3, సెప్టెంబర్ 2022, శనివారం

ప్రేమ్ నగరం లో అతిథి

బహుళ త్రైమాసిక పత్రిక    ‘’రసోత్కృష్టం” శీర్షిక న  ‘’నిగమ’’ పేరుతో  అనువాద కథలను పరిచయం చేస్తున్నాను కదా… అందులో ప్రచురింపబడ్డ ఈ కథను చదవండి..


కథా పరిచయం: 


“ప్రేమ నగరంలో అతిథి"


కొందరు పవిత్రతను హృదయంతోనూ మనసుతోనూ తూస్తారు. మరికొందరు శరీరంతో లెక్కిస్తారు. నిత్యం వొళ్ళు అమ్ముకుంటే తప్ప పొట్టనిండని స్త్రీలు తమ దౌర్భాగ్యపు జీవితాలను ఇతరులతో పోల్చుకుని వేదన చెందుతూ వుంటారు. వేశ్యావృత్తిలో వున్నవారు తమను తాము కళంకితులుగా భావించుకుంటూ ఆత్మనూన్యతతో  కృంగిపోతూనే తమ అసహనాన్ని కసిని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తారు. కొందరు తమ వ్యక్తిత్వాలను తూట్లు పడకుండా కాపాడుకుంటారు.  

నిజానికి సమాజం యొక్క కామ ప్రకోపాలకు బాధితులైన వారు విలాసవంతుల కొరకు తయారుచేయబడ్డవారు గత్యంతరం లేక ఆ రొంపిలోనికి దిగినవారు దించబడ్డవారు వేశ్యలు గా జీవనం సాగిస్తూ వుంటారు. అదిగో .. అలా ఏర్పడిందే ఊరు వెలివేసిన ఆ వేశ్యా వాటిక. ఆ వాటిక కు సమాజం పెట్టిన పేరు “ప్రేమ నగర్” ఊరి చివర స్మశానభూమిలో  వెలసిన ఆ ప్రేమనగర్ లో పాతికమంది స్త్రీలు నివసిస్తూ వుంటారు. వారికి దైవభక్తి కృతజ్ఞత కూడా ఎక్కువ. ప్రతి సంవత్సరం సత్యనారాయణస్వామి పూజ చేసుకుంటారు. ఆ పూజ జరిపించడానికి వచ్చిన పూజారిని కూడా వారు దైవసమానంగా భావిస్తారు. కానీ ఆ పూజారి పూజ చేయడానికి వచ్చినప్పుడు ఓ యువతిని చూసి కామప్రకోపితుడై ఆమె పొందును కోరతాడు.  రాత్రికి రాత్రే అతని వాంఛ అయితే తీరుతుంది కానీ.. ఆ ప్రేమనగర్ లోని స్త్రీల మనస్సులో అతని పట్ల వున్న పవిత్రభావం పోయి అతనూ వొక సాధారణమైన విటుడిగా మిగిలిపోతాడు. 

వేశ్యలైన స్త్రీలు సమాజం తమని ఏ చూపుతో చూసి తమకు విలువను నిర్ణయిస్తుందో అదే చూపుతో ఆ పూజారిని వారు సాధారణ విటుడి స్థాయికి లెక్కిస్తారు. అక్కడ పవిత్రతకు కొలమానం శారీరక ప్రాతివత్యం అనే భావనకు వారు లోనవడమే కాదు వారి వద్దకు వచ్చే విటుడికి కూడా ఆ పవిత్రత అనే అర్హత లేదని భావించారు. నిర్ధారించారు కూడా.  సిగ్గుతో తలొంచుకొన్న పూజారి స్థానంలో సమాజం కనబడుతుంది పాఠకుడికి. 

వేశ్యల కోణంలోనే కాదు.. వ్యభిచార గృహాలపై దాడులు జరిగినపుడు అక్కడ వున్న స్త్రీలను మాత్రమే వ్యభిచారులుగా లెక్కిస్తూ వారి పేర్లనూ ముఖాలను ప్రదర్శిస్తూ అదే నేరంలో భాగస్వామ్యులైన పురుషులను రహస్యంగా దాటించడం దాపెట్టడం సమంజసం కాదనే ప్రశ్నకు జవాబు ఈ కథలో నాకు గోచరించింది. ఆధునిక సమాజంలో లోపించిన పారదర్శకత చంద్రమ్మ నిర్ణయంలో ఆమె పూజారితో మాట్లాడిన మాటల్లో సుస్పష్టమయ్యాయి.

కొంకణి భాషలో వచ్చిన ఈ కథను తెలుగు అనువాదంలో నేను చదివాను. అనువదించిన వారు శిష్టా జగన్నాథరావు. 

మూల రచన ‘అచ్యుత్ తోటేకార్'  “ప్రేమ నగరంలో అతిథి" గోవాలోని దేవదాసీ పద్ధతికి సంబంధించింది. ఈ ఆచారం ఆదికాలం నుంచీ వస్తోంది. సామాజిక చైతన్యం వలన ఈ వ్యవస్థ నెలుగులోకి వచ్చింది. ఈ ఆచారంలోని ఒక నాజూకు భావబంధం ఈ కథలో గొప్పగా చిత్రించబడింది. అశ్లీలం అనిపించకుండా రచయిత అద్భుత పంధాలో కలం నడిపించారు. మీరూ చదివి ఆస్వాదిస్తారని.. ఈ కథా పరిచయం.  -నిగమ

ప్రేమ నగరంలో అతిథి

 ఈవేళ ప్రొద్దున్నించీ ప్రేమనగర్లో పెద్దపెద్ద లౌడ్స్పీకర్లు మ్రోగుతున్నాయి. ప్రేమనగర్ ఏదో విశేషం వుందని చెప్పడానికి అది సంకేతం. రోడ్డుమీద వెళ్తున్న జనం ఒకర్నొకరు కనుసంజ్ఞలతో విచారిస్తున్నారు. ఏమిటీ ఈ హడావిడి? కొంతసేపట్లో వూరంతా ఈ వార్త పాకింది. ఈరోజు ప్రేమ్నగర్లో వేశ్యల వార్షిక సత్యనారాయణపూజ. పూర్తి ఈ సత్యనారాయణపూజ ఎంతకాదన్నా అందరినీ - నవయువకుల నుండి వయోవృద్ధుల వరకూ అందర్నీ ఆకర్షిస్తుంది. దైవదర్శనంతో బాటు కొత్తకొత్త వేశ్యల ముఖారవిందాలు చూడడానికి అవకాశం వస్తుంది కదూ? అందుకని తరచూ వచ్చేవాళ్లేగాక, ఎప్పుడూ అటువైపు అడుగు వేయని వాళ్లు కూడా ఆరోజు సాయంత్రం ప్రేమనగర్కి ఆ ఉత్సవ దర్శనం నిమిత్తం వస్తారు. తమ పవిత్ర కర్తవ్యం నిర్వహిస్తారు. ఆ ఊరుకి ఒక మూలగా వేశ్యల గృహాలు ఒక పాతిక-ముఫ్పై వున్నాయి. ఆ ప్రాంతాన్నే ప్రేమనగర్ అంటారు. పది సంవత్సరాలకి పూర్వం ఈ ప్రాంతంలో చచ్చిన ఆవులు, గేదెల మృతదేహాలు తెచ్చి పడేసేవారు. రోజంతా యిక్కడ ఆ కుళ్లు మాంసం వాసన, కుక్కలు, కాకులూ, గ్రద్దలూ మినహా మరెవ్వరి దర్శనం వుండేదికాదు. అటువంటి ఆ చండాలపు భూమి భాగ్యం పండి ఈనాడు ప్రేమనగర్ అనే శృంగార నామం రూఢి అయింది.


ఈ వేళ ఈ స్థలంలో వున్న వేశ్యలు యింతకుముందు వూరిలో ఎవరైనా ఆశ్రయం యిస్తే వాళ్ళలో వుండేవారు. యువకులకు యిది గిట్టలేదు. వాళ్లు వేశ్యలకి విరుద్ధంగా గొడవ చేశారు. ఊరు వదలమని బలవంతం చేశారు. వేశ్యలందరూ ఒక్కటయ్యారు. ఊరు బయట స్మశానభూమి దగ్గరకి వచ్చారు.


ఇంటి సామాన్లన్నీ తెచ్చుకొని సత్యనారాయణమూర్తిని స్మరిస్తూ గుడిసెలు వేసుకున్నారు. సంసారాలు పెట్టి కొత్త జీవితం ఆరంభించారు. అనతికాలంలోనే గుడిసెలు ఇళ్లుగా మారాయి. ఇళ్లముందు రోడ్లు వెలిశాయి. రస్తాలొచ్చాక లైట్లు వచ్చాయి. ఆ తరువాత నీళ్లపంపులు, ఒక చిన్నవాడ వెలిసింది. వేశ్యలు దేహం అద్దెకిచ్చేవాళ్లు లేదా ప్రేమని విక్రయించేవాళ్ళు. అందుకని ఎవరో వేళాకోళంగా ఆ వాడకి ప్రేమనగర్ అనే పేరు పెట్టారు. ప్రేమనగర్లోని వేశ్యలందరూ కలిసి ఈ పూజని చేస్తారు. దానివెనక కారణం కూడా ఇదే. పూర్తిగా నిరాధార స్థితిలో వున్నప్పుడు శ్రీ సత్యనారాయణమూర్తి వాళ్లకి సహాయం చేసినందువలన ఆయన కృపతో మంచిరోజులు వచ్చాయి. ముందు ముందుకూడా ఆయన యిలా వాళ్ళని కాపాడాలని ఈ పూజలు. ఈరోజు వేశ్యలకి దైవ ధర్మవిధులు చేసే పరమ పవిత్రదినం. ఏ మొగాణీ ముట్టుకోడం కూడా జరగదు. ఎవరినీ దగ్గరకి చేరనివ్వరు. ఎవరికీ కన్ను కొట్టరు. నోట్లో తిట్లూ, బూతులూరావు. పూర్వకాలపు స్త్రీలలాగ తొమ్మిదిగజాల చీరలు ధరించి, కుంకుమతో అడ్డంగా రేఖలు వేసుకుని పూజకోసం వేసిన పందిరిలో తిరుగుతున్నారు. పూజ అందరికోసం కనక, ప్రజలందరూ యిమిడేలా పందిరివేస్తారు. అందరికీ తప్పక నిరాఘాటంగా దర్శనం లభించాలని ఉద్దేశ్యం. పూజకి అన్ని హంగులు, రంగులలైట్లు, టపాకాయలు, చిచ్చుబుడ్లు, భజనలు, హారతి యివ్వడాలు... అడక్కండి... ఎంతోమంది ధనవంతులు ఈ పూజకి పరోక్షంగా సహాయం చేసి వుంటారు కదూ? ఈ పూజ నిర్వహణ చూసేది 'చంద్రమ్మత్త'. చంద్రమ్మత్త అంటే ఈ వాడలో వేశ్యలందరికీ నాయకురాలు. ఆమె అధికారంలో, అధీనంలో ఆమె మాటే, వాళ్ళందరిమాట. మొట్టమొదటి నుంచీ, ఈరోజు వరకూ ఈ పూజ నిర్వహించే గౌరవం 'విఠూ'భట్టి (భట్ అంటే పూజారి వేశ్యలందరూ అతన్ని 'గురూజీ' అని వ్యవహరిస్తారు. వాళ్ల దైవ, ధర్మాధి కార్యాలు 'గురూజీ'యే చేస్తాడు. అతనికీ మంచి ఆదాయం. అందువల్ల 'గురూజీ' వలన ఎక్కడైనా తత్తరపాటు జరగవచ్చుకాని 'ప్రేమనగర్'లో మాత్రం 'యథావాచ-తథాకృతి' (మాటకీ చేతకీ పొంతన కుదిరేలా) అన్నట్టు వుండేవాడు. లోకులు పైపైన అతన్ని హేళన చేసినా, మనస్సులో అతనిని అర్థం చేసుకొనేవారు. గురూజీ వంటి సాదాసీదా మనిషి, అంతర్ముఖుడు ఈ ప్రపంచంలో.. మరొకడు వుండడు. నిజం చెప్పాలంటే గత పది సంవత్సరాలుగా ఈ వేశ్యలతో గురూజీగా తప్ప మరేవిధమైన (లైంగిక) సంబంధం లేదు. అందువల్ల దేవుడి తరువాత గురూజీనే వేశ్యలు గౌరవించేవారు. గురూజీ పీఠంమీద కూర్చుని పూజ చేస్తారు. వేశ్యలు పక్కల కూర్చుని చూస్తూ వుంటారు. అలా పుణ్యంలో భాగం పొందుతారు. పూజ పూర్తి అయ్యేవరకు ఎవరికీ పందిరిలోకి రావడానికి వీలుండదు. ఈవేళ పగలు సూర్యోదయం అవగానే గురూజీ పందిరిలో హాజరయ్యాడు. పూజాసామాగ్రి సర్దడం మొదలయింది. చంద్రమత్త కూర్చున్న చోటే వుండి ఒక్కొక్కరికీ సామాన్లు తెచ్చే పని పురమాయిస్తోంది. “చంద్రమ్మత్తా! గంధం ఎక్కడుందో?" గురూజీ అన్నాడు. "అరే సుమన్, నువ్వు గంధం తేలేదా?" చంద్రమ్మత్త అడిగింది. "అయ్యో మఱచిపోయాను. ఇప్పుడే తెస్తానుండు... సుమన్.' "ఇలాగే నువ్వు అన్ని విషయాల్లో నిర్లక్ష్యం చేస్తావు" చంద్రమ్మత్త సుపారీని ముక్కలు చేస్తూ అంది. "మరి కలశంలో వెయ్యాల్సిన రూపాయిపావలా?" "ఇదిగో తీసుకొండి గురూజీ" చంద్రమ్మత్త వేళ్లతో రూపాయపావలా గురూజీకి యిచ్చింది. 


"ఇదిగో ఈ ఐదుంపావలా తాంబూలంలో పెట్టడానికి." చంద్రమ్మత్త తమలపాకుల మీద సున్నం రాయడం మొదలుపెట్టింది. “సరేగాని, ప్రసాదం చేయడం సంగతి" “గురూజీ మీరు పట్టించుకోకండి, ఆ పని మిలన్కి అప్పజెప్పాను. ఇంకా టైముంది కదూ?" చంద్రమ్మత్త తమలపాకులు నోట్లో గుప్పుకొని, సగం మిగిలిన పళ్లతో నమలడం మొదలెట్టింది. “హారతి సిద్ధం చేశారా?" చంద్రమ్మత్త తమలపాకులు నమలడంలో నిమగ్నురాలయి ఏం మాట్లాడలేదు. ఆమె బదులు షైలా హారతి పళ్ళెంతో ముందుకి వచ్చింది. “అరె షైలా! హారతి యిలాగేనా పెట్టడం? వొత్తులు మరీ మొద్దుగా చేశావు, కాస్త వాటిని మరింత వొత్తి సన్నంగా నాజూగ్గా చెయ్యమ్మా." గురూజీ మాటలు..విని షైలా నిర్ఘాంతపోయింది. ఆమె సిగ్గుతో హారతి పళ్లెం తీసుకుని పక్కకి పోయింది.


తన మాటలు బెడిసి కొట్టాయా అని అనుకొని గురూజీ చంద్రమ్మత్త వైపు చేశాడు. చంద్రమ్మత్త నోట్లో నమిలిన కిల్లీ “తూ" అని పందిర బయట వుమ్మివేసి, గురూజీ మాటలకి తన వ్యతిరేక ఆవిధంగా తెలిపింది.


"గురూజీ ఈ దండ, ఈ తులసి ఆకులూ తీసుకోండి" ఎవరో తెలియని ఒక నవయువకుడు అన్నాడు.


“ఒసే రూపా, నువ్వు ఎంత తొందరగా అల్లావమ్మా దండని." ఎవరో అన్నారు. “రూపా అంటే రూపాయే. దానికి సాటి మరిఎవ్వరూ లేరు.” మరెవరో అన్నారు.


రూపా సిగ్గుతో వంకర్లుపోతూ చంద్రమ్మత్త ప్రక్కనే వచ్చి కూచుంది. రూపా ఇలా సిగ్గు పడడం గురూజీకి బాగా నచ్చింది. రూపావంటి సౌందర్య రాశిని గురూజీ ప్రేమనగర్ ఎప్పుడూ చూడలేదు. “సరే ఇక ప్రారంభిస్తా"


గురూజీ చంద్రమ్మత్త అనుమతి తీసుకుని పూజకి వుపక్రమించాడు. “కేశవాయనమ:”


“అందరూ నిశ్శబ్దంగా వుండండర్రా. చంద్రమ్మత్త గట్టిగా అరిచింది. అరుపుతోబాటు నోట్లో ఢిల్లీలో నుంచి ఊరిన లాలాజలం పెదవుల పక్కనించి కిందకి జారింది. దానిని వెంటనే తన కొంగుతో తుడిచింది. వేశ్యలందరూ చేతులు జోడించి దేవుడి పటం ముందు కూర్చున్నారు. ప్రశాంత వాతావరణంలో గురూజీ పూజ పూర్తిచేశాడు. "ఇప్పుడు మీరందరూ ప్రతీ ఏడాదిలాగే దేవుడికి గంధం, పూలు సమర్పించడానికి రండి" గురూజీ సూచన చేశాడు. “వెళ్లండర్రా అందరూ. ఒంటిమీద నీళ్లు చల్లుకుని తడిసిన శరీరంతో దేవుడికి గంధం, పూలు అర్పించడానికి రండి.” చంద్రమ్మత్త ఆర్డరు యిచ్చి, తనుకూడా పందిరివదిలి బయటికి వచ్చింది. దేవుడికి గంధం, పూలు యివ్వాలంటే పూర్తిగా మడికట్టుకోవాలి. అందుకే తడిసిన శరీరంతో, బట్టలతో రావడం నిజమైన మడి అని వేశ్యలందరి భావన. అందరూ పందిర వెనక బయటకి వెళ్లారు. అక్కడ పెద్ద చన్నీళ్ల పాత్ర నిండివుంది. అందరూ వాళ్లవాళ్ల పాతబట్టలు మార్చుకుని, కొత్త చీరలు కట్టుకుని, నెత్తిమీద నీళ్లు పోసుకున్నారు. తరువాత అలాగే తడితడి శరీరాలతో ఒక్కొక్కరూ పూజా మందిరంలోకి రాసాగారు.


మొదటి గౌరవం చంద్రమ్మత్తది. ఆమె అందరికంటే ముందు పందిరిలో అడుగుపెట్టింది. పందిరిలో గురూజీ తప్ప మరెవ్వరూ పురుషులు లేరు. దానికి కారణం వీళ్లందరూ గంధం, పూలు సమర్పించేవరకూ బయటవాళ్ళని పందిరిలోకి రానివ్వరు.


గురూజీ గంధం, పూలు ముందుకు చాపాడు. చంద్రమ్మత్త వాటిని అందుకుని దేవుడికి సమర్పించింది. తరువాత ఒంగొని సాష్టాంగ నమస్కారం చేసింది.


మనస్సులో ఆ తలంపులేకపోయినా గురూజీ దృష్టి ఆమె శరీరంమీద పడింది. ఒకానొకప్పుడు తన సౌందర్యంతో యితరులని వివశులు చేసి ఆకర్షించిన చంద్రమ్మత్త శరీరపు చర్మం మడతలు పడింది. కొన్నిచోట్ల చర్మం వదులుగా వేళ్లాడుతోంది. మొహంమీద ముసలి తనపు చారలు వచ్చాయి. నోట్లోంచి నాలిక లోపలికి బయటకీ కదులుతోంది. శరీరంమీద ఇక్కడా, అక్కడా నలుపు, నీలపు చారలు పొంగుతున్నాయి. ఆమెని చూస్తేనే గురూజీ శరీరంమీద తేళ్లు, జెర్రులు ప్రాకినట్లయింది. చూడలేక తలవొంచుకున్నాడు.


చంద్రమ్మత్త తరువాత వొక్కొక్కరే క్రమంగా పందిర క్రిందకి వచ్చి గంధం,పూలు, అక్షింతలూ సమర్పించారు. చంపి, గంగి, యేసు, లక్షిమే, మంజుళ... అందరూ తడిబట్టలతో, వొంటిమీది సౌందర్య వస్తువులు కడిగి వెళ్లారు.


ఈ వేశ్యలే సాయంసంధ్యలో ఇంటి గుమ్మం ముందో, కిటికీల వెనకో కూర్చుని చూపుల బాణాలతో విటులని గాయపరుస్తారు. ఇప్పుడు వాళ్ళ శరీరాలని చూడాలనిపించదు. సౌందర్యపు ఆటంబాబు పేలిపోయింది. అంతా ఏహ్యభావం -చీదరింపు కలిగించేది. పెదవులమీద రంగు, మొహంమీద పౌడరు, తుడుచుకు పోయాయి. కళ్ళులోతుకి పోయాయి. వక్షోజాలు పొంగుతగ్గి చదరంగా మారాయి. పొట్టలోని పేగులు లెక్కపెట్టవచ్చు. నెత్తిమీది సవరంతీసి ఎవరో బయట వేలాడదీశారు. రాత్రి చీకట్లో మెరుస్తూ వుండే స్త్రీ వైభవం గిల్టు పోయిన నగలలాగ బయటపడింది. శరీరంలో ఏ భాగంలోనూ ఆకర్షణలేదు. గురూజీ కళ్ళు మూసుకుని ఒక్కొక్కరి చేతిలోనూ గంధం, పూలు పెడుతున్నాడు. అవి దేవుడికి అర్పించి వెళ్లిపోయినా మొగలి ఆకులాంటి ఆమె శరీరకాంతి, ముత్యాలరంగులో తెల్లగా శుభ్రంగా వున్న కళ్లు, దానిమ్మపండు రంగు పెదాలు, చీరవెనక నుంచి తొంగిచూస్తున్న పావురాల జోడిలాంటి వక్షోజాలు కళ్ళముందు నుంచి అదృశ్యం కాలేదు.


చాలాసేపైనా, విచలితమైన గురూజీ మనస్సు కుదుట పడలేదు. మంత్రాలు సక్రమంగా జ్ఞాపకం రావడంలేదు. అయినా ఫరవాలేదు హారతి యిస్తున్నప్పుడు - వొత్తులు నూనెగిన్నెలో బదులు నీళ్లగిన్నెలో ముంచినప్పుడు ఎవరూ చూడలేదు. ప్రదక్షిణకూడ తప్పుగా మరోలా చేయసాగాడు. కానీ చంద్రమ్మత్త "గురూజీ, మీరేం చేస్తున్నారు?" అని అనబోయేలోగా, అతనికి తన తప్పు తెలిసింది.


“చంద్రమ్మత్తా, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి."


పూజ పూర్తయిన తరువాత ఒక మూల నిలుచున్న చంద్రమ్మత్తతో గురూజీ అన్నాడు.


"ఏమిటి?


చంద్రమ్మత్త ఎగతాళిగా చూస్తూ అడిగింది. "ఈ రూప ఎవరూ?" “రూప? ఆ నవ్వు ముఖంతో వున్న అమ్మాయా?” “అవును!" "ఒక కొత్త అమ్మాయి. చాలా అందగత్తె. అతిధులకి ప్రాణం అర్పించైనా సుఖాన్నివ్వడానికి తయారుగా వుంటుంది. కానీ నేనే జాగ్రత్త తీసుకొంటాను. దానికి ఏ కష్టం రాకూడదని.” “అవును జాగ్రత్త తీసుకోవాలి. చిన్నది పైగా నాజూకైన పిల్ల. “అవును.” “చంద్రమ్మత్తా, ఒకటి అడగనా?" "కోపం రాదు కదా నీకు?" "కోపం రావడానికి మీరు పరాయి వాళ్ళు కాదుకదా!" గురూజీ నిర్మలంగా, తలవొంచుకుని మాట్లాడాడు. “ఈరోజుతో పది సంవత్సరాలయింది నేను యిక్కడికి వచ్చి వెడుతున్నాను. కానీ ఎప్పుడూ ఏ ఆడమనిషిని వక్రదృష్టితో చూడలేదు. కాని ఈవేళ అలా


ఎందుకయిందో ఎవరికి తెలుసు? ఆ రూప నా మనస్సుని ఆకట్టుకుంది. నా కోరిక తీరుతుందా?" ఏదో దెబ్బ తగిలినట్టు చంద్రమ్మత్త మొహం గంభీరమయింది. గురూజీ మొహం చూస్తూ చూస్తూ ఆమె ఆలోచనల్లో మునిగింది. గురూజీకి షాక్ తగిలింది. రూపాని కోరడంలో తను పెద్ద తప్పు చేయలేదుకదా? చంద్రమ్మత్త కాదని అంటే జరిగే అవమానం తను భరించగలడా? గురూజీ (మనసులో) తర్కించుకుంటున్నాడు. మనస్సులో అస్వస్థత పెరుగుతోంది. కొన్ని క్షణాలు అలా గడిచాయి. ఆఖరికి చంద్రమ్మత్త ఎదో నిర్ణయం మనస్సులో చేసుకొని, ఆదర పూర్వకంగా గురూజీతో అంది. “గురూజీ నేను మీకు ఎలా కాదనగలను?" మీ పుణ్యశక్తి వల్లనే మాకంతా శుభం జరిగింది. మీ మాట నేను తిరస్కరించలేను. మీ కోరిక తీరుతుందిలేండి. చెప్పండి ఎప్పుడు?"


 "ఈ వేళ రాత్రి"


“సరే, ఇప్పుడు మీరు వుండండి. ప్రొద్దున్న పూజాసామాగ్రి తీసుకొని మా వీడ్కోలుతో వెళ్లండి.." చంద్రమ్మత్త మాటలు విని గురూజీ గుండెలు చిన్నపిల్లాడిలా లోపల్లోపల గెంతులేయసాగాయి. రాత్రి రూప తన చేతుల్తో తయారుచేసి యిచ్చిన తాంబూలం గురూజీ స్వీకరించి తిన్నాడు. ఆ తరువాత రాత్రి ఎలా రంగుల రసడోలలతో గడిచిందో తెలియలేదు. తెల్లవారింది. గురూజీ ముస్తాబై సోఫామీద కూర్చున్నాడు. పూజసామగ్రి తీసుకుని చంద్రమ్మత్త ముందుకి వచ్చింది. "ఇది పూజ సామాను. ఇదిగో దక్షిణ. అలాగే అందుకొండి. నమస్కారం ఆఖరిది" చంద్రమ్మత్త తన నడుము వెనకభాగం అతనివైపు త్రిప్పి (మొహం చాటేసి) మాట్లాడింది. ఆమె గొంతుకలో కంపన ధ్వనించింది. గురూజీకి ఆశ్చర్యం వేసింది. ఎప్పుడూ నవ్వు ముఖంతో ఆమె గురూజీకి వీడ్కోలు చెప్పేది. కాని ఈరోజు వేరే విధంగా గురూజీకి అనిపించింది. అతని నోటిలోంచి మాటలు వూడిపడ్డాయి. “ఆఖరి నమస్కారమా?" “అవును ఆఖరిది." తన చెమ్మగిల్లిన కళ్లతో గురూజీ కళ్లల్లో చూస్తూ ఆమె అంది.


“ఈవేల్టి వరకూ మీరు మా గురూజీగా వుండేవారు. ఇప్పుడు మీరు... కాదు నువ్వు మా అతిధివి అయ్యావు." “అంటే ఏమిటి?” “ఇది నేను చెప్పాలా? మీరు పుణ్య పురుషులని మేము (భావించి మీకు శ్రేష్ట గౌరవం ఇచ్చాము. మడిని పాటించాము. మీ పుణ్యశక్తి వలన మా పాపాలు తుడుచుకుపోయేవి." “కానీ మీరు మీ ప్రత్యేకతని త్యజించి మా ఎంగిలి మెతుకులు తింటే మేము మిమ్మల్ని గురూజీగా ఎందుకు గౌరవించాలి?" గురూజీ నిల్చునే వున్నాడు. అతనికి చంద్రమ్మత్త మాటలు తూటాలుగా తగుల్తూ వుంటే, ఆ బాధలో ఎలా జవాబివ్వాలో తెలియలేదు. "గురూజీ దుఃఖించకండి. రూప కోసం మీరు ఎప్పుడు కావాలన్నా రావచ్చు." తన వ్యధిత హృదయంతో తలవొంచుని చంద్రమ్మత్తతక్షణం ఇంట్లోకి వెళ్లిపోయింది.


పూజా సామాగ్రితో వున్న సంచి భుజం మీద వేసుకుని గురూజీ చంద్రమ్మత్త ఇంటినుంచి బయటపడ్డాడు. జరిగిన అవమానం సహించే ధైర్యం అతనిలో లేదు. అథః పతనంతో, నల్లబడిన మొహంతో తలవొంచుకుని నెమ్మదిగా అడుగులేస్తూ అతను ప్రేమగర్కి వీడ్కోలిచ్చాడు. మధ్యమధ్య అతనికి ఏదో భావన కలుగుతోంది. మూలల్లోని కిటికీలల్లోంచి రంగులు పులుముకున్న ముఖాలు “షూ...షూ" అంటూ తనని పిలుస్తున్నాయని. అప్పుడే చెవులు గింగురుమనేలా అపహాస్యంగా ఎవరో అరిచారు “ఏం అతిథీ! రాత్రి ఎలా గడిచింది?" ఇంత ఆయుస్సులో ఏమి సాధించి, గడించానో అదంతా ఒక్కరాత్రిలో తగలెట్టేసాననే దుఃఖభారం నెత్తిమీద వేసుకుని గురూజీ ఇంటిముఖం పట్టాడు. పశ్చాత్తాపంతో అతని గుండెలు మండుతున్నాయి.



కామెంట్‌లు లేవు: