12, ఫిబ్రవరి 2013, మంగళవారం

మాటా - మంచి.


రెండు కొప్పులు  ఒకచోట కలిస్తే యుద్దాలు మొదలవుతాయి అని నానుడి.

అలాంటివి నానుడిని అప్పుడప్పుడూ అబద్దం చేస్తూ కాస్త హాస్య రసాన్ని  కలబోసుకుంటూ ముఖాలతో  పాటు మనసున నవ్వులు పూయించుకుంటూ ఉంటాం.  అలాంటి  సమయాల్లో ఈ సంభాషణ  జరిగిన సమయం ఒకటి.

ఇంతులకు బంతులన్నా, చామంతులన్నా బహు ప్రియం కదా!

ప్రియమైన ఇంతుల మనసు దోచే మాట.. ఒకటి చాలు కదా !  బహుమానాలుగా పూలమాల  ఎందుకు..అనుకుని ఒక భర్త అతని భార్య వద్దకు హడావిడిగా వెళ్ళి

నువ్వే  నా చామంతి వి    నేనేమో  నీ బంతి ని  ..అన్నాడట. కావాలని తనని తాను కొద్దిగా తగ్గించుకుని.

అంతే! తెలివికల భార్య మాటలో దొర్లిన పొరబాటుని పట్టేసి.. నాకేం తోచడం లేదండి..? ఇటురండి.. కాసేపు ఆడుకోవాలి అందిట.  :)  :)

చూసారా..!?  అక్షరం పొరబాటు మాట్లాడితేనే  ఎలాంటి ఇబ్బంది ఎదుర్కున్నాడో.. ఆ భర్త గారు.

అందుకే ..ఇతరులతో మాట్లాడేటప్పుడు అచ్చుతప్పులు లేకుండా, అక్షరం తప్పు లేకుండా, అసలు అర్ధం కాకుండా మాట్లాడకండి.

ఇలా జోక్స్ చెప్పుకుంటూ నవ్వుకుంటూ.. మాటా - మంచి..గురించి మాట్లాడుకున్నాం.

మాట వరాల మూట! మాట జారాక తిరిగి తీసుకోలేం !  కదా అనుకుంటూ నవ్వుల విషయం లో నుండి.. సీరియస్ గా ఇంకో విషయంలోకి వెళ్ళిపోయాం.

నాలుక మాట్లాడే మాటలకి శరీరం దెబ్బలకి కాయాల్సి వస్తుంది. అని చెప్పేది మా నానమ్మ.  కబీర్దాస్ పోయెట్రీ చదివినట్లు కూడా గుర్తు.  (जीभ jibh)

కొందరు అతిగా ఆవేశపడి మాటలు అనేసి తర్వాత సారీ సారీ..అనేస్తారు. సారీ అనేస్తే.. అంతకు క్రితం వారు అన్న మాటల వల్ల  గాయపడిన మనసుకి ఊరట కల్గుతుందా చెప్పండి?

ఇంకొంతమంది మనుషులని కుక్కలతో,పశువులతో పోల్చి మాట్లాడుతూ ఉంటారు. అసలు కుక్క కున్న విశ్వాసం మనిషికి ఉంటుందా చెప్పండి..? గడ్డి తిని పాలిచ్చే పశువులతో..మనుషులని పోల్చడం కూడా సమంజసం కాదేమో! పశువులే నయం .. వాటికి గడ్డి తినడమే తెలుసు. అవినీతితో అడ్డంగా బలిసే మనుషుల తీరు వాటికి తెలియదు పాపం.

అలాగే గడ్డిపోచ కన్నా..హీనం అంటూ తీసివేస్తారు. ఒకోసారి గడ్డిపోచలే వరదలో .కొట్టుకుపోకుండా కాపాడతాయి. కొందరు  ఒకోసారి గడ్డిపూవు తోనూ పోలుస్తుంటారు.బావి ఒడ్డున పెరిగే గడ్డి పూవు కి అందం ఉంది.. విలువ ఉంటుంది.

ఇలాంటి మాటలు మాట్లాడి ఇతరులని బాధపెట్టిన  తర్వాత కొన్ని బంధాలు తెగిపోవడం చూస్తుంటాము.తర్వాత  ఏమి వగచినా ఏం  ప్రయోజనం..చెప్పండి.

కొందరు సంస్కారం మెట్టు దిగజారలేక  తమ తప్పు ఏమి లేకపోయినా మౌనంగా ఉండిపోతారు. ఎదుటి వారి మౌనం ని అలుసుగా తీసుకుని  నోటి దురుసు వారు పెట్రేగి పోతూ తాము మాత్రమే  నిజాయితీపరులుగా ముద్రించుకుంటే  మాత్రం వారు సచ్చీలురు అయిపోగలరా?

 కొందరిలో రెండు నాల్కల దోరణి చూస్తుంటాం. కొందరు.. అతి మంచి తనంగా మాట్లాడుతూ వెనుక గోతులు తీస్తూ ఉంటారు. అమాయకంగా అందరిని నమ్మేయకుండా ఎవరి నైజం ఎలాంటిదో.. తెలుసుకుంటే చాలా ప్రమాదాలనుండి  ఎవరిని వారు కాపాడుకోవచ్చు కదా!

ఎవరైనా నోటిని అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది.  ఎదుటివారి మంచితనాన్ని అలుసుగా తీసుకుని పెట్రేగి పొతే.. ఎప్పుడు చూస్తూ ఊరుకోరు. తగిన సమాధానం చెపుతారు. మాటకి మాట అనడం  సమాధానం కాదు
అనకుండా ఉండటమే సంస్కారం. ఎన్ని చదువులు చదువుకుంటే ఏం?  కొంతమందికి అసలు సంస్కారమే తెలియదు.ఇతరులని  నలుగురిలో చులకన చేయడం,  ఎగతాళిగా మాట్లాడటం వలన వారికి గౌరవం ఏం పెరగక పోగా పదుగురితో అసహ్యించుకోబడతారు. మనిషి విలువని పెంచి మనుగడలో గౌరవం పెంపొందించుకుంటూ మనకంటూ  నలుగురు  ఆత్మీయులను సంపాదించుకోవడమే గొప్ప విషయం.

 సంస్కారం మనిషికి ఆభరణం కావాలని కోరుకుందాం.సరేనా!

dude .. సంస్కారమే కదా..కావాల్సింది. సంస్కారంగా మెలిగిన సంస్కారం  తిరిగి వచ్చును. :)




4 కామెంట్‌లు:

పల్లా కొండల రావు చెప్పారు...

ప్రతీ విషయాన్నీ పోస్టుగా మలచే శక్తి అదీ సంస్కారవంతంగా .... బాగుందండి.

శశి కళ చెప్పారు...

అవును అక్కా మన సంస్కారమే ..మనకు అవతలి వారి నుండి నమస్కారం తీసుకొని వస్తుంది

భారతి చెప్పారు...

మనిషి విలువని పెంచి మనుగడలో గౌరవం పెంపొందించు కుంటూ మనకంటూ నలుగురు ఆత్మీయులను సంపాదించుకోవడమే గొప్ప విషయం.
మంచి మాటను చెప్పారు వనజగారు.
చక్కటి సంస్కారమే మనిషిని మానవత్వం నుండి మాధవత్వం వైపు నడిపిస్తుంది.
ఎప్పటిలా మరో మంచి పోస్ట్ అందించినందుకు ధన్యవాదాలండి.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"సంస్కారంగా మెలిగిన సంస్కారం తిరిగి వచ్చును."
"ధర్మో రక్షతి రక్షితః" లాగా...
బాగుందండీ :)