లేఖా సాహిత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
లేఖా సాహిత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, మే 2022, ఆదివారం

ఊహలెంత సత్యం




ప్రియమైన నీకు…. 

 చిన్నితల్లీ..   నాయనమ్మ నీకు వ్రాస్తున్న రెండో ఉత్తరం ఇది. 

 నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఒక మధురమైన ఘట్టంలా రికార్డ్ చేయాలని వుంటుంది కానీ చేయలేను. పసిపిల్లలకు ప్రతిది ఆశ్చర్యంగా తోస్తుంది అందుకే వారు అనేక ప్రశ్నలు అడిగి పెద్దలను విస్మయపరుస్తారు అనుకుంటానెపుడూ.ఇప్పుడు  అనుక్షణం నిన్ను చూస్తూ.. పసితనం మనిషికి అద్భుతమైన వరం కదా.. కాలం చెక్కిన గుర్తుల వెనుక అవి మాయమైన తెల్లకాగితాలు కదా అనిపిస్తూంది. 


బంగారూ.. చీకటి పడ్డాక బ్యాక్ యార్డ్ లోకి వెళ్ళగానే మినుకు మినుకు మనే నక్షత్రాలను చూసి స్టార్స్ అని ఒకింత ఆశ్చర్యంతో  చెప్పలేని సంతోషంతో నీవు అనడం చూసి నేను యెంత మురిసిపోయానో.. అది మాత్రమే కాదు ఉదయిస్తున్న సూర్యుడికి “స్వామీ” అని చేతులు జోడించడం, రాత్రివేళ  చందమామను చూసి “దా దా” నీ చిట్టిచేతులతో పిలవడం చూస్తే ఏదో చెప్పలేని ఆనందం.  సైకిలు యెక్కి బయటకు వెళ్ళి తిరిగిరావలనే ఆకాంక్షను చలిగాలుల బూచి చూపి నేను వాయిదావేయడం నువ్వేమో చెట్లఆకుల కదలికలను చూసి కొద్దిపాటి భయం ప్రదర్శించే చూపులతో  “అమ్మో గాలి” అనడం. ఇలా ప్రతి విషయం నాకు అపురూపమే.


పచ్చదనాన్ని ప్రకృతిని పరిరక్షించుకోవాలనే  ఆకాంక్ష వున్న నేను.. నిన్ను మొక్కల దగ్గరకు తీసుకువెళ్ళి వాటికి గుడ్ మార్నింగ్ చెప్పించి ఆకులను స్మూత్ గా టచ్ చేయిస్తూ.. చెట్టూ ఐ లవ్ యూ అని  నీతో చెప్పించడమూ,  కేవలం స్క్రీన్ మీదనే కాకుండా  అనంత ఆకాశాన్ని మబ్బులను పక్షులను వాన ను సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను ఎడతెగక తిరిగే విమానాలను విరబూసిన పూలను మంచును ఇంటి ముందు ముగ్గులను దీపకాంతుల మధ్య దైవమందిరాన్ని నీకు పరిచయం చేయడం నా బాధ్యత కూడా.ఏ రాగమో తెలియక పోయినా ఏ భాష రాకపోయినా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గరళమాధుర్యానికి పరవశిస్తూ రాగాలు ఆలపిస్తూన్న నిన్ను చూసి నాకెంతో మురిపెం. అలాగే Nora En pure బీట్ కి లయబద్దంగా కాళ్ళు కదుపుతూ  రిథమిక్ గా  ఊగిపోవడం చూస్తే కూడా అమిత ఆశ్చర్యమూ ఆనందం. నీ బోలెడన్ని  ఆశ్చర్యాలు నేను అనుభవించడం కూడా  ఆనందమే! ఇలా రోజు మొత్తం  సూర్యుడు చుట్టూ తిరిగే భూగోళంలా మనుమరాలు చుట్టూ తిరిగే నాయనమ్మను అయిపోయాను. 


 నీ సాన్నిహిత్యంతో మనసుకు తొడిగిన నైరాశ్యాన్ని కడిగేసుకుని  నువ్వు ఇంకొంచెం పెరిగిన తర్వాత నన్ను అడగబోయే ప్రశ్నలను ఊహించుకుంటూ  ప్రియమైన నీకు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. ఈ ఊహలో సత్యమెంతో మధురం కూడా అంతే! నువ్వు నన్ను ఇలా అడుగుతూ వుంటావన్నమాట. నేను నీకు సమాధానం చెపుతుంటాను.


******


 “నాయనమ్మా!  రాత్రంతా నక్షత్రాలు ఎందుకు అలా  మెరుస్తున్నాయి”


చీకట్లో దారి కనబడక మనం ఇబ్బంది పడుతుంటామని   దేవుడు మనకు దారి చూపడానికి ఇచ్చాడమ్మా అంటాను నేను. 

ఉహూ.. అంటావ్ పెద్ద ఆరిందలా.


మరో రోజు..


 “ నాయనమ్మా! రోజూ సూర్యుడు ఎందుకు వస్తాడు, సాయంత్రం మాయమైపోతాడెందుకు”


చిన్నితల్లీ..  మిష్టర్ సూర్య ఎక్కడికీ వెళ్ళడమ్మా అతనికి చాలామంది పిల్లలు. వాళ్ళ ఊరికి కూడా వెళ్ళి వస్తాడంతే!

 

 “నాయనమ్మా! వాన ఎందుకు కురుస్తుంది. కాసేపటికి

 మాయమై అది ఎక్కడికి వెళుతుంది?"


 “పూల చెట్లకు, పండ్ల తోటలకు, పొలాలకు  దాహం అవుతుందని దేవుడు వాటికి నీళ్ళు పోస్తాడమ్మా  ఎందుకంటే ఆయన వాటిని  ఎంతగానో ప్రేమిస్తున్నాడు.


” నాయనమ్మా! నువ్వు నన్ను కూడా ఎప్పుడూ ప్రేమిస్తావా!  నేను  ఎంత అల్లరి  చేసినా తిట్టకుండా ప్రేమిస్తావా!? అని అడుగుతావు.


చిన్ని తల్లీ! నా బంగారు కొండా! నువ్వు నాకెప్పటికీ ప్రియమైన దానివి. ఎల్లప్పుడూ నా బిడ్డవి, ఎప్పటికీ మరియు ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే వుంటాను. దేవుడు మన అందరినీ ప్రేమించినట్లే నేనూ నిన్ను అమితంగా ప్రేమిస్తాను బంగారు తల్లీ! అంటాను.


అపుడు నీవు నన్ను ఎత్తుకోమని చేతులు చాపుతావు. నేను నిన్ను ఎత్తుకోగానే నా మెడ చుట్టూ చేతులు చుట్టేసి “ ఐ లవ్ యూ నాయనమ్మా” అంటూ ముద్దులు  పెడతావు. నా హృదయం అమృతం సేవించిన ఆనందంతో ఊగిపోతుంది.  చిప్పిల్లిన కళ్ళతో..   “హృదయాలను వెలిగించే దేవుడు కల్మషం ఎరుగని పసి మనసుల్లోనే కదా వున్నాడు కదా” అంటాను మీ నాన్నతో.  “అవునమ్మా” అంటాడు మీ నాన్న. 


నాకు తెలియని నా పసితనం నాకు తెలిసీ మీ నాన్నకు తెలియని మీ నాన్న పసితనం ఇప్పుడు మా ఇద్దరికీ తెలిసిన నీ పసితనపు ముచ్చట్లు ఇలా భద్రపరచడం నాకెంతో ఇష్టమైన వ్యాపకం కూడా. నువ్వు పెరిగి పెద్దయ్యాక వీటిని చూసి సంతోషిస్తావ్. ఫోటోగ్రాఫ్ లు వీడియోలతో పాటు ఈ లేఖలను కూడా నీ పిల్లలకు చూపించి నీ బాల్యాన్ని వారికి పరిచయం చేస్తావు కదూ! బాల్యం మధురమైనది ఎంతో స్వచ్ఛమైనదని అప్పుడు నువ్వు కూడా అనుకుంటావు. 


              శుభాశీస్సులు బంగారు తల్లీ.. ప్రేమతో నాయనమ్మ. 



(175 మంది రచయితలు వ్రాసిన లేఖాసాహిత్యం పుస్తకరూపంలో ‘’ జ్యోతి వలబోజు’’ గారి సంపాదకత్వంలో


‘’ ప్రియమైన నీకు’’ వెలువడింది. అందులో నేను వ్రాసిన లేఖ ఇది. 






20, ఏప్రిల్ 2016, బుధవారం

అయ్యోరమ్మా! రొవొంత ఇటొచ్చి ఉత్తరం ముక్క చదివిపో ..

అయ్యోరమ్మా! రొవొంత ఇటొచ్చి ఉత్తరం ముక్క చదివిపో .
శశీ ఎలా ఉన్నావ్ ?

ప్రేమ నిండిన  నీ పిలుపుతో ప్రియమైన అక్కని చేసావు నన్ను. ఆ పిలుపు నాకెంత సంతోషమో !

నాలుగేళ్ల క్రిందట నువ్వు నన్ను చూడాలని  మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఎంత సంతోషించానో ! నాలుగేళ్ళు అలా అలా..  గడచిపోయాయి . మీ అబ్బాయి నివాస్ చదువు పూర్తయింది కదా !
అమ్మాయి హేమకి   పెళ్ళి చేసినప్పుడు నాకూ ఆత్మీయంగా  ఆహ్వానం పంపావు. నెల్లూరు అనగానే నాకెంత సంబరమేసిందో !   నువ్వు కాకుండా, నాకెంతో ఆత్మీయురాలైన "సామాన్య " ఉంది. ఇంకో సుగుణ ఉన్నారు, ఇంకా కొంతమంది స్నేహితులు ఉన్నారు.  వీలుపడక రాలేకపోయాను కానీ .. ఈ టీచరమ్మ అప్పుడే అమ్మాయికి పెళ్లి చేస్తుంది ఏమిటీ ? అమ్మాయికి చిన్న వయసే కదా ! తను కూడా బాగా చదువుకుని ఉద్యోగంలో చేరి కొంచెం ఆర్ధిక స్వావలంబన  ఆత్మవిశ్వాసంతో నిలకడగా నిలబడినప్పుడు కదా పెళ్లి చేయాలి ? , తనేమో చక్కగా చదువుకుని టీచరమ్మగా ఉంటూ అమ్మాయికి పెళ్లి చేయాలని తొందరపడం బాగోలేదు అనుకున్నాను. మళ్ళీ అంతలోనే అంత మంచి సెబ్బర కనుక్కోకుండా, అన్నీ వివరంగా తెలుసుకోకుండా శశీ తొందరపడదులే అనుకున్నాను.

అమ్మాయికి  బాల్యజ్ఞాపకాల గురించి హేమ మాధురి మధురిమలు పేరిట నువ్వు వ్రాసిన జ్ఞాపకాలు ఎంత మధురంగా ఉంటాయో శశీ ! బిడ్డల ప్రతిదశని, ఆ ముద్దు ముచ్చట్లని అమ్మ గుర్తుంచుకున్నంతగా ఇంకెవరికి గుర్తుండవేమో కదా ! ఇక్కడ సందర్భం కాదు కానీ .. ఒకటి చెప్పుకోవాలి. మంచి విద్యావేత్తగా చక్కని వక్తగా పేరు తెచ్చుకున్న లక్ష్మీ పార్వతి గారు  సవతి కూతురికి పెళ్లి చేసి పంపేసి తను మాత్రం ఉన్నత విద్య చదువుకుందని పత్రికలలో చదివాను. పిల్లలకి కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి రావాలి కదా ! తొందర తొందరగా  పెళ్లి చేసి భాద్యత తీర్చేసుకోవాలనుకుంటే తర్వాత అమ్మాయిలకి వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు వస్తే ఇతరులపై ఆధారపడి బ్రతకడం ఎంత కష్టం చెప్పు ?

అందుకే ఆడపిల్లలకి విద్య యొక్క ఆవశ్యకత తప్పని సరిగా తెలియాలి. ఇప్పుడు పిల్లలేమో చదువుకోమని కాలేజీలకి పంపితే ప్రేమ, అవాంచిత గర్భం, మౌనపోరాటం లేదా ఆత్మ హత్య ఎక్కడ చూసినా ఇవే కనబడుతుంటే ఇదా మనం సాధించిన అభివృద్ధి అని దిగులు కల్గుతుంది.

ఒకపక్క స్త్రీలకి విద్య అందుబాటులోకి వచ్చి వందేళ్ళు కూడా కాలేదు అప్పుడే స్త్రీల చదువులపట్ల ఎంతో  వ్యతిరేకం .  ఎంత చదివినా ఇల్లు చక్కబెట్టుకోవడం తప్పదు కదా అని తేలికైన మాటతో తీసిపారేస్తారు. ఇంకో పక్క  భారతీయ స్త్రీల వేష భాషల్లో ఆహార్యంలో ఎంతో  మార్పు వచ్చింది ముఖ్యంగా  వస్త్రధారణలో ఎంతో  మార్పు వచ్చింది.  సంప్రదాయబద్దంగా కట్టే చీరకట్టు, చుడీదార్ స్థానంలో ఫ్యాంట్ షర్ట్ వచ్చేసాయి . మళ్ళీ అక్కడినుండి కూడా డీ గ్రేడ్ అయి నిక్కర్ లలోకి దిగిపోయారు. మా విజయవాడలో కూడా అమ్మాయిలు ఐమాక్స్ దియేటర్స్ లోనూ, షాపింగ్ మాల్స్ లోనూ చాలా అధునాతనంగా కనబడుతున్నారు. నాకేమో ఇదంతా పశ్చిమ దేశాలనుండి దిగుమతి అయిన సంస్కృతి అయినప్పుడు పశ్చిమ దేశాలవాళ్ళు తీసుకున్నంత తేలికగా కొన్ని విషయాలని కొట్టి పారేయలేక పోతున్నాం కదా! అనుకుంటాను. వేష భాషలలో వచ్చినంత ఆధునికత ఆలోచనల్లో రాలేదు కాబట్టే  బయటకి వెళ్ళిన అమ్మాయి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేంతవరకూ అమ్మ చూపులు వీధి చివరనే అతుక్కుని ఉంటున్నాయి.

ఇంకేమిటీ శశీ ... నీ చిన్నప్పటి పొలం కబుర్లు చాలా బావుంటాయి. వ్యాఖ్య పెట్టలేకపోయినా చదివేసి వస్తూ ఉంటాను. మాది కూడా వ్యవసాయమే వృత్తిగా చేసుకుని, దానికే   ప్రాధాన్యతనిచ్చే  కుటుంబం కదా ! మా పంటపొలాలు కూడా వాణిజ్య భూమిగా మారిపోయే రోజులు దగ్గరికొచ్చాయి. అగ్రికల్చర్ జోన్ అంటే రైతులే నిరసన తెలుపుతున్నారు. ఇక పంటలు పండేది ఎక్కడ? అన్నం తినేటప్పుడు చేనుని, దాహంతో నీరు తాగేటప్పుడు నదికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని మా అమ్మ చెప్పేది. ఈ అతివృష్టి అనావృష్టిల దోబూచులాట కాలంలో రైతు కునారిల్లిపోతున్నాడు. ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు. మనసు వికలమైపోతుంది.  ఈ సంవత్సరం కృష్ణ డెల్టా లో కూడా పంట వేయలేదని 24 ఏళ్ళ తర్వాత మళ్ళీ మళ్ళీ అలాంటి కటకటని చూస్తున్నామని మా ప్రాంత  రైతులు చెపుతున్నారు. కృష్ణ, గోదావరి జలాలన్నీ  ఈ జిల్లాలే మింగేస్తున్నాయని రాయలసీమ ప్రాంత ప్రజల ఆవేదన వింటున్నాం.  ఇలాంటి  వాతావరణ పరిస్థితుల్లో పాలకులు మాత్రం ఏం చేస్తారు ? మనిషి చేసే పర్యావరణ నాశనానికి అంతం ఉందా ?

పత్రికలలో ఒక వార్త చూసినప్పుడు  నువ్వే గుర్తుకు వచ్చావ్ ! తమిళనాడులో శ్రీ వరిని  పండించి అధిక దిగుబడి సాధించిన ప్రసన్న భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు అంట. అర ఎకరం పొలంలో  నలబై బస్తాలు పండించి రికార్డ్ సృష్టించారు . మహిళలు క్లాస్ రూం లో పాఠాలు చెప్పడమే కాదు పంట పొలంలో దిగి వ్యవసాయం చేసి ఉత్తమ ఫలితాలని అందిస్తున్నారు . వ్యవసాయ ప్రాధాన్యమైన మన దేశంలో పొలం గురించి పరిచయం లేనిదెవరికి?  పచ్చని పైరుని చూసి పొంగిపోవడం,  పాడి పశువులని ప్రేమగా చూడటం మన గ్రామీణులకి సహజంగా అమిరిన గుణం. అది ఒకరు నేర్పాలా ఏమిటీ ?

అయిదవ తరగతి నుండి వ్యవసాయాన్ని కూడా తరగతి పాఠంగా చేర్చి వ్యవసాయ ప్రాధాన్యం గురించి, కుటీర పరిశ్రమల గురించి తెలియజెప్పాల్సిన అవసరముంది శశీ ! మన విద్యావిధానంలో చాలా మార్పులు రావాలి. రాబోయే కొన్ని సంవత్సరాలలో వ్యవసాయ ఉత్పత్తులే పెద్ద పరిశ్రమగా మారే అవకాశం ఉందంట. ఆధునిక వ్యవసాయం పట్ల మనవాళ్ళకి అవగాహన ఏర్పడాలి . మా ఇంటి దగ్గరలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలెట్టారు. ఒక స్టోర్ కూడా పెట్టి కూరగాయలు అమ్ముతున్నారు. ఖరీదు చాలా ఎక్కువ. మనలాంటి మధ్య తరగతి వాళ్లకి అందుబాటులో లేవు. పెరటి తోటలు ఇప్పుడు లేవు కదా ! అలాగే రూఫ్  గార్డెనింగ్  చేసుకోవడానికి అవకాశంలేని అగ్గిపెట్టె గదులున్నఇళ్ళు  అయిపోయాయి. ఇక మొక్కలని ఎలా పెంచుకోగలం ? సూర్యోదయం, సూర్యాస్తమయం, వెన్నెల  ముఖం చూడని బతుకులు అయిపోతున్నాయని దిగులుగా ఉంది.  ఇకపై మా ప్రాంతం వాళ్ళూ ..  ప్రకృతి ఒడిలో సేదతీరాలంటే ... ఓ  పాతిక కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. ఎక్కడ చూసినా బిల్డింగ్ లే ! నెల్లూరు కూడా అంతే కదా ! ఎంత పెరిగిపోయింది! కానీ అంతే ఇబ్బంది ఉంది కదా? మొన్న వర్షాలకి నిండా మునిగి పోయింది కదా, అలాంటి అభివృద్ధి అవసరమా అనిపించడం లేదూ !?

అందరూ పచ్చగా  ఉండాలంటే ... భూమికి పచ్చని  రంగేసినట్టు పాటు పడాల్సింది మనమే కదా ! మా అబ్బాయీ, నేనూ అనుకుంటూ ఉంటాం. ఇంకో అయిదారేళ్ళకి  తను ఇక్కడికి వచ్చేస్తాడు. పాలీ హవుస్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని తెగ ముచ్చట పడుతున్నాడు. భూముల ధరలు చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. గ్రౌండ్ వాటర్ లెవల్స్ పాతాళంలో ఉన్నాయి, పదెకరాలు పొలం కొనాలంటే అమెరికాలో పదేళ్ళు కష్టపడ్డా ఇక్కడ భూమి రాదు ... ఎక్కడో మారుమూల కొనుక్కోవాలి, అక్కడ కూడా మంచినీళ్ళు కొనుక్కుని తాగుతున్నారు. నువ్వేం వ్యవసాయం చేస్తావ్ ? అని వాస్తవాలు చెపుతాను .  అవునా అమ్మా అంటూ  దిగులు పడతాడు.

ఇంకేమి వ్రాయాలబ్బా అని ఆలోచిస్తున్నా. ఉత్తరం వ్రాయకముందు  ఏవేవో వ్రాయాలి అనుకున్నాను కానీ వ్రాయడం మొదలెట్టాక అవేమీ గుర్తులేవు. ఎప్పుడో నువ్వు అడిగిన ప్రశ్న గుర్తుకు వచ్చింది.

ప్రేమంటే ఏమిటని అడుగుతావు కదా శశీ ! నాకు కూడా అదేమిటో తెలియదు. అమ్మ ప్రేమ, బిడ్డపై ప్రేమ, ఒక మంచి భావం పై పుట్టే తాత్కాలిక ప్రేమ తప్ప ప్రేమంటే ఏమిటో నాకూ అనుభవం కాలేదు శశీ !
ప్రేమంటే భాద్యత , మనని నమ్మినవారి భవిష్యత్ ని మనం కలగనడం. అవతలివారు ద్వేషించినా ప్రేమిస్తూనే ఉండటం అని నేను అనుకుంటాను .

నేనున్నానని తోడయ్యేది..నీవే నేనని నీడయ్యేది...అమ్మగా చల్లగా కనిపించేది.. వేటూరి గారి గీత రచన కూడా నాకు చాలా నచ్చుతుంది.

బిడ్డపై తల్లిదండ్రులకి ఉన్న ప్రేమని ఎవరూ శంకించలేరు, అదే జీవిత భాగస్వామి ప్రేమ ఎప్పుడూ శంకతోనే ఉంటుంది.  యువతీ యువకుల ప్రేమ ఎప్పుడూ ఆకర్షణ తోనే ముడిపడి  ఉంటుంది  అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్ళ పెళ్ళిళ్ళూ  విఫలమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇద్దరూ ఉద్యోగాలు చేయాలి, ఇద్దరూ ఇంటిపని, వంటపని మిగాతాపనులన్నింటిని పంచుకోవాలి.  ఆడ పని మగ పని అంటూ ఏమి ఉండకూడదు. గౌరవం ప్రధానం. పురుషులు ఏమంటారో తెలుసా ! అన్నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పడేస్తున్నాం అది ప్రేమ కాదా అంటారు . ఆ పడేయడంలో విసుగు,అహంకారం ఉంటాయి.  ప్రకటితం కాని ప్రేమ ఎక్కడో అట్టడుగున తొక్కేసి ఉంటుంది. యాంత్రిక జీవనంలో ప్రేమ దొరికే చాన్స్ ఉంటుందా ?  దొరకని దానికోసం ఆవేదన చెందటం ఎందుకూ అని  అనిపిస్తూ ఉంటుంది.


ఈ మధ్య చాలామంది స్త్రీలు  ముక్కుపచ్చలారని బిడ్డలని ఉరి వేసి చంపేయడమో, నీళ్ళలో తోసేసి చంపేయడమో చేసి వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కన్నతల్లికి  బిడ్డలని చంపేసే కర్కశత్వం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపడుతున్నాం. కానీ వారి మరణం వెనుక దాగిన  పురుషుల నిర్లక్ష్యాన్ని, ద్రోహ చింతనని మనం అంతగా పట్టించుకోవడం లేదు. వైవాహిక జీవితంలో అసంతృప్తులు మగవాడిని ప్రక్కదారి పట్టించడం జరుగుతుంది. ఆడవాళ్ళు తక్కువేం కాదు. ఇలా కుటుంబ సంబంధ భాంధవ్యాలు దెబ్బతినడం మూలంగా నిరాశతో, నిసృహతో నిలువునా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి మరణాలు సమాజానికి విసురుతున్న  సవాల్ అన్నమాట . భర్త అలా చేస్తే భార్య నేను ఇలా చేసి చూపిస్తాను అని చెప్పడమన్నమాట.

మగవాళ్ళ దుర్వ్యసనాలు, బహుభార్యాతత్వంతో వర్దిల్లుతుంటే ఆ సంసారాన్ని ఈదటం తలకి మించినబరువు. పిల్లల చదువులు గుండెల్లో  పెద్దబండ. పాపం ఇక ఆ స్త్రీ ఏం చేయగల్గుతుంది ? ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే గుండె బరువెక్కుతుంది.  దైర్యంగా బ్రతుకుని ఈడ్వాలని వీరికి ఎవరు చెపుతారు ?  నిజంగా భర్త భార్యని ప్రేమిస్తే బిడ్డలు గుర్తుంటే ఇలా వ్యసనాల పాలవుతారా ? కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారా?

నాకు తెలిసిన ప్రేమ ఏమిటంటే  జీవిత భాగస్వామిని చచ్చేదాకా ప్రేమించడమే ! అంతకన్నా ఇంకేదైనా ప్రేమ బలమైనది ఏమైనా కల్గితే, ఒకవేళ  ఉంటే ఇతరులని ఎక్కువ కాలం మోసగించకుండా క్లారిటీతో హుందాగా, గౌరవంగా ప్రక్కకి తొలగడమే ! మొదట్లో జీర్ణం చేసుకోవడం కష్టమే కానీ దీర్ఘకాలం మోసపోయి భంగపడటం కన్నా ఇదే మంచిది కదా ! ఓల్గా గారి  మానవి నవలలో  ఇలాగే జరుగుతుంది. పాపం వసంత అని అనిపిస్తుంది. ఆ  నవల  నువ్వు చదివావా?  ఆ నవల చదవబట్టే నేను ఇలా ఉన్నాను శశీ ! ఒక నిజం చెప్పనా ?  నెల్లూరు అంటే నాకు కూడా ఇష్టమే,  పదిహేడేళ్ళు నిండి నిండగానే పెన్నా తీరానికి కొత్తకాపురానికి వచ్చాను. అక్కడ పంటపొలాలు, పచ్చని ప్రకృతి, మంచి మనసులు అన్నీ ఓ మంచి  జ్ఞాపకమే! కాకపొతే ఓచేదు జ్ఞాపకం నా జీవితకాలం  వెంటాడేది కూడా ఉంది. నా జీవితాన్ని కాజేసిన దొంగది ఆ నెల్లూరంటే నాకెందుకో విరక్తి.ఇంకెప్పుడూ నెల్లూరు రాకూదదనుకున్నాను. రాను కూడా !

నాకు పురుషులంటే ద్వేషం ఏమీ లేదు. కానీ మన చుట్టూ ఎంతోమంది పురుష అహంకార పదఘట్టనల క్రింద నలిగి పోతున్నారు. మన తరం స్త్రీలు ఓర్చుకున్నారు. కానీ ఇప్పటి తరం ఓర్చుకునేటట్టు లేరు. అందుకే మగవాళ్ళు తరతరాలనుండి అంటిపెట్టుకున్న భావజాలాన్ని వదిలించుకోవాలి. నేను కథలు వ్రాస్తున్నది కూడా అందుకే ! నేను వ్రాసే కథలన్నీ నిజజీవిత శకలాలపైనుండి  లేచి నిలబడి ఆత్మస్యైర్యంతో ముందుకు సాగాలనే సందేశం ఉండేటట్టు, స్త్రీలు తమ తప్పులు తానూ తెలుసుకునే విధంగానూ ఉండేటట్టు వ్రాస్తున్నాను.

ఈ మధ్య  నేను చదివిన కథలలో నాకు బాగా నచ్చిన కథలు సత్యవతి గారి కథలు. నువ్వు కూడా  తప్పకుండా చదువు శశీ ! దాదాపు ఒక అరవై డెబ్బై ఏళ్ళ నాటి నుండి స్త్రీల జీవితాల్లో వచ్చిన మార్పులని చక్కగా చూపించారు. ఆ పుస్తకంలో ఉన్న కథలన్నీ స్త్రీల అస్తిత్వ పోరాటంలో  విజయం సాధించి తమ కన్నా ముందు తరం స్త్రీలకి మంచి భవిష్యత్ ఇవ్వడానికి ప్రయత్నించి విజయం సాధించిన కథలే ! చాలా సునిశితమైన పరిశీలనతో పురుషులని తిట్టకుండానే వ్యంగంగా వ్రాసిన కథలవి.

మన ముందు తరాలవారికి మనమేం అందించగలమో లేదో .. ఇప్పటి పిల్లలకి ఏం చేపుదామన్నా ..నీకేమీ తెలియదు నువ్వూరుకో అంటారు తేలికగా. మనసు చిన్నబోతుంది అంది ఒక స్నేహితురాలు. తనకి ఇద్దరూ అమ్మాయిలే !  తల్లి అనుభవం, ముందు చూపు పిల్లలకి చాదస్తం అనిపిస్తుంటే ఏం చేయగలం ? ఇది తరానికి తరానికి ఉన్న అంతరమేమో ... అలా అర్ధం చేసుకుని మనసుని ఊరటపరుచుకో అని చెప్పాను. రాలే ఆకుల్లాంటి మనం పిల్లలకి పదే పదే హితబోధ చేసి వాళ్లకి మనపై చులకన భావాన్ని మరీ పెంచి పెద్దది చేయలేము కదా !  నా ఫ్రెండ్ భర్త మరీ భాద్యత లేనివాడు. కుటుంబాన్ని ఏ మాత్రం పట్టించుకోనివాడు. అందుకే ఆమె పిల్లలకి  తల్లి మాటలన్నా విసుగు. బాధ్యత లేని మనుషులని, భాధించే పెద్దలని పిల్లలు ఎలా భరించగలరు, ప్రేమించగలరు   అంటే...  ప్రేమించగలరు.  జన్మ నిచ్చినందుకు తల్లిదండ్రులకి రుణ పడి  ఉంటామంట.  అందుకే వాళ్ళని మనం ప్రేమించి ఆదరించాలి. అనుభవాల ముడుతలు మనుషులకే కాదు ఆకులకి అనుభవమే ! ఆ ముడుతలలో దాగిన అనాదరణ గాయాల గేయాలు,ఈ ముడుతలలో  చీడపీడల దాడులు. ముడుతలని ప్రేమిద్దాం . రాలే ముందు అదే అసలైన మందు అని అనాలనుకుంటాను.

తర్వాత  మనం గురువుకి , సమాజానికి రుణ పడి  ఉంటామంట.  నువ్వు గురువుగా చాలా మంచి గురువు అని నాకు తెలుసు.  తరగతి పాఠాలు కాకుండా  ఎన్నో మంచి మంచి పాఠాలు నవ్వుతూ, నవ్విస్తూ విసుగు కల్గించకుండా చెపుతావ్. నీ క్లాస్ లో  చదువుకున్న పిల్లలందరికీ నువ్వు మంచి టీచర్ వి గా గుర్తుండిపోతావ్. ఆ మాట నిస్సందేహంగా నేనూ చెప్పగలను .   మీ లాంటి టీచర్స్  కి మాత్రమే కాదు నాలాంటి సాధారణ గృహిణికి కూడా సామాజిక భాద్యత ఉంటుంది. ఎవరికీ వారు సమాజానికి మనమేం చేస్తున్నాం అనే ప్రశ్న వేసుకోవాలి .  ఆ భాద్యతతో మెలగాలనే నేను నా శాయశక్తులా కృషి చేస్తాను. ఏం చేస్తాను అంటే ... అదొక పెద్ద వ్రాత అవుతుంది శశీ ! spondylitis వల్ల  ఎక్కువ వ్రాయలేకపోతున్నాను . నేను బ్లాగ్ తక్కువగా వ్రాయడానికి కూడా కారణం అదే ! అయినా వ్రాస్తూనే ఉన్నాను . ఏదో శక్తి నన్నావహించి వ్రాయిస్తూ ఉంటుంది.

ఏ మూర్తి శక్తి చైతన్య ముక్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి...  ఆ శక్తికి ప్రణమిల్లుతూ ...

ఇక ముగిస్తున్నాను . తప్పకుండా లెటర్ వ్రాస్తావు కదూ .. ఎదురుచూస్తూ ఉంటాను .  పిల్లలకి నా ఆశ్శీస్సులు. మీ సార్  గార్కి నా నమస్కారములు తెలియజేయి.

నీ విద్యార్ధులకి ... ప్రపంచం ఇలా ఉండాలని ... బోధించడానికి కంకణం కట్టుకోవాలని నిన్ను కోరుకుంటున్నాను .

ఇక ఉండనా మరి.   ప్రేమతో ... అక్క  వనజ.   

14, ఏప్రిల్ 2016, గురువారం

ఆత్మీయ భాషణం

రమణీ ..ఎలా ఉన్నారు ?

నేను మీకీ ఉత్తరం వ్రాయడం ఎలాటిదంటే సముద్రం దగ్గరకి బుడ్డి చెంబు తీసుకెళ్ళి దానిని నింపి నీకు చూపిస్తూ ఇదే  సముద్రం అని చెప్పినట్టు అన్నమాట.  :)

ఈ మధ్య బ్లాగ్ లలోకి వచ్చినప్పుడు నాకు తెలిసిన పాత వాళ్ళనందరినీ ఆత్రంగా వెతుక్కుంటాను. కొంతమందిని చదివి వస్తాను. మనసుకు బాగా నచ్చిన విషయమైనా సరే వ్యాఖ్యనివ్వడానికి ఒకింత బద్ధకం అని తప్పించుకోజూస్తాను కానీ ఆ బద్ధకం వెనుక అంతులేని నిరుత్సాహం. ఏమైనా వ్రాయాలని మనఃస్పూర్తిగా అనిపించినప్పుడు వ్రాసుకోవడం, లేదా ఏ కథో ,కవితో ఇక్కడ భద్రపరుచుకుని బ్లాగులలో కూడా కొంతమందికి పరిచయం చేసినట్లు ఉంటుందని రావడం తప్ప పెద్ద ఆసక్తి లేదు. ఒకప్పుడు ఎలా ఉండేవి బ్లాగులు? ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ,సద్విమర్శలు చేసుకుంటూ సరదాగా ఉంటూనే సీరియస్ విషయాలు ముచ్చటించుకునే వాళ్ళు కదా !   ఇప్పుడంతా సాధారణంగానూ లేక కావాలని కువిమర్శ చేసుకుంటునట్లూనూ,కాలక్షేపం కోసం పోట్లాడుకుంటూన్నట్లుగానూ ఉంటున్నాయ "ట". నేనైతే అసలు వివాదాల జోలికి  పోను కాబట్టి  విహంగవీక్షణం చేసేసి వచ్చేస్తున్నాను.

ఎందుకు బ్లాగ్ మిత్రులందరూ ఫేస్ బుక్ కి అతుక్కుపోతున్నారా అని ఆశ్చర్యం కల్గుతుంది. ఒకే విషయం కాకుండా అనేకానేక విషయాలని రోజుకి ఒక పది పోస్ట్ లని స్నేహితులకి పంచే  వారిని చూస్తూ ఉంటాను. నాకున్న స్నేహితుల జాబితాలో అధికంగా పోస్ట్ లు వేస్తున్నవారిలో మీరూ ఉంటున్నారు రమణీ ! అయితే మీ మాటల్లో ఎక్కువగా చిరాకూ, ఆశాభంగం, బాధ వ్యక్తపరుస్తూ ఉంటారు. మన బాధలు, మన  కోపతాపాలు, చిరాకులూ, నిసృహలూ అన్నీ వ్యక్తిగతం కాదు. అందులో కొన్ని మన చుట్టూ ఉన్న మనలాంటి  మనుషుల నుండి, సమాజం నుండి వస్తున్నవి. కాలక్షేపపు కబుర్లకి, దూలానందం పొందేవారికి, ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి మనసులోమాట కక్కేదానికి అక్కడ వెసులుబాటు ఉంది కాబట్టి తాత్కాలిక వినోదపు వేదిక అయిందని మనందరం గుర్తించాం కానీ అందులోనుండి బయటకి రాలేకపోతున్నాం . ఘనసమయాలు వ్యర్ధంగా గడచిపోతున్నాయి. మనుషులు మనసు విప్పి మాట్లాడుకోవడం తగ్గిపోయింది . మనసు విప్పి  మాటాడటానికి ఓ మనిషి  దొరకక విలవిలలాడిపోతున్నాం.

ముఖ్యంగా ఈ సోషియల్ మీడియా తక్షణ అభిప్రాయాలు పంచుకునే వీలుంటుందని అనుకుంటున్నామో అంతే త్వరగా మనుషులని విడదీస్తుంది .  నా చుట్టుపక్కల నాకెవరితోనూ శత్రుత్వం లేదు . కానీ ఈ ఆన్ లైన్ స్నేహాలలో చాలామందితో నాకు శత్రుత్వం ఏర్పడింది. ఇక్కడ మనుషులు కులం, మతం ప్రాతిపదికపై రాజకీయ పార్టీలని మోసే క్రమంలో, సినీ కథానాయకులని, నాయకురాళ్ళని మోసే క్రమంలో విడిపోతున్నారు. అదెంత విషాదమో !  మనుషుల మధ్య మొలుస్తున్న బలమైన కుడ్యాల పట్ల నిరసన తెలుపుతూనే అదే కుడ్యాల మధ్య మనని మనం బందీలుగా మార్చుకుంటున్నాము, మారిపోతున్నాం . అది చాలా విచారకరంగా ఉంది.   ద్వంద్వ వైఖరి,  ద్వంద్వ ప్రమాణాలు నేనస్సలు పాటించలేను, మనసులో ఉన్నట్టే ప్రవర్తిస్తాను . మనని నిత్యం తిడుతున్నా భరించి, ముఖం మీద నవ్వు పులుముకుని నటించి బ్రతకలేను . నేను నాలాగా ఉండదల్చుకున్నాను. బయటున్న శత్రువు కన్నా మనతోనే మిత్రుడిగా ఉండి మనకి శత్రువై వ్యవహరించేవాడి పట్ల ఉదారంగా ఉండకపోవడం మంచిది . చాలా మందిని un friend ని చేసినందుకు నాలో ఆత్మనూన్యత ఏ మాత్రం లేదు. రమణీ !  స్నేహం పేరిట మానసిక ప్రశాంతత కోల్పోలేము కదా ! నువ్వు కూడా నీకు బాధకల్గిస్తున్న వారినుండి దూరంగా జరిగిపో. అదే మంచిది కూడా !

ఒకొకరికి వారికి ఉన్న ఆలోచనాధోరణి, వారి వారి అనుభవాల మూలంగా  కొన్ని స్థిరాభిప్రాయాలు ఏర్పడిపోతాయి. వాదనలవల్ల వారి వారి అభిప్రాయాన్ని మనమెన్నటికీ మార్చలేం. అందుచేత మనం వారికి దూరంగా ఉండటమే మంచిదని అనిపిస్తూ ఉంటుంది.  బ్లాగ్ లలోనే కాదు  ఫేస్ బుక్ స్నేహితులలో కూడా ఇలాగే ఉన్నారు. భిన్నాభిప్రాయాలు కల్గిన వ్యక్తుల మధ్య స్నేహం నిలిచి ఉండాలంటే వారి వారి మధ్య చాలా అవగాహన ఉండాలి కదా ! మనం చెప్పిన అభిప్రాయాన్ని వారు వ్యతిరేకించారని  వారిని దూరంగా పెట్టాల్సిన అవసరం లేదని అదివరకంతా వాదించే నేను నా అభిప్రాయాన్ని మార్చుకుని కొందరిని దూరంగా పెట్టేస్తే,  కొందరు నన్ను దూరంగా పెట్టారు . నిజంగా ఈ పరిస్థితి  చాలా బాధాకరమైనది కూడా !  అప్పుడే ఇలా వ్రాసుకున్నాను. "నీలోకి నువ్వు తొంగి చూసుకో, నీకు నువ్వు అర్ధమైతే... లోకం అర్ధమవుతుంది. నువ్వూ ఓ నమూనా బొమ్మవేకదా!"  అని. ఇలాంటి ఆనవాళ్ళు ఎవరికైనా దొరుకుతాయేమో కదా !

అంతకు క్రితంలా నేను బుల్లి తెర ముందు, అంతర్జాలం నందు సమయాన్ని వెచ్చించడం లేదు. ఎక్కువగా పుస్తకాలు చదువుతున్నాను. పుస్తకాలు చదవడమంటే ఒక సంగతి గుర్తుకువచ్చింది. ఈ మధ్య నేనొక కథ చదివాను. ఆ కథా రచయిత శైలి చాలా బావుంటుంది. కానీ ఆ కథలో  భాగమైన నలుగురి ఆడవాళ్ళ పట్ల ముఖ్యంగా స్త్రీల పట్ల (ఆమెకి ఒక కొడుకు కూడా ఉంటె బాగుండేది అని ఆడపిల్ల పట్ల చులకన భావాన్ని వ్యక్తపరిచి ) ఆ రచయితకి గౌరవభావమే గోచరించలేదు. ఒకే ఒక పాత్రపై కొద్దిగా జాలి సానుభూతితో పాటు  తాను  దర్శించిన (రచయిత సృష్టించిన పాత్ర ) ఒక సౌందర్య కోణాన్ని గొప్పగా చెప్పాననుకున్నాడు. చాలా బాధేసింది. రచయిత దృక్పధం ఏమిటో మనకి స్పష్టంగా అర్ధమవుతుంటే ... వాళ్ళని  మంచి రచయిత అని ఎలా ఒప్పుకోగలం? ఇలాగేనా కథలు వ్రాసేది? రచయితకి కొంచెమైనా బాధ్యత ఉండొద్దూ  అని చాలామంది అనుకున్నాం కూడా !

ఇలాగే ఒక సినిమా నిర్మాత దర్శకుడు కూడా  "ఆ ఇద్దరంటే నాకు గౌరవంతో కూడిన భయం . జీవితంలో ఆ ఇద్దరాడవాళ్ళకే  గౌరవాన్ని ఇస్తా ! వారికే భయపడతా. వారు నా  తల్లి , నా భార్య . అంటున్నారు. అవును మరి ప్రపంచంలో మిగతా ఆడవాళ్ళందరూ అతని సినిమాల్లో ఆరబోసి చూపించే బాపతనే ఉద్దేశ్యాన్ని అంత నిసిగ్గుగా చెపుతున్నారో చూడండి . ఇంకో దర్శక నిర్మాత హీరోయిన్లను బట్టలు లేకుండా చూపించేందుకు ఎక్కువ ఖర్చుపెడతానని చెపుతుంటే ... వీళ్ళ సినిమాలని తిరస్కరించాలనే జ్ఞానం మన ఆడవాళ్ళకి లేకపోవడం ఎంత విచారకరం.  ముందు స్త్రీలని గౌరవించడం నేర్చుకోండి బాబూ .తర్వాతనే  మీ కథలు,  సినిమాలు అని చెప్పాలి కూడా.  ఇలా చెప్పకపోబట్టే ఏం జరుగుతుందో తెలుసా ?

ఈ  విషయం నీకు చెప్పే తీరాలి.  తలుచుకుంటేనే అప్రయత్నంగానే పెదవులపై నవ్వులు పూస్తున్నాయి. నేనసలు ఎప్పుడో కానీ ప్రొఫైల్ పిక్ పెట్టనని నీకు తెలుసు కదా !  ఈ మధ్యనే ఒకటి రెండు రోజులు పెట్టాను.  నా ఇన్ బాక్స్ లో అపరిచిత వ్యక్తీ నుండి మొదటి పలకరింపు యు ఆర్ సో నైస్ మేడమ్ అని.   నేను గమనించలేదు.   తర్వాత కొన్ని గంటలకి మరి కొన్ని సందేశాలు. హాయ్ మేడమ్, హాట్ సెక్స్ విత్ మీ  అని . అన్ని మెసేజ్ లు ఒకేసారి చూసాను . అది  చూసి రగిలిపోయాను. సరిగా మీసం మొలవని మగపిల్లాడు (మన దృష్టిలో ) వాడి  తల్లి వయసున్న నాతో నెరిపే సంభాషణ ఇది. నేను షాక్ తిన్నాను. నిజంగా ఇలా మెసేజ్ రావడం కూడా ఇదే మొదటిసారి.  వెంటనే వాడికి ఒక చెప్పు బొమ్మ పంపాను. వెళ్లి మీ అమ్మని ఇలా అని అడగరా  అని చెప్పాను.  ఇలాంటి అశ్లీల విషయాన్ని అపరిచిత స్త్రీ మెసేజ్ బాక్స్ లోకి పెట్టినందుకు సైబర్ కేస్ అవుతుంది జాగ్రత్త అని కూడా  హెచ్చరించాను. వాడిని బ్లాక్ చేసాను.  భద్రంగా ఇంట్లో కూర్చున్నా కూడా జొచ్చుకుని వచ్చే అలుసుతనమంతా దృశ్య మాధ్యమం పుణ్యం కాదు. సాంకేతిక పరిజ్ఞ్ఞానం పిచ్చివాడి చేతిలో రాయిలా మారిపోతుంది.  దిగులేస్తుంది. ఇలాంటి వాళ్ళే కదా ఆడవాళ్ళు ఒంటరిగా కనబడితే తెగబడేది అని అనిపించింది .

నేను ఈ విషయాన్ని ఇలా బ్లాగ్ ముఖంగా చెప్పానా !? కొంతమందయినా ఇలా అనుకుంటారని నాకు తెలుసు. ఈ వనజ గారికి ఎంత దైర్యం ? వాడెవడో అలా మాట్లాడితే మాత్రం ఈమె ఇలా బహిరంగంగా  చెప్పాలా అంటారు.  ఎస్, చెప్పాలి. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల ప్రవర్తన ఎలా ఉందో గమనించుకుంటారు. పిల్లల్లో ఉన్నమానసికరోగాలు,వాళ్ళ ప్రవర్తనా లోపాలు గమనిస్తే  కదా మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చుకుని ఇంటా, బయటా ఎలా మెలగాలో సంస్కారంగా ఉండటం, ఆలోచించడం నేర్పిస్తారు. లేదా  సంస్కారంగా ఉండాలని అవగాహన కల్పిస్తారు కదా !

అన్నట్టు ఒక బ్లాగ్ మిత్రుడు ఇలా అన్నారు. ఇదిగో ఆ మిత్రుడి సూచన "బ్లాగులు ఎంత కాదన్న ఔట్ డేటెడ్ . ఇప్పుడు కావాలిసింది ఒక కలెక్టవ్ పబ్లిషింగ్ ప్లాట్ ఫామ్. Medium.com లాంటిది"  అని చెప్పారు. అక్కడికి వెళ్లి చూసాను . అక్కడంతా ఆంగ్లమాధ్యమం. నాలాంటి ఇంగ్లీష్ రాని  వారికి అదంతా అయోమయమే.  :)

మనిషి మనసుని సుతిమెత్తగా మీటగలిగే అనేకానేక పదబంధాలు కల మన మాతృభాషలో మనం వ్రాసుకున్నత హాయిగా వేరొక బాషలో వ్రాయలేమేమో కదా ! గండికోట వారిజ "సీత కో ఉత్తరం "అంటూ ఎంత లాలిత్యంగా, హృద్యంగా వ్రాసిందో కదా !  నువ్వు  ఆ ఉత్తరాన్ని చదివావా ?   అన్నట్టు మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ లో  ఏ విషయమైనా బాగా వ్రాయగలరు అనిపించే ఇద్దరు మిత్రురాళ్ళని  నేను కని పెట్టేసాను. వారిద్దరూ కూడా బ్లాగ్ వ్రాస్తే బావుంటుందని అనుకుంటున్నాను . వారు సరళ మోహన్ (Sarala Mohan) అంజనీ యలమంచిలి. వారిద్దరూ కూడా బ్లాగ్ లోకంలోకి రావాలి. నిన్న ఇద్దరు మిత్రురాళ్ళు బ్లాగ్ రూపొందించి ఇవ్వమని అడిగారు . సంతోషంగా చేసి ఇచ్చాను.

ఇంకో విషయం మరిచాను .. మధురవాణి వెబ్ పత్రికలో పొత్తూరి విజయలక్ష్మి గారి "కొత్తకోణం " కథ చదివాను . గొప్ప సెటైర్ అనిపించింది .  పురాణ  ఇతిహాసాల లోని పాత్రలని తీసుకుని ఆ పాత్రలకి కొత్తకోణం ఆపాదించి మనకి నచ్చినట్లు వ్రాసుకోవడం అని  కథని హాస్యోక్తిగా, వ్యంగంగా చెప్పారు.  నాకు వెంటనే ముగ్గురు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీతలు గ్రహింపుకి  వచ్చారు. ఓల్గా గారి "విముక్త" కి కాకుండా "రాజకీయ కథలు" కి అవార్డ్ వస్తే బావుండేదని నేను అనుకున్నాను. రాజకీయ కథలు స్త్రీలు తమ  అస్తిత్వాన్ని  తాము తెలుసుకునే క్రమంలో వచ్చిన కథలు. మీరు ఇంతకు  ముందు చదవకుంటే వెంటనే చదవడానికి ప్రయత్నం చేయండి.
 ఇక ఉండనా మరి. మరిన్ని విషయాలతో మళ్ళీ ఇంకో సారి మాటాడుకుందాం. వీలువెంబడి మీరూ  ఓ లేఖ వ్రాస్తారు  కదూ ! పలకరింపే ఓ పులకరింత.. అని  మీకు తెలుసు కదా !
ప్రేమతో ...  వనజ .