28, ఏప్రిల్ 2023, శుక్రవారం

రెండు నవలలు

మైదానం చెలియలికట్ట

చలం మైదానం లో  లైంగిక వాంఛలు తీరని ఆకర్షణకు లోబడిన వొక స్త్రీ గడప దాటిన తర్వాత వచ్చే పర్యవసనాలను చూచాయగా చెబుతూనే ఆ స్త్రీ అంతకన్న హీనంగా దిగజారిపోవడాన్ని సూచిస్తుంది. చలం మొదటి నవల అది.. అందులో రాజేశ్వరిని ఆయన సమర్దించలేదు వ్యతిరేకించలేదు. పాత్రను  స్వేచ్ఛగా సంచరింపజేసాడు. ఆయన మైదానం రాయడంలో పాఠకుల వ్యతిరేకత వుంటుందని లేదా మెప్పుదల  గురించి అంచనా వేసి రాయలేదని మనం గమనించాలి. రచనా కాలం 1927 సంవత్సరం. 


అదే విశ్వనాథ చెలియలికట్ట మైదానం కి జవాబుగా రాయబడింది అని అంటారు. ఈ నవల 1935 లో వచ్చింది. ఈ నవలలో  ఆది నుండి పాత్రల చిత్రణ కట్టుదిట్టంగా సృజించారు.  ముగింపు వెళ్ళేసరికి ఆ కాలపు మెజారిటీ  పాఠకులను సంతృప్తి పరచడానికే క్రాప్టింగ్ జరిగిందని తెలివిగల పాఠకులకు అర్థమవుతుంది. ఇక చెలియలి కట్టలో  మాత్రం రత్నావళి లో ఆధునికత యెక్కడ వుంది. మరిదితో వెళ్ళిపోయి కొంత సంపాదనతో వెనక్కి వచ్చి అది భర్త కొడుక్కిచ్చి  అంతిమ సంస్కారాలు చేయమని అబ్దికం జరిపించమని కోరడం తప్ప. అది హస్యాస్పదం అనిపించింది నాకు. పశ్చాత్తాపంతో మరణించడం వేరు అన్ని అంపకాలు చేసి మరణించడం వేరు. ఆమె ధర్మాన్ని అర్ధం చేసుకుంది కాబట్టి అని సింపతీ చూపడం పాఠకులకు తగదు. అది ముమ్మాటికీ  రచయిత అభిప్రాయం. ఆ ఒరవడి లోనే రాసాడు ఆయన.


రత్నావళి వికాసం చదువు ఆర్థిక స్వాతంత్ర్యం వొంటరిగా బ్రతికే దైర్యాన్ని ఇవ్వలేనప్పుడు మరిది వెంట వచ్చి తప్పు చేసానని మథనపడినప్పుడే చంపేయాలి కదా! రచయితకు అది యిష్టం లేదు. రత్నావళి చదువుకుని ధర్మాధర్మ విచక్షణల గురించి కుహనా అభ్యుదయాల గురించి చర్చించి ఇతరుల చర్యలు అభిప్రాయాలు తప్పని వొప్పించే సామర్థ్యం కల్గిన స్త్రీ అయివుండి కూడా  యెవరి సానుభూతి కోసమో జాలికోసం ఆశ పడాలి చెప్పండి. భర్త తృతీయ వివాహం చేసుకుని కొడుకుని కన్నందుకు సంతోషిస్తుంది. రత్నావళిలో  పశ్చాత్తాపం కల్గింది అనుకుంటే సమంజసమే కావచ్చు. కానీ రచయిత విశ్వనాథ ఆ పాత్రను యెలా తీర్చిదిద్దారు అంటే..  చదువుకుని సంపాదన పరురాలైన విజ్ఞానవంతురాలైన స్త్రీ పురుషుడితో సమానస్థాయి కల్గిన వ్యక్తి అయినప్పటికి ఆమె తప్పును  భర్త క్షమించడం లోకం కూడా తప్పైపోయిందని కాళ్ళు పట్టుకుందిగా పోనీలే పాపం అని సానుభూతి పొందటం కోరుకుందా?  పశ్చాత్తాపం అంటే చావడమే శరణ్యమని చెప్పదలిచిందా? అది రచయిత అభిప్రాయమే అయివుంటుంది. కాదంటే రత్నావళి బ్రతికివుండేది అని నా అభిప్రాయం.రంగారావు రత్నావళిని చివరి వరకూ అంటిపెట్టుకునే వుంటాడు. పుట్టి ముంచలేదు. రత్నావళి ఒక్కటే సముద్రంలోకి నడిచి వెళుతుంది. గిల్టీ రంగారావుకు కూడా వుండింది. మరి అతనెందుకు ఆమెను అనుసరిస్తాడో ..  ఆమెను నిలువరించి ఇరువురూ జీవించలేరెందుకో! బహుశా ఆ కాలానికి తగిన శిక్షను విధించుకున్నారేమో! ఆ కాలానికి అది అవసరం అనిపించింది కనుక రాసారేమో అనుకుంటాను.


నేను రత్నావళి పాత్ర తో differ అయ్యాను. అంతఃచక్షువులు తెరుచుకోని ఏ జ్ఞానమైనా నక్క నీలి నీలిమందు బానలో మునిగినట్టే అని నా భావన. గిల్ట్ తో జీవితాన్ని ముగించుకుంది తప్ప బతికే అవకాశం లేక ముగించుకోలేదు. ప్రణయమైనా ప్రళయమైనా ఉదృతి కొంత సమయమే!  రంగారావుకి తన పై ప్రణయం జీవితకాలం  వుండదనే తెలివిడిగా మేల్గొన్న ఆమె కు ఆత్మహత్య కూడదనే జ్ఞానం కల్గలేదు అంటే అది రచయిత అభిప్రాయమే కదా!    ఇవన్నీ వ్యాఖ్యలలో రాసి మనఃశ్శాంతి పోగొట్టుకోను.  రచనల్లో పాఠకులు ఎవరికి నచ్చింది వారు తీసుకుంటారు. . 


నేను “మైదానం” నవల ని పరమ చెత్త  అని చెబుతాను. అలా అని రత్నావళి కూడా నాకు నచ్చలేదంతే! 


అదేదో రాధికా శోభన్ బాబు సినిమా రమ్యకృష్ణ రాజశేఖర్ సినిమాలు కూడా ఈ కోవలేవే!


ఆడది తప్పు చేసింది అంటే... ఆమెకు ఆత్మహత్యే శరణ్యం అని అన్నమాట. ఇప్పటికి కూడా అదే తరహా ఆత్మహత్యలు జరుగుతూ.. వుంటున్నాయి కూడా! 


భార్య ఏ కారణాల చేతనైనా సరే మరొక పురుషుడితో వెళ్ళిపోయి ఆ బతుకు నరకప్రాయమై తిరిగివస్తే భర్త క్షమించినా ఆమెతో కలిసి వుండటానికి కుటుంబం

 సమాజ ఆమోదయోగ్యం కావాలి.  మరి అదే తప్పు  భార్య వుండి కూడా నిత్యం వ్యభిచరించే మగవాడు  కూడా తప్పు చేస్తున్నట్లు లెక్కే కదా! మరి అతనికి పశ్చాత్తాపం వుండొద్దా. రోజు కొక పురుష ఆత్మహత్య వుండొద్దా.. 😂😂


మైదానం నవల చెలియలి కట్ట నవలలు సమకాలీన నవలలు కాదు. రాజేశ్వరి లు రత్నావళి లు వీధి కొకరు వున్న కాలం యిది. రచనల ప్రభావం స్వల్పం మాత్రమే! పూర్తి ప్రభావం వుంటే లోకం యింత చెడ్డగానో లేపోతే యింకా కొంత మంచిగానో వుండేది కాదు. 


రచనల్లో యెవరికి నచ్చినది వారు తీసుకుంటారు. భిన్నాభిప్రాయాలను గౌరవిస్తూ సాగిపోవడమే తప్ప .. నేను చెప్పిన కోణమే.. సరైనదని భావించడం దానినే బలపరుచుకుంటూ వితండవాదం చేయడం.. కూడదు అనే ఎఱుకతో.. నా బ్లాగ్ లో రాసుకుంటున్నాను.  


రచనను బట్టి తప్ప  ఈ రచయిత చెప్పిందే   నాకు వేదం అని ఆ రచయిత రచనలు హేయం అని నేనెప్పుడూ అనలేదు. చలం విశ్వనాధ.. ఎవరిని చదివేటప్పుడు వారిని గౌరవిస్తాను. అచ్చెరువు చెందుతాను. మరొకసారి రెండు నవలలూ చదవాలి. ఈ నవలల పై ఇంతకూ ముందు బోలెడు చర్చలు జరిగాయి. ప్రస్తుతకాలానికి అవసరం లేని చర్చ కూడా ఇది.



కామెంట్‌లు లేవు: