24, మే 2023, బుధవారం

నాకు నచ్చిన నా కథ


సారంగ పత్రిక వారు ..నాకు నచ్చిన నా కథ గురించి చెప్పమని అడిగారు . నేను బాగా రాసాను అనుకున్న కథలను ఇతరులు బాగా మెచ్చిన కథలను వదిలేసి  ఇదిగో ..ఈ కథ గురించి ఇలా రాసాను.  ఆ రాత ఇక్కడ పంచుకుంటూ .. అసలు ..ఈ లింక్ లో 

*************

నాకు నచ్చిన నా కథ .. 

ఎవరైనా ఎందుకు రాస్తారు? మనసు ఉగ్గబట్టుకోకలేక తమ  ఆలోచనలకు అక్షరరూపం ఇస్తారు. వాక్యం  కుదురుగా వుందనీ తను రాసుకున్న విషయం ఇతరులను  కమ్యూనికేట్ చేయగలదని నమ్మకం కుదిరాక పత్రికల్లో ప్రచురింపబడటం కోసం ప్రయత్నం చేస్తారు. అది రచయితకు తన రచనపై గల నమ్మకం. నా దృష్టిలో రచన చేయడం అంటే  సామాజిక మార్పు కోసం జరిగే అనేక ప్రయత్నాలలో ఒక భాగం.


“బయలు నవ్వింది” కథ .. కేవలం ఇది  కథ కాదు. నిత్యం మనం చూస్తున్న మన విద్వంసం. విద్వంసాన్ని లక్షణంగా చేసుకున్న మానవజాతి చేజేతులా తమ నాశనాన్ని తామే కోరుకుంటుంది. 


ప్రకృతి యిచ్చే సహజసంపద ను నాశనం చేసేస్తున్నాం మనం. ఒక తరం నుండి మరొక తరానికి అందించే నిజమైన సంపద సంప్రదాయమే! సంప్రదాయమంటే మరేమిటో కాదండీ జీవన విధానమే..  పంట పశువు చెట్టు పుట్ట గుట్ట నీరు ఆహారవిహారాదులు. వాటిని వొక్కొక్కటిగా నాశనం చేసుకుంటూ వెళ్ళి పోవడం అంటే  మన వినాశనానికి మనమే బీజం వేసుకున్నట్టు కదా!


సంప్రదాయం లేని జాతి  వెన్నుముక లేని శరీరం లాంటిదని పెద్దలు చెబుతారు. తమ చుట్టూ వున్న ప్రకృతిని ప్రేమించడం పూజించడం గౌరవించడం మన సంస్కృతిలో భాగం. ఈ కథలో .. ఒక తరం జీవన విధానానికి మరో తరం జీవన విధానానికి ఆలోచనలకు చాలా తేడా వుంది.    


కథలో యశోదమ్మ యిలా  అంటుంది. 


“నిజం చెప్పరా తమ్ముడూ.. ఆడు చెట్లన్నీ నరికేసినప్పుడల్లా నీక్కూడా కాళ్ళూ చేతులూ అన్నీ కోసి పారేస్తున్న బాధ కలగలేదు” అని. 


ఈ వాక్యం రాయాలని అనుకోలేదు. ఒరవడిలో రాసేసినాక.. ఆగి చూసుకుంటే దుఃఖం ముంచుకొచ్చింది.


మూఢనమ్మకాలతో ఇళ్ళను చెట్లను నిలువునా కూల్చడం పరిపాటి అయిపోయింది. ఆధునిక జీవితం పై మోజు పెరుగుతున్న కొద్దీ తమ మూలాలను త్యజించడం అనివార్యమైంది. ఎకరాలను అమ్ముకోవడం అడుగులు కొనుక్కోవడం నీరు ను దూరం చేసుకోవడం నీరు కొనుక్కోవడం. సంపద అంతా కార్పోరేట్ కబందహస్తాలలో బందీ అవడం. మానవజాతి తమ అభివృద్దికి కారణమైన అన్నింటినీ నిర్దాక్షిణ్యంగా  తొక్కుకుంటూ వెళ్లిపోవడం సర్వసాధారణం అయిపోయింది. వీటన్నింటికీ మూలం సహజమైన జీవన విధానాన్ని దూరం చేయడం ద్వారా కొందరికి మాత్రమే కల్గే అపరిమిత లాభం. 


ఈ రచన ద్వారా నా ఉద్దేశం యెంత వరకూ నెరవేరుతుందో చెప్పలేను. కానీ పాఠకుడిని తప్పకుండా ఆలోచింపజేస్తుంది. నా ఆలోచన వొక్కటే!  నేను రాసినది సామాన్య పాఠకుడిని స్పందింపజేస్తుందా.. ఆలోచింపజేయగల్గిందా లేదా? అని.  అదే నా రచనకు గీటురాయి. ఈ కథ కన్నా గొప్ప కథలు రాసాను. కానీ ఈ కథ నాకు తృప్తినిచ్చిన కథ. ఏకబిగిన రాసిన కథ ఇది. 


ఈ చిన్న కథలో సందేశంతో పాటు యశోదమ్మ పాత్రలో ధీరత్వం కరుణ రెండింటి సమన్వయం వుంది. స్త్రీ సాధికారత వుంది. 


మానవుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తమ జీవనాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవచ్చు సౌఖ్యం గా బ్రతుకుతున్నాం అని భావించవచ్చు. కానీ తాను నిలబడి వున్న యీ భూమి పై ఆరోగ్యంగా బతకాలంటే పకృతి సమతౌల్యం వుండాలి. పంచభూతాల సమన్యయం వుండాలి. అప్పుడే భూమి పై ప్రాణ కోటి మనుగడ సాగించగల్గుతుంది. మిగతా ప్రాణులతో పాటు తాను అన్నది ఎరుక కల్గి వుండటం ముఖ్యం. 


మనిషికి శాంతి నిచ్చే అభివృద్ధి బదులు భయం కల్గించే అభివృద్ధిలో మనం బతుకుతున్నాం. మనమంటూ మిగిలివుంటేనే కదా.. ఏ ఘర్షణ సంఘర్షణై నా! మనం పచ్చగా వుండాలంటే మన చుట్టూ కూడా పచ్చగా వుండాలి. ఇదే ముఖ్యం.  సంపూర్ణ సత్యమిదే! మన సంప్రదాయం కూడా ఇదే! 


కథ చదవండీ.. 


బయలు నవ్వింది కథ ఈ లింక్ లో




చిత్రం కోసం వెతుకుతుంటే .. ఈ చిత్రం కనబడింది . విచిత్రంగా ఇది మన భారతదేశం లో  ఇళ్ళు కాదు. ఈ తరహాలో అమెరికా లో ఒహియో రాష్ట్రంలో Dayton లో ఈ తరహా ఇళ్ళు నిర్మించుకున్తున్నారట. మానవుడు ఆధునికత జీవనంలో విసిగి పోయాడు. ప్రకృతిలో సహజంగా బతకడానికి ఇష్టపడి .. ఆ దిశగా వెళుతున్నాడు. శుభ పరిణామమే !




కామెంట్‌లు లేవు: