ఫేస్ బుక్ లో చాలా మంది వాల్ మీద నా స్పందన కనబడదు. ఎందుకంటే కొంతమంది అప్ డేట్ చేయరు. కొంతమంది చేసినా పాత అకౌంట్ లు ప్రోత్సాహించని కారణం మరికొంత కావడంతో వారి పోస్ట్ లు మనకి కనపడవు. మిత్రుల రాతలను వాల్ మీద అయితే చదవగలను. బుక్ గా చదవలేని కారణంగా. ..నా స్పందన వుండదు. ఇకపోతే మరో కారణం ఎవరి గోల వారిదే! కొంత వివరణ ఇచ్చే ప్రయత్నంలో.. ఈ పోస్ట్ రాస్తున్నాను. ఎవరికి వారు వాళ్ళు మన పోస్ట్ లకు స్ఫందిస్తున్నారా.. మనం వాళ్ళ గోడ మీదకు వెళ్ళడానికి అని భీష్మించుకుని కూర్చుంటారు. కొంతమంది తమ రాత ఏదో తాము రాసుకుంటూ ఇతరులను చదవరు.. ఓపిక ఆసక్తి లేక కూడా!
కొంచెం వివరంగా రాస్తున్నాను అందుకే!
**********
రహస్య గీతం
గులాబీ నుండి రేకులు రాలడం ఎవరు చూశారు?
నేనే, కానీ అది ఎవరికీ తెలియదు అంది సాలీడు,
పక్షిపై సూర్యాస్తమయ కాంతి మెరవడం ఎవరు చూశారు?
నేనే, కానీ అది ఎవరూ వినలేదు అంది చేప,
సముద్రంపైకి పొగమంచు రావడం ఎవరు చూశారు?
నేనే, కేవలం నేనే! అంది సముద్రపు పావురం,
సూర్యుని మొదటి ఆకుపచ్చ కాంతిని ఎవరు చూశారు? (ఆకుపచ్చ అంటే lush green కావచ్చు)
నేనే, ఏకైక దానిని అంది గుడ్లగూబ.
రాయిపై నాచు పాకడం ఎవరు చూశారు?
నేనే, ఒంటరిగా! అంది బూడిద రంగు నక్క,.
Margaret Wise Brown/మార్గరెట్ వైజ్ బ్రౌన్
The Secret Song అనే కవితకు స్వేచ్ఛానువాదం
****************
ఈ పద్యం నవ్వు తెప్పించేదిగా వుంది కదా! సాలీడు, చేప, సముద్రపు పావురం, గడ్లగూబ,నక్క ఇవ్వన్నీ కూడా ప్రాణులే! ప్రకృతిలో జరుగుతున్న అనేక విషయాలను మార్పులను ఎవరు చూసారు అంటే…. వేటికవి నేను చూసాను, నేను మాత్రమే చూసాను, ఒంటరిగా చూసాను అని జవాబు ఇస్తున్నాయి. కానీ వాటితో పాటు మిగతా ప్రాణులన్నీ కూడా ఆ విషయాలను గమనిస్తాయి. ఇవన్నీ సామూహికంగా ఆ విషయాలను గ్రహించలేదు గమనించలేదు. వేటికవే తమను సమూహం నుండి విడగొట్టుకుని ఒంటరిగా గమనించి ఆస్వాదించి నేను మాత్రమే చూసాను అని డంబాలు పలుకుతుంటాయి. ఆస్వాదన అందరిదీ. ఎవరి పరిధిని బట్టి వారు అర్థం చేసుకుంటారు, ఆస్వాదిస్తారు. నేను మాత్రమే ప్రత్యేకం అనుకోవడం హాస్యాస్పదం. ఒకే దృశ్యాన్ని ఇద్దరు ఒకేసారి చూసినప్పుడు కూడా కలిగే భావనలు ఒకటిగా వుండవు. ఎవరి భావన వారిది. ఇది చిన్న పిల్లల పద్యంలా అనిపించినప్పటికీ.. ఇది అందరికీ సంబంధించినదిగా నాకు తోచింది. ఒంటరితనం కూడా బాగా ఆస్వాదించతగినదే కదా అనిపించింది.ఆనందపడటం కూడా హర్షించదగినదే! సాహిత్యం కూడా మనకి మనం ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఎవరికి అర్థమైనంత రీతిలో అర్ధమైనంత. ఇతరులకు అర్థం కానంత మాత్రాన అది మంచి రచన కాకుండా పోదు. దేని విలువ దానిదే! ఎవరి రహస్య గీతాలు వారివే!
కవిత్వం కానీయండి కథ కానీయండి అందులో ఒక అంతరార్థం వుంటుంది. ఆ భావోద్వేగాల లోతు,శ్లేష సాధారణ పాఠకుడు అందుకోలేకవచ్చు. అందుకే కవులు రచయితలు సాధ్యమైనంతగా సంక్లిష్టంగా కాకుండా అలతి అలతి పదాలతో రూపాలను సృజించగల్గితే సాహిత్యం పామరుల వరకూ చేరుతుంది. అక్షరం అందరికీ చేరువకానప్పుడు కూడా సాహిత్యం వాజ్మయరూపంలో వర్ధిల్లింది. జానపద గీతాలు, పేదరాసి పెద్దమ్మ కథలు ఆయాకాలంలో అలరించాయి.
ప్రతి కవి, రచయిత కూర్చుని పాఠకుడికి అర్ధవివరణ ఇవ్వలేడు, ప్రతీక లను ఎలా అర్ధం చేసుకోవాలో చెప్పలేడు. పాఠకుడు అర్ధం చేసుకోవాలి అంటే మనం ఆ సాహిత్యాన్ని సృజించే రూపం, భాష అత్యంత ప్రధానం. లేదా ప్రతి పాఠకుడు ఆ ఎత్తులను అందుకోవాలి. చాలామందికి సాహిత్యం కన్నా జీవితం విలువైనది. జీవనయాత్రలో అనేక పరీక్షలు యాతనలు. తప్పక ఈదాల్సిన సముద్రం జీవితం.. సాహిత్యం చదువుకుంటూ కూర్చుంటే అవ్వదు కదా! సాహిత్యం అప్పుడప్పుడూ మనిషికి అవసరపడే చేతిలో దీపం. అంతే!
ఇవాళ సాహిత్యాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలిపే పంతుళ్ళు లేరు. సిలబస్ ఎంత త్వరగా పూర్తి చేయాలి, రిజల్ట్ ఎంత బాగా చూపించాలి అనే సవాళ్ళు తప్ప. మాతృ భాషలో చదవడం అనేది లేకపోవడం, అసలు పుస్తకాలు చదవడం అనే అలవాటు లేని యువత సోషల్ మీడియాలో చదవడానికి అలవాటు పడ్డారు. వారు అలవాటుగానో రిలాక్స్ అవడానికో వచ్చినప్పుడు మనం సంక్లిష్టంగా రాసిన రూపం ఏదైతే వుందో అది కనబడితే అర్థం కాక వెంటనే వేరే విషయం లోకి వెళ్ళిపోతారు. ఏదో కొద్దిమంది తప్ప లోతుగా స్ఫురించే రూపాల పట్ల ఎక్కువ మంది ఆసక్తి చూపరు. అది గమనిస్తూ… మన కోసం మనం రాసుకుంటే కల్గే తృప్తి కోసం రాసుకుని అది తన సమూహంలో వుండే మనుషుల కోసం అయినా విసిరి పడేసి స్పందన రావడం లేదని విచారపడకూడదు. ప్రతి అంశం అందరికీ తెలిసి వుండదు. నిఘంటువులు పక్కన పెట్టుకుని చదివే ఓపిక ఆసక్తి అందరికీ వుండదు. అంత అవసరం కూడా అందరికీ ఉండదు.
చెరుకు నమిలిన కొలదీ తీపి అని అర్ధమైనప్పుడే చెరుకు గడ పూర్తిగా తింటారు. కానీ అంత ఓపిక లేదే.. ఈ జనరేషన్ కి. ఓనమాలు మాత్రమే వచ్చిన వారికి శార్దూలము, మత్తేభము పరిచయం చేసినట్టు వుంటుంది కదా! కాఫ్కా ని అందరూ అర్ధం చేసుకోలేరు. కాఫ్కా అర్ధం కాలేదని మిగతా సాహిత్యం వదిలేయరు. తమ స్థాయికి తగినవి చదవడానికి ఎన్నుకుంటారు. కాఫ్కా లాగా నేను రాస్తున్నాను మీరు ఎందుకు చదవరూ.. అర్ధం చేసుకోలేరు అని అంటే… block చేసుకుని పోతారు. గ్రహింపు శక్తి హైయిర్ డై వేసుకుంటే నలుపు అంటుకున్నంత సహజంగా అందరికీ వుండదు. ఎవరి స్థాయి వారిది. కాలక్రమేణ ఆసక్తిని బట్టి ఉత్సాహాన్ని బట్టి అలవడతాయి. అందుకు ఆంగ్ల సాహిత్యమే ప్రామాణికం కాదు. మన సాహిత్యం కూడా చాలా గొప్పది. ఈ విషయం మనం గ్రహించాలి. ఇకపోతే నేను సంక్షిష్టంగా రాసిన రాతలను అర్ధం చేసుకోలేను. మన్నించండి. నా పరిమితి ఇంతే!
నేను పై కవిత సౌలభ్యం కోసం తీసుకున్నాను తప్ప.. నాకు ఆంగ్లం రాదు. గూగుల్ అనువాద సాయం తీసుకున్నాను. అంతే!
ఇవాళ ఫేస్ బుక్ ని పక్కన పడేసి “సుందరకాండ” చదువుకుంటాను. మన భాష లోని మాధుర్యం అనుభవించడానికి. ఇదంతా చదివినందుకు ధన్యవాదాలు.
నా మెదడు పెద్ద నిర్జన మైదానం. అంతగా అవసరం లేని పనికి రాని దరిద్రపు జ్ఞానంతో నిండి వున్నప్పుడు మంచి కవితో కథో నా అంచనాకు అందదు. అందుకోలేను. కఠినం అయిన వాటి జోలికి పోకుండా కరుణ శ్రీ “లలిత సుగుణజాల తెలుగు బాల” చదువుకుంటాను.
ఈ రాతతో నా సమూహం లోని మిత్రులను ఎవరినైనా బాధ పెట్టి వుంటే వారికి ప్రేమతో ఈ గులాబీ. 🌹మీ రచనల విలువను నేను అందుకోలేని అజ్ఞానిని. మన్నించండి. మీ వాల్ మీద స్పందించలేకపోతున్నందుకు మన్నించండి. 🙏
చెట్లు ఉసురుపోసిన (ప్రసాదించిన) జీవితం - పెరుమాళ్ మురుగన్
ఈ కథ మూలం: ప్రసిద్ధి తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ - అమ్మ. "A life bestowed by trees" అనే శీర్షికతో కవితా మురళీధరన్ ఇంగ్లీష్ లోకి అనువదించారు. ఇంగ్లీషు నుండి తెలుగు లో అనువదించిన వారు - సునీతా రత్నాకరం
ఒక మంచి కథను స్పూర్తికరమైన అమ్మ ను సాహితీ మిత్రులకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో
ఇప్పుడు ఈ కథను చదివి వినిపిస్తున్నది… వనజ తాతినేని
అమ్మ - చెట్లు ఉసురుపోసిన (ప్రసాదించిన) జీవితం - పెరుమాళ్ మురుగన్
అమ్మ దగ్గర ఎప్పుడూ డబ్బులుండేవి. తన అవసరాలకి ఎప్పుడూ ఎవరిమీదా ఆధారపడేది కాదు. తన ఆరోగ్యం దెబ్బ తిన్నప్పుడు కూడా ఉన్న మేకల్ని, ఆవుల్ని అమ్మేసి ఇంట్లోనే ఉండిపోయింది. నేను నా కుటుంబంతో సహా నామక్కల్ కి మారినప్పటి నుంచి పొలంలో ఉన్న నా రెండు గదుల ఇల్లు ఖాళీగానే ఉంది. అమ్మని అందులో ఉండమన్నాం, కానీ నాకు అంత పెద్ద ఇల్లు ఎందుకని దానిని అద్దెకిచ్చేసింది. ఆ ఇంటి వెనక నా పుస్తకాలు పెట్టి ఉంచిన చిన్న అర లాంటి గది ఉంది. మట్టి పెంకులతో కప్పు వేసిన ఆ చిన్న అర చాలు అనేది.
నేను ఎప్పుడు డబ్బులు ఇవ్వాలని చూసినా అమ్మ అనే మాట ఒకటే 'నాకేం ఖర్చులుంటాయి?' అని. బదులుగా నా పిల్లలు ఎప్పుడు మా ఊరు వెళ్లి వస్తున్నా తానే పదో, ఇరవయ్యో వాళ్ళ చేతిలో పెట్టేది.
ఆ ఇంటి నుంచి వంద, నూట యాభై రూపాయల అద్దె వచ్చేది. ఆవిడ ఒక్కతే ఉన్నా ఆ కాసిన్ని డబ్బులెట్ల సరిపోతాయ్? అందుకే నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా కూరగాయలు, సరుకులు తీసుకెళ్ళేవాణ్ణి. 'ఇవన్నీ నాకెందుకు? నేనేం చేసుకుంటాను? నువ్వు డబ్బులన్నీ దుబారా చేస్తావేం? నాకేమైనా అవసరం వుంటే నేనే అడుగుతాను కదా' అని నన్ను కోప్పడేది. అప్పట్నుంచీ అమ్మకేం కావాలో ముందే అడిగి తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నా. అమ్మా నీ ఖర్చులన్నీ ఎట్లా గడుస్తున్నాయ్ అని నేను ఆమెనడిగితే ఇంటి బయట చుట్టూ ఉన్న చెట్లని చూపించి, 'అవి ఇస్తాయి' అని చెప్పేది. మా అమ్మకి ఆ కొన్ని చెట్ల నుంచి వచ్చే ఆదాయం సరిపోయేది.
పెళ్ళికి ముందు మా అమ్మకి పొలం పనులు ఏమీ తెలియవు, ఒకసారి నేర్చుకున్నాక ఆమె మొక్కని పెంచడం కూడా ఒక అందంతో చేసేది. అమ్మ అంట్లు తోమే జాలారు దగ్గర్లో ఒక మిరపచెట్టుని ఎప్పుడూ పెంచేది. ఏడాది పొడుగూతా ఆమెక్కావాల్సిన మిరపకాయలు ఆ చెట్టే ఇచ్చేది. రెండు మూడేళ్లు వుండేది. ఆకుపచ్చటి గొడుగులాగా చూడటానికి కూడా కంటికింపుగా వుండేది. కొన్ని కాయలు పచ్చిగా కోసుకునేది, కొన్నిటిని చెట్టుమీదే పండనిచ్చి ఎండబెట్టేది. పది రోజులకోసారి పొరియల్ చెయ్యడానికి ఒకట్రెండు కలేపళ్ళ మొక్కలు సరిపొయ్యేవి. అమ్మ ప్రకృతిని ఉపయోగించుకునే పద్ధతి భలే ముచ్చటగా వుండేది.
నామక్కళ్ లో మేముండే ఇంట్లో కూడా అమ్మ చెట్లు పెంచింది. ఒక ములగ చెట్టు, ఓ కరివేపాకు చెట్టు బయటి గోడ పక్కనే వేసి, డాబా ఎక్కితే వాటిని కోసుకొనేంత పెరిగేదాకా పెంచింది. మా ఇంటిముందు నాటిన గోరింటాకు మొక్క ఇప్పుడు పెద్ద పెద్ద కొమ్మలతో గోడంతా కమ్మేసింది. వాకిలి మొత్తం నింపేసే ఆ గోరింట వాసన తగిలినప్పుడల్లా అమ్మ, అమ్మతోపాటే ఆమె ఆ చెట్లను జాగ్రత్తగా పెంచుకున్న జ్ఞాపకం నాలో నిండిపోయేది.
అమ్మ మా ఊళ్ళో పెంచిన చెట్ల ముచ్చట ఇంకా పెద్దది. ఇంట్లో, పొలంలో ఎన్నో చెట్లు పెట్టింది. ఒక్కో కరివేపాకు చెట్టు, మునగ చెట్టు, నిమ్మచెట్టు, జామచెట్టు, ఉసిరిచెట్టు, రెండేసి మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, దానిమ్మ, చింత చెట్లుండేవి. మొత్తం పదమూడు చెట్లు - మాకంత గుర్తు.
మా చింత చెట్లు ఓ మాదిరివి, చింతకాయలు పండి ఎండిపొయ్యాక కూడా వాటంతట అవి రాలేవు కావు, కర్రతో కొట్టి దులుపుకోవడమే. మా అమ్మ ఆ చింత పండు ని 'నరం చింత' అనేది, నరాల్లాగా చెట్టుకి అతుక్కుని ఒక పట్టాన రాలవని. ఒక్కో ఎండిన చింతకాయని జాగ్రత్తగా రాల్చి, గింజ తీసేసి దాచేది. తనకోసం కొంత పక్కన పెట్టుకుని మా అన్నకూ, నాకు ఏడాదికి సరిపడా చింతపండు ఇచ్చేది. చింత చెట్టు పంటని ఎప్పుడూ అమ్మింది లేదు, మిగిలిన పదకొండు చెట్ల నుంచి వచ్చిందే అమ్మ ఆదాయం.
మా చుట్టుపక్కల పెద్దగా కరివేపాకు చెట్లు ఉండేవి కావు, నీటి ఎద్దడితో పెంచడం కష్టమని ఎవరూ వేసేవాళ్ళు కాదు. మా దగ్గర కరివేపాకు ఎంత అబ్బురంగా ఉండేదంటే ఎవరింట్లో అన్నా ఒక్కళ్ళే బిడ్డలు వుంటే వాళ్ళని లేత కరివేపాకు మొక్కతో పోల్చేవాళ్ళు. మా అమ్మ కరివేపాకు చెట్టు మొదట్లో ఓ కుండ పెట్టేది. పంపులో నీళ్లు వచ్చినప్పుడల్లా ఆ కుండ నింపి పెట్టేది. మేము కాళ్ళు, చేతులు అక్కడే కడిగేవాళ్ళం కాబట్టి ఆ చెట్టుకి వేరే నీళ్లు పొసే పనిలేదు. కొబ్బరి చెట్ల దగ్గరా అట్లాగే రెండు కుండలు పెట్టింది. అంట్లు అక్కడ కడిగేది మళ్ళీ నీళ్లు పోసేపని లేకుండా. జామ, ఉసిరి చెట్లు అమ్మ వుండే చిన్న గది ముందే వుండి కావలసినంత నీడ ఇచ్చేవి ఇల్లూ, వాకిలికి, వాటికి మాత్రం అప్పుడప్పుడూ కాసిన్ని నీళ్లు పోస్తే సరిపొయ్యేది.
దానిమ్మ చెట్లు ఇంటికీ రోడ్డుకి మధ్య ఉన్న కాలిబాటలో వుండేవి. నా భార్య ఈ దానిమ్మ గింజలు మొలకెత్తించి ఒక పాలిథిన్ సంచీలో పట్టుకెళ్లి అక్కడ నాటింది. ఆ చెట్టు బాగానే ఎదిగి పూలు, పిందెలు వచ్చేవి. పిందెలు కాస్తా కనపడగానే ఎక్కడినుంచో పురుగులొచ్చి వాటిని పాడు చేసేవి. అమ్మ ఆ పిందెల మీద బూడిద చల్లి పురుగుల్ని చంపాలని చూసేది కానీ, ఆ బూడిదని అవి మంచిగ అరాయించుకునేవి.
ఒకసారి అమ్మ ఇంటి చుట్టుపక్కల కనపడ్డ పాలిథిన్ సంచీలు పోగు చేసి ఆ దానిమ్మ కాయల చుట్టూరా జాగ్రత్తగా చుట్టి దారంతో కట్టేసింది. పురుగులు ఈ సంచీల్ని ఏమీ చేయలేకపోయాయి, అట్లా అమ్మకి అవి క్రిమి సంహారకాలుగా ఉపయోగపడ్డాయి. అప్పట్నుంచి అమ్మ ఆ చెట్టుమీద ఒక కన్ను వేసి ఉంచేది, కాయ కనపడగానే చిటుక్కున పాలిథిన్ సంచీ కట్టేది పురుగు దాన్ని చూసేలోపు. మా దానిమ్మ చెట్టుమీద పాలిథిన్ సంచీలు పెరుగుతున్నట్లు వుండేది అదాటున చూస్తే. అప్పుడప్పుడూ జాగ్రత్తగా ఆ సంచీలు విప్పి కాసేపు కాయకు గాలి తగలనిచ్చి మళ్ళీ కట్టేసేది. ఆ కాయ పూర్తిగా పండి సుళువుగా తెంపగలిగినప్పుడే వాటిని తెంపేది చెట్టుకి దెబ్బ తగలకుండా. మా పాలు పళ్ళు మేము తిన్నాక మిగిలినవి అమ్మితే బాగానే డబ్బు వచ్చేది వాటిమీద.
అప్పుడప్పుడూ వచ్చే వానలు గోరింటాకు చెట్టునీ, మునగ చెట్టునీ పోషించేవి. గోరింటాకుని ప్రత్యేకం కొనేవాళ్ళు ఉండరు, అందుకే వేరేవి ఏమైనా కొంటున్నప్పుడు వాళ్ళు గోరింటాకు తెంపుకోవచ్చు. మునగచెట్టు మాత్రం ఏడాది పొడుగునా ఏదోకటి ఇచ్చేది. మునగాకు ఎప్పుడూ వుండేది, కాలంలో మునక్కాయలు కాసేవి. మునగచెట్టు మహా పెళుసు, అందుకే ఆ చెట్టుని ఎవ్వరినీ పట్టుకొనిచ్చేది కాదు, అమ్మే చులాగ్గా చెట్టు కందకుండా ములక్కాయలు కోసే విద్య నేర్చుకుంది. ఎప్పుడైనా గాలి విసురుకి ఓ కొమ్మ విరిగిపోతే చెయ్యి విరిగినంత పనయ్యేది అమ్మకి. మునగచెట్టుకి పసిపిల్లలంత సుకుమారపు అవసరాలుండేవి, అమ్మ ఆ చెట్టుని అంత సుకుమారంగానే చూసుకునేది. మా మావిడిచెట్లు ఇంటి నుంచి కాస్త దూరంగా పొలంలో వుండేవి. ఆ రెండు చెట్లకి పైపుతో నీళ్లు పెట్టేది. చెట్లనుంచి వచ్చే వస్తువేదీ అమ్మ వృధా పోనిచ్చేది కాదు. అమ్మ బజారుకి ఎప్పుడూ ఉత్త చేతులతో బయలుదేరేది కాదు, రెండు మూడు కట్టల కరివేపాకు, మునగాకో, ఏ కూరగాయలో సంచీలో వేసుకునేది. దారిలో ఉన్న ఇళ్లలో వాటి అమ్మకం అయిపోయేది. చుట్టుపక్కల పిల్లలు జామకాయలు, ఉసిరికాయల కోసం వచ్చేవాళ్ళు, అవి అమ్మకి అందే ఎత్తులో వుండవు కాబట్టి ఆ పిల్లల్ని కోసుకోనిచ్చి వాళ్ళిచ్చిన డబ్బు తీసుకునేది. మామిడిపళ్ళ కాలం వస్తే మాత్రం పొద్దంతా ఆ చెట్లకి మా అమ్మ కావిలి వుండేది. ఆ చెట్ల దరిదాపుల్లో ఒక నీడ తచ్చాడినా 'ఎవరక్కడ?' అని అరుస్తుండేది.
మా ఇంటికెప్పుడైనా వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఉన్న మునగాకో, మునక్కాయలో తప్పకుండా కోసుకుని సంచీలో వేసుకునేది, వెళుతూ వెళుతూ వాటిని అమ్మేసి సంచీ ఖాళీ చేసుకునేది, ఎక్కడా వస్తువు దుబారా కావద్దు అమ్మ లెక్కలో.
అమ్మ కంటపడకుండా ఒక్క పసి పిందె అయినా తప్పించుకునే ప్రసక్తి లేదు. ఇంక మామిడిపళ్ళ కాలంలో అయితే మేము ఎంత బతిమిలాడినా ఊరునుంచి కదిలేది కాదు. తప్పక రావాల్సిన పరిస్థితి వస్తే సాయంత్రంగా వచ్చి మళ్ళీ పొద్దున్నే ఇంటికి చేరేది. మేము కనుక వేసవిలో ఊరికి వెళితే వెంటనే చెట్ల దగ్గరికెళ్లి రెండు పండిన కాయలు తెంపుకొచ్చేది. ఆ పళ్ళు మా చేతికిస్తూ 'మీరొస్తున్నారని చెట్టుమీదే వుండనిచ్చా' అని చెప్పేది ఎక్కువ రోజులు ఉండనిచ్చినందుకు చెట్టు తనకేదో అనుమతి ఇవ్వాలన్నట్టు. మాకు ఎప్పుడూ బాగా మగ్గిన జామకాయలు, చక్కగా పండిన ఉసిరికాయలు దొరికేవి. అమ్మకి ఆ చెట్ల అణువణువూ తెలుసు.
మామిడిపళ్ళ కాలంలో అమ్మ ఆదాయం బాగా వుండేది. కొబ్బరికాయలు కూడా అమ్మేది. అమ్మకి ఎంత ఆదాయం వచ్చేది ఇవన్నీ అమ్మితే? మహా అయితే కొన్ని వందలు. మూడొందల రూపాయలు మహా బాగా సరిపోతాయి అనేది, ఇంకా కొంత డబ్బు దాచేది కూడా. నా అంచనా అయితే ఇంటద్దెతో కలిపి ఒక అయిదొందలు వస్తాయి నెలకి. అందులోనే బియ్యం, ఉప్పులు, పప్పులు, కూరలు గడిపేది అమ్మ.
నాకు మంచి జీతం వచ్చే గవర్నమెంటు ఉద్యోగమని అమ్మకి తెలుసు. అమ్మ అవసరాలు నేను చూసుకోగలననే నమ్మకం, తాను ఒప్పుకుంటే చూసుకుంటాననే గర్వం ఉన్నాయి ఆమెకు. అప్పట్లో మా ఊళ్ళో ముసలివాళ్లైన తల్లిదండ్రుల్ని తిండికి కూడా సరిగా లేకుండా తిప్పలుపెట్టిన పిల్లల కథలేమీ తక్కువలేవు. మన దగ్గర పిల్లలు కావాలనుకునేదే ముసలితనంలో ఆసరాగా ఉంటారని. చిన్నప్పటినుంచీ 'పెద్దయ్యాక మీ అమ్మా నాన్నల్ని చూసుకోవా?' అన్న మాటల్ని నూరిపోస్తూనే వుంటారు. అయినా తల్లిదండ్రుల్ని గాలికి వదిలేసే పిల్లలు వుంటూనే ఉన్నారు. అమ్మకీ మొదట్లో ఈ భయం వుండేది, కానీ నా చేతలతో ఆమెకి గట్టి నమ్మకం కలిగింది తనకా గతి పట్టదని.
ఎవరైనా అమ్మని నిన్ను వాడు చూసుకుంటాడా అని అడిగితే, 'వాడెప్పుడైనా నేను అడిగింది ఇవ్వనన్నాడా? కట్టలకొద్దీ నోట్లు ఇవ్వబోతాడు, నేనే వద్దంటాను. నన్ను చూడటానికి ఎప్పుడైనా ఉత్త చేతులతో వస్తాడా? సంచీల నిండా ఏవొకటి నింపుకువస్తాడు. ఇక్కడేమైనా పిల్లలున్నారా అవి తినడానికి? అందుకే వాడిని అవేవీ తేవద్దంటాను. నా ఒక్కదానికి గడవడానికి ఈ చెట్లు చాలవా?' అంటుంది.
అమ్మకి పార్కిన్సన్స్ జబ్బు చేశాక ఎనిమిదేళ్లు బతికింది. ఆమె ఇష్టం మీద హోమియోపతీ మందులు వాడినా, అల్లోపతీ మందు కూడా వేసుకునేది. రోజుకో మాత్ర, అది ఖరీదైనదే. ఎక్కువ ధర అని తెలిస్తే వాటిని వద్దంటుందన్న భయానికి నేను అవి చవకేనని చెప్పా. ప్రతీ నెలా మర్చిపోకుండా ఆ మాత్రలు కొనిచ్చేవాణ్ణి. ఊళ్ళో ఎవరైనా 'నువ్వు నీ కొడుకుని చదివించావ్, వాడు నిన్ను సరిగ్గా చూసుకుంటున్నాడా?'అని అడిగితే అమ్మ 'మీకు కళ్ళు కనబడట్లేదా, నెలనెలా ఎన్నెన్ని మాత్రలు తెచ్చి పోస్తున్నాడు? వాటికీ ఎంత ఖర్చవుతుందో ఎప్పుడైనా చెప్పాడా? అవి వెయ్యో రెండువేలో నీకేమైనా తెలుసా?' అని పోట్లాడేది.
ఆ చెట్లు అమ్మకి ఆదాయం ఇవ్వడమే కాక ఇంకో పెద్ద మేలు చేసాయి.
నేనెప్పుడూ ఊరికి వెళ్లినా అమ్మ ఏ చెట్టు కిందో కూర్చొనో, నిలబడో వుండేది. మా ఇల్లు పొలాల్లో వుండటంచేత ఒంటరిగా వుండేది. మిగిలిన ఇళ్ళు కూతవేటు దూరంలో వుండేవి కానీ, యింటి ముందు అటూ ఇటూ జనాలు తిరిగేవాళ్లు కాదు. ఎప్పుడైనా జనాలు ఇటు వచ్చినా ఒకట్రెండు మాటలంతసేపు కనపడేవాళ్లు. ఎవరి పని వాళ్ళకుండేది. అమ్మకి చెట్లతోనే సావాసం. వాటితో మాట్లాడేది. వాటితో పాటు అమ్మ ఒక చెట్టు, అట్లా కలిసిపోయేది. వాటిలో వచ్చే చిన్న మార్పైనా అమ్మ పసిగట్టేది. ఏ చెట్టు మీద ఎన్ని పిందెలున్నాయి, ఎన్ని పండ్లున్నాయి, ఎన్ని కాయలున్నాయి, అవి ఎన్నాళ్ళలో పండుతాయి, అన్నీ అమ్మకి తెలుసు. ఏ పనిలో ఉన్నా వాటివైపు ఓ చెవి వేసి వుంచేది. అమ్మకు కొన్నేళ్లు ఎక్కువ ఆయుష్షు పోసింది ఖాయంగా ఆ చెట్లే.
రెండేళ్లపాటు వర్షాలు లేవు మా ప్రాంతంలో. బోరింగులో నీళ్లు అడుగంటిపోయాయి. ఆ చెట్లని కాపాడానికి అమ్మ ఎన్నో తిప్పలు పడ్డది. పార్కిన్సన్స్ వల్ల కాళ్లు చేతులు సరిగ్గా చాపగలిగేది కాదు, బరువులు పట్టుకునే శక్తి వుండేది కాదు. ఇంటి దగ్గర ఉన్న చెట్లకి పెద్ద బాధ లేదు కానీ మామిడి చెట్లు వడలిపోవడం మొదలైంది. వాటిని కాపాడుకోవాలని అమ్మకు ఎంత ప్రాణంగా ఉండేదంటే పిల్లలు ఆడుకునే రెండు గురుగుముంతలు కొనుక్కొచ్చింది. వాటిలో నీళ్లు నింపుకుని ఆ చెట్ల దగ్గరికి బయల్దేరేది. ఆ కాస్త దూరానికి ఒకటిరెండుసార్లు మధ్యలో ఆగి ఊపిరి పీల్చుకుంటేగానీ నడవగలిగేది కాదు. అట్లా ప్రతీరోజూ కాసిన్ని నీళ్ళని పోసి ఆ చెట్లని మళ్ళీ జీవం పుంజుకునేలా చేసింది.
మేము అమ్మని చూసేందుకు వెళ్ళినప్పుడు ఆమె అడిగేది ఒక్కటే 'ఆ మామిడి చెట్లకి ఒక కుండెడు నీళ్లు పోసిపొమ్మని'. అమ్మ దగ్గరికి ఏదైనా కొనడానికి వచ్చినవాళ్ళనీ ఆ మాటే అడిగేది. రెండేళ్లపాటు ఆ మామిడిచెట్లు పూత పుయ్యలేదు. కానీ అమ్మ పంతంతో బతికించింది. మూడో ఏడాది కొంచెం వర్షాలు పడ్డాయి, మామిడిచెట్లు మళ్ళీ పూత పూసి కాయలు కాసాయి, అమ్మ సంబరానికి అంతులేదు.
అమ్మ చివరి యేడాది భారంగా గడిచింది. ఆవిడ ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో మా ఇంటికి తీసుకువచ్చాం. ఊర్నుంచి అమ్మని చూడటానికి ఎవరైనా వస్తే ముందు చెట్ల గురించే వాకబు చేసేది. మేము కూడా ఊరికి వెళ్ళినప్పుడల్లా తప్పనిసరిగా నీళ్లు పోయడం అలవాటు చేసుకున్నాం. ఎప్పుడైనా అమ్మ ఆరోగ్యం కాస్త మెరుగైతే తనను బస్సు ఎక్కించేదాకా ఊరుకునేది కాదు. ఆ చెట్లకి ఆ గురిగిముంతలతో నీళ్లు పోస్తూ కనీసం వారమన్నా అక్కడ వుండేది. ఆ చెట్లని చూసుకోవడానికి ఎవరూ లేరని అమ్మ చాలా దిగులుపడేది.
అమ్మ చివరి ఆరు నెలల్లో మా ఊరికి వెళ్లలేకపోయింది. మేము వెళ్ళినప్పుడల్లా ఆ చెట్లకి నీళ్లు పోస్తూనే ఉన్నాం. మేం చెయ్యగలిగింది అంతే. పాతిక మైళ్ళ దూరంలో ఉన్న చెట్లకి నెలకోసారికన్నా ఎక్కువ వెళ్లి నీళ్లు పొయ్యలేకపోయాం. అమ్మ కడతేరి పోయాక కొన్ని నెలలపాటు మా ఊరికి వెళ్లలేకపోయాం. అమ్మ వస్తువులు తీసుకురావడానికి నేను వెళ్ళినప్పుడు ఆ మామిడి చెట్లని ఒకసారి చూడాలనుకున్నాను. చెప్పడానికేముంది? రెండు చెట్లూ ఎండిపోయి మొద్దుల్లా నిలబడ్డాయి. అనాధ పిల్లల్లా!
---------------- సేకరణ*************** ఈ కథ పోస్ట్ చేయడం పై అభ్యంతరం వుంటే లేదా copy right వుంటే గనుక తెలియజేయండి. తొలగించగలను. మంచి కథను పాఠకులకు అందించడమే నా ఉద్దేశ్యం అని మనవి చేస్తూ..
ఈ కథ చదువుతూ వుంటే.. ఆవిడ.. ఒక దృఢమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మ అనిపించింది, చాలా మంది అమ్మల్లాగే వుంది కూడా! విజయవంతమైన అనేదానికన్నా ఆటుపోట్లు తట్టుకునే నిబ్బరం ఉన్న ప్రతి స్త్రీ పురుషుల వెనుక గట్టిగా నిలబడ్డ అమ్మ మాత్రం కచ్చితంగా వుంటుందని అనిపిస్తుంది. అమ్మ కు 🙏
సాధారణంగా నేను చాలా ఉత్సాహంగా ఉంటాను. నాకు అడ్డుకట్ట వేయగల్గినవి సీరియస్ కండీషన్స్ మాత్రమే! లేకపోతే కారణం లేకుండా ఎవరైనా డిస్ట్రబ్ చేస్తే ముభావంగా మారిపోతాను. ఎవరైనా పలకరిస్తే మాటల ప్రవాహమే! అందులో వ్యక్తిగతం పదిశాతం సామాజికం నలబై శాతం.. మిగతాది పుస్తకాలు గురించిన మాటలు వుంటాయి. పాతికేళ్ళుగా నా మైండ్ అలా ట్యూన్ అయిపోయింది మరి. ఆపాత మధురం సంగీతం - ఆలోచనామృతం సాహిత్యం అని సిరివెన్నెల అన్నారు కదా!
పిల్లలు మనని వదిలి దూరంగా వెళ్ళే సమయానికి మనకు చేతినిండా సరిపడా పని లేదా కాలక్షేపం వుండాలి. వ్యక్తిగతంగా మన అభిరుచులకు సమయం కేటాయించుకోవాలి. లేకపోతే డిప్రెషన్ కి గురి అవుతాము. మా అబ్బాయి 15 ఏళ్ళ క్రితం USA వెళ్ళేటప్పుడు డెస్క్ టాప్ ఓపెన్ చేయించి మౌస్ చేతిలో పెట్టి వెళ్ళాడు. ఇక నా కాలక్షేపం అభిరుచి అవసరం అన్నీ.. ఇంటర్నెట్ తో అనుసంధానం అయిపోయింది. బ్లాగ్ ఓపెన్ చేసాను.. ఏవో కాలక్షేపం కోసం రాస్తూ.. నాకున్న సాహిత్య అభిలాషను సీరియస్ గానే తీసుకున్నాను. ఇదిగో ఇప్పుడు ఇలా వున్నాను. ఎక్కువగా ఒంటరితనం కోరుకుంటాను. అలా అని నేను ఇంట్రావర్ట్ ని కాదు. ఒకోసారి చుట్టుపక్కల వందమంది వున్నా నేను నాతో ఏకాంతంగా వుండగలను. నన్ను నేను యాక్టివ్ గా వుంచుకోవడానికి నా చుట్టూ చిన్నపిల్లలు వుంటే వారితో మాట్లాడతాను.వారితో ఆటలాడతాను. మంచి పాటలు వింటాను. మూడీగా వుంటే పెద్ద సౌండ్ పెట్టి ఫాస్ట్ బీట్ పాటలు వింటాను. డాన్స్ చేస్తాను. ఫ్రెండ్స్ తో బాతాఖానీ వేస్తాను. క్రమం తప్పకుండా మా పెద్దవారిని పిల్లలను పలకరిస్తాను.
ఎన్ని ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా వచ్చినా నేనెప్పుడూ కృంగిపోను. కానీ ఎవరైనా అసంబద్ధమైన ఆరోపణలు చేసినా, నిందించినా చాలా బాధ పడతాను. త్వరగా అందులో నుండి బయటకు రాలేను. కరోనా సమయంలో పద్దెనిమిది నెలలు చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత నా మనుమరాలుతో గడిపి ఆ గాయం మాన్పుకోగల్గాను. పుస్తకాలు చదవడం.. అదీ నేను సీరియస్ సాహిత్యం చదువుతాను రాస్తాను కాబట్టి ఎక్కువగా పెయిన్ మూడ్ లో వుంటాను. నన్ను సేదదీర్చేది సంగీత సముద్రమే! పాటలు.. పాటలు.. పాటలు. Instrumentals music వింటాను.ఎక్కువగా flute base వినడం నాకిష్టం. నాకు వినడమే తప్ప సంగీత పరిజ్ఞానం లేదు. వృద్ధాప్యం ముంచుకొస్తుంటే మనుషులు యాక్టివ్ గా వుండాలంటే సంగీతం తప్పక వినాలి పసిపిల్లలతో గడపాలి. లేకపోతే స్థబ్దత ఆవరిస్తుంది. హాస్యం కూడా మనిషిని యాక్టివ్ గా వుంచుతుంది. నేను హాస్య రసాన్ని ఎంజాయ్ చేయలేను.
నేను ఎప్పుడైనా.. పాటలకు తగ్గట్టు డాన్స్ వేస్తుంటే మా నాన్న చూస్తే సన్నగా నవ్వుకుంటారు. మా అన్నయ్య పరుగులు పెడుతున్నా, డాన్స్ వేస్తున్నా “ఏంటి చిన్న పిల్లలాగా “ అని మందలిస్తాడు. మా అబ్బాయి అయితే “అమ్మా! నీ ఏజ్ ఎంత?” అంటాడు. ఇవ్వన్నీ అసలు పట్టించుకోను నేను. మన శరీరం మైండ్ హెల్దీ గా ప్రెష్ గా వుండాలి అంటే.. మనకి నచ్చిన పనులు చేయాలి. మొక్కలు పెంచడం, పాటలు వినడం, నలుగురితో కలవడం, మాట్లాడటం వల్ల యాక్టివ్ గా వుంటాము. అంతే తప్ప stage యెక్కి డాన్స్ చేస్తామని కాదు.ఊరికే సరదాగా ఇంట్లోనే, అంతే! సినిమాల్లో పాటలు మనలోని కాల్పనిక భావాలకు రూపాలు. కాకపోతే మనమందరం ఎందుకు చూస్తున్నాం చెప్పండి!?
నా మనుమరాళ్ళు ఇద్దరూ డాన్స్ చేస్తారు. చిన్నామె 20 నెలలు. చాలా యాక్టివ్. డాన్స్ లో మంచి ఈజ్ అండ్ గ్రేస్ వుంటుంది.ఆరేళ్ల పెద్దామె.. వీడియో కాల్ లో సంగీత పాఠాలు చెబుతుంది. వాళ్ళతో ఓ పదేళ్ళు యాక్టివ్ వుండి ఆడుకోవాలి,పాడుకోవాలి
మన శంకరవరప్రసాద్ గారు.. ఆ వయసులో డాన్స్ వేస్తుంటే మనక్కూడా వేయాలనిపిస్తుంది కదా! 😊. నేనైతే డాన్సింగ్ హిట్ ఫెయిర్ చిరంజీవి - రాధ గారి కాంబినేషన్ లో ఏ పాటకైనా పదం కలపాలి వచ్చీ రానట్టు అయినా సరే.😊😊
డాన్స్ అయినా సరే, డ్రెస్సింగ్ అయినా సరే, హెయిర్ స్టైల్ అయినా సరే, రాత అయినా సరే, డ్రైవింగ్ అయినా సరే! నన్నెవరూ ఆపలేరు. ఇవి నా వ్యక్తిగతం. విచక్షణ హద్దులు నాకు తెలుసు.
I am most responsible citizen.
మనుషులు,పరిస్థితులు,సంఘటనలు మనని బాధపెడతాయి. కానీ మనుషులు సృజించిన సాహిత్యం సంగీతం మనకి మూలమైన ప్రకృతి మనని సేదదీరుస్తాయి. మనకు ఎవరో తోడుంటారని వస్తారని ఆశించకండి. ఎవరికి వారే తోడు. ఎవరికి వారే ఒక సైన్యం. ఎవరికి వారే బుల్లెట్ ప్రూఫ్,శిరస్థ్రాణం.
మన పిల్లలు ఎక్కడో దూరంగా వారి జీవనపోరాటంలో వారుంటారు. వారికి ప్రతిరోజూ మనని పలకరించే ఓపిక ఆసక్తి కూడా లేకపోవచ్చు. వారు పలకరించడం లేదనే కినుక కూడా అనవసరం.
మనని మనమే ఎంగేజ్ చేసుకోవాలి. ఇంకా మన తరానికి కొద్దో గొప్పో రక్తస్పర్శ విలువ తెలిసిన తోడబుట్టినవారు, బంధువులు వున్నారు. వారితో చిన్న చిన్న విషయాలకు విభేధాలకు పోకుండా జాగ్రత్తగా బంధాలను కాపాడుకోండి. ఒకరికొకరు తోడుగా నిలబడండి. సోషల్ మీడియా స్నేహాలతో జాగ్రత్తగా వుండండి. పర్సనల్స్ వరకూ వెళ్ళకండి. మన గాడ్జెట్ నుండి app delete చేస్తే వారెవరో మనం ఎవరమో అన్నది బాగా గుర్తు పెట్టుకోండి. నమ్మకమైన మిత్రులు నలుగురు వున్నా చాలు. వీలైనంత ప్రశాంతంగా వుండేటట్లు జాగ్రత్త వహించండి. వీలైనంతగా నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి దూరంగా వుండండి . పాజిటివ్ గా వుండండి. మూఢనమ్మకాలను విడనాడండి. చాదస్తం పెంచుకోకండి. డిప్రెషన్ కి సంగీతం మంచి మందు. ముఖ్యంగా YouTube video’s చూసి ప్రతి రోగం మనకు వుందని టెన్షన్ పడకండి. వారు చెప్పే వాటిలో లక్షణాలు సగం పైగా వుంటేనే డాక్టర్ ని చూడండి.
ఏ ఏజ్ గ్రూప్ వారైనా సరే సంగీతం వినండి. ఉత్సాహంగా వుండండి. మన కుటుంబ సభ్యులకు మన గురించి దిగులుపడే అవకాశాన్ని మనకు అధిక సమయం కేటాయించాల్సిన అవసరాన్ని తగ్గించే విధంగా.. నడుచుకోవాలి. వీలైనంత తక్కువగా ఇతరులపై ఆధారపడండి. గౌరవంగా వుంటారు.
మంచి పాట ఒకటి వినండి మరి.
పాట సాహిత్యం సంగీతం చిత్రీకరణ అన్నీ బాగుండే పాట ఇది.
Happy day.. and Good night.
నా పోస్ట్ లకి ఎన్ని లైక్స్ కామెంట్ షేర్ లు వచ్చాయి అన్నది పట్టించుకోను.
ఏదైనా మిత్రులతో పంచుకోవాలి అనుకున్నప్పుడు.. ఇలా వచ్చేయ్యడమే! 😊
ఇలా నిండా పూచిన మామిడి చెట్టును చూడగానే… “మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే! మాటలు రాని మూగ మనసు పాడెనులే” అనే పాట అప్రయత్నంగా గుర్తుకొస్తుంది.
లోకంలో సుందరమైన విషయాలు చాలా వున్నాయి.
అందులో నిజాయితీ గా నిరాడంబరంగా పలికే మాటలు కూడా ఒకటి. ఆ మాటలు పక్షుల పాటల వలె హృదయం నుండి దుముకుతాయి. ఆ మాటల్లో అర్థం కాని క్లిష్టత గాయ పరిచే వాడితనం వుండకూడదు. మాట సొబగులు అద్దుకున్నంత మాత్రాన అందంగా వుండదు. మన పెదవుల నుండి మన భావనల నుండి వెలువడే మాట, రాసే విషయం వివేకంతో నియంత్రించబడాలి. అప్పుడే ఆ మాటలను పలికే పెదవులు, రాసే వ్రాతలు అందంగా అనిపిస్తాయి.
మాటలు వచ్చినంత మాత్రాన సరికాదు. ఆ మాటకు మృదుత్వం ముఖ్యం. మనం వేటగాళ్ళం కాదు. ఎప్పుడూ మాట అనే బాణాలతో ఇతరులను గాయపరచడానికి.
గాయబడితే మనుషులు దూరంగా జరుగుతారు. నటించడం వేరు స్వభావం వేరు. రెండింటిని ఎదుటివారు గుర్తించగలరు.
నా దృష్టిలో అందమైన పెదవులు అంటే సదా చిరునవ్వులు చిందించే లిప్ స్టిక్ వేసుకున్న పెదవులు కాదు. అందంగా వుండి ఇతరులను గాయపరిచే మాటలు మాట్లాడే పెదవులు కాదు. హృదయపూర్వకంగా మాట్లాడే మాటలు, మాటలో మృదుత్వం ధ్వనించే మాటలు, ఉచ్చరించే పెదవులు.
మాటలు రావడమే యోగ్యతా కాదు. బాగా రాయగలమని విర్రవీగడం యోగ్యతా కాదు.
ప్రకటనాశక్తి ఒక యోగం. అది అందరికీ సంప్రాప్తించదు. దానిని సరైనరీతిలో ప్రదర్శించడం మర్చిపోవద్దు.