, అనాలనుకున్న మాట టక్కున అనేసి వెళ్ళిపోయేది . అమ్మో.. ఈ అమ్మాయితో జాగ్రత్తగా వుండాలి. కాస్త యెక్కువ తక్కువ అయినా కూడా యిబ్బందే అనుకుంటూ నవ్వుకుంటూ వుండేవాడు. వదిన ప్రసవించడానికి వెళ్ళినప్పుడు కూడా బిడియం లేకుండా ఆమె తమ యింటికి వస్తూనే వుండేది . అప్పుడప్పుడూ అనిపించేది .. తనని చూసే ఆ చూపులు, తన కళ్ళతో కళ్ళు కలసి నప్పుడు కనబడే వెలుగులు , తను నవ్వితే కలిగే సిగ్గుదొంతరలు అన్నీ తన కోసమే అన్నట్లు వుండేవి అనుకునే వాడు మాధవ్ .
ఆరు నెలల తర్వాత వదిన పుట్టింటి నుండి బాబునెత్తుకుని వచ్చింది . బాబుని పెంచడంలో సాయం చేస్తున్నట్లు , బాబుని ముద్దు చేస్తూ రాధ యెక్కువగా తమ యింట్లోనే ఉండేది . రాధను చూస్తుంటే మాధవ్ కి చాలా యిష్టంగా వుండేది తన మనసులో మాటని చెప్పాలనుకుంటే చుట్టుప్రక్కల యెప్పుడూ యెవరో వొకరు వుండటం వల్ల వీలయ్యేది కాదు అలా ఆర్నెల్లు గడచిపోయాయి బాబుకి ఆర్నెల్లు వచ్చాయి . అన్న ప్రాసన కొండ మీద వున్న లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో చేయాలనుకున్నారు . అక్కడికి రాధ వస్తుందని మాధవ్ కి తెలుసు . తన ప్రేమ ప్రకటించడానికి అదే అనువైన సమయనుకున్నాడు .
అతని మనసులో అందమైన దృశ్యం మెదలాడుతూ ఉంది . తమకి యే  మాత్రం పరిచయం లేని మనుషుల మధ్య .. యెదురుగా కృష్ణా నది.. నదిలో నుండి గుడికి వెళ్ళే మెట్లు  ఆ మెట్లపై నడుస్తూ  యెవరూ లేకుండా చూసి రాధ ని తను ప్రేమిస్తున్న సంగతి చెప్పేయాలని రిహార్సల్స్ వేసుకుంటూ వున్నాడు...
అతను అనుకున్నట్లుగానే  రాధ అక్కడికి వచ్చింది. ఒంటరిగా దొరికే సమయం కోసం యెదురు చూస్తూ వున్నాడు . అన్నప్రాసన కార్యక్రమం ముగిసేదాకా వోపికగా వేచి చూసాడు. అందరూ భోజనాలకి కూర్చోగానే రాధ ప్రక్కకి వెళ్లి .." అలా కాసేపు నది వైపు వెదదాము  రాకూడదూ " అన్నాడు . "మొహం చూడు మొహం, వెళదాం రాకూడదు అని దీర్గం తీయకపోతే వెళదాం అని అడగవచ్చుగా, అందుకు కూడా దైర్యం లేని మాధవా,  రాధతో  నీకేల  యీ బాధలు " అని వెక్కిరిస్తూనే ."నీకు పిలవడానికి భయం కాని నాకు రావడానికి యే౦ భయం వస్తాను పద ..." అంటూ చెప్పి .. "అక్కా నది దాకా వెళ్ళొచ్చి భోజనం చేస్తాను. మీరందరూ భోజనం చేసేయండి అంటూ  చెప్పేసి వచ్చేసింది .
ఇద్దరూ కలసి మెట్లు దిగుతూ నది వైపుకి వచ్చారు . కొన్నాళ క్రితం అక్కడ జరిగిన సినిమా షూటింగ్ గురించి ముచ్చటించుకుంటూ నీళ్ళతో ఆడుకుంటూ కాసేపు కాలం గడిపారు . అక్కడి నుండి చూస్తే గుడి గోపురం కనబడుతూ ఉంది ..
ఆ దృశ్యం చూపుతూ బాగుంది కదూ  అడిగాడు . తలూపి ఇంకా  అని అడిగింది రాధ . మాధవ్ మనసు ఆమెకి తెలుసు . "అంతకన్నా మన ప్రేమ కూడా బావుంటుంది . నువ్వు సంతకం చేస్తే అని చెప్పాడు . "అబ్బ.. ఆశ, నీ మొహం చూడు, ప్రేమ కాదు యేమి కాదు . మా యింట్లో తెలిస్తే నన్ను నిన్ను యిద్దరినీ కాళ్ళు విరక్కొడతారు " అని బెదిరించింది . అది కాదు రాధా అంటూ వివరించి చెప్పబోయాడు" ఏం కాదు" అని కొట్టి పారేసింది . అతని మోహంలో నిరాశ . ఆమెకది ఆట. మాధవ్ కి యిప్పుడప్పుడే అంగీకారం చెప్పకూడదు . కొన్నాళ్ళు వుడికించాలి అనుకుంది. ఆ మాటలు లోలోపల దాచేసుకుని ..
ఓస్ .. ఈ విషయం చెప్పదానికేనా యిక్కడి దాకా రమ్మన్నావ్, అక్కడే అడిగితే చెప్పెసేదానిని కదా, అనవసరంగా యింత దూరం నడిపించావు. అంటూ గుడి వైపు వెళ్ళడానికి దారి తీసింది .
రాధ వెనుకనే మాధవ్. సగం మెట్లెక్కి వచ్చాక వెనుదిరిగి చూసింది . రాధ వైపే చూస్తూ .. మెట్ల వంక చూసుకోకుండా పడిపోబోతున్న మాధవ్ ని గబా గబా మెట్లు దిగి పట్టుకోబోయింది . మాధవ్ పడకుండా నిలద్రోక్కుకుని ఆమెని చూసి నవ్వేసాడు . "నేను పడిపోతే నీకెందుకు ?" అన్నాడతను . నువ్వు యెప్పుడో పడ్డావని నాకు తెలుసులే ! చెప్పింది . ఇప్పుడే పెళ్లి చేసేసుకుందామా.. అడిగాడు "వద్దొద్దు " అలాంటి వన్నీ యిప్పుడే ఆలొచించకు. నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు ప్లీజ్ " అంది. ఇక్కడ కొంచెం సేపు కూర్చుందామా ? అడిగాడు . ఇక్కడ వద్దు ఎవరైనా చూస్తే మా నాన్నతో చెపితే ప్రమాదం .. పద అక్కడ కూర్చుందాం అని దూరంగా కనబడే  బండ వైపు చూపించింది .
ఇద్దరూ యేమి మాట్లాడుకోకుండానే రక రకాల ఆలోచనలతో నడుస్తూ అక్కడికి చేరుకున్నారు. మాధవ్ మనసులో యేదో తెలియని గుబులు. కులం,ఆస్తి ,హోదాలలో యిద్దరికీ చాలా తారతమ్యం ఉంది . పైగా అప్పటికే రాధకి పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తున్నారు . ఆ పరిస్థితులలో రాధ ఒప్పుకుంటుందా? ఆని ఆలోచిస్తున్నాడు మాధవ్ .
రాధ కూడా యేమి మాట్లాడటం లేదు గుడి దగ్గర నుండి చాలా దూరంగా వచ్చేసారు అక్కడ నది ఒడ్డున ఉన్న బండ పైకి చేరుకున్నారు ఇద్దరూ .
రాధా ! ఒకసారి నదిలోకి వెళదాం రా.. అన్నాడు మాధవ్. ప్రశ్నార్ధకంగా చూసింది . ఆమె చూపులని పట్టించుకోకుండా  ఆమె చేయి పట్టుకుని నీళ్ళ వద్దకి తీసుకు వెళ్లి  ఆమెని వొడ్డునే వున్న వొక చిన్న బండపై నిలబెట్టాడు . తానూ యే౦  జేసినా సరే కదలకుండా అలా నిలబడే వుండాలని  ఆజ్ఞాపించాడు . రాధ మాధవ్ వంక అనుమానంగా చూసింది . మాధవ్ మాత్రం నీటి వద్దకి వెళ్లి దోసిలి తో నీళ్ళని తెచ్చి బండపై నిలబడిన ఆమె పాదాల పై పొసాడు . అయ్యో ! ఇదేంటి మాధవ్, నా కాళ్ళు కడుగుతున్నావ్, యిలా చేయడం యేమీ బాగోలేదసలు,  మీరు మగవాళ్ళు అలా చేయవచ్చా  అని అడుగుతూ వెనుకకి అడుగులు వేసింది . ఆమెని మాట్లాడవద్దని పెదాలపై చూపుడు వేలుంచి సంజ్ఞతో వారించి అలా మూడు సార్లు దోసిలితో నీళ్ళు తెచ్చి ఆమె పాదాలని అభిషేకించాడు . " ఆ కృష్ణమ్మ నీళ్ళతో ఈ రాధమ్మ కి అభిషేకం చేయమని ఈ మాధవ్ కి .ఆ లక్ష్మి నరసింహుడే ఆజ్ఞాపించాడు . నేను కాదు ఈ పని చేసింది అంటూ........
ఫాంట్ జేబులో నుండి రుమాలు తీసి రాధ సుకుమారమైన లేత తమలపాకుల ల్లాంటి పాదాలని తుడిచాడు . ఆతను ఆ పనులు చేస్తున్నంత సేపు ఆమె అభ్యంతరం చెపుతూనే ఉంది . ఆ తర్వాత్ మాధవ్ షర్ట్ పాకెట్ లో నుండి ఒక పొట్లం తీసి గులాబీ రంగు కాగితం విప్పాడు. అందులోనుండి ఒక వస్తువుని తీసి రాధ కళ్ళ ముందు వూపాడు . సన్నగా మృదువుగా మ్రోగుతున్న కాలి గజ్జెల వైపు ఆశ్చర్యంగా చూసింది . " ఇవి ముత్యాల ముగ్గు పట్టీలు అంట. షాపతను చెప్పాడు . ఈ పట్టీలు నీ కోసం తెచ్చాను కాదనకూడదు రాధా .. ప్లీజ్ " మాధవ్ అభ్యర్ధన కి ఆమె కరిగిపోయింది . చిన్నగా నవ్వింది .
మాధవ్ రాధ ప్రక్కనే కూర్చుని ఆమె పాదాలని ఒడిలోకి తీసుకుని ఇంత అందమైన పాదాలకి గజ్జెలు లేక యెంత  బోసిగా వుంటాయో తెలుసా! చురుకుగా కదిలే నీ పాదాలు చూసినప్పుడల్లా నాకు లోలోపల యేదో తెలియని అలజడి . అది మనసు పొరలలో నుండి తెరలు తెరలుగా ..ఈ నది అలలుగా వినబడుతూ వుంటుంది .. ఇప్పుడు ఈ మువ్వల సవ్వడితో నువ్వు నడుస్తూ వుంటే  మంద్రంగా ప్రవహించే ఈ కృష్ణమ్మ పరవళ్ళు త్రోక్కుతున్నట్లు వుంటుంది. నా ప్రేమకి గుర్తుగా యెప్పుడూ నువ్వు వీటిని ధరించే వుండాలి, సరేనా ? .
రాధ యేమి మాట్లాడలేదు.  అమ్మ యెప్పుడు కాళ్ళకి పట్టీలు  పెట్టుకోమన్నా యిష్టం లేదని తిరస్కరించేది . ఇప్పుడు కొత్తగా యీ  పట్టీలు పెట్టుకుంటే అమ్మకి అనుమానం రాదూ, తన ఫ్రెండ్ వద్దన్నా వినకుండా బలవంతంగా పెట్టిందని అబద్దం చెప్పాలి కాబోలని ఆలోచిస్తూ వుంది .
రాధ చేయి పట్టుకుని లేవదీసి ఇక వెళ్ళిపోదాం పద . మన గురించి గుడిలో వాళ్ళందరూ యెదురు చూస్తారు అని చెప్పాడు .
రాధ కట్టుకున్న పట్టు పరికిణీ కొంచెం పైకి పట్టుకుని గుడి మెట్లెక్కుతూ  తన కాళ్ళకి మాధవ్ పెట్టిన పట్టీల నుండి వినబడుతున్న శబ్దానికి వింతగా చూసుకుంటూ వుంటే
మాధవ్ మనసు నిండా వింత అనుభూతులు .. ప్రియురాలి అందెల సడిలో హృదయ లయలు వుంటాయన్నట్టు .. అతనికి యె౦తో యిష్టమైన మరో పాట లోలా
ఈ చరణ కమలాలు యె౦త  మృదులం నా హృదయంలో యివి యెoతో పదిలం. జీవితాంతం తనతో కలిసి నడిచే యీ పాదాలని,మనిషిని మనసుని పదిలంగా చూసుకోవాలి  అనుకున్నాడు .
ఇది జరిగిన వారం రోజుల లోపలే రాధకి పెళ్లి నిశ్చయం అయిపోయింది . ఇంట్లో వారికి యెదురు సమాధానం చెప్పే దైర్యం, మాధవ్ గురించి చెప్పి యింట్లో వాళ్ళని వొప్పించే విధం తెలియక .. పెదవి విప్పకుండానే, పదం పాడ కుండానే పధం కదపకుండానే, మాధవ్ కి మళ్ళీ కనబడకుండానే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది రాధ.
మాధవ్ మనసులో యె౦తో వేదన, యెవరికీ చెప్పని వేదన . అతని వదిన అన్నీ గ్రహించి రెండు మూడు సార్లు అడిగింది మాధవ్ యేమిటి అలా వుంటున్నావ్ అని .
ఏం లేదు ..బాగానే వున్నానే అని అతని సమాధానం
రాధ పెళ్ళయ్యాక భర్త తో కలసి మాధవ్ ఇంటికి వచ్చింది . అతి మాములుగా వారిని పలకరిస్తూనే ఆమె పాదాల వైపు చూసాడు . అక్కడ తను ఆమెకి కానుకగా యిచ్చిన మువ్వల పట్టీలు వుండాల్సిన చోటున పాదాలు బోసిగా దర్శనమిచ్చాయి .
అతని మనసు అంతులేని వేదనకి గురైంది . ఇంకెప్పుడూ యెవరిని ప్రేమించకూడదు. ఇదే మొదటి ప్రేమ ఆఖరి ప్రేమ అనుకున్నాడు. అనుకున్నంత తేలికగా రాధను మర్చిపోలేక అక్కడి నుండి ట్రాన్సఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు . కానీ యెప్పుడూ యెవరైనా కాళ్ళకి పెట్టుకున్న పట్టీల  నుండి మువ్వల శబ్దం విన్నప్పుడుల్లా గంభీరంగా మారిపోయేవాడు. ఈ చిరు మువ్వల సందడితో నా మదిలోకి నడచి రావాల్సిన రాధ వేరొకరి జీవితంలోకి వెళ్ళి పోయి తన మనసుని శూన్యం చేసింది ...నేను నా ప్రియ దేవతని యెక్కడని అన్వేషించను వేరొకరి జీవితంలోకి వొదిగిపోయిన రాధని అలజడికి గురి చేసి నా ప్రేమని వ్యక్తపరచడం కన్నా యీ  వేదన భరించడమే సరియింది . నా ప్రేమని నేనాలపించడమే మంచిది .అది నా జీవితాలాపనగా తిష్ట వేసుకున్నా సరే అనుకుంటూ .. అలరించే సినిమా పాటలలోని భావానికి తన జీవిత సత్యాలని జతచేర్చుకుని వేదనలో మునిగిపోతూ వున్నాడు . ఆ వేదనెంత  తీయనో  కాని అనుభవిస్తే తెలియదు అనుకుంటాడు. ఇలా జ్ఞాపాకాలను గుర్తు చేసుకుంటూ ..
తానూ యిష్టపడే యీ  పాటంటే రాధకి మాత్రమే తెలుసు, అంటే యీ  పాట వింటున్నది రాధ కాదు కదా  అని అనుమాన పడ్డాడు .
రేపుదయం లేవగానే ఆ ప్లాట్ లోకి యెవరొచ్చారో గమనించాలి అనుకున్నాడు .
తెల్లవారింది . ప్లాట్లలో వున్న వొక్కొక్కరు బయటకి వస్తున్నారు. అందరిని గమనిస్తూ వున్నాడు. ఎవరూ రాధలా వున్న వ్యక్తీ అతనికి కనబడలేదు, నిరాశ ముంచుకొచ్చింది.నీరసంగా ఆఫీసుకి వెళ్ళిపోయాడు . సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చి మొక్కలకి నీళ్ళు పోసుకుంటూ ప్రక్కనే వెలిసిన భవన సముదాయం వైపు చూస్తూనే వున్నాడు . రాధ లాగానే వున్న అమ్మాయిని వెనుక కూర్చోబెట్టుకుని టూ వీలరు పై ఇరవై యేళ్ళనాడు వున్న చురుకుదనంతోనే రోడ్డుపై దూసుకు వెళుతున్న "రాధ" ని చూసాడు . మాధవ్ కి చాలా సంతోషం, ఇంకాసేపటికే రెండు సంచీలతో నిండుగా సామాను తీసుకుని లోపలి వెళుతున్న రాధ ని  చూసాడు . తను నడుపుతున్న బండిని కంట్రోల్ చేస్తూ ఒక కాలు క్రిందకి పెట్టినప్పుడు వూపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి ఆమె కాలి వైపే చూసాడు . అప్పుడూ  బోసిగానే కనపడింది ఆమె పాదం .
"ఈ ఆడవాళ్ళు రాతి బండలు, మగవారి హృదయాలతో ఆడుకుంటారు క్షణంలో ప్రేమించిన వారిని మర్చిపోయి యింకొకరితో జీవితం గడిపేస్తారు ." అంటూ వుండే ఫ్రెండ్ శేఖర్ చెప్పే మాటలు గుర్తు తెచ్చుకుంటూ . నిజమేనేమో! అనుకుంటూ లోపలి నడిచాడు. మనిషి జీవితంలో అనేకానేక సమస్యలు యెలాగో వుంటూనే వుంటాయి . చాలా విషయాలకి బండబారిపోతూనే వుంటాము . జీవితంలో చిన్న చిన్న అనుభూతులు, మధురమైన జ్ఞాపకాలు తో కాస్త ఆనందంగా వుండటంలో తప్పేమీ వుంటుందో "రాధ" కనీసం అలా కూడా నన్ను గుర్తు పెట్టుకోలేదేమో, నేను చాలా దురదృష్ట వంతుడిని.. అనుకున్నాడు మాధవ్ .
చాలా సేపు రాధ గురించి ఆలోచిస్తూ .. ఎవరికైనా మదిలో దాగిన రహస్యాలు అనేకం ఉంటాయి. అవన్నీ జీవిత భాగస్వామ్యికి తెలిస్తే వారికి అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారు. అవన్నీ తెలియడం అనవసరమనిపించింది కాబట్టే సత్యకి యెప్పుడూ రాధ గురించి చెప్పనే లేదు. లేకుంటే ఆమె ముందు మరొక రకంగా సానుభూతి పొందాల్సి వచ్చేదేమో  అని కూడా అనుకున్నాడు
ఆ రోజు రాత్రి పొద్దు పోయాక పై ప్లాట్ లో నుండి అదే పాట వినబడుతూ ఉంది . చాలా అసహనంగా ఫీలయ్యాడు మాధవ్. అశాంతితో కదలసాగాడు.
మరుసటి రోజు ఆఫీసుకి వెళుతూ వాచ్ మెన్ భార్య పార్కింగ్ ప్లేస్ లో నుండి బండి తీస్తున్న రాధ ని పలకరిస్తూ .. "అమ్మగారు .. మీరు కాళ్ళ గొలుసు వేసుకోలేదు యెందుకని, అలా వేసుకోకుండా వుండకూడదమ్మా,  వేసుకోకపోతే మగవాళ్ళ కాళ్ళకి ఆడవాళ్ళ కాళ్ళకి తేడా లేదంటారు అని అనడం వినబడింది . ఆ మాటలకి రాధ చిన్నగా నవ్వేసింది.
"మమ్మీకి కాళ్ళ పట్టీలు పెట్టుకోవడం యిష్టం వుండదు ఒకే ఒకసారి వొక ఫ్రెండ్ గిఫ్ట్ యిస్తే పెట్టుకుందట . అదే రోజు .. ఒక కాలి పట్టీ జారిపోయిందట . ఇక అంతే,  అమ్మ యెప్పుడూ  మువ్వల పట్టీలు  పెట్టుకొనే లేదు. మా డాడీ కూడా నువ్వన్నట్టే అంటారు కాని అమ్మ వినదు. పైగా అప్పుడు తన ఫ్రెండ్ యిచ్చిన గిఫ్ట్ ని సెంటిమెంటల్ పూల్ లా యిప్పటికి భద్రంగా దాచుకుంది .. ప్రాణంలా చూసుకుంటుంది " అని చెప్పింది నవ్వుతూ రాధ కూతురు.
ఆ మాటలు వింటున్న మాధవ్ కి  చాలా సంతోషం. తననిప్పుడు చూస్తే రాధ యెలా ఫీల్ అవుతుందో, అసలు తన యిల్లు యిక్కడే అని ఆమెకి తెలుసా? వాళ్ళిక్కడికి  వచ్చి యెన్నాళ్ళయ్యిందో! వాచ్మెన్ భార్య మాటలు చూస్తుంటే వాళ్ళు ఈ ప్లాట్ లో వుండటం మొదలెట్టి చాన్నాళ్ళు అవుతున్నట్లుగా వుంది.
 అతని అంతరంగం ఒక మాట చెప్పింది "ఒరేయ్ బుద్దూ ! పట్టీలు బహుమతిగా యిచ్చిన అబ్బాయిని యే  అమ్మాయైనా  జీవితంలో మర్చిపోతుందా!!. (అరె బుద్దూ,  పాయల్ దియా ఉస్ లడకే కో జిందగీ మే ఓ కభి బూల్ నహీ సక్తి ) మాధవ్ పెదవులపై పై దరహాసం తళుక్కుమంది.
‘’ఘల్లు ఘల్లన కాలి మువ్వలు
ఝల్లుమన నా జన్మంతా
వెల్లువై వచ్చావు ప్రేయసీ
వెన్నెలై వచ్చావు ప్రేయసీ’’
అడవి బాపిరాజు “అతిథి” గేయం చప్పున గుర్తొచ్చి మధుర జ్ఞాపకానికి జీవమై పెదవులపై గేయమై ప్రాణం పోసుకుంది.
అతని హృదయం కనబడని ఆ మంజీరనాదాన్ని శ్రావ్యంగా వింటుంది.
ఆ రోజు రాత్రి పొద్దుపోయాక అతనికిష్టమైన పాట వినబడుతూనే వుంది.
"మంజీరమైనాను నీ పాటలో..
మందారమైనాను..నీ తోటలో...
వేదనలోనే ఆనందాన్ని అనుభవిస్తూనే వున్నాడు మాధవ్.





3, సెప్టెంబర్ 2013, మంగళవారం

లాస్ట్ మెసేజ్

 ప్రముఖ X చానల్ అధిపతి దశరథ్ దుర్మరణం. నగర పొలిమేరల్లో మితిమీరిన వేగంతో కారు నడుపుతూ అదుపు తప్పి డివైడర్ ని  ఢీ  కొట్టి పల్టీలు  కొట్టిన కారు. డ్రైవ్ చేస్తున్న దశరధ్ అక్కడికక్కడే దుర్మరణం. ఎక్స్ క్లూజివ్ Y వార్తలు చూస్తూ వులికిపడి ఫోన్  అందుకుంది ధాన్యమాలి   అప్పుడే ఆమె  పోన్ మ్రోగడం మొదలయ్యింది. లిఫ్ట్ చేసింది, అవతలి వైపు నుండి ఛానల్ సిబ్బంది .. "సారీ మేడమ్. సర్ కారుకి యాక్సిడెంట్.   ఆయన నో మోర్ " చెప్పాడు

అదే సమయానికి కొద్దిగా ముందు  చేతిలో ఉన్న ఫోన్ లో  ఆమె కోసం ఒక మెసేజ్ కాచుకు కూర్చుని వుంది. అది ఓపెన్ చేసి చదువుకుని అతని మరణవార్త విన్నప్పటి కన్నా యెక్కువ షాక్ అయింది. పది రోజులపాటు దశరథ్ మరణ వార్త ప్రసారం చేసి చేసి సొంత చానల్ కి కూడా విసుగు కల్గింది.ఊదర గొట్టే వార్తల మధ్య దశరధ్ ని అందరూ మర్చిపోయారు. రాజకీయనాయకుడు  చనిపోతే సానుభూతి ఓట్లకోసం బై ఎలక్షన్ లో అతని భార్యకి సీట్ దక్కినట్లు దశరథ్ మరణించగానే అతని భార్య "ధా న్యమాలి" కి చానల్  పగ్గాలు చేతిలోకి వచ్చాయి 

తెల్ల చీర కట్టుకుని,పొడవాటి జుట్టుని  రబ్బర్ బాండ్ తో బంధించి నెమ్మదిగిగా నడుచుకుంటూ వచ్చి భర్త సీట్లో కూర్చుంది ఆమె. ఒక గంట కూర్చుని సిబ్బంది సానుభూతి వాక్యాలు,నమస్కారాలు భరించి యింటికి వచ్చేసింది . సాయంత్రం ఆమె చిన్ననాటి స్నేహితురాలు   సుధ ఆమెని పరామర్శించడానికి వచ్చింది ఆప్పుడామె శోక  దేవతలా వుంది. కొన్ని పొడి పొడి మాటల తర్వాత ఆమెని ధాన్యమాలి అడిగింది

"సుధా! నీ భర్త చనిపోయి యేడెనిమిది యేళ్ళు అయింది కదా ! అతని మరణాన్ని యెలా భరించావ్? ఇప్పటికీ  బిడ్డని పెట్టుకుని వొంటరిగానే బ్రతుకుతున్నావ్? నీకెలాంటి యిబ్బందులు కలగలేదా ? అడిగింది

"ఆర్దికంగా చాలా ఇబ్బందులు,అందుకోసం వుద్యోగం చేయక తప్పదు. రకరకాల మనుషులు వారి వింత ప్రవృత్తులు. వాటిని భరిస్తూనే బ్రతుకుతున్నాను. తప్పదు కదా, ఇదిగో.. దీని కోసం " అంటూ యెనిమిదేళ్ళ పాపని వొడిలోకి తీసుకుంది.

"ఇవన్నీ సరే, నీకెప్పుడు తోడూ కావాలని అనిపించలేదా ? "అడిగింది ఆరాగా.

"అనిపించినా  అన్నీ అణిచేసుకుని బ్రతికేయాలి ఆడ బ్రతుకు కదా ! తప్పదు "అంది ఆమె కొంచెం విచారంతో

"అణచి వేసుకోవడం అంటే " అడిగింది.

భర్త చనిపోయి పది రోజులు కూడా కాలేదు, ఇవేం ప్రశ్నలు అనుకుంటూనే  "మగవాడు బరి తెగించి తిరిగినట్లు ఆడవాళ్ళు తిరగడం అంత సులభంకాదు. పద్దతికాదు.  అంత కన్నా తాడు బొంగరం లేనివాడినయినా, ఏమి తెలియని అమాయకుడి నయినా కట్టుకోమని చెపుతారు . స్వాతిముత్యం సినిమాలో చెప్పినట్లు" అంది.

మౌనంగా వింది ధాన్యమాలి.

"ఏమిటో  నీ జీవితం యిలా అయిపోయింది కోట్లయితే వున్నాయి కాని మనిషి మాత్రం లేడు  కదా ! పిల్లలున్నా బావుండేది. వాళ్ళని చూసుకుంటూ బ్రతికేదానివి" సానుభూతి చూపింది. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కాసేపు౦డి  వెళ్ళిపోయింది

"భర్త వుండి  కూడా  నేను యిన్నేళ్ళు విధవరాలిగానే బ్రతికాను సుధా ." అని  అరచి చెప్పాలనుకుంది. కానీ చెప్పలేకపోయింది. దశరథ్ మరణానికి తనే కారణమయ్యిందేమో! తన బరితెగించినతనమా ..లేక ధిక్కార స్వరమా?

ఇంతకు  క్రితం సుధ చెప్పినట్లు ఆడవాళ్ళు  అండర్ టోన్ లో తమ ఇబ్బందులని చెప్పుకుని నిట్టూర్చేవారు, పరిస్థితులకి అనుగుణంగా  రాజీ పడేవారు. తనలా తెంపరితనం చూపినవాళ్ళు తక్కువేమో ! ఓదార్చడానికి వస్తున్న  వాళ్ళని తప్పించుకుని గదిలోకి వెళ్ళిపోయింది.  మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసుకుని దశరథ్ పంపిన లాస్ట్ మెసేజ్ ని చూసుకుంది. పశ్చాతాపమో లేక అంత  కన్నా ఏమి చేయలేని నిస్సహాయతో ఆమె దుఃఖ భారంలో మునిగిపోయి పది రోజుల వెనక్కి వెళ్ళి ఆ రోజు యే౦ జరిగిందో గుర్తు చేసుకుంది

*************************************

 తన చేతిలో ఉన్న  STD మెడికల్ రిపోర్ట్ ని పట్టుకుని అచేతనంగా వుండిపోయింది ధాన్యమాలి

మళ్ళీ ఒకసారి లాబ్ సూపర్ వైజర్ ని పిలిచి " ఈ రిపోర్ట్ నేను పంపిన  వ్యక్తి అదే ఆతను "శ్రీధర్ " వేకదా! ఏవిధమైన పొరబాటు  జరగలేదు కదా?  "అడిగింది అనుమానంగా
" అలాంటిది  జరిగే  అవకాశమే లేదు మేడం,ఖచ్చితంగా  మీరు పంపినతని  శాంపిల్స్ యొక్క  రిపోర్ట్ ఇదే ".. నిర్ధారణ చేస్తూ . చెప్పాడు .

తల వూపి "సరే ..మీరు వెళ్ళవచ్చు" అని చెప్పింది.

బోర్లించిన కడవ లాంటి పొట్టతో ఎప్పుడూ తెల్లని బట్టలలో ఫ్రెష్ గా కనిపించే భర్త హటాత్తుగా బరువు తగ్గడం తరచూ జ్వరం రావడం లాంటి  లక్షణాలు గమనించి తనతో పాటు హాస్పిటల్ కి తీసుకు వచ్చి STD టెస్ట్ చేయించుకోమని చెప్పింది. నేనింత  పబ్లిక్ గా ఆ టెస్ట్ చేయించుకుంటే నా పరువేం  కాను కుదరదంటే కుదరదు అన్నాడతను. అయితే నేనే టెస్ట్ లకి  కావాల్సిన శాంపిల్స్  అన్నీ తీస్తాను అంటూ తనే స్వయంగా తీసుకుని  "శ్రీధర్  " అనే మారు పేరుతొ ఆ శాంపిల్స్ ని లాబ్ కి  పరీక్షల కోసం  పంపించింది

తన పనులన్నీ అయ్యాక రూం కి వచ్చి చూస్తే "శ్రీధర్ " పేరుతో వచ్చిన టెస్ట్ రిపోర్ట్స్ ఎదురుగా  టేబుల్ పై పెట్టి ఉన్నాయి. తెరిచి చూస్తే షాక్ కొట్టినట్లు అయింది. ఇన్నాళ్ళు యేదో పోగొట్టుకున్నాననుకుంది కానీ  తను యె౦త రక్షించబడ్డానో నన్న సంగతి అర్ధమై మనసులో కనబడని దేవుడికి దణ్ణాలు పెట్టుకుంది

కాసేపటి తర్వాత కాల్ చేసి " దశరథ్.. ఎక్కడ ఉన్నారు? అడిగింది. "ఏమిటి సంగతి ఒక మీటింగ్ లో వున్నాను ఎనీ అర్జంట్ ? "అడిగాడతను

" మీ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి.  అర్జంట్ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే రండి . కానీ ఈ రోజు మాత్రం తప్పకుండా మీరు యింటికి రావాలి "చెప్పింది

"సరే ! నేను యే సంగతి కాల్ చేస్తాను"  అంటూ కాల్ కట్ చేసాడు అతను.ఎంత ధీమా అసలు ఆ టెస్ట్ ల రిజల్ట్  యేమిటో తెలుసుకునే  ఆసక్తిలేదతనికి  అనుకుంటూ ఆ రాత్రి యింటికి వస్తే అతనితో యెలా మాట్లాడి విషయం చెపితే బాగుంటుందో అని ఆలోచిస్తూ వుండి  పోయింది.

కొన్నాళ్ళ క్రితం యిదే  కార్పోరేట్ హాస్పిటల్ లో  అనేక సార్లు తను మాత్రం  దొంగ పేర్లుతో యిలా  టెస్ట్ లు చేయించుకోలేదు అని అనుకుని నేను టెస్ట్ చేయించుకోవడం అనేది యితరులకి తనపై నమ్మకం కల్గించడానికి అలాగే యితరుల నుండి మెడికల్ రిపోర్ట్స్ కంపల్సరీ  అని  షరతు  విధించింది  ముందు ముందు తనకి యెలాంటి ఆరోగ్యపరమైన  యిబ్బంది కలగ కూడదనే వుద్దేశ్యం తోనూ చేసినవి కదా,   మనం తాగే నీరు, తినే ఆహారం, మన పరిసరాలు యెలా అయితే పరిశుభ్రంగా వుండాలని కోరుకుంటామో అలాగే శారీరక సంబంధం యేర్పరచుకునే వ్యక్తి కూడా యెలాంటి ఇన్ఫెక్షన్స్ ని కలిగి వుండలేదని తీర్మానించుకోవాలి  కదా !  ఇతరుల నుండి మనం యేమి ఆశిస్తున్నామో యితరులకి కూడా మన నుండి అలాంటి హామీ యిచ్చితీరాలనుకునే నిబద్దత కల్గిన వ్యక్తి గా వుండాలని  అనుకోవడంలో తప్పేమీ వుంది ?  అలా ఆలోచిస్తూనే  "ఆ మాత్రం నిబద్దత లేకపోతే  యెలా ?" స్వగతంలో అనుకోబోయి పైకే అనేసింది

"నన్నా మేడం  యేదో అంటున్నారు"  అని అడిగింది జూనియర్ .

"ఆహా,  లేదు లేదు నిన్ను కాదు జనరల్గా అంటున్నాను" అంది

ఆమె యే౦ మాట్లాడుతుందో, యె౦దుకు మాట్లాడుతుందో అర్ధం కాక విచిత్రంగా ఆమె వైపు  చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది జూనియర్

మళ్ళీ ఆమె ఆలోచనలు  ఆగిపోయిన నిబద్దత దగ్గర మొదలయ్యాయి నైతికత - అనైతికత మధ్య మనకి కనబడేది ఒకే ఒక  అక్షరం తేడానే!  ఆచరణ లో మాత్రం యెంత కష్టం ? ఈ ప్రపంచం మొత్తం డబ్బు,సెక్స్  అధికారం అనే మూడింటి చుట్టూనే తిరుగుతుంటుంది. ఎవరి అవసరం యేమిటో, యెంతో మరొకరికి  తెలియనట్లు నైతికత అనైతికత అనే అర్ధాలు కూడా మనఃప్రవర్తులును బట్టి మారి పోతుంటాయి.  ఎవరి నడవడికకి వారే జవాబుదారీ అయినప్పుడు మనం వేరొకరిని  యెలా జడ్జ్ చేయగలం ? ఖచ్చితంగా ఈ పాయింట్ దగ్గర నుండే దశరధ్ తో మాట్లాడటం మొదలెట్టాలనుకుంది.  వీలైనంత  బలంగా అతని బలహీనత పై దెబ్బ కొట్టాలని వువ్విళ్ళూ రుతుంది ఆమె.

తమ యేడడుగుల బంధం మొదలైన యేడేళ్ళ నుండి యెన్ని అనుభవాలు!!   సళ సళ  కాగే యెసరులో పడేసిన బియ్యంలా పగిలి తుక తుక వుడుకుతున్నాయి  మనసుకి తగిన గాయాలు పచ్చి వాసన వేస్తూ చేదైన  జ్ఞాపకాలని గుర్తు చేస్తున్నాయి   వద్దు వద్దు అనుకుంటూనే గుర్తు చేసుకునే ఆగత్యం పట్టినందుకు విసుక్కుంటూనే  బయటికి వచ్చి కారు నడుపుకుంటూ యింటి దారి  పట్టింది.

శిశిరం రాకుండానే అర్ధంతరంగా రాలే ముదురుటాకుల్లా  రాలి  గాలివాటుకు కొట్టుకుపోతే బాగుండును  ఈ  జ్ఞాపకాలు మనసుని బాధ పెట్టకుండా అని అనుకుంటుంది.   కానీ మళ్ళీ  వద్దనుకున్న ఆజ్ఞాపకాల బురదలోనే కూరుకుపోతుంటుంది.

రవీంద్రభారతి వేదికగా తను తన విధ్యార్ధులతో చేయిస్తున్న  నృత్య ప్రదర్శన సందర్భంగా  కవరేజ్ కోసం వచ్చిన  ధశరధ్ తో   తన పరిచయం వొక గమ్మతైన విషయం.  ఒక జర్నలిస్ట్ గా  పరిచయం అయిన  అతనితో ప్రేమలో పడటం విచిత్రమే. పరిచయమైన వొక నెలరోజులకే యిల్లు విడిచి  వెళ్ళిపోయి అతనిని పెళ్ళాడటం మరొక  విచిత్రమే!

తను డాన్స్  టీచర్ గాను,  అతను జర్నలిస్ట్ లాగా పని చేసుకుంటూ వొక  సంవత్సరం ఆనందంగానే గడిపారు
దశరథ్  మనసులో యెప్పుడూ  మేడలు, కోట్లు  గురించి ఆలోచనే.  డబ్బు యిలా సంపాదించవచ్చో అన్న మెలుకువలు బాగా వంట బట్టించుకుని అడ్డదారులు త్రొక్కినప్పుడల్లా అతనితో  తీవ్రంగా వ్యతిరేకించేది.

"ఇప్పుడు వ్యతిరేకించిన నువ్వే ఆ డబ్బుకి హారతులు పట్టే రోజు వస్తుంది చూడు " అంటూ శపధాలు చేసేవాడు. రకరకాల వ్యాపారాలు చేసేవాడు. అందులో అమ్మాయిలని  యెరగా  వేసి  కాంట్రాక్టర్ లకి  బిల్లులు చేయించడం అనేది మంచి నీళ్ళ  ప్రాయం అనే  పేరు గడించాడు.  అవినీతి నాయకులకి  కొమ్ముకాస్తూ వారికి  విశ్వసనీయమైన వ్యక్తిగా  నమ్మకం సంపాదించాడు.

క్రమేపి అతను ఆమెకి దూరం అయ్యాడనే కంటే  ఆమె అతనికి దూరం జరగసాగింది ఆమె దూరం జరిగినప్పుడల్లా  దశరధ్ మాత్రం ఆమెని యెద్దేవా చేసేవాడు.  "నువ్వెప్పుడూ  పనికి మాలిన నీతికబుర్లు చెపుతావ్ !
గడ్డి వామి దగ్గర కుక్క లాంటి దానివి, నువ్వు తినవు యెదుటి వారిని తిననివ్వవు అని." శూలాల్లా గుచ్చుకునే ఆమాటలకి ధాన్యమాలికి కన్నీళ్లు ముంచుకొస్తాయి, అయినా వాటిని  కసిగా దాచేసుకుని  లోపలంతా తడిసి ముద్దయిపోయేది.

ప్రతినెలా  జీతం అందుకున్నవెంటనే  వో రెండు వేల రూపాయలైనా సరే పదులు, ఇరవైలు నోటులుగా  మార్చి   పట్టణానికి దూరంగా విసిరి పారేసినట్లున్న మురికి వాడలకి వెళ్లి  అందరికి పంచి వారి నవ్వులని భుజానకున్న సంచీలో వేసుకుని  ఆనందంగా యింటికి వచ్చి అమ్మ-నాన్నలకి తన జీతం యింతే అని అబద్దం  చెప్పినటువంటి సంఘటనలు చెపితే యింతగానో మెచ్చుకుని, నీలాంటి అమ్మాయే భార్యగా  నాక్కావాలి అని కోరుకున్న దశరథ్ యేనా యితనన్న అనుమానం కల్గేది.    

కొన్నాళ్ళకి ఆమె యిష్టంగా సాగించుకునే డాన్స్ స్కూల్ కూడా  వెళ్ళ వద్దని తీర్మానించేసాడు,  దానితో  ఆమె కృంగి పోయింది   జీవితంలో వరుసగా యేమి కోల్పోతుందో అర్ధం అవసాగింది భర్త చేతిలో కీలుబొమ్మగా మార్చబడుతుంది స్వేచ్చని కోల్పోతుందని అర్ధమయిపోయినప్పుడైనా మేల్కోని   తన అర్భకత్వం పై జాలి పడుతుంది. ఒక మనిషి హాయిగా నవ్వడం చూస్తే తను యె౦దుకలా నవ్వలేకపోతుందో అర్ధం కాని స్థితి నుండి బయట పడలేకపోతుంది  బహుశా  ఒకేఒక మనిషి  తన జీవిత సర్వస్వం అనుకోవడం మూలంగా వచ్చిన పరిస్థితి అది, ప్రతి ఆడపిల్ల అలాగే జీవిస్తుందేమో నేను అలాగే వున్నాననుకుని  సర్ది చెప్పుకోవడం అలవాటు చేసుకుంది.  అది కొన్నాళ్ళే !
బాహ్య  స్వేచ్చని నిరోధించగలరేమో  కానీ  అంతర్ స్వేచ్చన్ని అణచి వేయడం సాధ్యం కాని పని కనుక   మనసు పరి పరి విధాలుగా తలపోస్తుంది.  ఆలోచన వాటిని నియంత్రించ లేకపోతే మనిషి యె౦తకైనా తెగిస్తాడ౦ట .
తన  విషయంలో యిప్పుడు అదే జరుగుతుంది .

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త  సాన్నిహిత్యం దక్కని  ఆమెలో సంతోషం క్రమంగా మాయమవడం మొదలెట్టింది. రోజులు, వారాలు, నెలలు ఆతను ప్రక్కన లేకుండానే గడిచిపుతున్నాయి అతని కోసం యెదురు చూసిన రోజులు అతను వచ్చాక యిందుకేనా  యితను రావాలని కోరుకున్నాను వద్దు గాక వద్దు అనుకున్న బరువైన క్షణాలు  ఆమె జీవితంలో  వో భాగమైపోయాయి.   ఎప్పుడూ  మనసంతా యిసుర్రాయిలో పడి  నలిగే గింజలా నలిగి పోయేది

పిడికెడంత ప్రేమ కావాలి, అది తప్ప యింకేది వద్దనిపిస్తుంది   అదే మాట దశరధ్ తో అంటే ఎంత సేపు  ప్రేమ ప్రేమ అంటావు !? ఏం  చేసుకుంటావు యీ పనికి రాని  ప్రేమ ని.  ప్రేమ యేమన్నా డబ్బుని సృష్టించగలదా ! డబ్బుతో వచ్చే సుఖాలు కంటే ప్రేమ గొప్పదా ?   అందరూ నువ్వు అనుకున్నట్లు అణాకాణీ  ఖర్చు లేని ప్రేమని ప్రకటిస్తూ భార్య  యెదురుగా ముప్పొద్దులు కూర్చుంటే  అది  మాత్రమే  గొప్ప ప్రేమ అని నిరూపించు కున్నట్లా  !?  అని లాజిక్ గా మాట్లాడే అతనితో పోట్లాడి కూడా నెగ్గలేనని అర్ధం అయింది

 మొదట్లో మనసుకి సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నం చేసేది, తర్వాత  సెగలు రగిలే శరీరాన్ని  జోకొట్టడానికి ప్రయత్నం చేసింది  శరీరానికి సర్ది చెప్పడం మనసుని సర్ది పెట్టుకున్నంత తేలిక కాదని తెలుస్తుంది . ఎక్కడో చదివిన గుర్తు "మనసు పిలుపు కన్నా శరీరం పిలుపు బలంగా ఉంటుందని"  అదే నిజమవుతుంది . ఆమెలో శరీర కాంక్షలు మేల్కొన్నప్పుడల్లా దశరథ్ కోసం యెదురు చూపులు చూసేది కళ్ళు యెర్రబడేవి.  ఆ యెర్రబడ్డ కళ్ళలోనే సూర్యుడు పుట్టుకొచ్చేవాడు  నిన్నటి రోజున పుడమితో  పొద్దస్థమాను రమించినా మళ్ళీ  తీరని కోరికలా ..

చిన్న వ్యాపారాలు చేసే దశరధ్ ఒక రాజకీయ ప్రముఖుడి అండతో ఒక చానల్ కి అధిపతిగా మారాడు    అతనికి వార్తలు సృష్టించడం తెలుసు వాటిని క్యాష్ చేసుకోవడం తెలుసు.  డబ్బు వెదజల్లి , వుద్యోగ అవసరం కనిపెట్టి అనేకానేక అమ్మాయిలతో సరదాలు తీర్చుకోవడం తెలుసు. తాత్కాలిక  మత్తు నిచ్చే ఖరీదైన మద్యాలు ,  ఎంత  మంది అమ్మాయిలని మార్చినా  సంతృప్తి పడని  మృగ వాంఛలు,  నిద్రపోనివ్వని అనవసర కాలక్షేపాలు  మగత నిద్రలో కరిగే  అనేకానేక రాత్రులు కలగాపులగమయి దశరథ్ కి యిల్లుని  కాని యిల్లాలిని కాని క్షణం పట్టించుకునే తీరిక లేకుండా చేసాయి

డబ్బు డబ్బుని సృష్టించడానికి యెక్కువ కష్టపాడాల్సిన అవసరం లేకుండానే పొలాలు,తోటలు,ప్లాటుల రూపంలో, బంగారం రూపంలో పేర్చబడుతున్నాయి. అయ్యో ! ఈ అవినీతి డబ్బు నా కంటికి కనబడదే ? కాల్చి బూడిద చేయాలి.   ఈ ధనం, కార్లు, బంగళాలు, నగలు,  క్రెడిట్ కార్డులు  యేవి వద్దు నాకు. నాకు ప్రేమ కావాలి, ఆ ప్రేమతో నా శరీర వాంఛని  మేల్కొలపాలి.  భూమిని  నిట్టనిలువుగా  తాకే వుదృతమైన జడివానలాంటి తాకిడితో   అతని శరీరాన్ని తాపి  తన అణువణువుని ఉద్దీపనం చేయాలి లాంటి తలపులతో, మోహంతో   వొక విధమైన  మైకంతో బ్రతికింది .  అలా  కోర్కెతో కాలిపోయేటప్పుడే  తను  యెప్పుడో వొకప్పుడు   సిగ్గు విడిచి  భర్త దరి చేరినా    ఆతను మాత్రం భార్యకి చేరువ కాలేని స్థితిలో మత్తులో మునిగిపోయేవాడు.  ఆమె అణువణువులో అసంతృప్తి సెగలు.

డబ్బుతో పాటు వచ్చి చేరుతున్న అనేకానేక కొత్త పరిచయాలు. నిత్యం  యేదో వొక  పార్టీకో ,ఫంక్షన్ కో వెళ్ళాల్సి రావడం,  వున్న అందానికి  యె౦తో  కొంత మెరుగులు దిద్దుకోవడానికి పార్లర్ కి అలవాటు పడటం, స్పా కి వెళ్లి శరీరాన్ని  అప్పగించి గంటలు గంటలు మసాజ్ లతో  కాలక్షేపం చేయడం, అందంగా అలంకరింప జేసుకుని నాజూకైన మునివేళ్ళతో అతి నాజూకుగా వుండి పదే పదే  జారిపోయే పైటని పట్టుకుని గంటల తరబడి వుండాల్సి రావడం. పైటని నాజ్జూగా   పట్టుకున్నట్లు కొన్ని పరిచయాలని  అలాగే  పట్టుకుని  తర్వాత వదిలేయడం,   అతి ఖరీదైన మనుషుల మధ్యలో అత్యంత నాటకీయంగా నవ్వులు పులుముకుని  మెలగడం విసుగ్గా తోచేది   అదే సమస్తం  అనుకుని బ్రతకడాన్ని  అలవాటు చేసుకోవడం కూడా కష్టమనిపించింది

హఠాత్తుగా డబ్బు పుట్టుకొచ్చిందని  పుట్టుకలో లేని దర్పం,ఠీవి కూడా పుట్టుకొస్తాయని అనుకోవడం భ్రమ అని తెలుసుకోవడానికి యెక్కువ కాలం పట్టలేదు ఆమెకి. భర్త గురించి తమ దాంపత్య జీవితం గురించి చూచాయగా తెలిసిన కొందరు  జలగల్లా అంటుకోవాలని  చూసారు.  డబ్బున్న వాళ్ళ పట్ల  తనలో పెరిగిన ఉన్న విముఖత వల్లనేమో వారికి చేరువ కాలేక పోయింది  కొన్ని అనుభవాల తర్వాత  పంక్షన్లకి, పార్టీలకి దూరం అయి పోయింది. తనకి తానే  ఒంటరి తనం అనే శిక్ష విధించుకుంది

అప్పుడప్పుడూ భర్త తో విపరీతంగా పోట్లాడేది.  ఆమె  పోట్లాడినప్పుడల్లా  ఆమెని శిక్షించదానికన్నట్లుగా ఒక నెల రోజుల పాటు యింటి వైపు కూడా తొంగి చూసేవాడు కాదు.  ఏ మలేషియా నో, సింగపూరో ఆడ స్టాపు నంతా వేసుకెళ్ళి   వారి మధ్య వుల్లాసంగా గడిపి వచ్చేవాడు   పెళ్ళయి రెండేళ్ళు అతనితో కాపురం చేసినా తన కడుపు పండలేదు. వాళ్ళని చూసుకుంటూ బ్రతికే దాన్ని అనుకునేది . తనకి "ధాన్యమాలి " అని పేరెందుకు పెట్టారో కాని ఆ పేరు సార్ధకమయినట్లు వుంది. ఈ వొంటిస్తంబపు మేడలో వొంటరిగా  జీవిస్తూ నిండు యవ్వనం మ్రగ్గిపోతూ సంతాన భాగ్యంకినోచుకొక విలపించే ధాన్యమాలి  గుర్తుకువచ్చింది.  ఆమెలా తను  అలమటించాల్సిందేనా ? జీవితం యిలా తగలబడాల్సిందేనా ?   తనలో ఎడతెరిపిలేని ఆలోచనలు

"మిసెస్ దశరథ్ కి యేదో లోపం ఉందట,  పిల్లలు పుట్టే  అవకాశం లేదని తెలిసాక  అతని భార్య ఆ డిప్రెషన్  తో అతనినసలు పట్టించుకోదట, అందుకే దశరధ్  అలా తిరుగుతూ వుంటాడు అని మన హై  క్లాస్స్ లేడీస్ చెప్పుకుంటున్నారు  అవునా ! అది నిజమేనా ? " అని  ధాన్యమాలితో సన్నిహితంగా ఉండే సృజన  అడిగినప్పుడు దుఖం వువ్వెత్తున ముంచుకు  వచ్చింది. నేను గొడ్రాలిని కాదు కాదు . నా భర్త నపుంసకత్వమే అందుకు  కారణం అని దిగంతాలు వినబడేలా అరచి చెప్పాలనిపించేది.

అదే మాట అతనితో చెపితే వాళ్ళన్నది నిజమే కదా! నా బెడ్ ఫెర్పోర్మేన్స్ యేమిటో నీకు తెలియనిదా !? నేనంటే   పడి  చచ్చిపోయే యంగ్ గాళ్స్ నడుగు,. నేను యెలా  సుఖ పెడతానో, సుఖ పడతానో చెపుతారు అని పచ్చిగా చెపితే తన లోని ఆడతనమే సిగ్గుపడింది. తన పై తనకే సందేహం వచ్చింది నాలో ఆడతనం లేదా!? నేను అతనికి యే  మాత్రం సుఖాన్ని యివ్వలేకపోతుందా ? అని ఆలోచించడం యెక్కువ చేసింది

దొంగ తిరుగుళ్ళు తిరిగే ప్రతి మగవాడు భార్య  ఆడతనం పై   నిందలు మోపేవాడే! తనని అర్ధం చేసుకోవడం లేదని కుంటి  సాకులు చెప్పేవాడే !  కోర్కెల వరద లో మునిగిపోయినప్పుడల్లా పుట్టలో పాముల్లా బయటికి వచ్చి జర జర ప్రాక్కుంటూ పోయి  యెక్కడో వొక చోట లుంగలు చుట్టుకుంటారు  వాళ్ళ  కొవ్వేక్కిన వొంటికి, కంటికి కనబడేది ఆడది అయితే చాలు అంతే  అనుకుంది కసిగా.
ఒకోసారి అసలు  అతనితో కలిసెందుకు  వుండాలి !? విడాకులు తీసుకుంటే జీవితమంతా తిని కూర్చునే అంత ధనం  లభిస్తుంది. తర్వాత తను మళ్ళీ పెళ్ళి  చేసుకోవచ్చు అననుకునేది,  మళ్ళీ అంతలోనే .. ఛీ చీ.. పెళ్లి చేసుకోవడమంత  బుద్ధి  తక్కువ పని యింకొకటి లేదు. అవసరం అయితే సహజీవనం అయినా  చెయ్యొచ్చు కాని  . ప్రతి చేతకాని వెధవకి  భార్య అనగానే   యెక్కడ లేని అధికారం, అర్ధం లేని అహంకారం  గుర్తుకొస్తాయి  అవలీలగా వాటిని భార్య పై ప్రదర్శిస్తాడు. అనుకుంది

 మళ్ళీ అంతలోనే మరొక విధంగా ఆలోచనలు చేసేది.  అయినా నేను దశరథ్ కి విడాకులు యిస్తే సంఘంలో  హోదా కోసమయినా యింకో  పెళ్లి చేసుకుంటాడు, అతని డబ్బు ,హోదా చూసి యెవరో  ఒక అందగత్తె అతనికి దగ్గరవుతుంది అయినాక కదా  అతనిలో అసినం లేదని తెలిసేది, అర్ధం అయ్యేది , మళ్ళీ యింకో ఆడదాన్ని    ఈ వొంటి స్థంబపు మేడలోకి   రానివ్వకూడదు, ఆ యవ్వనాన్నీ మగతోడు   లేకుండా రగిలిపోనివ్వ కూడదు అనుకుంది. మళ్ళీ అంతలోనే యింకొకామె  వస్తే  మాత్రం  తనలా మడికట్టుక్కు కూర్చుంటుందని నమ్మకమేమిటి ? మనసు వుండాలే కాని అనేక మార్గాలు అనుకుంది ..ఇలాంటి  పిచ్చి పిచ్చి ఆలోచనల మధ్య గడిపే ఆమె  కాలక్షేపం కోసమో  లేక  తనని తానూ మర్చిపోవడం కోసమో  భర్త సూచించినట్లు  హాస్పిటాలిటి మేనేజ్మెంట్ కోర్స్ లో జాయిన్ అయి ..ఓ  రెండేళ్ళు నేర్చుకోవడం లోనే శ్రద్ద చూపింది. ఆ రెండేళ్లలో ఒక కార్పోరేట్ ఆసుపత్రి నే నెలకొల్పాడు దశరథ్. ఆ హస్పిటల్  ని మేనేజ్ చేయడం కోసమే తనని  ఆ కోర్స్ చదవమన్నాడని అర్ధమైంది.

పనిలో పడి  తనలో రగిలే  అసంతృప్తి జ్వాలలు ఆరిపోతాయని  భావించాడేమో  కాని  అక్కడే తనలో  పూర్తి మార్పు వస్తుందని వూహించలేకపోయాడనుకుంది . రోజూ తను అందంగా తయారై హాస్పిటల్ కి వెళ్ళడం హాస్పిటల్ లో పని చేసే  పని వాళ్ళు దగ్గరనుండి డాక్టర్లు వరకూ తన అందాన్ని కళ్ళతోనే తాగేయాలన్నట్లు  చూడటాన్ని  గమనించింది. ఎవరికి యెక్కువ  చనువు ఇవ్వకుండా తనకి ప్రపంచానికి మధ్య ఒక సరిహద్దు రేఖ  గీసుకుంది

ఒక రోజు భర్త దశరధ్ ఫోన్ చేసి తమ చానల్ లో   యాంకర్ గా పని చేసే ఒక అమ్మాయి   హాస్పిటల్ కి వస్తుంది,   యెవరికీ అనుమానం  రాకుండా రహస్యంగా ఆమెకి  ట్రీట్మెంట్ యిప్పించమని ఆమెతో  చెప్పాడు    శరీరంలో అంగుళం మాత్రం కూడా  పరుల కంట బడకుండా  బట్టలు చుట్టుకున్న ఆమె నేరుగా తను వున్న రూం లోకి  వచ్చింది. ప్రాబ్లమ్  యేమిటి అని అడుగుతున్న ధాన్యమాలి  ముందు ఆమె భోరున ఏడ్చింది ఆమె కట్టుకున్నముసుగులు అన్నీ తొలగించి చూపింది.   ఆమె ఒంటి నిండా గాయాలు,  గోళ్ళతో గ్రుచ్చినట్లు,పంటితో కొరికినట్లు, కొడవలి ముక్కుతో  భూమిని త్రవ్వినట్లు  రక్తం చిందిస్తున్న గాయాలు.    చూస్తున్న ఆమెకి   అరికాళ్ళ నుండి వొణుకు పుట్టుకొచ్చింది.

ఎవరి పాలబడి  యింతవరకు తెచ్చుకున్నావ్ అని ఆ అమ్మాయిని  కోప్పడి  ఆమెని ఎప్పుడైనా  చూసినా కూడా గుర్తుపట్టడానికి అవకాశం యివ్వకుండా నార్త్ నుండి  వచ్చి పని చేస్తున్న డాక్టర్ తో ట్రీట్మెంట్ యిప్పించింది   పైకి నాగరికంగా కనిపిస్తూ అనాగరికంగా దాడి చేసిన మానవ మృగం తన భర్తే అని అర్ధం చేసుకోవడానికి యెక్కువ సమయం పట్టలేదు. సంపాదన కోసం క్షణ క్షణం  ప్రాకులాట,  నిత్యం  మద్యం లో మునిగి తేలుతూ 35 ఏళ్ళకే  డయాబెటిస్,బిపి ని  డబ్బుతో సమంగా పెంచుకుపోయే అతనిలో   లైంగిక పటుత్వం కోల్పోయినంత వేగంగా  మనసులో మెదిలే వికృతమైన కోర్కెలు చావనందు వల్ల  నిత్యం యెంతో  మంది  అమ్మాయిల కాయాలపై యీ  గాయాలు మచ్చలుగా మిగిలిపోతూనే వుంటాయని అర్ధమయింది.  భగవంతుడా ! ఆడదానిపై యె౦దుకింత ఆరాచకం, హింస? ఈ  తల్లులు యే  అవసరం కోసం  యిలాంటి హింసని భరిస్తున్నారో తెలియదు కదా ! వాళ్ళకి ఆ అవసరాలు యె౦దుకు కల్పిస్తావు తండ్రీ !   లోలోపల దుఖిస్తుంది ఆమె.  అప్పుడప్పుడు అతనికి కావాలని తను చేరువైన క్షణాలని గుర్తుకు తెచ్చుకుని భీతిల్లింది .  ఆనాటి నుండి అతనికి దూరంగా తన జాగ్రత్తలో తానూ వుండసాగింది

కాలం యెవరి బాధలతోను,  యెవరి అసహ్యాలతోను తనకి ప్రమేయం లేనట్టు కరిగిపోతూనే వుంది.ఆ కరిగే కాలంలో ఆమె  నైతికత అనే పదానికి   అర్ధాన్ని  మార్చుకోవాల్సి  వచ్చింది . భర్త పై కల్గిన అసహ్యంలో నుండి బయటపడి లోకాన్ని చూడటం మొదలెట్టింది  ముప్పై రెండేళ్ళ  వయసు. యువతిగా జీవితం అనుభవించక ముందే ప్రౌఢగా మారడాన్ని మనసు అంగీకరించినట్లు శరీరం అంగీకరించలేకపోతుంది.  మానసిక వొత్తిడిని తట్టుకోవడానికి శరీరానికి మర్ధనలు అవసరమే అని  స్పా సెంటర్ కి వెళ్ళింది .

"మేడం ! లేడీ స్టాఫ్ యీ  రోజు తగినంతమంది లేరు రేపు అప్పాయింట్ మెంట్ తీసుకుని వస్తారా ! లేదా ఉన్న మేల్  స్టాఫ్ తో  మసాజ్ చేయించుకుంటారా ? మీ ఇష్టం " అన్నారు .

"వై నాట్ " అంటూ లోపలి వెళ్ళిన ఆమె లోపల అలజడులని  కార్యరూపం లోకి తెచ్చుకోవడానికి యెన్నో రోజులు పట్టలేదు. మొదటి సారి స్పా సెంటర్ లో పనిచేసే పాతికేళ్ళ అందమైన యువకుడు,రెండవసారి మొబైల్ చాట్ లో పరిచయం అయిన  ముప్పయ్యి యేళ్ళ యువకుడు, మరి కొన్ని సార్లు తన క్రింద  పనిచేసే చురుకైన యువకుడు .. ఆమెలో కోర్కె   మొదలై నప్పుడల్లా నచ్చినవాడి కోసం వేట ప్రారంభించేది అందుకు రక రకాల వుపాయాలు కనిపెట్టేది మేల్ ప్రాస్టిట్యూట్స్ గురించి తెలుసుకుంది, సుఖించడానికి సులభ మార్గాలు యెన్నుకునేది.  ఈ లోకంలో డబ్బుతో అన్నీ కొనవచ్చు అన్న దశరధ్ మాటని నిజం చేసింది. నిజానికి డబ్బు అవసరం లేకుండానే ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోను సుఖించవచ్చు అని కూడా తెలుసుకుంది. సంప్రదాయ  కుటుంబంలో పుట్టిన తనేనా ఇలా చేస్తుంది? అని ప్రశ్నించుకునేది. మంచి చేయడానికి పోటీ పడాలి కాని తప్పులు చేయడానికి పోటీ పడినట్లు తయారైన తనని తానూ విశ్లేషించుకుని తన భర్త యెడబాటు వల్లనే తానూ యిలా  చేయాల్సి వచ్చిందనుకుని  సమర్దించుకుని సంతృప్తి పడేది 

హఠాత్తుగా దశరధ్ ని ఒక కార్ల షో రూం ప్రాంభించమని కోరింది అతను ఆమె అడిగిన పనిని  మారు మాట్లాడకుండా  చేసాడాంటే అదొక్కటే. నేనెందుకు ఆ కోరిక కోరానో తెలిస్తే గుండె ఆగి చస్తావు అనుకుంది మనసులో నవ్వుకుంటూ ..  క్రొత్త మోడల్ కారు వచ్చిన ప్రతి సారి  క్రొత్త కారుని డ్రైవ్ చేయాలని ముచ్చట పడేది.  ఒకరోజులోనే అలా  కారు నేర్చుకోవడం రెండో రోజు ట్రయల్ కి వెళ్ళడం చేసేది. ఒకోసారి వొంటరిగా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళానని  చెప్పేది. ఎవరికీ ఆచూకి తెలియనివ్వకుండా క్రొత్త క్రొత్త వ్యక్తులని వెదుక్కునేది . తనని గుర్తుపట్టకుండా డ్రెస్సింగ్  స్టైల్ మార్చేసుకునేది, పేరు మార్చేసుకునేది, ఫోన్  నంబర్ మార్చేసుకునేది. అయితే తనెప్పుడూ వొక విషయంలో జాగ్రత్త తీసుకునేది   తను యె౦చుకున్న వ్యక్తీ హెచ్ ఐ వి టెస్ట్ రిపోర్ట్  తీసుకుని వారికి తన ఫ్రెష్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ముందుకు నడిచేది   తను చేస్తున్నది  యే మాత్రం తప్పుగా తోచలేదు, ఎక్కడా ఆత్మ వంచన లేదు. మనిషికి  అత్యంత సహజమైన అవసరమైన పిజికల్ నీడ్. ఆ అవసరాన్ని అణుచుకుని  లేని పవిత్రత ఆపాదించుకుని నటించుతూ బతకడం అవసరం లేదనుకుంది. 

ఒకోసారి యేకాంతంలో తను చేసిన పనులకి నవ్వుకునేది తన  మనసుని, యవ్వనాన్ని బంధించి కోర్కెల కొలిమిలో మండమని నిర్దేశించడానికి దశరధ్ కి యే మధికారం వుంది, అతను భర్తగా నా అవసరాలు యెప్పుడైనా గుర్తించాడా, అసలు గుర్తించడానికి ప్రయత్నించాడా ? యుగ యుగాలుగా స్త్రీని యింటిలో బందీ చేసి తానూ మాత్రం తన వాంఛలని   యదేచ్చగా తీర్చుకుంటూనే వుంటాడు, మరి శరీర యాతనతో బాధపడే స్త్ర్రీ మాత్రం వూరుకుంటుందా !? పట్టపగలు కాకిని చూసి భయపడే స్త్రీ కూడా  ప్రియుని కోసం అర్ధరాత్రి అవలీలగా నదిని దాటి వెళుతుందట" అని చదివింది గుర్తుకొచ్చి  " పచ్చి నిజం " చెప్పారు అని పడి పడి  నవ్వుకునేది. తనలాంటి ఆడవారిని చూసయినా సమాజం స్త్రీల ఆలోచనల్లో వస్తున్న మార్పుని గమనించి మగవారిని తస్మాత్ జాగ్రత్తని హెచ్చరిస్తుందేమో ! లేకపోతే  రాళ్ళతో కొట్టి చంపండి అని వెంటబడుతుందేమో !

ఈ హై  క్లాస్ సొసైటీ లో మార్పు కోసం, అవసరాల కోసం, సరదాల కోసం  కార్లు మార్చుకున్నట్లు లైఫ్ పార్టనర్ ని మార్చుకోవడం ప్యాషన్ అయిపోతే అది తప్పు కానప్పుడు నేను చేసింది యెంత మాత్రం తప్పు కాదని  అనుకునేది. తనని తానూ సమర్ధించుకునేది . సంఘంలో యేది యెక్కువ చెలామణి అయితే అదే గొప్పగా భావించే సంస్కృతిలో దశరధ్  లాంటి మగవాడు యే౦  చేసినా చెల్లుబాటవుతుందనుకుంటాడు.  మగవాళ్ళకి  మాత్రమే అది యెల్లప్పుడూ చెల్లుబాటు కాదు స్త్రీ ఆలోచనలు లో కూడా మార్పు వస్తుంది. ఆ మార్పు అనివార్యం అయినప్పుడు వారు మారకుండా యెలా వుండగలరు? అని ప్రశ్నించాలనుకునేది.

నేను చేసేదంతా భర్తకి తెలిస్తే  అన్న ప్రశ్న తలెత్తేది.  తెలిసి వుండవచ్చుననే అనుమానం వుంది.  అయినా అతనికేమి  సమాధానం చెప్పాలో కూడా ఆమెకి స్పష్టంగా తెలుసు.  తనను తానూ సమర్ధించుకోవడానికి  వొక బలమైన గోడని కట్టుకుని వుంది.

 గతాన్ని  గుర్తు చేసుకుంటూ...  ఏడేళ్ళ గా జరిగిన  పెళ్ళి  అనే నాటకంలో కొన్ని అంకాలు తను వూహించని రీతిలో ముగిసిపోయాయి.  ఇక యీ  రోజు యిది ఆఖరి అంకం కావచ్చు లేదా కాకపోవచ్చు మొగుడు అనే వాడిని బంతిలా ఆడుకునే అవకాశం నాకు దొరికింది కనుక అతనిని  వదలకూడదు అనుకుంది కక్షగా.   ఆడది తెగబడితే  నైతికత అనే గుమ్మం దాటితే  యెలా వుంటుందో  అనేదానిని ఋజువు చేస్తూ ... తను యే౦  చేసిందో, చేస్తుందో చెప్పి హై పిచ్ లో తన రివెంజ్ యేమిటో వినిపించాలనుకుంది . అది తలచుకుంటూ  కారు నడుపుతూనే పడి  పడి నవ్వుకుంటూనే  వుంది.  ఆ నవ్వులో  కళ్ళలో జల జల కారే కన్నీరు కలసిపోయింది

ఇవన్నీ తెలియని దశరథ్  మాత్రం ఆమెకి  ఆ ఆవకాశం యివ్వకుండానే   రిపోర్ట్ల గురించి ముందే తెలుసుకుని   ..  తననే ప్రశ్నిస్తున్నట్లున్న ధాన్యమాలిని గుర్తు చేసుకుంటూ మితిమీరిన వేగంతో కారు నడిపి కావాలని యాక్సిడెంట్ చేసుకుని  భయంగా  మరణాని కంటే  ముందే కళ్ళు మూసాడని ఆ మెసేజ్ చెప్పింది .

జరిగిన విషయాలని గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళ మధ్య   మెసేజ్ని మరొకమారు చదివింది. అందులో . "నా కంతా  తెలుసు, కారణమూ నేనేనని తెలుసు, ఒక భర్తగా నీకు చాలా అన్యాయమే చేసాను.  హెచ్ ఐ వి పాసిటివ్ అని నాకు తెలుసు కనుకనే యి న్నేళ్ళు  నిన్ను దూరంగా వుంచాను. కేవలం అది నీ పై ప్రేమ వల్లనే ! నిజం నీకు తెలిస్తే  యెక్కడ  అసహ్యించుకుంటావొనని నీకు తెలియనివ్వలేదు . రహస్యంగా నువ్వు పర పురుషులతో తిరగడం తెలుసు.   మగాడిగా జరిగినవాటిని జీర్ణించుకుని బ్రతకడం చాలా కష్టం అని తెలుసు. నివురు కప్పిన నిప్పు లాంటి నిజాలని భరించగల్గడం చాలా చాలా కష్టం కనుక  బలవంతపు మరణమే సరయినదని   మరణాన్నిఆహ్వానిస్తున్నాను. సంస్క్రతి సంప్రదాయం పేరిట   అణచిపెట్టబడిన ఆడవాళ్ళు , గదులలో మగ్గుతున్న ఆడవాళ్ళు,  మేలుకుని అవకాశాలని అందుకోవాలని, తెంపరితనంతో  ఆ అవకాశాలని దుర్వినియోగం చేసుకోవాలని చూస్తే, వాళ్ళ ప్రవర్తనని,  ప్రశ్నలని పురుష ప్రపంచం భరించలేదు. తట్టుకోలేదు. చంపడం లేదా చావడం రెండింటిలో యేదో వొకటి జరిగి తీరుతుంది. ఆఖరికి యేమి మిగలదు. అంతా సర్వనాశనం. ఇకనైనా  నీకు స్వేచ్చన్ని ప్రసాదించానని అనుకుంటూ నేను తప్పుకోవడమే మంచిదని యీ  నిర్ణయం  తీసుకున్నాను. నీ మనసులో నాపై ప్రేమే వుంటే  నా కోసం రెండు కన్నీటి చుక్కలు చాలు,  ఇదే లాస్ట్ మెసేజ్. రియల్లీ సారీ  ధాన్యమాలి  .. సెలవ్ !

అది దశరథ్ క్షమాపణో, వివరణో, లేక ఆభిజాత్యమో!  ఏదైనా కానీ ఆ మెసేజ్ ఆమెని కుదిపేసింది. దుఃఖంలో మునిగిపోయింది.

(విహంగ లో వచ్చిన కథ ఆగష్ట్ 2013)