28, జనవరి 2019, సోమవారం

విశ్వ కథా వీధి కథలు

వాడ్రేవు చిన వీరభద్రుడు గారు పరిచయం చేసిన విశ్వకథా వీధి ఐదో సంపుటిలోనూ ఆరుకథల్నీ ఆవురావురావురుమంటూ చదివాను. వాటి గురించి నా స్పందన.
“గుల్లీ” చదివాను. ప్రమాణం యెంత గొప్పది. ఎంత గొప్ప మనసు. విలువలు పాటించడంలో వున్నతి ధనిక పేదలో లేదు. అలాగే గుల్లీలో భూతదయ, దాదూ పై అల్లుకున్న ప్రేమ గొప్పగా వున్నాయి. ఛగన్ లాంటి గుంటనక్క ఉంటారని చెప్పిన కథ యిది.
"కసి" కథలో గఫార్ కసి సంస్కారవంతమైనది. అతనికి నా సెల్యూట్. వడ్డించిన భార్య చేతులను తన చేతులలోకి తీసుకుని కృతజ్ఞత తెలియజేసాడు. ఆ భావన యెంత సంతోషం కల్గిస్తుందో అనుభవిస్తే కాని తెలియదు. ఒక చేయి విరిగినా రెండో చేత్తో యువకుడిని కాపాడిన తక్షణ సంస్కారం మెచ్చుకోతగినది.విప్లవాలు ఎందుకు వస్తాయో ప్రజలెందుకు ఉద్యమిస్తారో అరటిపండు వొలిచి తినిపించినట్టు పరిచయం చేసేకథ యిది.
"డేగ" కథ మర్చిపోలేని కథ. తీవ్రవాదులను, క్రీడాకారులను ఇలాగే తయారు చేస్తారేమో ఇంకా చెప్పాలంటే ఇప్పటి మన ప్రభుత్వాలు సంక్షేమ పధకాలు ద్వారా ప్రజలకు కష్టపడకుండా సోమరులను చేసి ముప్పు తెచ్చుకోబెట్టారని నాకనిపించింది. పాపం రహీమ్ అనిపించలేదు. అతనికి అది సంతోషమే కల్గించినందుకేమో.
"దొంగ" కథ ...ఒక సామెతను గుర్తు చేసింది. కథలో యజమాని సేవకురాలు కాబట్టి ఆ సామెత పొసగక పోయినా సమంజసం కాకపోయినా " మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కడం లాంటిది"
"పిల్లలు -ముసిలివాళ్ళు" కథ చదివి విచలితమైపోయాను .యుద్ధం ఎందుకు చేసుకుంటారు రాజుగారి కోసం. యుద్ధంలో ఎంత బాగా చంపగలితే అంత గొప్ప. శత్రువు దగ్గర హృదయం ఉండదు శత్రువు దగ్గర హృదయం ఉండదు అంతే. కథ ముగింపు వాక్యాలు దుఃఖభరితంగా ఉంటాయి. వాక్యం ఎంత శక్తివంతంగా వ్రాయవచ్చో తెలిపే కథ యిది.
"ఆఖరి ఉత్తరం" ఆలోచింపజేసే కథ. బాగుంది. ప్రేమ కథలెప్పుడూ బాగుంటాయి. వృద్ధాప్యపు జ్ఞాపకాలలో స్థిరంగా ఉండేది యవ్వనమే. ఆ వృద్ధుడు తన ప్రేయసికి ఒక లేఖ వ్రాస్తాడు. స్వార్ధంలేని ప్రేమఒక్క భగవంతుడికే సాధ్యమవును అని చెపుతూ నా జీవితంలో సుఖ దుఃఖాలు రెండూ నీతోనే వచ్చాయి. ఆ రెండింటి కోసమూ నీ ముందు కృతజ్ఞుడిని నేను అంటాడు. కానీ అతను వ్రాసిన ఆఖరి ఉత్తరాన్నిప్రియురాలికి పోస్ట్ చేయకముందే అతను చనిపోతాడు. ఆ వృద్ధుని కొడుకు ఆ ఉత్తరాన్ని చూసి నాన్న రహస్యాలు మనకి తెలియడానికి వీల్లేదంటూ ఆ ఉత్తరాన్ని కాల్చేస్తాడు. కానీ తండ్రి మనసును తెలుసుకోలేకపోయానని దుఃఖిస్తాడు. మనో వైజ్ఞానిక కథ.
ఈ కథల్లో పరిచయమైన చాలా పదాలకు అర్ధం తెలుసుకోవాల్సి వుంది. పురిపండా గారి అనువాద రచనలు చదివి ఉండటం వల్ల అనువాద కథలే అనిపించలేదు.ఈ కథలను మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి. కాలక్షేపపు కథలు కావివి. మంచి కథలను పరిచయం చేసిన వాడ్రేవు చిన వీర భద్రుడి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
విశ్వ కథా వీధి ఆరు భాగాలు కలిపి కథా సంకలనం గా పునర్ముద్రణ కాబోతుంది. కథాప్రపంచం వారు ప్రచురిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతుంది. తప్పకుండా కొని చదువుకోవాల్సిన కథలివి.


1 కామెంట్‌:

Unknown చెప్పారు...

నిజమే! కాలక్షేపపు కథలు కావివి. ఎంతో కొంత జీవితాన్ని నేర్పించే కథలు. మీ కళ్ళతో చదవడం గొప్ప హాయి!!