31, ఆగస్టు 2020, సోమవారం

పిచ్చుకమ్మలూ.. ఇటు రండి

పిచ్చుకమ్మలూ ఇటు రండి... .                            

మీరు కనుమరుగయ్యారని వాపోతుంది లోకం తమ పాపం ఏమీలేనట్లు

జనులపై దయతలచి మీ ఉనికిని చాటుకుంటూ అతిథిలా వేంచేస్తారు నా గృహానికి.

గూడు అల్లకపోయినా మీకొక గూడు కనబడింది నా వరండా ఇంటిలో

నేను కాసిని గింజలు వేలాడదీసి కొబ్బరిచిప్పలో నీళ్ళు పెట్టినందుకేమో.. అతిథిలా నా ఇంటికి వస్తూనే వుంటారు.

మీ క్షేమం సదా నా బాధ్యత అన్న వాగ్ధానం అర్దమయ్యిందో యోమో..

కరెంట్ తీగలచుట్టపై మెత్తని శయ్య ఏర్పరుచుకుని సరాగాలాడుతుంటారు ఆలుమగలు.  ఎంత మురిపెంగా వుందో మిమ్ము చూస్తుంటే..

మిమ్మలను చూస్తూ నాకు నేనే చెప్పుకుంటానిలా వేరొకరితో చెప్పినట్లు.. హృద్యంగా..

 “ఆమె గూటిలో కూర్చుని ఎదురుగా తీగపై కూర్చున్న అతనితో ఊసులాడుతుంటుంది.

అతను అపుడపుడు పెత్తనాలకు వెళ్ళినట్టేవెళ్ళి.. ఏ పురుగునో పుడకనో తెచ్చి అపురూపంగా ఆమెకందిస్తాడు.

ఆమె కిచకిచ మనుకుంటూ ఒక రెక్కను క్రిందికి వొంచి అతని చుట్టూ తిరుగుతూ ఆనందంగా నాట్యం చేస్తుంది.

అతను ఆమె మెడక్రింద తన తలను వొంచి.. ఓసి.. పిచ్చి ప్రేయసీ.. ఈ మాత్రం దానికేనా ఇంత సంతోషం... ముందురోజులకు కాస్త దాచుకో.. కలకాలపు తోడును కదా నేను.

మన వంశాన్ని వృద్ధి చేసి పంటలకు సస్యరక్షణలో తోడవుదాము.ఇక పోదాం పద పద.

మనుషులు చూస్తే మనపై ఈర్ష్య పడతారు. వారికి మనంత తీరిక మనస్సు ఎక్కడిదీ?
రెండు కళ్ళు దేనికో అప్పగించి మన ఉనికికి ఉపద్రవం తెచ్చిపెట్టేపనిలో తలమనకలైవున్నారు.

త్వరగా ఎగిరిపోదాం పద..  పచ్చని లోకం మన నెలవై.. కొలువై. “   అంటూ మీ కథను అప్పటికి ఆపేస్తాను.

పిచ్చుకమ్మాలూ.. ఇటు రండి అని రోజూ పిలవకుండానే వస్తూండటానికి జొన్న కంకుల గుత్తినొకటి వ్రేలాడగడతాను.

మీ సంతతిని కాపాడటానికి బల్లులను ఇటువైపు చూడకుండా భయపెడతాను. పక్షి పశువూ కీటకమూ జంతువూ అన్నీ వుంటేనే కదా.. మనిషి మనుగడ అన్న  కూసింత స్వార్దంతో కూడానూ..




26, ఆగస్టు 2020, బుధవారం

నీటి జాబిలి కాదు మేరు శిఖరం


కవి సాంఖ్య పక్షం,అయినా వాళ్ళు నిందిస్తారు 
అవును వాళ్ళు అసభ్యపు మాటలతో గుండెల్లోగునపాలు దించుతారు

వాళ్ళ రక్తమంతా కులద్వేషంతో కుతకుత ఉడుకుతుంటుంది.

వ్యక్తి పూజకు సమాజ హితానికి తేడా తెలియని మూర్ఖశిఖండులు.

అవినీతి గొంగళిలో పంచభక్ష్యాలు భుజిస్తూ.. పక్కవాడి పళ్ళెంలో మెతుకులను కాజేయాలని పన్నాగాలు

జగన్నాథ రధచక్రాలు వస్తున్నాయ్ అని రంకెలేస్తూ ఎగిరెగిరి పడతారు సరే రాత్రి వేళకు కన్ ఫెషన్ చెప్పుకుంటూ మోకరిల్లుతారు అవసరమైన చోట కాళ్ళు పట్టుకుంటారు

ఆరడుగులు నేల చాలన్న సత్యాన్ని విస్మరించి ఆరొందల పరగణాల భూదాహంతో దప్పికగొని వుంటారు

సురపానానికి స్వాగత ద్వారాలు తెరిచి అమృతమని భ్రమింపచేసి విషపు ఉక్కుకౌగిలిలో నలిపిపడేస్తుంటారు మొసలి కన్నీరు కారుస్తుంటారు రోజుకొక రంగు మారుస్తున్న ఈ ఊసరవెల్లులు

రెండున్నర శతాధికదినాలు దీర్ఘంగా అవిశ్రాంతంగా సాగుతూ మోయలేని బరువుతో కృంగి కృశించి వేదనతో ఆక్రోశంతో అలమటిస్తూ ఆశల చూపులతో బొంద విడిచి పెట్టాయో.
బతికివున్నవాళ్ళు శాపనార్ధాలు పెడుతూ రాజకీయరాబందుల ఇనుప గోళ్ళకు చిక్కి రక్తమోడుతున్నాయో

వేలమంది ప్రజల జీవన విద్వంసం కనబడటంలేదా.. ఈ గాంధారి పుత్రులకు.. 
ఇంటింటికి వొక కథ వేల కుటుంబాల అంతులేని వ్యథ
వేయి పడగల విషనాగు రోజుకొకతూరి విషం చిమ్ముతూనే వుంది .
గారడివాడి మాయాలా మూడు రాజధానుల ఆట ఆడుతూనే ఉంది మాయాలాంతరు ధరించిన రాక్షస మాయ మట్టిదిబ్బలుగా స్మశానవాటికగా మార్చజూస్తేనో  నమ్మశక్యంగా లేదిపుడు

పోరాటదీపం భావితరాల చేతుల్లోకి మారిందిపుడు. నిత్యం పబ్బం గడుపుకోవడానికి ఇది నిత్యాగ్ని హోత్రం కానేరదు. హరితుల పోరాటం వస్త్రంలో దారంలా అభివృద్దిగాముల  ఆరాటం

చట్టం ఎవరికీ చుట్టం కాదు
జడలు విప్పిన అరాచక దృశ్యాలను కళ్ళకు కట్టిన గంతలు
విప్పుకుని మరీ న్యాయదేవత చూస్తూనే ఉంది

కొందరు సత్యగాములు  ఘోషిస్తూనే వుంటారు సముద్రంలా
అది ఆత్మఘోష మాత్రమే అనుకుంటే పొరబాటు. అది పెను ఉప్పెనై  ముంచెత్తడం ఖాయం.
అమరావతి నీటి జాబిలి కాదు  కుయుక్తితో నీలిరంగుఅద్దిన పదహారు కళల ఖ్యాతి చంద్రికుల మేరు శిఖరం 
మసకబారిన జాబిలివెలుగులకు  చీకట్లు తృటికాలం అది ఉండదు కలకాలం   
సత్యమేవ జయతే !!