21, అక్టోబర్ 2013, సోమవారం

పరువు హత్యలు

హాయ్ ఫ్రెండ్స్ .. బావున్నారా? 

వ్రాయడానికి బద్ధకం ఎక్కువైంది . వ్రాసేందుకు విషయాలు అయితే చాలానే ఉన్నాయి.  ఈ మధ్య కాస్త మిత్రులతో కాలక్షేపం  ఎక్కువైంది . అనేక మంది అనుభవాలు విన్నాను .

బాగా కదిలించిన ఒక సంఘటన .కరీంనగర్ ప్రాంతంలో జరిగిందని విన్నాను.

వేర్వేరు కులాలకి సంబంధించిన యువతీ యువకుల ప్రేమని ఆమోదించని పెద్దల దురహంకారాన్ని ప్రదర్శించి వారిని గదులలో పెట్టి హింసకి గురిచేసారట. అవకాశం దొరికే దాకా వేచి చూసి పెద్దలని  ధిక్కరించి  పెళ్లి చేసుకుని అదే వూరి మధ్యలోఇరువురు కలసి విషం  త్రాగి  చావు కూడా వారిని విడదీయలేదని  చెపుతున్నట్లుగా   ఆత్మ హత్య చేసుకుని మరణించారు .

ఆ తర్వాత ఆ పెద్దలు వారిరువురి కాయాలకి కలిపి చితినంటించి తర్వాత వారి జ్ఞాపకారం సమాధులని కట్టి సంతాప సభ ఏర్పాటు జేసి విందు భోజనాలు పెట్టి వీలైనంత కన్నీరు కార్చారట. ఇలా ప్రేమికులు మరణించకుండా ఉండాలంటే అసలు ప్రేమ జోలికి పోకూడదు అని తీర్మానించి .. ఆ వూరి మధ్యలో రచ్చబండ దగ్గర , వీధుల్లో  అక్కడక్కడా " ప్రేమిస్తే ప్రాణాలు తీస్తాం, జాగ్రత్త " బోర్డులు పెట్టారంట .  

ఈ విషయం వింటే అసహ్యం వేసింది . బిడ్డల పట్ల తల్లి దండ్రులు  వ్యవహరించే తీరులో నియంతృత్వం కనబడుతుంది . యుక్త వయసులో ఉన్న బిడ్డల ప్రేమలు పెళ్ళిళ్ళు పట్ల వారికి విముఖత ఉండటం సహజమే ! కానీ సున్నితంగా వ్యవహరించాల్సిన ఇలాంటి విషయాలలో మూర్ఖంగా వ్యవహరించి  వారిని నియంత్రించాలని అనుకోవడంతో యువతీ యువకులు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు . ఇలా వెళ్ళే వారిలో మైనర్ బాలికలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది . వారిని ఇంటికి  తీసుకు వచ్చి పరువు  పోయిందన్న కారణంతో వారిని హత్య చేయడానికి కూడా  తల్లిదండ్రులు వెనుకాడటం లేదు. పరువు హత్యలు పేరిట చేస్తున్న హత్యలలో ఉన్న పరువు ఏ  పాటిదో  అర్ధం చేసుకోవడం కష్టంగా ఉంది .

పుట్టుక  మరణం మధ్య   మిగిలిన ముప్పాతిక జీవితం ఎలా గడపాలో అన్న నిర్ణయం తమంతట తాము తీసుకుంటే .. పెద్దలు ఎలా నిరంకుశంగా వ్యవహరిస్తారో తెలుసుకుంటూ కూడా ప్రేమ అనే ఊబిలో పడి పెద్దల చేతిలో పరువు హత్యల కి గురవడం ఉత్తరాది రాష్ట్రాలలోనే కాదు  .. మన రాష్ట్రం లోను మొదలయ్యాయి .

"చందు" అనే తమ్ముడు ఈ విషయం చెప్పాక .. " ప్రేమిస్తే ప్రాణాలు తీస్తాం, జాగ్రత్త " ఇలాంటి సన్నివేశం  మన తెలుగు సినిమాలలో ఇంకా కనబడలేదు .. ఎందుకని ? అని అడిగాను .

  ఎప్పుడో వచ్చే ఉంటాయి మనం చూడలేదు అంతే! అని .. "అక్కా .. ఈ విషయం నీ బ్లాగ్ లో వ్రాయి . సినిమాలలో కన్నా బయట ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి .  పెద్దవాళ్ళు మారరా? ప్రేమించుకున్నవాళ్ళు చావాల్సిందేనా ? అని బేతాళ ప్రశ్న  వేసాడు .  :)  

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మారే వాల్లు మారారు. మారుతున్న వాల్లూ ఉన్నారు. మారకుండా ఖాప్ పంచాయితీలకు నఖల్లను సృష్టిస్తున్న వారూ ఉన్నారు. ఈ జాడ్యం పోవడానికి ఇంకా కొంత కాలం పడుతుందనిపిస్తోందండీ. ఈ వార్త చూడండి.
(Steady rise in inter-caste marriages involving dalits)

కులాంతర వివాహాలు పెరుగుతున్నాయని ఒక అధ్యయనం తెలియ జేసింది. మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేష్, కేరళలలో ఇవి బాగానే ఉన్నాయని ఆ అధ్యనం చెబుతోంది. ఇవన్నీ ప్రేమ వివాహాలో కాదో నాకు తెలీదు కానీ,మీరు ఉదహరించిన ఖాప్ పంచాయితీలాంటి సమాజాలలో కులం పాత్ర విస్మరించ లేనటువంటిది. సామాజికంగా వస్తున్న మార్పులతో కుల సంకెళ్ళు క్రమంగా తెగిపోతున్నాయి. ఇదో శుభ పరిణామం. భవిశ్యత్తులో మంచిరోజులు వస్తాయని నమ్మకం కలిగేలా చేస్తోంది.

అజ్ఞాత చెప్పారు...

యువత పెడ తోవపోతోందంటోది పాత తరం కాదు అభివృద్ధివైపు అడుగంటోంది నవతరం. సాధక బాధకాలని వివరించవలసినవారు మూర్ఖంగా ప్రవర్తిస్తే మిగిలేది బూడిద, అదే జరిగుతోంది దేశం లో పరువు హత్యల పేరిట.