27, ఫిబ్రవరి 2011, ఆదివారం

ఇక్కడ ఆశలు వ్రేలాడబడ్డాయి!?

నిజం.. నాకు నచ్చని రెండు బలవంతపు మరణాలు గురించి తెలుసుకుంటే  మీకు అలానే అనిపిస్తుంది.

నేను చాలా ఆక్రోశంతో..చాలా రోజులు ఆలోచించాను.ఒక ప్రాణం పోయటానికి..ఒక డాక్టర్ ఎంత విశ్వప్రయత్నం చేస్తారు..ఒక తల్లి నవమాసాలు మోసి ఒక ప్రాణికి జన్మ ఇచ్చి ఎంత అపురూపంగా..పెంచుతారు.ఎన్ని కష్టాలు పడతారు. బ్రతుకు విలువ తెలిసీ.. మరీ.. బ్రతకలేము అనుకుని బలవన్మరణం పొందేవారిని చూసి..నాకు వారిపట్ల జాలి కలగదు. విపరీతమైన కోపం ముంచుకొస్తుంది.

ఒక సం.ము.కాలంలో నేను చూసిన మరణాలు..ఇద్దరి యువతుల మరణాలు. ఒక అమ్మాయికి 26 వయసు.న్యాయశాస్త్రంలో  పట్టభద్రురాలు.. పేరు పొందిన కూచిపూడి నృత్య కళాకారిణి. రెండేళ్ళ క్రితం జాతీయ మహిళా దినోత్శవం సందర్భంగా.. "మహిళలా-మజాకా" అన్నమెగా మహిళా  కార్యక్రమాన్ని నేను నిర్వహించినప్పుడు ఆ అమ్మాయి "పద్మశ్రీ " మా సంస్థ ఆహ్వానాన్ని అందుకుని ఒక అతిధిగా  వచ్చి చర్చాకార్యక్రమంలో పాల్గొన్నారు.ఆవేశపూరితమైన,ఆక్రోశ భరితమైన ఆ అమ్మాయి ఆలోచనావిధానం, చట్టం పై ఉన్ననమ్మకం న్యాయ శాస్త్ర పరిధిలో.. మహిళలపట్ల జరిగే అన్యాయాలకి.. శిక్షలు ఎలా  ఉంటాయో చెప్పిన తీరు.. ఆ అమ్మాయి.. యేమిమి చేయాలని అనుకుంటుందో... అవన్నీ..చెప్పడం అందరికి యెంత బాగా గుర్తు ఉన్నాయో.! తను ఒక డాన్సు స్కూల్ కూడా నడుపుతూ.. ఆసక్తి ఉన్న పేద విద్యార్ధులకి..ఉచితంగా శిక్షణ ఇస్తూ.. ఎంతో.. స్పూర్తిగా మాట్లాడిన అమ్మాయి.. కొన్ని నెలల తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయిందన్న వార్త దిన పత్రికలో చూసి నేను షాక్ అయ్యాను. మన తోటి  బ్లాగర్ తెలుగు కళ కూడా ఫోన్ చేసి ఆ అమ్మాయే అని నిర్ధారించుకున్నాక  ఎంత  బాధని వ్యక్తం చేసారో. అంత  మంచి ఆలోచనా విధానాన్ని వ్యక్త పరచిన ఆ అమ్మాయేనా.. ఇలా చేసింది అని ఆశ్చర్య పోవడం తోపాటు.. బాధ,కోపం మిళితమయ్యాయి.

ఎందుకు.. ఈ ఆవేశాకావేషాలతో జీవితాని తృణప్రాయంగా భావించి తల్లిదండ్రులకి ఆవేదనని మిగిల్చి అలా.. పచ్చని ఆశలు నేరవేర్చుకోకుండానే..ఉరితో.. వ్రేలాడ బడటం!? చదుకుని పదిమందికి సాయం చేయగల మేధ ఉండి, వారసత్వ సంపదగా.. కళని అందించాల్సి ఉండి..బలవన్మరణం. కారణాలు ఏదైతేనేం..విలువైన జీవితం ముగించుకుంది. అసలు చావడానికి.. ఎంత ధైర్యం కావాలో.. చచ్చే ధైర్యం వచ్చిందంటే..బ్రతికి చూపడం ఎంత తేలికో..!? నాకు తెలుసు అది నా అనుభవం కూడా.

ఇక రెండవది.. ఇటీవలె..  మాకు సమీపంలో.. జరిగిన సంఘటన. అమ్మాయి డాక్టర్.ధనవంతుల కుటుంబంలో పుట్టిన అమ్మాయి.తండ్రి మరణం తర్వాత ఆ అమ్మాయికి  వాళ్ళ హోదాకి తగిన వరునితోనే వివాహం జరిగింది. భర్త, అతని కుటుంబీకులందరు  ధన పిశాచిలు. పెళ్లి ఆరు నెలల కాలంలో.. నిత్యం అధిక కట్నం కోసం వేధింపులు. ఆ అమ్మయి తల్లికి ఎప్పటికి అప్పుడు అక్కడ విషయాలు చెబుతూనే ఉండేది. కొంత సర్దుబాట్లు.. కొంత కాలం సైలంట్ గా ఉండటం.తర్వాత తిరిగి వేధింపులు మామూలే. అది భరించలేక  ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చి తల్లికి అన్ని విషయాలు చెప్పి..కడసారి మురిపించి గోరుముద్దలు తిని మరీ..ఏ మాత్రం  అనుమానం  కలగకుండా.. నమ్మించి మరీ.. ఒక సూయిసైడ్ నోట్ వ్రాసి ఆత్మహత్య చేసుకుంది. కట్న పిశాచానికి బలి అయిన  ఒక వైద్యురాలి  బలవన్మరణం ఎంత సిగ్గు చేటు!? పైగా ఆ అమ్మాయి గర్భవతి కూడా. తన తల్లికి.. వేదన మిగిల్చి ఒక ప్రాణిని     భూమిపైకి రానీయకుండా.. ఒక  ప్రాణిని నలిపేసే హక్కు ఎవరు ఇచ్చారు ?

ఆ అమ్మాయి చేసిన  పిచ్చి పనికి ఎంతగా కోపం వచ్చిందో. ఆ అమ్మాయిని  డాక్టర్ చదివించడానికి  తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో, ఎంత ఖర్చు పెట్టి ఉంటారో.. ఒక డాక్టర్నితయారు చేయడానికి   ప్రభుత్వ ధనం (పరోక్షంగా ప్రజల ధనం ) ఎంత ఖర్చుఅయ్యిందో.. ఎంత మందికి వైద్య సాయం చెయ్యాల్సిన ఆ చేతులు..  అలా పిరికితనంతో..ప్రాణాలు తీసుకోవడం  ఏమిటో..!? వీళ్ళకి  మంచి చదువులు చదవడం  తప్ప జీవితాన్ని చదువుకోవాలని నేర్పలేని  ఈ.. ఉన్నత చదువులు ఎందుకు!?

తప్పు తమది కాకపోయినా.. సరే.. మూల్యాన్ని ప్రాణ రూపంలో.. త్యజించడం ఎంత వరకు సబబు. ఎన్ని కష్టాలు ఎదురైనా నష్టాలు భరించి అయినా..

జీవితాన్ని జీవించి చూపడంసహజలక్షణంగా..ఎదగలేకపోతున్నందుకు..యెంత బాధ కల్గుతుందో! నేనైతే.. ఆ భర్త,అతని బందువులందరిని.. చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో.. శిక్షించకుండా వదిలేదాన్నేకాదు. ఎంత పిరికివాళ్ళు.ఈ..యువత.. ఇంత భీరువులా.. !? ఇలాటి యువతనా మనం చూస్తుంది, కోరుకుంది.!?.

సుకుమారంగా ఉండటం తప్పా? అంటే ఖచ్చితంగా తప్పే.. ఒకసారి వివేకానందుడి మాటలు గుర్తుకు తెచ్చుకుంటే సరి. పోరాడి సాధించాలి.. అదే అదే.. జీవితం..   

కామెంట్‌లు లేవు: