16, ఆగస్టు 2021, సోమవారం

దుఃఖపు రంగు దర్శించి... ప్రదర్శించిన దార్శనిక కలం



హటాత్తుగా మనకొక బహుమతి లభిస్తే... చాలా సంబరంగా వుంటుంది. ఆ బహుమతి విలువైనది అయితే యిక  ఆ ఆనందానికి అవధులు వుండవు. 


 నా రచన “దుఃఖపు రంగు’’ సాహిత్య విమర్శకుడి దృష్టిలోపడి.. చక్కని విశ్లేషణకు నోచుకుంది. ఆ విశ్లేషణ వీడియోగా రూపాంతరం చెందింది. ఒక రచయితకు యింతకన్నా యేం కావాలసలు!?


ధన్యోస్మి కంపల్లె రవిచంద్రన్ గారూ... 


మీరూ యీ విశ్లేషణ వినండి... కథ చదవడం మాత్రమే కాదు కథను యెలా అర్దం చేసుకోవాలో తెలియజేస్తుంది. వినండి.. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి..


*********


 'దుఃఖపు రంగు' దర్శించి... ప్రదర్శించిన దార్శనిక కలం - కంపల్లె రవిచంద్రన్ 



“దుఃఖపు రంగు” తెలియాలంటే కన్ను అనే చర్మేంద్రియం ఉంటే సరిపోదు, జ్ఞాననేత్రం కావాలి. 

సరే! దుఃఖపు రంగు తెలిసింది, మరి దాన్ని తెలియజేయాలంటే ఏం కావాలి? 


వనజ తాతినేని అనే కవయిత్రి, రచయిత్రి, చింతనాశీలి సహజంగా, సహజాతంగా కలిగిన వివేకంతో, సాధన వల్ల ప్రోదిచేసుకున్న జ్ఞానంతో దుఃఖపు రంగు చూడగలిగారు, తెలుసుకోగలిగారు. దాన్ని నా బోటి పాఠకుడికి తెలియజెప్పాలి అంటే అని ఇలా ఓ కథ రాయాలి. కథలో వ్యథ ఉన్నంత మాత్రాన పాఠకుడికి దుఃఖపు రంగు తెలిసిపోతుందా? మంచి కథ అయితే కేవలం ప్రదర్శించడమే చేస్తుంది, అదే గొప్ప కథ అయితే ఆ ‘దుఃఖపు రంగు' అనుభవం అవుతుంది. అంటే, ఒక రచయిత తాను జ్ఞాననేత్రంతో దర్శించిన ఓ జీవన సత్యాన్ని,   కాకుండా, చదువరిని కూడా ద్రష్టని చేయడం! తన తలంలోకి తీసుకురాగలగడం! చూపించే వేలు, చూసే కన్నూ ఒకటే అయిపోవడం- ఎంత విశేషం!


అందుకే వనజ తాతినేని కథ- 'దుఃఖపు రంగు' ని మంచి కథఅని మాత్రమే అనలేను, గొప్ప కథ అంటాను. కథ అనే సాహిత్యప్రక్రియ కింద రాసిననవన్నీ కథలే అని చెప్పలేము. కథలుగా consider చేయదగ్గ వాటిల్లో కొన్నే మంచి కథలు. ఆ మంచి కథలన్నీ గొప్ప కథలని అనడానికి వీల్లేదు. ఆ మంచి కథల్లోనే 'దుఃఖపు రంగు' లా విలక్షణత సంతరించుకొన్నదే గొప్ప కథ. అంటే ఇదొక పరమపదసోపానం లాగా అన్నమాట. వ్రాసింది ముందు కథకావాలి, ఆ కథ మంచికథ కావడానికి తోడు, వైవిధ్యభరితమైన మన జీవితాల్లో నిగూఢంగా దాగిన మహత్తర సత్యాన్ని అద్భుతశిల్ప నైపుణ్యంతో కళ్ళకు కట్టించి, హృదయాన్ని అనుభూతితోనింపి, మళ్ళీ మళ్ళీ చదివించేది గొప్ప కథ. చదివిన ప్రతిసారి ఒకకొత్త వెలుగుని ప్రసరించేది గొప్ప కథ!  అందుకే 'దుఃఖపు రంగు' గొప్ప కథ. కథ అనే ప్రక్రియలో దొంతర్లు దొంతర్లుగా అనేకజీవనపార్శ్వాలను ఒదిగించి, నవలకి ఉన్నంత విస్తృతిని ప్రదర్శించిన 'దుఃఖపు రంగు' వస్తు- రూప- సారాల వంటి అనేక విలక్షణ విధాలుగా గొప్ప కథ.


వస్తుపరంగా చెప్పుకుంటే- వర్తమాన సమాజం అనుభవిస్తున్న ఆధునిక ఫలాలు అప్పుడప్పుడే అందుకుంటున్న తండాలో, వాటికి కూడా నోచని అభాగ్యురాలు సోనాబాయీ కథ ‘దుఃఖపురంగు’


సోనా భర్త భూక్యా, సోనా అన్నయ్య మురళి. ఒకే సామాజిక స్థితి, కానీ, సాంస్కృతికంగా ఇద్దరి మధ్యా ఎంత దూరం! మురళి చదువుకున్న వాడు, ఉద్యోగస్తుడు. భూక్యా మారుమూల కొండప్రాంతంలో తండా మనిషి. అనాగరికుడు.  


"గొడ్డు గోదా మందకి తాగేదానికి నీళ్ళు కావాలి, ఆడది బిందెపుచ్చుకుని నీళ్ళు మోయాలి.మగోడు పుల్లరి కాపు కాయాలి, కట్టెల మోపు మొయ్యాలి" ఇవీ అతని అభిప్రాయాలు. పెళ్లామంటే ఒంటికి, ఇంటికీ ఒక అవసరమని తప్ప అంతకంటే ఆలోచించలేని మోటుమనిషి.


ఆధునికత అందించే సౌఖ్యాలు, సౌకర్యాలు అందనంతదూరంలో ఉంది భూక్యా కొండంచు పల్లె. తాగునీరు లేదు. నీళ్లకిరెండేసి మైళ్లు వెళ్ళాలి ఆడవాళ్లు. అరక్షితమైన నీళ్లు తాగి రోగాలతోఎంతో మంది చనిపోతారు ఆ తండాలో. అయినా, బోర్లువేయించమని డిమాండ్ చేసేంత చైతన్యం ఉండని తండా అది. భూక్యా పేరుకి వార్డు మెంబరే. రెండొందల ఓట్లు ఉన్న బలం ఉందివెనక. కానీ, బోర్లు వేయించమని అడిగే అవగాహన, చైతన్యంలేవు. "నీళ్ళు మోయడానికే యింటికొక మనిషిఅవసరపడతన్నారనే సాకు చెప్పి రెండో పెళ్ళాన్ని తెచ్చుకునే తండామగవాళ్ళ" లో ఒకడు భూక్యా. 


సొంత చెల్లి పెళ్లికి కూడా రాలేనంత పెద్ద బాధ్యతలు ఉన్నఉద్యోగంలో ఉన్న మురళికి, భూక్యాకి మధ్య సాంస్కృతికంగా ఎన్నితరాల దూరం ఉందో ప్రతిభావంతంగా చూపెట్టారు రచయిత్రివనజ తాతినేని. 


మురళీ- భూక్యా భౌగోళికంగా పరస్పరం చాలా దూరాల్లో ఉంటారు. కోస్తాంధ్ర- రాయలసీమ- తెలంగాణా వంటి ప్రాంతీయమైన అంతరాలున్న ప్రదేశాలే కానక్కర్లేదు. ఒకే ప్రాంతంలో కూడా రెండుజీవనవిధానాల మధ్య అంతులేని అంతరాలు, అందరాని దూరాలూ ఉండొచ్చు. ఉదాహరణకి తెనాలి- మాచర్ల- రెండూ గుంటూరు జిల్లాలో పట్టణాలే. కానీ, తెనాలి సస్యశ్యామలమైనఊరు, మరి మాచర్ల- శ్రీనాథ కవిసార్వభౌమ చెప్పినట్టు - 


'చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు

నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు

సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు

పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు" 


ని గుర్తుకుతెచ్చే ప్రదేశం. ఈ రెండుచోట్లా మధ్య కూడా సాంస్కృతిక అంతరం ఎంతో. ఈ అంతరాన్ని చూపడంలో ఏమంత విశేషం లేదు. ఈ కథలో అంతకంటే విశేషం మరొకటి ఉంది.


మురళి సోనా తోడబుట్టిన వాళ్లు. ఒకే ఊళ్లో, ఒకే వాతావరణంలో, ఒకే కప్పు కింద బతికిన వాళ్లు. కానీ, సోనా- కూతురు - అంటే స్త్రీ, మురళీ- కొడుకు- అంటే పురుషుడు. కుటుంబంలో ఆడపిల్లకి- మగపిల్లాడికీ సాంస్కృతికంగా ఉన్న దూరం గురించి కూడారచయిత్రి చాలా subtle గా చూపెట్టారు. అదే అసలైననేర్పరితనం, అదే లింగవివక్షని ఎత్తిచూపిన కథా సంవిధానం, అదే అసలైన జీవితావిష్కరణం... అదే గొప్ప శిల్పం! 


ఆడవాళ్ళు ఆకాశంలో సగమన్నారు. ఆడ మగ సమానమేననిరాజ్యాంగమూ చెబుతోంది. సమాన అవకాశాలు కల్పిస్తామనిపాలకులూ ఊదరగొడుతుంటారు. కానీ, ఈ మధ్య వరల్డ్ఎకనమిక్ ఫోరం (డబ్యూఈఎఫ్) ఇచ్చిన నివేదిక ప్రకారం లింగసమానత్వం రావాలంటే మరో 100 సంవత్సరాలు పడుతుందట. అంతేకాదు స్త్రీ-పురుష అసమానతలు గతంతో పోలిస్తేపెరుగుతున్నాయని కూడా డబ్యూఈఎఫ్ ఆ నివేదికలో చెప్పింది. మగవాళ్లకు ఉన్న అవకాశాల్లో స్త్రీలకు కేవలం 68 శాతం మాత్రమేఉన్నాయని అంటోంది ఆ నివేదిక. బడి చదువులోనే లింగవివక్షనూరిపోస్తున్నాయి పుస్తకాలు. ఆ వ్యత్యాసం మరింత పెరిగిందట.అటువంటి పరిస్థితుల్లో సామాజికంగా దిగువున ఉన్న లంబాడి, సుగాలి తండాల్లో ఇంకెంత వివక్ష ఉంటుందో చూపెట్టారు 'దుఃఖపు రంగు' (కథ)లో రచయిత్రి వనజ. 


"ఈ కొండ కింది తండా యింత దూరం వుంటదనుకోలేదు చెల్లి. చెల్లెలు కొడుకని పొలాలు వున్నాయని ఇంత దూరంనిన్నిస్తాడనుకోలేదు బాపు. ఈ అడివిలో పడి మూఢాచారాలలోమగ్గుతా వుంటివి," అంటాడు చెల్లిని చూడ్డానికి వచ్చిన మురళి. 


కొడుక్కి చదువులు చెప్పించిన మురళీ - సోనా తండ్రి, కూతురుకిపెళ్లిజేస్తే చాలనుకున్నాడు. 

"మీ చెల్లిని మేనమామ కొడుక్కి చేయాలనే గందా లగ్గం పెట్టితిరి. ఆడేమో లగ్గం రోజుకి మొహం తప్పించే, ఎక్కడోచెట్టుకి ఉరేసుకునిచచ్చిపోయే నీ చెల్లిని చేసుకోవడం యెందుకిష్టం లేకపోయిందో యెవరికి యెరుక. సమయానికి నేను అక్కడుంబట్టే మా అమ్మపోరింది.. దీన్ని చేసుకోమని." అంటాడు మురళితో భూక్యా. అంటే, అసలు పెళ్ళీ చేద్దామని అనుకుంది వేరే మేనల్లుడితో, అతను  ఏ కారణాలతోనే ఉరేసుకొని చచ్చిపోయాడు. ఏదో రకంగా పెళ్లిచేయాలనుకొని అదే లగ్గానికి భూక్యాకి అంటగట్టేశాడు సోనాతండ్రి. అతని యోగ్యతలతో ఆ తండ్రికి సంబంధం లేదు. తనకూతురి స్థాయి, స్థితి, మనసుతో అస్సలు సంబంధం లేదు. వదిలించుకోవడమే తన బాధ్యత. 


పెళ్ళయ్యాక రుక్కు మీద కోరికపుట్టింది భూక్యాకి. వంద అబద్ధాలుఆడి, వెయ్యి కలబొల్లి మాటలు చెప్పి మసిబూసి మారేడు కాయచేసి మారుమనువు చేసుకున్నాడు భూక్యా. అది కూడా ముందటిభార్య సోనా అనుమతితో, పెద్దల పంచాయితీ ఆమోదంతో. ఆతర్వాత సోనా పడుతున్న నరకబాధ గురించి పొరుగింటివాళ్లు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెబుతున్నా పట్టించుకోలేదా తండ్రి. అదీ, ఒకే ఇంట్లో పెరిగిన ఆడపిల్లకీ- మగపిల్లాడికీ మధ్య ఉన్నదూరం. అదీ వ్యత్యాసం. 


తండాలలో తాండవమాడుతున్న అవిద్య, అనాగరికత, సామాజిక, సాంస్కృతిక,  రాజకీయ అణిచివేత, ఆడవాళ్ల పట్లవివక్ష, లైంగిక హింస... వంటి ఎన్నో అంశాలను స్పృశించారువనజ తాతినేని ఈ కథలో. కొండంచు పల్లెలో మట్టి వాసన, బురద లసలస, ఎండిపోయిన దిగుడుబావు, కన్నీళ్లింకని కళ్ళు, కష్టాలు, ఆనంద విషాదాలు, వేదనావేదనలను, ఆవేశకావేశాలు, ఆక్రందనలు, అరణ్యరోదనలు, పొరుగింటి వాళ్ల మనస్తత్వాలూ... అన్నింటినీ కథ అనే చిన్న కాన్వాస్ లో కుదించి చూపారురచయిత్రి. “To see the world in a grain of sand, and to see heaven in a wild flower, hold infinity in the palm of your hands, and eternity in an hour” అంటాడు కదా గొప్ప కవి William Blake. అలా అల్పంలో అనల్పాన్ని కూర్చడం వంటిది ఈకథ. అందుకే 'దుఃఖపు రంగు' గొప్ప కథ అయ్యింది.


సంచార జాతుల్లో ఆధునికతా సంపర్కం వల్ల కలిగిన మార్పులు, పెళ్లి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలలో లోపాయికారిచేసుకుంటున్న సర్దుబాట్లు ఈ కథలో పొందుపరిచారు రచయిత్రి. కథా నిర్మాణంలోను, వస్తుపరంగాను వైవిధ్యభరితంగా ఉన్న ఈకథని వనజ నడిపించిన తీరు, ఎత్తుగడలో  కూడా ఆమె చూపినప్రతిభ ప్రశంసనీయం. కథన శిల్పం గెలవడానికి సఫలంకావడానికీ ముఖ్యం భాష, శైలి. 'దు:ఖపు రంగు' సమకాలీకమైన వస్తువు. వార్తాపత్రికల్లో ఇటువంటి కథనాలు మనకిసుపరిచితమే. కనీసం సింగిల్ కాలం వార్తలుగా అయినా, దగాపడిన స్త్రీల వెతలు చూస్తూనే ఉంటాం. ఆ వార్తకు లేనిచైతన్య శక్తి కథకి ఎక్కడి నుంచి వస్తుంది? దానికోసం ఆ కథలో రచయిత్రి ఏఏ అంశాలు కూర్చుతారు? అక్షరాల సాయంతో జరిగిన ఆ కూర్పు- అది ఇచ్చే అర్ధంలో గానీ, అది డీల్ చేసిన వస్తువుతోకానీ, నడిపిన  పాత్రతో కానీ, మొత్తం మీద అది ప్రతిపాదించినజీవిత సత్యంతో కానీ అనుసంధానమై ఉండటం చేత ఆసాదాసీదా వార్తకే కళాస్థాయి చేర్చబడుతుంది. అదే ఇక్కడ వనజచేశారు. 


వస్తుగత, రూపగత, సంవిధానగతమైన వివిధాంశాల కూర్పులోనైపుణ్యం ప్రదర్శించే కథ పాఠకుల మనసుల్లో నిలిచిపోతుంది. అయితే, ప్రతి మంచి కథకూ ఈ లక్షణాలు ఉండవల్సిందేనా? అక్కర్లేకపోవచ్చు, ఉంటే మాత్రం గొప్ప కథ అవుతుంది- 'దు:ఖపు రంగు' కథ అయినట్టుగా. అన్ని కథల్లో శైలీగతమైన సుగుణాలన్నీఉండవు, ఉండాలని ఆశించడం అత్యాశే. కానీ, అటువంటి సమ్మేళనం కుదిరితే 'దుఃఖపు రంగు' వలె వస్తు విన్యాసంలో, పాత్ర చిత్రణలో, సంవాదశైలిలో, సంఘర్షణాత్పాదనలో, సన్నివేశకల్పనవంటి అనేకానేక అంశాల్లో కలగలిసి ఉన్నతమైన శిల్పపారమ్యాన్ని అందుకొని గొప్ప కథగా నిలవొచ్చు. వనజ తాతినేనిఎన్నుకొన్న వస్తువు, చెప్పదలచిన పరమార్ధం అంటే, ఆ వస్తువుపట్ల ఆమె ప్రదర్శించే దర్శనం ఉదాత్తమైనాయి కాబట్టే సంవిధానశిల్పం రాణించి గొప్ప కథ అయ్యింది. 


ఈ కథ ఎత్తుగడే చూద్దాం: 


"ఇంటి వెనుక నుండి మొదలయ్యే అడవి. పేరుకు అడవే కానీ, ఒక పచ్చని చెట్టు కూడా కనబడని ఆరుబయలు. చిన్న చిన్నచిట్టీతి పొదలు బొమ్మేడు,చిట్టికీసర చెట్లు. గట్టి ఎర్రటి నేల. చిన్నగాలికే నేల దుమ్మురేగి చెట్ల ఆకులు కూడా జేగురు రంగువేసుకున్నట్టు వుంటాయి."


- నాందీ శ్లోకంలోనే కథాంశం యావత్తూ సూచించడం సంస్కృతనాటక మర్యాద, సంప్రదాయం. ఈ కథారంభంలోనే అడవి కానిఅడవిని, ఆ వాతావరణాన్ని చిత్రించడం ద్వారా ఆ అడవి వంటి సోనా జీవితం, అరణ్యరోదన వంటి ఆమె ఆక్రోశం చెప్పేశారు వనజ.  


వర్ణన, శైలి, కథనంలో అంతర్భాగాలు. ఈ కాలం రచయితల్లో కరువౌతున్న వాటిల్లో భౌతిక వాతావరణ పరిసరాల వర్ణన పూర్తిగా కరువవుతోంది. ఆ భౌతిక వాతావరణాన్ని పాత్ర చిత్రణను జోడించికాల స్థల వస్త్వైక్యం సాధించడమే 'దుఃఖపు రంగు' విశిష్టత. అదిపచ్చాపచ్చాని అడవి కాదు, 'దుమ్మురేగి చెట్ల ఆకులు కూడా జేగురు రంగు...' పులుముకున్నాయి. సోనా కూడా తనదైన సహజత్వం మాసిపోయి, జేగురు రంగు జీవితాన్ని జీవిస్తోంది. మాట్లాడేటప్పుడు, అంటే మాటల్ని రాసేటప్పుడు అభివ్యక్తం లో కనబడే తీరునే శైలీవిన్యాసం అంటాము. 'దు:ఖపు రంగు' కథకిఒక మాండలికాన్ని కేటాయించే క్రమంలో నైపుణ్యాన్ని చూపించారురచయిత్రి. వివిధ ప్రాంతీయ, సామాజిక వర్గ మాండలీకాలగురించి అవగాహన, సాధికారతా లేకుంటే ఇది సాధ్యం కాదు. ఆసముచిత   ప్రయోగం వల్ల కథన సంవాదాలు రెంటికీ సహజసౌందర్యం సమకూరింది. 


సోనాని భూక్యా చావగొట్టి వీధిలోకి తోసేస్తాడు. "పలుపుతాడు దెబ్బలకి ఒళ్ళంతా పొంగింది సోనాకి. జ్వరంముంచుకొచ్చింది. నోరు పిడచగట్టుకు పోతోంది. ఎవరన్నా నీళ్ళుఇవ్వకపోతారా అన్నట్టు చూస్తూ వుంది. ఊరంతాసద్దుమణిగింది కానీ, గొంతులో చుక్క నీళ్ళు పడలేదు. ఆకాశంలోచంద్రుడికి మల్లే నడీధిలో సోనా."


- ఆకాశంలో చంద్రుడికి మల్లే నడీధిలో సోనా. ఎటువంటివాక్యమిది? "ఆకాశపు టెడారిలో కాళ్లు తెగిన... ఒంటరిఒంటెలాగుంది జాబిల్లి!" అన్నాడు కదా మహాకవి శ్రీశ్రీ (ఒక రాత్రికవితలో). యుగయుగాలుగా కవులకి ప్రేరణగా నిలిచిన చంద్రుడుకి ఆధునిక మహాకవి కొత్త ప్రతీకని అన్వయించాడు. అటువంటిదే వనజ తాతినేని చేసిన ప్రయోగం, ఇచ్చిన ప్రతీకకూడా. నిరాశ, నిస్సహాయత, నిర్వేదం, ఒంటరితనం - అన్ని అర్థాలు ఒక్కవాక్యంలో- "ఆకాశంలో చంద్రుడికి మల్లే నడీధిలో సోనా" - ఇంతకు మించి వనజ ప్రతిభని చెప్పడానికి ఏముంది? 

**​**

వసుధైక కుటుంబాన్ని కలగని, దాని సాకారానికి తపించే వనజ తాతినేని వంటి ఉత్తమ రచయిత్రి సాహిత్యం గురించి కాకుండా సాహిత్యేతర మైన సామాజిక కులీనతని ప్రస్తావిస్తున్నందుకునన్ను మన్నించాలి. కానీ అనివార్యం కాబట్టే తప్పడం లేదు. సగటు పారిభాషిక పదాల్లో చెప్పాలంటే, వనజ తాతినేనిఅగ్రకులానికి చెందిన రచయిత. సామాజికంగా అట్టడుగువర్గానికి చెందిన బడుగు, దళిత స్త్రీ గురించి, ఆ అభాగ్యుల జీవనంలోని దుస్థితి గురించి ప్రతిభావంతంగా కళ్లకు కట్టారు. 


నా దృష్టిలో అది చాలా గొప్ప విషయం. కానీ, దళితేతరులు, లేదాగిరిజనేతరులు దళితుల, లేక గిరిజనుల సమస్యల గురించిమాట్లాడటం, రచనలు చేయడం కూడదనే వాదనలు మనతెలుగు సాహిత్యంలో, మరీ ముఖ్యంగా అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్న వినిపిస్తున్న మొండి వాదం. ఎవరి రచనలువారే రాసుకోవాలని అస్తిత్వ ఉద్యమాలు హోరు పెడుతున్నాయి. తనదికాని జీవితాలకు విస్తరించడమనే అభిలాష, ఆసక్తీ సాహితీకారులకు ఉండనక్కర్లేదని వాదాలరాయుళ్లు గొడవలగోదాల్లోకి దూకుతున్నారు. ఈ వాదనే సబబైతే, రెండో పెళ్లి చేసుకున్న భర్తతో వేగి, హింసలు పడితేనే 'Jane Eyre' నవల రాయాలని Charlotte Bronte ని దబాయించాల్సి వస్తుంది. 'Madame Bovary' గురించి మగాడివి అయిన నువ్వెలారాస్తావయ్యా అని మహారచయిత  Gustave Flaubert తో దెబ్బలాట కి దిగాలి. మన భారతీయ రచయితల విషయానికొస్తే,  హరిజనులు, దళితుల స్థాయి, దయనీయమైన వారి స్థితిగతులు, అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలూ మీరెందుకురాశారని ముల్కరాజ్ ఆనంద్, రాజాజీ (సి.రాజగోపాలాచారి- తమిళం), శంకర్రావ్ ఖరత్ (మరాఠీ), కుం.వీరభద్రప్ప (కన్నడ) వంటి గొప్ప రచయితల్ని బోను ఎక్కించాలి.


మన తెలుగులో  1913లోనే వచ్చింది హేలావతి'' కథ. వెంకటపార్వతీశ్వరకవుల 'మాతృమందిరం'  వచ్చి నూరేళ్ళునిండిపోయింది.  ఉన్నవ లక్ష్మీనారాయణ గారి ‘‘"మాలపల్లి'కికూడా నిండు నూరేళ్ళే కదా. 1925 లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి‘ పుల్లంరాజు’ కథ , 1931 లోని ‘సాగర సంగమం', 'ఇలాంటితవ్వాయి వస్తే', (1934 ) వంటి కథలు హరిజనుల సమస్యగురించే. అసలు గిరిజనుల గురించి కథలు రాసిన, రాస్తున్నవారికి ఆద్యులు చింతా దీక్షితులు గారు. సుగాలీలు, చెంచులు, ఎరుకలు, యానాదులు, కోయలు మొదలైన వారి జీవిత శైలినిఅత్యంత సహజంగా, దగ్గరగా చూపించారు- ‘సుగాలీకుటుంబం’లో.  ‘చెంచురాణి’ చెంచుల జీవితం, ‘అభిప్రాయభేదం’ యానాదుల కథ. 


రెండు మూడు దశకాల నుంచీ వెలుగులోకి వచ్చిన దళిత, స్త్రీ, మైనారిటి, ప్రాంతీయవాద అస్తిత్వ సాహిత్యోద్యమాలు వారివర్గాలకు చెందని రచయితలు, కవుల మీద నిషేధాజ్ఞలు విధించడం బాధాకరం. అస్తిత్వ చైతన్యాలు ఎవరి మూలాల్నివాళ్లు వెతుక్కునేందుకు దోహదపడటం ఎంత వాస్తవమో, ఆయాచైతన్యోద్యమాలకు చెందని సృజనకారుల్లో కొత్త స్పృహల్నికలిగించి, ఉత్తమోత్తమ కోణాల్ని ఆవిష్కరించే విధానాలకి తెరతీసింది. అట్టడుగు జీవుల ఆక్రందనలు, శ్రామికులనిస్సహాయత, అస్పృశ్యుల ఆవేదన, సంచారజీవుల బతుకుల్లో చీకటి వెలుగులు వస్తువులుగా స్వీకరించి, ఆ వస్తువులకి తగ్గ భాషని, యాసని, శిల్పాన్ని సాధించి, సంతరించే రచయితల వల్ల ఇంకా ఆ అస్తిత్వవాదాలకి మేలు జరుగుతుందని గ్రహించడం లేదు- వివాదాల వాదులు. 


ఒక రైటర్ కు భావపుష్టి, పలుకుబడి ఎంత ముఖ్యమో అంతకన్నాముఖ్యమైనది సాంస్కృతిక సంపద.  ఆ సాంస్కృతిక సంపద పుష్కలంగా ఉన్న రచయిత్రి వనజ. కాబట్టే, ఒక అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీ బీభత్స ... విషాద... కారుణ్యమైన కథనురాయగలిగారామె. పాత్రల సహజ ప్రవృత్తి, వాళ్ళకే తెలియని సైద్ధాంతిక మూలాల్లోంచీ కొన్ని భావప్రకటనల్ని పదాల్లో పలికించి పాఠకుడిలో cultural అడ్డుగోడల్ని కూల్చి, వస్తువులోని గాఢత, తీవ్రత అతనికి కలిగించి, సమస్య పట్ల తీవ్ర నిరసనలు పాటూసహానుభూతిని, రస స్పందన కలిగించేలా  'దుఃఖపు రంగు' రచించిన వనజ తాతినేనికి అభినందనలు. 


**​**​**

వీడియో యీ లింక్ లో...



కామెంట్‌లు లేవు: