3, జనవరి 2015, శనివారం

కొత్త ఆశలా !




కొత్త  ఆశలా ! ఇంకా పాతవే తీరలేదు.
కేలండర్   మారబోతుంది. ఏదో కావాలని, రావాలని మది నిండా ఎన్నో ఆశలు ఆకాంక్షలతో 2015 లో అడుగుపెట్టాను కానీ ఏవీ తీరనే లేదు ..

"ఈ మది  గది ఉంది చూసారూ .... ఇదో పెద్ద బంగాళాఖాతం. ఇంకా చెప్పాలంటే  ఇదో   అగ్ని గుండం  ఎన్ని  వేసినా స్వాహా చేసేస్తుంది ఇంకా ఇంకా అంటూ ఉంటుంది" అని లోలోపల అనుకుంటూ ఉంటాను .

నిజంగా చెప్పాలంటే ఒక సంవత్సరం ఎలా గడిచిపోయిందో ఏమీ చెప్పలేను . ఆ సంవత్సర కాలంలో చెప్పుకోదగిన విశేషాలు ఏవీ లేవు . ఎన్నో అనుకున్నాను. అవేమీ జరగలేదు. ఆ నిరాశతోనే మళ్ళీ ఇంకో సంవత్సరంలో అడుగుపెడుతున్నాను .  కేలండర్ మారినంత త్వరగా  మన మనసు, మన ఆలోచనలు, మన స్వభావం ఏవీ అంత త్వరగా మారవు. సమూహంలో ఉన్నా ప్రతి  మనిషి ఒంటరి. ఎవరి వ్యక్తిగత ఆకాంక్షలు, ఎవరి ఆలోచనలు, ఎవరి లక్ష్యాలు. ఎవరి విజయాలు వారివి . వైఫల్యం మాత్రం సమూహానిది .

మనుషులమధ్య సంబంధ బాంధవ్యాలు, ఆర్ధిక ఒత్తిడులు, సామాజిక ఒత్తిడులు, సాంస్కృతిక ఒత్తిడిలు ( సోషియల్ లాగ్ ) మనిషిని ఒంటరిని చేస్తున్నాయి. మనిషి కుదేలై పోతున్నాడు తనని తానూ రక్షించుకోలేని వ్యవస్థ లో తనలో తనే కన్నీరు కారుస్తున్నాడు . ప్రపంచం మారినంత త్వరగా పైకి కనిపించినంత వేగంగా  మనిషి వేగవంతం కాలేకపోవడం మనిషిని కృంగదీస్తుంది
అందులో నేనూ ఉన్నాను
నావరకూ నాకు ఈ సంవత్సరంలో నా కొడుకుని సమీపంగా చూసుకోవాలని, వాడికిష్టమైనవన్నీ వండి పెట్టుకోవాలని, ఇంకా పెళ్ళి చేసి కోడలిని తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నాను. బిడ్డని ఒక అడుగు దూరంలో స్క్రీన్ పై చూసుకోవడం తప్ప  ప్రేమగా దగ్గరకి తీసుకునే క్షణం రానివ్వని పరిస్థితులని చూస్తే దుఃఖం కల్గుతుంది. కొందరి ధనాశ,పరిస్థితులు ఏవైనా అపజయాన్ని అంగీకరించని నా బిడ్డ ఒంటరి పోరాటం, తనకి అండ కాలేని నా ఆసక్తత నన్ను మానసిక బలహీనతలోకి నెట్టేసాయన్నది నిజం. మీకేమిటి.. మీ అబ్బాయి అమెరికా లో ఉన్నాడు  హాయిగా ఉండక ఎందుకు దిగులు పడటం అంటారు కొందరు. డాలర్ల తో చాలా... కొనుక్కోలేము. ముఖ్యంగా సంతోషాన్ని. డాలర్లు సంపాదించడానికి వాళ్ళు ఎన్నెన్ని కష్టాలు పడతారో, జీవితంలో ఎన్ని సంతోషాలకి దూరం అవుతారో ! కానీ డబ్బు తెర తోనే మనుషులని విభజించే  మనుషుల మధ్య మనిషి ఒంటరి అవుతున్నాడని నాకిప్పుడు బాగా తెలుస్తుంది. చాలా మందికి సుఖానికి సంతోషానికి తేడా తెలియక సాలె గూడులో  సాలె పురుగులా ఉండిపోతూ ఉన్నారు. ఆధునిక జీవన శైలి కూడా అలాంటిదే !

వృద్ది ఆరాటాలు, పోయినవాటి పట్ల నిరాశ, ప్రతి క్షణం యుద్ధం.. యుద్ధం  మనిషి మనసుతో చేసే యుద్ధం.    పోయింది ఏదైనా దొరికేనా ఎన్నటికైనా అన్నది కాలం విషయంలో అందరికి వర్తించే  చేదు నిజం

ఎవరు ఎవరితోనూ మన్నసు విప్పి మాట్లాడుకోవడంలేదు.అంతా పొడి పొడి మాటలు, ఆరోపణలు ,  నిష్టూరాలు,  అందరి మధ్యకనిపించని  ఏవో ఇనుప తెరలు. అసలు ఎవరితోనైనా మాట్లాడాలన్న భయం వేస్తుంది. మాట్లాడినప్పుడో, తర్వాతనో గాయం తగులుతూనే ఉంటుంది. అందుకే మౌనాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది.  చాలా మంది  అకారణంగా ఇతరులపై  ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుంటారు.వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు, పేరు సంపాదించుకుంటూ ఉన్నారంటే ఓర్వలేనితనం ఎక్కువైపోయింది.  ప్రక్క వాడు కొంచెం బావుంటే చూడలేరు వాళ్ళు  కష్టాలలో ఉంటే, ఏడుస్తూ ఉంటే.. సానుభూతి చూపిస్తూ "అయ్యో ! " అనడటంలో  వాళ్ళకి ఎనలేని సంతృప్తి. ఎల్లప్పుడూ ప్రక్క వాడు తమ మీద ఆధారపడినట్లు ఉండాలని, వీళ్ళ సహాయ సహకారాలు ఆశిస్తూ ఉంటే  వీళ్ళు జాలి కురిపిస్తూనే మొండి చేయి చూపుతూ ఒక విధమైన పైశాచిక ఆనందంతో   కొందరు ఉంటారు. ఇవన్నీ కూడా మనిషి అనుభవిస్తున్న హింస.

ఒకటో తారీఖు వస్తే  "అమ్మో ! ఇంటద్దె కట్టాలి, పాల వాడు , ఎలక్ట్రిసిటీ బిల్లు, ఫోన్ బిల్లులు వీటన్నింటి మధ్య చిక్కిపోయే వంటింటి సరుకులు పెరుగుతున్న ఖర్చులకి భయపడి ప్రయాణాలు మానుకోవడం, తప్పనిసరై ప్రదర్శించాల్సిన ఆడంబరం, వెనక్కి నెట్టేసే ఆరోగ్య పరీక్షలు.. ఇవన్నీ కూడా మనిషి పై కనబడని హింస..  

వీటన్నింటి మధ్య  మాయమవుతున్న మనని మనకి పరిచయం చేసే పుస్తకాలు, సంగీతం , మిత్రుల ఆలింగనం, కొన్ని చిన్న  సరదాలు, సంతోషాలు
వీటితో నా ప్రయాణం .. ఇంకో సంవత్సరంలోకి  అడుగిడుతూ ..
వనజ తాతినేని .  

1 కామెంట్‌:

లక్ష్మీ'స్ మయూఖ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.