24, జూన్ 2014, మంగళవారం

ఎవరైతే ఏమిటి ?

సాయి బాబా ! రామ్? ఎవరైతే ఏమిటి ? అభ్యంతరం ఎందుకు ?

రోజు గుడికి వెళుతూ కూడా దేవుడున్నాడా లేడా అన్న సందేహం కల్గినట్లు .

సాయిబాబా దేవుడు కాదు . ఎందుకో నాకు అలానే అనిపిస్తుంది అలా అని సాయిబాబాని నేను ద్వేషించడంలేదు . సాయిని పూజించే వారిని వ్యతిరేకించనూ లేదు .. నా దృష్టిలో గుడి అంటే శివాలయం ,విష్ణాలయం, అమ్మవారి ఆలయం .... ఇలా అన్నమాట .అది నా భావన

నాతో చాలా మంది చెప్పారు షిర్డీ వెళ్లి ఆయన విగ్రహం ముందు నిలబడి కూడా ఆయనకీ నమస్కరించడానికి మనసొప్పలేదు . ఆయన దైవం అంటే అంగీకరించలేకపోయాను  అక్కడ జరిగే హారతి లోను మనఃస్పూర్తిగా పాల్గోనలేకపోయానని చెప్పినవారు ఉన్నారు .

వారిలోనూ నాలోనూ ఎందుకలాంటి భావన అని  నా ఆలోచన .
సాధారణంగా పుట్టుక నుండి మనకొక సంప్రదాయం ఉంటుంది మనం కొన్నింటిని స్వయంగా ఆస్వాదిస్తేనే, అనుభూతికి లోనైతేనే ఒక స్థిర అభిప్రాయంకి వస్తాం . అదే ప్రామాణికంగా తీసుకుంటాం . అలాంటి అభిప్రాయానికి  రానప్పుడు ఎవరి మాటని మనం లేక్కించం అది దేవుడు విషయమయినా దెయ్యం విషయమయినా సరే! ఎవరి నమ్మకమే వారికి ప్రాధాన్యం కదా !

అడుగడుగునా గుడి ఉంది గుడిలోన దైవముంది మన హిందువుల విశ్వాసం కూడా అదే ఒక రాయిని నిలబెట్టి  ప్రాణ ప్రతిష్ట చేసి చుట్టూ నాలుగు గోడలు కట్టి శాస్త్రోక్తంగా ధ్వజస్తంభం  ప్రతిష్టించి రోజూ వేదాలలోని భాగాలతో మంత్రోచ్చారణ చేస్తూ ఉంటే అక్కడ మనకి తెలియని శక్తి ఏదో అదృశ్యరూపంలో నెలకొని ఉండి దైవం అన్న భావంలో మనుషులని కాపాడుతుందని మన నమ్మకం కూడా . అలాంటి భావనతోనే మూడు కోట్ల మంది దేవతలని మనం పూజిస్తున్నాం ప్రకృతిలో నిబిడీకృతమై ఉన్న అన్నింటిని మనం దైవ స్వరూపంగానే భావిస్తాం ..అలాగే ఇతర ప్రాణుల పట్ల భూత దయ కల్గి ఉండటం కూడా   అది మన జీవన విధానంం... .

ఇక సాయి బాబా దేవుని రూపమా కాదా అన్న విషయానికి వస్తే .....కొందరు పీఠాదిపతులు వ్యతిరేకించిన విషయం ఇప్పుడు కొత్తదేమీ కాదు ఈ విషయం నేను చాలా సంవత్సరాలుగా వింటున్నాను . సాయిబాబా గుడిలో పూజారులుగా ఉన్నవారిని వారి బంధువర్గం ఈ విషయంలో విభేదించడం చూసాను .

సాధారణ మానవులలో ఉండే మానవత్వం కన్నా ఎక్కువ శాతం మానవత్వముండి  తోటి ప్రాణులపట్ల దయ, జాలి కనికరం చూపే వారిని మీరు మనిషి కాదు దేవుడు తో సమానం అని కీర్తించేది మనమే ! దైవత్వం అపాదించేది మనమే ! సాయి బాబా గా తెలిసిన ఆయన్ని సాయి రామ్ గా మార్చేసింది మనమే ! సర్వ ప్రాణులపట్ల దయకలిగి మానవసేవ మాధవ సేవ చేయమని చెప్పిన వారికి దేవుడు ముద్ర వేసారు . సాయి బాబా తర్వాత అలాంటి  మహనీయులే పుట్టారు . రమణ మహర్షి , భగవాన్ వెంకయ్య స్వామి ఇలా కొందరు . అందరికి గుళ్ళు కట్టి పూజలు చేస్తే వాళ్ళు దేవుల్లవుతారు . ఎందుకంటే భక్తి అనే పిచ్చి జనం కి ఎక్కువ కాబట్టి . ఆచరించినా ఆచరించక పోయినా  సాయి బాబా చరిత్ర ఆయన జీవనమార్గం మంచే చెప్పింది.. ఆయన మనిషిగా ఉండే మనిషిలో  ఉన్న దైవత్వమే చూపాడు.. కృతజ్ఞతా భావం ఉన్నవారు మనిషినే దైవం అంటారు .. దైవం అని గుడులు కట్టి పూజించక పోయినా పర్లేదు . మంచి మార్గం ని అనుసరిస్తే చాలు .ఇష్టమయినవారు పూజించినా ఎవరికీ నష్టం లేదు. ఎవరైనా సరే దైవం పేరిట దీనులని  దోచుకు తినకుండా ఉంటే అదే చాలు  . ఇప్పుడు పీఠాధి పతులు చేస్తున్నవి అదే కదా! . శైవం వైష్ణవం పేరుతో కొట్టుకు చచ్చినట్లు ఇది మరో వివాదమా ?  హే  భగవాన్ !
  .
  .    

1 కామెంట్‌:

rajachandra చెప్పారు...

Nijame.. Devudu Peru to Jananni Dochukokunda unte ade chalu