25, మార్చి 2012, ఆదివారం

" వనూ స్ డైరీ విత్ వనమాలి "

"వను  వారు" ఇలా అనుకుంటున్నారు..

ఈ రోజు బ్లాగ్ పోస్ట్ లో  ఏం వ్రాసుకోవాలి? అలవాటు అయిపోయి.. చేతులని కీ బోర్డ్  రా రమ్మని పిలుస్తుంది. ఏం తోచి  చావడం లేదు.

వనమాలీ.. అలా చోద్యం చూస్తూ. మందస్మితంతో.. అక్కడ నిలబడి వీక్షించక పొతే కాస్త సాయం చేస్తే మీ సొమ్మేమ్  పోయిందో ? అసలు నాకు తెలీయక అడుగుతాను  మీరు నన్నెందుకు  ఈ బ్లాగ్ లోకంలోకి నెట్టినట్లు.. ? నేను హాయిగా పుస్తకాలు చదువుకుంటూనో.. స్నేహితులతో ముచ్చట్లు పెట్టుకునో లేదా .."వను స్ ..డైరీ విత్ వనమాలి " ..అంటూ వ్రాసుకుంటూనో ఉండేదాన్నికదా!. ఇప్పుడు కలం పట్టుకుని  వ్రాత వ్రాసి ఎన్నాళ్ళవుతుందో !

అయినా ..వేటూరి వారు ఒక పాటలో చెప్పినట్టు.. నేనేమంత గొప్పదాన్ని.. అంట? ఉద్యోగాలు చేస్తున్నామా? ఊళ్లు యేలుతున్నామా? నార్మల్లీ హౌస్ వైఫ్. మెదడులో గుజ్జు  వుండదు.అంట్లు తోముకుంటూ,బట్టలు వుతుక్కుంటూ,పిల్లా జెల్లా ని సర్ది ఆపై  హాయిగా టీవి సీరియల్ చూస్తున్నామని, పేపర్లో విశేషాలకి  అలవాటయి అదే ప్రపంచంలో బ్రతుకుతున్నామని అనుకుంటారు. మేము వ్రాసే విషయాలు ఏముంటాయి.. ? కాస్త  నవ్యంగా  వ్రాయడానికి  ఏదైనా  సలహా ఇవ్వవచ్చుగా ..అంది  వను.

బాప్ రే ! వను! (మా వనమాలికి నేను "వను" ని ) ఇంత ఏకధాటిగా మాట్లాడిన మిమ్ము చూస్తుంటే..మాకు గీతోపదేశం సమయమందున..అష్టాదశ  అధ్యాయాలని .. మేము  అర్జునుని తో ఇలాగున   యేకధాటిగా బోధించి వుండలేదే..అని విచారం కల్గినది"  అని అన్నారు హాస్యంగా.

మీ హాస్యం కొంచెం ఆపండి మహాశయా!  వనమాలీ అని పేరు వున్నంతనే..మీరు..ఆ మురళీ లోలుడు అయిపోతారా? నేనేమో భామని అవుతానా?  కొద్దిగా కినుకుగా అడిగింది..వను

"మీకు యేమి తక్కువ.. ప్రేమలో రాధకి, భక్తిలో రుక్మిణికి , అభిమానంలో (అహం అంటే ఇంకేమైనా ఉందా?) భామకి సరి సాటి" అన్నారు వనమాలి  

లోలోపల మురిసి పోతూనే అంత మునగ చెట్టు యెక్కించ వలదు లెండి. మీరన్న రీతిన మేమెక్కడ? మీరెక్కడ ? మీరు అసలే  లీలా వినోదులు. తగవులు పెట్టి చూచి తరించెదరు. మీ బుద్ది యుగాలు   మారినా మారలేదు అంది వను 

యుగాలు అయితే నేమి.. మేము మేమే ! మీరు మీరే కదా!..దేవి. అన్నారు వనమాలి. .

అక్కడ ఆ పోలిక కి కడుపు  మండింది వనుకి

ఆహా!  మేమేమి గొప్ప కాకుండే! మీరుమాత్రం  యెలా గొప్పఅయివుండును.. ? . అని అంది కత్తులు నూరినట్లు.

మీతో.. ఇదే సుమా చాలా చాలా చిక్కు. మేము చెపుతున్నది  సరిగా వినరు,  ఒకవేళ విన్నా  సరిగా అర్ధం చేసుకోరు.మీతో వేగి వేగి నా తల గిర్రున తిరుగుతున్నది.  మీతో వాదన తెగక తల బొప్పి కడుతున్నది. ఆ ప్రభావం మా పై పడి..మా రాచకార్యాలు సరిగా సక్రమంగా జరగకుండే!.. హతవిదీ..అంటూ.. రెండు చేతుల మధ్య ..శిరస్సు వుంచుకుని చటుక్కున కూలబడ్డారు.

ఆ స్థితిలో పతి దేవుని చూసి హృదయం ద్రవింపగా.. వనమాలీ మన్నించవలెను.
అసలే   అఖిల భారతమందున పురుషులు  కొంగ్రత్త చట్టములను చూసి..అగ్గి మీద మొక్క జొన్నల్లా..పేలిపోతున్నారు. వారిని కాస్త సాంత్వన  పరచకుంటే.. తేత్రా యుగం నందు సీతమ్మలా అగ్గిలో దూకి ఆత్మ  త్యాగం చేసేటట్లు వున్నారు..కాస్త వారిని సాంత్వన పరచే విధంగా నాలుగు మాటలు చెపుతారని..అడుగుదామనుకునే లోపునే..మనకి అలవాటైన వాగ్వివాదం మొదలయింది.మన్నించండి.. .వనమాలీ.. అంది వను.

ఆ మాటకి కాస్త ఉపసమనం పొంది..అది కాదు..వనూ ..ఇప్పుడు మేము చెప్పేడు విషయం శ్రద్దగా వినుడు.ఇప్పుడు కలియుగమున పురుషులకి చెప్పవలసినది ఏముంది? తేత్రాయుగమును వదిలివేయుడు. ఆ యుగమును  దాటి  ద్వాపర యుగమున ఈ వనమాలి..అష్ట భార్యలతో,పదుహారు వేల మంది గోపికలతోను కూడి..అనేక కష్టముల పాల్బడి నను .. నా స్వభావ సిద్దమగు ఆనందమునే..అందరికి అందించి..అందరివాడిని అనిపించుకుంటిని. అయినను..నన్ను ఆదర్శంగా తీసుకోకుండా..ముందు యుగమునందు ఆదర్శ పురుషుడిగా నడచిన శ్రీ రామునిని ఆదర్శం చేసుకుని..భారతీయ వివాహ చట్టములు యేర్పడి వుండవచ్చును. అదే  తరుణమున సీతమ్మ కష్టములని పరిగణన లోకి తీసుకుని ..స్త్రీలకి కొంత అనుకూలముగా చట్టములు చేసి వుండవచ్చును.

కాదు శ్రద్దగా వింటూనే వున్నది వను.

వనమాలి  కొనసాగిస్తూ.. ఇంకో విషయం చెప్పెదు    వినుడు.. కలియుగ దైవం అయిన మేము దేవేరిని వదిలి పద్మావతిని చేపట్టి యిద్దరి నడుమున నలిగి శిలనయితిని. అందుకే పురుషులకి అన్ని యుగాలయందునూ   ఏక పత్నీ వ్రతం శ్రేష్టం అయినది అని చెప్పుచుంటిని. అటులనే.. స్త్ర్రీలని ధనం  కోసమును,సేవలు చేయుట కోసమును వివాహమాడుట తగదని చెప్పుచూనే..వారికి పురుషులతో సరి సమానంగా..అస్త్ర,శస్త్రవిద్యల యందునూ,చతుషష్టి   కళలు నేర్చుకోనుడు ఆసక్తులపైననూ నిషేదములు వలదని చెప్పుచుంటిమి. అయిననూ  మా పురుషులు స్త్రీలని తక్కువ స్థాయిలో జూచు చుండబట్టే   ఈ అభిప్రాయ బేదములు తలెత్తి యున్నవి.  పతి అర్ధభాగం తానే  అగునట్టి ఉమయునూ, హృదయమున ప్రతిష్టించుకున్న మీరును, నాలుకపై నుండు..వాగ్దేవినూ స్త్రీ మూర్తులే కదా!మీ మువ్వురు భర్త అంతరంగ మెరిగి మసలుకోనలేదా! ఇప్పుడు స్త్రీలు కూడా అలాగే పతి మనసెరిగి ప్రవర్తించెదరు  అనుటలో సందేహం వలదు.

కానీ స్త్రీ-పురుష బేధం రాకుండా.. పాలునీళ్ళులా కలసి యుండెడి మాట మరచి ఒకరిపై మరొకరు విద్వేషములు పెంచుకొనుట యేల ?  విద్యలు,కొలువులు,బిడ్డల ఆలనా పాలన గృహ నిర్వహణ అన్నీ సమముగా చేసుకుని అందరు సుఖముగా వుండు..యోచన చేయ వలెనని..మా మాటగా చెప్పుచూ ఒక టపా వ్రాయుడు..అని చెప్పి విశ్రమించిరి.

అటులనే వనమాలీ..మీ మాట నేనెపుడైననూ  జవదాటితినా  ? మీరు నేను వేరు కాదు..మీ మాటే..నా మాట కూడాను అంది సంతోషంగా వ్రాయడానికి ఉపక్రమిస్తూ.. వను.

(జిలేబి వారలకు-జన్బునాధాన్ కృష్ణ స్వామీ అయ్యర్ వారలకు అనుకరణగా.. వ్రాసే సాహసం తో..క్షమాపణలతో.. ) 

కామెంట్‌లు లేవు: