27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

దేవుడా

దేవుడు గాన నాకు కనబడి ఉంటే పొరక్కట్ట తీసుకుని నాలుగు బాది  ఉండును. మనిషిని స్థిమితంగా కాసింత కూసిండనీయకపోయే...

మనుషులందరూ ఒకటే అంటరు గానీ నల్లరంగు తెల్లరంగు ఎర్ర రంగు గోధుమరంగుతో ఎన్ని రంగులు?
మళ్ళీ దేవుళ్ళలో రకాలు  వాళ్ళ గురించి చెప్పే మతాలు. ఈ దేశంలోనే కాదు అనేక దేశాలలో  తినడానికి మెతుకు లేకపోయినా మోయడానికి  మతం కావాలి.  మతం ముసుగులోనే  అస్తిత్వం వెతుక్కోవాలి. అందుకే ..దేవుడా ..నీ మీద చానా కోపంగా వుంది. జనులు అజ్ఞానంలో మూర్ఖత్వంలో పడి కొట్టుకుపోతున్నారు.

కూటికి కటకట లాడేటాళ్ళు కోట్లానుకోట్లు  ఆ కోట్లు వుండేటాళ్ళు వేలు. వుంటానికి చిన్న గుడిసెయినా లేనేటోళ్ళు, అంతస్తులు మీద అంతస్తు లుండేటాళ్లు కొద్దిమంది .

ఆకళ్ళు,రోగాలు, నొప్పులు ఇవన్నీ నిండిన లోకంలో లేనోడికి వుండేటోన్ని చూస్తే కొంత ఈసు మరి కొంత ఉక్రోషం సహజమే కదా! మనుషులందరినీ ఒకటిగా పుట్టీయనందుకు ఈ మాత్రం కోపం రావడం నాలోని రచయితకు సహజమే కదా !

అయ్యో .. దేవుడ్ని ఎంత మాట అనేసినాను. పుణ్యం చేసుకోండిరా అని భూమి మీదకు పంపిస్తే పాపాలు చేసుకుని అనుభవిస్తా వుండారు. ఇది కర్మ సిద్ధాంతం. చేసుకున్నోడికి చేసుకున్నంత.. చేసేది చేయించేది ఆయనే అయినప్పుడు మనం నిమిత్తమాత్రులం. అంతే కదా ! అనుకుంటూ  కూసిని  కన్నీళ్ళ మధ్య మళ్ళీ నిర్వేదం.    పక్షికి రెక్కలు వలె రధానికి చక్రాల వలె .. భక్తీ విశ్వాసం కలిసే వుంటాయి. ఆ విశ్వాసంతో జీవనం సాగించడమే తప్ప జీవశ్చవంలా బ్రతుకులీడుస్తుండటమే తప్ప యెవరిని కరిగించేనూ .. ఈ వేడికోళ్ళు.

ఇలా అనుకుంటుంటే  అప్రయత్నంగా గురుదేవ్ రాతలు గుర్తుకొచ్చాయ్.

"మంత్రాలూ కీర్తనలూ జపతపాలూ విడిచిపెట్టు. తలుపులన్నీ బంధించి, ఈ గుడి చీకటిమూల వొంటరిగా ఎవరిని పూజ చేస్తున్నావు? కళ్ళు తెరచిచూడు, నీ ఎదట ఈశ్వరుడు లేడూ!.

ఎక్కడైతే గట్టినేలను రైతు దున్నుతున్నాడో, ఎక్కడ బాట వేయడానికి కూలీలు రాళ్ళు కొడుతున్నారో, అక్కడ ఈశ్వరుడు ఎండలో వానలో దుమ్ము కొట్టిన బట్టలతో వాళ్ళ మధ్యన తిరుగుతున్నాడు. నీ మడి బట్టలు అవతల పెట్టి అతని వలనే నువ్వూ దుమ్ము నేల మీదకి రా.. 

మోక్షమా! ఆ మోక్షమనేది యెక్కడ వుందయ్యా! మన ప్రభువే సంతోషంగా ఈ సృష్టి బంధాన్ని తన పైని వేసుకున్నాడు. శాశ్వతంగా మనతో తానూ కట్టుబడి వున్నాడు. 

నీ పుష్పాలు, ధూపాలూ, దూరాన పెట్టి నీ ధ్యానంలోంచి బైటికి రా! నీ బట్టలు చిరిగి మరకలైతే, ఇంతలో వచ్చిన ముప్పేమిటి? నుదుటి చెమటతో కష్టించి, కృషిలో అతని పక్కన నిలబడు. 

టాగోర్ “ గీతాంజలి” కి చలం అనువాదం నుండి. 

కష్టపడినా కడుపు నిండెనా ? పని లేక పడక ఎక్కిన వ్యవసాయం అటకెక్కిన పల్లెలు పట్నాలు. అనేకానేక ఆత్మ హత్యలు  :( 

దీనభాంధవుడు యెవరూ లేరు. ప్రజలను వెఱ్ఱి గొర్రెలను చేసి ఆడిస్తున్నవారే. దేవుడికి కూడా రంగులు మార్చుతున్నవారే.

ఈ దేశంలో ఆకలితో ఒక కుక్క చనిపోయిందంటే అందుకు కారణం నేనే అనుకుంటాను అన్న వివేకానందుడు పుట్టిన యీ దేశంలో  మనిషితో సహా అడవులను గురించిన ఆలోచించే నాయకుడే లేడు.

మూర్ఖులు అవినీతిపరులు రాజైన చోట ప్రజల ఇక్కట్లు వినడానికి దేవుడికి చెవులు కూడా లేకపోయే! ఉంటే చూస్తూ ఊరుకుంటాడా ? 

ధర్మం వైపు  పీడితుల వైపు నిలబడి ఉండటమే కదా ..మనిషి తత్త్వం. (రచయిత కాకపోయినప్పటికీనూ )

దేవుడా .. రక్షించు.. మా అజ్ఞానాన్ని అంధకారాన్ని అసహాయతను. విజ్ఞానపు వెలుగును తరుముతూన్న చీకటి కరి మబ్బులను.

ఎందుకోసం ప్రార్దిస్తున్నామో కూడా తెలియని నిస్సహాయత ..లేవనా  లేక వున్నా పట్టించుకోవడం లేదనా ?
ఏమో తెలియదు.





కామెంట్‌లు లేవు: