30, ఏప్రిల్ 2011, శనివారం

ఎంతో రసికుడు దేవుడు

వసంతం .. ఆ.. మాట  వింటేనే.. మొహం విప్పారుతుంది.. అనంత  సౌందర్యానికి.. వసంత ఋతువు ప్రతీక.శిశిరం మిగిల్చిన  మోడులపై..చివురులు మొలిచి.. మొగ్గలు తొడిగి.. తొలి పూత పూసిందా..? అవనికే కొత్త అందాలు.. అందరికి ఆనందాలు.. ప్రకృతి కాంత తనని తాను అలంకరించుకుంటుంది. అందుకేనేమో..! ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో.. పదము కలిపితే అన్నన్ని లయలు..అని సిరివెన్నెల, ఎంతో రసికుడు దేవుడు.. ఎన్ని పూవులు ఎన్ని రంగులు ఎన్ని సొగసులిచ్చాడు..అంటూ.. మనసు కవి.. అ పూల రంగు నీ చీర చెంగు రాశాయి నాలో.. గీతాలు.. అంటూ.. పాటలకి.. ఊపిరి పోసి.. పూలు.. కవుల కల్పనలో..కలికితురాయి గా వన్నెకేక్కేయేమో!

  ఈ వసంతంలో.. ఎక్కడ చూసినా.. ముఖ్యంగా రహదారుల ప్రక్కన దారి పొడవునా... ఆకు కనపడకుండా.. ఎఱ్ఱగా, చైతన్యవంతంగా  అందరి మనసులని దోచేసే.. గుల్మొహర్,  అగ్నిపూలు, తురాయి పూలు,.(పేరు ఏదైతేనేమి? ) ఆకర్షణీయంగా కనబడతాయి. మా  చిన్నప్పుడు మైలవరం లో.. చదువుకోవడానికి ..దాదాపు ఆరు కిలోమీటర్లు ఆరుగురుము  కలసి గూడు రిక్షాలో.. (పన్నెండు సంవత్సరాలు) వెళ్ళిన కాలంలో.. ప్రతి ఏడాది.. దారి పొడవునా.. మాకు స్వాగతమిస్తూ.. మాకు యెనలేని సంతోషం కల్గించే.. ఆ.. పూల సౌందర్యం .. మా మదిపుటల్లో..  ఎఱ్ఱని.. ఎన్నటికి..మాయని జ్ఞాపకం. నాకు నలుపు తర్వాత ఎరుపు రంగంటే ఇష్టం కావడానికి అదే కారణం ఏమో! 

ఇంతకి.. నేను..ఎందుకు ఈ పూల గురించి చెపుతున్నానంటే.. ఈ రోజు బెంగళూర్  గురించి తలచుకోగానే మళ్ళీ  నాకు.. గుల్మొహర్ ..గుత్తులు గుత్తులు కళ్ళముందు కదలాడాయి.ఎంత అందమైన నగరం.నాలుగేళ్ల క్రిందటి వరకు.. ఆ నగరాన్ని సంవత్సరానికి నాలుగైదు సార్లు..గిరగిర  చుట్టేసేదాన్ని.. అప్పుడు అంతే.. రోడ్లన్నీ ఎక్కడ చూసినా  యెర్రని పూల తివాచి  పరచినట్లు ఉండేవి.. నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా మనసు ఒప్పేది కాదు.

యద్దనపూడి సులోచనా రాణి గారి "అగ్నిపూలు" నవల చదివాను.. సినిమా చూసాను.. ఆ.. సినిమాలోనూ.. ఆ పూలు చూసాను..నా..  చిన్నప్పుడయితే.. చెట్లు ఎక్కి మరీ.. కొమ్మలు విరిచి.. ఆ..పూల మద్య ఉండే కొంకీల లాటి..వాటితో.. కోడి పందాల ఆటలు ఆడేవాళ్ళం. మా అబ్బాయి చిన్నప్పుడూ.. అంతే.. వాడితో..అలా ఆడటం.. ఆడటాన్ని వాడికి నేర్పించడం నాకు యమ సరదాగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ చెట్లు అంతగా ఎక్కడా కనబడటం లేదు. రహదారుల విస్తరణ లో.. మొదలంటా నరికిన చెట్లు.. అక్కడక్కడా.. చైతన్యంని ఎవరు మాపగలరు అన్నట్లు..ఆ మోడులపైనే చివురించే..కొమ్మలు..వాటి మద్య  పూలగుత్తులు.. ఇది..నేటి సౌందర్యం.

ఎంత చైతన్యం



ఎరుపు  చైతన్యానికి ప్రతీక. అలాగే..కవయిత్రి "మహజబీన్" కూడా.. తన కవితలో.. గుల్మొహర్ లు   గురించి.. ప్రస్తావించినట్లు గుర్తు. ఆమె.. "ఆకురాలుకాలం"...కవితా సంకలనం నా.. ఆలోచనలపై.. బలమైన ముద్ర..
అందులో..గుల్మొహర్ ఒకటి  ఇలా చెప్పుకుంటూపోతే.. ఎంతని చెప్పను.. యెర్రని,పచ్చని,  రంగులెన్నో! కానీ..యెర్రని  గుల్మొహారుల అందాలు.. అరుణారుణ భావ మందారాలు.. మట్టి ఒకటే! ఆ మట్టిలో..పెరిగిన మొక్కలకి.. చెట్లకి పూసే పూల రంగులు..వేరు వేరు. ఆ రంగులే..మనలోని  భావాలకి ప్రతీకలు. ఓహ్...ఎంత  శోభానమయం. అనంత శోభానమయమైన..ఈ ప్రకృతి ఒడిలో.. సేదతీరడం..నిత్యం ..ఓ.. నూతన ఉత్తేజం...


          
ఇకపొతే అక్కడక్కడా కనిపించే పలాస (మోదుగు) పుష్పాలు

నా అభిమాన రచయిత "దాశరధి కృష్ణమాచార్య "  ..వారి.. "అగ్నిధార"   కావ్యానికి స్పూర్తి మోదుగ పూలేనట...

    నా చెవులలోన   రుధిర వీణాకటోర
    ఘోర ఝుంకార మేళ డాగుకొన జూచే
    వో.?నిశాహిమానీ తరుణీ నితంబ
    లంబి వేణిక నగ్ని పుష్పంబు లేలనో!
  
అని దాశరధి.. ఆత్మావలోకనం చేసుకున్నారు ..ఆయన కావ్యాలలో.. ఎక్కడ చూసినా పలాస పుష్పాల ప్రస్తావన ఉంటుంది.



  ఇది ఎర్రెర్రని పూల అందం .. 
   

2 కామెంట్‌లు:

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

మీ గుల్మొహర్ గుబాళింపులు మనసును పరవశింప చేసాయండి.దానికి తగ్గట్టు మీ వర్ణన.అన్ని రకాల పూల గురించి వ్రాయండి.మీరెప్పుడయినా బత్తాయి తోట పూత పూసినప్పుడు తోటలో తిరిగారా!వదల బుద్దికాదు తోటని.మాకు నిరుటి వరకు తోట వుండేది.నీరు లేక ఎండి పోయింది. బాదేసింది.సఖి లో ఓ పాట వుంది.పచ్చనిదనమే పచ్చందమే...అనుకుంటా మణిరత్నం ఆపాట చిత్రీకరణ అద్భుతం గా చేశాడు.అంతా పచ్చదనమే.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Thank you very much! plz..Connect This link.
http://www.vanajavanamali.blogspot.in/2011/09/blog-post_12.html. just like That.