22, మార్చి 2023, బుధవారం

ఏనాటికీ ముగియని కథ

 ఏనాటికీ ముగియని కథ

కన్నడమూలం :డా॥ యు, ఆర్. అనంతమూర్తి


తెనిగింపు: శ్రీ శంకరగంటి రంగాచార్యులు.


ఏనాటికి ముగియని కథ 

టైమ్ ప్రెజెంట్ అండ్ టైమ్ పాస్ట్


ఆర్ బోత్ పర్ హాప్స్ ప్రెసెంట్ ఇన్ టైమ్ ఫ్యూచర్


 అండ్ టైమ్ ఫ్యూచర్ కంబైన్డ్ ఇన్ టైమ్ పాస్ట్


టి. ఎస్. ఎలియట్.



"బయట శానా చలిగా వుండాలి.".


పండు పండు ముసలివాడు మనస్సులోనే చలిని వూహించుకుని వణకి, ధగధగ మండుతూన్న కుంపటి వద్ద ఒళ్ళు కాచుకుంటూన్నాడు. ఏవేవో స్మృతులు మనస్సులో మెదలాడుతాయి.... ఎన్నేళ్ళ క్రిందటివో ఏమో!


కాంతిగా నుండే నిప్పుల్లా వెలుగుతున్నాయి... ఆ ముసలికళ్ళు.. ఏమో తృప్తి! ....


దేవుడి దయ అనాలి. సుఖమైన బదుకు. నిండుగృహం. వయస్సయినా ఇంటి బాధ్యతనంతా అతడి కొడుకే వహిస్తున్నాడు. అతడికి చేతికి అందుబాటులోకి వచ్చిన నలుగురు కుమారులు, అందరికీ లక్ష్మీదేవుల్లాంటి భార్యలు... మళ్ళీ ముద్దుముద్దుగా పుట్టిన ఆ మనముల పిల్లలు మునిమనుములు!!


ఎంత అదృష్టవంతుడు ముసలివాడు!


రెండు పూటలకూ అయి మిగిలేటట్టు వడ్లు పండుతూన్న మాగాణి !  చిన్నదైనా ఉత్తమంగా పంటనిస్తున్న పోకతోటా! కొట్టం నిండా పాడి పశువులూ అన్నీఉన్నాయి.


ఇంకేం కావాలి, ఇంతకన్నా?


తొంభై ఏళ్ళు వచ్చినా రాయిలాంటి ఒళ్ళు, కొడుకు అధికారంలోకి వచ్చినా తన్నడగకుండా ఏపనీ చేయడు. అదలా వుండనీ... ఎంతభక్తి వాడికి! ఈనాటికీ తన్ను తలయెత్తి చూడడుగదా!.... ఇక ప్రాయపు మనుమలు... ఈకాలం వాళ్ళయితే ఏమంట? తాతయ్యంటే వాళ్ళకు నాన్న గార్ల కన్నా ఎక్కువ ప్రేమ....


... లోపల్నించీ జోలపాట వినవస్తోంది.....


ఏడ్తువేల రంగ, 

ఏమికావలె నీకు.... 

నాలుగెనుములు పిండినట్టి పాల్ చక్కెరా

నీ నడిగినపుడంత ఇస్తానులేరా

వోవలా హోనీ.... ... చిట్టి జోజో

జోజో బాబూ..జోజో…


ఇంకెవరంట బాగా జోలపాట పాడతారు. అతడి ముసల్దే!..... ఆ చిన్న మనునుడి పాపడిని ఊదుతూండాలి....


ఔను! ఆ పాపడిరి అతడి పేరే పెట్టారు. అతడి ముఖంలాగే వాడి ముఖమూనూ హుం! అతడి లాగే హదమారి తనం కూడా!.. .....


ఇప్పటికి ఎనభై రెండేళ్ళక్రితం... శానా కాలం క్రితం అతడూ అలాగే ఏడ్చేవాడు! అపుడు అతడి అవ్వకూడా పూచి లాలి పాడుతూండేది.


ఏడ్తువేల రంగ, ఏమికావలె నీకు.... 

నాలుగెనుములు పిండినట్టి పాల్ చక్కెరా..


ఆ జోలపాటకు ముగింపే లేదేమో!


ఆ తొట్లలోనే .... తాను ! ....


తన కొడుకూ!.....


కొడుకు కొడుకూ!.....


అతడి కొడుకు కొడుకూ


ఆ తొట్ల ఊగక ఆగిన దినమే లేదు!


ఆ జోలపాట పాడని దినమూ లేదు!

అతడి పాలిట ఆ జోలపాట ఎంత సత్యం


అతడి ఇంట్లో పుట్టిన పిల్లలు ఎందుకేడ్వాలి? కావలసినవన్నీ ఉన్నాయి. ఇంట్లో నాలుగెనుములెందుకు? అరెనుములున్నాయి! ఇంట్లో ' జనం నిండుగా వున్నారని ఇంకా మొన్నే అతడి కొడుకు జాతరకు వెళ్ళి మరొక ఎనుము తెచ్చాడు.


ఆ నాలుగెనుములంటేనో తన ఇంట్లోనే పుట్టి పెరిగాయి,. వాటి తల్లి, తల్లి, తల్లి,తల్లి, ఆవ్వ పాలో ఏమో తను తాగి పెరిగింది......


హూం! మొదలైంది హదమారితనం! వాడే పెద్ద మనుమని కొడుకు! ...ఇంకేముంటుంది! 'కథ చెప్పు..... ఒకటే పోరు! అతడి ముసల్దానికి ప్రతి నిత్యపు గోడు!…


ఔను! అతడి లానే కదా అతడి మనుమలు! 'తాత ప్రతి బింబాలు' అంటూ వాళ్ళ తల్లులు ఎందుకు దూరుతూంటారు... ముసలివాడి ముఖం తృప్తితో విప్పారుతుంది .... ఔను! అతడూ అలానే చేస్తూవుండలేదా, పిల్లవాడై వుండినప్పుడు, అవ్వ కధ చెబితే తప్ప నిద్రపోయిన దినం ఒకటైనా వుందా?....


ఆ ఒక కథను మాత్రం.... హో! అదే! అదే కథ! అతడి అవ్వ అతడికి చెప్పిన కథ.

అతడి లానే అతడి మనుమడి కొడుకూ తన అవ్వను వేధించి, కథ వింటూన్నాడు...

ముసలిదానికి ఆకథ ఎవరు చెప్పారు? అతడి అవ్వ అతడి కొక్కడికే చెప్పిన కథ అతడి ముసలిదానికెలా తెలిసింది? ... ఏమో జ్ఞాపకమే రాదు!


అతడే కదా..


ఆరోజు! .... సంక్రాంతికి ముందు!... పొలంలో వంగి పనిచేస్తూ వున్నపుడు ఆమె చెంపకు తన చెంపను సోకిస్తూ.....

ముసలివాడి ముఖం ముడతలు పడి వుండినా సిగ్గుతో ఎర్రబారుతుంది.

మనస్సులోనే ముసి ముసి నవ్వు నవ్వుతాడు.


అతడని ఆ అవ్వకు ఎవరు చెప్పి వుంటారు.

ఇంకెవ్వరూ..అతడి ఆ తాతయ్యే! 

అతడికి అతడి అవ్వ


ముసలివాడు తన ఆలోచనలకు తనే నవ్వుకుని మంటను మరింత పెద్దదిగా చేసి వీపు రాచుకుంటాడు.


ఔను,అదోకథ! వంశపారంపర్యంగా తామందరూ వింటూ వచ్చిన కథ! అదే ముగియని కథ. ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎందుకు ఏళ్ల తరబడి చెప్పినా ముగియని కథ! 

అతడు తన అవ్వను అడిగినప్పుడంతా ఆమె చెప్తూండేది.

రేపు ముగుస్తుందా

ఊహూ

ఎల్లుండి..

ఊ హూ..

ఇంకెప్పుడూ

“ఎప్పుడూ ముగియదు”

“ఎందుకు”

 అతడు ఎనభై రెండేళ్ళక్రితం అతడి అవ్వను కుతూహలంగా అడిగాడు. 

అపుడామె బహు గంభీరధ్వనితో చెప్పింది. 

ఈ కథ చివరికి వస్తే పొద్దు పొడవదు చెట్టులో పండ్లు కాయవు తీగలో పూలు పూయవు. మనుషులకు కథలు చెప్పే అవ్వలు బతకరు”


ఇప్పటికీ ముసలివాడు అవ్వ మాటల్లో నమ్మకం పెట్టాడు.ఆ కథ ఏనాడు తుదముట్టరాదు.. ముట్టితే? 


అతడి అవ్వ ఆ రోజు చెప్పి వుండలేదా? ఏమవుతుందని? 


************


ముసలివాడికి చెవులు చాలా చురుకైనవి. అతడి ముసలిది


మునిమనుమనికి చెప్తూన్న కథను చెవియొగ్గి వింటాడు.


తను పాపడై వుండినపుడు అవ్వ తొడమీద పడుకొని వింటూవుండిన చిత్రం కనులముందు కదలుతుంది.


అతనికేమో ఆశ్చర్యమవుతుంది. అతడి ముసలిది ఆ కథనింకా సాగదీసి, సాగదీసి చెప్పుతూవుంది......


నిదానంగా.... పాపడికి నిద్రను తెప్పించే గంభీరమైన, కంపి స్తున్న స్వరంతో..


ఎక్కడో కొంచెం కొంచెంగా వినబడుతోంది.


" ... తరువాత.... ఆ రాజకుమారుడూ, రాజకుమారీ నిండు ప్రేమతో బదుకుతూంటే.... ఒకానొక దినం.. అయి, చనిపోయారు... చనిపోయినా తోడుగానే వున్నారు.... ఇద్దరూ ఆకాశానికి పోయి, రెండు మేఘాలై, అక్కడంతా సందరిస్తూ సుఖంగా వున్నారు .. ఒకదినం రాజ కుమారుని మేఘం బరువెక్కి, వానై క్రిందపడింది... ఒక కొలనులో నీళ్ళలో చేరుకుంది... అప్పుడు రాజకుమారి కొలనులో చేపగా వచ్చి చేరుకుంది.... తర్వాత ఇట్లే ఉంటూండగా, ఒకానొక దినం ఒక బెస్తవాడు ఆ చేపను పట్టుకుని తినేశాడు..... నీళ్ళై వుండిన రాజకుమారుడు కృశించి, కృశించి, చిక్కి పోయి, మేఘమైనాడు….. చేపను తిన్న బెస్తవాడు ఇట్లే వుంటూ ఒకదినం చచ్చి మన్నయ్యాడు. ఆమట్టి నుంచి చెట్టొకటి పుట్టింది, చూడు, బాబూ, చేపై బెస్తవాడిలో చేరి వుండిన రాకుమారియే ఇలా అంటుంది. మేఘమైన రాజకుమారుడప్పుడు అచెట్టుకు వానై కురిశాడు. .... ఒకటి అక్కడినించీ కూడా వాళ్ళిద్దరికీ ఎడబాటు కలిగింది. రాజకుమారి పోయి చంద్రుడిని చేరింది. రాజకుమారుడు వెళ్ళి సూర్యుడిని చేరాడు. చూడు బాబూ, అందుకే చంద్రుడు రాజకుమారిని మోసుకుని ఆకాశంలో తిరుగుతాడు.... అయితే సూర్యుడు క్రూరుడు చూడు... అతడికి దూర దూరంగా పరుగెత్తిపోతాడు... అప్పుడు రాజకుమారి, రాజకుమారుడూ శానా దుఃఖంతో ఏడుస్తాను.... అందుకే తెల్లవారు జామున ఈ భూమి మీదంతా మంచు బొట్లు బొట్లుగా పడివుంటుంది..... పిల్లవాడు ఉత్సాహంగా నడుమ అడుగుతున్నాడు:


"ముగిసిందేమవ్వా, కథ"


"లేదు. బాబూ...."


"రేపటికి ముగుస్తుందా?"


“ఏ నాటికి ముగియదు బాబూ”


"ఎందుకవ్వా!"


ఆ పిల్లవాడు అతడు అతడి ఆవ్వను ప్రశ్నించినట్లే, ఇపుడు తన అవ్వను మొండిగా అడుగుతున్నాడు.... ఔను.... అతడి అవ్వ జబాబునే ఇపుడు అతడి ముసలిది తన మనుమలకు చెబుతూవుంది. అతడి అవ్వ మాదిరిగానే అతడి ముసలిది కూడా నెలల తరబడి ఆ కథను కొత్తకొత్తగా అల్లి, ముందుకు లాక్కుని పోతుంది.... ఇంట్లో పుట్టిన పిల్లలందరూ ఆ ముగియని కథను వింటూ ఎన్నో రోజులు నిద్రపోయారు,


ఇలానే.. .


ఆ రాజకుమారీ రాజకుమారుల కథ ఇంకా కొనసాగి ముందుకు పోవడం విన్నాడు అతడు....ప్రతీసారీ ఎలాగో ప్రయత్నించి, మళ్ళీ కలుసుకుంటారు. అలాగే ప్రతిసారీ వేర్పడతారు..... మళ్ళీ కలుసుకుంటారు.


తుది మొదటిలేని అనంతమైన కథ.... అనంతములైన రూపాల్లో వాళ్ళ ప్రేమ.... పూవై, కాయై, నీళ్ళై మేఘమై, గాలై, అగ్గియై, ఒకటా? రెండా.... ముగియని కథ.... ఏనాటికి ముగియని కథ!....


అతడికి అన్నం పెట్టిన పొలంలానే .... అతడిని ఊచిన తొట్లలానే...


తన్ను లాలిలో నిద్రపోగొట్టిన - ఆ జోలపాటలానే....


కొడుకులూ, మనునులూ, మునిమనమలూ అనక సతతంగా, అనంతంగా ఒకరినుంచీ ఒకరికి సంక్రమించిన కథ!


_ఔను! ఆది ముగియరాదు, ముగిస్తే? —


_అతడి అవ్వ చెప్పి వుండలేదా? ఏమవుతుందని?


************

.... పాపడికి నిద్రవచ్చివుండాలి ముసలిది చలికాచుకోవాలంటూ ముసలివాడి పక్కన వచ్చి కూర్చుంటుంది.


"శానా  వీపు దురద...."


థూ! ఏం సుఖమాశిస్తూందీ ముసల్ది! మొగుడంటే కొంచమైనా సిగ్గులేదు? ఇలా వీపు గీరమని అడుగుతుంది నిత్యమూ.....


ముసలివాడు నవ్వి, గుద్ది, ఆమెకు కొంచెం బాధకలిగేటట్టే అదేపనిగా గట్టిగా గీరుతాడు.


ఔను! ఆ ముసలివాడి అవ్వకూడా అలాగే....


మనుమలకు, 'అర్థరాజ్యమిస్తాను వీపు గీరితే' అని ఒప్పించి, గీరించుకున్నది చాలక, అతడిప్పుడు, చలికాచుకుంటూన్న కుంపటి ముందే కూచుని, తన మొగుడిచేత కూడా గీరించుకుంటూవుండేది.


అతడి ముసలిది అతడి అవ్వలానే. అన్నిటిలోనూ, 


కొంతవరకూ రూపంలోనూ,


...ఏమో కిలకిల నవ్వినలా వినబడుతోంది. ముసలివాడు వీపు గీరడం నిలిపి చెవియొగ్గి వింటాడు.....


ఓ, అతడి చిన్న మనమడూ, అతని భార్యా,


ఇంకేం! పగడకాయలు కావొచ్చు..... ముప్పొద్దులూ అదే పిల్లాట.... ఎంత ధైర్యంగా, గట్టిగా నవ్వుతారు!... ఏం ముద్దో, ఏమో!.....


గొణుక్కుంటూ ముసలివాడు ముసిముసి నవ్వుతాడు.


పాపం ... ఇంకా పసివాళ్ళు  పెళ్ళై ఇంకా ఎక్కువ రోజులు కాలేదు. ముసలివాడు నవ్వుతూ దూరుతాడు.


ముసలి సిగ్గుపడి, కుంపటిముందు పెళ్ళికూతురిలా ముసలి వాడితో కూర్చుని, చిరునవ్వు నవ్వుతుంది.


మనమలను ఎందుకు దూరాలి?.... ఎంత దొంగ ఆ ముసలి వాడు! .... ముసలిదాని సిగ్గుతో ఎరుపెక్కిన ముఖం చూస్తే తెలియడంలేదా?.... చాలా కాలం క్రితం.... వాళ్ళిద్దరూ పగడకాయలాడాక, ఆడుతూ కొట్లాడక.... పడుకొనడానికి వెళ్ళిన దినం ఒకటైనా వుండేదా?


అవే పాచికలు,

అదే పట్ట

అవే కాయలు, 


ముసలివాడి అవ్వ, తరువాత ఆ ముసలివాడు, తరువాత అతడి కొడుకు, ఇపుడు మనుమడు, అందరూ వాటితోనే తమ ప్రేమ క్రీడలు కొనసాగించారు.


జీవన ప్రవాహం నిరర్గళంగా సాగుతోంది....


ఊహు!... ఏనాటికీ ముగియదు...


ఇది ఎపుడైనా ముగుస్తుందా? ఆ కథలాగే ఈ ప్రేమక్రీడలు ఏనాటికీ ముగియవు.


ఎపుడైనా ముగిసిపోతే?.....


అతడి అవ్వ చెప్పి వుండలేదా? ఏమవుతుందని?_


"అప్పుడు పొద్దుపొడవదు- చీకటిపడదు. చెట్టులో పండ్లు కాయవు. తీగపూలు పూయదు ..."


*****************0****************



చిత్రం: 

Gibbs Garden GA





అనగనగ…

 కొందరు కథకులు కవులు ప్రపంచ కథల దినోత్సవం ప్రపంచ కవితా దినోత్సవం.. అంటూ రెండూ వరుసగా వచ్చాయని  వున్నాయని గుర్తు చేసారు.  పాఠకుడికి రోజూ కథ కవిత దినోత్సవమే కదా! కథ గురించి రాసిన మంచి కథ గురించి చెప్పుకుందాం. .. అనుకున్నాను.  


కథ అనగానే నాకు నాయనమ్మ చెప్పిన కథలే జ్ఞాపకం వస్తాయి. 


నాయనమ్మా ఈ కథ నీకు యెలా తెలుసు నీకు యెవరు చెప్పారు అని అడగడం తెలియని వయస్సులో అమాయకంగా  ఆమె చెప్పే కథ వింటూ.. ఆశ్చర్యపోతూ అనుమానంగా ఆలోచిస్తూ కళ్ళ మూసుకుంటే ఊహా ప్రపంచంలో  అనేక దృశ్యాలు మెదులుతూ కళ్ళు తెరిస్తే అవన్నీ మాయమై అయ్యో అవన్నీ యేమైపోయాయని దిగులుపడుతూ.. మళ్ళీ  యేదేదో వూహించుకుంటూ కళ్ళు మూసుకుంటే  కనబడే వేరొక దృశ్యాలు నిరాశ పెడితే వుసూరుమంటూ.. నాయనమ్మ చెప్పే కథలకు ఊ కొడుతూ ఊ కొడుతూ.. నిద్రలోకి జారుకోవడం.  కలల మధ్యలో పొంతనలేని కథలకు  కలవరింపులతోనో గావుకేకలతో యింట్లో అందరినీ నిద్ర లేపడం... అవ్వన్నీ  యిపుడు తలుచుకోవడం మధురంగానే వుంటాయి.


ఇప్పుడు నా మనుమరాలికి కథ చెబుతుంటాను. ఐ పాడ్ కనబడకపోతేనో టివీ పెట్టకపోతేనో మెల్లగా నాయనమ్మ పక్కన చేరి కథ చెప్పుకుందామా అని అడుగుతుంది. అనగనగా వొక రాజు అంట అనే కథ తనకు చెప్పడం వచ్చేసాక మరికొన్ని కథలు చెబుతుంటే ఊ హూ.. అంటూ కళ్ళు విప్పార్చుకుని చెవులు రిక్కించి శ్రద్దగా వింటూ వుంటుంది. విశ్యజనీయమైన ముచ్చట కూడా  యిది.. 


కథ గురించి చెప్పుకుని ఆ తర్వాత కథ చదివేద్దాం

కథ మనది కాదని కొందరంటే.. భలే వారు కథ మనది కాకపోడమేమిటీ? మనమేమి కథను విదేశీయుల నుండి అరువు తెచ్చుకోలేదు. విదేశాల్లో short story పుట్టకముందే మనకు సంస్కృతంలో కథలు ఉప కథలు వుండేవనే ఆధారాలు వున్నాయని చెపుతారు. లిపి పుట్టకముందు వాగ్రూపంలో కూడా కథలు చెప్పుకునేవారు.  తరతరాలుగా కథ సజీవ స్రవంతిలా ప్రవహిస్తూనే వుందని వుండబోతుందని కొందరు అన్నారు.


నేను పరిచయం చేయబోతున్న కథ “ఏ నాటికి ముగియని కథ” రచన.. యు ఆర్ అనంతమూర్తి. కన్నడ రచయిత. కన్నడంలో రాసిన యీ కథ శంకరగంటి రంగాచార్యులు తెలుగులో అనువాదం చేసారు. ఈ కథ గురించి సూచనాప్రాయంగా చదివి  వెబ్ అంతా వెదికాను. ఒక కథల ప్రేమికుడు యీ కథను పంపించారు. ఈ కథలో  వొక సౌందర్యం వుంది. భావుకత వుంది.తరతరాల పాటు విస్తరించిన ప్రయాణం వుంది. అదే ఈ కథను మర్చిపోనివ్వని కథగా నిలిపింది. ఇది మీ కథ నా కథ అందరి కథ. కథ చదివాక భలే వుంది కథ.. నిజమే కథ.. మన అవ్వలకు యెవరు చెప్పారో యీ కథ అనుకుంటాం.. 


తొంభై యేళ్ళు వున్న వొక వృద్ధుడు తన భార్య మునిమనుమడికి చెపుతున్న కథ ను వింటూ.. తన బాల్యం గురించి జ్ఞాపకం చేసుకుంటాడు. తన మునిమనుమడు లాగే తాను కూడా అవ్వ వొడిలో పడుకుని ఆమె చెప్పే కథను వింటూ… తర్వాత ఏమైంది కథ  అయిపోయిందా  అని అడిగేవాడినని గుర్తుచేసుకుంటాడు. ఆమె కథ అయిపోలేదని అయిపోదు కూడా అని చెబుతూ వుంటుంది. నాలుగైదు తరాలు ఆ కథను వింటూ తన కొడుకులు మనుమనుమలు మునిమనుమలు ఆ కథ వింటూనే వుంటారని ఆ ముదుసలి భార్య కథను సాగదీసి సాగదీసి యింకా యేవో జతకూరుస్తూ కథ చెబుతూనే వుంటుందని విసుగుపడుతూనే ఆ కథ ముదుసలికి యెవరు చెప్పివుంటారు నేనే కదా చెప్పి వుంటానని యవ్వనకాలం నాటి ఆలు మగల సరాగాలను గుర్తుకు తెచ్చుకుంటాడు. సాధారణంగా జేజమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పినట్టు కథ కంచికి మనమింటికి అని తేలికగా ముగించి పిల్లలను నిద్రపుచ్చే కథ ను ఆ అవ్వ చెప్పదు. ఆ కథ యేమిటంటే.. 


ఆ కథ ఒక రాకుమారుడు రాకుమారి ప్రేమను వారు మరణించాక వారిరువురు మళ్ళీ మళ్ళీ పుట్టడం ఒకో జన్మలో కలిసి వుండటం వొకో జన్మలో యెడబాటుతో దుఃఖించడం.. తో కథలో అనేక మార్పులు కూర్పులు చేరుతూ కథ సాగిపోతూనే వుంటుంది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అనురాగబంధం అది వొక జన్మతో తీరిపోయేదికాదని ఏడేడు జన్మల వరకూ అది ముడిపడే వుంటుందని అవ్వ చెప్పే కథ అంతర్లీనంగా బోధిస్తూ వుంటుంది. ఆ తర్వాత ఏమైంది కథ అయిపోయిందా అని పిల్లలు అడుగుతూనే వుంటారు. కథ అయిపోతే ఈ ప్రకృతి లో చెట్లు కాయలు కాయవు తీగలు పూలు పూయవు అని అవ్వ చెప్పే వుంటదని అది తను భార్యకు చెప్పే వుంటానని ముదుసలి పురుషుడు అనుకుంటూ వుండగా రచయిత కథ ను ముగిస్తాడు. 


అనాదిగా స్త్రీ పురుషులిరువురూ వొకరి కోసం వొకరు పుడుతూనే వుంటారు. ప్రకృతిలో వివిధ రూపాల్లో జీవిస్తూ మరణిస్తూ వుంటారు.. అదొక కాల జీవ ప్రవాహం. అది కొనసాగుతూనే వుంటుంది. 


కాలమూ ప్రవాహం జీవితం వెనక్కి మళ్ళటం అంటూ వుండదు అనేక మార్పులు చేర్పులు చేసుకొంటూ ముందుకు సాగిపోవడమే .. .. ఇదెన్నడూ

 కంచికి చేరని కథ.. తరతరాలు వంశపారంపర్యంగా అవ్వలు  పిల్లలకు చెప్పే కథ లాంటి కథను యీ రచయిత యెంత హృద్యంగా చెప్పాడో.. 

మీరూ చదవండి యీ కథ. .. ..


అనగనగా.. అనగనగా.. ఒక రాకుమారుడు ఒక రాకుమారి.. 


….. అంట.. కథ చదివించేది.. రేపు అంట..( పైన వున్న టపాలో.. )






బీగాలు వేయకండి


కొన్నాళ్ళుగా ఫేస్ బుక్ కి బ్లాగ్ కి ఉద్వాసన పలికి వెబ్ రహిత జీవనానికి స్వాగతం పలికాను. అలా వున్న ప్రాణిని హఠాత్తుగా యెందుకు ఫేస్ బుక్ యాక్టివేట్ చేసాను అంటే.. మూడు రోజుల క్రితం నుండి కొన్ని హెల్త్ ఇష్యూస్ మొదలయ్యాయి. ముఖ్యంగా హార్ట్ అటాక్ వార్తలు యెక్కువగా వినడం మూలంగానేమో అదోరకం భయం ప్రవేశించింది. శారీరక వ్యాయామాలు నడక ఇక్కడ (అట్లాంటా) వాతావరణ పరిస్థితుల వల్ల జీరో అవడం మూలంగా చెడ్డ కొవ్వు పేరుకుపోయి టాబ్లెట్స్ వాడుతున్నాను. ఎసిడిటీ సమస్యలు కూడా యెక్కువే! మొన్నంతా నిన్న కూడా  సమస్య బాగా భయపెట్టింది. ఇప్పుడు బాగున్నాను. అప్పుడు కొంత ఆలోచించాను. 

ఫేస్ బుక్ బ్లాగ్ తాళాలు వేసుకుని కూర్చుంటే.. భ్లాగ్ లో డ్రాప్ట్ లలో పడవేసి వుంచిన పోస్ట్ లు కథలు యేమైపోతాయో!  సడన్ గా లోకానికి వీడ్కోలు చెపితే మన రాతలు అన్నీ మరుగున పడిపోతాయి. ఒక్కో రాత బయటికి రావడం వెనుక యెంత ఆలోచన కృషి తపన ఆరాటం వుంటాయి. అవన్నీ మరుగున పడిపోతే ఇంకేమైనా వుందా అని.. అనిపించి.. అప్పటికప్పుడు ఫేస్ బుక్ యాక్టివేట్ చేసాను. వరుసగా బ్లాగ్ లో కథలన్నీ పోస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను.

దయచేసి రైటర్స్ ఎవరూ వారి అకౌంట్ లను స్థబ్థత పరిచి లేదా మరుగున పడేసిన వుంచకండి. మన పిల్లలకు మన అభిరుచులు పట్ల మన ఆసక్తుల పట్ల ఆసక్తి తక్కువ.వారి జీవనపోరాటాలు వారివి. కనీసం మన మెయిల్ ఐడి కానీ మన ఫోన్ నెంబర్ కానీ ఠక్కున నోటితో చెప్పగల శ్రద్ధ వుండదు కనీసం ప్రయత్నం కూడా చేయరు. ఇక మన ID లు passwords బ్లాగ్ పబ్లిష్ లు వాళ్ళకు ఏం పడతాయి చెప్పండి? అని చెప్పడమే కాదు మీకందరికి గుర్తు చేస్తున్నాను. (అందరి పిల్లల సంగతి నాకు తెలియదు. మా ఇంట్లో వారి గురించే నేను చెబుతూ జనాంతికంగా అంటున్నానని మనవి)

మనల్ని నచ్చినవాళ్ళు యెప్పుడైనా మన రాతలను చదవాలనుకుంటే వాళ్ళకు అందుబాటులో మన రాతలను  మిగిల్చివెళ్ళాలని మనం మరువవద్దు. అన్ని రాతలు అచ్చులో వుంచుకోవడం సాధ్యం కాదు కదా! రాయడం వెనుక వున్న శ్రమలో ఒక వంతు భద్రపరచడం లో అందుబాటులో వుంచడం కూడా వొక భాద్యత గా భావించుదాం. కొందరు రచయితలు వారి రచనలను యెప్పటికప్పుడు భద్రపరుచుకోలేక తర్వాత వగస్తూ వుంటారు. మరికొందరు కీర్తిశేషులైన తర్వాత వారి రచనలు అందుబాటులో వుండవు. ఆ విషయాలన్నీ విన్నప్పుడు చచ్చువో పుచ్చువో మంచివో చెడ్డవో కాకి పిల్ల కాకి కి ముద్దు లాగా మన రచనలు మనకు ముద్దుగా గొప్పగా భావించి భద్రపరచడం సమంజసం అని నేను భావించాను. మీ రాతలకు తాళాలు (బీగాలు ) వేయకండి. :)

మిత్రులందరూ బ్లాగ్ చూస్తున్నందుకు ఆత్మీయంగా స్పందించినందుకు ధన్యవాదాలు.

వీలైనప్పుడు స్పందిస్తాను.. నమస్తే!

వ్యాఖ్యల సౌలభ్యం తొలగించాను. రద్దు చేసాను. మన్నించండి. అందుకు చాలా పెద్ద కారణమే వుంది. దాని గురించి ఒక టపా రాస్తాను .





21, మార్చి 2023, మంగళవారం

నా అక్షరాల కోశాగారం

 ఈస్తటిక్ సెన్స్ బుక్ ప్రచురించాక..  మళ్ళీ యేమైనా రాయాలంటే.. నాకు ఒక విధమైన అయిష్టత ఏర్పడింది. 


బహుళ పత్రిక లో అనువాద కథ పరిచయం చేయాలంటే కూడా మనస్సు పెట్టలేకపోయాను. అది రైటర్స్ బ్లాక్ లాంటిది కూడా కాదు. అంతకన్నా యెక్కువ. 


ఒకరోజు రాత్రి కథ రాయాలనిపించింది.. రాయడం మొదలెట్టాను. రెండు రోజులలో కథ పూరైంది. ఆ కథను వొక పత్రిక  ప్రచురణకు వెళ్ళడానికి  కొద్ది గంటల ముందు మాత్రమే పంపగల్గాను.  ఆ కథ “రంగు వెలిసిన కల”


హమ్మయ్య! యిప్పట్లో కథ ను అంటుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నానో లేదో.. భండారు విజయ గారు “ఒంటరి మహిళ” సంకలనం కోసం కథను వెంటనే పంపండి అని వాట్సాఫ్ గ్రూఫ్ క్రియేట్ చేసి అందులో మెంబర్ గా చేర్చి.. సందేశం పంపారు. ఆమె గత మే నెల నుండి కథ పంపమని అడుగుతూనే వున్నారు. నేనే బద్దకించాను. ఒంటరి స్త్రీ గురించి ఇంకేం రాయగలను.. ఇప్పటికే చాలా కథలు రాసేను. స్త్రీ ఓరియంటెడ్ కథలు ఇక రాయకూడదు అని అనుకున్నాక మెడ మీద కత్తి పెట్టినట్లు ఇది వచ్చి పడిందేమిటి అని ఆలోచించాను. మాట యిచ్చినప్పుడు యెలా నిర్లక్ష్యంగా వూరుకుంటావు? ఇదసలు పద్దతేనా.. అని నా మీద నేను విసుక్కుని.. కథ రాయడానికి వుపక్రమించాను. మూడు రోజుల్లో కథ పూరైంది. వెంటనే భండారు విజయ గారికి కథ పంపేసాను.


నిజానికి కథ రాయాలనే తపన లేకపోయినా కథ రాయాల్సివస్తుంది. కానీ ఆ కథ లోని పాత్రలు ఇతివృత్తం అప్పటికప్పుడు రూపుదిద్దుకున్నవి కాదు. మెదడులో బ్లూ ప్రింట్ రూపంలో దాగి వుంటుంది. రాయడం మొదలెట్టాక..  పొగ పెడితే కలుగులో దాగిన ఎలుకల్లా పాత్రలు కథ బయటకు వస్తాయంతే! 


పాతికేళ్ళ కిందట తిరిగొచ్చిన కథలు రెండు మూడు అలాగే వున్నాయి. ఒక నవల అలాగే వుంది. అవి పూర్తి చేయడానికి సమయం రావడం లేదు అంతే! 


ఈ లోపు లో  నేను బాగా రాసానని మెచ్చుకునే వారు కొందరైతే.. ఏం బాగో లేదు అని  రహస్యంగా చెప్పే వొకరు అయినా వుంటారు. అందరూ పాఠకులలోనే వుంటారు. నేను ఏ వొక్కరి కోసమో రాయలేదు. నాకు రాయాలనిపించింది రాసుకుంటాను. ఇదిగో యిది నా గురించే రాసావు అని గొడవ పెట్టుకునే వారు వున్నారు. నా గురించి రాయకూడదు.. చాలా హిట్ అవుతుంది అని ఏళ్ళ తరబడి అడిగే ఫ్రెండ్ వుంది. మీరు రాయాలే కాని నా కథ కు మించిన కథ మీ కథల్లో వుండదు అంటుంది పొరుగింటావిడ. 


అసలు కథ రాయాలంటే నాకు మనస్కరించాలి కదా.. 


నేను తపన పడి రాయలేనివి కొన్ని 

రాయాలని రాయలేనివి కొన్ని 

అలవోకగా రాసేసినవి కొన్ని.. 

అసలు రాయకూడదు అనుకొని కూడా రాసేనవి కూడా కొన్ని.. 


మొత్తం.. 117 కథలు 3 మైక్రో కథలు మొత్తం 120 కథలు నా బ్లాగ్ లో పబ్లిష్ చేసేసాను. ఇక కొరవ యేమీ లేవు. 


ఒక్క కథ భండారు విజయ P Jyothi గారి సంపాదకత్వంలో వెలువడబోయే కథ మాత్రం వుంది. ఆ కథ పేరు "దీప వృక్షం " . 


ఇక.. 

మూడు అసంపూర్తి కథలు ఒక నవల  యెప్పుడు పూర్తవుతాయో చెప్పలేను. 😊


27 సంవత్సరాల రచనా ప్రస్థానం ఇది.


నా పుస్తకాలు కొంటారా కొనరా.. ఉచితంగా పంపిణీ చేయాలా.. అవన్నీ అప్రస్తుతం. 


కొందరికి చీరలు కొనుక్కోవటం బంగారం కొనుక్కోవడం వస్తువులు కొనుక్కొని ఇంటిని అలంకరించుకోవడం యెలాగో .. నాకూ.. నా భావాలను నా ఆలోచనలను రచనలుగా వ్యక్తీకరించుకోవడం యిష్టం.  నా సంతృప్తి కోసం అదే పని చేసాను. ఆ రాతలను భద్రపరిచాను. 


కథలు కవిత్వం వ్యాసాలు సరదా కబుర్లు.. స్పందనలు

చెప్పుకోదగిన  వ్యక్తిగతమైన విషయాలు..  బాల్యం  కుటుంబం.. కలగాపులగంగా.. 


ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటిలో 14 కథలున్నాయి . రెండు కథలు గీటురాయి,కోకిలతల్లి 2019 లో రాసిన కథలు.2020 లో మొదలుపెట్టి  2022 జూలై వరకూ 12 కథలు రాసాను. కరోనకాలంలో ఎక్కువ రాయలేదు.అనారోగ్య కారణాల వల్ల రాయలేకపోయాను. ఈ కథలన్నింటిని ఈస్తటిక్ సెన్స్ కథాసంపుటిగా తేవడం జరిగింది. ఆ కథలన్నింటినీ ఇప్పుడు ఇక్కడ అంటే బ్లాగ్ లో మార్చి నెలలో గత పదకొండు రోజులుగా పదకొండు కథలను ప్రచురించాను. 

 

నా రాతలన్నీ.. ఇక్కడే ఉన్నాయి .. ఎప్పుడైనా ఎవరైనా చదవడానికి వీలుగా ప్రచురించాను. మీరందరూ చదువుతారని ఆశిస్తూ .. .. 









20, మార్చి 2023, సోమవారం

ఔనా!

 ఔనా!    -వనజ తాతినేని. 

పన్నెండేళ్ళుగా  మెదడు  నిండా ఓ పాత్రను మోస్తున్నాను. అప్పుడామె తన కథను చెపుతున్నప్పుడు  కనులు పెద్దవి చేసి చెవులు రిక్కించి ఆశ్చర్యంతో రోమాలు నిక్కబొడుచుకున్నట్లు జ్ఞాపకం వుంది. ఇదంతా ఆమె చెప్పిందా నేను  నిజంగానే విన్నానా అనుకుంటూ   నన్ను నేను గిల్లి చూసుకున్నాను కూడా. స్త్రీ పురుష సంబంధాల గురించి లోతుగా ఆలోచిస్తున్నప్పుడల్లా ఆ పాత్ర   గుర్తుకొస్తుంటుంది. గుర్తుకొచ్చినప్పుడల్లా రెండు మూడు రోజులు ఆలోచిస్తూ వుంటాను. మరి ఆమె చెప్పిన విషయమైతే సామాన్యమైన విషయంలా నేను భావించలేదు మరి. 


ముఖ్యంగా కథ రాయాలి అనుకున్నప్పుడల్లా నన్ను గురించి రాయి అని ఆమె అడుగుతున్నట్లే వుండేది.  రాసే సాహసం చేయలేదు అనను కానీ రాయకూడని విషయాలు కొన్ని ఉంటాయని గిరిగీసుకుని కూర్చున్నాను. సాధారణంగా  ధనబలం వుండి ఎవరేమనుకుంటే నా కేమిటి నా జీవితం నా ఇష్టం అనుకుంటూ జీవితం పట్ల  అమితాసక్తితో  విచ్చలవిడిగా విహరించేవారిని  మనం చూస్తుంటాం కదా ! ఆ కోణంలో చూస్తే ఆ పాత్ర అంత నాగరిక జీవనంలో జీవించిన పాత్రా కాదు. పెద్ద చదువుసంధ్యలున్న స్త్రీ లా కూడా అనిపించలేదు.  అలా అని ఆమె కడు పేదరికంలో జీవనం కొనసాగిస్తూ అవసరాల కోసం శరీరాలను ఫణంగా పెడుతూ  నిర్లక్ష్యంగా బ్రతికే తెగువ కల్గిన పాత్రా కాదు.  ఈ రెండు రకాల మధ్య గల మధ్యతరగతి జీవితం గడిపే కుటుంబ స్త్రీ అంత నిర్భయంగా నిస్సంకోచంగా   మసలగల్గినదంటేనే ఆశ్చర్యం నాకు. ఇప్పుడిక కథలోకి వెళదాం.


**************


పన్నెండేళ్ళ క్రితం వారం రోజుల్లో అమెరికాకు ప్రయాణమవుతున్న కొడుకును తీసుకుని శ్రీశైలం వెళ్ళాను నేను.  మధ్యాహ్నం పన్నెండుకల్లా అక్కడకు చేరుకున్న మాకు వసతి సౌకర్యం లభించేసరికి రెండుగంటల సమయం పట్టింది. మర్నాడు గురుపౌర్ణమి. పుణ్యక్షేత్రాలన్నీ రద్దీగా వుంటాయన్న సంగతి మర్చిపోయాను. ఎప్పుడూ విడిది చేసే సత్రానికి వెళ్ళి రూమ్ అడిగితే ఎంతమంది అడిగాడు. నేను అబ్బాయి అనగానే మా వంక పట్టి పట్టి చూసి కాసేపు ఆగండి అన్నాడు. అరగంట వేచివున్నా మాకన్నా వెనుక వచ్చినవారికి రూమ్ లు కేటాయిస్తూ మమ్మల్ని అలాగే నిలబెట్టాడు. అతని వద్దకు వెళ్ళి గోత్రం పేరు ఇంటి పేరు చెప్పాను. “ఖాళీ లేవమ్మా, ఇద్దరు వుంటే అసలు ఇవ్వడం లేదు” అన్నాడు. అబ్బాయి వంక నా వంక అతను చూసే చూపులు నాకు అవమానంగా అనిపించేయి.


 స్నేహితురాలికి ఫోన్ చేసాను. ఆమె బంధువులు ఎవరో వున్నారని తెలిసి,మాట సాయం చేస్తారని.  అప్పుడు ఆమె మాటలు వింటే నేను అబ్బాయి మాత్రమే ఎందుకు వచ్చామా అని చింతించాను. తల్లి కొడుకు కలిసి వెళ్ళినా అనుమానంగా చూసే రోజులు వచ్చేసాయి. పుణ్యక్షేత్రాల పవిత్రతను చెడగొడతన్నారని ఎవరికి పడితే వారికి రూమ్ లు ఇవ్వడం లేదంట. ఇరవై రాకముందే బిడ్డలు పుట్టి వాళ్ళు తాటిచెట్లలా పెరిగితే మనం నలబైల్లో వుండి వాళ్ళకు అక్కల్లా కనబడతన్నాం. నలుగురైదుగురు వుంటామంటే తప్ప ఇద్దరికి మాత్రం రూమ్ లు ఇవ్వడం లేదంట”అంది. 


“అమ్మ కొడుకు అని నిరూపించడానికి ఆధారాలు కూడా పట్టుకెళ్ళాలా.. ఆ సంగతి తెలిసి వుంటే అబ్బాయి పాస్ పోర్టు, రేషన్ కార్డు తెచ్చుకునేదాన్నిగా అని విసుకున్నాను. సత్రం రిసెప్షన్ లో రూమ్ లు ఇచ్చేవాడు  పిల్లాడిని నన్ను ఎంత  అనుమానంగా చూసాడో తెలుసా! ఎంత అవమానం అనిపించిందో నాకు. ఇంకెప్పుడూ ఈ సత్రానికి రాను. విరాళాలు రాయను” అన్నాను చికాకుగా. 


అక్కడి నుండి గంగ సదన్ కి వచ్చి రూమ్ తీసుకుని ప్రెష్ అయి భోజనానికి వెళ్ళడానికి కిందకు వస్తుండగా ముందెళ్ళిన  సత్రం గుమస్తా ఎదురై “ఇందాక పొరబాటు జరిగిందమ్మా, క్షమించాలి మీరు. భోజనానికి మన సత్రానికే రావచ్చు. ఇక్కడ ఖాళీ చేసి అక్కడికి వస్తే ఏసి రూమ్ ఇస్తామన్నారు” అన్నాడు.


 స్నేహితురాలి ఫోన్ సిఫారసు ఫలితం అని అర్థమై “వద్దులెండి. మీ రూల్స్ ఏమిటో తెలిసాయి కదా. ఈ సారి వచ్చినపుడు అన్ని వివరాలు తెలిసేటట్టు ఆధారాలు వెంట తెచ్చుకుంటాం అన్నాను విసురుగా. అసలు అబ్బాయి ముందు అలాంటి విషయం వొకటి చర్చకు రావడం నాకు ఇష్టం లేకపోయింది. 


ప్రదోషసమయంలో  మల్లికార్జునుడి దర్శనం అమ్మ వారి హారతి ప్రాతఃకాల అభిషేకం అమ్మవారికి కుంకుమ పూజ అన్నీ ప్రశాంతంగా జరిగిపోయాక.. నేను గుడిలో ప్రదక్షిణలు చేసుకుంటాను వస్తావా అని అడిగాను అబ్బాయిని. “రాత్రి సరిగ్గా నిద్రపోలేదమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను. నువ్వు తీరిగ్గా ప్రదక్షిణలు చేసుకుని రా” అని రూమ్ తాళం తీసుకుని వెళ్ళిపోయాడు.  నాలుగు ప్రాకారాల మధ్య చుట్టూ రద్దీగా సంచరిస్తున్న భక్తులను  తప్పించుకుంటూ  నేను కొన్ని ప్రదక్షిణలు చేసిన తర్వాత మా పక్కనే వున్న రూమ్ లో వున్నావిడ ఎదురైంది. నన్ను చూసి పలకరింపుగా నవ్వింది. పంచాక్షరీ జపిస్తూ వున్న నేను పట్టించుకోనట్టూ ముందుకు సాగాను. 


ఆమె పేరు మీనమ్మ అని చెప్పినట్టు గుర్తు. చామానఛాయ రంగుతో  కళగల ముఖంతో బలిష్ఠమైన ఆకృతితో చాలా ఉత్సాహంగా కనబడింది. మళ్ళీ తర్వాత ప్రదక్షిణలో వృద్ద మల్లికార్జునుడి గుడి దగ్గర ఎదురైంది. 


నవ్వుకుంటూ దగ్గరకు వచ్చి పలకరించింది. ఎన్ని ప్రదక్షిణ లు చేస్తున్నారు అని. నోరు విప్పక తప్పింది కాదు. అంతటితో ఆగకకుండా  ఏ ఊరు ఏం చేస్తారు అని వివరాలు అడిగింది. చెప్పిన తర్వాత “ తన పేరు చెప్పింది.  నా వయస్సు ఎంతనుకున్నావ్ “ అని అడిగింది  నా ప్రదక్షిణకు అంతరాయం కల్గిస్తూ, నడకలో నడక కలుపుతూ. 


చిరాకు పడ్డాను.  ఆమెను అంతకు ముందు రోజు దేవాలయం పరిసరాల్లో చూసాను. రాత్రి సత్రం భోజనశాలలో చూసాను. ఉదయాన్నే పాతాళగంగకు నేను దిగుతుంటే మెట్లెక్కుతూ ఎదురైతే చిన్న చిరునవ్వుతో పలకరించాను. ఇప్పుడీమె ఎదురై ఆరాలు తీయడం ఈ అసంబద్దమైన ప్రశ్న వేయడం. అసలు ఆమెకు ఎంత వయస్సు వుంటే నాకెందుకటా అని మనస్సులో విసుక్కుంటూనే అప్రయత్నంగా నలభై నలబై అయిదు మధ్య వుంటాయేమో అని సమాధానమివ్వగానే గలగలా నవ్వింది. “ఏబై నాలుగు” అంది. ఓహో అన్నట్టు చూసానేమో! 


“కాసేపు ఈడ కూర్చుందామా “ అని అడిగింది. కాదనబుద్ధి కాలేదు. త్రిఫల వృక్షాల క్రింద చప్టాపై కూర్చున్నాం. 


“ఎన్ని రోజులైంది!? మీరొచ్చి “ అన్నాను.


 “నెలా పదిరోజులైంది”


“ఎందుకు అన్ని రోజుల నుండి వున్నారు? ఏమైనా మొక్కు వుందా  లేదా మండల దీక్ష లాంటిదా”  


పకపకా నవ్వింది. గుండె జల్లుమంది. అప్రయత్నంగా లేచి నిలబడ్డాను. 

నిన్న సాయంత్రం రూమ్ శుభ్రం చేసే ఆమె మాటలు గుర్తొచ్చాయి.  వాళ్ళది కన్నడ రాష్ట్రం.  మనిషి చూస్తే  ఉత్సాహంగా ఆరోగ్యంగానే వుండట్టు వుంటుంది. చేష్టలు చూస్తే ఏమిటో పిచ్చి పిచ్చిగా గొణుక్కుంటూ చేతులు తిప్పుకుంటూ నవ్వుకుంటూ వుంటది. కొడుకు అనుకుంటా. రోజు రెండు పూటలా చేయి పట్టుకుని వదలకుండా తిప్పుకుంటా వస్తాడు. నలబై రోజులు నిద్ర చేస్తే పిచ్చి గిచ్చి తగ్గుద్ది ఒంటి మీద చేరిన దెయ్యాలు వొదులుతయ్యి అని చెప్పారంట. ఓపిగ్గా తిప్పుతున్నాడు బిడ్డ” అని. 


“కూర్చో బుజ్జమ్మా” అంటూ చేయి పట్టుకుని గుంజింది. బెరుకు బెరుకుగా కూర్చున్నాను. 


“నిన్ను చూస్తుంటే నా మనస్సులో వున్నదంతా విప్పి చెప్పుకోవాలని అనిపిస్తుంది” అంది. 


ఎందుకు అని అడగలేకపోయాను. మనిషి సాత్వికంగా ముఖం  పవిత్రంగా కళకళలాడుతూ వుంది.మాట్టాడకుండా ఆమె వంక నిశితంగా చూసాను.


“ నీతో వచ్చింది కొడుకా” అనడిగింది. 


“అవును, ఒక్కడే కొడుకు, వారం రోజుల్లో అమెరికా కి పై చదువులు చదవటానికి పోతున్నాడు. స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు అందుకుని పోవాలని వచ్చాం. అభిషేకం చేసుకున్నాం. స్వామి స్పర్శ దర్శనం అయింది. రాత్రికి బయలుదేరతాం” అన్నాను. 


“నాతో వుండింది నా కొడుకు అనుకొంటివా” అడిగింది. 


“అవును, అట్టాగే వున్నాడు, అలాగే అనుకుంటున్నా”


మళ్ళీ గట్టిగా నవ్వింది. నా చెవి దగ్గర ముఖం పెట్టి రహస్యం చెబుతున్నట్టు చెప్పింది. “అందరూ అనుకునేటట్డు  వాడు నా కొడుకు కాదు నా ప్రియుడు” అంది. 


ఆశ్చర్యపోలేదు వేగంగా ఆలోచించాను. సందేహం లేదు ఈమెకు నిజంగానే మతి భ్రమించి వుంటుంది. ఇంతకు ముందు తన వయస్సెంత అని అడిగింది ఇప్పుడిలా. తొందరగా ఈ మనిషిని వదిలించుకుని పోవాలి అనుకుంటూ చుట్టుపక్కల ఎక్కడైనా ఆమె కొడుకు కనబడతాడేమో అని చూపులతో గాలిస్తున్నాను. 


“నువ్వు నమ్మడం లేదు కదూ, నేను చెప్పింది నిజం బుజ్జమ్మా! దేవళంలో కూర్చుని అబద్దం ఎందుకు చెపుతాను. నన్ను నమ్ము” అంది దీనంగా.


“నీ నిజాలన్నీ నాకెందుకు, నన్ను వొదిలేస్తే నా ప్రదక్షిణ లు నేను చేసుకుంటా “ విసుగు ప్రదర్శించాను. 


“నా సొదే అనుకో నా కథే అనుకో అది కూడా వింటే నీకు పుణ్యం దక్కుద్ది అనుకో. ఇలాంటి కథ నువ్వెప్పుడూ విని వుండవు’’ అని ఊరించింది.


కథలంటే ఇష్టం కనుక “సరే చెప్పు మరి”అన్నాను వింటే కానీ వొదిలి పెట్టేటట్టు లేదని. 


“నేను  కాపు బిడ్డను. నెల్లూరు ఆత్మకూరు కాడ చిన్న పల్లె. పద్నాలుగేళ్ళ వయస్సుప్పుడు    రాయచూర్ కి వలసబోయిన కుటుంబంలో వాడికిచ్చి పెళ్ళిజేసారు. వొళ్ళు ఇరగ పనిచేయడం మొగుడు చెప్పినమాట ఎదురుచెప్పకుండా ఇనడం. మోటుమనిషి. ముగ్గురు బిడ్డల తల్లినయ్యానన్నమాటే కానీ  నేను మనసు నిండా సుఃఖ పడిందే లేదు. భర్త ప్రేమ దక్కిందే లేదు. అంతా అతుకుల బొంతే అనుకో. మన పెద్దాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే.. అందరూ అని కాదులే.. మా తాత లాంటోళ్ళు అనుకో ’’


చెప్పడం ఆపి కాసిని నీళ్ళు తాగింది. కథ వినే ఉత్సాహంలో ఆలస్యం భరించలేకుండా వున్నా నేను. 


“మా తాత పెద్ద కవి లే. కవిత్వం రాసేవాడు. గజళ్ళు చదివేవోడు. అందరికీ నోరార విప్పి చెప్పేవాడు. జమీన్ & రైతు చదివి వినిపిస్తా వుండేవాడు. మా నాయన చిన్నగా వున్నప్పుడే మా అవ్వ చనిపోయిందంట. మళ్ళీ పెళ్ళిచేసుకోకుండా నలుగురు బిడ్డలను సాకినాడు. రోజూ ఆయన  వొళ్ళో కూర్చుని ఇన్న మాటలే అనుకో, బాగా గమనం వుండాయ్. ఇట్టా అనేటోడు “ బొట్టా! మనిషన్న  వాడికి జీవితంలో అన్ని దశల్లోను ప్రేమ శాంతి దొరకాలి. సముద్రం నుంచి కొంత, అడవి నుంచి కొంత, నాయన నుంచి కొంత, అమ్మ నుంచి కొంత, సేయితుల నుంచి కొంత, భర్త నుంచి కొంత, బిడ్డల నుండి కొంత ఇట్టా అందరి నుండి కొంత కొంత గ్రాసం ప్రేమ జవురుకుంటే కానీ ఈ కట్టె చల్లారదు” అని. 


“ఆయనెందుకు చెప్పాడో కానీ ఆయన చెప్పినవేమి నాకెప్పుడూ దొరకలేదు. ఆకులుపోకలు అందుకున్నప్పుడు నుండి ఎదురు చూపే మిగిలింది. మొగుణ్ని మనసు నిండా కరువుదీరా కౌగలించుకున్నదే లేదు. ఈ ఆకలి శరీరానిది కాదు మనసుది. బిడ్డల పెళ్ళిళ్ళై మనవళ్ళు మనవరాళ్ళు పుడుతున్న కొద్దీ ముసలిదాన్ని అయిపోతన్నాను నా మనసు ఆకలి తీరకుండా ఏడ చచ్చిపోతానేమోనని వొకటే దిగులయ్యేది. నేను మాత్రం జీవమున్న ప్రతిదాన్ని నిండా కావిలించుకుంటాను. పిల్లలు, పిల్లల పిల్లలను,దూడను  పెయ్యను కుక్కను మేకను పిల్లిని ఆఖరికి అంతంతలావు మానులను కూడా వాటేసుకుంటాను.అయినా మనసుకు నెమ్మది లేదు. కంటినిండా నిదుర పట్టేది కాదు. ఆఖరికి నా ఆకలిని కనిపెట్టినవాడు ఒకడు కనిపించాడు. కుడియెడంగా నా కొడుకు వయస్సు వున్నవాడు. వాడిని తగులుకున్నాను. తప్పా ఒప్పా అని ఆలోచించలేదు నేను. శరీరానికేనా భోగానుభవం మనస్సుకు ఉండొద్దూ. ఆకలిగా వున్నప్పుడు అందుబాటులో వున్నది తిని ఆకలి తీర్చుకున్నట్టు మొగుడు పెళ్ళాం మధ్య  కాపురం సక్రమంగా  వర్దిల్లినా  వాళ్ళ మధ్య గాఢానురాగం లేకపోతే అది ఓటి కుండ లెక్క. నలబై ఏళ్ళ కాపరంలో మొగుడి గుండెల మీద పడి ఆదమరించిది లేదు. నా మనస్సు సేదదీరింది లేదు. కంటికి కనబడని నరమానవుడికి తెలియని వియోగ దుఃఖం ఏదో  ఎప్పుడూ నన్ను అతుక్కొని వుండేది.  అందుకే దైర్యం చేసా. ఈ నలబై రోజులు వాడు నన్ను ప్రియంగా చూసుకున్నాడు. వాడు నా ఆకలిని గుర్తించాడో అశాంతిని కనిపెట్టాడో ఆర్తిని అర్దం చేసుకున్నాడో కానీ నలభై రోజుల నుండి మరో లోకం చూయిచ్చాడు. స్వర్గం అంటే ఇట్టాగే వుంటదేమో అనిపించింది అనుకో. ఇప్పుడు నా మనసుకు తృప్తిగా నెమ్మళంగా వుంది. ఇట్టా చేసినందుకు నేనేమి సిగ్గుపడటం లేదమ్మాయ్! పాపభీతి బిడియం నన్నేం తరుముకొస్తలేదు. దేవుడు సాచ్చిగా చెబుతున్నా, నువ్వు నమ్మాలి” అంది. 


ఆశ్చర్యమో అసహ్యమో అయోమయమో ఏమో తెలియదు. ఇది నిజమా అబద్దమా అన్న ఆలోచనా లేదు. నోట మాటరాలేదు. ఎలాంటి మనిషిని విన్నాను. ఇంత దైర్యమా, తెంపరితనమా! పైగా అపరిచితురాలినైన నాకు కూర్చోబెట్టి మరీ చెపుతుంది అని నివ్వెరపోయి కళ్ళు విప్పార్చుకుని ఆమెనే చూస్తూ..  ఔనా! అని మాత్రం అనగల్గాను. 


మళ్ళీ చెప్పడం మొదలెట్టింది. 

“మొన్న మా ఊరు వాళ్ళు కనబడ్డారు. ఊరంతా గోలగోలగా వుంది. నువ్వు ఈడ వుండావా అని ఆశ్చర్యంగా అడిగారు. ఈపాటికి నేను ఈడ వుండానని నా కుటుంబానికి ఉప్పు అందేవుంటంది. నా మొగుడో పిల్లకాయలో రేపో మాపో వచ్చి ఇక్కడ వెతుకుతారు. నన్ను తీసుకునిపోతారు. పరువు కోసం అసలు విషయాన్ని  గంప కింద దాపెట్టి   తీర్ధయాత్రలకు వెళతానంటే   వద్దంటున్నామని ఎవరితో చెప్పాపెట్టకుండా   గుళ్ళు గోపురాలు చూడటానికి  పోయిందని  అని చెప్పుకుంటాడేమో నా మొగుడు”  చెప్పడం ఆపి మళ్ళీ గల గలా నవ్వింది. 


“ఒకవేళ ఇదంతా తెలిసి ఈ ముసలిముండకు రంకు మొగుడు కావాల్సొచ్చిందా అని కోడళ్ళు అసహ్యించుకున్నా, కూతురు చీదరగా చూసినా, జవసత్వాలు చచ్చిన మొగుడు రొప్పుతూ కాళ్ళతో కుమ్మినా లెక్కపెట్టేదే లేదు. ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు నాకు  కావాల్సింది నాకు దక్కించుకున్నాను. ఈ తృప్తి చాలు నాకు “ అంటూ గర్వంగా సంతృప్తిగా నవ్వింది. 


నేను నోటమాట రాక వింటూ వుండిపోయాను.


ఇంకో సంగతి చెప్పనా నీకు, ఇక్కడ నిత్యం  పాతాళగంగకు పోయి పచ్చలబండను చూసివస్తాను. ఎందుకో తెలుసా! కూతురిని మోహించిన రాజు ని పచ్చలబండవై పడివుండమని శపించింది అంటగా. మరి నేను కొడుకు వరుసయ్యే వాడిని మోహించాను కదా! లోలోన నేను ఏ బండను అవుతాననే భయం అనుకుంటా.  మనిషి బతికివుండగానే కోరికతో పెయ్య కాలుతుంటే చచ్చినాక వచ్చే పాపపుణ్యాల గురించి చింత ఎందుకంటా అంటా నేను. నువ్వు ఏమన్నా అనుకో,ఎవురికో వొకరికి నా లోపలి బాధ చెప్పుకోకపోతే కుమ్మరి పురుగు తొలిచినట్టు మెదడును ఈ విషయం తొలిచేత్తా వుంటంది. అందుకే చెప్పుకుని తెరిపిన పడ్డా. ఇప్పుడు మనసంతా తేలిగ్గా వుంది” 


వింటున్న నాకు ఆమె చెప్పిన విషయం జీర్ణం కావడానికి సమయం పట్టేట్టు అనిపించింది. ప్రశాంతంగా ప్రదక్షిణలు చేసుకుంటూ వున్న నన్ను కదిలించి మరీ  ఒక విధమైన షాక్ యిచ్చింది. 


“వస్తాను బుజ్జమ్మా! వాడు కూడా బయలుదేరతానంటున్నాడు. పెళ్శి కావాల్సిన పిల్లోడు. వాడన్నట్టు  రేపో మాపో మా  వాళ్ళ కంటబడి నలుగురు నోళ్ళల్లో నానడం ఎందుకు చెప్పు? నేను కూడా ఈ రూమ్ ఖాళీ చేసి మా కన్నడ సత్రంలో రూమ్ తీసుకుంటా. పోయొస్తా! రహస్యాలు నేను దాచుకోలేనబ్బా పొట్టపగిలిపోద్ది” గలగలా నవ్వుకుంటూ వెలుపలి ద్వారం వైపుకు నడుచుకుంటూపోయింది. 


ఆ క్షణంలో విచిత్రంగా ఆమె పట్ల నాకు అసహ్యం కల్గలేదు. అభావంగా ధ్వజస్థంభం దగ్గరకు చేరుకుని చేతులు జోడించి నమస్కరించుకుని తిరిగి ప్రదక్షిణ ప్రారంభించాను. 


నేను రూమ్ కి చేరేసరికి మీనమ్మ రూమ్ లో పిల్లలతో కూడిన కుటుంబం కనబడింది. 


రాత్రి బస్టాండ్ లో  మీనమ్మ ఇద్దరు ముగ్గురు మనుషుల మధ్య కూర్చుని తనలో తనే మాట్టాడుకుంటూ తేడాగా నవ్వుకుంటూ చెదిరిన బొట్టు చిరిగిన జాకెట్ తో కనబడింది. ఆమెనే చూస్తున్న నన్ను చూసి నవ్వింది. 

విషయం అర్ధమై పలకరిద్దామని దగ్గరకు వెళ్ళాను. కన్నడ యాస తెలుగు లో  “అమ్మా, కాస్త దూరంగా వుండమ్మా,ఆమె కు మైండ్ సరిగా లేదు, మనుషులను కొడతంది రక్కుతుంది’’ అన్నాడు వయసు మళ్లి తల నెరిసిన అతను.


నేను మీనమ్మ వైపు అనుమానంగా చూసి వెనక్కి జరిగాను. 


“అవును,నేను కొడతా,తిడతా,రక్కుతా,  అంతా నా ఇష్టం. నువ్వు నా పతి దేవుడివి పతి దేవుడివి,పతిదేవుడివి, సుగంధం తెలియని రాతి దేవుడివి” రాగం తీసింది.


“నెలన్నర అయింది ఇల్లు ఇడిచి. ఏడేడో తిరిగాం. ఆఖరికి ఈడ దొరికింది. పిచ్చి ముదిరిపోయింది” అన్నాడు. మనసులో నవ్వుకున్నాను.


మేము ఎక్కిన బస్ కదిలేటప్పుడు విండో సీట్ లో కూర్చున్న నన్ను చూస్తూ.. 


“ బుజ్జమ్మా, నన్ను గుర్తుంచుకో, టాటా’’ అని చెయ్యి వూపింది.నేను చెయ్యి ఊపాను. “ నువ్వు పిచ్చి వాళ్ళతో కూడా ఫ్రెండ్ షిప్ చేస్తావమ్మా” అన్నాడు నా కొడుకు నవ్వుతూ.


************

కథ అయిపోయింది. 


ఆనాడు ఆమె చెప్పిన విషయం సామాన్యమైన విషయం కాకపోబట్టే  ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆలోచించి చూస్తే.. అదొక ఆశ్చర్యకరమైనదిగా తోస్తుంది. 


మీనమ్మ కోణంలో  నుండి చూస్తే ఏది పవిత్రం, ఏది పాపం ఏది పుణ్యం.  ప్రతి మనిషి కోర్కెల పుట్ట. ఆ పుట్టలో నిదురించిన సర్పాలెన్నో! అవకాశం దొరికిన చోట దైర్యం వున్నవాళ్ళు పాపపుణ్యాల భీతి లేనివారు బిడియాలను సంకోచాలను వొదిలి తమకు కావాల్సింది పొందుతారు. మిగిలిన వారు నీతినియమాల పేరిట వారిపై కొరడా ఝళిపించాలనుకుంటారు. 


సహజీవనాలు తప్పుకాదు అని చెప్పుకుంటున్న ఈ కాలంలో మీనమ్మ ను నేనెలా తప్పు పట్టేది? అలాగని ఎలా సమర్దించేది!? వావివరుస లేకుండా బాబాయి కొడుకుతో అక్రమ సంబంధం నెరిపే బంధువుల అమ్మాయిని చూస్తూ,  సొంత పిన్ని కూతురినే గర్భవతిని చేసిన ఇంజినీరింగ్ చదివే యువకుడు గురించి విని.. ఏమిటీ కాముక లోకం! ఎక్కడుందీ లోపం!? అమలిన శృంగారం గుమ్మరించిన పూర్వ కథలు హాస్యాస్పదం అని పిల్లలకు  సెక్స్ ఎడ్యుకేషన్ ముఖ్యమని వాదించే వారిని చూస్తూ  సెక్స్ ఎడ్యుకేషన్ పోర్న్   ఒకటి కాదు అని వొప్పించడానికి ప్రయత్నించే నేను ఈ కథ కాని కథ గురించి రాయటానికే సంసిద్దురాలినయ్యాను. విజ్ఞత విచక్షణ వున్నవాళ్ళు ఎప్పుడూ వుంటారు. అవి లేని వారి గురించే మనం జాగ్రత్త పడాలి. చలం రాజేశ్వరి ని దాటి మనం చాలా ముందుకువచ్చాం. రాయడానికి చర్చించడానికి ఇంకా సంకోచాలు వుంటే ముందు ముందు లోకం ఏమికానున్నదో. మీనమ్మ భర్త లాంటి భర్తలకు భార్యల హృదయాన్ని టార్చ్ వేసి చూపించాలి కదా! 


విలువలు మారుతున్నప్పుడు రచనలు కూడా మారాలి కదా! మంచినీళ్ల ప్రాయంగా  ఎల్లప్పుడూ నీతులు వల్లించడం  ఏదైతే వుందో అది మురుగునీటి గుంటను శుభ్రం చేయాలనుకుని అందులో గంగాళం మంచినీటిని గుమ్మరించినట్లు వుంటుందని నాకనిపించింది. 


అందుకే  మీనమ్మ కథ ఇప్పుడిలా మీ ముందుకొచ్చి కూర్చుంది. పన్నెండేళ్ళు నా ఆలోచనల్లో మోసిన బరువును మీరు మోయాలిపుడు. అన్నట్టు మీనమ్మ ను వొకటి అడగడం మరిచాను. మీరు పుస్తకాలు చదువుతారా, మీ తాతగారు చలం పుస్తకాలు కానీ మీతో చదివించారా అని. ఆమె చలం పాత్ర అనిపించింది మరి. ఆమె ఎక్కడైనా ఎదురైతే మీరీ విషయం అడగడం మర్చిపోవద్దే. 


****************౦*****************


#ఈస్తటిక్_సెన్స్ కథాసంపుటిలో స్వీయ ప్రచురణ.