8, ఆగస్టు 2019, గురువారం

తులసి పూలు

నేను రచయితలని గురువులు అనుకుంటూ చదివేను. రచయిత చెప్పినది ఆలోచించుకోడమే కానీ ఇది ఎందుకిలా రాసేరు అని ప్రశ్నించలేదు. - నిడదవోలు మాలతి
ఇపుడు ప్రశ్నించే తరం మన ముందు వుంది. అది మొన్న తెనాలిలో జరిగిన కొత్తకథ 2019 ఆవిష్కరణ సభలో విద్యార్ధులు చాలా ప్రశ్నలే వేసారు.
నేను కూడా వొక ప్రశ్నతో వచ్చానిపుడు. మహ్మద్ ఖదీర్ బాబు రీ టోల్డ్ కథల సంకలనం నుండి పొద్దున్నే వొక కథ చదివాను. “పుష్పలత  నవ్వింది” అనే  కథ. రచయిత కరుణ కుమార్.
రీ టోల్డ్ చేయబడిన యీ మంచి కథలో.. వొక వాక్యం.. ఇదేంటి.. యిలా వ్రాసేరు అని అనుకున్నా.. “పూలు పూయని తులసి మొక్కే నిత్యం పూజలు అందుకుంటుంటే నీకేంటి? దాన్ది పుణ్యమైతే ఈ మార్గం ఎంచుకున్న మన్ది కూడా పుణ్యమే” అంటుంది పుష్పలత తల్లి. ఈ వాక్యం వ్రాసింది “కరుణ కమార్” or ఖదీర్ బాబు?
తులసి మొక్క పూలు పూయకపోవడం యేమిటి? అగ్రికల్చర్ కస్టమ్స్ కళ్ళుకప్పి మరీ వేరే దేశాలకు భారతీయులు తులసి విత్తనాలు తీసుకువెళుతుంటే..
ఇలా రచయితలు నాతో సహా యేదో వొక విషయంలో పరధ్యానంలో పొరబడుతూనే వుంటారు. పాఠకులు ప్రశ్నిస్తూనే వుంటారు అని చెప్పడమే నా వుద్దేశం తప్ప భూతద్దంతో చూడటం కాదు. మహ్మద్ ఖదీర్ బాబు రీ టోల్డ్ కథలు 26 ఇంతకు ముందే చదివాను. మిగతా కథలు కోసం మళ్ళీ కొనుక్కొచ్చుకున్నాను. రూపాయలు 150/ యే కానీ.. విలువైన పుస్తకం. అబ్బూరి ఛాయాదేవి గారి రచన “సుఖాంతం” ను మా కిట్టీ పార్టీ సభ్యులకు వినిపించాను కూడా.
సరే మరి... పూలు పూసిన తులసి ని కూడా చూడవచ్చు. 
మాటలో మాట ...

గతంలో నేను కూడా మబ్బులు విడివడి అనే కథలో రంజాన్ రాఖీ పండుగ ఒకే రోజు వచ్చాయని వ్రాసేను. అప్పుడు ఎవరో చూసి చెప్పేదాకా నేనిలా వ్రాసేనని నాకు తెలియదు. ఆ దెబ్బతో వొళ్ళు దగ్గరపెట్టుకుని వ్రాయడం మొదలెట్టాను. ఇలాగే పరధ్యానంలో వ్రాసేవి కొన్నైతే .. కావాలని ఇతర మతం, సంప్రదాయాల పై కావాలని వ్యాఖ్యానించేవారు కొందరు. తర్వాతా వివాదాలు. ఇప్పుడు మరీ సందు ఎప్పుడు దొరుకుతుందా అని కాసుకుకూర్చుని ఉన్నట్టు వుంటారు. ఇతర మతస్తుల గ్రంధాలు అందరూ చదివి ఉండరు. కానీ వ్రాయడం చేస్తారు. మనోభావాలు దెబ్బతిన్నాయని వాదనలు. యేమిటో ..  అర్ధమై చావదు. ముసుగులు వేసుకుని బయటకు కనిపించే మనుషులు వేరు అంతరంగం వేరు అన్నట్టు వుంటున్నారు. ఇదో వేదన. మనుషులకు దూరంగా పారిపోవడం నయం లా ..వుంది. ఇక స్నేహాలు కూడానా ! 

మా ఇంట తులసితో నా స్నేహం ... యిలా ..

తులసిపూలు 


కామెంట్‌లు లేవు: