29, మే 2023, సోమవారం

ఓ అన్నా.. నీ అనురాగం


 మహిళాభ్యుదయం కోణంలో రామన్న అడుగుజాడలు..

ఒక రాజకీయ నాయకుడిగా.. ముఖ్యమంత్రిగా.. మహిళలకు అండదండలు సమకూర్చిన శ్రీ .. నందమూరి తారక రామారావు గారిని అభివృద్ధి సంక్షేమ రాజకీయ కోణంలో నేను చూసినదాన్ని చెప్పే ప్రయత్నం ఇది.


ఒక మనిషి గురించి మనం మాట్లాడాలంటే వారితో మనకు వ్యక్తిగత పరిచయమే అవసరంలేదు. వారి వ్యక్తిత్వం మనకు అర్ధమైతే చాలు.వారి సేవలు  ఆచరణయోగ్యం గా మారి చరిత్రలో సువర్ణాక్షరాలుగా లిఖింపబడివుంటాయి.


నేను చిన్నతనం నుండే ఇతరుల ద్వారా విన్న మాటల్లో పత్రికల్లో చదివిన సమాచారంతో  రేడియో లలో విన్న వార్తల్లో చూసిన సినిమాల్లోనూ అప్పుడపుడే పరిచయం అయిన టివీ లో చూసిన వరకూ మాత్రమే ఎన్ టి ఆర్ తో  పరిచయం అని చెప్పవచ్చు. ఆయన రాజకీయరంగ ప్రవేశం జరిగిన తర్వాతనే  పూర్తి ఆసక్తిగా గమనించడం. 


స్వర్గీయ ఎన్ టి రామారావు గారిని నేను రెండుసార్లు సమీపంగా చూసి వుంటానంతే! అంతకుముందు ఆయన  గొప్ప ప్రజాదరణ వున్న   సినీ నటుడు రాజకీయవేత్త.   నటుడిగా పౌరాణిక పాత్రల ద్వారా వేసిన ముద్ర వల్ల కొంత  అభిమానం, రాజకీయరంగంలో సంచలనం సృష్టించిన తీరు వల్లనూ   పేదల అభ్యున్నతి పట్ల  వారికి గల శంకించలేని  చిత్తశుద్ధి వలన కల్గిన అభిమానం. ఈ పురానవ యుగ పురుషుడి గురించి రాయడం అంటే.. భయంతో కూడిన గౌరవమే!  


మహిళాభ్యుదయం పట్ల వున్న వారికి వున్న అభిలాష చేసిన ప్రయత్నాలు వల్ల 1985 తర్వాత మహిళల జీవితాల్లో పెనుమార్పులే వచ్చాయి. మహిళాభ్యుదయం అంటే మహిళలను గౌరవించడం వారికి వున్న అవకాశాలను సుగమం చేయడం వారి అభివృద్ధికి కంకణం కట్టుకోవడం.. 


మొదటగా ఆయన నటనా జీవితంలో తారసపడ్డ స్త్రీల పట్ల వారి వైఖరి.. 


నటనా జీవితంలో యెన్నో ఆకర్షణలుంటాయి. వాటి బారిన పడకుండా హుందాగా ప్రవర్తిస్తూ నటీమణుల పట్ల గౌరవం కల్లి వుండేవారని చాలామంది నటీమణులు తమ ఇంటర్వ్యూల్లో చెప్పడం మనం విన్నాం. ఒకానొక సందర్భంలో మోహం లో పడిపోకుండా ఔచిత్యం ప్రదర్శించారని చెప్పడం విన్నాను. 


తన  సహ నటీ నటులకు  విలువైన సూచనలు అందించేవారని క్రమశిక్షణ సమయపాలన కల్గిన వ్యక్తి అని అది సెట్ నుండి ఇంటి వరకూ  వ్యక్తిగతం వరకూ కూడా వుండేదని వారి పిల్లలు  సహ నటులు అనేక సందర్భాల్లో  చెప్పగా మనం విన్నాం. ఆహ్యారం వాచకం విషయంలో చాలా శ్రద్ద తీసుకునే వారని అదే ఆయనను ఉన్నతస్థానంలో నిలిపిందని అంటారు. 


నాలుగు దశాబ్దాల పాటు  నటనకు భాష్యం చెప్పినట్లుగానే  రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల మధ్య తిరుగుతూ  నాయకుడు అనే పదానికి నిర్వచనమై నిలిచారు. ఆయన విద్యావంతులైన స్త్రీలను గుర్తించి రాజకీయాల్లోకి ఆహ్వానించారు చట్ట సభల్లో ప్రవేశానికి అవకాశం కల్గించారు. కె. ప్రతిభా భారతి , రేణుకా చౌదరి

గ్రంధి మాధవి నన్నపనేని రాజకుమారి జయప్రద మొదలైన వారంతా తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయరంగంలో ప్రవేశించినవారే! 


 ఊరూరా తిరిగి ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్గించారు. తెలుగు ప్రజల హృదయాన్ని చూరగొని ముఖ్యమంత్రి కాగానే అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. తమ ఆడబిడ్డలను కూడా ఉన్నత విద్యలు చదువుకునే విధంగా ప్రోత్సహించడమే కాదు,  మహిళాభ్యున్నతి గొప్ప సాంఘిక ప్రయోజనం అని భావించి 1983 లో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తిరుపతిలో  పద్మావతి మహిళా కళాశాల (విశ్వవిద్యాలయం) స్థాపించబడింది.


స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్ , స్త్రీలకి చట్ట సభల్లో 30% రిజర్వేషన్,  తండ్రి ఆస్తిలో ఆడబిడ్డలకు సమ హక్కు కల్పించారు.


ఒకప్పుడు వైద్య, ఇంజనీరింగ్ కాలేజీలకి ఉన్న డొనేషన్లు, ఇంటర్లో మార్కులు బట్టి నిర్ణయించే విధానం తొలగించి అందరికోసం EAMSET ఎంట్రన్స్ 1986 లో మొదలుపెట్టింది ఎన్టీఆర్. అందువల్ల ప్రతిభావంతులైన ఆడపిల్లలందరూ మగపిల్లలతో పోటీపడి ఇంజినీరింగ్ డాక్టర్ చదివి ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా  ఉన్నత స్థానాల్లో వున్నారు. 


1987 లో రాష్ట్రం అంతటా “ తెలుగు బాల మహిళా ప్రగతి ప్రాంగణం” “శిశు వికాస కేంద్రం”  “వృత్తి వికాస విద్యా కేంద్రం” పేరిట ఎన్నో సంస్థలు ప్రారంభించి మహిళా వికాసానికి మహిళాభివృద్ధికి పెద్దపీట వేసారు. 


మద్యపాన నిషేధ ఉద్యమానికి మద్దతు పలికి 1994 లో ప్రభుత్వం ఏర్పాటు కాగానే  మద్యపాన నిషేధం విధించి మగువల మనసును చూరగొన్నారు. 


నాకు తెలిసినంత వరకు స్త్రీ అభ్యున్నతి కోణంలో చెప్పాలంటే  అప్పటివరకుసమాజంలో, ఇంటిలో  భర్త,ఇతర పురుషులు మాత్రమే ఎవరికి  ఓటు వేయాలి అనేది నిర్ణయించేవారు. బయట రాజకీయ సభలు, సమావేశాలకు స్త్రీలు అసలు వచ్చే వారేకాదు.  వచ్చినా వారికి రాజకీయ కుటుంబ నేపథ్యం  వుండేది. ఎన్ టి ఆర్ పార్టీ పెట్టిన అనంతరం స్త్రీలలో రాజకీయ చైతన్యం అనేది ఎవరు నివారించలేని ఒక ఉత్తుంగ తరంగంలా యెగసిపడింది. అన్ని అంశాలపై స్వచ్చందంగా అవగాహన పెంచుకుని ప్రత్యక్ష రాజకీయలలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ పరిణామం  ఒక శతాబ్దకాలంగా ఒక జాతీయ పార్టీ, ప్రభుత్వం అన్నీ కలిసినా కూడా, ఆవిధానాలేవీ అంత చైతన్యం తీసుకురాలేకపోయాయి. అది వొక్క ఎన్ టి ఆర్ కే సాధ్యమైంది.


43 సంవత్సరాల దాంపత్య జీవనంలో భార్య బసవతారకం కు  సముచితమైన విలువనిచ్చారు. ఆమె కేన్సర్ వ్యాధితో మరణించగా కలత చెంది ఆమె పేరిట “బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్” స్థాపించారు. 


 లక్ష్మిపార్వతి ని ద్వితీయ వివాహం చేసుకునే క్రమంలో కూడా ఆమె విడాకులు తీసుకున్నాకనే  వివాహం  చేసుకున్నారు. విలువలకు ఆయన అంత ప్రాముఖ్యం ఇచ్చేవారు. రెండవ భార్యకే అధిక ప్రాధాన్యం ఇచ్చి ఆమెనే ముఖ్యమంత్రిణి చేయాలి అనే భావనలో కూడా వుండేవారని విన్నాం.  


వారికి మహిళల పట్ల వున్న గౌరవభావం సహృదయత కు తార్కాణం ఇవన్నీ.  మన తెలుగునాట మళ్ళీ ఇలాంటి నటుడు రాజకీయ నాయకుడు మరొకరు పుడతారని వుంటారని కాబడతారని ఏ మాత్రం ఊహించలేం. ఎందుకంటే యుగానికి ఒక్కరే ఇలాంటి వారు వుంటారు. తెలుగు ఖ్యాతిని నలుచెరుగులా వ్యాపితం చేసిన నాయకుడు శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో వారిని మనసారా స్మరించుకోవడం నాకు తెలిసిన జ్ఞానంతో ఈ కొద్దిపాటి విషయాలను పంచుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తూ.... శ్రీ నందమూరి తారక రామారావు గారికి .. ప్రణతులు అర్పిస్తూ.. జయహో! జయహో!! జగత్ విఖ్యాత నందమూరి జయహో!!!


- వనజ తాతినేని

     

    


కామెంట్‌లు లేవు: