spiritualtales లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
spiritualtales లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, అక్టోబర్ 2018, బుధవారం

రస స్పర్శ





నిశ్శబ్దం నిశ్శబ్దం .. భయంకరమైన నిశ్శబ్దం. నా  లోలోపల మాట్లాడుకునే మాటలే నాకు వినబడని నిశ్శబ్దం.  అమావాస్య రాత్రిలా  నన్ను చుట్టేసిన నిశ్శబ్దం. మైనస్ డిగ్రీలలో వెచ్చని రజాయిలా నన్ను అంటిపెట్టుకున్న నిశ్శబ్దం. నిశ్శబ్దంలో నుండి  నిశ్శబ్దంలోకి ప్రయాణిస్తూ నేను. ప్రచండమైన మనో వేగంతో యిల్లు నగరాలు దేశాలు ఖండాలు దాటి దట్టమైన  కీకారణ్యంలో ప్రవేశించాను. అక్కడ కూడా నిశ్శబ్దమే. నేను మనుషులకి దూరంగా కదా పారిపోయి వచ్చింది. ఇన్నాళ్ళూ వాళ్ళకు యిష్టంగా నాకు కష్టంగా వాళ్ళకు కష్టంగా నాకు యిష్టంగా మాట్లాడే శబ్దాల నుండి వెఱచి చేస్తున్న ప్రయాణం కదా యిది. పక్షుల కిలకిల రవాలని  కూడా అసహ్యించుకున్నానేమో..అవి కూడా వినబడని గాఢమైన నిశ్శబ్దంలో దారీతెన్నూ లేక నడుస్తూనే వున్నాను. ఊటలా పుట్టే ఆలోచనలపై కూడా  నిశ్శబ్దమనే పెద్ద బండపడి యెందుకు నడుస్తున్నానో తెలియని  సృహలో  నిసృహగా నడుస్తూనే వున్నాను. అలా పగలురాత్రెరుగని ప్రయాణంలో నిస్సత్తుగా మారి శరీరం గాలిలో తేలిపోతూన్నట్లు అనిపించి  కాసేపు విశ్రమించాలని అనుకున్నాను. ఉన్నచోటనే పడిపోయాను. రాళ్ళు ముళ్ళు వున్న సృహే  లేదు.

ఆ అచేతనావస్థలో అకస్మాత్తుగా   చెవులనుండి ఆత్మని చేరిన సంగీత ప్రవాహం. అనాదిగా వున్న నిశ్శబ్దంలో నుండి జనియించిన శబ్దం. అది సృష్టించిన అలజడిలో నుండి మేల్కొని చుట్టూ పరికించి చూడాలనుకున్నాను. కానీ కనులు తెరవలేకపోతున్నాను. నా విశ్రాంతిని,  నిశ్శబ్దాన్ని భగ్నం చేసిన ఆ శబ్దంపై  అంతులేని ద్వేషం కల్గింది. పైకి లేవలేక కుప్పకూలిపోయాను. లోకంలో వూరేగాల్సిన గాలినంతా యెవరో  పోగేసుకున్నట్లు దానిని పూరించి శబ్దాన్ని సృష్టిస్తూ వున్నట్లు అనిపించింది. వింటూ వింటూ నుండగా  ఆ  నాదంలో యేదో మహత్తర శక్తి వుందనిపించింది .  క్రమేపీ ఆ శక్తి నాలో ఆణువణువూ ఆక్రమించింది. నన్ను  నిద్రాణంలో నుండి బయటపడేసిన ఆ శబ్దాన్ని సృష్టించిన  వైతాళికుడిని చూడాలనుకుని లేచి కూర్చున్నాను.  ఈసారి శ్రమ పడకుండానే కళ్ళు మాములుగా తెరుచుకున్నాయి. మైళ్ళ దూరందాకా  విస్తరించిన ఊడల మఱ్ఱిచెట్టు మొదలునానుకుని విశ్రాంతంగా రాజసంగా కూర్చున్నాడతను. అరమోడ్పు కన్నులతో వెదురుకర్రపై వేళ్ళు కదిలిస్తూ పెదవులతో గాలిని వూయిస్తూ లోకాలలో పనిలేనట్టు తన లోకంలో మునిగిపోయి వున్నాడు.  నాకు దాహంగా వుంది అని అరిచాను.  అతను ఆ వెదురుకర్రని వూదటం ఆపేసి నెమ్మెదిగా లేచొచ్చి  తండ్రిలా నా చేయి పట్టుకుని నడిపిస్తూ తీసుకెళ్లి  సముద్రం ముందు నిలబెట్టాడు. అతన్ని పట్టించుకోవడం మానేసి సముద్రాన్ని చూస్తున్నా. కెరటాలు వువెత్తున్న వచ్చి భూమిని తన తలతో కసితీరా బాది  వెనక్కి వెళుతున్నాయి. అలసిపోతూ వున్నాయి. మళ్ళీ అంతలోనే వొచ్చి  తనప్రతాపం చూపుతున్నాయి.  ఎందుకో భూమిపై జాలేసింది. సముద్రం పొగరు అణచాలనిపించింది.

సముద్రానికి స్ట్రా వేసి తాగుతున్నా ..తాగుతూనే వున్నాను. ఎంత తాగినా దప్పికారడం లేదు. సముద్రమంతా యెండిపోతుంది. చేపలన్నీ,తిమింగలాలన్నీ యెగిరిపోతున్నాయి. నక్షత్రాలన్నీ నా చుట్టూ వెలుగుతున్నాయి. కనిపించినంతమేరా పూలపొదలు,ముత్యాల, పగడాల, బంగారు రాసులు. చిన్న పువ్వునైనా కోసుకోవాలని కానీ ముత్యాల  పగడాల రాశులని  తాకాలని కానీ నాకనిపించలేదు.  ఒక్క క్షణం నేనెవరిని ..అసలు నాకూ ఈ లోకానికి సంబంధమేమిటీ అన్న సందేహం వచ్చింది. తెలుసుకోవాలనిపించింది. మరుక్షణంలో అసలీ లోకంతో నాకు పనేమిటీ, నేను నేనే. నేను మాత్రమే నిజం అన్న అహం ఆవరించింది. తలెత్తి చూసాను. భూమి చాలా మైళ్ళ యెత్తులో,శిఖరాలు అంతకన్నా యెత్తులో కనబడుతూ వున్నాయి. నేనిక్కడ దాకా యెందుకు వచ్చాను,  అసలక్కడ లేనిది యిక్కడ వున్నది యేమిటన్న  సందేహం ముంచుకొచ్చింది. హఠాత్తుగా నాలోపల ఒక మనిషి వున్నాడని గుర్తుకువచ్చింది . వాడికి అన్నీ వున్నాయి అనుకోగానే  ఆకలి గుర్తుకొచ్చింది.  చుట్టూ చూసాను. తినదగిన ఆహార పదార్ధాలేవి  యెక్కడా కనబడలేదు. ఆఖరికి నీళ్ళు లేవు, గాలి లేదు, యేవీలేవు.  కానీ నేనున్నాను. అసంతృప్తి నిండిన నేనున్నాను.  నాకేమికావాలో తెలిసిన సృహలో  కొంత వినయంగానూ, తెలియని అజ్ఞానంలో కొంత అమాయకంగానూ, నాకేమి తెలియాల్సింది లేదన్న అహంకారంతో  కొంత నిర్లక్ష్యంగానూ సంచరిస్తూనే  వున్నాను.

ఉన్నాను, అలాగే సంచరిస్తూనే వున్నాను.మంటలు మంటలు నా చుట్టూతా మంటలు మంటలమధ్య కూడా నడుస్తూనే వున్నాను.అందులో దహించబడతున్నానేమోనని   భయం కల్గింది కానీ నాకు యిసుమంత వేడి తగలడంలేదు దూదిలా తేలి తేలి పోతున్నాను. ఎందుకంటే నాలో ఉన్న ఆరునదులను దాచుకుని వున్నందునేమో. ఆ ఆరు నదులు అగ్నికి లోబడి దహించనిదే నేను చేరుకోవాల్సిన గమ్యం నాకు కనబడదేమోనన్న దిగులు ఆవరించింది .   నిరాశగా నడుస్తూనే వు న్నాను. కొన్నాళ్ళకి   ఆ అగ్ని శిఖల మధ్య అతను. చిత్రంగా అతని చుట్టూ ఒక చీకటి  వలయం. ఆవలయంలో కూర్చుని శిల్పాలు చెక్కుతూనే వున్నాడు అతని చుట్టూ వున్న బండరాళ్ళన్నీ  శిల్పాలు గా మారుతూనే వున్నాయి..కొన్నాళ్ళకి  ఆ శిల్పాల అర చేతిలో దీపపు ప్రమిదలని  చెక్కుతున్నాడు. చెక్కడం పూర్తైన తర్వాత నోటితో ఉప్ మని వూది వాటినన్నింటిలో  నూనెని నింపాడు.  తరువాత  అన్నింటిని చేతితో తాకుతూ వెళుతున్నాడు. దీపాలు  వెలుగుతున్నాయి  కానీ కానీ అక్కడ వెలుగు లేదు. అక్కడ  ఆవరించిన భయంకరమైన  చీకటిలోకి  వూపిరి ఆడటంలేదు. దీపాలని వెలిగించి వెలిగించి అతను చెట్టుని ఆనుకుని కూర్చుని వెదురుకర్రని ఊదడం మొదలెట్టగానే దీపాలన్నీ వెలుగుతున్నట్లు గాలికి వూగుతున్నట్లు కనబడింది నాకు. విసుగనిపించింది. మెల్లగా ఆ వలయం మధ్య నుండి బయటకి చేరుకున్నాను  అక్కడపుడు అగ్ని లేదు. మళ్ళీ సంచారం. 


 కొన్నాళ్ళకి  ఓపిక సన్నగిల్లింది. తూలిపడిపోబోతున్న నన్నొక ఆత్మీయ హస్తం పట్టుకుని నిలబెట్టింది. మెత్తని  పచ్చిక తివాచీపై కూర్చుండబెట్టి ఈ లోకానికి అతిధిగా వచ్చావ్, క్షుద్భాధతో అలమటించడం నాకు బాధ కల్గిస్తుంది. రా .. వచ్చి ఆరగించు అన్నాడు  చేతితో దగ్గరగా వున్న రకరకాల ఆహారపదార్ధాలవైపు చూపుతూ.   తొలిసారిగా నాతో మాట్లాడుతూన్న అతని వైపు చూస్తూ    ఓహ్ ..నన్ను  యిప్పుడితని అతిధిని అంటున్నాడు. అతిధి మర్యాదలు చేయకపోతే నామోషీ గాబోలు, కనీసం  ఆకలి తీర్చేటప్పుడైనా అమ్మలాగా అనిపించ వచ్చు కదా !  ఆ ఆహారపదార్ధాలలో కాస్త మధురమైన ప్రేమని రంగరించి  కొసరి కొసరి తినిపించవచ్చుకదా !  ఏదో మొక్కుబడిగా పిలిచాడు. నేనెందుకు వెళ్ళాలసలు అని బీరాలు  పోయాను.  ఆకలి సంగతి మరిచి ఆసలెక్కడికి వెళ్ళినా అతనే యెందుకుంటున్నాడో అని ఆలోచన చేస్తూ ఆ ఆహార పదార్ధాలనుండి దూరంగా జరిగి  వో  రాతిపై కూర్చుండి పోయాను.

అతను ఎప్పటిలాగానే   చెట్టు క్రిందనే కూర్చుని దట్టీ లో నుంచి వెదురు కఱ్ఱని తీసి పెదవులకి ఆనించాడు. ఎప్పటిలాగానే నేనొకరకమైన  మైకంలో  కనులు మూసుకుని పోతుండగా నా అంతరంగం ఒకటి గుర్తుచేస్తుంది.ఈ సుందర వుద్యాన వనాలు, లతలు, ఫలపుష్ఫాదులు, ముత్యాల పగడాల రాసులు, గాలిలో తేలిపోయినట్లుండే యీ సంగీతం వినడం, మధుర పదార్ధాలు ఆరగించడం యివేమి కాదే నేను కోరుకున్నది. నాకు కావాల్సినది మరేదో, అదేమిటో హృదయానికి తెలుసు కానీ ఆలోచనకేమాత్రం అందనంటుంది.  శతాబ్దాల విరహంతో మనసు వేగిపోతుంది. హృదయం అలమటిస్తుంది.  ఆ యాతనని  చెప్పటానికి సమయం ఆసన్నమైంది కానీ నోరు పెగలనంటుంది. ఎట్టకేలకూ  అంతరంగంలో జ్వలిస్తున్న కోరిక ముందుకు తోసుకొచ్చింది. అవును నేను నా సఖుడిని కదా కోరుకున్నది. అతడే యీతడు కావచ్చు కదా అని తోచింది. తోచినదే తడవుగా  నేను నా అహాన్ని  త్యజించి బిడియం విసర్జించి  అతడు మాత్రమే సత్యం అన్నది  గ్రహించి జ్ఞాన వస్త్రాన్నికప్పుకుంటూ చేతులు చాచి  రా రమ్మని ఆహ్వానిస్తూ  అతని ముందుకు నడిచాను. అతను నా వైపు చూడనైనా చూడలేదు. తన లోకంలో తాను మునిగి వున్నాడు.  నాచుట్టూ మాయమైన సముద్రమంతా దుఃఖంలా మొలుచుకొస్తుంది. అందులో నేను మునిగిపోతున్నాను. దీనంగా అతనిపైనే దృష్టి నిలిపి నీ బాహుబంధాల మధ్య క్షణమైనా నన్ను విశ్రమించనీయి. ఎన్నివేల లక్షల   యోజనాలు తిరిగి తిరిగి వెతికాను నిన్ను. నిన్నిప్పుడే తెలుసుకున్నాను. నీ సమక్షంలో  గొప్ప శాంతిని పొందిన అనుభవాన్ని రవంతైనా  మిగలనీయ కూడదా, వేదనతో అలమటిస్తున్న నా  ఆత్మ రోదన వినిపించడం లేదా అని మౌనంగా నా మాటని  నివేదిస్తున్నాను. కళ్ళనిండా వున్న నీళ్ళను కమ్మేస్తూ మహా సముద్రం నన్ను ముంచేసింది.

సృహ వచ్చి చూసుకునే సరికి అతని ఆలింగనంలో నేను.  నన్ను రక్షించాడతను.సంతోషంతో నిలువెల్లా వూగిపోయాను.  సఖా ! నేను నువ్వు వేరు  వేరు కాదు  కదా,  మనం ఆత్మ ముద్రలం కదా అని గుస గుసగా అడుగుతూ, నా స్వరం నాకే కొత్తగా వినబడుతుంటే ఆశ్చర్యంగా కనులు విప్పాను. నాతలకి దగ్గరగా అతను  తలని వొంచి  దయాపూరితమైన ధృక్కుతో వాత్సల్యంతో నన్ను చూస్తూ   నీ అశాంతి మాయమైందా  అని అడిగాడతను . మాయం చేయడం నీ చేతిలో పని కదా, మళ్ళీ అశాంతి వొడ్డున నన్ను వొదిలేయకు. నన్ను నీ ఆలింగనంలోనే బంధించి ఆ పారవశ్యసౌఖ్యాన్ని శాశ్వతం చేయి అన్నాను. అతను మాట్లాడ లేదు. తలనెత్తి సాలోచనగా పైకి  క్షణకాలం   చూసి కనులు మూసుకున్నాడు. ఆ గడ్డం క్రింద  నొక్కుని చూస్తూ అతన్ని మరింత గట్టిగా హత్తుకోబోయాను. సుతిమెత్తని స్పర్శలో యేదో లోపించింది. మరుక్షణం మనసుకి  వుక్కపోసినట్లయింది. అప్రయత్నంగా అతని నుండి విడివడ్డాను.క్షణంలో నన్నావరించిన తేజస్సంతా తటిల్లతలా మెరిసి గాఢాంధకారంలో కలిసిపోయింది.  అర్ధమైంది, నేను అలమటిస్తున్నాననే జాలి దయతోనే  అతను నన్ను దగ్గరకి తీసుకున్నట్లు.   సంపూర్ణమైన ప్రేమతో  అక్కున జేర్చుకోని అతని  ప్రియ సాన్నినిధ్యం  నాకు మాత్రం వెగటు కల్గించదూ. పొతే పోనీయి లే అని నన్ను నేను స్థిమిత పరుచుకున్నాను. మరుక్షణంలోనే  నా ప్రేమలో నిస్వార్ధం, నా వాంఛలో పరిపూర్ణం గోచరించనిదే అతను మాత్రం యెలా స్వీకరించగలడు అని ప్రశ్నించుకున్నాను.  అతను క్రమేపీ నా మానసంలో నుండి కూడా అదృశ్యమై పోయాడు. వెనువెంటనే  అవ్యక్తమైన  దుఃఖం నన్నావరించింది. మృత భారమైన శరీరాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ వున్నాను.ప్రేమించడం అంటే మనని మనం గాయపరుచుకోవడమేకదా! గాయాలను మాన్పుకుంటూ మరింత ప్రేమించడమనే మార్గం ద్వారానే అతన్ని చేరుకోగలననిపించింది.

దేహం పొరలు పొరలు  తొలుచుకుంటూ నెమ్మెదిగా బయటకి వస్తుంది. తడిచిన మోచేయి చల్లగా ముఖానికి  తగులుతుంది.ఎవరో పై అంతస్తులో గతా గతా నడుస్తున్న శబ్దం. తోడుగా తలుపుపై మునివేళ్ళ శబ్దం. బలవంతంగా నెమ్మదిగా కళ్ళు తెరిచి యెదురుగా  వున్న కిటికీ వైపుకి చూసాను. దూరంగా గాలికి కదులుతున్న ఫైన్ వృక్షపు కొమ్మలు. అద్దాల తలుపులని బద్దలు కొట్టుకుని మరీ వచ్చిన   బుచుకు  బుచుకు మనే శబ్దం. అప్రయత్నంగానే లేచి కిటికీ ప్రక్కన నిలబడి  అద్దానికి ఆవల చూస్తే రోజ్ గ్రీక్ పూల పొదలపై తుమ్మెదల సంచారాన్ని చూసిన ఆనందంతో పేటియా రైలింగ్ పైన చక్కర్లు కొడుతూ గొంతువిప్పిన పక్షి.  తిరిగి మొదలైన అవుట్ ఫుట్ రొద. దూరంగా కూతవేస్తూ వెళుతున్న లోకల్ ట్రైన్ నా లోపలి  నిశ్శబ్దాన్ని పూర్తిగా భగ్నం చేస్తూ.



                            (ఇదొక అనుభవైకవేద్యం)

30, అక్టోబర్ 2017, సోమవారం

వితరణ

వితరణ (కథ )

 

చదవండి ఫ్రెండ్స్ .. (ఉషోదయ వెలుగు పత్రికలో ప్రచురణ )


దసరా పండుగ వస్తుందంటేనే సరదా ఇంటి గుమ్మం ముందు తచ్చాడుతూ ఉంటుంది. రోజంతా బద్దకంగా చేసే ఇంటిపనిని త్వరత్వరగా ముగించుకుని సంప్రదాయంగా చక్కగా ముస్తాబై ..రోజుకొక అలంకారంలో శోభిల్లే అమ్మని కనులారా వీక్షిస్తూ మనసారా ధ్యానిస్తూ .. పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో గడపడమంటే ఎంతో ఇష్టం వైష్ణవికి. కానీ ఈసారి ఆమెకి పూర్తి అవకాశం చిక్కలేదు సెలవలకి వచ్చిన పిల్లలతో, వారిరాకని పండుగగా భావించి వచ్చిపోయే బంధుమిత్రులతో ఇల్లంతా సందడిగా ఉంది. తెల్లవారుజ్హామునే లేచి గుడికి వెళ్ళింది. గుడి చుట్టూ ప్రదక్షణం చేసుకుని ..గుడి ఆవరణలో పద్మాసనం వేసుకుని కూర్చుని మౌనంగా అమ్మని ప్రార్ధించుకోసాగింది.

ఆమె ప్రశాంతతని భగ్నం చేస్తూ "ఏమ్మా..శాంతమ్మ గారూ! బాగున్నారా ? చాలా రోజుల తర్వాత చూస్తున్నాను మిమ్మల్ని " అంటూ ఎవరిదో పలకరింపు. "దేవుడి దయ వలన అంతా బాగున్నారు. మనమరాలి చదువు పూర్తైపోయింది. ఇక ఇంటికి వచ్చేసాను. అయిదేళ్లపాటు రోజూ ఉదయాన్నే తన దర్శన భాగ్యాన్ని కల్గించిన కంచి కామాక్షి ఇక మీ ఊరు వెళ్ళమని చెప్పింది. అమ్మ అజ్ఞ ఇస్తే తప్పుతుందా ? " అంది.

"అదృష్టవంతులు, అన్నేళ్ల పాటు రోజూ ఆమె దర్శన భాగ్యం కల్గింది మీకు. నాకు ఒక్క రోజు కూడా సెలవీయదు ఇల్లు. ఏదో ఇంటికి కూసింత దూరంలో ఉన్నాను కాబట్టి ఈ గుడికైనా రావడం".. అంది మీనాక్షమ్మ.

"మా వూరు వెళ్లి అక్కడే ఉందామనుకునే లోపే అక్కడొద్దు. ఆ ఇల్లు అమ్మేస్తున్నాం, వచ్చి మా పుట్టింట్లో ఉండండి అంది కోడలు విజయ. అదీ అమ్మ ఆజ్ఞే అనుకుంటున్నాను"

"అత్తా కోడలు ఒకే ఇంటి ఆడపడుచులు కదా ! అన్నదమ్ములతో కలిసి ఉండే అదృష్టం దక్కిందని భావించాలి మీరు" .

"అంతే,అంతే ..ఎనబై యేళ్ళ వయసులో పుట్టిన ఇంటిలో ఉండే భాగ్యం రోజూ చీకటితో దేవుడికి సేవచేసుకునే భాగ్యం ఇచ్చిన భగవంతుడిని యేమి కోరుకోను ..అందరూ చల్లగా ఉండాలని తప్ప." ..అంది శాంతమ్మ.

"మీ అబ్బాయి ఆర్ధిక పరిస్థితి బాగోలేదని వింటున్నాను,నిజమేనా" అని అడిగింది మీనాక్షమ్మ.

" పది లక్షల అప్పుంటే కోట్లు అప్పు ఉన్నాయని చెప్పుకోవడం లోకం తీరు. ఏమిటో, వాడికి అన్నిటిలోనూ ఎదురే. యే వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా కలిసి రావడం లేదు. అందులో ఇద్దరు పిల్లలని డొనేషన్ కట్టి మెడిసన్ చదివించడం అంటే మాటలా ! చెప్పండి. ఏవో వొడిదుడుకులు ఉన్నమాట వాస్తవమే కానీ ..అంత అప్పుల బాధ లేదు. వాడికేమిటమ్మా,కోట్లు ధర పలికే ఇరవై ఎకరాల భూమి ఉంది. భగవంతుడి దయ ఉంటే అన్నీ దాటేయవచ్చు.."అని చెపుతున్న ఆమెని ఆసక్తిగాను,అబ్బురంగానూ చూసింది వైష్ణవి. జీవితాన్ని కాచి వడపోసిన ఆమె మాటలు హృదయంతో తీసుకునేటట్లు ఉన్నాయి అనుకుంది. శాంతమ్మ గారికి నమస్కారం మామ్మ గారూ అంటూ నిండు మనస్సుతో నమస్కరించింది.

సౌభాగ్యవతీ భవ,దీర్ఘాయష్మాన్భవ, ..అని దీవించి .. అమ్మా ..నేను పెద్దదానిని అయిపోయాను.. ఈ వొత్తులు,నువ్వుల నూనె తీసుకుని వెళ్లి ఆ కాలభైరవుడి ముందు దీపం వెలిగించి రా ..అని వైష్ణవికి పురమాయించింది.

మీరే దీపం వెలిగించకూడడా ! అంది వైష్ణవి.

"ఎవరైతే ఏమిటమ్మా .. దేవుడు ముందు దీపం వెలిగించామా అజ్ఞానమనే చీకటి తొలగించామా అన్నదే ముఖ్యం. పాపం,పుణ్యం అన్నీ ఎవరి ఖాతాలో వేయాలో భగవంతుడికి తెలుసు. మనం కేవలం నిమిత్త మాత్రులమి మాత్రమే "అంది.

ఆ మాటలతో శాంతమ్మ గారిపై పూజ్యభావం కల్గింది వైష్ణవి. అప్పటి నుండి వారి పరిచయం దినదినాభి వృద్ధి చెందసాగింది.రోడ్డుకి అవతలి వైపున శాంతమ్మ గారి ఇల్లు ఇవతలి వైపున గుడి ఉండటం మూలంగా .. రోడ్డుపై వెళ్ళే వాహనాల రద్దీలో ఆమె రోడ్డు దాటటం కష్టంగా ఉండేది. వైష్ణవి వేకువఝామునే త్వరత్వరగా బయలుదేరి వచ్చి ఆమెని రోడ్డు దాటించి గుడిలోపలికి తీసుకుని వచ్చేది. శాంతమ్మ గారు చెప్పే అనేక భక్తీ విషయాలు, యాత్రా అనుభవాలు చాలా ఆసక్తిగా ఉండేవి. రోజూ దైవ దర్శనంతో పాటు శాంతమ్మ గారి దర్శనం కల్గకపోతే యేదో వెలితిగా ఉన్నట్టు ఉండేది వైష్ణవికి. దసరా పోయి దీపావళి వచ్చింది..దాన్ని ఆనుకునే కార్తీకం వచ్చింది. వేకువనే నాలుగు గంటలకల్లా దీపాలు పెట్టె వరుసలో శాంతమ్మ గారూ వైష్ణవి పోటీ పడేవారు. ఎప్పటిలాగానే ..ఈ నువ్వుల నూనె వడ్డించు తల్లీ, ఈ వొత్తులు తీసుకెళ్ళి ఆ దీపారాధన కుంది లో వేసి రామ్మా .. అంటూ వైష్ణవి చేతికి ఆ వస్తువులని అందించేది.

శాంతమ్మ గారు అందరిని ఆప్యాయంగా పలకరించేది, ఇతరులు చెప్పేదాన్ని ఓపికగా వినేది కూడా ! సహృదయం ఉన్న వ్యక్తే కాదు ..అందరికి పెట్టే గుణం ఉన్న వ్యక్తి కూడా ! ప్రతి రోజూ ఇంటి ముందు తోటలో కాసిన జామకాయలనో, నారింజ కాయలనో, సీతా ఫలాలనో పనివాళ్ళ చేత జాగ్రత్తగా కోయించి సంచీకి వేసి పెట్టేది. వైష్ణవి సాయంతో ఆ బరువైన సంచీని గుడిలోపలకి తెప్పించి.. గుడికి వచ్చిన అందరికి జాకెట్ ముక్క ఓ పండో ఫలమో పెట్టి వారి చేతికిచ్చి తృప్తి పడేది. ఒకో రోజు నాన పెట్టిన శెనగలు, కందులు కూడా తెచ్చి అందరికి పంచేది.

"నా కోడలు రాక్షసి, మేనకోడలని కొడుక్కి  చేసుకుంటే నరకం చూపుతుంది. కొడుకేమో రేసులకి వెళ్ళడం, క్రికెట్ బెట్టింగులు కట్టడం. నా భర్త నుండి వచ్చిన ఆస్తులని అన్నింటిని కర్పూరంలా కరిగించేశారు. ఇక కోడలి ఆస్తి మాత్రమే ఉంది. నేను కనబడితే చాలు భర్త మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తూ తిట్టిపోస్తుంది . ఈ వయసులో ఒక్కదాన్ని వండి వార్చుకునే ఓపిక ఎక్కడుంది నాకు. పుట్టింట్లో ఉంటె మాత్రం మేనల్లుళ్ళ భార్యలు ఎందుకు వండి పెడతారు. ఓపిక లేకపోతే కొడుకు ఇంటికే వెళ్ళాల్సింది. ఇప్పటిదాకా వాళ్ళ పిల్లలకేగా చేసి చేసి వచ్చారు. ఇప్పుడొచ్చి మా ఇంట్లో కూర్చుంటే ఎట్లా అని అంటుంటారు. ఆ అనే మాటలేవో నా ముందు అనరు ఇంటికొచ్చిన బంధువుల దగ్గర అనడం నేను విన్నాను. ఈ బతుకు ఎట్లా తెల్లారుతుందో..? " అని చెప్పుకుని బాధపడింది.

ఒక రోజు వైష్ణవి గుడికి రావడం ఆలస్యమైంది. అప్పటికే గుడికి వచ్చిన శాంతమ్మ గారు రావి చెట్టూ కట్టిన చెప్టా మీద కూర్చుని పూజ కోసం వచ్చిన ఒకామెకి వొత్తులు,నూనె ఇచ్చి దీపం వెలిగించమని అడిగింది. ఆమె అలా చేయడానికి తిరస్కరించడమే కాకుండా "అదేంటి మామ్మగారూ ! మీకు అలా నువ్వుల నూనె, వొత్తులు చేతికి ఇవ్వడం మంచిది కాదని తెలియదా ? అని తీవ్రంగా ప్రశ్నించింది. "లేదమ్మా నాకు తెలియదు. ఓపిక లేక అడుగుతున్నాను కానీ ఒకరికి మంచిది కాదని తెలిస్తే నేను అలా ఎందుకు చెపుతాను" అంది.

ద్వజస్థంభం దగ్గర దణ్ణం పెట్టుకుంటున్న వైష్ణవి ఇవన్నీ వింటూనే ఉంది. అంత పెద్ద వయసు వచ్చింది ఆమెకి . గుడిలోకి వచ్చి మరీ అబద్దాలు చెపుతుంది. తెలిసినవారు ఎవరూ పత్తితో చేసిన వొత్తులు,నువ్వుల నూనె చేతికి ఇవ్వరు ..ఇంకొకరు ఇస్తే తీసుకోరు,శని దోష నివారణ కోసం చేస్తూ ఉంటారు అలా . అని వివరంగా చెపుతుంది ఆమె

వైష్ణవికి వెంటనే తట్టింది శాంతమ్మ గారు నీలం రంగు జాకెట్ ముక్కలని మాత్రమే పంచి పెడుతుంది అని. కొందరు ఆమె ఇస్తున్నవేవీ తీసుకోకుండా వెళుతున్నారేమిటో అనుకునేదాన్ని. అందుకు కారణం ఇదా ..అనుకుని ఆశ్చర్యపోయింది. ఎన్నో సూక్ష్మ విషయాలు తెలిసిన ఆమెకి ఈ విషయం తెలియదంటే వైష్ణవికి కూడా నమ్మశక్యం కాలేదు. అప్పటిదాకా శాంతమ్మ గారి మీద ఉన్న గౌరవం చటుక్కున జారిపోయింది.

జరిగినవేమీ తెలియనట్లే .. రోజూ లాగానే శాంతమ్మ గారి దగ్గరకి వచ్చి ఈ రోజు ఆలస్యం అయిపోయింది. మీరు తొందరగానే గుడికి వచ్చేసారే మామ్మగారూ, రోడ్డు ఎవరు దాటించారు మిమ్మల్ని అని అడిగింది.

ఎలాగోలా నిదానంగా నేనే దాటానమ్మా ! ఇదిగో ఈ వొత్తులు నూనె తీసుకుని వెళ్లి దీపం వెలిగించి రా ..అంటూ వైష్ణవి చేతికి ఇచ్చింది. వైష్ణవి మాములుగానే తీసుకుంది. అంతకు ముందు శాంతమ్మ గారిని తీవ్రంగా ప్రశ్నించిన స్త్రీ మళ్ళీ వచ్చి వైష్ణవిని చేతితో వారిస్తూ.. "అలా ఆమె చేతిలో నుండి ఆ వస్తువులని ఎప్పుడూ తీసుకోకండి. శని దోష నివారణ కోసం ఇస్తూ ఉంటారు అని .. ఇదిగోండి మామ్మగారు మీకు ఇందాక చెప్పాను అయినా మళ్ళీ మీరు ఆమె చేతికి అవే వస్తువులని మళ్ళీ ఇచ్చారు. మనం మాత్రమే బాగుండాలని అనుకోవడం కాదండీ ఇతరులూ బాగుండాలి అనుకునేవాళ్లు ఎప్పటికీ మీలా చెయ్యరు. అంత వయసు రాగానే సరికాదు, అన్ని తీర్ధయాత్రలు చేసాను అని చెప్పుకుంటే సరికాదు. మంచి అన్నది మనం చేసే పనుల్లో ఉండాలి. అందరూ ఎవరి విశ్వాసం కొద్దీ వాళ్ళు గుడికి వస్తూ ఉంటారు,పూజలు,అభిషేకాలు చేయించుకుంటారు తప్ప మనం మన రాతలని దోషాలని ఇంకొకళ్ళకి అంటించాలని చూడరు. ఇది మీకు మంచిది కాదు" అని దులిపేసింది.

"అంత పెద్ద పెద్ద మాటలెందుకు పోనీ లెండి, నాకు ఏమీ తెలియదు కాబట్టి సహాయం చేస్తున్నాననుకుని ఆమె చెప్పేవన్నీ గుడ్డిగా చేసాను. ఆమెకి తెలిసి చేసింది అంటే .. ఆ పాపం ఆమెకే ! పైన భగవంతుడున్నాడు ఆయనే చూసుకుంటాడు అవన్నీ ! అంటూ దీపం వెలిగించి వచ్చింది.

శాంతమ్మ గారు వైష్ణవి చేయి పట్టుకుని "అమ్మా ! పెద్దమనసు చేసుకుని నన్ను క్షమించమ్మా ! ఇక ఎప్పుడూ అలా చేయను. పుత్ర ప్రేమతో .. గుడ్డిదాన్నై ఏదో బిడ్డకి దుష్ట గ్రహాలూ పట్టి పీడిస్తున్నాయి నివారణ కోసం అలా చేయమంటే చేస్తున్నాను తప్ప ఎవరికీ కీడు కలగాలని కాదు. నన్ను నమ్మమ్మా" ..అంటూ పమిట చెంగుతో కళ్ళు తుడుచుకుంది

"అయ్యో ..అలా అనకండి మామ్మ గారూ .. ఈ లోపం అంతా మీలో లేదు, మీలాంటి నాలాంటి ఎందరికో పండితులు పుర్రెలకి అంటించిన జాడ్యం ఇది. దేవుడు అన్నిచోట్లా ఉన్నాడనుకుంటూనే నిత్య జీవితంలో కలిగే అశాంతులని తగ్గించుకోవడానికి,మానసిక నిబ్బరం పెంచుకోవడానికి ప్రశాంతత కోసం గుడికి వస్తాం తప్ప మన బాధలని ఇంకొకరి బదిలీ చేద్దామని కాదు. మనం చేతితో ఇచ్చినంత మాత్రాన ఇంకొకరు పుచ్చుకున్నంత మాత్రాన అన్ని బాధలు సమసిపోతాయనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. మంచిని ఇతరులకి పంచడమే వితరణ. నేనూ మీలో మంచినే చూసాను. ఎవరిది పాపమో పుణ్యమో నాకు తెలియదు. మీరే అంటారుగా పాపం,పుణ్యం అన్నీ ఎవరి ఖాతాలో వేయాలో భగవంతుడికి తెలుసు. మనం కేవలం నిమిత్త మాత్రులమి మాత్రమే అని అంది వైష్ణవి.

"చిన్నదానివైనా భగవత్తత్వాన్ని వొంటపట్టించుకున్నావ్. చల్లగా ఉండమ్మా" ..అంటూ మనఃస్పూర్తిగా దీవించింది శాంతమ్మ.